Srikakulam District News
-
అండర్ పాసేజ్ పైనుంచి దూకి వ్యక్తి మృతి
నరసన్నపేట: దేవాది వద్ద జాతీయ రహదారిపై అండర్ పాసేజ్ వంతెన పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్లో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. నరసన్నపేట ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంతెన పైనుంచి వ్యక్తి దూకడం సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు. -
పలాసలో ఫొటోస్టోడియో దగ్ధం
పలాస: పలాస జీడిపిక్క బొమ్మ ఎదురుగా ఉన్న డిలైట్ ఫొటో స్టూడియోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. యజమాని బొంతల రమేష్ షాపును మూసేసి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. పలాస అగ్నిమాపక అధికారి బి.సోమేశ్వరరావు, లీడింగ్ ఫైర్ ఆఫీసర్ రవికుమార్, రాము, లోకనాధం తదితరులు మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5లక్షలు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి బి.కోటేశ్వరరావు తెలిపారు. చిన్నమ్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు సారవకోట: బుడితి సీహెచ్సీలో హెడ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న సొమలపురి చిన్నమ్మి మంగళవారం నర్సుల దినోత్సవం పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు ప్రభుత్వం గుర్తించి గుంటూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 1992 నుంచి ఈమె నర్సుగా విధులు నిర్వర్తిన్నారు. ఈమెను సీహెచ్సీ సూపరింటెండెంట్ చైతన్య, వైద్యులు, సిబ్బంది అభినందించారు. యూరియా, డీఏపీ అమ్మకాలు నిషేధం రణస్థలం : ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో యూరి యా, డీఏపీ నిల్వ ఉన్నా అమ్మకాలు జరపరాదని రణస్థలం వ్యవసాయాధికారి డి.విజయభాస్కర్ షాపుల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ యూరియా, డీఏపీ స్టాప్ సెల్ ఆదేశాలు జారీ అయ్యాయని, అమ్మినవారు శిక్షార్హులని హెచ్చరించారు. కొత్తగా ఎరువులు స్టాక్ వచ్చినా వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ అప్డేట్గా ఉంచాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టాక్ వివరాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఆఫీస్ టెక్నికల్ జి.సుహాసిని, ఏఈవో ఎం.సునీత, వై.రాజశేఖర్ పాల్గొన్నారు. చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి జి.సిగడాం: ప్రతి మహిళా ఆర్థికాభావృద్ధి సాధించాలని డీఆర్డీఏ పీడీ పి.కిరణ్ అన్నా రు. నిద్దాంలో కొరమీను చేపల పెంపకం యూనిట్ను మంగళవారం పరిశీలించారు. యూని ట్ ఆదాయం, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పైల కోటేశ్వరమ్మ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు, సీసీ లక్ష్మి, బాబ్జీనాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు. -
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభు త్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జాబితాలను సిద్ధం చేసి, డీఈఓ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో చేపట్టే బదిలీలు, పదోన్న తులు తదితర ప్రక్రియలన్నీ ఈ జాబితా ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన వెల్లడించారు. -
మినీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం జాతీయ రహదారిపై సూర్య స్కూల్ కూడలిలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండములగాం గ్రామానికి చెందిన గుంటముక్కల నర్సింహమూర్తి (52) విశాఖపట్నం వెళ్లేందుకు ద్విచక్ర వాహనంతో మంగళవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. 4.45 గంటల సమయంలో సూర్య స్కూల్ కూడలి వద్ద అవతల వైపునకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింహమూర్తి తుళ్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు శవపంచనామా నిమిత్తం తరలించారు. నర్సింహమూర్తికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయమంటే నిర్బంధిస్తారా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ పోరాటం సాగించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా కార్మికులను ప్రభుత్వం నిర్బంధించి అక్రమ కేసులు బనాయించడం తగదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఇఫ్టూ జిల్లా నాయకులు ఎస్.కృష్ణవేణి అన్నారు. నోయిడా కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని కోరుతూ నేషనల్ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కార్మికులను మరింత దోపిడీ చేసేందుకు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్స్ నిబంధనల్ని నోటిఫై చేసిందన్నారు.గతంలో కూడా బీహార్ ఎన్నికల అనంతరం 2025 నవంబర్ 21 లేబర్ కోడ్స్ అమలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, ఎం.రాఘవ, కె.అప్పలరాజు, ఎం.వి.రమణ, యం.నాగేశ్వరావు, డి.రాము, కేదారేశ్వరరావు, పి.జగ్గారావు, బి.జనార్దనరావు, కె.అప్పారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
‘సదావర్తి’లో కూన రవికుమార్ భూదందా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సదావర్తి భూముల్లో అక్రమ లేఔట్ నిర్మించి ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. ఈ స్థలంలో ఒక్క ఇల్లూ లేనప్పటికి రోడ్లు వేయటం కూన అవినీతికి అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ బావాజీ మఠం భూములు 1600 సంవత్సరాలకు ముందువని చెప్పారు. మఠం భూముల్లో అక్రమ లేఔట్లు నిర్మించి ప్రజలకు అమ్మకం చేసి సొమ్ము చేసుకోవాలన్నా సరికాదన్నారు. పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. సదావర్తి భూములు కాజేసేందుకేనా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నదని మండిపడ్డారు. 1947 ఎండోమెంట్ చట్టం ప్రకారం నోటీసులు కూడా ఇచ్చారని, చారిటీ భూములు, సదావర్తి భూములు నాన్ ట్రాన్స్ఫర్ భూములు కింద నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ భూములను 22–ఏ నిషేధిత భూముల్లో కూడా పెట్టారన్నారు. రిజిస్ట్రేషన్ భూములుగా అమ్మకం ప్రారంభించిన కూన రవికుమార్ కుటుంబ సభ్యులు సామాన్యుల్ని మోసగించి అమ్మేస్తున్నారని ఆరోపించారు. అక్రమ లేఔట్కి కలెక్టర్ రోడ్లు మంజూరుచేయడం దారుణమన్నారు. కూన రవికుమార్ సోదరుడు, కాంట్రాక్టర్ నాణ్యత లోపాలతో రోడ్లు, కాలువలు వంటివి చేపట్టి ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కూన రవికుమార్ అక్రమాలు, అవినీతిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, రాష్ట్ర బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, బూత్కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, ఆమదాలవలస నగర అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పొన్నపురెడ్డి తవిటినాయుడు, సాకేటి శ్రీనివాసరావు, గదిలి రమణ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని వాల్వ్ ఆపరేటర్ మృతి
టెక్కలి రూరల్: మండలంలోని మునసబుపేట సమీప రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి చిన్నచాకలి వీధికి చెందిన వెగులాడ ధర్మారావు (52) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారావు టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ పరిధిలో కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిమిత్తం వెళ్లిన ఆయన నౌపడ వైపు వెళ్లి తిరిగి తన ద్విచక్రవాహనంపై టెక్కలి వైపు వస్తుండగా ముసనబుపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ధర్మారావు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ధర్మారావుకు భార్య కేసవమ్మ, కుమార్తె షర్మిల ఉన్నారు. -
పల్లె మాగాణం.. సంబరాల గానం
డప్పుల దరువులతో ఊళ్లన్నీ చిందులేస్తున్నాయి. గజముద్దలు అమ్మవారి ప్రతిరూపాలై ఊరేగుతున్నాయి. కాళికా వేషధారులతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. ఊరి సంబరాలతో పల్లె మాగాణం సంబరాల గానం ఆలపిస్తోంది. ఈ ఉత్సవాల దయ వల్ల కళాకారులకు ఉపాధి లభిస్తోంది. పల్లెలను పచ్చగా చూసే తల్లులు, గ్రామ సరిహద్దుల్లో ఉంటూ తమ బిడ్డలను కాచే కల్పవల్లులు, పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్న శక్తి స్వరూపిణులను గ్రామీణులు కొలిచి తరిస్తున్నారు. జాతరలు, ఉత్సవాలు, సంబరాలు జరిగితే చాలు కళాకారులకు అసలైన పండగే. ఈ ఉత్సవాలు జరిగే సమయాల్లో క్షణం తీరుబాటు లేకుండా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అమ్మవారి సన్నాయి మేళం కళాకారులు, వీధి వేషధారణలు వేసే కళాకారులు, కోయ నృత్యం, అంజాట, తప్పెట గుళ్లు, పాములోళ్లు, డప్పు కళాకారులు, కాళికా వేషధారణ, పులి, సింహాల వేషధారులు, కోలాటం కళాకారులు.. ఇలా ఒకటేమిటి వంద లాది మంది కళాకారులకు ఈ ఉత్సవాలు ఉపాధి కల్పిస్తుంటాయి. ఉత్సవాలు అనగానే చిన్నారుల నుంచి వృద్ధులు వరకు సరదాగా గడుపుకునే పండగ. ఈ ఉత్సవాలు సమయాల్లో చిరు వ్యాపారులకు అసలైన పండగే. వీధుల్లో చిన్నపాటి దుకాణాల నుంచి సర్కస్, జాయింట్ వీల్, డిస్కో చైర్స్ వంటి పరికరాలతో ఉపాధి పొందుతుంటారు వ్యాపారులు. ఇచ్ఛాపురం రూరల్: చైత్రాన మొదలైన సంబరాలు ఆషాఢం వరకు కొనసాగుతూనే ఉంటాయి. సంబరాల వేళ ఉద్దానం పచ్చ కోక కట్టుకుని మురిసిపోతోంది. అమ్మవారి ఆలయాలు, వీధులు రంగురంగుల విద్యుత్ దీపాల తో ముస్తాబై, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒకనాడు పల్లెల్లో నిత్యం కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు, తీవ్ర దుర్భిక్ష, దుర్భర పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితుల నుంచి కాపాడాలని ఏటా పల్లె వాసులు అమ్మవార్లకు చల్లదనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి కృతజ్ఞత తెలిపే విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చైత్ర మాసం మొదలైన నుంచి జ్యేష్ట మాసం వరకు ప్రతీ ఏడాది గ్రామస్తులు ఐక్యంగా గ్రామదేవతకు చల్లదనాలు చేస్తుండగా, పదేళ్లకు ఓ సారి 5,7,9 రోజులు పాటు గ్రామ దేవత ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయాల్లో సహజ సిద్ధంగా పండిన తాజా జీడి, మామిడి, పనస, పైనాపిల్ వంటి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆది, మంగళ, గురువారాల్లో పొలి మేరలో ఉన్న దేవతలకు మేళతాళాలతో వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు. గ్రామ దేవత ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన ఇంటింటా ఆధ్యాత్మికత ప్రస్తుతం సిక్కోలులోని ప్రతి ఇంటా పసుపు, కుంకుమలతో సువాసనలు వెదజల్లుతుండగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు, పూజా సామగ్రి సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి సేవల్లో కుటుంబాలంతా నిమగ్నమవుతున్నాయి. అంబరాన్ని తాకుతున్న గ్రామ దేవత సంబరాలు వాడవాడలా అమ్మవారి జాతరలు పొటాపోటీగా గ్రామాల్లో ఉత్సవాల ఏర్పాట్లు ఉపాధి పొందుతున్న కళాకారులు -
‘మడపాంను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి’
నరసన్నపేట: వంశధార నదీ తీరాన ఉన్న మడపాంను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డా రు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉందని, ఇప్పటికే రోజూ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మడపాం వద్ద ఉన్న విశ్వవిరాట్ వీర హనుమాన్ దేవస్థానంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధిలు తంగుడు జోగారావుతో పాటు స్థానికులు రువ్వ వాసుదేవరావు, మారెళ్ల అప్పలనాయుడు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
తొలిరోజు 45 మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఏపీఈఏపీసెట్ పరీక్షలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఏపీఈఏపీసెట్– 2026 పరీక్షల పర్వం మంగళవారం మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల్లో భాగంగా రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి ఐదు రోజులపా టు ఇంజినీరింగ్ స్ట్రీమ్కు పరీక్షలు జరుగుతుండగా.. తొలిరోజు రెండు సెషన్లకు కలిపి 1440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 1395 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 45 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్కు 720 మందికి 693 మంది, మధ్యాహ్నం సెషన్కు 720 మందికిగాను 702 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో నాలుగు కేంద్రా ల్లో పరీక్షలు జరుగుతున్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ, టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాలల కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. -
మోసం సులువు!
ప్రభుత్వ కొలువు.. ఏజెంట్ల మోసాలే ఎక్కువ.. శ్రీకాకుళం క్రైమ్ : ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలన్న నిరుద్యోగుల బలహీనతే వారి ఆయుధం. పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు, మినిస్టర్లతో పరిచయాలున్నాయి, మీ వాడికి జాబ్ పక్కా.. అంతా మా చేతుల్లో ఉందంటూ కుటుంబ పెద్దలకు నమ్మించేలా మాయమాటలు చెప్పడమే వీరి నైజం. కార్లలో దిగుతూ, చక్కని వస్త్రధారణ, చేతివేళ్లన్నింటికీ ఉంగరాలు పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. జిల్లాలో ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరిట మోసాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నలుగురు నిరుద్యోగుల నుంచి ఓ వ్యక్తి రూ. లక్షల్లో కొట్టేశాడు. రైల్వేలోను, ఇతర ప్రభుత్వ విభా గాల్లో జాబులిప్పిస్తామని మోసగించినట్లు సమాచారం. విదేశీ ఉపాధి, ఉద్యోగాల పేరిట పలు కంపెనీలు, సంబంధిత ఏజెంట్లు సైతం గ్రామాల్లో ఉన్నవారిని మోసగిస్తుండటం ఓ దినచర్యగా మారిపోయింది. ఈ రోజుల్లో ఏ ఉద్యోగమైనా కష్టపడి చదివితేనే సంపాదించగలరని, అంతా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా జరుగుతున్న ఇలాంటి రోజుల్లో ఎలాంటి పైరవీలకు చోటుండదని నిరుద్యోగ యువ త, వారి కుటుంబ సభ్యులు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు. మోసాలను పరిశీలిస్తే.. ● వజ్రపుకొత్తూరుకు చెందిన కారి బాలకృష్ణ అనే ఏజెంటు యూరోపియన్ దేశమైన స్వీడన్లో డ్రైవర్, వెల్డర్, ఫిట్టర్లో జాబ్లిప్పిస్తానని నమ్మించి మూడేళ్ల క్రితం ఇప్పిలి గిరిబాబు (కొండవూరు), పల్లివూరుకి చెందిన దున్న ఢిల్లీరావు, దున్న జానకిరావుల వద్ద రూ. లక్షల్లో తీసుకుని మోసం చేశాడు. ప్రస్తుతం విశాఖలో ఉన్నా బాధితుల ఫోన్లు ఎత్తడం మానేశాడు. ● నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీ (33) ఢిల్లీ సెంట్రల్ జోన్ ఆడిట్ అధికారినని చెప్పి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి కోట్లాది రూపాయల వసూలు చేసి మోసగించాడు. విశాఖలో 8 మంది నుంచి రూ. కోటి, తిరుపతిలో సుబ్రహ్మణ్యం నుంచి రూ. 25 లక్షలు, జిల్లాలో నందిగాం మండలం దేశెట్టి రమణమూర్తి నుంచి రూ. 1.05 కోట్లు, ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేశాడు. ● ఈవై మల్టీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్రెడ్డి, నాగేంద్రరెడ్డిలు నగరానికి చెందిన ఎం.విజయలక్ష్మిని పావుగా వాడుకుని ఆమెతో పాటు మరికొందరికి రూ. 15.25 లక్షలు బురిడీ కొట్టారు. ● హిరమండలానికి చెందిన బోయిన జనార్ధనరావు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఐదుగురి వద్ద రూ. 13.5 లక్షలు వసూలు చేశాడు. ● ఎలాంటి రాత పరీక్షలు లేకుండా పీహెచ్సీల్లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ సంస్థ మహిళల నుంచి రూ. లక్షల్లో దండుకుంది. ● వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన 30 మందికి పైగా నిరుద్యోగ యువతకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన పలాస సమీప సువర్ణాపురం వాసి కె.గోపాలకృష్ణ, విశాఖకు చెందిన హరీష్ అనే వ్యక్తితో కలసి దాదాపు రూ. 2 కోట్లకు టోకరా వేశాడు. 2021 కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న యువత కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. మళ్లీ 2023–24 నుంచి ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఉపాధి నిమిత్తం వెళ్లినా.. దాదాపు 2126 మంది వరకు ఏజెంట్లు మోసం చేయడంతోను, మంచి కంపెనీలు కాకపోవడంతోను వెళ్లలేదన్నది సమాచారం. 2024 నుంచి ఇప్పటివర కు జిల్లాలో దాదాపు 200కు పైగా ఉద్యోగాల పేరి ట మోసపోయిన కేసు లు నమోదవ్వగా నమోదు కానివి దాదా పు 342కు పైగా ఉంటా యని అధికార వర్గాల అంచనా. నిరుద్యోగులను నమ్మిస్తున్నారు ఉద్యోగాలంటూ ముంచేస్తున్నారు జిల్లాలో ఇటీవల పెరుగుతున్న మోసాలు విదేశాల్లో ఉపాధి పేరిట ఏజెంట్లు, కంపెనీల మోసాలు డబ్బులిస్తే ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి.. డబ్బులిస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. ఆన్లైన్ విధానంలో, పారదర్శకంగా జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఇంకా నిరుద్యోగులు ఇలాంటివారి ఉచ్చులో పడ టం బాధాకరం. నిరుద్యోగుల బలహీనత పట్టుకుని బ్రోకర్లు, మధ్య వర్తులు, ఏజెంట్లు ఇలా చేస్తుంటే వారికి కష్టపడిన సొమ్మును ధారాదత్తం చేస్తున్నారు. – పాత్రిని శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్), శ్రీకాకుళం -
పరిశ్రమల ఆన్లైన్ సేవలకు హెల్ప్డెస్క్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమం కింద పరిశ్రమల ఆన్లైన్ సేవలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఏపీ పీసీబీ ఈఈ బి.కరుణశ్రీ తెలిపారు. పీసీబి చైర్మన్ పి.కృష్ణయ్య, సభ్య కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం హెల్ప్డెస్క్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ హెల్ప్డెస్క్ ద్వారా పారిశ్రామికవేత్తలకు తప్పనిసరి అనుమతులైన కన్సెంట్ టు ఎస్టాబ్లిస్మెంట్ టు ఆపరేట్(సీటీఈ), కన్సెంట్ టు ఆపరేట్ (సీటీఓ) పొందేందుకు ఆన్లైన్ కన్సెంట్ మేనేజ్మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టమ్, ఇండస్ట్రిస్ సింగిల్ డెస్క్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఏఈఈ వంశీసత్యనారాయణ, డీపీఓ హరీష్ వీటిని నిర్వహిస్తారని తెలిపారు. పరిశ్రమల రిజిస్ట్రేషన్, పత్రాల సమర్పణ ఫీజు చెల్లింపు, అనుసరణ విధానాలపై హెల్ప్డె స్క్ను సంప్రదించాలని కోరారు. అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్ పోస్టు నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూ డాలని ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ పట్టణ, గ్రామీణ పోలీస్స్టేషన్లతో పాటు పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టుని మంగళవారం అకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా పోలీస్స్టేషన్లోని రికార్డులు, రికార్డు భద్రపరిచే గదులను పరిశీలించారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్లో గల కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రౌడీ షీటర్లను నిరంతరంగా కౌన్సిలింగ్ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అక్రమ రవాణా జరగకుండా బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టు సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ‘ఎరువులు తగిన మోతాదులో వాడాలి’ సారవకోట: రైతులు పంటలకు ఎరువులను తగిన మోతాదులో వాడాలని జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్ వెంకటరావు సూచించారు. మంగళవారం ధర్మలక్ష్మిపురం సచివాలయంలో ఆత్మా కార్యక్రమంలో భాగంగా రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని సేంద్రియ పద్ధతులను అవలంబించాలని, దాని వల్ల భూ సారం పెరుగుతుందన్నారు. వరితో పాటు చోడి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర పంటలను సైతం పండించాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయనతో పాటు స్థానిక ఏఓ కెసీహెచ్ వెంకటరావు, జిల్లా వనరులు కేంద్రం ఏఓ వై సురేష్, ఏఈఓ కంఠయ్య తదితరులు ఉన్నారు. 16న సీఎం పర్యటన శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన నరసన్నపేటలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. శాఖల వారీగా ఏయే అధికారికి ఏ విధులు కేటాయించిందీ వివరిస్తూ జిల్లా అధికారులు సమర్థంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, ఎస్డీసీలు పద్మావతి, లక్ష్మణరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఆర్ అండ్బీ ఎస్ఈ పి.సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీసీ వేణుగోపాలరావు, అదనపు డీఎంహెచ్ ఓ మేరీకేథరీన్, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయ సారథి, డీఎస్ఓ సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. -
కనీట్ కథ
● రద్దయిన నీట్ పరీక్ష ● పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలమైన కేంద్రం ● జిల్లాలో పరీక్ష రాసిన వారి సంఖ్య 1904 ● తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: నీట్ యూజీ–2026 పరీక్ష రద్దయ్యింది. పేపర్ లీకేజీ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈనెల 3వ తేదీన మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)చదువుల కోసం దేశవ్యాప్తంగా ఏకకాలంలో నీట్ యూజీ–2026 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా నుంచి మొత్తం 1951 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1904 మంది పరీక్ష రాశారు. మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రెండేళ్ల కిందట కూడా నీట్ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. పరీక్షలపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోసారి నీట్కు సన్నద్ధం కావాలంటే తమ మానసిక పరి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యపోయాను బాధ్యులను శిక్షించాల్సింది పోయి నీట్ రాసిన వారందరినీ ఇలా శిక్షించడం సరికాదు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేయడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాయాలంటే ఎంత కష్టం. ఆ వాతావరణం మళ్లీ వస్తుందా.. ఇలా రద్దు చేసి ఎంత మందో అభ్యర్థుల జీవితాలను ఫణంగా పెట్టారు. లీక్ బాధ్యులను ఉరి తీయాలి. అప్పుడే మళ్లీ లీక్ చేయడానికి భయపడతారు. అలాగే గతంలో వలే ఈ పరీక్షలు రాష్ట్రాలకు అప్పగించాలి. మా అబ్బాయి పరీక్ష రాశాడు. ఎంతో వ్యయప్రయాసలకు కుటుంబమంతా గురయ్యాం. ఇప్పుడు కథ అంతా మళ్లీ మొదటికే వచ్చింది. –ఎన్.అప్పయ్య, విద్యార్థి తండ్రి, నరసన్నపేట, -
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా భాస్కర్రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్స్టేషన్కు డీఎస్పీగా ఎన్.భాస్కర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్ఎస్లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్కు డీఎస్పీగా బి.రాజశేఖర్ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి. బీచ్ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్ పాతపట్నం: పోక్సో కేసు నిందితుడైన అంతరాబ గ్రామానికి చెందిన యాగాటి జయరాంకు పాతపట్నం మెజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని అంపోలులోని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు. విద్యుత్ తీగ తెగిపడి మూగజీవి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: పెదబాడాం–గుళ్లలపాడు గ్రామాల మధ్య 33 కేవీ విద్యుత్ తీగలు సోమవారం సాయంత్రం తెగి పడటంతో మూగజీవి మృత్యువాత పడింది. నగరంపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు దువ్వాడ పున్నయ్య తాను పెంచుకుంటున్న మూగ జీవాలను పంట పొలాల వైపు మేతకు తీసుకువెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో విద్యుత్ తీగ పడటంతో ఎద్దు మృతి చెందింది. సుమారు రూ. 40 వేలు నష్టం కలిగినట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరాడు. వేతనాలు పెంచాలని కార్మికుల నిరసన రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఆంధ్రా ఆర్గానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పండుగ, జాతీయ సెలవులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మద్దతు తెలిపారు. -
రియల్ ఎస్టేట్ కేంద్రంగా అమరావతి!
● ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇచ్ఛాపురం రూరల్: అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారని, ప్రజల కలల రాజధాని కాకుండా అధికార పార్టీ ల్యాండ్ డిపాజిట్ బ్యాంకుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ ముందు నుంచి చెబుతున్న మాటలే వాస్తవాలు అయ్యాయని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు కేటాయించిన ప్లాట్లు, చంద్రబాబునాయుడు అనుచరులకు ఇచ్చిన ప్లాట్ల వివరాలను పరిశీలించిన అమరావతి ప్రాంత రైతులు నివ్వెరపోతున్నారని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు ముంపు ప్రాంతాలలోనూ ప్లాట్లు కేటాయిస్తే, చంద్రబాబునాయుడుకు భజన చేసే వారికి విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడాన్ని ఇప్పుడిప్పుడే రాజధాని రైతులు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించిన పచ్చ పత్రికలు ప్రస్తుతం ఎందుకు ఆ వివరాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, పేద ప్రజలకు ఏమైనా మేలు చేశారా..?అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు నిలిపివేశారని, రాష్ట్రంలో ఒక్క వితంతువుకూ కొత్తగా పెన్షన్ మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. -
● ఒక ఫ్యామిలీ.. నాలుగు హెల్మెట్లు
జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కలిపి మొత్తం నలుగురు హెల్మెట్లు ధరించి ప్రయాణం సాగిస్తూ సోమవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులకు కనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నలుగురు ఒకే వాహనంపై కనిపించినా.. అందులో ఇద్దరు పిల్లలుండటంతో ఇలా ఇరుకుగా రాకూడదని అవగాహనపరుస్తూనే హెల్మెట్లు పెట్టి రావడం అభినందనీయమని ట్రాఫిక్ సీఐ వి.రామారావు ప్రశంసించారు. నగరంలోనే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రమేష్ వినూత్న మార్పుకు నాంది పలికారని, వాహనదారులంతా హెల్మెట్ ధారణలో రమేష్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. – శ్రీకాకుళం క్రైమ్ -
నీడ జాడ లేక..!
హిరమండలం: ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్ జీ) వేతనదారులు మండుటెండల్లో మాడిపోతున్నారు. నీడ కరువై విలవిల్లాడిపోతున్నారు. వేసవి అలవెన్సు రాక, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, బిల్లులు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎల్.ఎన్.పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. నిప్పుల కుంపటిలా.. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి వేతనదారులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (టెంట్లు)వేయాల్సి ఉంటుంది. విరామ సమయంలో వేతనదారులు వీటి కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఒక వేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ నీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, తర్వాత ఆస్పత్రికి తరలించడం వంటివి చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పని ప్రదేశంలో నిలువ నీడ కూడా కరువైంది. బడ్జెట్ లేనందువల్ల గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఎల్ఎన్పేట మండలంలో ఓ కార్మికుడు వడదెబ్బతగిలి పని ప్రదేశంలో మృతిచెందాడు. ఈ పరిస్థితి చూసి మిగతావారు బెంబేలెత్తుతున్నారు. పనిప్రదేశంలో చాలాచోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడంలేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వసతుల్లేవ్..! ఉపాధి హామీ పథకంలో సాధారంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఈ అలవెన్సులు వేతనదారులకు అందిస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి అలవెన్సులు తీసేశారు. దీంతో ఉపాధి పనులపై వేతనదారుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. గతంలో జిల్లాలో వేసవిలో రెండు లక్షల మందికి హాజరు నమోదు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఉపాధి పని జరిగే ప్రాంతాల్లో వేతనదారులకు టెంట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్ లేక గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నాం. పని ప్రదేశం వద్ద వేతనదారులు సొంతగా షెడ్ నిర్మించుకోవాలని సూచించాం. వసతులు ఉన్న చోటే పనులు పెట్టాలని చెప్పాం. మజ్జిగ పంపిణీ దాదాపు రెండేళ్లుగా ఇవ్వడం లేదు. వేతనాలు దశలవారీగా పడుతున్నాయి. వేతనదారుల సంఖ్య పెంచేందుకు కృషిచేస్తున్నాం. – ఏ.శ్రీనివాసరావు, ఏపీఓ, హిరమండలం మండుటెండలో ఉపాధి వేతనదారుల విలవిల టెంట్లు కొనుగోలుకు బడ్జెట్ లేదంటున్న అధికారులు ఇప్పటికే ఎల్ఎన్పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృతి -
దాసునాయుడు మృతి పార్టీకి తీరనిలోటు
ఆమదాలవలస: సైలాడ పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు సైలాడ దాసునాయుడు ఇటీవల గుండెపోటుతో మృతిచెందడంతో కుమ్మరిపేటలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య సోమవారం పరామర్శించారు. దాసునాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతికి గల కారణాలు అడిగి తెలుకున్నారు. వారితో పాటు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, నాయకులు గొండు కృష్ణమూర్తి, సురవరపు నాగేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, బోర చిన్నంనాయుడు, ఇసాయి వెంకటరావు, కింజరాపు సురేష్, పొన్నాడ చిన్నారావు, ఎన్ని రామచంద్రరావు, మొండేటి కూర్మారావు, మజ్జి నాగేశ్వరరావు, బొడ్డేపల్లి మన్మధరావు, పున్నపురెడ్డి తవిటినాయుడు తదితరులు ఉన్నారు. -
పుస్తెలతాడు చోరీపై ఫిర్యాదు
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ గణేష్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కొలగాన శ్రీనివాసరావు ఇంట్లో పుస్తెలతాడు మాయమైంది. ఈ మేరకు అతని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భర్త శ్రీను స్నేహితుడినని చెప్పి ఇంట్లో ప్రవేశించాడు. కూర్చోమని చెప్పి టీ తేవడానికి వెళ్లగా, ఆ వ్యక్తి టేబుల్పై ఉన్న పుస్తెలతాడు, సెల్ఫోన్ పట్టుకుని బయట గడియపెట్టి పరారైనట్లు బాధితురాలు పేర్కొన్నారు. జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై ఎస్.చిరంజీవి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించి వివరాలు సేకరించారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి హిరమండలం: ఎల్ఎన్పేట మండలంలోని స్కాట్పేట గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ (56)సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ప్రతిరోజులాగే సోమవారం కూడా స్నానానికి చెరువుకు వెళ్లాడు. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో భార్య సులోచన ఆందోళన చెంది గ్రామస్తులతో చెప్పగా.. వారు చెరువులో గాలించారు. మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. వెంకటరమణకు భార్యతో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. సులోచన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా అధికారులతో కలిసి 154 వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్డీసీలు జయదేవి, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే యూనిఫారాలను గతంలో మాదిరిగా కుట్టు ఏజెన్సీలు, మహిళా ఏజెన్సీలకు అందజేయాలని గాయిత్రీ మహిళా సొసైటీ ప్రతినిధులు కోరారు. ● సోంపేట మండలం జింకిభద్ర, బెంకిలి, పలాసపురం గ్రామాల్లో వడగండ్ల వాన ధాటికి టమాట, నువ్వు, కట్టెజనుము, చోడి, మిరప, మామిడి తదితర పంటలు పాడయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కె.గోపీనాథ్, టి.బిహాస్, బాపూజీ, తామాడ అప్పలస్వామి తదితరులు కోరారు. -
ఎస్పీ గ్రీవెన్స్కు 62 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో బాధితుల నుంచి 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ● ఆమదాలవలస ఎస్ఐపై బెలమాం గ్రామానికి చెందిన ఆబోతుల వసంతమ్మ ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇండక్షన్ ఆర్డర్ పట్టుకుని తమ భూమి వద్దకు వెళ్లామని.. అవతలి వ్యక్తులు తమనేం చేయలేక పంటతో ఉన్న భూమిని మేం కాల్చేశామని ఎస్ఐకు ఫిర్యాదు చేశారన్నారు. ఎటువంటి ఆధారం లేకపోయినా దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఎస్ఐ తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. -
సేవామూర్తులు
● రోగుల పాలిట అపర సంజీవులు ● భరోసా కల్పించేలా సపర్యలు ● ఆస్పత్రుల్లో ఉన్నంత సేపూ సేవలు ● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నా తమ్ముడు చాలా కాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉన్నప్పటికీ ఇంట్లో మా తమ్ముడు పరిస్థితి వల్ల మెడికల్ డిపార్ట్మెంట్ను ఎంచుకున్నాను. నా ఆలోచనకు అమ్మ మద్దతు తెలపడంతో నర్సింగ్ పూర్తి చేశాను. బాధితులకు ధైర్యం చెబుతూ వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చేలా పనిచేయడం సంతృప్తినిస్తోంది. మా తమ్ముడ్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెబుతున్నాను. – ఎల్.సంధ్య, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్త సంబంధీకులే దరిచేరని రోజులివి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకు మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో కొందరు నర్సులు సకల సేవలందిస్తున్నారు. అమ్మ కన్నా మిన్నగా బాగోగులు చూసుకుంటున్నారు. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు. నేడు నర్సింగ్డే సందర్భంగా కొందరు నర్సుల గురించి.. నర్సు వృత్తి దేవుడిచ్చిన వరంగా భావిస్తా. వృత్తిలో చేరి మూడేళ్లవుతోంది. చాలా మంది రోగులకు వైద్య సహాయక చర్యలు అందించాను. ఆరు నెలలు క్రితం నేను నైట్ డ్యూటీలో ఉండగా, అర్థరాత్రి సమయంలో అంంబులెన్స్లో ఓ యువకుడ్ని తెచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఘోరంగా కొట్టి రోడ్డు పక్కన పడేశారని చెప్పారు. ఎలాగైనా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆలోచనతో సాధ్యమైనంత వరకు ప్రథమ చిక్సిత ద్వారా ఊపిరందించాను. అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం వెళ్లాల్సిందిగా సూచించాను. కోలుకున్న వారు కృతజ్ఞతతో చూసే చూపు మరిచిపోలేనిది. – జె.మహేశ్వరి, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం అమ్మా, నాన్నలు ప్రోత్సాహంతో నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వచ్చాను. 27 ఏళ్లగా ఇదే వృత్తిలో కొనసాగుతూ అనేక మంది పేషెంట్లకు చికిత్స అందించడం సంతృప్తిగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం కోటబొమ్మాళి ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఓ మహిళకు పాము కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే ఇంజక్షన్ చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. ఆమె కోలుకోవడం, కుటుంబ సభ్యులు నన్ను అభినందించడం సంతృప్తినిచ్చింది. టెక్కలిలో ఉన్నప్పుడు ఓ మహిళా ఇంటి వద్ద ప్రసవం అయింది. ఆమె గర్భసంచి బయటకు రావడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తెచ్చారు. చాకచక్యంగా గర్భసంచిని యథాస్థానంలో ఉంచి కుట్లు వేశాను. – ఆర్.భవానీ,హెడ్ నర్సు, ఇచ్ఛాపురం -
ఉత్సాహంగా స్విమ్మింగ్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా సోమవారం జరిగిన ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారిలో దీక్షా బెహరా, ప్రీతమ్రాజ్, అవినాష్ ఉన్నారు. వీరు ఈ నెల 24న కర్నూలులోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అద్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, ఎస్.కాంతారావు, కోచ్ మురళీధర్, సూర్యారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
సేవాభావంతో..
