సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ ఖాళీలను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం అమలు చేస్తామంటే కుదరదు అని హెచ్చరించారు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘సోషల్ మీడియాపై నియంత్రణ పేరుతో గొంతులు నులుమాలంటే కుదరదు. సుప్రీంకోర్టు ఆదేశాలను కాదని సొంత రాజ్యాంగం(రెడ్బుక్ రాజ్యాంగం) చేస్తారా?. దీనిపై ప్రజా పోరాటం చేస్తాం. అసలు సోషల్ మీడియా మీద సమీక్షలు, చర్యలకు మంత్రి లోకేష్కు ఏం అర్హత ఉంది?. సకల శాఖా మంత్రిగా లోకేష్ వ్యవహరించటం సబబు కాదు. సోషల్ మీడియా నియంత్రణ పేరుతో సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఉల్లంఘిస్తారా?.
వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధించటానికే సోషల్ మీడియా నియంత్రణా?. సాక్షి మీడియా, ప్రశ్నించే గొంతులను నులుమేయటమే మీ పనా?. ఆర్టికల్-19కి విరుద్ధంగా వ్యవహరించే వారందరిపై చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థి పార్టీ నేతల కుటుంబాలపై ఐ-టీడీపీ పెడుతున్న పోస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు?. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పేరుతో ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించినా కేసులు పెట్టటం ఏంటి?. ఐ-టీడీపీ, కొన్ని యూట్యూబ్ ఛానల్స్పై కోర్టుకు వెళ్తాం. లోకేష్ గురివింద గింజ సామెత లాగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ఏపీలో అమలు చేయని వైనంపై కోర్టులోనే తేల్చుకుంటాం. అభ్యంతరకర పోస్టులన్నీ టీడీపీ సోషల్ మీడియా నుండే వస్తున్నాయి. లోకేష్ ముందుగా వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.


