
పట్టణాల్లో కంటే ఊర్లలోనే ఎక్కువ
దేశవ్యాప్తంగా 75.7 శాతం, ఏపీలో 75.2 శాతం కుటుంబాలు
4.3 శాతం కుటుంబాలే ఆహార వస్తువులు ఆన్లైన్లో కొనుగోళ్లు
ఏపీలో 3.2 శాతం కుటుంబాలు
ఏపీలో ఆహార, ఆహారేతర వస్తువులు 21.6 శాతం కుటుంబాలు ఆన్లైన్ కొనుగోళ్లు
సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికాం–2025 వెల్లడి
సాక్షి, అమరావతి: ఇప్పుడంతా ఆన్లైన్ ఆర్డర్ల యుగం..! దుస్తుల నుంచి సెల్ఫోన్ల వరకు.. పుస్తకాల నుంచి వంటింట్లో వస్తువుల దాక.. అన్నిటికీ ఆన్లైన్. అయితే, ఇందులో పల్లెలు, పట్టణాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అటు దేశవ్యాప్తంగానూ... ఇటు మన రాష్ట్రంలోనూ... పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రజలు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటికి చేర్చే (హోం డెలివరీ) సేవలు అందుబాటులో ఉండడంతో పట్టణ ప్రజలు ఆహార వస్తువులను ఎక్కువగా ఆర్డర్ పెడుతున్నారు. జాతీయ స్థాయితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ కొనుగోళ్లపై సమగ్ర మాడ్యులర్ సర్వే: టెలికాం–2025 ఈ వివరాలు వెల్లడించింది.
దీనిప్రకారం..
⇒ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటున్న కుటుంబాలు: 75.7 శాతం. ఏపీలో 75.2 శాతం.
⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్న కుటుంబాలు 4.3 శాతం. ఏపీలో 3.2 శాతం.
⇒ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతం కుటుంబాలు ఆహార, ఆహారేతర వస్తువులనూ ఆన్లైన్లో కొంటున్నాయి. ఏపీలో వీరి శాతం 21.6.
⇒ దేశంలో పట్టణాల్లో 10 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో ఖరీదు చేస్తుండగా.. ఏపీలో 18.7 శాతం కుటుంబాలు ఇదే పద్ధతిని ఎంచుకుంటున్నాయి.
⇒ దేశంలో పట్టణాల్లో 37.6 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువుల కోసం ఆన్లైన్ను ఆశ్రయిస్తుండగా, ఆంధ్రప్రదేశ్లో ఈ శాతం 36.1.
⇒ దేశంలో పట్టణాల్లో 52.4 శాతం కుటుంబాలు ఆహారం, ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా, రాష్ట్రంలో ఈ శాతం 45.3.
⇒ దేశంలో మొత్తం గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి 7.6 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తుండగా, 53.3 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆన్లైన్లో ఖరీదు చేస్తున్నాయి.
⇒ దేశంలో 39 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను ఆన్లైన్లో కొనుగోళ్లు చేస్తున్నాయి.
⇒ ఏపీలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 11.7 శాతం కుటుంబాలు ఆహార వస్తువులను ఆన్లైన్లో కొంటుండగా... 53.7 శాతం కుటుంబాలు ఆహారేతర వస్తువులను మాత్రమే ఆర్డర్ పెడుతున్నాయి. 34.6 శాతం కుటుంబాలు ఆహారంతో పాటు ఆహారేతర వస్తువులను కూడా ఆన్లైన్ ద్వారానే తీసుకుంటున్నారు.