రెండు నెలలు క్రితం నేను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉండగా, రాత్రి సమయంలో ఏడాదిన్నర బాబును తల్లిదండ్రులు ఏడుస్తూ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఫిట్స్ రావడంతో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ పిల్లాడ్ని చూస్తే నా ఏడాది కొడుకు గుర్తుకు వచ్చాడు. వెంటనే వైద్యం అందించా. ఇంజక్షన్ చేసి తెల్లారేవరకు ఆ పిల్లాడిని కంటికి రెప్పలా సపర్యలు చేశాను. బాబు కోలుకున్నాక ఆ తల్లిదండ్రులు నాపై చూపిన కృతజ్ఞతకు పులకించిపోయాను. నా భర్త సీఐఎస్ఎఫ్లో జాబ్ చేస్తుండటంతో పలుమార్లు నన్ను ఉద్యోగం మానేయాలని చెప్పారు. అయితే తోటి వారికి సాయం చేసే అమూల్యమైన ఉద్యోగాన్ని వదిలేయాలనిపించలేదు. – సీహెచ్.నాగశ్రీ, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం రోగులకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నేను డ్యూటీ నర్సు కావడంతో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశాను. చికిత్స అందిస్తుండగా నా చేతిలోనే మృతి చెందాడు. ఆ సమయంలో నిస్సహాయ స్థిఽతిలో ఉండిపోయాను. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం మూలంగా మృతి చెందాడు. ఇప్పటి కుర్రాళ్లు ప్రయాణాలు చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించడం లేదు. – బి.రూపావతి, స్టాఫ్ నర్స్, ఇచ్ఛాపురం ● -
కారు ఢీకొని రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
బూర్జ : మండల కేంద్రం బూర్జ గ్రామానికి చెందిన బంక రెయ్యిబాబు(38) సోమవారం ఉదయం విశాఖపట్నం షీలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెయ్యిబాబు ఎయిర్ఫోర్స్లో పనిచేస్తూ ఆరు నెలల కిందట ఉద్యోగ విరమణ పొందాడు. షీలానగర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 10న స్వగ్రామం బూర్జలో శుభకార్యం నిమిత్తం వచ్చి తిరిగి సోమవారం విశాఖపట్నం బయలుదేరాడు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షీలానగర్కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెయ్యిబాబుకు భార్య నళిని, కుమారులు దినకర్, కౌశిక్ ఉన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి సంతబొమ్మాళి: దండుగోపాలపురం రైల్వే హాల్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి సోమవారం మృతి చెందాడు. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు నుంచి జారిపడినట్లు తెలుస్తోంది. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
పలాసకు ఏమైంది..?
శ్రీకాకుళంసిగ్నల్ వస్తే ఒట్టుఏపీ ఫైబర్ నెట్ సిగ్నల్ రావడం లేదు. వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. –8లోసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026శ్రీకాకుళం క్రైమ్, పలాస : జిల్లాలోని జంట పట్టణాలైన పలాస–కాశీబుగ్గలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. జిల్లాలోనే గొప్ప వర్తక కేంద్రంగా ఖ్యాతి పొందిన ఈ మున్సిపాలిటీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా యి. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనంటూ ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరుసగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలే అందుకు సాక్షి. ఓ వైపు గన్ బెదిరింపులు, కిడ్నాప్లు, దాడు లు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా అరెస్టులు స్థానికులను భయపెడుతున్నాయి. ఇవి జరుగుతుండగానే మరోవైపు దొంగనోట్ల ముఠా, అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల చొరబాటు, జిల్లా చోరుల హస్తలాఘవం వంటివి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలవు అన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం దుకాణాలు, బార్లు, బెల్టుషాపుల్లో ఏరులై పారిస్తున్న మద్యానికి తోడు ఏఓబీ ప్రాంత సరిహద్దుల్లో వెలుస్తున్న గంజాయి డెన్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. తాజాగా శనివారం మొబైల్షాపులో పనిచేస్తున్న ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. పలాస–కాశీబుగ్గలో క్షీణించిన శాంతిభద్రతలు వరుసగా దొంగతనాలు, దోపిడీలు తాజాగా యువకునిపై హత్యాయత్నం సమీప ఏఓబీ ప్రాంతాల్లోనే గంజాయి, పేకాట డెన్లు ఇటీవల కాశీబుగ్గలోని ఓ బంగారం షాపులో ఒడిశా, యూపీలకు చెందిన డెకాయిట్ గ్యాంగులు పట్టపగలు చొరబడి యజమాని చేతు లకు బేడీలు వేసి గన్లతో బెదిరించి భారీగా బంగారాన్ని దోచుకుపోయారు. ఒడిశా డెకాయిట్లు పట్టుబడినా కథంతా నడిపింది కాశీబుగ్గలో ఉంటున్న ఒడిశా వలసదారుడే కావడం విశేషం. ఊరుకునేది లేదు.. భారీ చోరీలనేవి తగ్గాయి. నేరస్తులను పట్టుకుంటున్నాం. అంతర్ రాష్ట్ర వలసదారులు ఇక్కడ స్థానికంగా ఉంటూ నేరాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం. సర్వైలెన్సులు పెట్టాం. శాంతిభద్రతల పరిరక్షణలో మా పోలీసులు ముందుంటాం. – ఇటీవల మీడియాతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఘటనలు ఇవే.. ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి కాశీబుగ్గ జీడివ్యాపారిని(ఇతని సొంతూరు ఆమదాలవలసనే) ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించాడు. అంతకుముందు ఏడాదే జీడి వ్యాపా రి కె.రాజేంద్ర కుమారున్ని ఆర్థికలావాదేవీల్లో తేడాతోనే కొందరు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో రుజువైంది. ఇదే కాశీబుగ్గలో ఓ ఆర్మీ ఉద్యోగి గణేష్ అఫ్సెంట్ ప్రింటర్స్ ఓనర్ని కిడ్నాప్ చేయించాడు. పలాస రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్, రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్సు (ఆశీలు) కాంట్రాక్టు విషయంలో కాంట్రాక్టర్ను గన్తో ముగ్గురు బెదిరించారు. ఈ ఏడాది జనవరిలో కాశీబుగ్గలోని చినతిరుపతిగా పేరొందిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇదే జనవరిలో పూండిలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లోనూ భారీ చోరీ జరిగింది. అంతకు ముందేడాది ఇదే పూండిలోని ఓ బంగారం షాపు లో భారీ చోరీ జరిగింది. పూండీ చోరీలు అంతర్రాష్ట్ర ముఠాల పనేనని ఇటీవల ఎస్పీ విలేకరుల సమావేశంలో సైతం చెప్పారు. -
పల్లకిలో పెళ్లికూతురు
సీహెచ్ కపాసుకుద్ధిలో విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా నిర్వహించిన తారకనామమంత్ర పారాయణ సహిత నామయజ్ఞం ఆదివారంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా ఏర్పాటుచేసిన పూర్ణకుంభాలు, యజ్ఞకుండంలో మిగిలిన పదార్థాలను సమీపంలోని సముద్ర జలాల్లో నిమజ్జనం చేసే శోభాయాత్ర వేడుకగా జరిపించారు. – కవిటి కాలం మారింది. వివాహ పద్ధతులు మారిపోయాయి. ఆనాటి సంప్రదాయాలన్నీ కనుమరుగైపోయాయి. అలాంటిది ఓ పల్లెలోని పెళ్లిలో పల్లకీ మళ్లీ కనిపించింది. అంతరించిపోతున్న సంప్రదాయాన్ని ముచ్చటగా తట్టి లేపింది. ఆదివారం ఎస్పిఆర్పురం–చీపురుపల్లి, జి.సిగడాం–పొగిరి గ్రామాల్లో వివాహ వేడుకల్లో పెళ్లి కూతుళ్లను పల్లకిలో ఊరేగించారు. – జి.సిగడాం పల్లకిలో పెళ్లికూతురును ఊరేగిస్తున్న దృశ్యం (ఇన్సెట్లో) ఎస్పీఆర్పురం గ్రామంలో పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురు -
20 నుంచి పాఠశాల, కళాశాల బస్సులు తనిఖీ
శ్రీకాకుళం రూరల్: ఈ నెల 20 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేస్తామని ఉపరవాణా శాఖాధికారి ఎ.విజయసారథి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని స్కూల్స్, కాలేజీ బస్సులను ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం అనుసరించి రహదారి భద్రత నిబంధలను అనుస రించి తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బస్సు నిర్వహణ, బస్సు ఫిట్నెస్, పర్మిట్, పన్ను విధానం, అత్యవసర నియమాలు, వేగ నియంత్రణ పరికరాలు, డ్రైవర్కు సంబంధించిన లైసెన్స్, బ్యాడ్జి బస్సు పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. జిల్లాలోని 5 బృందాలుగా ఏర్పరచి ప్రతి రోజు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా 614 స్కూల్, కాలేజీలకు సంబంధించిన బస్సులు ఉండగా ఇంతవరకూ 173 బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. వీటిలో 49 బస్సులకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పు అవసరమన్నారు. ఆయా యాజమాన్యాలను స్పంచింది వెంటనే స్కూల్ కాలేజీ బస్సులను వెంటనే తనిఖీలు చేపట్టాలని డీటీసీ కోరారు. 16న ముఖ్యమంత్రి పర్యటన నరసన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న నరసన్నపేట మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మండలం జమ్ము కూడలి, తామరాపల్లిల వద్ద ఉన్న హెలీప్యాడ్ స్థలాలను ఆయన అధికారులతో కలసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొంటారని అన్నారు. ఆయన వెనుక ఇన్చార్జి ఆర్డీఓ వేణుగోపాలరావు, ఆర్అండ్బీఈఈ తిరుపతిరావు, డీఎస్పీ లక్ష్మణరావు, తహసీల్దార్ సత్యనారా యణ ఉన్నారు. ఇప్పటికే నరసన్నపేట మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను చురుగ్గా చేపడుతున్నారు. రోజుకు 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ రణస్థలం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలకు ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్స్ రూల్స్ అమలులోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం పైడిభీమవరం పారిశ్రామికవాడలో లేబర్ కోడ్స్ రూల్స్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలే పతనం అవుతాయని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస వేతనం వెంటనే సవరించి కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే గేటును ఢీకొట్టిన వాహనం వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గలో గల రైల్వే ఎల్సీ గేటును ఆదివారం ఓ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సుమారు గంట కాలం పాటు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు.. రైల్వే గేటు వేస్తున్న సమ యంలో తొందరగా గేటును దాటే ప్రయత్నంలో వాహనం అతివేగంగా వెళ్లి ఎల్సీ గేటును బలంగా ఢీ కొట్టింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సిబ్బంది సాయంతో ప్రత్యా మ్నాయంగా తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులు చేపట్టేందుకు దాదాపుగా గంట సమయం పట్టడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అలాగే ద్విచక్రవాహనదారులు మండుటెండతో చాలా ఇబ్బంది పడ్డారు. అలా గే కొంత మంది ప్రయాణికులు బస్సులు, ఆటోలను దిగి అక్కడ నుంచి వెళ్లారు. -
అరసవల్లిలో భక్తుల రద్దీ
అరసవల్లి: వైశాఖమాసం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సందడి కనిపించింది. చివరి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయక పూజలు నిర్వహించారు. పెసల మొలకలు, ధాన్యం, బెల్లం, వడపప్పు, మామిడి పండ్లు, టెంకాయలతో ప్రత్యేకంగా స్వామి వారికి నివేదించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ మొక్కుకున్నారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకున్నారు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కబోత, ఎండతీవ్రత పెరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్కరిణి సమీపంలో టెంట్లు ఉన్నప్పటికీ ఏమాత్రం సరిపడకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నదాన ప్రసాదానికి భక్తులు బారులు తీరారు. పెందుర్తికి చెందిన భక్తులు ఆరిపాక సంధ్యారాణి, ఆమె కుమారుడు అయాన్ష్ నందన్లు తులాభారం మొక్కు చెల్లించుకుని 60 కేజీల బెల్లం చెక్కీలను ఈవో ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణల సమక్షంలో ప్రసాదాల విభాగానికి సమర్పించారు. -
పోర్టు నిర్వాసితులకు తప్పని పాట్లు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. నౌపడలో కేటాయించిన పునరావాస కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో మూలపేట గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు, రోడ్లు లేకపోవడం, డ్రైనేజీలు అరకొరగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్స్తో వస్తున్న ట్రాక్టర్, టిప్పర్లు తరచూ బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం కూడా ఇదే సమస్య పునరావృతం కావడంతో అవస్థలు పడ్డారు. తమ భూములు, గ్రామాన్ని పోర్టుకు ఇస్తే త్యాగాలను గుర్తించకుండా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ వేంకటేశ్వర కాలనీ నడిబొడ్డున ఉన్న ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రణస్థలం మండలం నారువ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న డి.మల్లేష్ వెంకటేశ్వర కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం నేతేరు లక్ష్మీపురం వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉంటున్న బంధువులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే మల్లేష్కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ బృంద సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. ఐదు తులాల బంగారం, రూ.లక్షా ఇరవై వేలు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వివరాలు ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీతో రాత్రి 11 గంటల సమయంలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. 12.30 గంటల సమయంలో మిగతా ఇద్దరు స్కూటీతో రాగానే లోపలి వ్యక్తి బయటకు వచ్చి అందరూ పరారయ్యారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యంత రద్దీగా, ముఖ్య కూడలిలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడం ఎక్కువైందని, అర్ధరాత్రి వేళల్లో కూడా బైక్లతో తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని, ఇప్పటికై న ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లాన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన నల్లాన వెంకునాయుడు నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సంఘ జాతీయ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ నియామక పత్రాన్ని వెంకునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకునాయుడు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి పిల్లా కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో చోరీలకు అడ్డుకట్ట పలాస: దొంగతనాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కోరారు. ఆదివారం స్థానిక జి.ఎం.ఈ కాలనీలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిందని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతివీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
కిక్కిరిసిన కాంప్లెక్స్
జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిక్కిరిసింది. పిల్లలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా జనాలు ప్రయాణాల బాట పట్టడంతో బస్సులన్నీ రద్దీగా కనిపించాయి. ఈ నెల 13 తర్వాత మూఢం రానుండటంతో వివాహ, గృహప్రవేశ ముహూర్తాలు ఇప్పుడే ఎక్కువగా జరుగుతుండటంతో జనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారితో నాన్స్టాప్ కౌంటర్ కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్కు చేరుకున్న బస్సుల్లో సీట్లు సాధించేందుకు.. ముఖ్యంగా ఉచిత బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఎగబడ్డారు. – శ్రీకాకుళం అర్బన్ -
అంతులేని గ్యాస్ కష్టాలు
● సిలిండర్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్న వినియోగదారులు ● ప్రయాసలు పడుతున్న గ్రామీణ ప్రజలు టెక్కలి: జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా గ్యాస్ ఇబ్బందులు లేవంటూ అధికారులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం సామాన్య వినియోగదారుడికి గ్యాస్ సిలిండర్ అందాలంటే పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏకంగా 2 వేల నుంచి 2500 రూపాయలకు పైగా అవుతోందని అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర చెప్పాల్సిన పని లేదు. రెండు నెలల క్రితం వరకు రూ.1850 ఉన్న కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు రూ.3270కు చేరింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన డొమెస్టిక్ వినియోగదారులు అనేక ప్రయాసలతో ఏజెన్సీల వద్దకు రెండు మూడు సార్లు తిరిగితే తప్ప సిలిండర్ దొర కడం లేదు. గ్యాస్ కొరత ఉందనే నెపంతో ఇప్పటి కే పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పెద్ద బ్లాక్ మార్కెట్గా మారుతోంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుని నిర్ణీత కాలంలో గ్యాస్ సిలిండర్ పొందాలని అధికారులు ప్రకటన లు చేయడం కేవలం కంటి తుడుపు చర్యగా మా రింది. ఏజెన్సీల ద్వారా అందని గ్యాస్ సిలిండర్లు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తే బయట మార్కెట్లో పుష్కలంగా లభ్యమవుతున్నాయని కొంత మంది వినియోగదారులు వాపోతున్నారు. పర్యవేక్షిస్తున్నారా..? ప్రతి రోజూ ఏజెన్సీల నుంచి ఎన్ని సిలిండర్లు సరఫరా చేస్తున్నారు, ఎక్కడకు చేరుతున్నాయి, అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా, ఈ వ్యవహారంలో డెలివరీ బాయ్స్ పాత్ర ఎంత మేరకు ఉంది అనేది ఎవరూ పర్యవేక్షించడం లేదన్న ఆరోపణ ఉంది. టెక్కలి, నందిగాం మండలాలకు ఒకే ఒక్క సివిల్ సప్లై డీటీ ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
చదువుకు దూరం
ఫీజుల భారం.. శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదలకు ఉన్నత చదువులు భారంగా మారుతున్నాయి. స్కాలర్ షిప్పులు, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పెను భారమవుతోంది. దీని వల్ల కొందరి చదువులు అర్ధంతరంగా ఆగిపోతుంటే.. మరికొందరి సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పేదల ఉన్నత చదువులకు మొండిచేయి చూపుతోంది. ఈ ఏడాది విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకునేది. తల్లిదండ్రులపై భారం పడ కుండా పిల్లల చదువులు సాగిపోయేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంజినీరింగ్, మెడికల్ చదువుల్లో చేరిన వారికి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్సుమెంట్, స్కాలర్షిప్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 2023–24 సంవత్సరం చివరిలో ఎన్నికలు రావడంతో చివరి రెండు విడతలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ బకాయి చెల్లించలేదు. కనీసం రెండు విడుతల్లో రూ.14.6 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. 2024–25 సంవత్సరంలో జిల్లాలో 52 వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో కొన్ని డిగ్రీలకు మాత్రమే ఒక విడత నగదు వేసి, చేతులు దులుపుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న సుమారుగా 44 వేల మంది బీసీలకు ఈ నగదు జమకాలేదు. ఒక విడతలో సుమారుగా రూ.12 కోట్లు విడుదల చేయాల్సింది, కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 2025–26 విద్యాసంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో సుమారుగా 52 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు వివిధ కోర్సులో ఉండగా.. వారిలో కేవలం 3321 మందికి మాత్రమే స్కాలర్ షిప్పులు విడుదల చేశారు. ఇది కేవలం రూ.4 కోట్లు. మిగిలిన విద్యార్థులు సుమారుగా 49 వేల మందికి రూ.48 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. వీరంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాలు అయ్యాయి. గతంలో చేరిన విద్యార్థులు ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు వెళ్తున్నారు. వీరంతా ఫీజుల చెల్లింపుపై ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు పెరుగుతున్న బకాయిలు -
ఏయూఈఈటీకి 330 మంది హాజరు
ఎచ్చెర్ల : ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్ల డ్యూయల్ ఇంజినీరింగ్ (బీటెక్, ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికి ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఏయూఈఈటీ– 2026కు 330 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 374 మందికి హల్టికెట్లు జారీ చేయగా 44 మంది గైర్హాజరయ్యారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు పర్యవేక్షించారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం ఉదయం కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుకు వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మత్స్యశాఖ డైరెక్టర్ జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరున్ని మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అర్చకులు ఆల చరిత్ర వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. ఈయనతోపాటు డీడీ గోపికృష్ణ, సిబ్బంది, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను పట్టుకొని డ్రైవర్పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆదివారం తెలిపారు. నారాయణవలస సంత వద్ద నుంచి అలమండ సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న వ్యాన్లోనే 9 ఆవులను ఎక్కించడంతో ప్రాణాపాయంగా కనిపించాయని చెప్పారు. తామరాపల్లి వద్ద వీటిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించి వ్యాన్ సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. నాటకరంగానికి చేయూతనివ్వాలి శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ నియామకం పట్ల శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న నాటకరంగానికి, పేద కళాకారులకు చేయూతనందించాలని కోరారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్ర దేవ్, న్యాయ సలహాదారు కంచరాన అప్పారావు, కార్యవర్గ సభ్యులు చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
32 ఏళ్ల తర్వాత..
దూసి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు కొడుతూ తమ చిన్ననాటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. – ఆమదాలవలస -
ధాన్యం కొనుగోలుకు మోక్షమెప్పుడో?
సారవకోట: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వీడటం లేదు. సారవకోట మండలంలోని పలు గ్రామాలలో రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యం నేటికీ కొనుగోలు కాలేదు. సారవకోట, జగ్గయ్యపేట, బురుజువాడ, కొత్తూరు, అగదల తదితర గ్రామాల రైతులకు పంట త్వరగా చేతికి రావడంతో ధాన్యాన్ని వ్యాపారులకు ఎంతోకొంత ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం తొగిరి, అక్కివలస, బద్రి, అడ్డపనస గ్రామాల రైతులకు పంట ఆలస్యంగా చేతికి రావడంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం రబీలో పండిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో వారంతా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం సరైన ధర మార్కెట్లో లేదని, ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఈదుర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం భద్రపర్చుకునేందుకు అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులలో తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలవరపడుతున్నారు. మరోవైపు మొక్క జొన్న సాగు చేసిన రైతులు సైతం మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
అధికారులూ.. ఇదేం తీరు..!
● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం! ● కార్పొరేట్ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను శ్రీకాకుళం : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖలోనే చర్చ జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని, ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి అందరినీ ఒకేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా తాము ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారు సమ్మతిస్తే ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని మాత్రమే చెప్పారని, ఎంఈఓలు టీసీలు ఇస్తారనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు. -
సిగ్నల్ వస్తే ఒట్టు!
ఏపీ ఫైబర్ నెట్.. ● సాంకేతిక లోపంతో సరిగ్గా అందని సేవలు ● మండిపడుతున్న వినియోగదారులు ● చేతులెత్తేస్తున్న ఆపరేటర్లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో ఏపీ ఫైబర్నెట్ సేవలను కూటమి పాలకులు గాలికి వదిలేశారు. ప్రజలు సాంకేతికతను అందిపుచ్చుకొని ఇంట్లోనే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఏపీ ఫైబర్ నెట్ సేవలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకే ప్యాకేజీ కింద టీవీ, ల్యాండ్ ఫోన్, ఇంటర్నెట్ విత్ వైఫైతో సర్వీసులను ఏపీ ఫైబర్ లిమిటెడ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో 40 వేలకు పైగా ఏపీ ఫైబ నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన ఈ సేవలను కూటమి ప్రభుత్వం తర్వాత పూర్తిగా గాలికి వదిలేయడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నో సిగ్నల్.. ప్రభుత్వ బడులకు, గ్రామ, వార్డు సచివాయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ గాలికి వదిలేయడంతో సేవలు సరిగా అందని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 26 వేలకు కనెక్షన్లు తగ్గాయని అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ నెట్ బేసిక్ ప్లాన్ ప్రతి నెలా రూ.149 ఉండగా నేడు రూ.349కు పెరిగింది. ఈ ప్యాకేజీ డబ్బులను నెల ముందుగానే కేబుల్ ఆపరేటర్ల ద్వారా వినియోగదారులు చెల్లించాలి. లేదంటే నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయేవి. ముందుగానే బిల్లు చెల్లించినప్పటికీ ఇంటర్ నెట్లో నో సిగ్నల్ అంటూ చూపిస్తుండటంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ఎప్పుడు నెట్ వస్తుందో ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. ఈ విషయమై కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ నెట్ ఆపరేటర్లు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. సాంకేతిక సమస్య ఉండటంతో పాటు యూపీఎస్లు పని చేయకపోవడం, డిజిటల్ బాక్స్లు ఇవ్వకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు శాటిలైట్ వ్యవస్థ ద్వారా సిగ్నల్ను పంపిస్తుంటే ఏపీ ఫైబర్ నెట్ మాత్రం కేబుల్ వైర్ల ద్వారా అందిస్తున్నారు. ఏపీ ఫైబర్ సేవలలో సాంకేతిక లోపానికి వైర్లలో నాణ్యత కూడా ఒక కారణమని పలువురు చెబుతున్నారు. -
ఏమేం చేయాలంటే..?
● వేసవిలో ప్రణాళిక ఉండాల్సిందే ● ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం ● ఆహార నియమాలు పాటించి తీరాల్సిందే ద్రవాహారమే ఉపయుక్తం సాధారణ రోజుల్లో కంటే మూడు రెట్లు అధికంగా నీరు తాగాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకు ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. శ్రీకాకుళం కల్చరల్: కార్తెలు మొదలైనప్పటి నుంచి సూరీడు ఎక్క డా ఆగడం లేదు. నిప్పులు కక్కుతున్నాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ మే ఎండలను ఎదుర్కోవడానికి చక్కటి ప్రణాళికతో సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం మేలు వేసవిలో చెమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా 3 సార్లు స్నానం చేస్తే మరీ మంచిది. నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపటం మేలు. ఉదయపు స్నానం ఒంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్రకు తోడ్పడుతుంది. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు ఫిజియోథెరపిస్టు కె.లక్ష్మణమూర్తి. పాటిస్తే ఆరోగ్య యోగమే వేసవిలో యోగా చాలా మంచిదని పతంజలి యోగా నిర్వాహకులు మావూరు నాగేశ్వరరావు అంటున్నారు. సూర్యనమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకండ్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్యనమస్కారాలు రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ణాసనం, ఏకమ్ముక్తాసనం, శశాంకాసనం, అర్దకోణాసనం, ప్రశాంతాసనం, యోగ నిద్ర, షణ్మఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. శీతలి, చంద్రభేధిని, నాడి శోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీరక ఇబ్బందులు అధిగమించవచ్చు. ఆహారమే కీలకం వేసవిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్కి ఉంటాయి. బ్లాక్బె బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెరీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి వంటివి విరివి గా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకర కాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలి, దోస, గ్రీన్బీన్స్, పెద్ద వంకాయ, పుదీనా వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. ఓట్మిల్, బ్రౌన్రైస్, తియ్యటి బంగాళాదుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతిరావు బుడితి విద్యుత్ సబ్స్టేషన్లో ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సారవకోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నందిగాం: లట్టిగాం సమీపంలో జాతీయ రఽహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన కోమటూరు ప్రసాదరావు(44) దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాదరావు భార్యాపిల్లలతో కలిసి లట్టిగాంలో నివాసముంటూ స్థానిక ప్రైవేటు పాఠశాల బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం పలాస వెళ్లేందుకు జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండగా.. లఖిదాసుపురంకు చెందిన తెలిసిన వ్యక్తి తన బొలెరా వాహనం ఆపాడు. ఆ వాహనం వద్దకు వెళ్తుండగా టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న వ్యాను ప్రసాదరావును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాదరావు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమినించిన స్థానికులు వెంటనే టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రసాదరావుకు భార్య శాంతికుమారి, కుమారుడు నిరంజన్, కుమార్తె కావ్యశ్రీ ఉన్నారు. శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కక్ష గట్టి.. గొంతు కోసి..
● మొబైల్ షాపులో పనిచేస్తున్న వ్యక్తిపై ఇద్దరు వ్యక్తుల దాడి ● షాపు నుంచి బయటకు తీసుకొచ్చి గొంతు కోసి పరారీ పలాస : కాశీబుగ్గ కె.టి.రోడ్డులోని ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న లోలుగు ఈశ్వరరావు(20) అనే యువకుడిపై పలాస రాజమ్మకాలనీకి చెందిన రాజాం తిరుపతి, అతని స్నేహితుడు కోత సురేష్ దాడికి పాల్పడ్డారు. శనివారం షాపులోకి వెళ్లి మాట్లాడదామని చెప్పి బయట రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఈశ్వరరావు గొంతును చాకుతో కోసేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఈశ్వరరావును పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుట్లు వేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమా.. పోలీసుల కథనం ప్రకారం.. ఈశ్వరరావు అన్నయ్య రమేష్.. తిరుపతి చెల్లెలను ఏడాది క్రితం ప్రేమించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇదే సమయంలో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి రమేష్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె తండ్రి మనస్థాపానికి గురై మృతి చెందాడు. దీంతో అమ్మాయి కుటుంబీకులు రమేష్, అతని కుటుంబ సభ్యులపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రమేష్ తమ్ముడు ఈశ్వరరావుపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు బలి!
వరకట్న వేధింపులకు.. ● విశాఖలో శిమ్మపేట వివాహిత అనుమానాస్పద మృతి ● ఉరేసుకుందంటున్న భర్త ● అల్లుడే చంపేశాడని తల్లిదండ్రుల ఆరోపణ శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మినారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా ఉన్న సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. మృతిచెందిన తేజశ్రీ తేజశ్రీ కాళ్లపై వాతలు -
నియామక నోటిఫికేషన్ ఉప సంహరణ
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం కార్య నిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 60 ఉత్తర్వుల ప్రకారం బీఆర్ఏయూలో ఖాళీగా ఉన్న 98 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్న ట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. సదరు పోస్టుల భర్తీ కోసం 2023 సంవత్సరం 10 వ నెల 30వ తేదీన జారీ చేసిన అధ్యాపక నియామక నోటిఫికేషన్లు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుము తిరిగి పొందేందుకు సంబంధించిన సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ బీఆర్ఏయూ.ఈడియూ.ఇన్ ను సంప్రందించాలని సూచించారు. కొత్త నోటిఫికేషన్లు, తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటించనున్నామని తెలిపారు. ఎచ్చెర్ల: డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్బీఎస్ అండ్ హెచ్ఎస్ఎస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న మజ్జి రామారావు విద్యార్థినితో అసభ్యంగా ఫోన్లో మాట్లాడిన అంశంపై విచారణ జరిపా రు. వీసీ కేఆర్ రజిని నియమించిన త్రిసభ్య క మిటీ శనివారం వర్సిటీలో విచారణ జరిపారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యార్థినితో వేర్వేరుగా కమిటీ సభ్యులు విచారణ చేపట్టి వివరణ తీసుకున్నారు. ఈ కమిటీ చైర్మన్గా నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ వి. బాలహోహాన్దాస్, సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రధానాచార్యులు కె.సీతామాణిక్యం, విశ్రాంత జిల్లా జడ్జి ధర్మారా వు ఉన్నారు. అయితే విద్యార్థిని వేధింపులపై సంబంధిత కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మ జ్జి రామారావును అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీ అధికారులు నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇచ్ఛాపురం: ప్రతి ఒక్కరూ ఇతర జీవులపై జా లి, దయా గుణం కలిగి ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందని జైనమత సన్యాసులు శ్వేతాంబర్ తెరపంతి ఆచార్య మహాశ్రమ అన్నారు. చైన్నె నుంచి ఒడిశాలోని కటక్ వరకు పాదయాత్ర చేపట్టిన జైనమత సన్యానులు, శిష్యులు శనివారం పట్టణం చేరుకున్నారు. వీరికి జ్ఞానభారతి పాఠశాల కార్యదర్శి జోహార్ఖాన్ స్వాగతం పలికి పాఠశా ల ఆవరణలో విడిది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైనమత సన్యానులు మాట్లాడుతూ జైనమతంలో అత్యంత పవిత్రంగా భావించే చతుర్మాస దీక్షను నాలుగు నెలల కాలం పాటు కఠినంగా పాటించి దీక్షను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: వేసవి సెలవు ల్లో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెట్టడం సరికాదని ఏపీటీఎఫ్ (1938) జిల్లా శాఖ అధ్యక్షుడు మామిడి భుజింగరావు అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత ప్రణాళికలు అత్యవసరంగా తయారు చేసి సమర్పించాలని జిల్లా విద్యాశా ఖాధికారులు ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేసవి సెలవులు అని ఆలోచించకుండా ఒకటి రెండు రోజుల్లో ఆయా ప్రణాళికలు రూపొందించి అందించాల న్న అధికారుల తీరు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేదిగా ఉందన్నారు. స్వల్పకాలంలో ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, పాఠశాల కమిటీలతో కూలంకషంగా చర్చలు జరిపి ఈ ప్రణాళికలను రూపొందించాల్సి ఉన్నందున వేసవి సెలవులు ముగిసి పాఠశాల లు తెరిచిన తర్వాత ఈ ప్రణాళికలు సమర్పించేలా అధికారులు ఆదేశాలను సవరించాలని ఆయన కోరారు. హిరమండలం: ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన గౌతమి, రోజారాణి, హనీష్లు హిరమండలంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. తిరిగి వెళుతుండ గా ఎల్ఎన్పేట మండలం రావిచంద్రి సమీపంలో వెనుక బైక్పై వస్తున్న రాఘవ ఢీకొట్టాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 108లో ఆ మదాలవలస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
పత్రాలు.. ఇప్పుడే తీసుకుంటే మేలు
హిరమండలం: పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పది, ఇంటర్ విద్యార్థులకు ఉన్నత చదువులకు పలు ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటిని ముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒత్తిడి పెరగక ముందే.. ఏటా మే, జూన్ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో ఒత్తిడి అఽధికంగా ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరు గుతుంది. దీంతో మాటిమాటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ముందుగా మేల్కొంటే ఈ అవస్థ తప్పుతుంది. పత్రాలు పొందాలంటే.. తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కుల, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. వీటికోసం మీసేవా, స్వర్ణగ్రామం సచివాలయాలు వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత అర్జీ పూర్తి చేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్ సహాయకుడికి అందజేయాలి. ఆన్లైన్లో పొందపరిచిన ఈ వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలోను, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)నేరుగాను పరిశీలిస్తా రు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్ తన లాగిన్లో మరోసారి నిశితంగా అన్నింటినీ తనిఖీ చేసి డిజిటల్ సంతకం చేస్తారు. దీనిపై చరవాణికి వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయం లేదా మీసేవాలో ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళ న చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు నిర్దేశించిన సమయం కంటే ముందు జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్, హిరమండలం -
●ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా..
ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన ఈమె పేరు మంగి హేమావతి. ఈమెకు ఆనంద్, యోగానంద్, యోగేశ్వరరావు ముగ్గురు కొడుకులు. చిన్నతనంలో పుట్టిన రోజు చేస్తే తన ముగ్గురు పిల్లలకు మిలట్రీ డ్రస్సులు వేసి ఆనందించేవారు. మీరు పెద్దయితే మీ ముగ్గురూ దేశం కోసం సైనికులుగా మారి భరతమాతకు సేవ చేయాలంటూ ఉన్నత చదువులు చదివించారు. 2002లో పెద్ద కొడుకు ఆనంద్ మీరట్లో ఆర్మీలో జవాన్గా, రెండో కొడుకు యోగానంద్ 2003లో పంజాబ్లో ఆర్మీ జవాన్, మూడో కొడుకు యోగేశ్వరరావు 2004లో జమ్మూలో ఆర్మీ జవాన్గా ఎంపికయ్యారు. తన ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా మార్చి తన కలలను నిజం చేసింది హేమావతి. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటున్న ముగ్గురు కుమారుల్ని చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని ఆనందభాష్పాలతో చెబుతోంది హేమావతి. మంగి హేమావతి -
కిక్ కొడితే పతకమే..!
శ్రీకాకుళం న్యూకాలనీ: బాక్సింగ్లో అంచెలంచెలుగా రాణిస్తూ.. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది శ్రీకాకుళం యువ క్రీడాకారణి పెద్దింటి చైతన్య. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుపులు మెరిపిస్తోంది. యువ బాక్సర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. సిక్కోలు నుంచి ఐర్లాండ్ వరకు.. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐర్లాండ్లో జరిగిన అంతర్జాతీయ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్లల్లో చైతన్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తృటిలో పతకం కోల్పోయినా.. అంతర్జాతీయ వేదికపై సిక్కోలు వనితగా చూపించిన పోరాట ప్రతిభను బాక్సింగ్ దిగ్గజాలను సైతం మెచ్చుకునేలా చేసింది. తాజాగా అసోంలో గత నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 8వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్–2026 పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన చైతన్య అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. పలువురు స్టార్ ప్లేయర్లను ఓడించి సెమీస్లో అడుగుపెట్టిన ఈ యువ కిషోరం చిన్న తప్పిదం కారణంగా ఫైనల్ బెర్త్ను కోల్పోయింది. దీంతో 65 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఎంతో కఠినమైన పోటీ నడుమ చైతన్య చూపించిన పోరాట ప్రతిభ అత్యద్భుమని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్దేవ్(అను) పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో,. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన జీవిత లక్ష్యంగా సాధన చేస్తున్న చైతన్య శ్రీకాకుళం నగరంలోని పుణ్యపువీధిలో నివాసం ఉంటున్నారు. తండ్రి పెద్దింటి వేణుగోపాలరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తుండగా, తల్లి తేజేశ్వరి గృహిణి. చైతన్య విశాఖపట్నంలోని వాల్తేర్ కేంద్రీయ విద్యాలయంలో 10+2 (ఇంటర్) చదువుతూ.. విశాఖలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో సాధన చేస్తోంది. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత లక్ష్యం. కోచ్ల పర్యవేక్షణలో నిరంతర సాధన చేస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాక్సింగ్ సంఘ పెద్దలు, కోచ్ల నిరంతర కృషితో రాణించగలుగుతున్నాను. భవిష్యత్తులో మరిన్ని పెద్ద టోర్నీల్లో పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. – పెద్దింటి చైతన్య, బాక్సింగ్ క్రీడాకారిణి బాక్సింగ్లో సత్తాచాటుతున్న పెద్దింటి చైతన్య ఐర్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్ల్లో రాణింపు తాజాగా యూత్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకంతో మెరుపులు -
●ఒక కొడుకును కోల్పోయినా..
ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన ఈమె పేరు లోపింటి మహాలక్ష్మి. ఈమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కిషోర్కుమార్ మిలట్రీలో చేరతానంటే, తండ్రి పద్మనాభం వారించినప్పటికీ, తల్లి మహాలక్ష్మీ పెద్ద మనస్సుతో సైన్యంలోకి పంపించింది. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత 2007 డిసెంబర్13న చత్తీస్గఢ్ రాష్ట్రం బీజూపూర్లో నక్సల్స్కు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో కిశోర్కు మార్ నేలకొరిగాడు. కుటుంబం అంతా తల్లడిల్లినా ...తల్లి మహాలక్ష్మీ మాత్రం దేశ రక్షణ కోసం తన కొడుకు ఆశువులు బాసాడు అంటూ గొప్పగా చెప్పుకుంది. అధైర్య పడకుండా తన చిన్న కొడుకు అశోక్ను సైతం అదే సైన్యంలో చేర్పించింది. ప్రస్తుతం అశోక్ రాంచీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. లోపింటి మహాలక్ష్మీ -
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీనివాసనగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంటి తాళాలు పగలుగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎల్.హేమశంకర్ అనే ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మందసలోని తన స్వగ్రామానికి వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటికి తాళాలు లేవు. లోపలికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో రెండు తులాల బంగారు నగలు, రూ.70వేలు నగదు, కిలో వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతోకాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నర్సింహమూర్తి సిబ్బంది వచ్చి పరిశీలించారు. దొంగలు ఉపయోగించిన ఇనుపరాడ్లను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీరు పంపినా వేధింపులేనా..?
టెక్కలి: టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులు తీవ్రమైన నీటి ఇక్కట్లు పడుతుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నీటి ఇబ్బందులు తెలుసుకుని వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా డ తిలక్ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి నీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకున్నా రు. ఈ క్రమంలో శనివారం మంచినీటి ట్యాంకర్ను ఆస్పత్రికి తరలించారు. అయితే మంచినీటి ట్యాంకర్ ఆస్పత్రికి చేరుకోగానే ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది నీటి ట్యాంకర్ను తీసుకోకుండా లేనిపోని కారణాలతో ట్యాంకర్ను నిలిపివేశారు. అక్కడితో ఆగకుండా పోలీసు లు మరో అడుగు ముందుకేసి ట్యాంకర్ డ్రైవర్తో పాటు కొంత మంది ఆస్పత్రి దిగువ స్థాయి సిబ్బందిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. మానవతా దృక్పథంతో ఆస్పత్రికి మంచినీటిని అందజేస్తే, రోగులు పడుతున్న అవస్థలను పక్కన పెట్టి ట్యాంకర్ను తీసుకోకుండా రాజకీయ కోణంలో ముప్పు తిప్పలు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు, నీటి ఇబ్బందులపై తరచూ ఆస్పత్రికి వచ్చే వారు అవస్థలు పడుతున్నప్పటికీ, వాటిపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించకపోగా, మానవీయ కోణంలో రోగుల కోసం తాము పంపించిన మంచినీటి ట్యాంకర్ను తీసుకోకుండా రాజకీయం చేయ డం అత్యంత పాశవికమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు నియంతగా ప్రవర్తిస్తున్నారనే విషయానికి ఇది ఒక పెద్ద నిదర్శనమ ని తిలక్ గుర్తు చేశారు. ఆస్పత్రిలో రోగులు నీటి ఇబ్బందులు పడుతున్నారనే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి మేర కు నీటి ట్యాంకర్ను పంపించామన్నారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ రోగులకు మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవర్తించారని దుయ్యబట్టారు. -
శ్రీకాకుళం
కిక్ కొడితే పతకమేబాక్సింగ్లో చైతన్య రాణిస్తున్నాడు. యూత్ బాక్సింగ్ పోటీలో అదరగొట్టాడు. –8లోకక్ష గట్టి.. గొంతు కోసి పలాసలో దారుణం జరిగింది. కక్ష గట్టి ఓ వ్యక్తి మృతి చెందారు. –8లోఆమె కొట్టినా ఆనందమే.. ఆమె తిట్టినా సంతోషమే.. అమ్మ ఏం చేసినా పిల్లలకు ముచ్చటే. ఇళ్లంటే అమ్మ గాజుల చప్పుడు వినిపించాలి. ఇళ్లంటే ఆమె అడుగుల సవ్వడి తెలుస్తూ ఉండాలి. మాతృత్వం అంటే ఈ లాలిత్యం ఒక్కటే కాదు. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా దేశ రక్షణకు పంపించే తల్లులు ఉన్నారు. వారసుడికి ప్రాణాపాయం ఉందని తెలిసి అవయవాన్ని దానం చేసిన మాతృమూర్తులు ఉన్నారు. కన్నపేగు అడుగుల కదలికలు లయబద్ధం చేసి నుదుటి రాతను మార్చిన అమ్మలూ ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. మమతల మాలలు అల్లుతూ ప్రతి ఇంటినీ పచ్చగా చూసుకుంటున్న అమ్మకు జేజేలు పలకాల్సిన రోజు. – ఇచ్ఛాపురం రూరల్, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్, జి.సిగడాం, వజ్రపుకొత్తూరు రూరల్ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు బుడత లోలమ్మ. ఇద్దరు మగ పిల్లలు పుట్టాక పెంచి ప్రయోజకుల్ని చేయాల్సిన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న లోలమ్మ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించారు. తన ఇద్దరు కొడుకుల్ని సైన్యంలో చేర్పించాలన్న ఆమె కోరికను పిల్లలు ముందుంచారు. పెద్దబ్బాయి దివాకర్, చిన్నబ్బాయి ఢిల్లీరావులు పదో తరగతి నుంచే తమ తల్లి సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేశారు. 2014లో పెద్ద కొడుకు జైలర్గా, 2015లో చిన్నకొడుకు ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఎంపికయ్యారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో ఢిల్లీరావు పాల్గొనగా, తల్లి లోలమ్మ దేశ రక్షణ కో సం పోరాడాలంటూ పిలుపునివ్వడం విశేషం. దేశానికి సేవ చేస్తున్న తన ఇద్దరు కుమారుల్ని చూసి ఇప్పుడు తల్లి లోలమ్మ గర్వపడుతోంది. ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి ఆయుష్షును పెంచారు. టెక్కలి రెడ్డికవీధికి చెందిన పిలక దుర్గారావుకు కిడ్నీ పాడై పోవడంతో, ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మళ్లీ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడంతో, 2013లో తల్లి ఆరుద్రమ్మ తన కిడ్నీని కుమారుడికి ఇచ్చి ఆయుష్షును పెంచారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం చక్కగా ఉంది.తల్లి లోలమ్మ ఎస్ఎన్.పుట్టుగ గ్రామానికి చెందిన ఈమె పేరు బొట్ట జానకమ్మ, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఈమెది. ఈమె పెద్ద కొడుకు కృష్ణారావు ఆరేళ్ల క్రితం పంజాబ్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు రాజేష్ ఇండియన్ కోస్ట్ గార్డ్గా రెండున్నరేళ్ల కిందట పాండిచ్ఛేరిలో నేవీలో చేరారు. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కొడుకులు దేశ రక్షణ విధుల్లో చేరడం, ఎంతటి విపత్కర పరిస్థి తులు ఉన్నా దేశం తమకు ముందు అని వారు చెబుతుండటం తల్లిగా తనకు గర్వంగా ఉంటుందని జానకమ్మ చెబుతున్నారు. ‘దేశ సేవలో మేము ఉన్నాం...కానీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అసలు సైనికురాలు మా అమ్మే, ఆమె త్యాగం, ప్రేమ, ఆశీర్వాదం వల్లే ఈ యూనిఫాం గౌరవంగా ధరించగలుగుతున్నాం’ అంటూ ఉప్పొంగిపోతున్నారు ఈమె కుమారులు కృష్ణారావు, రాజేష్లు. తల్లి జానకమ్మతో కుమారులు కృష్ణారావు, రాజేష్ తల్లి సరోజిని -
నదీజల కాలుష్యాన్ని నివారించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నాగావళి నదీ జల కాలుష్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, పి.తేజేశ్వరరావు ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యం నివారించాలని, శ్రీకాకుళం ప్రజల ఆరోగ్యం కాపా డాలని, శ్రీకాకుళం మురికి నీరును శుద్ధిచేసి పైపులైన్ ద్వారా సముద్రానికి పంపించాలని కోరుతూ శని వారం నాగావళి నది కలుషిత జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు జలకాలుష్యాన్ని నివారించి ఎస్టీపీ ప్లాంట్ కట్టేందుకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించా రు. కలుషిత జలాలను తాగడం వల్ల నగరవాసులు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో 11 చోట్ల నుంచి నాగావళి నదిలోకి మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు చేరుతున్నాయని, అవి నీటి ట్యాంకుల వద్దకు చేరడంతో అదే నీరు నగరవాసులకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. నీటి పన్ను, నాలా పన్ను పేరిట రకరకాల పన్నులు వేసి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మంచినీరు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. నదీజల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతాడ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, బి.చిన్నారావు, వెంకటరావు, ప్రవీణ పాల్గొన్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన ప్రసాద ట్రస్ట్కు నగరానికి చెందిన కింతలి మురళీధర్, నిర్మల దంపతులు రూ.లక్ష విరా ళం అందజేశారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు విరాళ నగదు దాతలు అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నదాన ప్రసాదాన్ని నిత్యం దాతల విరాళాల వడ్డీలతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యం కనీసం వెయ్యి మందికి అన్నప్రసాదం అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. టీచర్లను ఇబ్బందిపెట్టవద్దు శ్రీకాకుళం: మండు వేసవిలో రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఉపాధ్యాయులకు పనులు అప్పగించడం సమంజసం కాదని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వెకేషన్ డిపార్ట్మెంట్కు చెందినవారని గుర్తు చేశారు. ప్రత్యేక తరగతులు, ఎన్రోల్మెంట్ డ్రైవ్, క్లస్టర్ హేబిటేషన్ ప్లాను పేర్లతో రాతపూర్వక ఆదేశాలు లేకుండా మౌఖికంగా, ఆన్లైన్ సమావేశాలు, వాట్సాప్ మెసేజ్లతో రకరకాల పనులు అప్పగించడం భావ్యం కాదన్నారు. మానసికంగా వేధింపులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు వ్యక్తిగత పనులకు వెళ్లారని, కొందకరు స్వగ్రామాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు నరసన్నపేట: గుండవల్లిపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ.కుమార స్వామి, ఏ.సాంబమూర్తిలు గాయపడ్డారు. వీరు నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద, చిన్న దూగాం గ్రామాలకు చెందిన వీరు శ్రీకాకుళం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఎన్హెచ్ అంబులెన్స్ సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
కన్నీటి చార ఆరక ముందే..
● వారం వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతి నరసన్నపేట: జమ్ము గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. వారం వ్యవధిలో తండ్రీకుమారులు కోల లక్ష్మణరావు, కోల శివప్రసాద్లు మృతి చెందారు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రమైంది. వారం కిందట కోల లక్ష్మణరావు కుమారుడు శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్ ద్విచక్రవాహనం విజయనగరం వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పుట్టెడు దుఖంతో తండ్రి లక్ష్మణరావు కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అనారోగ్యానికి గురైన లక్ష్మణరావు జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు మృతి నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబం దిక్కులేనిదైంది. శివప్రసాద్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు సోదరీమణులకు వివాహాలు చేశాడు. ఇప్పుడు తండ్రీ కుమారులు ఇద్దరూ వారం వ్యవదిలో మరణించడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావ డం లేదు. కోల లక్ష్మణరావుకు భార్య సీతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు
మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్ఎస్ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ ఎర్.అప్పలరాజు, తహసీల్దార్ మిస్క శ్రీకాంత్ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ విద్యుత్ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ‘వేధింపులు ఆపండి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్, వై.దుర్గారావు, ఎస్.జోగారావు, ఎస్ఎస్ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు. టెన్త్ టాపర్లకు నేడు పురస్కారాల ప్రదానం శ్రీకాకుళం : వసుదైక కుటుంబం యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ బి సంస్థ సౌజన్యంతో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నట్లు వి.కె.ఫ్యామిలీ సభ్యులు, జిల్లా సమన్వయకర్త పి.హరిప్రసన్న, లాభాల గుణశేఖర్, జి.సాయికుమార్, పైల సత్యవతి, రావాడ పాపారావు, పైడి సునీత తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ రో డ్డులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీరపు దేవీ ప్రియ –594(జెడ్పీ ఉన్నత పాఠశాల, పైడి భీమవరం), నౌపడ చిద్విలాస్–593(మున్సిపల్ హైస్కూల్, మెట్టక్కివలస), ఎన్.రమ్యశ్రీ –593(ఏపీ మోడల్ స్కూల్, కొండములిగాం), బి.కాత్యాయ వరప్రసన్న–591 (గవర్నమెంట్ స్కూల్ – కవిటి), కె.దీపిక–591(ఏపీ మోడల్ స్కూల్, తామాడ), పూజారి కీర్తి పండా –591(జెడ్పీ హైస్కూల్, కాశీబుగ్గ), బి.షర్మిల–591(ఎం.జె.పి, పలాస), శివ హరీష్ అంజంగి–591(ఎం.జె.పి–సంతబొమ్మాళి), పి.సత్య ఇందు–591(మున్సిపల్ హైస్కూల్, అరసవల్లి) బగాతి మౌనిక 591(జెడ్పీ హైస్కూల్, లింగాలవలస)లకు పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. టాప్ 10 విద్యార్థులతో పాటు, స్కూల్ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. -
నిదురమ్మ ఎటు బోతివే..
స్మార్ట్ స్క్రీన్ల వెలుగులో ‘మెలటోనిన్’ హార్మోను రాను రానంటోంది. మొబైల్ ఫోన్ల మాయలో పడి ‘సెరొటోనిన్’ రావడమే మానేసింది. ఈ రెండూ లేకుంటే మనిషికి నిద్ర లేదు.. జీవికి ప్రశాంతత లేదు. రాత్రంతా కొరివి దెయ్యాల్లా కళ్లు ఎర్రగా మండేంత వరకు సెల్ఫోన్ చూడడం, నిశాచరుల్లా తిరగడం, ఇష్టానుసారం తినడంతో ఈ హార్మోన్ల అసమతుల్యత తప్పడం లేదు. ఒకప్పుడు టీవీ చూస్తూ ఆవులింతలు తీయడం, మాటలు వింటూ కునికి పాట్లు పడడం అన్నది ఈ తరానికి పూర్తిగా దూరమైపోయింది. అర్ధరాత్రి దాటినా చాలా మందిని నిద్ర కరుణించడం లేదు. దీని ఫలిత మే సవాలక్ష ఆరోగ్య సమస్యలు. శ్రీకాకుళం కల్చరల్: ఉరుకులు, పరుగులు, హడావుడి.. బతుకుంతా ఇలాగే మారిపోయింది. ఈ గజిబిజి జీవనంలో కంటి నిండా నిద్రపోయే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి గురై వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కానరాని మానసిక ఉల్లాసం ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం కనిపించడం లేదు. నేటి పరిస్థితులలో జీవన సమస్యలు ఎదుర్కోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి కాసేపు పార్కులకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. నిద్ర పట్టకపోవడం. ఆకలి లేకపోవడం, ఎక్కువ తినాలనిపించడం. హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళలలో పీరియడ్స్ ఇబ్బందులు. ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు సోకడం. నిద్రకు దూరమవుతున్న యువత చుట్టు ముడుతున్న ఆరోగ్య సమస్యలు గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్లకు ఇదీ ఓ కారణం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం. ఒకే సమయానికి రోజూ నిద్రించడం అలవాటు చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్పై దృష్టి సారించాలి. సెల్ఫోన్ చూడడం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. నిద్ర తగ్గితే ప్రాణ హాని కలుగుతుంది. శారీరక, మానసిక ఒత్తిడులు నిద్రలేమి వల్లనే కలుగుతాయి. వృత్తిపరమైన స్ట్రెస్, పర్సనల్ లైఫ్ సమస్య, ఎగ్జైట్మెంట్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయి. పిల్లలైనా పెద్దవారైనా ప్రతి వారు శారీరక వ్యాయామం, ఆటపాటల వల్ల మంచి నిద్ర పట్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. – జి.రోష్మల్లికార్జున్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, శ్రీకాకుళం -
సొమ్ము దోచేశాడు
గ్యాస్ ఓటీపీ అడిగాడు.. ● హిరమండలం మండలంలో వెలుగుచూసిన వైనం ● ఆన్లైన్లో వివరాలు చెబితే అంతే.. ● హెచ్చరిస్తున్న పోలీసులు హిరమండలం: హిరమండలం మండంలోని పిండ్రువాడ, రెల్లివలసలో గుర్తు తెలియ ని యువకుడు మోసాలకు గురిచేశా డు. గ్యాస్ పేరుతో ఫోన్లకు నకిలీ మెసేజ్లు పెట్టాడు. గ్యాస్ వచ్చిందని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేసి ఉడాయించాడు. అయితే ఆ రెండు గ్రామాల్లోనే కాదు. పరిసర ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గ్యాస్ పేరుతో ఇలా మోసాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విధిగా 45 రోజుల తరువాత కొత్త గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అటు ఫోన్లకు వచ్చే ఓటీపీ చెబితే కానీ గ్యాస్ అందించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఓటీపీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలో జనగణన కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరు ఎందుకు వస్తున్నారో? ఏ వివరాలు సేకరిస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు జనగణన కోసం వచ్చేవారు ఏ వివరాలు తీసుకుంటారు? ప్రజలు ఏ వివరాలు ఇవ్వకూడదు? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఆన్లైన్లోనూ వల గ్యాస్ పేరుతో ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారు. రెండు రోజుల్లో గ్యాస్ సరఫరా అంటూ వల పన్నుతున్నారు. వారు పంపిన లింక్లను క్లిక్ చేసిన మరుక్షణం వినియోగదారుల ఫోన్లు మోసగా ళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. వినియోగదారుడు తెలుసుకునేలోగా మోసం జరిగిపోతోంది. వారి వలకు చిక్కకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, గ్యాస్ డీలర్లు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ వాహనాలు వచ్చి డెలివరీ బాయ్స్ సంప్రదించేవరకూ ఎవరూ స్పందించవద్దని కోరుతున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆన్లైన్లో ఓటీపీలు అడగరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేవలం గ్యాస్ వాహనంతో డెలివరీ బా య్స్ వచ్చి వివరాలు అడిగితేనే చెప్పాలని సూచిస్తున్నారు. గ్యాస్ పేరుతో అపరిచిత వ్యక్తులు వచ్చి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. గ్యాస్ వాహ నం రాకుండా ఇంటికి వచ్చి అడిగేవారు మోసం చేసేవారు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అదే సమయంలో ఆన్లైన్లో సైతం ఎలాంటి వివరాలు చెప్పకూడదు. చెబితే సైబర్ నేరగాళ్ల మాయలో పడినట్టే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – వై.మధుసూదనరావు, ఎస్ఐ, హిరమండలం -
రెండేళ్లుగా గ్రీవెన్స్కు..
● భూమి కోసం రిటైర్డ్ ఉద్యోగి పోరాటం ● దక్కని న్యాయం శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ కార్యాలయంలో పని జరిపించుకోవడం సామాన్యులకు రానురాను అసాధ్యమైపోతోంది. సామాన్యులకే కాదు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులకు సైతం ఇక్కడ నిరీక్షణ తప్పడం లేదు. మట్ట మల్లేశ్వరరావు శ్రీకాకుళం నివాసి, రిటైర్డు గెజిటెడ్ అధికారి. ఆయన దివ్యాంగుడు కూడా. ఆయనకు జలుమూరు మండలంలోని జలుమూరులో సర్వే నెంబర్ 87–15 లో 20 సెంట్ల భూమి ఉండేది. కొన్నేళ్ల కిందట ఏడు సెంట్లు భూమిని విక్రయించారు. మిగిలిన భూమిని రికార్డుల్లో సెంటు సెంట్లు తక్కువగా చూపించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్ర యించగా రోడ్డులో కొంత కలిసిందని అధికారులు చెప్పారు. రీ సర్వేలో రెండు సెంట్లు తేడా రావడంతో ఆయన ఫిర్యాదు చేయగా.. రో డ్డులో కలిసిపోయిందని చెప్పారు. ఆధారాలు కావాలని అడిగితే ఎవరూ స్పందించడం లేదు. దీంతో ఆయన రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కరించాలని గ్రీవెన్స్సెల్కు వెళ్తూనే ఉన్నారు. రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ను నేరుగా కలిస్తే.. ఆయన జలుమూరు తహసీల్దార్ను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కానీ అవి కూడా బుట్టదాఖలయ్యాయి. ఇక్కడ ఫిర్యాదు దారు ఒకప్పు డు గెజిటెడ్ ఆఫీసర్. అందులోనూ దివ్యాంగుడు. ఆయన సమస్య పరిష్కారం కావడానికే ఇన్నేళ్లు పడితే ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. దీనిపై మల్లేశ్వరరావు మాట్లాడుతూ తన భూమిని తన పేరిట ఇవ్వడానికి ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. పలు దుకాణాల్లో చోరీ టెక్కలి రూరల్: స్థానిక అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఉన్న పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు శుక్రవారం గుర్తించారు. అరటిగెలల షాపు, కూరగాయల షాపు, గుడ్లు షాపులతో పాటు పూజ సామగ్రి షాపుల్లో చోరీలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం నాలుగు షాపులకు సంబంధించి సుమారు రూ.40వేలు వరకు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
ప్రభుత్వ ఆదాయానికి గండి
● వృథాగా డ్రైవర్ల సంఘం భవనం ● సచివాలయానికి అప్పగించాలని పూర్వపు అధ్యక్షుల డిమాండ్ శ్రీకాకుళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలో ఉన్న డ్రైవర్ల సంఘం కార్యాలయ భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ భవనం ద్వా రా వస్తున్న ఆదాయం ఎవరికి వెళ్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అన్నది తెలియకుండా ఉందని డ్రైవ ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని అనీల్చంద్ర పునేఠ కలెక్టర్గా ఉన్న సమయంలో డ్రైవర్ల కు అప్పగించారు. రౌతు సింహాచలం ఈ సంఘాని కి అధ్యక్షులుగా ఉన్న సమయంలో 2014లో రూ.14 లక్షలతో భవనానికి మరమ్మతులు నిర్వహించి పక్కా షాపులు నిర్మించారు. అనంతరం అద్దెల వసూలు మొదలుపెట్టారు. నెలకు సుమారు రూ.50వేలకు పైగా అద్దెలు వస్తున్నాయి. ఇన్నేళ్లలో దాదాపు లక్షల్లో అద్దె రూపంలో వచ్చిఉండాలని, కానీ ఆ డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సంఘానికి చెందిన వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే డ్రైవర్లు కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ రూమ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సుమారు 320 మంది ఉండేవారు. వారంతా పదవీ విరమణ చేయడంతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో వాచ్మెన్లను పెట్టి అన్ని రకాల క్లీనింగ్లు వంటివి చేసేవారు. కలెక్టరేట్లో డ్రైవర్గా ఉన్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే పెత్తనమంతా చెలాయిస్తున్నట్లు ఆ సంఘ నాయకులే చెబుతున్నారు. భవనానికి వచ్చిన రాబ డి అంతా సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాను కలెక్టరేట్ డ్రైవర్నని తనను ఎవరూ ఏమీ చేయలేరని డాంబికాలు పలుకుతున్నట్లు సమాచారం. ఓ ఇద్దరు వ్యక్తులే వచ్చిన కాడికి తినేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. అద్దెలు కలెక్షన్ చేస్తున్నారే తప్ప ఎలాంటి లెక్కలు చూపించడం లేదని, సంఘ భవనాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లించగలిగితే బాగుంటుందని పూర్వపు అధ్యక్షులు, సంఘ నాయకులు కోరుతున్నారు. కనీసం సచివాలయాలకైనా ఇస్తే ఆ డబ్బులైనా మిగులుతాయని అంటున్నారు. -
విపత్తుల నిర్వహణపై శిక్షణ
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ రెడ్క్రాస్, తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని శాంతా కల్యాణ అనురాగం నిలయంలో శుక్రవారం వలంటీర్లకు, విద్యార్థులకు విపత్తుల నిర్వహణ, సామర్థ్యం పెంపుపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విపత్తుల నుంచి నష్టాన్ని తగ్గించుకోవటానికి శిక్షణ కార్యక్రమాలు ఎంత దోహదపడతాయన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వలంటీర్లకు నైపుణ్యాలు కలిగించడం ద్వారా తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, పి.శ్రీకాంత్, ఎం.కళ్యాణ్ చక్రవర్తి, బి. చిన్మయి రావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఈసెట్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 90.97 శాతం ఉత్తీ ర్ణతను సాధించి మెరిశారు. పాలిటెక్నిక్ చదివి ఇంజినీరింగ్ కోర్సు ల్లో నేరుగా రెండే ఏడాది ప్రవేశా లు పొందేందుకుగాను రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన రెండు సెషన్లగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. ఈసారీ బాలికలే టాప్.. ఎప్పటిలాగే సారి కూడా బాలికలే టాప్లేపే ఫలితాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1389 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1340 మంది హాజరయ్యారు. వీరిలో 1219 మంది ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించారు. ఇందులో 923 మంది బాలురుకుగాను 89.17 శాతం ఉత్తీర్ణతతో 823 మంది క్వాలిఫై అవ్వగా, 417 మంది బాలికలకుగాను 94.6 శాతం ఉత్తీర్ణతతో 396 మంది అర్హత పొందారు. వివిధ బ్రాంచీల్లో పలువురు విద్యార్థులు అదిరేటి ర్యాంకులు పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్లో పలాస మండల పరిధిలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన కుప్పిలి నిఖిల్కుమార్ స్టేట్లో 7వ ర్యాంకు సాధించాడు. లింగాలవలస విద్యార్థికి ఈసెట్లో 33 వ ర్యాంక్ జలుమూరు: లింగాలవలసకు చెందిన పంచిరెడ్డి పవన్ కల్యాణ్కు ఈసెట్లో 33వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 973. ఒకటి నుంచి ఐదు వరకూ చల్లవానిపేట విజ్ఞాన దుర్గ, ఆరు నుంచి పది వరకూ కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. తల్లి దండ్రులు జయలక్ష్మి, ప్రకాశరావు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసు సాధనే తన లక్ష్యమని పవన్కల్యాణ్ తెలిపాడు. -
క్లాసులు చెబుతాం రండి
శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారీ జూనియర్ కళాశాలల్లో చదువుతూ.. ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులపై ఇంటర్ విద్య డైరెక్టరేట్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభుత్వ కాలేజీలు 38 ఉన్నాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 5814 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 3439 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం నుంచి 5,188 మంది పరీక్షలకు హాజరుకాగా 3,588 ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫెయిలైన విద్యార్థులతోపాటు తాము సాధించిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు ఇంప్రూవ్మెంట్(మార్కులు పెంచుకునేందుకు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం వారి మార్కులను పెంచుకునేందుకు పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్బోర్డు అవకాశం కల్పించింది. ఈ విధానం అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇంటర్లో సాధించిన మార్కులు ఐఐటీ, ఎన్ఎస్ఐటీల్లో సీటు సాధించేందుకు కీలకం కానున్నాయి. ఇంటర్లో రెండేళ్లు కలిపి ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం, ఓసీ, బీసీ, ఓబీసీ తదితరులకు 75 శాతం మార్కులు సాధిస్తే ఈ వెయిటేజీ ఉత్తమ కోర్సుల్లో చేరేందుకు ఉపయోగపడుతుంది. కొందరు విద్యార్థులు జేఈఈలో ఉత్తీర్ణులైనా ఇంటర్లో వచ్చిన మార్కులు తగ్గడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈఏపీసెట్లో 25 శాతం వెయిటేజీ పొందవచ్చు. తాజా ఫలితాల్లో మార్కుల శాతం తగ్గిన విద్యార్థులు లోటు పరిస్థితి అధిగమించేందుకు సప్లిమెంటరీపై దృష్టి పెట్టారు. రెమీడియల్ క్లాసులు.. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెట్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సర్కారీ కాలేజీల్లో రెమీడియల్ క్లాసులు (పునశ్చరణ తరగ తులు) నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల్లో సందేహాలు, ప్రశ్నలు, జవాబులతోపాటు మోడల్ పేపర్లలో ప్రశ్నలకు సాధన చేయిస్తున్నారు. ఫెయిలైనవారు ఉత్తీర్ణత సాధించడంతోపాటు మార్కులు స్కోరింగ్ చేసేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమన్వయంతో పనిచేసి విద్యార్ధులను తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్య అధికారులు సూచిస్తున్నారు. మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతను సాధించేలా రెమీడియల్ క్లాసులను నిర్వహిస్తున్నాం. ఒకవైపు రెమీడియల్ క్లాసులు నిర్వహిస్తూనే మరోపక్క పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లు చేస్తున్నాం. సెకెండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సప్లిమెంటరీ విద్యార్థులు గణనీయంగా పెరిగారు. – ఎం.కృష్ణవేణి, ఇంటర్విద్య డీవీఈఓ, శ్రీకాకుళం జిల్లా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు పునఃశ్చరణ తరగతుల నిర్వహణ బెటర్మెంట్కు దరఖాస్తు చేసిన వారు సైతం హాజరు కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పడిపోయిన ఉత్తీర్ణత శాతం మెరుగుకు చర్యలు పర్యవేక్షిస్తున్న ఇంటర్ విద్య జిల్లా అధికారులు -
ఆస్పత్రిలో నీటి పాట్లు సిగ్గుచేటు
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నీటి సమస్యను పరిశీలించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ● తన వంతుగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తానని హామీ టెక్కలి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సదుపాయం కల్పించలేకపోవడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సరఫరా సక్రమంగా అందకపోవడంపై శుక్రవారం ‘సాక్షి’ లో వచ్చిన కథనం మేరకు ఆయన ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావును కలిసి నీటి కొరత పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అసమర్థతకు ఇది నిదర్శనమన్నారు. బహిరంగ సభల్లో గొప్పలు చెప్పుకుంటూ అర్థం లేని ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై లేని పోని కేసు లు, విచారణలు చేయించడమే మంత్రికి తెలుసు నని తిలక్ అన్నారు. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి కొరత తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తానని తిలక్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ యనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, జడ్యాడ జయరాం, అక్కురాడ లోకనాథం, కిల్లి అజయ్కుమార్, ఆట్ల రాహుల్ తదితరులు ఉన్నారు. -
25, 26న ఎస్బీఐ సమ్మె
శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్లోగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎస్బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీ బూర్జ: పాలవలస సచివాలయం పరిధిలోని లక్కుపురం గ్రామంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ కమిషనర్ బి.హర్ష స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పర్యటనలో భాగంగా లక్కుపురంలో ఎంపీడీఓ ఆర్.తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ రఽథం కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హిరమండలం: పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువులో పడి ఒడిశాకు చెందిన పురోనభత్ర (24) అనే యువకుడు మృతిచెందాడు. వంశధార రిజర్వాయర్ వద్ద నీరు వచ్చే గెడ్డలో పడి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి సోదరుడు త్రిలోచనభత్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన పురోనభత్ర, త్రిలోచనమిత్ర అన్నదమ్ములు. ఇందులో పురోనభత్ర పెద్దసంకిలి గ్రామానికి చెందిన పల్ల శ్రీనివాసరావు వద్ద బోర్లు తవ్వే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం మెట్టూరు వద్ద నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిలేకపోవడంతో తనతో పాటు పనిచేస్తు న్న సురుభత్ర, మహేష్భత్ర, అమిత్ బడాతో కలిసి పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువు వద్ద చేపల వేటకు వెళ్లారు. అయితే అప్పటికే పురోనభత్ర మద్యం మత్తులో ఉండడంతో మిగతా ముగ్గురు వదిలేసి చేపల వేటలో నిమగ్నమయ్యారు. అయితే చేపల వేట ముగిసే సమయానికి పురోనభత్ర కనిపించలేదు. మెట్టూరులో రూములోకి వెళ్లిపోయాడని భావించి మిగతా ముగ్గురు వెళ్లిపోయారు. కానీ పురోనభత్ర ఇంటికి చేరలేదు. శుక్రవారం ఉదయం సైతం చేరకపోయేసరికి సోదరుడికి సమాచా రం అందించారు. పురోనభత్ర తన వద్దకు చేరలేదని చెప్పిన సోదరుడు త్రిలోచనభత్ర మెట్టూరుకు చేరుకున్నాడు. అనుమానంతో చెరువు వద్ద వెతకగా పురోనభత్ర మృతదేహం కనిపించింది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ఉండాడని సోదరుడు త్రిలోచనభత్ర పోలీసులకు ఫిర్యాదుచేశాడు. -
జీడి.. ఇంటికి చేరిందండి
● ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు ● దేశీయ పిక్కలపై ఆసక్తి చూపని వ్యాపారులు పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రజల జీవనాధారమైన జీడి పంట రైతుల ఇళ్లకు చేరింది. వాటిని అమ్ముకోవడానికి ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి తోటల్లో జీడి పిక్కలు కాపునకు వచ్చాయి. వాటిని తోటల్లో సేకరించి ఎండబెట్టి గోనె సంచుల్లో నింపి భద్రపరిచారు. ప్రస్తుతం జీడి పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయి. పలాస నియోజకవవర్గంలోని పలా స మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో గల జీడి తోటల్లో పిక్కలు ఇళ్ల వద్దకు చేరుకున్నాయి. అయితే గ్రామాల్లోకి వ్యాపారులు ఇంకా రావడం లేదు. ఇప్పటికే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకున్న పలాస వ్యాపారులు ప్రస్తుతం వాటిపైనే ఆధార పడి తమ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. దీంతో వారంతా ధీమాగా ఉన్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పలాస పప్పు అంటే ఉద్దానం జీడి పిక్కల వల్లనే వాటికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పు డు ఉద్దానం పిక్కలను కొనుగోలు చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఎప్పు డో ఒకప్పుడు తమకే అమ్ముతారన్న ధీమా వారిలో నాటుకు పోయింది. అలాగే రైతులు కూడా చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం, వారితో ఉన్న అవినాభావ సంబంధాల మేరకు వారికే పిక్కలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా పిక్కల ధరలు తేలలేదు. రైతు సంఘాల మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 80 కిలోల బస్తా పిక్కలను రూ.16వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న వారి డిమాండు ఏడాది ఎంత వరకు నెరువేరుతుందో వేచి చూడాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఉద్దానం ప్రాంతంలోని జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు ల నుంచి నేరుగా కొనుగోలు చేయాలి. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధర ప్రకటించాలి. కనీసం బస్తా పిక్కలకు రూ.16వేలు చెల్లించాలి. – తెప్పల అజయ్కుమార్, రైతు, మాకన్నపల్లి, పలాస మండలం వాతావరణం అనుకూలించలేదు ఈ ఏడాది జీడి రైతులకు వాతావరణం అనుకూలించలేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వమే రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. – కోనేరు రమేష్, రైతు కూలీ సంఘం నాయకుడు -
11న జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, ఉపాధ్యక్షుడు వై.సూర్యారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.కాంతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఎంపికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక్కడ రాణించి ఎంపికైన క్రీడాకారులను ఈనెల 24వ తేదీన కర్నూలులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన స్విమ్మింగ్ క్రీడాకారులు తమ పేర్లను ఈనెల 9వ తేదీలోగా డీఎస్ఏ కోచ్ మురళీ (సెల్: 9908831849)ని సంప్రదించాలని వారు కోరారు. ‘ఒడిశా అధికారుల నుంచి రక్షించండి’ మందస: మాణిక్యపట్నం గిరిజనులపై ఒడిశా అధికారులు, పోలీసుల దౌర్జన్యాలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు విన్నవించారు. జనగణనలో భాగంగా సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో ఉంటున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. రక్షించాలని తహసీల్దార్ మిస్క శ్రీకాంత్, ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, ఎంపీడీఓ వై.వెంకటరమణలకు వినతి పత్రం అందజేశారు. సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ సచివాలయం సిబ్బంది జనగణన చేసి ఇంటి గోడలపై నంబర్లు వేశారు. అనంతరం ఒడిశా అధికారులు, పోలీసులు వచ్చి ఆ నంబర్లను చెరిపివేశారు. ఇళ్లలో ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. తాము చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నామని గిరిజనులు ఆవేద న వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి సవర గురునాథ్, రైతుల సంఘం కార్యదర్శి పి.దేవేంద్ర, మట్ట ధర్మారావు, ఎన్.భాస్కరరావు, ఎస్.విప్రో, ఎస్.మధుసూదన్, ఎస్.సుదన్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయ కిటికీ అద్దాలు ధ్వంసం సారవకోట: మండలంలోని కిడిమి సచివాలయ కిటికీ అద్దాలను నాలుగు రోజుల కిందట ఆకతాయిలు పగలగొట్టారు. సచివాలయ సిబ్బంది తమ విధులు ముగించుకుని ఇంటికెళ్లిన తర్వాత రాళ్లతో కొట్టడంతో అద్దాలు పగిలి పోయాయని వీఆర్వో రాము తెలిపారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఆమదాలవలస: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రి న్సిపల్ సీపాన నీలవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. దరఖాస్తులు ఆచార్య ఎనన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.angrau.ac.i n ద్వారా సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7702394824 నంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. -
● అలా.. ఉమ్లింగ్లా వరకు
● ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్ ● జిల్లా నుంచి బైక్పై సాహస యాత్ర చేసిన యువకుడు రణస్థలం:రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ సాహస యాత్ర చేశాడు. ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్ 18న కిశోర్ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్ ప్రాంతం నుంచి ఉమ్ లింగ్ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. బైక్, సర్టిఫికెట్తో కిశోర్ -
ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసితుల అవస్థలు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్అండ్ఆర్ కాలనీలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాసిత కాలనీలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండిపోయింది. గురువారం ఇళ్ల నిర్మాణాల కోసం మెటీరియల్స్తో వస్తున్న ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. కూరుకుపోయిన ట్రాక్టర్ బయటకు రాని పరిస్థితి తలెత్తడంతో మెటీరియల్స్ను అక్కడే కిందకు దించారు. ఇక్కడి నుంచి పని చేసే ప్రదేశానికి మెటీరియల్స్ తీసుకుని వెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దానికి తోడు అదనపు భారం కూడా తమపై పెడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత జేసీబీ సాయంతో ట్రాక్టర్ బయటకు తీశారు. -
ఎందుకింత కాల్యాపన..?
