జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. పలువురి పరిస్థితి విషమం | Several Govindas Injured During Janmashtami Celebrations | Sakshi
Sakshi News home page

జన్మాష్టమి వేడుకల్లో అపశృతి.. పలువురి పరిస్థితి విషమం

Aug 17 2025 7:45 AM | Updated on Aug 17 2025 8:45 AM

Several Govindas Injured During Janmashtami Celebrations

ముంబై: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం అర్ధరాత్రి దాటేవరకూ ఉత్సాహంగా కొనసాగాయి. అయితే కొన్నిచోట్ల వేడుకల్లో స్వల్ప ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్ర అంతటా దహీ హండీ(ఉట్టికొట్టే వేడుక) ఉత్సవాలు జరిగాయి. ముంబైలో ఈ వేడుకలు పెద్ద ఎత్తున  జరిగాయి.
 

పెరుగుతో నిండిన మట్టి కుండలను పగలగొట్టేందుకు మానవ పిరమిడ్‌లను ఏర్పరిచే సంప్రదాయ కార్యక్రమంలో వందలాది గోవిందులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ వేడుకలు విషాదకరంగా మారాయి.

బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విడుదల చేసిన డేటా ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల నాటికి వేడుకల సమయంలో మొత్తం 95 గోవిందులకు గాయాలయ్యాయి. వీరిలో 19 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో చాలామందికి తక్షణ వైద్య సహాయం అందించి, తర్వాత డిశ్చార్జ్ చేశారు.

దహి హండి అనేది కృష్ణుని జన్మదినాన్ని గుర్తుచేసుకునేందుకు మహారాష్ట్ర అంతటా జరుపుకునే ఉత్సాహభరితమైన వేడుక ఈ సంప్రదాయ కార్యక్రమంలో గోవిందులు పేరుతో యువకులు బృందాలుగా ఏర్పడి పాల్గొంటాయి. వారంతా మానవ పిరమిడ్‌లుగా ఒకరిపై ఒకరు నిలుచుంటారు.

మరోవైపు పెరుగు, వెన్న లేదా ఇతర పాల ఉత్పత్తులతో నిండిన మట్టి కుండ (హండి)ను తాళ్లతో ఎత్తుగా వేలాడదీస్తారు. దీనిని మానవ పిరమిడ్‌లుగా ఏర్పడినవారు కొల్లగొడతారు. ఈ పండుగ శ్రీకృష్ణుని చిలిపిచేష్టలను గుర్తుచేసింది. పురాణాల్లోని వివరాల ప్రకారం శ్రీకృష్ణుడు బాల్యంతో తన స్నేహితులపై నిలుచుని వెన్నతో కూడిన ఉట్టిని అందుకునేవాడు. 

Advertisement
 
Advertisement
Advertisement