108.. మూడంటే మూడే అంకెలు. లక్షలాది ప్రాణాలను కాపాడాయి. రోడ్డుపై నెత్తురోడుతూ ఆఖరి క్షణాల్లో ఉన్న వారికి సైతం పునర్జన్మను అందించాయి. నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణులను మోసుకెళ్లి పసికందులకు కొత్త జన్మనిచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ క్షణాన కాల్ చేసినా కుయ్కుయ్.. మంటూ శబ్దం చేస్తూ బతుకులను వెలిగించాయి. అలాంటి వాహనాలు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నాయి. కాల్ చే స్తే కనెక్ట్ కాని దుస్థితి, కనెక్ట్ అయినా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్న పరిస్థితులు దాపురించాయి. ఈ ‘కాల్’యాపన వెనుక కారణాలు సర్కారే చెప్పాలి. అరసవల్లి: దశాబ్దాలుగా ఆపద్బాంధవి అవతారమెత్తి కోట్లాది మందిని ఆదుకున్న 108 వాహనం ఇప్పుడు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం బాధితుల ప్రాణాలకు విషంగా మారుతోంది. ఒకప్పుడు ఎప్పు డో గానీ ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మాటిమాటికీ ఈ వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమయానికి ఎమర్జన్సీ సేవలు అందక గత ఏడాది జిల్లాలో రెండు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది నాలుగైదు ఘటనలు మెరుగైన వైద్యానికి విశాఖప ట్నం రిఫర్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న రణస్థలం జాతీయ రహదారిలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. 108 వాహన సేవలకు కాల్ చేస్తే అది తెలంగాణ రాష్ట్ర కాల్సెంటర్కు కనెక్ట్ అయ్యింది. దీంతో లోకేషన్ చెబుతున్నా తమ పరిధి కాదని చెప్పేశా రు. వారి వాదనల నడుమ ఆ క్షతగాత్రుడు 45 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ కుక్కకాటు బాధితుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కుప్పకూలిపోతే ఒకరు 108 వాహనం కోసం కాల్లో సంప్రదిస్తే ఏ మాత్రం కాల్ కనెక్ట్ కాలేదని తెలిసింది. ఆఖరుకు ఆస్పత్రికి వెళ్లాక అతడు మృతి చెందిన ఘటన సంచలనమైంది. నిర్వహణ తీరుపై విమర్శలు జిల్లాలో మొత్తం 30 మండలాలకు మొత్తం 33 ఎమర్జన్సీ 108 వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాహనాలు రన్నింగ్ స్థితిలో ఉన్నాయి. గతంలో నిర్వహణ బాధ్యతల కంటే తాజాగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భవ్య సర్వీసెస్ యాజమాన్య పరిధిలో నిర్వహణ చాలా అధ్వానంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కాల్ చేసిన క్షణాల్లో ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సహాయం అందేలా చర్యలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆపద వచ్చిందని కాల్ చేసినా పెద్దగా స్పందన లేదు సరికదా.. కొన్నిసార్లు ఏకంగా ఆ కాల్ తెలంగాణకు కనెక్ట్ చేస్తున్నారంటే నెట్వర్క్ నిర్వహణ తీరు ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిస్థితులు ఈ నిర్వహణ తీరుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో రెండు జాతీయ రహదారులున్న నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అందునా అర్థరాత్రి సమయంలోనూ. వేకువజామున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులు ప్రాణాప్రాయంలో ఉంటే అక్కడివారు 108 సర్వీస్ కాల్ చేస్తున్నా.. అంతసులువుగా కాల్ కనెక్ట్ కావడం లేదు సరికదా...ఇతర రాష్ట్ర నెట్వర్క్కు కనెక్ట్ అయ్యే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. మండలానికి ఒక్కో వాహనం ఉన్నప్పుడు కాల్ చేసిన 5 లేదా 10 నిమిషాల్లో ఘటనాస్థలానికి వాహనం చేరిపోవాల్సి ఉంది. జిల్లాలో ఆ పరిస్థితి నేడు లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం 108 వాహనాల ఎమర్జెన్సీ సేవల ప్రాధాన్యతను గుర్తించి నిర్వహణ తీరును మెరుగుపరుచుకుంటే కొందరి ప్రాణాలను కాపాడే పరిస్థితులుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ఆలస్యంగా వస్తున్న 108 వాహనాలు బాధితుల ప్రాణాలతో చెలగాటం కాల్ వెంటనే కలవదు.. కలిసినా కొన్నిసార్లు తెలంగాణకు కనెక్ట్ -
రవి అస్తమించని మైనింగ్ సామ్రాజ్యం
వీఆర్ గూడెం ఎర్ర కొండలో అక్రమ తవ్వకాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో కొండలు తరిగిపోతున్నాయి. అక్రమంగా కొండల్ని తవ్వేసి గ్రావెల్ దోపిడీ చేస్తున్నా రు. ప్రకృతి వనరులు విధ్వంసం చేసి, అడ్డంగా సంపాదిస్తున్నారు. కీలక నేత కనుసన్నల్లో పచ్చనేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడక్కడ క్రషర్లకు ఉన్న అనుమతులు చూపించి, ఏకంగా క్వారీలు నడుపుతున్నారు. రైల్వే లైన్లు, లేఅవుట్లకు, అపార్ట్మెంట్, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్కు విక్రయించి అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మై నింగ్ సామ్రాజ్యంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేక పోతున్నారు. అధికారులు సైతం అక్కడికెళ్లడానికి భయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను నియంత్రించాలంటే చెక్ పోస్టు పెట్టాలని మండల స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా దోపిడీ.. పొందూరు మండలంలో అధిక సంఖ్యలో కొండలు ఉన్నాయి. నల్ల రాయి, ఎర్ర రాయి, ఎర్ర గ్రావెల్ అధికంగా దొరుకుతుంది. ఈ మండలంలో రాపాకలోని సర్వే నంబర్ 335లో, కృష్ణాపురంలోని సర్వే నంబర్ 198లో మాత్రమే నల్ల రాళ్లను కొట్టుకోవడానికి అనుమతి ఉంది. అలాగే, వీఆర్ గూడెంలో క్రషర్కు అనుమతి ఉంది. మిగతా చోట్ల ఎక్కడా అనుమతుల్లేవు. కానీ రాపాకలో అనుమతి ఉన్న ప్రాంతంలోనే కాకుండా పక్కనున్న ఏరియాలో అక్రమంగా తవ్వేస్తున్నారు. కృష్ణాపురంలో కూడా అదే జరుగుతోంది. వీఆర్ గూడెంలోని సర్వే నంబర్ 137లోని ఎర్రకొండనైతే ఏకంగా గుల్ల చేసేస్తున్నా రు. వీటితో పాటు మరికొన్ని గ్రామాల్లోని కొండల్లో కూడా అక్రమ క్వారీ జరుగుతోంది. రైల్వే లైన్ కో సం, అపార్ట్మెంట్లు, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్ కోసం, లేఅవుట్లను చదును చేసేందుకు నల్లరాయి, ఎర్ర రాయి, గ్రావెల్ను విక్రయిస్తున్నారు. రోజూ వందలాది లారీలకు వక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్లు వేసే ముందు గ్రావెల్తో కప్పుతారు. దాని కోసం కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మొత్తానికి కీలక నేత అండతో రూ. కోట్లలో తమ్ముళ్లు ఆర్జిస్తున్నారు. కొండలను తవ్వి ఆక్రమణ మండలంలోని కొండలను తవ్వి, ఆ తర్వాత చదును చేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వందలాది ఎకరాలు ఈ రకంగా అక్రమార్కుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడా భూ ములను చూపించి క్వారీలు, క్రషర్ల ఏర్పాటు కో సం అనుమతులకు యత్నిస్తున్నారు. ప్రస్తుతానికై తే ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అనుమతులు రాకపోయినా తమ పని మాత్రం కానిచ్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. పొందూరు మండంలో ఎక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ పచ్చ గెద్దలు వాలిపోతున్నాయి. రూ. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాయి. చెక్ పోస్టుకు సిఫార్సు చేసినా.. పొందూరు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీని అడ్డుకోవాలంటే చెక్ పోస్టు శరణ్యమని ఇక్కడ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు గతంలో నివేదిక ఇచ్చారు. అక్రమ క్వారీలు, తవ్వకాలు, రవాణాను తాము నియంత్రించలేమని, పరిస్థితి చేయి దాటిపోయిందని, రహదారి మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కనీసం రవాణానైనా అడ్డుకుని తద్వారా అక్రమ తవ్వకాలు నిలువరించవచ్చని మండల అధికారులు తమ నివేదికలో వి వరించారు. కానీ ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయో తెలి యదు గానీ చెక్ పోస్టు ఏర్పాటు ఊసేలేదు. మండల అధికారులు ఇచ్చిన నివేదిక ముందుకెళ్లలేదు. చెప్పాలంటే తుంగలోకి తొక్కేసినట్టు స్పష్టమవుతోంది. విధ్వంసం జరుగుతున్నా.. అక్రమంగా నడుస్తున్న క్వారీల్లో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమి ది మంది వరకు మృత్యువాత పట్టారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అంతేకాకుండా అక్రమ క్వారీ ల సమాచారాన్ని బయటపెట్టాలని చూసిన కొందరు లారీల కింద సమాధి అయ్యారు. అంత దారుణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక, గ్రావెల్ రవాణా లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. క్వారీ తవ్వకాలతో గ్రామాలు కాలుష్యం బారిన ప డుతున్నాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునే నాథు డు లేకుండా పోయారు. దట్టమైన కొండలు కావడంతో అక్కడికి వెళ్తే మైనింగ్ మాఫియా చేతులో ఏమవుతామో అన్న భయం పట్టుకుంది. అధికారు లు సైతం అక్కడికి వెళ్లడానికి హడలెత్తిపోతున్నారు. అసలే నిర్మానుష్య ప్రదేశం, మరోవైపు కీలక నేత అండదండలు ఉండటంతో వెనక్కి తగ్గిపోతున్నారు. పొందూరు మండలంలో తరిగిపోతున్న కొండలు అడ్డగోలుగా తవ్వకాలు ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ తవ్విన ప్రాంతాన్ని చదును చేసి గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం -
గతంలోనూ ఇదే తీరు..
2015లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ యూనిట్గా 100 మంది విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు సమీపంలోని 2 నుంచి 3 పాఠశాలలను విలీనం చేస్తూ నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలకు ప్రత్యేక పద్దుల్లో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ తరగతికో ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయం, భాషా ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా పాఠశాలలు మూతపడటం మాత్రమే మిగిలింది. – దుప్పల శివరాంప్రసాద్, ఆపస్, జిల్లా అధ్యక్షుడు -
టమాటా రైతులకు పరిహారం అందించాలి
సోంపేట: మండలంలో గత నెల ఏడో తేదీన కురిసిన వర్షాలకు టమాట పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమాట రైతులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జింకిభద్రలో టమాటా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత నెలలో కురిసిన వర్షాలకు టమాటా రైతులు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వలల్ల టమాట పంట నీట మునిగి రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టగా.. వర్షాల వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. ప్రభుత్వాలు టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో 600 ఎకరాల్లో టమాట సాగు చేస్తే ఏప్రిల్ 7న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయిందన్నారు. నేటికీ పంటల బీమా గానీ, పంట పెట్టుబడి సహాయం గానీ అందలేదన్నారు. టమాట పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్చేశారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ చొరవ తీసుకోవాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టమాటా రైతులను ఆదుకోవాలని విన్నవించామని, అయినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, సల్ల దేవరాజు, గురాల శ్రీను, బతకల మోహనరావు, తామాడ పద్మావతి, పాతిన శేషగిరి, పిన్నింటి ఈశ్వరరావు, రౌతు విశ్వనాథం, కోట రాజు, కర్రి సత్యం, మేరుతు తిరుపతిరెడ్డి, అనంత, పోకల హేమరాజు తదితరులు పాల్గొన్నారు. -
దారి ఖర్చులు ఏవీ?
● విద్యార్థులను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వం ● రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం శ్రీకాకుళం: పాఠశాలల విలీనం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6–14 ఏళ్ల విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి రూ.6,000 రవాణా భత్యం అందిస్తామని పేర్కొంది. అయితే ఈ హామీ కాగితాలకే పరిమితమైంది. అమలు ఎక్కడ..? ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో లేకపోయినా, ఉన్నత ప్రాథమిక, హైస్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో లేకపోయినా రవాణా భత్యం ఇవ్వాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై గ్రామ సభలు నిర్వహించి, ప్రజల విశ్వాసం పొందుతూ పాఠశాలల విలీనానికి ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసింది. కానీ విద్యార్థులను దూర పాఠశాలలకు తరలించిన తర్వాత ఒక్క రూపాయి కూడా రవాణా ఖర్చులుగా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. విలీనం పేరిట విద్యా వ్యవస్థకు దెబ్బ.. పాఠశాలలను ‘తొమ్మిది రకాల విభజన’ పేరిట పునర్ వ్యవస్థీకరించి, తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను (3, 4, 5) ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో విలీనం చేయ డంవల్ల గ్రామీణవిద్యార్థులు రోజువారీగా ప్రయాణ భారాన్ని, ప్రకృతి అవరోధాలు భరించాల్సి వస్తోంది. రవాణా భత్యం అందకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సులో తరలిపోతున్నారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధమా? ఆర్టీఈ చట్టం (రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్) ప్రకారం విద్యార్థులకు సమీపంలో పాఠశాల లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ రెండింటిలో ఏదీ సరైన విధంగా అమలు చేయకుండా పాఠశాలల విలీనాన్ని ముందుకు తీసుకెళ్లడం చట్టబద్ధ బాధ్యతలపై నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. కాగితాలపై పాఠశాలలు విలీనం అయినట్లు చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనించాల్సిన అంశం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేక విద్యార్థులు విద్యకు దూరమవుతుండటం తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోంది. పాఠశాల ఉనికికే ప్రమాదం.. ఈ ఏడాది ఏప్రిల్–మేలో చేపట్టబోయే కొత్త విలీన ప్రక్రియతో జిల్లా స్థాయిలో వందలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమలు కాని హామీల నేపథ్యంలో, మరింత పెద్ద స్థాయిలో విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడే అవకాశముంది. -
నేటి నుంచి పీజీ సెట్
ఎచ్చెర్ల : రాష్ట్రంలో పలు యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8 నుంచి నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో వివిధ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ● ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి ఎం.కాం, ఎం.ఎ (ఎకనామిక్స్), ఎం.ఎ (రూరల్ డెవలప్మెంట్), ఎంఈడీ, ఎం.ఎల్.ఐ.సీ (లైబ్రరీ సైన్స్), ఎం.ఎ(సోషల్వర్క్), ఎం.ఎ (ఇంగ్లీష్), ఎం.ఎ (తెలుగు), ఎం.జె.ఎం.సి (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) కోర్సులకు వెబ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ● సైన్స్ కళాశాలకు సంబంధించి ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్సీ (మైక్రో బయాలజీ), ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (అనలైటికల్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (అప్లయిడ్ మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (ఫిజిక్స్)లకు ఏపీపీీజీసెట్–2026 ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.ఎపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. అధునాతన వసతులు.. పీజీ ప్రవేశాలు పొందినవారికి అంబేడ్కర్ వర్శిటీ పలు వసతులు కల్పిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు, కిచెన్లు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు, ప్రయోగశాలలు, యోగా హాళ్లు, హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. జీసీసీ కేఫ్, క్యాంటీన్, బ్యాంక్, వైఫై సదుపాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకు విద్యార్థులు అర్హులేనని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. -
రెడ్క్రాస్ ఔదార్యం
శ్రీకాకుళం కల్చరల్ : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఒండ్రుజోల గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక ప్రసాద్ (36) ఇటీవల కుక్కకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలోని సార్వత్రిక ఆసుపత్రిలో వైద్య సహాయం పొందుతూ మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కు బయలుదేరడానికి శ్రీకాకుళం బస్టాండ్కు వచ్చిన ప్రసాద్ ర్యాబిస్ వ్యాధి లక్షణాలతో కుప్పకూలి మృతిచెందాడు. ఒంటరిగా ఉన్న సహాయకుడికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీపంలో ఉన్నవారు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావుకు తెలియజేశారు. ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్ చిన్ని కృష్ణ, ఉమా శంకర్, రెడ్క్రాస్ ఎంసీ కమిటీ సభ్యుడు ఎం.కళ్యాణ్ చక్రవర్తికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. మేడ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబాడాం గ్రామానికి చెందిన కురిటి వినోద్కుమార్ (33) ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి పడి గురువారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 10 గంటల తర్వాత మేడపైకి వెళ్లాడు.. తెల్లారి చూసే సరికి కింద శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వినోద్కుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ మృతి పలాస: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటరమణ అనే రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవరు గురువారం రామకృష్ణా పురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తన పొలం వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు దాడుతుండగా కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవధాన్యాలతో నేల సారవంతం రణస్థలం: నవధాన్యాలు వేసి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. రావాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, ఇతర రైతులకు నేలను సారవంతం చేయడానికి ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నవధాన్యాలు కిట్స్ 1400 కిట్లు తయారు చేసి అవగాహన కల్పించారు. ప్రధాన పంట వేసే ముందు కిట్లో ఉన్న విత్తనాలు వేయడం వల్ల వేరు వ్యవస్థ నేలలోకి చేర్చుకుని రకరకాల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కకు కావాలసిన పోషకాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వస్తుందన్నారు. కిట్లు కావాల్సిన వారు రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో విజయభాస్కర్, ఎన్ఎఫ్ఏఐసి టి.శివకృష్ణ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నరసింహులు, వెంకటలక్ష్మి, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు కంబపు కృష్ణ, గంట్యాడ ఏసుబాబు, పెద్దింటి రాజేశ్వరి, కలివరపు శివశంకర్ పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి
హిరమండలం: కూటమి ప్రభుత్వానికి మొక్కజొన్న రైతుల ఉసురు తగులుతుందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం అక్కరాపల్లిలో అకాల వర్షాలకు పాడైన పంటలను, మొలకలు వచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు ఈ సందర్భంగా కన్నీరుమున్నీరయ్యారు. వరి తరువాత ఎక్కువగా మొక్కజొన్న వేసుకున్నామని.. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదన్నారు. అందుకే కల్లాల్లో ఉన్న మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసిపోయిన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఆమెతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ, నాయకులు చింతాడ సూర్యనారాయణ, లుకలాపు ప్రసాద్, ఎం.శంకరరావు, జి.సుధీర్, ఎల్.శ్రీనివాసరావు, సింహాచలం, జనార్దనరావు, శిమ్మ పాపయ్య, వంజరాపు చిరంజీవి, జ్యోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జెమ్స్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం
● దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు ● విలేకరులతో జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు వెల్లడిశ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్–హెచ్ ఆస్పత్రి వైద్య కళాశాల నుంచి ఇకపై అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందిస్తామని జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. తమ కళాశాలకు దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్గా గుర్తింపు రావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి జనరల్ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే సీసీఆర్ఎల్ఎస్పీ ప్రొవైడర్ కోర్సును జెమ్స్ హెచ్ ఆస్పత్రిలోనే నెలకొల్పినట్లు వివరించారు. ప్రధానంగా సర్జికల్ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, అధ్యాపక బృందం, నాణ్యత ప్రమాణాలు, శిక్షణా విధానాలపై జరిగిన సమీక్షలో జెమ్స్ ఆస్పత్రికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ మాట్లాడుతూ సర్జరీ విద్యా ప్రమాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ గుర్తింపు ఇచ్చిందన్నారు. సీసీఆర్ఎల్ఎస్సీ కోర్సు డైరెక్టర్ జీఐ సర్జన్ డాక్టర్ ఎం.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఈ కోర్సును మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్ర చికిత్స శిక్షణార్థులకు అనస్తీషీయా విభాగాలకు చెందిన నిపుణుల బృందం శిక్షణ అందిస్తోందన్నారు. ప్రాక్టికల్ శిక్షణ, వాస్తవ పరిస్థితుల ఆధారిత అధ్యయనం, క్లినికల్ నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించేలా కోర్సు అందిస్తున్నట్లు చెప్పారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జెమ్స్ హెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ లలిత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఎస్.బాబు, కె.బాబూరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందన్నారు. పని భారం పెంచుతోందన్నారు. ఓవర్ టైం సర్వీసులు రద్దు చేసి సింగల్ డ్యూటీలు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో సెలవు మంజూరు చేయడం లేదని, మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, టిక్కెట్ ఇచ్చే యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని, డిపోలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సీ్త్ర శక్తి కేసులపై న్యాయం చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో డిపో ఉద్యోగులు బి.ఆనందరావు, బి.శేషుబాబు, ఎ.ఈశ్వరరావు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో మహిళ మృతి వజ్రపుకొత్తూరు: కొండవూరుకు చెందిన యడ్ల ఆదెమ్మ(57) అనే మహిళ పాముకాటుకు గురై బుధవారం మృతి చెందింది. ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకున్న ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా ఇంటి ఆవరణలో నాగు పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదెమ్మ భర్త కొన్నేళ్లు క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుమారుల వద్ద నివాసం ఉంటోంది. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
మాట్లాడుతున్న జి.వి.రమణి నరసన్నపేట : టీడీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండాపోతోందని, అధికారం అండతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనికి నిదర్శనం నరసన్నపేటలో తాజాగా జరిగిన ఈ ఘటనే నిదర్శనమని వైఎస్సార్ సీపీ నరసన్నపేట నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జి.వి.రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆదిలక్ష్మి చెప్పారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం మహిళా విభాగం ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి పాలనలో ఒంటరి మహిళలు, వితంతువులు వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా పింఛన్లు ఇప్పిస్తామని అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు లైంగిక వేధింపులకు దిగడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనకు ఎన్నో జరుగుతున్నాయని, ఇది మాత్రమే వెలుగులోకి వచ్చిందన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. పింఛన్ ఇస్తానని చెప్పి వేధింపులకు గురి చేసిన జగన్నాథపురానికి చెందిన టీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయాన్ని ధైర్యంగా చెప్పిన మహిళకు అండగా నిలిచి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. భయపెట్టి గురువారం ఆమెతో మరో స్టేట్మెంట్ ఇప్పించారని విమర్శించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైఎస్సార్ సీపీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు సవర శైలజ, చింతు శ్రీదేవి, తర్ర మాధవి, కై బాడ వాణి తదితరులు పాల్గొన్నారు. -
రెమిడియల్ క్లాసులపై ఉత్తర్వులు ఇవ్వాలి
శ్రీకాకుళం : టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెమిడియల్ క్లాసులకు రావాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని, తక్షణం రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆన్లైన్ సమావేశాల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులను క్లాసులు రావాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. రెమిడీయల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. డీఈఓను కలిసిన వారిలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు బమ్మిడి శ్రీరామ్మూర్తి, కార్యదర్శి పి.ప్రతాప్కుమార్, ఎస్.కిషోర్కుమార్, చావలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు, పి.ఆనందరావు, పి.సూర్యప్రకాశరావు, వై.ఉమాశంకర్, జి.సురేష్,హెచ్ అన్నాజీరావు, బి.రవికుమార్, జి.శ్రీరామచంద్రమూర్తి, టి.ఉమాభాస్కర్, వి.శ్యామ్కుమార్, పి.అప్పారావు పాల్గొన్నారు. -
పక్క రాష్ట్రానికి పరుగు..!
● మనకంటే ఒడిశాలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ● అక్కడికే వెళ్తున్న సరిహద్దు గ్రామాల ప్రజలు ● వెలవెలబోతున్న స్థానిక బంకులు ధర తక్కువే.. ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పెట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్కు రూ.7లు తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను. ఇక్కడి ధర, నాణ్యతతో పోల్చితే ఆర్థికంగా మిగిలే ఉంటుంది. – బొంగు శ్రీరాములు, ఆర్.ఎల్.పురం, పాతపట్నం నాణ్యత బాగుంటుంది ఒడిశాలో పెట్రోల్ బంక్లను అక్కడి రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. కల్తీ లేని పెట్రోల్ విక్రయిస్తారని ఈ ప్రాంతంలో ప్రచారం ఉంది. ఆంధ్రా కంటే ఒడిశాలో తీసుకున్న పెట్రోల్ నాణ్యత బాగుంటుంది. వాహనాలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని మోకానిక్లు చెబుతున్నారు. అందుకే ఒడిశా వెళ్లి పెట్రోల్ వేయించుకుంటాం. ఎన్ని లీటర్ల పెట్రోల్ పోయిమన్నా పోస్తున్నారు. – గణపతి మధుబాబు, కాగువాడ, పాతపట్నం సమాధానం చెప్పాలి ఎన్నికల సమయంలో పెట్రోల్ ధరలపై చంద్రబాబు, లోకేష్లు హడావుడి చేశారు. ఇప్పుడు పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయో సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మన రాష్ట్రంలో కొరత లేకుండా చూడడంతో పాటు ధరల తగ్గించాలి. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం పాతపట్నం: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలపై గగ్గోలు పెట్టిన సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ మాటనే మరిచారు. యువగళం పాదయాత్ర సమయంలో పక్క రాష్ట్రాల్లో ధరలు తక్కువగా ఉన్నాయని, కేవలం మన రాష్ట్రంలోనే ఎక్కువని విమర్శించిన మంత్రి లోకేష్.. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ధరలపై కనీసం నోరు మెదపడం లేదు. నియోజకవర్గ కేంద్రమైన పాతపట్నం ఒడిశా రాష్ట్రానికి పక్కనే ఉంది. కొత్తూరు, మెళియాపుట్టి మండలాలు సైతం సరిహద్దులో ఉన్నాయి. అలాగే పది, పదిహేను కిలోమీటర్ల దూరంలోనే హిరమండలం ఉంది. అయితే ఒడిశా రాష్ట్రంలో మన రాష్ట్రం కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ధరలు లభిస్తుండడంతో ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు అక్కడికే వెళ్లి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. పెట్రోల్లో లీటర్కు రూ.7లు, డీజిల్లో లీటర్కు రూ.3లు ఆ రాష్ట్రానికి మనకు తేడా ఉండడం గమనార్హం. దీంతో ఇక్కడి వాహనదారులు నిత్యం పర్లాకిమిడి పట్టణంలోని పెట్రోల్ బంక్లను ఆశ్రయించి, వాహనంలోకి పెట్రోల్ నింపుకుంటున్నారు. ఒడిశా సరిహద్దులో ఉన్న పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి మండలాలకు చెందిన వేలాది మంది వినియోగదారులు అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసేందుకు నిత్యం ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పట్టణానికి వెళ్తుంటారు. దీంతో ఒడిశాలో తక్కువ ధరకు దొరుకుతున్న డీజిల్, పెట్రోల్కు గిరాకీ ఏర్పడుతోంది. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటారు. డీజిల్ కంటే పెట్రోల్ కోసం వెళ్లే వాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. అయితే పక్క రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా పెట్రోల్ రూ.109.96లు రూ.102.62లు రూ.7.34లు డీజిల్ రూ.97.73లు రూ.94.19లు రూ.3.54లు రోజుకు వినియోగం(లీటర్లులో..) మండలం పెట్రోల్ పెట్రోల్ డిజిల్ పాతపట్నం 2 3,000 3,800 మెళియాపుట్టి 2 2,500 1,800 కొత్తూరు 4 3,100 3,900 హిరమండలం 3 2,500 2,900 ఎల్.ఎన్.పేట 2 1,400 1,900 -
రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్రగాయాలు
కంచిలి: మండల కేంద్రం సోంపేట రైల్వేస్టేషన్లో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగులూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ సోంపేట రైల్వేస్టేషన్లో ఆగింది. ఒడిశా రాష్ట్రం అంకుల చండిపడ గ్రామానికి చెందిన ప్రభంజన్ నాయక్ అనే ప్రయాణికుడు సోంపేటలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వచ్చాడు. దిగేటప్పుడు తన బ్యాగు జారిపడి ఆగి ఉన్న రైలు పట్టాల కిందకు చేరింది. దీంతో ఆ బ్యాగ్ తియ్యబోయి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. -
యథేచ్ఛగా ఆక్రమణలు..!
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నరసన్నపేటలో ఆక్రమణలు హెచ్చుమీరుతున్నాయి. ప్రభుత్వ స్థలం, చెరువు గర్భం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. నేరుగా టీడీపీ కార్యకర్తలే ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే శివనగర్ కాలనీలో ఒక టీడీపీ నాయకుడు చెరువు గర్భంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. తాజాగా మరో టీడీపీ కార్యకర్త మెయిన్ రోడ్డుకు ఆనుకొని వంశధార కార్యాలయం ఎదురుగా ఉన్న పాలకర్ర(శర్మాల) చెరువును ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. గొట్టిపల్లి రెవెన్యూ పరిధి 178/2సీ సర్వే నంబర్లో పాలకర్ర చెరువు ఉంది. అటు జాతీయ రహదారి.. ఇటు పట్టణంలోని మెయిన్ రోడ్డుకు మధ్యన ఉన్న ఈ చెరువుపై ఇప్పుడు ఆక్రమణదారుల(టీడీపీ నాయకుల) కన్నుపడింది. టీడీపీ కార్యకర్త ఒకరు ఇందిరాగనర్లో ఒక ప్రైవేటు స్కూల్ ఎదురుగా ఉన్న కాలువ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు ఈ ఆక్రమణను తొలగించారు. దీంతో ఈ కార్యకర్త స్థానిక టీడీపీ నాయకులను పట్టుకొని ఎమ్మెల్యే ఆశ్రయాన్ని కోరగా.. ఆయన పాలకర్ర చెరువులో రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలంలో బడ్డీ పెట్టుకోమని సలహా ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆ కార్యకర్త రోడ్డుకు ఆనుకొని ఉన్న చెరువు స్థలంలో ఒక ఐదు సెంట్లు ఆక్రమించాలనే ఉద్దేశంతో ఇటీవల బడ్డీ పెట్టారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. – ఎంతో విలువైన స్థలం పాలకర్ర చెరువు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. దీనిలో కొంతభాగం జాతీయ రహదారిలో కలిసిపోయింది. మిగిలిన 5 ఎకరాలు రెండు రహదారులకు మధ్య ఉంది. ఇప్పటికే చెరువు గర్భాన్ని గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి ఆక్రమణలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మరికొందరికి ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఇక్కడ అడుగు స్థలం రూ.లక్ష పైనే ఉంది. ఈ కార్యకర్త కన్నేసిన స్థలం విలువ రూ.50 లక్షలు పైనే ఉంటుంది. దీంతో టీడీపీ నాయకుల కన్ను ఈ చెరువుపై పడింది. ఈ కార్యకర్తను అడ్డుపెట్టుకొని మిగిలిన రోడ్డు పక్కన ఉన్న మిగిలిన స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులు ఒక వైపు ముఖ్యమంత్రి పర్యటన పనుల్లో బిజీగా ఉండగా.. ఇదే అదునుగా భావిస్తున్న టీడీపీ కార్యకర్త బడ్డీ స్థలంలో పక్కాగా నిర్మాణాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రభుత్వ స్థలాలు, చెరువులను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఒక వైపు ప్రభుత్వం ఉపాధి నిధులతో చెరువులను లోతు చేస్తుంటే.. అధికార కూటమి నాయకులు, కార్యకర్తలు మాత్రం చెరువులను చెరబడుతున్నారు. అందువలన తగిన చర్యలు తీసుకొని వెంటనే పాలకర్ర చెరువు ఆక్రమణలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నరసన్నపేటలో పాలకర్ర చెరువు ఆక్రమణ చెరువు గర్భంలో బడ్డీ ఏర్పాటు పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాలల నుంచి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2026’ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక విభాగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన బాలలు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. 5 ఏళ్లు పైబడి, 31 జూలై 2026 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలలు వ్యక్తిగతంగా లేదా ఏదైనా సంస్థ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వివరించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పత్రికా క్లిప్పింగ్స్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేయడానికి జూలై 31 తేదీ వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతిభావంతులైన బాలలు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. కుక్కకాటుతో ఆటోడ్రైవర్ మృత్యువాత..? శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక ఆటో డ్రైవర్ బుధవారం మృత్యువాత పడ్డాడు. భామిని మండలం గొరండికి చెందిన నిమ్మల ప్రసాద్ (30) కొంతకాలం క్రితం కుక్కకాటు వేయడంతోనే అనారోగ్యం పాలయ్యాడని, అందుచేతనే చనిపోయివుంటాడని భావిస్తున్నట్లు మృతుని కుటుంబీకులు తెలిపారు. అయితే ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా తమ దృష్టికొచ్చిందని, ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు. -
తప్పు చేస్తూ.. తప్పించుకుంటూ..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అంబేడ్కర్ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి ఇన్విజలేషన్ సమయంలో జవాబుపత్రంలో సంతకం చేసినప్పుడు విద్యార్థి ని చేయిపట్టుకున్నారు. అప్పట్లో యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు కూడా వెళ్లింది. దీనిపై కమిటీ కూడా వేశారు. కానీ, ఆయనపై చర్యలు తీసుకోకుండా ఇకపై పునరావృతం కాకుండా ఉంటానని చెప్పి లెటర్ తీసుకుని వదిలేశారు. ● లా ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ కాంట్రాక్ట్గా పనిచేస్తున్న ఒకాయన విద్యార్థిని ఫోన్ నంబర్ సంపాదించి అసభ్యకర మెసెజ్లు పెట్టారు. విషయం తెలుసుకుని ఆ విద్యార్థిని భర్త నేరు గా వర్సిటీకి వచ్చి సదరు ఉద్యోగిని కొట్టారు. ఇంత జరిగినా ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోలేదు. రాజీ ధోరణితో వదిలేశారు. ● నాన్ టీచింగ్ స్టాఫ్ను ఎగ్జామినేషన్ సెక్షన్లో అటెండర్గా వేశారు. అక్కడ చేతివాటం ప్రదర్శించారు. పాస్ చేయిస్తానని చెప్పి యూనివర్సిటీకి చెందిన మాజీ ఉద్యోగి బంధువు నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ఈ వ్యవహారంపై ఏకంగా యూనివర్సిటీ అధికారులకు సదరు మాజీ ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో చేతివాటం ప్రదర్శించిన ఉద్యోగిని మందలించి వదిలేయడంతో పాటు నెలకు రూ.3వేలు చొప్పున ఆ విద్యార్థికి ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. ఇలా చెప్పుకుంటూపోతే అంబేడ్కర్ యూనివర్సిటీలో జరిగిన బాగోతాలు ఎన్నో.. ఓవైపు విద్యార్థినులపై వేధింపులు.. మరోవైపు పరీక్షలు పాస్ చేస్తామంటూ, మంచి మార్కులు వేయిస్తామంటూ అడ్డగోలు వసూళ్లు.. ఇక, విద్యార్థినులపై ర్యాగింగ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు అనేకం. వీటిన్నింటి విషయంలో యూనివర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించి రాజీలు, మందలింపులతో వదిలేస్తున్నారు. దీంతో ఎవరికీ భయం లేకుండా పోయింది. ఏం చేసినా రాజీ చేసేస్తారులే.. చర్యలేమీ ఉండవనే ధోరణికి చాలా మంది వచ్చేశారు. అలవాటుగా తప్పులు చేస్తున్నారు. తాజాగా ఓ విద్యార్థినితో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావు విషయంలోనూ అదే జరిగింది. అతగాడి తీరుపై ఒకసారి యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు వెళ్లింది. కానీ అటు విద్యార్థిని, ఇటు అసిస్టెంట్ ప్రొఫెసర్ మధ్య రాజీ కుదిర్చారు. కానీ, ఆ ఆధ్యాపకుడు మరింత బెదిరింపులకు దిగడంతో తప్పని పరిస్థితుల్లో ఫోన్ సంభాషణ ఆడియోను బయటకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. విభేదాలతో గుట్టురట్టు.. ఆ ఆడియో లీక్లు, యూనివర్సిటీలో జరుగుతు న్న వ్యవహారాలు బయటికొస్తున్నాయంటే అక్కడి అధ్యాపకులు, ఉద్యోగుల్లో కొందరి మధ్య ఉన్న విభేదాలే కారణం. చాలామందిపై వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఒకరినొకరు దెబ్బకొట్టుకోవడానికి అదును చూస్తున్నారు. ఎప్పుడైతే తనకు పడని వ్యక్తి అడ్డంగా దొరుకుతున్నాడో అవకాశం వదులుకోకుండా బాగోతాలను బయటపెడుతున్నారు. లేదంటే యూనివర్సిటీలో అన్నీ గుట్టుగానే కనుమరుగైపోయేవి. అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో కొనసాగుతున్న రాజీల పర్వం కళంకితులపై కానరాని చర్యలు విస్మయం కలిగిస్తున్న అధికారుల తీరు పునరావృతమవుతున్న ఘటనలుయూనివర్సిటీలో రాజీలేంటి? ప్రతిష్టాత్మకమైన అంబేడ్కర్ యూనివర్సిటీలో తప్పు చేసిన వారిని కాపాడేందుకు రాజీలు చేయడమేంటో అర్థం కావడం లేదు. తప్పు చేసిన వారిలో ఒకరిపై వేటు పడితే.. మరొకరు భయపడి తప్పు చేయడానికి వెనకాడుతారు. కానీ, ఇక్కడ తప్పు చేసిన వారిని వెనకేసుకొచ్చేలా రాజీలు చేయడం, మందలించి వదిలేయడం, బాధితులకు నష్టపరిహారం అందించడం వంటివి జరగడం విస్మయం కల్గిస్తోంది. పర్యవేక్షక అధికారులు చేయాల్సిన పని ఇదేనా? అన్న ఆరోపణలకు అవకాశం ఇస్తోంది. యూనివర్సిటీ ప్రతిష్టను మంటగలుపుతున్న కళంకితులను సస్పెండ్ చేయడమో.. ఏకంగా డిస్మిస్ చేయడమో జరిగితే.. భవిష్యత్లో విద్యార్థినుల జోలికై నా, అక్రమాలకు పాల్పడటానికై నా భయపడతారు. అటువంటిది లేకుండా ఉండటంతో ఇష్టారీతిన, అసభ్యకరంగా వ్యవహరిస్తూ అక్రమాలకు సైతం పాల్పడుతున్నారు. పాస్ చేయడానికి, మార్కులు వేయడానికి డబ్బులు అడుగుతున్నారంటే ఇక్కడ పరీక్షల తీరుపై కూడా అనుమానాలు నెలకొంటున్నాయి. కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేసినట్టే అవుతోంది. పరీక్షలు కూడా విశ్వసనీయత కోల్పోతాయి. -
స్మార్ట్మీటర్ల వినియోగదారుల్లో గందరగోళం
టెక్కలి: పట్టణంలో కొంతమంది స్మార్ట్ మీటర్ల వినియోగదారుల్లో గందరగోళం చోటుచేసుకుంది. కమర్షియల్ స్మార్ట్ మీటర్ల వినియోగదారులకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఏసీడీ చెల్లించాలని అధికారులు చెప్పారని, వాటిని చెల్లించే విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కేవలం అధికారులు సాంకేతికంగా చేసిన తప్పిదాలు వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై టెక్కలి ఏఈ వద్ద ప్రస్తావించగా.. ఏసీడీ పేరుతో కమర్షియల్ స్మార్ట్ మీటర్లకు ఎటువంటి సరఫరా ఆపలేదని చెప్పారు. కేవలం బిల్లులు చెల్లించకుండా డిఫాల్టర్గా ఉన్న వారికి ఆటోమేటిక్గా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. తమను సంప్రదిస్తే తక్షణమే పునరుద్ధరణ చేస్తామన్నారు. జనావాసాల్లోకి జింక హిరమండలం: కొండరాగోలు సమీపంలో కొండప్రాంతం నుంచి వచ్చిన జింకపిల్లను స్థానికులు రక్షించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జనావాసాల్లోకి రావడంతో కుక్కల గుంపు తరిమింది. వెంటనే స్థానికులు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ మధుసూదన్, సిబ్బంది చేరుకుని జింక పిల్లకు సపర్యలు చేసి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్ ఎచ్చెర్ల : బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావును సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రార్ బిడ్డిక అడ్డయ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సోషల్మీడియాలో ఆడియో హల్చల్ చేయడం, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణకు ప్రత్యేక కమిటీ నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోటీపరీక్షలకు ఉచిత శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ లోకో పైలట్, గ్రూప్–డి, ఏపీ హైకోర్టు – 2026 రిక్రూట్మెంట్ పరీక్షలకు జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణ, స్టైఫండ్, స్టడీ మెటీరియల్ అందజేయనన్నట్లు పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. టెన్త్, డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ నెల 25 నుంచి తరగతులు మొదలవుతాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20లోగా బీసీ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్, 80 ఫీట్ రోడ్డు, వాంబే కాలనీ, శ్రీకాకుళం కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 8332852106 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. డీవీఈఓగా కృష్ణవేణి శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారిగా సీనియర్ ప్రిన్సిపాల్ మొదలవలస కృష్ణవేణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డీవీఈఓగా పనిచేస్తున్న రేగ సురేష్కుమార్ అనారోగ్య కారణాలతో రెండు నెలలు సెలవులో ఉన్నారు. కృష్ణవేణి ఆర్ఐఓగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల సహకారంతో సప్లిమెంటరీ పరీక్షలను, స్పాట్ వాల్యుయేషన్ పూర్తిచేస్తామని తెలిపారు. ప్రవేశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: కూటమి ప్రభుత్వంలో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. గత ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముప్పుతిప్పలు పెట్టారని, రబీలో సైతం అదే పరిస్థితులు ఉన్నాయని దుయ్యబట్టారు. రబీ సీజన్లో మొక్కజొన్న పంటలతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేయలేదన్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. వ్యవసాయంపై కనీస అవగాహన లేని అచ్చెన్నాయుడు ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించడంతో రైతులకు కష్టాలు వెంటాడుతున్నాయన్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ముందస్తు ప్రణాళిక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సాగునీటి కాలువల మరమ్మతుల విషయంలో సమీక్షలు నిర్వహించకుండా, కేవలం వర్షాలు పడే సమయానికి తూతూమంత్రంగా పనులు చేసి కోట్లు దండుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత ఖరీఫ్లో రైతులు పడిన ఇబ్బందుల దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు ఎందుకు రూపకల్పన చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అసమర్ధత ప్రభుత్వానికి రైతులు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రైతుల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
పారా లీగల్ వాలంటీర్లు వారధిలా పనిచేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, వారికి న్యాయ సహాయం అందేలా చేయడంలో పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్వీ) వారధిలా పనిచేయాలని మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో మూడు రోజుల పాటు జరిగిన పీఎల్వీల అడ్వాన్సడ్ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా మోటారు వాహనాల చట్టం, విద్యా హక్కు, పోక్సో, పర్యావరణ సమస్యలతో పాటు కార్మికులు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితుల హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో న్యాయ సేవా సంస్థల ద్వారా బాధితులకు అందే సేవల గురించి వివరించారు. ఈ చట్టాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లను కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఎంవీఐ గంగాధర్, ప్యానల్ న్యాయవాది అన్నేపు భువనేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నారాయణి, విద్యా ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పనస కాయంత కష్టం..!
ఉద్దాన రైతుల జీవనాధారమైన పంటల్లో ఒకటైన పనస పంటకు ప్రస్తుతం ధర లేకపోవడంతో పంట రోడ్డు పాలవుతోంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ఎంతో ఆదరణ ఉన్న ఈ పంట సీజన్ ప్రారంభంలో కేజీ ధర అత్యధికంగా రూ.25లు పలికింది. తర్వాత కాయ సైజు ఆధారంగా కేజీ రూ.15ల నుంచి రూ.16లకు వ్యాపారులు కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. అయితే ప్రస్తుతం పసన కాయలకు గిరాకీ పూర్తిగా తగ్గడంతో పాటు వర్షాలు కురవడంతో కాయ నాణ్యత తగ్గిందని వ్యాపారులు కొనని పరిస్థితి నెలకొంది. దీంతో చెట్టు మీద కాయలను తొలగించిన రైతులు, వాటిని అమ్మలేక పలు ప్రాంతాల్లో రోడ్డుపైనే పడేస్తున్నారు. బెండి గేటు, బెండి, సీతాపురం, పెద్దబొడ్డపాడు, కొండవూరు గ్రామాల రోడ్లపై కాయలు పడివేయడంతో ఆయా గ్రామాల ప్రజలు కాయలను మోసుకెళ్తున్నారు. ఈ ఏడాది పనస ధర దారుణంగా పతనం కావడంతో నష్టపోయామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. – వజ్రపుకొత్తూరు రూరల్ -
పిచ్చికుక్క స్వైరవిహారం
● దాడిలో పలువురికి గాయాలు హిరమండలం: స్థానిక అంగురు వీధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలపై దాడిచేసి నలుగురిని గాయపరచింది. దీంతో వారిని హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడి చేసింది. గత నెలలలో కూడా పది మందిపై దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను కొట్టి చంపేశారు. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని సీతాపురంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్కు స్వైర విహారం చేస్తూ పలువురు మహిళలపై దాడి చేసింది. ఈ దాడిలో కె.ప్రశాంతి, టి.సీతమ్మ, టి.తులసమ్మ, టి.పద్మ, బి.శ్యామలకు గాయాలయ్యాయి. అలాగే నువ్వలరేవుకు చెందిన మహిళ చేపలు అమ్ముతుండగా ఒక్కసారిగా దాడి చేయగా ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. కాగా పిచ్చికుక్క నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం చేతికర్రలు పట్టుకొని గ్రామంలో తిరుగుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం మెళియాపుట్టి: మండలంలోని బురద రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే రహదారికి ఆనుకుని ఒక వృద్ధుడి మృతదేహాన్ని కొంతమంది పాదచారులు బుధవారం ఉదయం గుర్తించారు. వారిద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని, ప్రమాదానికి కారణమైన వ్యక్తుల చెప్పులు, ఇతర వస్తువులు సంఘటనా స్థలంలో లభ్యమయ్యాయన్నారు. వృద్ధుడి వివరాలు తెలియడం లేదన్నారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధాశ్రమానికి మతిస్థిమితం లేని యువకుడు కవిటి: మండలంలోని కుసుంపురం పంచాయతీ జుత్తుపుట్టుగలో గత కొన్ని రోజులుగా చిరునామా తెలియని ఒక మతిస్థిమితం లేని యువకుడు సంచరిస్తున్నాడు. గ్రామంలో ఆలయ నిర్మాణ వేళలో అక్కడ సంచరించాడు. దీంతో ఉదారమైన మనసుతో గ్రామస్తులు అతడికి ఆహారం, తాగునీరు అందించి ఆదరించారు. తాజాగా అతడి మానసిక స్థితిని గుర్తించి నర్తు సారధి తదితర గ్రామ పెద్దలు మానవతా దృక్పథంతో స్పందించి, మతిస్థిమితం లేని వ్యక్తిని తలతంపర సమీపంలోని వృద్ధాశ్రమం(సీతయ్య ఫౌండేషన్) నిర్వాహకులతో మాట్లాడి వారికి బుధవారం అప్పగించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఎచ్చెర్ల: మండలంలోని కుశాలపురం గ్రామం బైపాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న బ్యాటరీల వ్యాను బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ౖను ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాను నుజ్జనుజ్జయ్యింది. వ్యానులో ఉన్న డ్రైవర్, క్లీనర్తో పాటు ఒక బాలిక చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యాన్ బీహార్ నుంచి రాజమండ్రికి బ్యాటరీలతో వెళ్తోంది. ఎచ్చెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్ను నియంత్రించారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్ట్ దుకాణాల నిర్వాహకులపై బైండోవర్
పాతపట్నం: మద్యం బెల్టు దుకాణాల నిర్వాహకులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పాతపట్నం ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం పాతపట్నం మండలంలోని పాతపట్నం, ప్రహరాజపాలెం, దోమదల, జగ్గిలిబొంతు గ్రామాలకు చెందిన ఐదుగురు బెల్టుషాపు నిర్వాహకులను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావుతో బైండోవర్ నమోదు చేశారు. ప్రజారోగ్యానికి హానిచేసే నాటుసారా అమ్మకాలు చేయడం గానీ, బెల్టు దుకాణాలను నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఏడాది పాటు బైండోవర్ ఉంటున్న నేపథ్యంలో మరలా బెల్టు షాపులు నిర్వహంచినా, నాటుసారా అమ్మకం చేస్తున్నట్లు తెలిసినా రూ.2 లక్షలు జరిమానా వేస్తామని సీఐ కృష్ణారావు హెచ్చరించారు. ఎకై ్సస్ కానిస్టేబుల్స్ శివకుమార్, కల్పన పాల్గొన్నారు. -
ఉరుకులు.. పరుగులు
నరసన్నపేట: ప్రముఖ వ్యాపార కేంద్రం నరసన్నపేటలో ఎక్కడ చూసినా అధికారులే కనిపిస్తున్నారు. జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులు పేటలోనే మకాం వేశారు. 20 మంది ఎంపీడీఓలు, 20 మంది డిప్యూటీ ఎంపీడీఓలు, 50 మంది పంచాయతీ కార్యదర్శులు, 10 మంది తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు, పంచాయతీ విభాగం అధికారులు, సిబ్బందిని వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. పంచాయతీలో ఉన్న 20 వార్డులకూ అధికారులను ఇన్చార్జిలుగా నియమించారు. వీరికి సహాయకులుగా ఇద్దరేసి పంచాయతీ కార్యదర్శులను వేశారు. ప్రతివార్డులో 20 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. జిల్లా కేంద్రం తర్వాత నరసన్నపేట పెద్ద పట్టణమని, దీనిని స్వచ్ఛ నరసన్నపేటగా మార్చాలనేదే తమ ఉద్దేశమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఉదయానికే నరసన్నపేట చేరుకున్న కలెక్టర్ సత్యవరం కూడలి వద్ద చేపడుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పనుల సంగతి పక్కన పెడితే అధికారులు మాత్రం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని అప్పగిస్తుండటంతో దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
దరఖాస్తు నీ ఇష్టం.. బదిలీ తథ్యం!
● కేజీబీవీల్లో వింతపోకడ.. బలవంతపు బదిలీలకు శ్రీకారం ● రెండు రోజుల సమయం ఇస్తూ ఉద్యోగులకు వాట్సాప్ మెసేజ్లు ● ఆదేశాలు పాటించకపోతే రెన్యువల్ చేయబోమని బెదిరింపులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) బదిలీల ప్రక్రియ ఇష్టారాజ్యంగా మారిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా, కనీసం లిఖితపూర్వక ఉత్తర్వులు విడుదల చేయకుండా బలవంతపు బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వారు విమర్శిస్తున్నారు. వీరు తెలిపిన సమాచారం ప్రకారం బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని ఒకటి నుంచి రెండు రోజులు సమయం ఇస్తూ వాట్సాప్లో ఉద్యోగులకు వాట్సాప్ మెసే్స్జ్లు అందాయి. ఒకవేళ దరఖాస్తులు పెట్టుకోకపోయినా.. దూర ప్రాంతాలకు బదిలీ తప్పదని మెసేజ్ల సారాంశం. పైగా ఇలాంటి వారికి రెన్యువల్ కూడా ఉండదని హెచ్చరికలు జారీ అయ్యాయి. సమగ్ర శిక్షా అభియాన్లో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హైకోర్టు చీవాట్ల నుంచి తప్పించుకోడానికే..! కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు కావడం లేదు. కనీసం హెచ్ఆర్ఏ లేదు. అలవెన్సులతో కూడిన వేతనాలు లేవు. ఈ డిమాండ్లతో పాటు తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేసి బదిలీలు చేయాలని కేజీబీవీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లు పట్టించుకోకుండా కొన్ని జిల్లాల్లో బదిలీలు చేస్తుండటంతో స్టేట్ ప్రాజెక్టు ఆఫీస్ డైరెక్టర్పై పలు జిల్లాలకు చెందిన ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టులో సమాధానం చెప్పుకోవడానికి అధికారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుంచి బలవంతంగా దరఖాస్తులు తీసుకుని.. వారి ఇష్టపూర్వకంగానే బదిలీ చేశామని కోర్టులో చెప్పుకోవడానికి పన్నిన కుట్రలో భాగమే ఇదంతా అని ఉద్యోగులు భావిస్తున్నారు. అధికారులు తీరు సరికాదు బెదిరింపులతో నిర్బంధ బదిలీలు చేస్తున్న సమగ్ర శిక్షా అధికారుల తీరు దారుణం. బదిలీకి దరఖాస్తు చేయకపోతే రెన్యువల్ చేయ బోమని బెదిరిస్తున్నారు. ఇప్పటికై నా హైకోర్టు తీర్పును అమలు చేస్తూ, జీవో నంబర్ 24, 40,5, 2 ప్రకారం మినిమం టైమ్ స్కేల్, హెచ్ఆర్ఏ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా బదిలీలు చేయాలి. – కె.రత్నమాలిని దేవి, కేజీబీవీ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షురాలు, ప్రకాశం జిల్లా -
ముగిసిన ఈశ్వరాంబ వారోత్సవాలు
శ్రీకాకుళం కల్చరల్: భగవాన్ సత్యసాయి బాబా మాతృమూర్తి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా బాలవికాస్ పిల్లలు, గురువులతో జిల్లాలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలు బుధవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ఆధ్వర్యంలో పీఎన్ కాలనీలోని సత్యసాయి భజన మందిరం ఆధ్వర్యంలో బాలవికాస్ చిన్నారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పూర్తి చేసినట్లు తెలియజేశారు. సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, టెక్కలి, నరసన్నపేట, ఆమదాలవలస, గార, శ్రీకాకుళం మొత్తం తొమ్మిది జోన్లలో బాలవికాస్ చిన్నారులతో వివిధ సేవా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కార్యక్రమాల్లో జిల్లా పదాధికారులు పప్పల నాగేశ్వరరావు, బోయిన నరసింహమూర్తి, శశికాంత్, లాడి చంద్రశేఖర్, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నువ్వంటే నాకిష్టం.. మా ఇంటికి వస్తావా..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘ఎనిమిది సెమిస్టర్లు ఉంటావ్.. నీతో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. నువ్వు మా ఇంటికి వస్తావా.. గోడలకు చెవులు ఉంటాయి.. ఇంటికి వస్తే పూర్తిగా మాట్లాడుతా.. నీతో పరీక్షలు బాగా రాయించాలని.. రూమ్కి ఇన్విజలేటర్గా వచ్చా... నేను నీకు చూపించినా రాయచ్చు కదా.. రాసుకునేలా అవకాశం ఇచ్చా.. ఆ మాత్రం సైకాలజీ కూడా తెలియపోతే ఎలాగే.. నువ్వు వేస్ట్ చేశావ్. నువ్వంటే ఇష్టం.. ఐ వాంట్ యూ. రేపు శ్రీకాకుళం వస్తావా. రేపు ఎన్ని గంటలకు బయల్దేరుతున్నావు. ఆర్టీసీ కాంప్లెక్స్లో రిసీవ్ చేసుకుంటా. నీఫోన్ కోసం వెయిట్ చేస్తా.. నువ్వంటే నాకిష్టం.. నువ్వు వస్తే చెప్తాను. మనమిద్దరం కలిసి ట్రావెల్ చేద్దామని. శ్రీకాకుళం వచ్చాక ఇంటికి తీసుకెళ్తా. అక్కడ ఫేస్ టూ ఫేస్ చెబుతా. జర్నీలో ట్రావెల్ను బట్టి ఇలా ఉండాలి. అలా ఉండాలి అని చెప్పగలను. అది ప్రపోర్షనల్గా కావచ్చు. పర్సనల్గా కావచ్చు. ఏదైనా కావచ్చు. నన్ను సార్ అని పిలవకే...అండి అని పిలు...’ పాఠాలు చెప్పాల్సిన ఓ అధ్యాపకుడు తన స్టూడెంట్తో జరిపిన సంభాషణ ఇది. అంబేడ్కర్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థినికి ఎదురైన చేదు అనుభవమిది.ఎచ్చెర్లలోని బీఆర్ఏయూ ప్రతిష్ట మంటగలిసిపోతోంది. కొందరు అధ్యాపకుల తీరు వల్ల మొత్తం వర్సిటీకే చెడ్డ పేరు వస్తోంది. తల్లిదండ్రుల స్థానంలో ఉండి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొందరు ఆ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. విద్యార్థినులను వేధిస్తూ, ప్రలోభ పెడుతూ, బెదిరింపులకు సైతం దిగుతున్నారు. తాజాగా అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు అక్కడ చదువుతున్న ఓ విద్యార్థినితో జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వెలుగు చూసింది. ఈ వర్సిటీలో గతంలోనూ లైబ్రరీ సైన్సులో, లా విభాగంలో, గణిత, తెలుగు విభాగాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.ప్రలోభాలు.. ఆపై వేధింపులుఅంబేడ్కర్ యూనివర్సిటీలోని కొన్ని విభాగాల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉత్తీర్ణత అయ్యేలా చూస్తామని ప్రలోభాలకు గురి చేసి, లోబర్చుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధించే రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా మాట్లాడిన ఆడియో లీకైంది. ఈ విషయాన్ని వర్సిటీ పెద్దలు రాజీ చేశారు. అయినా ఆ అధ్యాపకుడి తీరు మారలేదు. తప్పని పరిస్థితుల్లో ఆ విద్యార్థిని విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ తల్లిదండ్రులు వర్సిటీ వర్గాలకు తెలిసిన వారి ద్వారా తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది.గతంలోనూ..వర్సిటీలో తెలుగు, గణితం, న్యాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ తరహా ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉత్తీర్ణత కోసం, మార్కుల కోసం ట్రాప్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటివి జరిగాయన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి ఆడియో రికార్డులు గతంలో కూడా వచ్చినప్పటికీ బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారనే వాదనలు ఉన్నాయి. వర్సిటీలో అధ్యాపకుల మధ్య విభేదాలు ఉండడం వల్ల ఇవి బయటకు వచ్చాయని లేదంటే ఈ ఆడియో క్లిప్ కూడా బయటకు రాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆ అధ్యాపకుడితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి పక్కన మరికొందరు ఉన్నట్టు, వారిచ్చే సూచనతో సంభాషణ జరిపినట్టు ఆ ఆడియోలో రికార్డు కావడం గమనార్హం. ఆ అధ్యాపకుడు తాను మాట్లాడింది కొంత అయితే మిగతాది కలిపారని ఆరోపిస్తున్నారు.వర్సిటీలో తెలుగు, ఆంగ్లం, ఎంసీఈ, గణితం, లా విద్యార్థినులు ఇలాంటి వేధింపులకు ఎప్పటికప్పుడు గురవుతున్నారు. రెండు నెలల క్రితం ట్రిపుల్ ఐటీలో వేధింపులపై అమ్మాయిలు చేసిన ఫిర్యాదుకు ప్రత్యేక కమిటీలను వేసి వేధించిన వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఇలాంటి కమిటీలను వేసి వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. ఫోన్ సంభాషణ చేసిన అధ్యాపకుడిది శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామం. ప్రస్తుతం బలగ వద్ద ఉంటున్నాడు. ఓ ఆల యం ట్రస్టు మెంబర్గా కూడా కొనసాగుతున్నాడు.మాట తెచ్చిన చేటు.. బోధకుడిపై సస్పెన్షన్ వేటుసాక్షి కథనంతో కదిలిన అధికారులువిద్యార్థినితో జరిపిన అసభ్యకర ఫోన్సంభాషణపై ప్రత్యేక కమిటీ విచారణకళంకిత అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెన్షన్సస్పెన్షన్ చర్యలను ధ్రువీకరించడానికి వెనకడుగుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అంబేడ్కర్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినితో ఫోన్లో అసభ్యకరంగా సంభాషణ చేసిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మజ్జి రామారావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన బాగోతంపై విచారణ జరపాలని కూడా యూనివర్సిటీ నిర్ణయం తీసుకుంది. ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై యూనివర్సిటీ అధికారులు స్పందించారు. ‘ప్రలోభాలు...బెదిరింపులు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో అధికారులు కదిలారు. ఇంజినీరింగ్ కళాశాలలో కమ్యూనికేషన్ ఇంగ్లిష్ (సాఫ్ట్ స్కిల్స్) బోధిస్తున్న మజ్జి రామారావు అనే అసిస్టెంట్ కాంట్రాక్ట్ ప్రొఫెసర్ను సస్పెండ్ చేశారు. ఫోన్ సంభాషణ బయటకు రావడంతో పాటు పత్రికల్లో ప్రచురితం కావడంతో వీసీ కె.ఆర్ రజని ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ బి.అడ్డయ్యతో పాటు ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నవాహిణి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధలతో కూడిన కమిటీ ప్రత్యేక సమావేశమై సస్పెండ్ చేయాలని వీసీకి రిపోర్టు అందజేశారు. దీంతో వీసీ ఆయనను సస్పెండ్ చేయడంతో విచారణకు ఆదేశించినట్టు ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపిచారు. ఈ చర్యలతోనైనా అంబేడ్కర్ యూనివర్సిటీలో విద్యార్థినులపై వేధింపులు ఆగుతాయేమో చూడాలి.అంతా గుట్టుగానే..అసిస్టెంట్ ప్రొఫెసర్పై చర్యలు తీసుకున్న విషయాన్ని యూనివర్సిటీ అధికారులు గుట్టుగా ఉంచారు. సోషల్ మీడియా వేదికగా ఆడియో సంభాషణ హల్చల్ చేసి, యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించిన విషయంపై తీసుకున్న చర్యలను బయటకు వెల్లడించకుండా మౌనంగా వ్యవహరించారు. యూనివర్సిటీ అధికారులకు ఫోన్ చేసినా స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవంగా తాజాగా ఘటనలో బాధ్యులైన విద్యార్థిని ఈ వ్యవహారాన్ని గతంలోనే అధికారుల దృష్టికి వచ్చింది. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారే తప్ప చర్యలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. అధ్యాపకుడిపై ఉన్న మమకారం ఏంటో తెలియదు గానీ అప్పట్లో తేలికగా తీసుకున్నారు. ఆ రోజే చర్యలు తీసుకుని ఉంటే యూనివర్సిటీ ప్రతిష్ట మంట గలిసేది కాదు. ఏం జరిగినా గుట్టుగా ఉంచడం ఇక్కడ పరిపాటిగా మారింది. -
పాలిసెట్లో 91.96 శాతం ఉత్తీర్ణత
● సత్తా చాటిన సిక్కోలు విద్యా కుసుమాలు ● ఈసారీ బాలికలదే పైచేయి శ్రీకాకుళం న్యూకాలనీ: పాలిసెట్–2026 ఫలితాల్లో శ్రీకాకుళం విద్యార్థులు సత్తాచాటారు. వివిధ పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల పొందేందుకు నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 91.96 శాతం ఉత్తీర్ణత సాధించి క్వాలిఫై అయ్యారు. పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీన జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. 11218 మందికి.. 10316 క్వాలిఫై.. జిల్లా నుంచి పాలిసెట్–2026కు 11218 మంది విద్యార్థులు హాజరుకాగా.. 91.96 శాతం ఉత్తీర్ణతతో 10,316 మంది క్వాలిఫై అయ్యారు. 6205 మంది బాలురు పరీక్ష రాయగా.. 90.48 శాతం ఉత్తీర్ణతతో 5614 మంది పాసయ్యారు. అలాగే 5013 మంది బాలికలు పరీక్షకు హాజరుకాగా.. 93.80 శాతం ఉత్తీర్ణతతో 4702 మంది క్వాలిఫై అయ్యారు. ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలురు కంటే.. బాలికలే (3.32 శాతం ఎక్కువ)మెరుగైన ఉత్తీర్ణతను సాధించారు 26వ ర్యాంకు జలుమూరు: చల్లవానిపేట పంచాయతీ పంగపేటకు చెందిన చిన్నాల లోహిత్ పాలిసెట్లో 120 మార్కులకు గాను 119తో రాష్ట్ర స్థాయిలో 26వ ర్యాంక్ సాధించాడు. తల్లి కృష్ణకుమారి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా తండ్రి కన్నయ్య వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఈ విద్యార్థి తూర్పుగోదావరి జిల్లాలో టెన్త్ చదివాడు. 69వ ర్యాంకుతో.. నరసన్నపేట: దూకులపాడు, రెడ్డికిపేటలకు చెందిన విద్యార్థులు పాలిసెట్లో ప్రతిభ చూపారు. దూకులపాడుకు చెందిన ముద్దాడ పవన్ కుమార్ రాష్ట్ర స్థాయిలో 69 వ ర్యాంకును పొందారు. తల్లిదండ్రులు కృష్ణారావు, దమయంతి ఆనందం వ్యక్తం చేశారు. రెడ్డికిపేటకు చెందిన కురిమిన ఢిల్లీశ్వరి 102 వ ర్యాంకును సాధించింది. దీంతో తల్లిదండ్రులు రామకృష్ణ, ఉషారాణిలు ఆనందం వ్యక్తం చేశారు. టెన్త్లో వీరిద్దరూ 584 మార్కులు పొందిన విషయం తెలిసిందే. తూలుగు జోత్స్న 118 మార్కులతో 136వ ర్యాంకు సాధించి మెరిసింది. -
కొనలేం..తినలేం!
● భగ్గుమంటున్న కూరగాయల ధరలు ● బెంబేలెత్తుతున్న సామాన్యులు ● ఉల్లిపాయలు మినహా అన్నీ రూ.60 పైమాటే! ధరలు చూస్తే దడ.. మార్కెట్లో ధరలు చూస్తే సామాన్యులకు దడపుడుతోంది. కూరగాయలు, నూనె ధరలు పెరిగిపోయాయి. నిత్యావసరాల ధరలు ఇలా ఉంటే పేద, మధ్య తరగతి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం స్పందించి ధరలను నియంత్రించాలి. – గులువిందల లలిత, తంప గ్రామం జేబుకు చిల్లు.. ఇప్పటికే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. తాజాగా కూరగాయల ధరలు కూడా పెరగడం భారంగా మారింది. డీజిల్ కొరత పేరిట సరుకుల రవాణా తగ్గి ప్రజల జేబులకు చిల్లు పడుతోంది. ధరలు అదుపుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – నక్క ఆనందరావు, పాత హిరమండలం హిరమండలం : మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వారం పదిరోజులుగా ధరలు అమాంతం పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయలు, బంగాళదుంపలు తప్ప మిగతా కూరగాయలు కిలో రూ.50 నుంచి రూ.70 పైమాటే. బీన్స్, మిర్చి, ముల్లంగి, క్యారెట్, చిక్కుడుకాయల ధరలు పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలకు షాక్కు గురి చేస్తున్నాయి. ధరలు అదుపుచేసి పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రమైన ఎండలు కారణంగా స్థానికంగా దిగుబడులు లేకపోవడంతో పాటు డీజిల్ కొరత కూరగాయల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. నిన్నమొన్నటి దాకా ధరలు లేక కుదేలైన టమాట ఒక్కసారిగా కిలో రూ.50కు పెరిగింది. మరోవైపు బీన్స్ కిలో రూ.150 ధర పలుకుతోంది. కాగా కొత్తిమీర కట్ట రూ.20 ధర పలుకుతుండటంతో నాన్వెజ్ వంటకాల్లో రుచి తగ్గుతోంది. మిగతా ఆకుకూరలు కూడా కట్టకు రూ.5 చొప్పున పెంచేశారు. మార్కెట్లో ధరలు ఇలా.. కూరగాయలు ధరలు బీన్స్ రూ.150 చిక్కుడు రూ.70 బీరకాయ రూ.80 క్యారెట్ రూ.60 ముల్లంగి రూ.60 పచ్చిమిర్చి రూ.60 కాకరకాయ రూ.60 టమాట రూ.50 వంకాయలు రూ.60 క్యాప్సికమ్ రూ.60 దోసకాయ రూ.40 గోబి రూ.40 క్యాబేజీ రూ.50 నిమ్మకాయలు రూ170 -
గ్యాస్ కనెక్షనా.. ఇప్పట్లో ఇవ్వలేం!
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో ఎల్పీ గ్యాస్ కనెక్షన్ల జారీ ఆగిపోయింది. ప్రస్తుతం సింగిల్ సిలిండర్తో పాటు రెండోది కావాలన్నా ఇవ్వడం లేదు. కొత్త కనెక్షన్లకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, డబుల్ సిలిండర్ల మంజూరును తాత్కాలికంగా నిలిపేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల ద్వారా జిల్లాలో గృహ, వాణిజ్య అవసరాలకు సిలిండర్ల సరఫరా జరుగుతుంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో కొత్త కనెక్షన్ల మంజూరు విషయంలో ఆయిల్ కంపెనీలు ఆంక్షలు విధించాయి. బుకింగ్ విధానాల్లో మార్పు ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో డబుల్ సిలిండర్ ఉంటే 30 రోజులు, సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజులకు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. తాజాగా డబుల్ సిలిండర్ బుక్ చేసుకునేందుకు 35 రోజులకు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సింగిల్ సిలిండర్ ఉన్నవారికి గ్యాస్ బుకింగ్కు 25 రోజుల గడువు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల వారీగా 40 రోజులకు ఓసారి మాత్రమే బుక్ చేసుకోవాలి. గ్యాస్ సమస్య తలెత్తడంతో రోజూ పెద్ద సంఖ్యలో వినియోగదారు లు కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయాలకు వస్తున్నా రని గ్యాస్ సరఫరా ఏజెన్సీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
లేఅవుట్కు అనుమతుల్లేవు
అవి నిషేధిత భూములే. అక్కడ లేఅవుట్కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఈ భూము లకు సంబంధించిన అంశం కోర్టులో ఉంది. కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. నాట్ టేకింగ్ ఓవర్ భూముల జాబితాలో ఈ భూములు ఉన్నాయి. ఇవే కాకుండా సుమారు 200 ఎకరాల వరకు ఇలాంటి భూములు ఉన్నాయి. కోర్టు ఆదేశాల వస్తే తప్ప ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. – ఎస్.రాంబాబు, తహసీల్దార్, ఆమదాలవలస బావాజీ మఠం భూముల్లో వేసిన అక్రమ లేఅవుట్ మఠం భూములపై ఎమ్మెల్యే కన్ను బావాజీ మఠం భూములపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కన్ను పడింది. ఆయన అనుచరులే బినామీలగా అవతారమెత్తి అక్రమ లేఅవుట్ వేశారు. స్థలాల విక్రయాలు చేపడుతున్నారు. అంతేకాకండా అక్రమ లేఅవుట్కు ఎమ్మెల్యే ఆదేశాలతో రూ. కోటి 45లక్షల ఉపాధి నిధులతో రోడ్లు, కాలువలు వేశారు. వీటిని అధికారులు అడ్డుకోవాలి. కలెక్టర్కు ఇప్పటికే ఫిర్యాదు చేశాం. – చింతాడ రవికుమార్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఆమదాలవలస సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే శిక్షిస్తామని అధికారులు చెప్పాలి. అవి నిషేధిత జాబితాలో ఉంటే ఆక్రమణలను అడ్డుకోవాలి. అక్రమ లేఅవుట్లు వేస్తే వాటిని వెంటనే తొలగించాలి. కానీ ఇక్కడ విచిత్రంగా అక్రమ లేవుట్లకు పాలకులు, అధికారులే సహకరిస్తున్నారు. ఉపాధి హామీ నిధులతో రోడ్లేసి ఆక్రమణదారులకు వంతపాడుతున్నారు. అడిగితే ప్రజల కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఫార్సు మేరకు రోడ్లు వేశామని చెబుతున్నారు. మఠం భూముల్లో అక్రమ లేఅవుట్.. ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలో బావాజీ మఠం భూము లు ఉన్నాయి. సర్వే నంబర్ 121లో దాదాపు 400 ఏళ్ల చరిత్ర గల 199 ఎకరాల భూముల్ని సదావత్తుకు (అన్నదానం కోసం) అప్పట్లో కేటాయించా రు. వీటిని భద్రంగా కాపాడాల్సిన అఽధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో మఠం భూములు ఆక్రమణల పాలవుతున్నాయి. పచ్చ నాయకులు కొందరు ముఠాలుగా ఏర్పడి అఽధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆక్రమించుకుంటూపోతున్నారు. ఇప్పటికే 90 ఎకరాల వరకు ఆక్రమణల పాలయ్యాయి. అడ్డుకునేవారు లేకపోవడంతో మఠం భూములు కబ్జాకు గురవుతున్నా యి. కబ్జా చేసిన భూముల చుట్టూ ప్రహరీలు కట్టి, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పుడక్కడే సుమారు 5ఎకరాల భూముల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి ఏకంగా లేఅవుట్ వేసేశారు. ఆ లేవుట్కు ఎలాంటి అనుమతులు లేవు. అక్రమంగా లేవుట్ వేయడమే కాకుండా స్టాంపు పేపర్లపై అనధికారికంగా విక్రయాలు జరుపుతున్నారు. కబ్జాదారుల అడుగులకు మడుగులు ఆక్రమిత భూముల్ని కాపాడాల్సిన అధికారులు చోద్యం చూడటమే కాకుండా కబ్జాదారులకు మరింత సహకరిస్తున్నారు. అధికార పార్టీ కీలక నేత ఆక్రమణదారుల వెనక ఉండటంతో అధికారులు వారి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఆ భూము లు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిందిపోయి అక్రమంగా వేసిన లేఅవుట్కు ఉపాధి హామీ పథకం నిధులతో రోడ్లు, కాలువలు నిర్మించారు. రూ.కోటి 45 లక్షల నిధులను కబ్జా దారుల ప్ర యోజనాలకు ఖర్చు చేస్తున్నారు. రోడ్లు, కాలువలు వేశాక పచ్చ ముఠాలు ఆగుతాయా? మరింత చెలరేగిపోతున్నాయి. విక్రయాలు చేపట్టేసి, దగ్గరుండి అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నాయి. రోజుకో కొత్త బాష్యం మఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని అందరికీ తెలిసిందే. కళ్లముందే కబ్జాలు కన్పిస్తున్నాయి. అడ్డగోలు నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ, ఆ భూముల స్వభావంపై అధికారులు రకరకాల భాష్యాలు చెబుతున్నారు. మఠం భూములని ఎక్కడా లేదంటూనే అవి 22ఎ (నిషేధిత భూములు)లో ఉన్నాయని ఒకసారి, నాట్ టేకింగ్ ఓవర్ లిస్టులో ఉన్నాయని మరోసారి చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడా భూములపై కోర్టులో వివాదం నడుస్తోందని, వాటిని స్వాధీనం చేసుకోవడం, ఆక్రమించుకోవడం కుదరదని అధికార వర్గాలు అంటున్నాయి. సమాధానాలు అన్నీ అధికారుల దగ్గరే ఉన్నాయి. కానీ కబ్జాకు గురవుతున్న భూములను కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీనికంతటికీ కీలక నేత కనుసన్నల్లో జరిగిన ఆక్రమణలు, వేసిన అక్రమ లేఅవుటే కారణమని అక్కడున్న వారందరికీ తెలుసు. ఎమ్మెల్యే సిఫార్సులతోనే.. అవి అసలైన మఠం భూములు.. ఆపై వివాదాస్పద భూములు. ఆ భూముల్లో బయట వ్యక్తి అడుగు పెడితే తక్షణమే అడ్డుకోవాలి. అలాంటి భూముల్లో ఏకంగా అక్రమ లేవుట్ వేస్తే నిలువరించలేదు. అమ్మకాలు జరుపుతుంటే పట్టించుకోవడం లేదు. కానీ, ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఫార్సు చేశారని, రూ. కోటి 45లక్షల ఉపాధి నిధులతో ప్రజల అవసరార్థం రోడ్లు, కాలువలు వేయించారని అధికారులు చెప్పడం మరింత ఆశ్చ ర్యం కలిగిస్తోంది. ఉపాధి నిధులను ఈ రకంగా ఖర్చు పెట్టొచ్చా.. కేంద్రమిచ్చే నిధులను అక్రమార్కులకు ధారపోయచ్చా అనే కొత్త ఆలోచన కలిగించారు. అక్కడెక్కడా ప్రజలు లేరు. ఖాళీ స్థలాలు, అక్కడకక్కడా అక్రమ నిర్మాణాలు తప్ప మరేవీ కనిపించవు. కానీ, ప్రజలు ఉన్నారని రోడ్లు, కాలువలు వేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. 400 ఏళ్ల చరిత్ర గల భూముల ఆక్రమణ ఆక్రమిత భూముల్లో అక్రమ లేఅవుట్ కబ్జా భూముల్లో వేసిన లేఅవుట్కు ఉపాధి హామీ నిధులతో రోడ్లు, కాలువలు ఎమ్మెల్యే సిఫార్సు మేరకు వేశామంటున్న అధికారులు విస్తుగొలుపుతున్న ఆమదాలవలస నియోజకవర్గం అక్రమాలు -
గిట్టుబాటు ధరల కల్పనలో ప్రభుత్వం విఫలం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: అన్నదాతలు పండించే పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రైతులు నష్టాల పాలవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టాల చవిచూస్తున్నారని ముందుగా కూట మి ప్రభుత్వానికి హెచ్చరించినా జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం కృష్ణదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాబోయే మూడు రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నా రైతులకు కష్టాలు తప్పడం లేదన్నా రు. మొక్కజొన్న, రబీ వరి రైతులకు మద్దతు ధర అందడం లేదని, మొక్కజొన్న అమ్మకాల్లో రైతులు భారీగా నష్టపోతున్నారని అన్నారు. మద్దతు ధర క్వింటాల్కు రూ. 2400 ఉంటే దళారులు కేవలం రూ. 1800 లకు కొనుగోలు చేస్తున్నారని, ఒక బస్తా వద్ద రైతులు రూ.600 వరకూ నష్టపోతున్నారని వివరించారు. అలాగే వరి రైతులకు కూడా మద్దతు ధర అందడం లేదన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు తమ పరిధిలో ఉన్న రైతు సంఘాల నాయకులతో సమన్వయం చేసుకొని రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలీసులకు ఫిర్యాదులు ఇవ్వండి కూటమి నాయకులు రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నీచంగా విమర్శలు చేస్తున్నారని కృష్ణదాస్ మండి పడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఉదాసీనంగా ఉండరాదని, అడ్డుగోలుగా మాట్లాడితే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అక్కడ స్పందన లేకపోతే ఎస్పీకి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు రశీదు పత్రాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కోరారు. -
తరగతుల నిర్వహణకు రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి
శ్రీకాకుళం : పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఉపాధ్యాయులను ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లాల్సిందిగా వాట్సాప్ మెసేజ్లు, ఆన్లైన్ సమావేశాల్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులపై రాష్ట్ర, జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంలో ప్రొసీడింగ్స్ రూపంలో ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులతో వేసవి సెలవులలో క్లాసుల నిర్వహణ చేయించడం సమంజసం కాదన్నారు. రెమీడియల్ క్లాసుల నిమిత్తం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు. బొలెరో ఢీకొని ఇద్దరికి గాయాలు మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ, కోట బొమ్మాళికి చెందిన టి.శ్రీనివాసరావు, ఎన్.ధనలక్ష్మి బంధువులు. మందస మండలం సొండిపూడి గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి బైక్ వస్తుండగా బాలిగాం జాతీయ రహదారిపై కోళ్లు రవాణా చేస్తున్నా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు, ధనలక్ష్మిలు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు. సూర్యనారాయణ నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : హయాతినగరానికి చెందిన ముగుల సూర్యనారాయణ (85) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఫణికిరణ్ తదితరులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేయడంతో మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది పి.సుజాత, ఎం.ఉమాశంకర్లు కార్నియాలను సేకరించి విశాఖపట్నం తరలించారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు శ్రీకాకుళం పాతబస్టాండ్: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దిశా నిర్దేశం చేశారు. పింఛన్లు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా మెరుగైన స్థానంలో ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, డీఆర్ఓ ఇన్చార్జి పద్మావతి, సీపీఓ ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్ఓ అనిత, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. శ్రీకాకుళం: ఏపీటీఎఫ్ కౌన్సిల్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా బుక్కూరు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడిగా టెంక చలపతిరావు, అదనపు కార్యదర్శిగా పి.బాలాజీరావు, సహాధ్యక్షులుగా అనంతాచార్యులు, ఉపాధ్యక్షులుగా వై.వి.రమణ, బి.వి.ఎన్.జితేంద్ర, బి.నవీన్, బి.ధర్మారావు, కార్యదర్శులుగా వి.శ్రీనివాసరావు, బి.చిన్నారావు, కిరణ్కుమార్, టి.జోగారావు, బి.కృష్ణారావు, ఎం.రమణారావును ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర సహాధ్యక్షుడు చింతాడ దిలీప్కుమార్, ఎన్నికల అధికారిగా ఈశ్వరరావు, మధుసూదనరావు పాల్గొన్నారు. నైపుణ్యాలతోనే సుస్థిర అభివృద్ధి ఎచ్చెర్ల : యువత నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి స్థిరమైన అభివృద్ది సాధ్యపడుతుందని పీయూసీ చైర్మన్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 45 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు మంగళవారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకుని నైపుణ్యవంతమైన మానవ వనరులుగా తయారుకావాలన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం పేడాడ శ్రీనివాసరావు, శిక్షణ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్జీ పాల్గొన్నారు. -
అమ్మో.. అలికాం–బత్తిలి రోడ్డు!
కొన్ని ప్రమాదాలు ● మార్చిలో ఎల్ఎన్పేట మండలం తురకపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాపారావు అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ● జనవరిలో ఎల్ఎన్పేట మండలం తురకపేట జంక్షన్ వద్ద అలికాం–బత్తిలి రోడ్డుపై ప్రైవేటు విద్యాసంస్థకు చెందిన బస్సు పొలాల్లోకి దూసుకుపోయింది. విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. ● నాలుగు నెలల కిందట ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యుగంధర్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ● ఎల్ఎన్పేట మండలం కరకవలస మాజీ సర్పంచ్ బి.జనార్దనరావు తురకపేట జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్పై వస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో దుర్మరణం పాలయ్యారు. ● ఇరుకుగా అంతర్ రాష్ట్ర రహదారి ● హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు ● కనీసం విస్తరణకు నోచుకోని వైనం ● తరచూ ప్రమాదాలతో భయపడుతున్న జనం హిరమండలం: అలికాం–బత్తిలి రోడ్డు ప్రయాణికులను భయపెడుతోంది. ప్రతి నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గార మండలం అలికాం నుంచి ఒడిశాలోని గుణుపూర్ వరకూ 118 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి ఉంది. ఇది అంతర్ జిల్లా, రాష్ట్ర రహదారి. శ్రీకాకుళం జిల్లాలోని ప్రధాన మండలాలను కలుపుతూ ఉంది. ఆపై విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి రహదారులకు అనుసంధానమైనది. ఆపై ఒడిశాలోని హడ్డుబంగి, గుణుపూర్ రోడ్లకు సైతం ఇది అనుసంధానమై ఉంది. ప్రతిరోజూ సగటున 5 వేల వరకూ వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటాయి. ఏటికేటా వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. రోడ్డు విస్తరణకు మాత్రం నోచుకోలేదు. జిల్లాలో ఇతర రోడ్లు విస్తరిస్తున్నా ఎంతో ప్రాధాన్యం ఉన్న అలికాం–బత్తిలి రోడ్డుపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదు. ఐదేళ్ల కిందట ప్రతిపాదనలు.. అలికాం–బత్తిలి రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలన్న ప్రతిపాదన చాలా ఏళ్ల నుంచి ఉంది. రెండు లేదా నాలుగు లేన్లగా విస్తరించాన్న ప్రతిపాదన 2021లోనే కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ ఇంతవరకూ ఆమోదం లభించలేదు. మధ్యలో ఒకసారి కొలతలు కూడా తీశారు. తర్వాత పట్టించుకోవడం మానేశారు. కనీసం ఈ రోడ్డు విస్తరణకు నోచుకోలేదు. ఆమదాలవలస మునిసిపాలిటీ, సరుబుజ్జిలి, ఎల్ఎన్పేట, హిరమండలం, కొత్తూరు మండల కేంద్రాల్లో మాత్రమే రోడ్ల విస్తరణ జరిగింది. మిగతా చోట్ల సింగిల్ లైన్గా ఉంది. దీంతో ఎదురెదురుగా వచ్చే బస్సులు, లారీలు తప్పించుకునే పరిస్థితి లేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ రెండు రోడ్లపైనే దృష్టి.. జిల్లాకు సంబంధించి కళింగపట్నం–పాలకొండ–పార్వతీపురం మీదుగా రాయగడకు ఉన్న 145 కిలోమీటర్ల రోడ్డును నేషనల్ హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదన సైతం కేంద్రం వద్ద ఉంది. ఇంకోవైపు చిలకపాలెం నుంచి రామభద్రపురం మీదుగా రాయగడకు 100 కిలోమీటర్ల రోడ్డు ఉంది. దీన్ని సైతం నేషనల్ హైవేగా గుర్తించాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిన రహదారిని విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ జాబితాలో అలికాం–బత్తిలి రోడ్డు లేకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోడ్డు ఇరుకున ఉండడంతో శ్రీకాకుళం రూరల్, గార, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్ఎన్పేట, హిరమండలం, కొత్తూరు మండలాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. తరచూ ప్రమాదాలు.. మా చిన్ననాటి నుంచి అలికాం–బత్తిలి రోడ్డు ఇలానే ఉంది. ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణం జాతీయ రహదారిగా గుర్తించి విస్తరించాల్సిన అవసరం ఉంది. – పెనుమజ్జి విష్ణుమూర్తి, వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు, ఎల్ఎన్పేట భయం వేస్తోంది.. ఈ రహదారిపై ప్రయాణమంటేనే భయం వేస్తుంది. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కూడా తప్పించుకునేందుకు వీలుండదు. జిల్లాలో ఇతర రహదారులను విస్తరించారు. కానీ రహదారి విషయాన్ని మాత్రం మరిచారు. ఇప్పటికై నా దృష్టిపెట్టాలి. – రెడ్డి సురేష్, ఎల్ఎన్పేట కేంద్రానికి నివేదించాం.. అలికాం–బత్తిలి రోడ్డును విస్తరించడంతో పాటు జాతీయ రహదారిగా గుర్తించాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. కానీ ఎలాంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. రోడ్డు విస్తరణ పనులు చేపడతాం. – సత్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ,శ్రీకాకుళం -
ఆర్అండ్బీ స్థలాల్లో ఆక్రమణల పర్వం
పాతపట్నం: నియోజకవర్గం కేంద్రం పరిధిలో ప్రభుత్వ స్థలాలు దర్జాగా ఆక్రమిస్తున్నారు. సొంత స్థలాలు లాగే విక్రయాలు కూడా చేస్తున్నారు. అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో రోజురోజుకూ ఆక్రమణలు పర్వం పెరుగుతుంది. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఆక్రమణ స్థలాల్లో పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డు జంక్షన్ నుంచి మెళియాపుట్టి, పలాస ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆర్అండ్బీ స్థలంలోను తాజాగా ఆక్రమణలు చేసి విక్రయాలు చేపట్టారు. బ్రాహ్మణవీది మెయిన్రోడ్డు నుంచి యశోదనగర్ వెళ్లే వరకు కొంత మంది స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. వీరు ఒక్కో దుకాణానికి సరిపోయే స్థలాన్ని రూ.50వేల నుంచి రూ.80 వేలు చొప్పున చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన స్థలం కాదా అని బీటీ రోడ్డుకు వీరు నిర్మాణాలు జరిపించి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డులో తిడ్డిమికి వెళ్లె రహదారిలో ఎక్కువ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ స్థలాల్లో ఆక్రమ నిర్మాణాలు చేస్తుండడం విశేషం. సాయంత్రం ఐదు గంటలకే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఆల్ఆంధ్రా కూడలిలో రద్దీగా ఉంటుంది. రహదారి పక్క స్థలాలను అమ్ముతున్న మొదట్లోనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి ఆక్రమణలను తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు. -
గిరిజన సమస్యల పరిష్కారానికి చర్యలు
కొత్తూరు: గిరిజన సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ అన్నారు. మండలంలోని ఓండ్రుజోల గ్రామంలో గిరిజనులతో మాటామంతీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గిరిజనులు పడుతున్న పలు రకాల సమలస్యలను పీఓకు వివరించారు. భూ సమస్యలు, రహదారులు, తాగునీరు వంటి సమ్యలు పరిష్కరించాలని కోరారు. పీఓ మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించేందుకు ఆధారాలతో కూడిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందజేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం మండల పరిషత్ అధికారులతో పాటు వివిధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులకు నిధులు కేటాయించి, చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనులకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సామాజిక వెత్త బామిడి రాజు, సుందర నారాయణ, తిరుపతిరావు, సచివాలయ ఉద్యోగులు, గిరిజనులు పాల్గొన్నారు. -
నరసన్నపేటలో భారీ వర్షం
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో మంగళవారం భారీ వర్షం కురిసింది. రాత్రి 8.30 గంటల నుంచి ఏకధాటిగా వర్షం కురవడడంతో వీధులు జలమయమయ్యాయి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన భూగర్భ డ్రైనేజీ సిస్టం పూర్తిగా విఫలం కావడంతో ఇప్పుడు చిన్న వర్షం పడినా వర్షం నీటితో వీధులు నిండిపోతున్నాయి. మెయిన్ రోడ్డుకు ఆనుకొని నిర్మించిన కాలువలు పూర్తిగా పూడికలతో నిండిపోవడంతో రోడ్డుపైనే నీరు ప్రవహిస్తోంది. ముఖ్యంగా బజారు వీధి, మఠంవీధి, నాయుడు వీధి, పుండరీకాక్ష కాలనీ, జోగిపేట కూడలిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. -
● అమ్మలగన్న అమ్మ
భద్రమహంకాళి అమ్మవారి ఊరేగింపు జిల్లా కేంద్రంలోని ఇల్లీసుపురంలో భద్రమహంకాళి అమ్మవారి అనుపు ఉత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కోలాటం, తప్పెటగుళ్లు, డప్పు విన్యాసాలతో అమ్మవారిని ఊరేగించారు. గుడి గోపురానికి సమానంగా కనిపిస్తున్న అమ్మవారిని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం చిన్నారికి అమ్మవారిని చూపిస్తున్న భక్తుడు -
బోరు కప్పేసి..షాపులు కట్టేసి..!
● పైడి భీమవరం పంచాయతీలో యథేచ్ఛగా ఆక్రమణలు ● పక్కా షాపులు నిర్మించిన కబ్జాదారుడు రణస్థలం : పైడిభీమవరం పంచాయతీలో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన ఈ రెండేళ్లలో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా కబ్జాదారులు ఆక్రమించేస్తున్నారు. తాజాగా పైడిభీమవరం పంచాయతీలోని కాజా వీధిలో నారువ వైపు వెళ్లే రహదారి పక్కన సర్వే నంబర్ 91–1లో ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి అడ్డగోలుగా ఆక్రమించేశాడు. అందులో ప్రభుత్వానికి చెందిన చేతిపంపు(బోరు) ఉంటే అది కూడా కప్పేసి స్థలం చదును చేసేశాడు. దీనికి తోడు పక్కనే ఉన్న కాలువపైన పలకలు వేసి చదును చేసి కబ్జా చేశాడు. తదుపరి దర్జాగా పక్కా షాపుల నిర్మాణ పనులు ప్రారంభించి 90 శాతం పూర్తి చేశాడు. ఇంత జరుగుతున్నా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారి జగదీశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి పి.అజయ్బాబు వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ స్థలంలో బోరు కప్పేసి అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి పనులు నిలిపివేయమని చెప్పామని, ఇంకా ఆపకుండా నిర్మిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఉద్దానం విధ్వంసానికే కార్గో ఎయిర్పోర్టు
● కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేసిన కార్గో ఎయిర్పోర్టు పోరాట కమిటీ ప్రతినిధులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కార్గో ఎయిర్పోర్టు పేరు తో ఉద్దానంలో విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు మండిపడ్డారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని పోలీసు నిర్బంధాన్ని ఎత్తివేయాలని, వేధింపులు ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పొ ద్దని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టరేట్ వద్ద గల జ్యోతీరావు పూలే పార్కు వద్ద కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు అధ్యక్షతన నిరశన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది జీడి, కొబ్బరి మునగ చెట్లు నరకడం వల్ల వాటిపై ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్న వేలాది మంది జీవనానికి ముప్పు ఏర్పడుతుందని, పర్యావరణానికి సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నా రు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఇక్కడి పరిస్థితులు, వాతావరణం, సహజ సంపద, మత్స్యకారుల జీవన విధానం తెలియదా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా ఒకసారి కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల కోసం ఒక్క పైసా అయినా ఎందుకు తేలేదని వారు ప్రశ్నించారు. అణు విద్యుత్ కేంద్రం, పచ్చటి పొలాల్లో కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల భూములను కార్పొరేట్లకు అప్పజెప్పడమే వీరికి ప్రధాన లక్ష్యమైపోయిందని విమర్శించారు. జూన్ 6వ తేదీన చలో ఉద్దా నం కార్యక్రమం చేపట్టి రాంపురంలో ర్యాలీ బహి రంగ సభ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతాడ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, పౌర హక్కుల సంఘం నాయకులు పత్రి దానేషు, ఆంధ్ర ప్రదేశ్ జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ అజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పొందూరు చంద్ర రావు, పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్
ఎచ్చెర్ల: ఈ విద్యా సంవత్సరంలో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 6, 7, 8 వ తేదీల్లో జిల్లాలోని ఏడు ఐటీఐ కళాశాలల్లో క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సుధాకర్ తెలిపారు. ఈ నెల 6 వ తేదీన ఎచ్చెర్ల ప్రభుత్వ పాఠశాలలో డ్రైవ్ జరుగుతుందన్నారు. దీనికి శ్రీరామ, గణేష్ ఐటీఐ విద్యార్థులు హాజరుకావాలన్నారు. ఈ నెల 7 వ తేదీ న డాక్టర్ వి.కణితీస్, సాయి తిరుమల, సర్వ మంగళ ఐటీఐ కళాశాలల్లో జరుగుతుందన్నా రు. ఈ నెల 8 వ తేదీన శ్రీవెంకటేశ్వర, భారతి ఐటీఐ కళాశాలల్లో డ్రైవర్ జరుగుతుందని తెలిపారు. ఐటీఐ కళాశాలల్లో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థికి ఉద్యోగ కల్పన లక్ష్యంతో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: సమాధాన్ సమరోహ్–2026లో భాగంగా సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా మంగళవారం తెలిపారు. ఈ లోక్ అదాలత్ ఆగస్టు 21, 22, 23 తేదీల్లో సుప్రీంకోర్టులోనే నిర్వహి స్తారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న కేసుల ప్రమాదాలకు సంబంధించి క్లెయి మ్లు, చెక్బౌన్స్ కేసులు, భూ సేకరణ సమస్యలు, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కార్మికులకు సంబంధించిన సమస్యలు, తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. పెండింగ్లో ఉన్న కేసులు సుప్రీంకోర్టు లోక్ అదాలత్ కు సంబంధించి గూగుల్ ఫార్మ్ (www.sci.gov.in), జిల్లా కోర్టు వెబ్ సైట్లో లోక్ అదాలత్ ఫార్మ్ ఉంచినట్లు చెప్పారు. పార్టీలు తమ అంగీకారంను తెలియజేయాల్సి ఉందన్నారు. పార్టీలు వారి అడ్వకేట్లతో జిల్లాలో మాత్రమే హాజరు కావచ్చన్నారు. పార్టీలు వారి సంబంధిత అడ్వకేట్లతో డీఎల్ఎస్ఏ నిర్వహించే సెటిల్ మెంట్ సమావేశాలకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్గా హాజరు కావచ్చన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబరు 15100, 08942–224675, 9440901060 సంప్రదించాలన్నారు. కలెక్టర్, ఎస్పీ సుడిగాలి పర్యటన నరసన్నపేట: నరసన్నపేటలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు మంగవారం నరసన్నపేటలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన వీరు అనంతరం ఇందిరానగర్, డంపింగ్ యార్డుకు వెళ్లి చెత్త సేకరణ పద్ధతులు పరిశీలించారు. డంపింగ్ యార్డు వృథాగా పడి ఉండడంతో కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఇంత విశాలమైన యార్డు ఉన్నప్పటికీ దీన్ని వినియోగించడంలో ఎందు కు శ్రద్ధ చూపలేదని అధికారులను ప్రశ్నించా రు. అనంతరం కంబకాయ రోడ్డులో ఉన్న పాత ఇనుము దుకాణానికి వెళ్లి అక్కడ పాత వస్తువులను ఎలా గ్రేడింగ్ చేస్తున్నారు.. ఏయే వస్తువులు ఎక్కడెక్కడ విక్రయాలు చేస్తున్నారు అనేది అక్కడి కార్మికుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో 13 మండలాల అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమానికి సంబంధించి సమీక్ష నిర్వహించారు. హెలీప్యాడ్ను, మీటింగ్ ప్రదేశాలకు అనువైన స్థలాలను పరిశీలించారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి వస్తున్నందున అధికార యంత్రాంగం అంతా సన్నద్ధం కావా లన్నారు. నరసన్నపేటలోని 20 వార్డులను పరిశీలించి చెత్త సేకరణపై పూర్తిగా అవగాహన కలిగించాలని, ఈ వారం రోజులూ చెత్త సేకరణ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న మండల స్థాయి అధికారులు సరైన సమాచారంతో సిద్ధంగా లేకపోవడంపై కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు, ట్రైనీ కలెక్టర్ హరిహోం పాండియా, జెడ్పీ సీఈఓ వెంకటరామన్, డీపీఓ మధుబాలతో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
వజ్రపుకొత్తూరు: చినపల్లివూరు గ్రామానికి చెందిన గర్తం ఇందు(25) అనే వివాహిత సోమవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. అమలపాడు పంచాయతీ చింతవానిపేటకు చెందిన ఇందుకు.. చినపల్లివూరుకు చెందిన గర్తం శంకరరావుతో 2017లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కవలలు (బాబు, పాప) ఉన్నారు. ఇందు తండ్రి లోకనాథం చిన్న వయస్సులోనే మృతి చెందగా తల్లి మోహిని అన్నీ తానై పెంచింది. కట్న లాంచనాలతో వివాహం చేసింది. ఇందు భర్త ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శంకరరావు దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మధ్య ఏం జరిగిందో తెలియదు గానీ ఇందు సోమవారం రాత్రి ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న తల్లి మోహిని, సోదరుడు సందీప్ హుటాహుటిన వెళ్లి విగతజీవిగా పడి ఉన్న ఇందుని చూసి బోరున విలపించారు. కాగా, ఇందు ఉరి వేసుకొని చనిపోయేంత పిరికిది కాదని, కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లి మోహిని, సోదరుడు సందీప్ ఆరోపించారు. కొద్దిసేపటి కిందటే ఇందుతో వీడియో కాల్లో మాట్లాడామని, ఇంతలో ఏం జరిగిందో తెలియదని చెప్పారు. భర్త శంకరరావు, అత్త వరలక్ష్మి చాలా రోజులుగా తమ కుమార్తెను వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ వైకుంఠరావు తెలిపారు. -
● సర్పాల సయ్యాట
344 మందికి ఆరు రోజుల వేతనాలు కట్ రణస్థలం: లావేరు మండలంలోని బుడతవలస ఫీల్డ్ అసిస్టెంట్ కెల్ల జగదీష్ కుమార్ చేసిన నిర్వా కం వల్ల 344 మంది వేతనదారులకు 6 రోజుల వేతనాలు రాలేదు. దీంతో సుమారు 50మంది వేతనదారులు మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఎంపీడీఓ పి.వెంకటరాజు, ఉపాధి హామీ ఏపీఓ ఆర్.సత్యవతి ఎదుట వాపోయారు. బుడతవలస గ్రామంలోని వేతనదారులు గత వారం రోజులుగా చెరువు పని చేశారు. అయితే దీనిపై మస్టర్ షీట్పై సంతకాలు తీసుకుని ఉపాధి హామీ కార్యాలయానికి అందజేయడం లేదు. వారం పాటు ఇలా చేయడంతో వేతనదారుల హాజరు ఆన్లైన్లోనూ, ఆఫ్ లైన్లో నమోదు కాలేదు. దీంతో ఆ మేరకు వేతనాలు పొందలేకపోయారు. దీనిపై ఎంపీడీఓ పి.వెంకటరాజు, ఏపీఓ ఆర్ సత్యవతి మాట్లాడుతూ 344మంది వేతనాలు అందేలా చర్యలు చేపడతామని, సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ జగదీష్పై పీడీ కార్యాలయానికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పిస్తామని చెప్పారు. టెక్కలి వంశధార కాలనీలో సోమవారం సర్పాల సయ్యాట కనిపించింది. స్థానికులు ఆ దృశ్యాలను ఆసక్తిగా గమనించారు. – టెక్కలి -
పరిహారం చెల్లించకుండా నోటీసులా..?
రణస్థలం: జాతీయ రహదారుల సంస్థ తరఫున ఎలాంటి పరిహారం చెల్లించకుండా తమ ఇళ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇవ్వడం అన్యాయ మని బుడుమూరు బాధిత దళితులు వాపోయారు. లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన ఉన్న జె.అప్పన్న, దుంగ బావాజి, కుప్పిలి ఆదిలక్ష్మి, కుప్పిలి రమణమ్మ, మున్నాన లక్ష్మి, అసిరమ్మలకు ఇళ్లు ఖాళీ చేయాలని హైవే అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా బాధిత దళితులు సోమవారం మాట్లాడుతూ రోడ్డు విస్తరణకు సంబంధించి తమకు ఎలాంటి పరిహారం రాలేదని తెలిపారు. ఉన్న ఫలంగా వెళ్లిపొమ్మంటే ఎక్కడకు పోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫున ఇంటి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష కొత్తూరు: పారాపురం గ్రామంలో ఉన్న సత్య సాయి బాబా మందిరంలో 28 తులాల బాబా వెండి పాదాలు దొంగతనం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా కోర్టు విధించిందని ఎస్ఐ కె.వెంకటేష్ సోమ వారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. పారాపురంలోని సత్యసాయిబాబా మందిరంలో 2006లో రూ.56 విలువ గల 28 తులాల బాబా వెండి పాదాల దొంగతనం జరిగింది. అప్పట్లో పోలుమహంతి ప్రసాదరావుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయగా దొంగిలించిన బాబా వెండి పాదాలు స్వాధీనం చేసుకున్నామని, కేసు విచారణలో భాగంగా సోమవారం కొత్తూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి కందికట్ల రాణి నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేలు జరిమానా విధించారని, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించారని తెలిపారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్.నాగభూషణం వాదించారని ఎస్ఐ తెలిపారు. జిల్లాలో 1196 ‘జలధార’ పనులు ప్రారంభం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూగర్భ జల మట్టాన్ని పెంచడంతో పాటు, ప్రతి నీటి చుక్క ను ఒడిసిపట్టే లక్ష్యంతో ‘జలధార – జలహారతి’ పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో జల సంరక్ష ణ కీలకమని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 7,376 పనులను గుర్తించగా, ఇప్పటికే 3,925 పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని, ఇందులో 1,196 పనులు క్షేత్రస్థాయిలో విజయవంతంగా ప్రారంభమయ్యాయని వెల్లడించారు. ముఖ్యంగా చెరువుల పూడికతీత, ఫీడర్ ఛానల్స్ పునరుద్ధరణ, చెరువు గట్ల పటిష్టత వంటి పనుల ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘ప్రసన్న’మైన విజయం శ్రీకాకుళం పాతబస్టాండ్: పదో తరగతి ఫలితాల్లో సరుబుజ్జిలి మండలం పెద్ద సవలాపురం గ్రామానికి చెందిన కోరాడ లక్ష్మీ ప్రసన్న అద్భుత ప్రతిభ కనబరిచింది. 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన లక్ష్మీ ప్రసన్నను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం గ్రీవెన్స్లో అభినందించారు. లక్ష్మీ ప్రసన్న తండ్రి కోరాడ గున్నారావు ఇండియన్ ఆర్మీలో అధికారిగా పనిచేస్తున్నారు. తన విజయంపై లక్ష్మీ ప్రసన్న స్పందిస్తూ.. భవిష్యత్లో ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య విద్యను అభ్యసించి, ఉత్తమ డాక్టరుగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వెల్లడించింది. 8న జాబ్మేళా హిరమండలం: స్థానిక రామేశ్వరి డిగ్రీ కాలేజీలో ఈ నెల 8న జాబ్మేళా నిర్వహిస్తున్నారు. ఆయన్ బిజినెస్ సపోర్టు సొల్యూషన్ ఆధ్వర్యంలో 15 కంపెనీలు ఈ జాబ్మేళాలో పాల్గొంటున్నాయి. 18–40 ఏళ్ల వయసు గల గ్రాడ్యు యేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వివరాలకు 6281318456, 9966903047 నంబర్లకు సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు. -
‘బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం తగదు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కాంట్రాక్టర్లుగా పనులు చేస్తున్న వారికి గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సబ్కా శ్రీకాకుళం అసోసియేషన్ అధ్యక్షుడు గొర్లె రామానాయుడు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్, కమిషనర్లకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ సీఎఫ్ఎంఎస్–2025 మార్చి తర్వాత రిటర్న్ అయిన బిల్స్ నేటికి తిరిగి అప్లోడ్ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రికార్డింగ్ పూర్తయి పాస్ ఆర్డర్లు వెయ్యకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. అగ్రిమెంట్ సమయంలో ఇచ్చిన ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు ఏళ్ల తరబడి చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని తెలిపారు. పనులు పూర్తయినా ఇంజినీరింగ్ అధికారులు బిల్లులు రికార్డింగ్ చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్, కమిషనర్ని కలిసిన వారిలో సబ్కా సంఘ నాయకులు గొర్లె వెంకటరామానాయుడు, చల్ల సింహాచలం, బాడాన హరికృష్ణ, గురుగుబెల్లి సుదర్శనరావు, గ్రంధి గణేష్, తంగి భాస్కర్, గంగు రాజు, రుద్రమహంతి కామేశ్వరరావు, మహేష్, కిల్లి మోహనరావు, వండాన మోహన్, దీర్ఘాసి తిరుమలరావు, రాయల సూర్యదీప్, సంతోష్, బాలకృష్ణ తదితరులున్నారు. -
తల్లి దిగంతాలకు.. తండ్రి జైలుకి
జి.సిగడాం: అభం శుభం తెలియని ఆ చిన్నారులు అనాథలుగా మిగిలారు. తండ్రి వ్యసనాలకు బానిస కావడంతో తల్లి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు లో పిల్లల తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలు ఇప్పుడు అనాథలయ్యారు. ఆనందపురం గ్రామానికి చెందిన కిమిడి రాజేశ్వరి(26), శ్యామలరావుకు హన్విక(4), జస్విస(18 నెలలు) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. తల్లి మృతి చెందడంతో ఆ చిన్నారులు తల్లి కోసం అమ్మ కావాలి, అమ్మ ఎక్కడకి వెళ్లింది అంటూ దీనంగా చూస్తున్నారు. ఈ చిన్నారులను చూ సిన వారంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. తండ్రి కిమిడి శ్యామలరావు విశాఖపట్నంలో పోలీస్ బ్యారక్స్ ఎంటీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను వ్యసనాలకు బానిసై రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారం తీసు కుని ఇష్టానుసారం బెట్టింగ్లు చేయడంతో ఆమె విసిగిపోయి ఉరి వేసుకున్నారు. చివరకు ఈ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. -
గుండె చెరువైంది..
● కూలి పనులకు వచ్చి చెరువులో పడి యువకుడు మృతి టెక్కలి రూరల్: కూలి పని కోసం ఊరి కాని ఊరు వచ్చిన ఆ యువకుడి ఆయుష్షు ఇక్కడే అయిపోయింది. టెక్కలి మండలం కాంట్రగడ గ్రామం వద్ద సోమవారం సాయంత్రం చెరువులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. విజయనగరం జిల్లా జొన్నగుడ్డి గ్రామానికి చెందిన కె.భానుప్రకాష్ (19) టెక్కలి మండలం కాంట్రగడ గ్రామంలో జరిగిన ఒక వివా హ వేడుకకు లైటింగ్, షామియానాల డెకరేషన్ చేసేందుకు సహచరులతో కలిసి 15 రోజుల కిందట వచ్చాడు. రెండు రోజుల కిందట పెళ్లి జరిగింది. తిరిగి తమ సామాన్లు వ్యాన్లోకి ఎక్కించుకుని జిల్లాకు వెళ్లిపోవాలనుకున్నారు. ఈ లోగా సోమవారం గ్రామం వద్ద ఉన్న చెరువుకి స్నానానికి వెళ్లారు. ఆ చెరువులో దిగిన భాను ప్రకాష్ లోపలకు వెళ్లి మునిగిపోయాడు. రెండు చేతులూ ఊపుతూ కాపాడాలని వేడుకున్నాడు. ఇది చూసిన తోటి స్నేహితులు చెరువంతా గాలించినా ఫలితం లేకపోవడంతో గ్రామస్తుల సహాయంలో చెరువులో వెతికారు. కాసేపటి తర్వాత చెరువు లోపల అతను లభ్యం కా వడంతో బయటకు తీసుకు వచ్చారు. అనంతరం 108లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహరాజ్ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో పాఠశాల విద్యార్థులు, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్లు) మొదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియ వేదికగా ఇన్చార్జి డీఎస్డీఓ ఎం.మాధురీలత సోమవారం సాయంత్రం ఈ శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. క్రీడల పట్ల ఆసక్తి కలిగిన 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలు ఈ శిక్షణలో పాల్గొనవచ్చన్నారు. అనంతరం ఎంపిక చేసిన శిక్షణ శిబిరాల కోచ్లకు క్రీడాపరికరాలను పంపిణీ చేశారు. -
అక్రమాలు అరికట్టాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆమదాలవలస నియోజకవర్గంలో పలు సమస్యలు, అక్రమాలను అరికట్టాలని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కోరారు. ఆమదాలవలస మండలం కొత్తరోడ్డు వద్ద గల బావాజీ మఠం భూములకు 400 ఏళ్ల చరిత్ర ఉందని, వాటిని ఆక్రమించుకుని లే అవుట్ వేస్తున్నారని తెలిపారు. ఈ భూములను రెవెన్యూ అధికారులతో సర్వే చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో లేఅవుట్ వేస్తున్నారని, వాటిని నిలుపుదల చేయాలని, ప్రభుత్వ దేవదాయ ఆస్తులను కాపాడాలని ఆయన కోరారు. పొందూరు మండలంలోని గణేష్ గాయత్రి స్టోన్ క్రషర్ కూడా ఆమదాలవలస ఎమ్మెల్యే బినామీలు నడుపుతున్నారని, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతోందని, ఈ భూమిని చౌకగా కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు. గాజులు కొల్లి వలస గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఉన్న పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చేశారని, కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో రోడ్డుపై భవ నం నిర్మిస్తున్నారని, తహసీల్దార్ ప్రత్యేకాధికారిగా ఉన్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. పురుషోత్తపురం, ముద్దాడపేటలో అక్రమ ఇసుక తవ్వకాలు ఆపాలని కోరారు. -
ప్రజా ఫిర్యాదుల వేదికకు 122 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండియాతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వేదికలో సాయంత్రం వరకు మొత్తం 122 ఫిర్యాదులు నమోదయ్యాయి. పొందూరు మండలం కింతలికి చెందిన వి.శివకుమార్ సోమవారం పీజీఆర్ఎస్లో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. తన భూమి వేరే పేరు మీద 1–బి రికార్డులో వస్తోందని, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించాడు. సోంపేట మండలం, కొర్లాం గ్రామంలోని భూముల విషయమై అధికారులపై కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు, రైతులు ఫిర్యాదు చేశారు. -
1104 యూనియన్ రీజనల్ కార్యదర్శిగా లోకేశ్వరరావు
అరసవల్లి: ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రీజనల్ కార్యదర్శిగా నక్క లోకేశ్వరరావు, అధ్యక్షునిగా టీవీ సుబ్రహ్మణ్యం (సుబ్బు) ను ఎన్నుకున్నారు. ఈమేరకు డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, ఏవీ రాంప్రసాద్ సంయుక్త అధ్యక్షతన ఆదివా రం నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ సభ్యుల ఎమర్జెన్సీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయాన్ని తీర్మానించారు. తదుపరి ఎన్నికల వరకు వీరిని తాత్కాలిక ప్రతినిధులుగా ఎన్నుకున్నట్లుగా ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఇటీవల 1104 సంఘ రీజనల్ కార్యదర్శిగా ఉన్న ఎంవీ గోపాలరావును ప్రాఽథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రాప్తికి ఇప్పటివరకు శ్రీకాకుళం రీజనల్ అధ్యక్షునిగా ఉన్న లోకేశ్వరరావును రీజన ల్ కార్యదర్శిగానూ, టీవీ సుబ్రహ్మణ్యాన్ని రీజనల్ అధ్యక్షునిగా తాత్కాలికంగా ఎంపిక చేశారు. ఈ సమావేశంలో డిస్కం వర్కింగ్ ప్రెసిడెంట్ మహంతి ప్రభాకరరావు, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ను చండ్ర రాజే శ్వరరావు 1959 మే 3న ఢిల్లీలో స్థాపించారని ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు వై.వేణు, ఎస్.అన్నాజీలు అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 67 వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం వారు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని యువత, నిరుద్యోగుల పక్షాన నిలబడి మాట్లాడే ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ యువజన సమాఖ్యను స్థాపించినట్లు తెలిపా రు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం నిర్విరామ ఉద్యమంలో సమాఖ్య భాగస్వామ్యమైందన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులకు వయో పరిమితిని పెంచాలని, వలంటీర్లును యథాతథంగా కొనసాగిస్తూ నెలకు రూ 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, నిరుద్యోగులకు రూ 3 వేల నిరుద్యోగ భృతి చెల్లించాలని, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి గార: శ్రీకూర్మం కూర్మనాథుడిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తర్లాడ రాజశేఖర్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి అధికారులు, అర్చకులు ఎదురేగి స్వాగతం పలికారు. మూలవిరాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. క్షేత్ర మహత్యాన్ని అర్చకులు కిశోర్బాబు, శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ టి. వాసుదేవరావు, బోర సింహాచలం మాస్టారు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సత్యవతి శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎ.సత్యవతి నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఆదివారం బీసీ ఉద్యోగుల సంఘ సమావేశంలో సత్యవతికి సంఘ అధ్యక్షుడు ఆవుల నరసింహారావు సమక్షంలో రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు అందజేశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహిస్తానన్నారు. సమావేశంలో బీసీ ఉద్యోగుల సంఘ ప్రతినిధులు చౌదరి పురుషోత్తమనాయుడు, హనుమంతు సాయిరాం, ఆర్.వేణుగోపాల్, కిల్లాన శ్రీనివాస్, గద్దెబోయిన కృష్ణ, ఇతర ప్రతినిధులు ఉన్నారు. -
ఐదు గంటల్లో అండర్ టన్నెల్
పాతపట్నం: పాతపట్నం రైల్వే గేటు వద్ద ఆదివారం అండర్ టన్నెల్ నిర్మాణం పనులు వేగవంతంగా చేపట్టారు. నాలుగు రోజుల పాటు వాహనాలను, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకుని కేవలం ఐదు గంటల సమయంలోనే పనులు పూర్తి చేశారు. ఉద యం గుణుపూర్–పూరి రైలు వెళ్లాక 7 గంటలకు నిర్మాణం పనులు అధికారులు ప్రారంభించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ముమ్మరంగా నిర్మాణం పనులు చేపట్టారు. నిర్మాణ పనుల వల్ల విశాఖపట్నం–గుణుపూర్ రైలు రాకపోకలకు అంతరాయం కలిగింది. విశాఖపట్నం–గుణుపూర్ రైలు నౌపడ వరకు వచ్చి, అక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లింది. గుణుపూర్–పూరి, పూరి–గుణుపూర్, రూర్కెలా–గుణుపూర్, గుణుపూర్–రుర్కెలా (రాజారాణి ఎక్స్ప్రెస్) రైళ్లు యథావిధిగా నడిచాయి. అండర్ టన్నెల్ నిర్మాణం కోసం భారీ క్రెయిన్లు రెండు, జేసీబీలు ఆరు, రైల్వే ఉన్నతాధికారులు పది మంది, దిగువ స్థాయి సిబ్బంది సుమారు 30 మంది, జాతీయ రహదారి హైవే అధికారులు, రైల్వే కార్మికులు సుమారు 100 మంది నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. రైల్వే అధికారులు విశాఖపట్నం–గుణుపూర్ రైలు నిలిచిపోతుందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
చరిత్రను మర్చిపోవద్దు
ఆమదాలవలస: వంశధార రెండో దశ నిర్మాణ పనుల సాధనలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం ప్రధాన పాత్ర పోషించారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ స్పష్టం చేశా రు. ఆయన ఆదివారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వంశధార ప్రాజెక్ట్ చరిత్రను రాజకీయ కోణంలో కాకుండా వాస్తవాల ఆధారంగా చూడాలని కోరారు. 1961లో బొడ్డేపల్లి రాజగోపాలరావు ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్కు అదే సంవత్సరం దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేయగా, ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలనే లక్ష్యం అప్పుడే నిర్ణయించారని గుర్తుచేశారు. తర్వాతి కాలంలో ఒడిశా అభ్యంతరాల కార ణంగా ప్రాజెక్ట్ దశాబ్దాల పాటు నిలిచిపోయిందని, 2010లో ఏర్పాటు చేసిన వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ 2017 సెప్టెంబర్ 13న ఇచ్చిన తుది తీర్పుతో ప్రాజెక్ట్కు చట్టబద్ధ మార్గం ఏర్పడిందన్నా రు. ఆ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు నేరడి బ్యారే జ్ నిర్మాణానికి అనుమతి లభించినప్పటికీ, ఒడిశా లో 106 ఎకరాల భూసేకరణ, పునరావాసం వంటి షరతులు అమలు చేయాల్సి ఉందని వివరించారు. 2019 తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒడిశాలో భూసేకరణ కోసం రూ.100 కోట్లకు పైగా నిధులు డిపాజిట్ చేయడం, న్యాయపరమైన అడ్డంకులను తొలగించే చర్యలు చేపట్టడం వంటి కీలక నిర్ణయా లు తీసుకుందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఒడి శా నుంచి భూమి అప్పగింతలో ఆలస్యం కారణంగా 2026 నాటికి నేరడి బ్యారేజ్ నిర్మాణం ప్రారంభం కాలేదని తెలిపారు. వంశధార రెండో దశ సాధనలో తమ్మినేని సీతారాం కృషి మర్చిపోలేనిదని చిరంజీవినాగ్ తెలపారు. కేంద్రంలో జనతాదళ్ ప్రభుత్వం ఉన్న సమయంలో, అప్పటి ప్రధానమంత్రి వీపీ సింగ్, జలవనరుల శా ఖ మంత్రి మునుభాయ్ కొటాడియా తదితరులను కలిసి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సూచనల మేరకు తమ్మినేని సీతారాం నేతృత్వంలో చౌదరి తేజేశ్వరరావు, తమ్మినేని శ్యామల రావు, బలగ అప్పలనాయుడు, మొదలవలస రామమూర్తి తది తరులతో కూడిన అఖిలపక్ష ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించిందని గుర్తుచేశారు. అదేవిధంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ల మధ్య ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో వంశధార రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి పచ్చజెండా ఊపిందన్నారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య వి వాదాలు తలెత్తడంతో అంశం ట్రిబ్యునల్, న్యాయస్థానాల వరకు వెళ్లినా, చివరికి రెండు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగే విధంగా పరిష్కార మార్గం ఏర్పడిందని వివరించారు. ఇలాంటి చారిత్రక వాస్తవాలను విస్మరిస్తూ కొందరు నాయకులు ప్రాజెక్ట్ క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని అన్నా రు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఒడిశాలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నేరడి బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని గూనపాలెంలో నివసిస్తున్న యండమూరి భాస్కరరావు (54) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందా రని ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ ఆదివారం వెల్లడించారు. గ్యాస్ స్టవ్లు రిపేరు చేస్తూ జీవనం సాగిస్తున్న భాస్కరరావు ఈనెల 1 ఉద యం బయటకు వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వచ్చారు. కుమారుడు మణిబాబు తండ్రిని స్నానం చేసి లోపలికి రమ్మని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఎంత సేపటికీ రాకపోవడంతో బయటకు వెళ్లారులే అనుకుని రాత్రి 10 గంటల వరకు వేచి చూసి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయమైనా తండ్రి రాకపోవడంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వెతకసాగాడు. ఆచూకీ లభించకపోవడంతో అర్ధరాత్రి బావిలోకి మొబైల్ టా ర్చి లైటు వేసి చూడగా రెండు కాళ్లు తేలియాడటం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కేకలు వేయగా చుట్టుపక్కల వారొచ్చి భాస్కరరావును పైకి తీశారు. తన తండ్రి మేడపై నుంచి మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి ఉంటాడని మణిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో బీసీ ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరఫున పోరాడతామని రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆవుల నరసింహారావు అన్నారు. శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో ఆదివారం ఏపీ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర బీసీ ఉద్యోగుల సంఘ సమావేశం జరిగింది. బీ సీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లాన శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు అధికారం ఉంటేనే రిజర్వేషన్లు, పదోన్నతులు లభిస్తాయన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు, ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ బీసీలకు రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉందన్నారు. -
బస్ షెల్టర్ వద్ద మందుబాబుల వీరంగం
● బాటిళ్లు పగులగొట్టి పడేసిన వైనం ● ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు మెళియాపుట్టి: బస్ షెల్టర్ వద్ద మందుబాబుల ఆగ డాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. వికృత చేష్ట లు చేస్తూ.. తాగుబోతులు వీరంగం సృష్టిస్తున్నారు. పగలగొట్టిన మద్యం బాటిళ్లు, చెత్తాచెదారాలు వేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోతే ఇబ్బందులు తప్పవని ప్రయాణికులు చెబుతున్నారు. జాడుపల్లి గ్రామంలో మారడికోట పంచాయతీకి వెళ్లే పూల సారి రహదారి కూడలిలో ఓ బస్టాండ్ ఉంది. పలు గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే అక్కడే వేచి చూడాలి. కొత్త మారడికోట, పాతమారడికోట, ఎర్రమానుగూడ, సవర పోలూరు, నందలపాడు, పుస్తిలవార, సన్నిబంద, అచ్చనాపురం, రాజపురం, పూలసారి తదితర గ్రామాలకు వెళ్లడానికి అదే బస్ షెల్టర్లో ప్రయాణికులు రోజూ వేచి చూస్తుంటారు. ఆ రహదారిలో ఒక్క బస్ సర్వీస్ కూడా లేదు. ఆటోల్లో ప్రయాణించాల్సిందే. అదే బస్ షెల్టర్లో మందుబాబులు మద్యం సేవిస్తూ అక్కడే బాటిళ్లు పగలగొట్టి గాజుముక్కలు చెల్లాచెదురుగా పడేస్తున్నారు. దీంతో ప్రయాణికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి అసభ్య కార్యకలాపాలు నివారించకపోతే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఒక్కో రోజు సాయంత్రం వేళల్లో మా గ్రామానికి చేరుకోవాలంటే ఆటోలు రావడానికి చాలా సమయం పడుతుంది. అక్కడ బస్టాండ్లో వేచి చూడాల్సి వస్తుంది. మద్యం బాటిళ్లతో కొంతమంది బస్టాండ్కు వచ్చి కూర్చుంటే భయమేస్తోంది. తోడులేకుండా అక్కడ కూర్చోలేం. ఇలాంటివి జరగకుండా చూస్తే మంచిది. – సుభద్రమ్మ, మారడికోట గ్రామం పగలగొట్టిన మద్యం సీసాలు, తిని వదిలేసిన చిరుతిళ్లు ఇతర చెత్త చెదారాలతో బస్టాండ్ ఆవరణ నిండిపోయి ఉంటుంది. దుర్గంధానికి ఉండలేకపోతున్నాం. ఇక్కడ రోజూ ఇదే తంతు. మండుటెండలో కాసేపైనా విశ్రాంతి తీసుకుందామనుకున్నా ఇక్కడ ఉండలేకపోతున్నాం. – కనక మహాలక్ష్మి, సీడిపాలెం గ్రామం -
భర్త తీరుకు విసిగిపోయి..
● వివాహిత ఆత్మహత్య ● భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు జి.సిగడాం: మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన కిమిడి రాజేశ్వరి(27) భర్త వేధింపులు తట్టుకోలేక ఆదివారం 3 గంటల సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆనందపురం గ్రామానికి చెందిన కొంచాడ సూర్యారావు, యశోదల కుమార్తె రాజేశ్వరిని విశాఖపట్నంలో పోలీస్ బ్యారక్స్ ఎంటీ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న కిమిడి శ్యామలరావుకు ఇచ్చి 2019లో వివాహం చేశారు. శ్యామలరావు మద్యం, పేకాట, బెట్టింగ్ ఇతర వ్యసనాలకు బానిసై రాజేశ్వరి దగ్గర ఉన్న బంగారం తీసుకుని వేధించేవాడని కుటుంబ సభ్యులు తెలిపా రు. భర్త వేధింపులు తట్టుకోలేక రాజేశ్వరి గతనెల 26న వైజాగ్ నుంచి కన్నవారింటికి వచ్చింది. కానీ భర్త తీరుకు విసిగిపోయిన ఆమె ఈ నెల 2న భర్తకు ఫోన్ చేసి ‘నువ్వు వ్యసనాలు మానకపోతే చనిపో తాను’ అని చెప్పింది. శ్యామలరావు ‘చనిపోతే చనిపో..’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఆమె తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసు కుంది. ఈ దంపతులకు 18 నెలల బాబు, ఐదేళ్ల పాప ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కోరుకొండ రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. జేఆర్ పురం సీఐ అవతారం దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తే కారణమంటూ.. తన కుమార్తె రాజేశ్వరి మృతికి తన భర్త, అత్తమామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు యశోద, సూర్యారావు ఆరోపించారు. భర్త తీరుకు విసిగిపోయే ఆమె ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం సీఐ అవతారం, ఇన్చార్జి ఎస్ఐ కేఏ సూరి, ఏఎస్ఐ రామకృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాజేశ్వరి భర్త శ్యామలరావు,అత్త మామలు, చిన్నమ్మడు, తవిటినాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో రైలు కింద పడి ఇద్దరు మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జీఆర్పీ ఎస్ఐ జి.మదుసూధనరావు, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 12840 నంబరు గల చెన్నయ్–హౌరా రైలు వెళ్తుండగా పట్టణ శివార్లలో పాత గేటు వద్ద ట్రాక్పై ఆ రైలు కింద పడి ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి ఒకటోవార్డు తిమ్మాపురం గ్రామానికి చెందిన గేదెల జగన్నాథం (59) మృతిచెందారు. ఈయన భిక్షాటనం చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. రైలు నుంచి దిగుతూ.. శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం శివార్లలో వాస్కోడి గామా 18047 రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. కోల్కతా వెళ్లాల్సిన ఈ వ్యక్తి వాస్కోడి గామా రైలు ఎక్కి మళ్లీ దిగేందుకు ప్రయత్నించగా రైలు కింద పడి మృతిచెందినట్లు జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యక్తి సుమారు 48 ఏళ్ల వయస్సు కలిగి ఉంటాడని మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఆచూకీ తెలిసిన వారు శ్రీకాకుళం రోడ్ జీఆర్పీ సంప్రదించాలని వారు కోరారు. -
రిమ్స్లో అరకొర సేవలు
● జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న రిమ్స్లో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇబ్బందులు మొదలవుతున్నాయి. రిజిస్ట్రేషన్కు సెల్ఫోన్తప్పనిసరి చేయడంతో గ్రా మీణ ప్రాంత రోగులు ఇబ్బంది పడుతున్నారు. ● వైఎస్ జగన్ హయాంలో ఇక్కడ ఐదు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ప్రారంభించారు. ఆయా విభాగాల్లో నాడే వైద్యులను నియమించారు. ఇప్పుడు సదుపాయాలు కల్పించకపోవడంతో వారానికి రెండుసార్లే ఓపీ నిర్వహిస్తున్నారు. ● వైద్యులు రాసిన విధంగా రోగులకు సరిపడా మందులు ఇవ్వడం లేదు. 50 మందులు రాస్తే 20 మందులు ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి మిగతా మందుల కోసం మరోసారి వచ్చాక మళ్లీ ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకుని, వైద్యులతో చీటీ రాయించుకోవాలని పేచీ పెడుతున్నారు. ● మార్చురీ వద్ద అత్యంత దయనీయ పరిస్థితి ఉంది. పోస్టుమార్టం చేసే ఇద్దరు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఇటీవల తొలగించడంతో ప్రైవేటు వ్యక్తుల ద్వారా పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇలా వచ్చిన ప్రైవేటు వ్యక్తులు మృతుని బంధువుల నుంచి రూ.10వేల నుంచి రూ.15వేలు వసూలు చేస్తున్నా రు. డబ్బులు ఇవ్వకపోతే పోస్టుమార్టం జాప్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం చేసేందుకు 24గంటలకు పైనే సమయం పడు తుంది. వార్డుల్లో కూడా రోగుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ● 950 పడకల ఆస్పత్రికి రెండే అంబులెన్స్లు ఉన్నాయి. అవి సరిపోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అష్టకష్టాలు జిల్లాలో దయనీయ పరిస్థితులు రోగుల ఘోష వినని చంద్రబాబు ప్రభుత్వం మూలకు చేరిన ఆర్ఓ ప్లాంట్లు, ఆక్సిజన్ ప్లాంట్లు తాగునీటికి, నిలువ నీడకు అవస్థలే -
దేవునల్తాడలో మూడు రోజులుగా నో కరెంట్
వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడకు కరెంటు కష్టాలు వీడడం లేదు. గత మూడు రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని ఎంపీటీసీ సభ్యుడు సౌదాల వెంకన్న, మాజీ ఎంపీటీసీ గాలి షణ్ముఖరావు తెలిపారు. ఈదురు గాలులకు, వర్షానికి గ్రామం అంధకారంలోకి వెళ్లిపోయిందని, ఆదివారం సాయంత్రం వర కు గ్రామానికి విద్యుత్ సరఫరా లేకపోవడం బాధాకరమన్నారు. ఒకప్పుడు పూండి 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి ఫీడర్ సేవలు అందేవని, ప్రస్తుతం సంతబొమ్మాళి మండలం నౌపడ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవతుండడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నీట్’గా ముగిసింది శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో నీట్ యూజీ– 2026 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1951 మంది విద్యార్థులు పరీక్ష కు హాజరుకావాల్సి ఉండగా 97.59 శాతంతో 1904 మంది పరీక్ష రాశారు. 47 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, ఇతర జిల్లా అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉద్యానవన పంటల ప్రాజెక్టులకు రూ.వంద కోట్లు రాయితీ పలాస: ఉద్యానవన పంటల ప్రాజెక్టులకు గరిష్టంగా రూ.100కోట్లు రాయితీ ఇస్తున్నట్టు గుంటూరు ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ వై.విద్యాశంకర్ చెప్పారు. కాశీబుగ్గలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆదివారం వ్యాపారులకు, రైతులకు జీడి మామిడిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నుంచి 16 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లగా 13 ప్రాజెక్టులకు రూ.1890 కోట్లు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. అందులో మామిడి, ఖోఖో, అరటి, మునగ, మిరప, పసుపు ఉన్నాయన్నారు. పలాసలో 250 జీడి పరిశ్రమలు ఉన్నా జిల్లాలో జీడి పిక్కల సాగు 40శాతమేనని చెప్పారు. 60 శాతం పిక్కలు ఇతర దేశాలవేనని తెలిపారు. మెళియాపుట్టి: పెద్దమడిలో ఉన్న గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల (బాలుర)లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఒక్కో గూపులో 40సీట్లు ఉన్నాయని, చేరడానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సిలింగ్ నిమిత్తం ఈనెల 26న సీతంపేటలోని ఏపీటీడబ్ల్యూ జూనియర్ కళాశాలకు రావాలని తెలిపారు. -
కటకటాల వెనక్కి హంతకుడు
శ్రీకాకుళం క్రైమ్, కొత్తూరు : కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ గిరిజన తండా గ్రామమైన చినరాజపురంలో గిరిజన దంపతులను హత్య చేసిన సవర తోటయ్యను కొత్తూరు సీఐ చింతాడ ప్రసాద్, ఎస్ఐ కె.వెంకటేష్లు అరెస్టు చేశారు. వివరాలను సీఐ ప్రసాద్ ఆదివారం వెల్లడించారు. కుమార్తె అనారోగ్యమే కారణం.. సవర తోటయ్యకు భార్య, రెండేళ్ల కుమార్తె, ఏడాది బాబు ఉన్నారు. కుమార్తె గత కొంతకాలంగా అనా రోగ్యంగా ఉండటంతో ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిప్పినా ఫలితం కనబడలేదు. దీంతో సవర ఎల్లంగి, అతని భార్య గయానీ (జ్యోతి)లు చిల్లంగి పెట్టి ఉంటారనే అపోహతో ఉండేవాడు. పదిరోజుల కిందట ఇదే విషయమై ఎల్లంగితో గొడవ పడ్డాడు. ఈ పంచాయతీ పెద్దల వరకు వెళ్లింది కూడా. వారు మందలించడంతో మనసులో పెట్టుకున్న తోటయ్య ఎల్లంగిని చంపేస్తేనే తన కుమార్తె ఆరోగ్యంగా ఉంటుందని బలంగా నిశ్చయించుకున్నాడు. ఇలా చంపాడు.. గత నెల 28 వేకువజామున 3 గంటలకు లేచిన తోటయ్య గొడ్డలి పట్టుకుని ఎల్లంగి ఇంటికి 4 గంటలకు వెళ్లాడు. ఇంటిలో లేకపోవడంతో బయట సిమెంటు రోడ్డుపై నిద్రిస్తున్న ఎల్లంగి, గయానీ దంపతులను చూశాడు. అంతే గొడ్డలితో వరుస వేటు లతో ఎల్లంగిపై విరుచుకుపడ్డాడు. పక్కనే పడుకున్న గయానీ సైతం లేవడంతో ఆమైపెన గొడ్డలి వేటు వేశాడు. ఆమె కేకలు గట్టిగా వేయడంతో పక్క నే ఉన్న సిమెంటు రాయితో దాడి చేసి చంపేశాడు. కుమారుడు భయపడి.. ఎల్లంగి ఎదురుగా కొత్త ఇల్లు నిర్మిస్తున్న సవర సన్యాసి మేడ మీద ఎల్లంగి కుమారుడు పడుకు న్నాడు. తల్లిదండ్రుల కేకలు విని లేచి చూసేసరికి తోటయ్య ఇద్దరినీ హత్య చేస్తుండటం గమనించి వెళ్తే తనని కూడా చంపేస్తాడేమోనన్న భయంతో రేగులపాడులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లిపో యాడు. హత్యలు చేసిన తోటయ్య పారిపోయాడని, ఎల్లంగి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని, దానిలో భాగంగా ఆదివారం అరెస్టు చేశామని, సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీఐ అన్నారు. -
స్వాధీనం చేసుకున్నవి..
నిందితులైన సాహు, బిహారీ, బారిక్, తపన్ల నుంచి రూ. 31.50 లక్షల విలువైన 243 గ్రాముల బంగారు ఆభరణాలు, తిరుమల పాత్రో నుంచి రూ. 3.41 లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాహు నుంచి 9 ఎం.ఎం. పిస్టల్, కాట్రిడ్జ్ లు ఐదు, బారిక్ నుంచి 7.65 ఎం.ఎం. పిస్టల్, రెండు మ్యాగ్జీన్లు, 11 కాట్రిడ్జ్లు స్వాధీనం చేశా రు. 11 మొబై ళ్లు, ఒక మహేంద్ర నియోకార్తో పాటు బంగా రం అమ్మగా వచ్చిన సొమ్ముతో ఒడిశాలో కొన్న డస్టర్, ఎక్స్యూవీ, బొలేనో కారులను స్వాధీ నం చేసుకున్నామని, అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్పీ వెల్లడించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస గ్రామంలో జాతీ య రహదారిపై రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఐసర్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వృద్ధు డు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం తాళ్లవలస గ్రామానికి చెందిన మీసాల రామ్మూర్తి (91) తన పొలంలోకి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే గుర్తు తెలియని వాహ నం శనివారం మధ్యాహ్నం 1.30 సమయంలో ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. సంఘటనా స్థలానికి లావేరు ఎస్ఐ వెళ్లి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అనంతరం హైవేపై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించి ఐసర్ వ్యాన్గా గుర్తించారు. నరసన్నపేట సమీపంలో టోల్ప్లాజా వద్ద పశ్చిమ బెంగాల్కు చెందిన ఐసర్ వ్యానుగా గుర్తించి పట్టుకున్నారు. మృతుడికి భార్య నారాయణమ్మ, కుమార్తె ఈశ్వర మ్మ ఉన్నారు. ఈ ప్రమాదంపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ సరిహద్దుల్లో విధి నిర్వహణలో ఉన్న సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వీర్ పరివార్ సహాయత యోజన–2025’ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.హరిబాబు తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలోని లీగల్ సర్వీస్ అథారిటీ చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సైనిక కుటుంబాలకు ఎదురయ్యే ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర న్యాయపరమైన చిక్కులను ఈ పథకం ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. జిల్లా, రాష్ట్ర జాతీయ సైనిక సంక్షేమ బోర్డుల సమన్వయంతో ఈ పథకం పనిచేస్తుందని, ఇందులో అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయవాదులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉండి తగిన న్యాయ సలహాలు అందిస్తారని ఆయన వివరించారు. -
పరిశ్రమే మిగులుతోంది
కంచిలి: ఉత్తరాంధ్రలోనే పేరొందిన కంచిలి కొబ్బరి మార్కెట్ అన్ని విధాలుగా కళావిహీనమవుతోంది. ఇక్కడి వ్యాపార సంస్థలు రోజురోజుకూ తగ్గుతున్నా యి. ఫలితంగా మార్కెట్ లావాదేవీలపై ఆధారపడిన వ్యాపారులు, కార్మికులు, రైతులు అంతా నష్టపోతున్నారు. జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి కాయలతో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా విలసిల్లేవి. కొబ్బరి కాయలతోపాటు కాయ ల నుంచి తొలగించే తొక్కతో పీచు పరిశ్రమలు, చెట్టు నుంచి రాలిపోయే కొమ్మల నుంచి ఆకుల మధ్యలో ఉండే ఈనెలు వేరు చేసి లాభాలు ఆర్జించే వారు. ప్రస్తుతం కొబ్బరికి ప్రకృతి విపత్తులు, చీడపీడల వ్యాపించడంతో ఉత్పత్తులు గణనీయంగా తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో నాణ్యత లోపించిన ఉత్పత్తులతో రైతులు తల్లడిల్లుతున్నారు. తాజాగా కొబ్బరితోపాటు దానికి అనుబంధంగా ఉన్న అన్ని పరిశ్ర మలు ఈ ప్రాంతంలో ఒక్కొక్కటిగా మూతబడుతు న్నాయి. కొబ్బరి ఈనెల వ్యాపారం కూడా మూతబడుతున్న జాబితాలో చేరింది. ఉద్దానంతోపాటు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఈనెలను కంచిలి మార్కెట్కు తరలించేవారు. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలతోపాటు పాకిస్థాన్కు సైతం ఇక్క డ కొబ్బరి ఈనెల చీపుళ్లను ఎగుమతి చేసేవారు. ఇక్కడ రైతుల నుంచి కొబ్బరి ఈనెలను కొనుగో లు చేసి, వాటిని మళ్లీ ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం సరిచేసి, ప్యాకింగ్ చేసి ఎగుమతులు చేస్తుంటారు. ప్రస్తుతం రైతుల నుంచి కొబ్బరి ఈనెలను రూ.52 నుంచి రూ.55 వరకు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇక్కడ కంచిలి మార్కెట్లో గల 15 వ్యాపార సంస్థల నుంచి ప్రతి నెలకు 25 వరకు లారీల లోడ్లు ఎగుమతులు అయ్యేవి. కొన్నేళ్లుగా మన దేశానికి ఇండోనేషియా దేశం నుంచి పెద్ద ఎత్తున కొబ్బరి ఈనెలు దిగుమతి అవుతున్నాయి. ఇవి చూసేందుకు ఇంపుగా ఉండడంతో పాటు తక్కువ ధరకు లభ్యం కావడంతో మార్కెట్ అంతా అటువైపు మళ్లింది. ఇండియాతోపాటు పాకిస్తాన్ తదితర దేశాలకు కూడా ఇండోనేషియా మార్కెట్ నుంచే సరుకు రవాణా అవుతోంది. దీంతో ఇండియన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో గల కొబ్బరి ఈనెల పరిశ్రమకు గట్టి దెబ్బ తగిలింది. కేవలం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో సరకు రవాణా చేసే కంచిలి మార్కెట్ నుంచి ప్రస్తుతం నెలకు 5 నుంచి 6 లోడ్లు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. ఇలా ఎగుమతులు దిగజారిపోవడంతో ఈ వ్యాపా రంపై ఆధార పడిన వారంతా నష్టపోతున్నారు. సరుకు ఉత్పత్తి చేసిన రైతుల వద్ద నుంచి తోటల్లో ఆకుల నుంచి ఈనెల్ని వేరు చేసే కూలీలు, వ్యాపారులు, వ్యాపార సంస్థలో వాటిని సరిచేసి, ప్యాకింగ్ చేసే కూలీలు, వాటి ప్యాకింగ్కు ఉపయోగించే గోనెల వ్యాపారులు, ట్రాన్స్పోర్టు వాహనాల యజమానులు, వాటి కూలీలు ఇలా అంతా పనుల్లేక రోడ్డున పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కొబ్బరి ఈనెలను ప్రాసెస్ చేస్తున్న మహిళా కూలీలు -
డెకాయిట్లు కేరాఫ్ ఒడిశా, యూపీ
● వీడిన కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యుయలరీ షాపు దొంగతనం కేసు ● పట్టుబడిన ఒడిశా డెకాయిట్లు ●ప్లాన్ చేసిన యూపీ గ్యాంగ్ కోసం గాలింపు ● 243 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశా డెకాయిట్లకు యూపీ దొంగలు జత కలి శారు. పక్కాగా స్కెచ్ వేసి, ఆపై రెక్కీ చేసి బంగా రం కొల్లగొట్టారు. గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్ కాలనీలో మారుమూలనున్న శ్రీవేంకటేశ్వర జ్యూయలర్స్ దుకాణంలోకి పట్టపగలు చొరబడి దోపిడీకి ఎగబడ్డారు. చోరీకి ఎగబడిన వారిలో ఒడిశాకు చెందిన డెకాయిట్లు ఐదుగురు కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో కేసు మిస్టరీ వీడింది. కేసుకు సంబంధించిన వివరాలను శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. గత నెల 7న కాశీబుగ్గ నిత్యానందనగర్లో శ్రీవెంకటేశ్వర జ్యూయలర్స్లో పట్టపగలు పోలీసు అధికారులమని లోపలకు ప్రవేశించి యజమాని చేతులకు బేడీలు వేసి 800 గ్రాముల బంగారు ఆభరణాలు, కొంత నగదు దోచేసి ఉడాయించిన సంగతి తెలిసిందే. దీనిపై యజమాని కిల్లంశెట్టి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ దర్యాప్తులో 4 బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు ఉపయోగించిన వాహనాల వివరాలు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ముందుగా కారును ట్రేస్ చేసిన పోలీసులు క్రయ విక్రయాలు, ఆధార్, మొబైల్ నంబర్లు సేకరించి మిగతా నిందితుల ఫోన్ నంబర్లు గుర్తించి కేసును ఛేదించారు. ఒడిశా నుంచి వలస వచ్చి.. ఒడిశాలోని అస్కాలో గోల్డ్షాపు రన్ చేసిన పొట్నూ రు తిరుమల పాత్రో (56) వ్యాపారం సరిగా సాగక నాలుగేళ్ల క్రితమే కాశీబుగ్గ చేరి జీడిపప్పు క్రయవిక్రయాలు జరుపుతూ స్థానికులతో నమ్మకంగా మెలిగాడు. దొంగలు తెచ్చే బంగారాన్ని కాశీబుగ్గలోని వివిధ నగల దుకాణాలకు అమ్ముతూ ఆ సొమ్మును దొంగలకు చేరుస్తూ కొంత భాగం తాను ఉంచుకుంటూ పబ్బం గడుపుతుండేవాడు. ఇక్కడి షాపుల వివరాలు డెకాయిట్లకు చెబుతుండేవాడు. దీనిలో భాగంగా రామకృష్ణ షాపుపైనా కన్నేసి పథకం రచించి తోటి సహచరులతో రెక్కీ చేయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం.. ఒడిశా గంజాం జిల్లాకు చెందిన కూన బారిక్ (36), రామచంద్రసాహు, మరికొందరితో గత ఏడాది డిసెంబరు 25న, ఈ ఏడాది మార్చి 22, 24 తేదీల్లో తిరుమల పాత్రో రెక్కీ చేశాడు. నిందితులు గత నెల 5న భువనేశ్వర్ నుంచి బయల్దేరి మహేంద్రగిరి చేరి అక్కడ రాత్రి బస చేశారు. 6న ఉదయం బయల్దేరి కేదారిపురం వద్దకు 3 ద్విచక్రవాహనాలు, ఓ నల్లని కారులో చేరారు. కారును కేదారిపురం సమీప లేఅవుట్లో పార్కింగ్ చేసి బైక్లపై కాశీ బుగ్గ పట్టణానికి ఉదయమే చేరినా షాపు త్వరగా మూసేయడంతో వెనుదిరిగారు. 7న అదే మార్గంలో వచ్చి పక్కా గా ప్లాన్ను అమలు చేసి ఉడాయించేశారు. అయితే ఏడుగురు నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారని, యూపీ గ్యాంగు కూడా వెనకుండటంతో వారు ఎ లా ఎస్కేప్ అయ్యారు. ఎవరికి బంగారాన్ని చేర్చా రన్నదీ ఇంకా తెలియాల్సి ఉందని ఎస్పీ అన్నారు. అందరూ డెకాయిట్లే.. ఒడిశా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దోపిడీ నేరాలకు పాల్పడిన అనుభవమున్న వీరందరిపై 32 కేసులున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిలో రామచంద్రసాహు, బనోజ్ బిహారీ పట్నాయిక్ లపై చెరో 6 డెకాయిట్ కేసులుండగా పోలీసుల నుంచి తప్పించుకునే సందర్భంలో ఇరువురూ ఫైరింగ్ చేసిన ఘనత కూడా ఉంది. అత్యధికంగా కూన బారిక్పై 14 డెకాయిట్, 8 చోరీ కేసులుండగా, తపన్ మహరాణాపై ఒక డెకాయిట్, ఒక హర్ట్ కేసు ఉంది. కాశీబుగ్గలో పాతుకుపోయిన పాత్రోపై 4 డెకాయిట్ కేసులుండటం గమనార్హం. -
రాజకీయ కక్షతో పింఛన్ల నిలిపివేత
పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్షతో అర్హులైన వారి పింఛన్లను నిలుపుద ల చేశారు. అధికారుల నిర్లక్ష్యానికి ఏడుగురు లబ్ధి దారులు తమ పింఛన్లు కోల్పోయారు. శనివారంతో మూడు నెలలు గడువు ముగియడంతో బాధిత పింఛన్దారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయం వద్ద పడిగాపులు కాశారు. ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు పంచాయతీ కార్యదర్శిని, ఎంపీడీఓను పలుమార్లు కలిసినప్పటికీ పింఛన్లు పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీఓకు ఫోన్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేదని, కనీసం ఫోన్ లిఫ్ట్ కూడా చేయలేదని బాధితులు తమ గోడు వినిపించుకున్నారు. దీంతో సచివాలయం వద్దే తమ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి విచారణ జరుపకుండానే తమ పింఛన్లను నిలుపుదల చేశారని వాపోతున్నారు. ఇదే విషయంపై వివరణ కోరేందుకు ఎంపీడీఓకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. -
భార్యపై దాడి.. ఆపై ఆత్మహత్యాయత్నం
టెక్కలి రూరల్: స్థానిక ఆది ఆంధ్ర వీధికి చెందిన డి.రామకృష్ణ అనే వ్యక్తి తన భార్యపై దాడి చేసి.. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రామకృష్ణ తన భార్య కృష్ణవేణి తాను చెప్పిన మాట వినలేదనే కోపంతో దాడి చేశాడు. అనంతరం తాను సైతం తన చేతిలో ఉన్న పదునైన కత్తిలో తన పీకను తానే కోసుకున్నాడు. దీంతో రక్తస్రావమైంది. గుర్తించిన స్థానికులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు భార్యాభర్తలు ఇరువురికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వివరాలు సేకరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బెజ్జిపురం జంక్షన్ ఎన్హెచ్–16పై గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కెల్ల వెంకటేష్ అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం నుంచి రణస్థలం వైపు వెళ్తున్న లగేజీ వ్యాన్ రోడ్డు పక్కన నిలిపి ఉంది. అదే సమయంలో వెనక వైపు నుంచి ద్విచక్ర వాహనంతో వచ్చిన వెంకటేష్ ఢీకొట్టాడు. దీంతో ఆ యువకుడు తల, కుడి చేయి, ఎడమ కాలికు బలమైన దెబ్బలు తగిలాయి. 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుడు పొందూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందినవాడు. దీనిపై లావేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తీరప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాం
సోంపేట: జిల్లాలోని తీరప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మండలంలోని ఎర్రముక్కాం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్తో కలిసి మత్స్య సాగరమాల ప్రాజెక్టు ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీరప్రాంత రోడ్ల అభివృద్ధి, 1,594 సోలార్ లైట్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. అనంతరం ఎకువూరు గ్రామంలో రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. వారితో పాటు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు ఉన్నారు. -
మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
పాతపట్నం: మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, రైతుల కష్టాలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీసీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. మండలంలోని కాగువాడ, కొరసవాడ గ్రామాల్లో రహదారి పక్కన అకాల వర్షానికి తడిచిపోయిన మొక్కజొన్న పంటను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో తడిచిన మొక్కజొన్న కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఆమెతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఆర్టీఐ నియోజకవర్గ అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, జిల్లా సహాయ కార్యదర్శి అమర రమణ, మండల కో–ఆప్షన్ సభ్యుడు మాధవ్ పుల్లాయ్, గణపతి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీ.. భవితకు గ్యారెంటీ..!
● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ● ఈనెల 30వ తేదీ వరకు గడువు ఎచ్చెర్ల: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది. పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం విద్యాసంస్థలో సుమారు 1,100 సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. ట్రిపుల్ ఐటీలో సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఆరేళ్లు కాగా.. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్ల ఇంజినీరింగ్లో చేరుతారు. నూతన విద్యా విధానం–2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజినీరింగ్ సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజినీరింగ్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంతో పాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరణ 2026–27 విద్యా సంవత్సరానికి గానూ రాజీవ్గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ అడ్మిషన్లు చైర్మన్, యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్ డా.అమరేంద్రకుమార్ చండ్రా ఈ షెడ్యూల్ను విడుదల చేశారు. ప్రవేశాల షెడ్యూల్ ఇలా.. దరఖాస్తులను మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నారు. జూన్ 12వ తేదీన ఎంపిక జాబితాను విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమైనప్పటికీ.. ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జూలై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో కలిసి చదువుకొనసాగించేలా ఈ మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో మంచి భవిష్యత్ ఉంటుంది. ఆసక్తి కలిగిన ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు నిర్ణీత గడువులో ఆర్జీయూకేటీ వెబ్సైట్, ఏపీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రిలీవ్ నాటికి మంచి ప్లేస్మెంట్ ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువ ప్రవేశాలు లభిస్తున్నాయి. – అమరేంద్రకుమార్, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, శ్రీకాకుళం -
అంగన్వేడి..!
హిరమండలం: రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. వేసవి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బకు భయపడి జనసంచారం లేక రోడ్లు కళాహీనంగా మారుతున్నాయి. దీనినుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో విద్యా సంస్థలకు గత నెల 24 నుంచి సెలవులు ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకొచ్చే సరికి చిన్నారుకు మాత్రం సెలవులు ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది. ఎండలకు చిన్నారుల ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. భానుడు భగభగ మండిపోతుంటే ఎండలకు చిన్నారులు ఎలా వస్తారనే కనీసం ఇంగిత జ్ఞానం లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటికే పక్కరాష్ట్రం తెలంగాణలో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులిచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం వేసవి సెలవులు ప్రకటించాలన్న ఆలోచన రాకపోవడం గమనార్హం. జిల్లాలో పరిస్థితి గమనిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 16 ఉన్నాయి. వీటి కింద 3,395 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో సంరక్షణ పొందుతున్న వారికి పౌష్టికాహారం అందించి, ఆటపాటలు, అక్షరాలు నేర్పించడం కార్యకర్తల విధులు. ఏడాది పొడువునా కేంద్రాల్లో చిన్నారులకు ఇదే పద్ధతి కొనసాగుతుంది. అయితే వేసవి సమీపించడంతో రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కానీ అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయలేదు. దీంతో ఎండలకు చిన్నారును పంపించేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. మండుతున్న ఎండలకు పెద్దలే గడప దాటి కాలు బయటికి పెట్టడానికి భయపడుతుంటే.. పిల్లలను ఎలా పంపిస్తామని ప్రశ్నిస్తున్నారు. కొందరు చిన్నారులు కేంద్రాలకు వస్తున్నా అక్కడ వారికి గాలి లేకపోవడంతో ఉక్కపోతకు విలవిలలాడిపోతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలు తంటాలు పడుతున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెబుతున్న ప్రభుత్వం.. వారికి సౌకర్యాలు అందించడంలో విఫలం అవుతోందని వాపోతున్నారు. మే 1వ తేదీ నుంచి అంగన్వాడీ ఆయాలకు, మే 15 నుంచి కార్యకర్తలకు సెలవులు ప్రకటించినట్లు సమాచారం. యూనియన్ నేతల మండిపాటు ఎన్నికల సమయంలో వివిధ హామీలను ప్రకటించారని, కానీ ఒక్కటీ నెరవేర్చకపోగా తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంతవరకు సమంజసమని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఎండలకు లెక్క చేయకుండా ఒక వైపు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వానికి జాలి, దయ లేదని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నా కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. వేసవి కారణంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా ఎండలు కాసే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పాఠశాలలు, కళాశాలలు మాదిరిగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి. – సిర్ల ప్రసాద్, సీఐటీయూ నాయకుడు పెద్దలోగిడి అంగన్వాడీ కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులు అంగన్వాడీల్లో వేసవి తీవ్రతతో చిన్నారుల విలవిల తగ్గుతున్న హాజరు శాతం సెలవులు ప్రకటించని ప్రభుత్వం -
విక్రమార్కుడిలా పోరాడు..
తల్లిదండ్రులు అక్కున చేర్చుకోవాలి.. ఫలితాలు విడుదలైన ఎలాంటి సమయంలోనైనా సరే తల్లిదండ్రుల పాత్రే కీలకం. ఫెయిలైన విద్యార్థులను, అనుకున్న మార్కులు సాధించలేకపోయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు అక్కున చేర్చుకోవాలి. మానసికంగా వారిని ధృడంగా చేసి.. వారికి తామంతా అండగా ఉన్నామనే విషయాన్ని నేరుగా మాటల రూపంలో వారికి తెలియజేయాలి. వీలైతే బయటకు తీసుకెళ్లాలి. ఆందోళనను తగ్గించేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. – జీఆర్ మల్లికార్జునరావు, మానసిక వైద్య నిపుణుడు, శ్రీకాకుళం శ్రీకాకుళం న్యూకాలనీ: వాడి కంటే నీకు తక్కువ మార్కులు వచ్చాయి... అందరూ పాసయ్యారు.. నువ్వు తప్ప.. ఇప్పుడే తప్పితే ఇంకేమీ లేదు.. ఫలితాలు వచ్చిన వెంటనే చాలా ఇళ్లలో వినిపించే మాటలివే. టెన్త్, ఇంటర్ ఫలితాలు వెలువడడంతో ఈ మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కానీ నిపుణులు మాట మరోలా ఉంది. టెన్త్లో ఫెయిలైన వారు, తక్కువ మార్కులు తెచ్చుకున్న వారిలో చాలా మంది తమ తోటి వారి కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారని వారు చెబుతున్నారు. పది పరీక్షలతోనే జీవితం ఆగిపోదని, తక్కువ మార్కులే వచ్చినా, ఉత్తీర్ణత సాధించకపోయినా ఆపై తరగతుల్లో పోరాడి విజయం సాధించిన వారు ఎందరో ఉన్నారని అంటున్నారు. జిల్లాలో చాలా మంది విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించారు. మరికొంతమంది బాగా రాసినప్పటికీ.. ఆశించిన స్థాయిలో మార్కులు స్కోర్ చేయలేకపోయారు. ఇంకొంతమంది వివిధ కారణాలు, అనారోగ్య కారణాలు, ప్రమాదాలు, తప్పిదాలు ఇతరత్రాదురదృష్టకరమైన కారణాలతో ఫెయి లయ్యారు. అయితే ఫెయిలైన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. పరీక్ష ఫీజులను వారి వారి పాఠశాలల్లోనే చెల్లించేలా చర్యలుతీసుకుంది. అలాగే తాము సాధిం చిన మార్కులపై సందేహాలు ఉన్న విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 11 వరకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మార్కులే కొలమానం కాదు.. ● జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వారి మార్కులే కొలమానం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితాల్లో ఆశించిన మార్కులు రానంతమాత్రాన, దురదృష్టవశాత్తు ఉత్తీర్ణత సాధించలేనంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ● ఈ రోజు ఉన్నత స్థానాల్లో నిలదొక్కుకున్నవారంతా గతంలో వారి చదువుల్లో ఫెయిలైనవారేనని, జీవితాల్లో జీరో నుంచే మొదలుపెట్టారనే విషయాన్ని మరువరాదని అంటున్నారు. ● మార్కులు, ఫెయిలైనంతమాత్రాన క్షణికావేశాలకు పోవడం, తొందరపాటు నిర్ణయాలకు పోవడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపక్రమించరాదనే విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. ● ఓటమే గెలుపునకు నాంది అనే విషయాన్ని మర్చిపోవద్దని విద్యావేత్తలు అంటున్నారు. ● ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇలాంటి సమయంలో కీలకంగా ఉండాలని, లేనిపోని సూటిపోటి మాటలకు పోవద్దని విద్యావేత్తలు చెబుతున్నారు. తక్కువ మార్కులు వస్తే తెలివి లేనట్టు కాదు ఉత్తీర్ణత సాధించకపోతే జీవితం ఆగిపోదు పరీక్షల్లో ఫెయిలైనా జీవితంలో విజయవంతమైన వారెందరో.. తల్లిదండ్రులూ పిల్లల బాధ్యత మీదేనంటున్న నిపుణులు విద్యార్థులకు మార్కులే జీవితం కాదు. మేము చదువుకునే రోజుల్లో టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణత సాధించడమే గగనం. అలాంటిది ఈరోజు ప్రిన్సిపాల్ స్థాయిలో ఉన్నామంటే క్రమేపీ మమ్మల్ని మేం మార్చుకుని, పోటీ ప్రపంచానికి అనుగుణంగా తయారయ్యాం. అంతే తప్ప.. టెన్త్, ఇంటర్, పోటీ పరీక్షల్లో ఎక్కడా కుంగిపోలేదు. అసలు మార్కులే జీవితం కాదు. చదువుకు మార్కులు కొలమానం కానేకాదు. విద్యార్థులు తమ టాలెంట్ను గుర్తించి, వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బట్టి ముందుకు నడుచుకోవాలి. అందులో ఉన్నతస్థాయిలో రాణించేలా ప్రయత్నం మొదలుపెట్టాలి. – డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ప్రిన్సిపాల్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం -
పదిలమైన విజయాలకు.. ఫలితాలే సాక్షి
కవిటి: ప్రభుత్వ పాఠశాలలో చదివిన పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన సాక్షి మెటీరియల్ బాసటగా నిలిచింది. గణితం, సైన్స్ సబ్జెక్టులపై నిపుణులు ఆధ్వర్యంలో రూపొందించిన మెటీరియల్ను ఎంపిక చేసిన పాఠశాలలకు ఉచితంగా అందజేసిన సంగతి తెలిసిందే. దీనికితోడు ప్రతిరోజూ సాక్షి దినపత్రికలోనూ సబ్జెక్టుల వారీగా పాఠాలు ప్రచురితమయ్యాయి. ఈ ఏడాది సాక్షి స్టడీ మెటీరియల్ అందుకున్న పలు పాఠశాలలు మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదుచేశాయి. కవిటి మండలం బొరివంక ఉన్నత పాఠశాల 95 శాతం, రాజపురం ఏపీ మోడల్ స్కూల్ 95 శాతం, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 90 శాతం ఉత్తీర్ణత సాధించాయి. బొరివంక ఉన్నత పాఠశాలలో 26 మంది 550కు పైగా మార్కులు సాధించడం విశేషం. 51 మంది 500 మార్కులకు పైబడి తెచ్చుకున్నారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని బాలక కాత్యాయని వరప్రసన్నకుమారి 591 మార్కులతో మండల టాపర్గా నిలవడం విశేషం. ఏపీ మోడల్ స్కూల్లో అంచనాలకు మించి 95 శాతం ఉత్తీర్ణత సాధించడం వెనుక సాక్షి స్టడీ మెటీరియల్ సహకారం ఎంతగానో ఉందని మోడల్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది వివరించారు. ఉపాధ్యాయుల కృషి తోడు సాక్షి మెటీరియల్లో ప్రచురితమైన కంటెంట్, సులభమైన వివరణలు వల్ల పరీక్షలపై భయం పోయి ఉత్తమ మార్కులు సాధించగలిగామని పలువురు విజేతలు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. సాక్షి మీడియా ఇటీవల పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ టెన్త్క్లాస్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు బాగా సహకరించింది. వీటిని భద్రపర్చుకుంటే అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా వినియోగపడుతుంది. టీచర్ల సహకారం, సాక్షి మెటీరియల్తో ఉత్తమ మార్కులు సాధించగలిగాను. – ఎం.ప్రేమ్కుమార్, 563 మార్కులు, ఏపీమోడల్ స్కూల్, రాజపురం పదో తరగతిలో 591 మార్కులు సాధించి మండలం టాపర్గా నిలవడానికి సాక్షి స్టడీ మెటీరియల్ ఎంతగానో దోహదపడింది. నాలాంటి ఎందరో విద్యార్థులు అద్భుతమైన ఫలితాల సాధించడం వెనుక ఉపాధ్యాయులతో పాటు సాక్షి మెటీరియల్ సహకారం ఎంతగానో ఉంది. – బాలక కాత్యాయని వరప్రసన్నకుమారి, 591 మార్కులు, కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సరైన సమయంలో సాక్షిమీడియా స్టడీ మెటిరియల్ పంపిణీ చేసింది. ఉత్తమ మార్కుల సాధన చేసేలా ప్రేరణ కలిగించింది. టెక్స్బుక్స్, నోట్స్ పట్టుకుని కుస్తీ పట్టే పనిలేకుండా సులభంగా, సమగ్ర సమాచారంతో అన్ని విభాగాల్ని కవర్ చేస్తూ ప్రచురించిన స్టడీ మెటీరియల్తో 568 మార్కులు సాధించగలిగాను. – మార్పు సమీక్ష, 568 మార్కులు, బొరివంక ఉన్నత పాఠశాల సాక్షి మీడియా పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ పరీక్షల ఒత్తిడిలో సతమతమవుతున్న మాలో సరికొత్త ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ఉపాధ్యాయుల కృషికి తోడు అన్ని అంశాల్ని క్రోడీకరిస్తూ సిద్ధం చేసి ఇచ్చిన మెటీరియల్తో ఉత్తీర్ణత శాతం పెరిగింది. – బి.చందన, 534 మార్కులు, రాజపురం మోడల్ స్కూల్ మెరుగైన ఉత్తీర్ణత సాధించిన సర్కారు బడులు సాక్షి మెటీరియల్ సహకారం మరువలేమంటున్న విజేతలు ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు -
బీసీ రిజర్వేషన్లపై బహిరంగ విచారణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బహిరంగ విచారణ నిర్వహించింది. కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించడంతో పాటు, వివిధ కుల సంఘాల ప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి నుంచి గత ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ స్థానాల వివరాలు, వాటిలో బీసీలకు కేటాయించిన సీట్లు, వాస్తవంగా గెలుపొందిన బీసీ అభ్యర్థుల సంఖ్య తదితర నివేదికలను కోరారు. జిల్లా పరిషత్ సీఈఓ నుంచి జెడ్పీటీసీ స్థానాల వివరాలు, మున్సిపల్ కమిషనర్ల నుంచి పట్టణ ప్రాంతాల్లో బీసీ అభ్యర్థుల గెలుపు శాతాలను అడిగి తెలుసుకున్నారు. బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులను అంచనా వేసేందుకు వీలుగా హౌసింగ్ తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను కూడా కోరారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల ప్రతినిధులు కమిషన్ చైర్మన్ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. -
తొమ్మిదో రోజూ కొనసాగిన విచారణ
టెక్కలి : కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసుల విచారణ శుక్రవారం 9వ రోజు కూడా కొనసాగింది. వైఎస్సార్సీపీ నాయకులు కర్నిక జీవన్, బోనెల ఎల్లయ్య తదితరులను పోలీసులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో పింఛన్లు అందజేత సంతబొమ్మాళి: ఉమిలాడ పంచాయతీలో కూటమి నాయకుల కుట్రతో నిలిపివేసిన వితంతు పింఛన్లను హైకోర్టు ఆదేశాలతో శుక్రవారం అందజేశారు. వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నారని ఉమిలాడ పంచాయతీకి చెందిన మెట్ట ఆదిలక్ష్మి, లండ వెంకటమ్మ వితంతు పింఛన్లను గత ఏడాది జూలైలో నిలిపివేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయినా న్యాయం జరగకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఇద్దరు వితంతువులకు పింఛన్లను వైఎస్సార్ సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కెళ్లి జగన్నాయకులు (గోవింద) చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మేరుగు రాజేశ్వరి, వైఎస్సార్సీపీ నాయకులు మేరుగు అప్పారావు, హనుమంతు అప్పలనాయుడు, ముగి చిరంజీవి, మేరుగు కాంతారావు, మైలపల్లి ఓంకార్, కారి గణపతిరావు, సీకిటి సత్యం, ఏరిపల్లి లక్ష్మణరావు, మేరుగు సత్యం పాల్గొన్నారు. ‘ప్రశ్నించే అక్షరం’ పుస్తకావిష్కరణ శ్రీకాకుళం: సాంస్కృతిక విలువలు కలిగిన విద్యారంగాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోంలో పీఎస్ నాగరాజు రచించిన ‘ప్రశ్నించే అక్షరం’ పుస్తకావిష్కరణ సభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే అక్షరం వ్యాస సంకలనం ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చదవాలన్నారు. ఇప్పుడున్న పతన విలువల విద్యారంగాన్ని అర్థం చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమ లరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి కె.భానుమూర్తి, రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి, పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యాయ సంపాదకులు ఎస్.వి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదుకోండయ్యా..!
● చిన్నారి వైద్యానికి సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు రణస్థలం: మండలంలోని జీరుపాలేం గ్రామానికి చెందిన దుమ్ము దుర్గారావు, సుమలత దంపతుల కుమార్తె లోయిస్కు అనుకోని ఆపద వచ్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు పాప పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మూడేళ్ల లోయిస్ బుధవారం ఇంటి డాబాపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే పాప పరిస్థితి విషమంగా మారడంతో శ్రీకాకుళంలోని పలు ఆస్పత్రులకు తిప్పారు. చివరగా ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప తల లోపల రక్తస్రావమై నరం కట్ కావడంతో ఆపరేషన్ చేయాల్సి ఉందని, సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. తల భాగంలో ఈ చికిత్సకు ఆరోగ్య శ్రీ లేదని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తండ్రి దుర్గారావుకు చేపల వేటే ఆధారం. ఖాళీ సమయంలో ఆటో డ్రైవర్గా వెళ్తుంటాడు. ఆర్థికంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్న వీరు దాతల సాయం కోరుతున్నారు. దాతలు 96523 66174 నంబర్కు ఫోన్చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. -
పోలీసు గ్రీవెన్స్కు స్పందన
శ్రీకాకుళం క్రైమ్: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఎస్పీ(పోలీసు గ్రీవెన్స్)’ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు పోలీసు సిబ్బంది స్పందించారు. తమ ఉద్యోగ, వ్యక్తిగత సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లు, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా ఎస్పీకి తెలియజేశారు. సిబ్బంది నుంచి వచ్చిన వినతులను శ్రద్ధగా విన్న ఆయన పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఎటువంటి సమస్యలున్నా 63099 90800 నంబర్ను సంప్రదించాలని సూచించారు. సారవకోట వాసికి దాసరి లెజండరీ ఫిల్మ్ అవార్డు సారవకోట: మండలంలోని సారవకోట గ్రామానికి చెందిన జోస్యుల విజయమిత్ర దాసరి నారాయణరావు లెజండరీ ఫిల్మ్ అవార్డును శుక్రవారం హైదారాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో అందుకున్నారు. ఈయన గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన 100 డేస్ లవ్స్టోరీ సినిమాకు గాను నూతన ఉత్తమ దర్శకుడిగా దాసరి లెజండరీ అవార్డును దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో సుమన్ చేతులమీదుగా అందజేశారు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. అవలింగికి చెందిన మహిళే దొంగ..? సారవకోట: మండలంలో వరుసగా జరిగిన మూడు దొంగతనాల్లో అవలింగి గ్రామానికి చెందిన ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. గత నెల 23న అవలింగి గ్రామానికి చెందిన ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో 23 తులాల బంగారం, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైంది. అలాగే బైదాలాపురం గ్రామంలో ఈనెల 20న ఆ గ్రామానికి చెందిన యాళ్ల రాము ఇంట్లో రాత్రి పడుకున్న సమయంలో తల్లికూతుళ్ల మెడలో ఉన్న 7 తులాల బంగారం పుస్తెలతాడ్లు తెంచుకుని పోయారు. అవలింగి గ్రామంలో ఈనెల 26న దుంగ లక్ష్మీనారాయణమ్మ రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడు తెంచుకునిపోయారు. ఈ మూడు దొంగతనాలు అవలింగి గ్రామానికి చెందిన మహిళ విశాఖపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 26న దుంగ నారాయణమ్మ మెడలో ఉన్న పుస్తెలతాడు తెంచుకుని వెళ్లిపోయే సమయంలో పుస్తెలతాడులో ఉన్న కాసు, తాడు కోయడానికి వినియోగించిన చాకు కింద పడిపోవడంతో స్థానికులు వాటిని పోలీసులకు అందజేశారు. దాని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ గ్రామానికి చెందిన మహిళగా నిర్ధారించారు. ఆమెకు సాయం చేసిన మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దొంగలించిన సొత్తు వేర్వేరు ఫైనాన్స్ కంపెనీల్లో తనఖా పెట్టి బెట్టింగ్లు ఆడినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. వర్షాలతో గుబులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వాతావరణం కొంత చల్లబడినా రైతులకు మాత్రం ఇబ్బందిగా మారింది. గాలుల ధాటికి అరటి, మామిడి వంటి పంటలకు నష్టం వాటిల్లింది. రాగులు, జొన్నపంటలు దెబ్బతిన్నాయి. ఉపాధి వేతనదారు మృతిఆమదాలవలస: సరుబుజ్జలి మండలం పాలవలస గ్రామానికి చెందిన లండ జోగమ్మ(48) శుక్రవారం మర్రికర్ర చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా కుప్పకూలి మృతిచెందినట్లు సర్పంచ్ మోహన్రావు తెలిపారు. మధ్యాహ్నం గాలులు వీస్తున్న సమయంలో చెరువు గట్టు ఎక్కుతుండగా కుప్పకూలిపోవడంతో సహచరులు వెంటనే ఆటోలో ఆమదాలవలస ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. జోగమ్మకు భర్త ఉన్నారు. -
సమస్యలతో సావాసం
వణికించిన వాన● పునరావాసం● కదం తొక్కిన కార్మికులు జిల్లాలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం ఎడతెరిపి లేకుండా వర్షం కురవగా మధ్యాహ్నం కాస్త తెరిపిచ్చింది. సాయంత్రం మళ్లీ ఒక్కసారిగా మేఘావృతమై భారీ గాలులతో కూడిన వర్షం పడటంతో ఉద్దానంలో జీడి, మామిడితోటలకు నష్టం వాటిల్లింది. మెళియాపుట్టి మండలం భరణికోట పంచాయతీలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. నరసన్నపేట మండలం కోమర్తి కాలనీ కూడలి వద్ద భారీ చెట్టు నేలకొరగడంతో ఉర్లాం రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. గార మండలం వమరవల్లి జంక్షన్ నుంచి కళింగపట్నం మధ్యలో భారీ వృక్షాలు కూలిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం / నరసన్నపేట/వజ్రపుకొత్తూరు/గార/మెళియాపుట్టి శ్రీకాకుళం : జిల్లా వ్యాపారులపై గ్యాస్ పిడుగు పడింది. చమురు సంస్థలు గురువారం రాత్రి అకస్మాత్తుగా కమర్షియల్ సిలిండర్ ధరను రూ.993 పెంచేశారు. శుక్రవారం నుంచే కొత్త ధర రూ.3198 అమల్లోకి తీసుకురావడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఒకేసారి ఇంత మొత్తం పెంచడం గతంలో ఎన్నడూ లేదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో నెలరోజులుగా గ్యాస్కు కొరత ఏర్పడినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొరత లేదంటూ ప్రభుత్వాలు చెప్పుకొచ్చాయి. ధరలు కూడా పెంచలేదు. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో గ్యాస్ ధరను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని పదేపదే చెబుతూ వస్తున్న చమురు సంస్థలు ప్రస్తుతానికి కమర్షియల్ సిలిండర్ ధరే పెంచినప్పటికీ, మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్తో పాటు ఇంటికి వినియోగించే డొమెస్టిక్ సిలిండర్లు ధరలు కూడా పెంచుతాయని పలువురు చర్చించుకుంటున్నారు. దుకాణాల మూత.. గ్యాస్ కొరత వల్ల ఇప్పటికే చిన్న చిన్న హోటళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం ఒకేసారి కమర్షియల్ సిలిండర్ ధర పెరగడం, దానికి కూడా కొరత ఉండడంతో పెద్ద హోటళ్లు కూడా మూసివేత దిశగా అడుగులు వేస్తున్నాయి. జిల్లాలో కమర్షియల్ సిలిండర్లు రోజుకు 500 వరకు డెలీవరీ అవుతాయి. ఇంత స్థాయిలో చమురు సంస్థల నుంచి గ్యాస్ దిగుమతి కావడం లేదు. ఇప్పుడు ఒకేసారి రూ.993 పెంచడం వల్ల వర్తకులపై నెలకు కోటిన్నర రూపాయల వరకు భారం పడుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ విపరీతమైన పోటీ పెరగడం వల్ల రేట్లను పెంచే పరిస్థితి లేకపోగా గ్యాస్ భారాన్ని ఏ విధంగా అధిగమించాలన్న దానిపై వర్తకులు ఆలోచనలు చేస్తున్నప్పటికీ సరైన మార్గం దొరక్క మదనపడుతున్నారు. చమురు సంస్థలు పునరాలోచన చేసి ధరను తగ్గించాలని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని వర్తకులు విజ్ఞప్తి చేస్తున్నారు. టెక్కలి/సంతబొమ్మాళి: ఉత్తరాంధ్రకే తలమానికంగా, జిల్లాకు మణిహారంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంతబొమ్మాళి మండలం మూలపేటలో సుమారు రూ.4361.91 కోట్ల వ్యయంతో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 ఏప్రిల్ 19న పోర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఓవైపు పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ, మరోవైపు మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించేందుకు నౌపడ సమీపంలో సుమారు 58 ఎకరాలను గుర్తించి కాలనీ పనులు ప్రారంభించారు. ఏడాది కాలంలోనే పోర్టు పనులు ముమ్మరం చేస్తూ కాలనీ ఎర్త్ పనులు పూర్తి చేశారు. ఇదే సమయంలో ఎన్నికలు రావడంతో మొత్తం అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కాలనీలో మౌలిక సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. రోడ్లు, మురుగు కాలువలు, పూర్తి స్థాయిలో మంచినీటి సదుపాయం లేక కాలనీవాసులు అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా కాలనీ మొత్తం చెరువును తలపిస్తోంది. 586 కుటుంబాలకు పునరావాసం.. పోర్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా నిరాశ్రయులైన మూలపేట, విష్ణుచక్రం తదితర గ్రామాలకు చెందిన సుమారు 586 కుటుంబాల కోసం నౌపడ సమీపంలో సుమారు రూ.149 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో పునరావాస కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాలనీ నిర్మాణానికి అప్పట్లో రూ.35 కోట్లు కేటాయించారు. విష్ణుచక్రం గ్రామస్తులు ఇప్పటికే ఇళ్లు నిర్మించుకోగా, మూలపేట గ్రామస్తులు షెడ్లు ఏర్పాటు చేసుకుని గృహ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే కాలనీలో సీసీ రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలు లేక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రోడ్డు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ఆ ప్రాంతమంతా చిత్తడిగా మారి నడిచేందుకు కూడా వీలు లేకుండా తయారవుతోంది. ఇప్పటికై నా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు. కనీస వసతులు కరువు పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్లు లేక చిన్నపాటి వర్షానికే బురదగా మారుతోంది. పక్కా ఇళ్ల కోసం తాత్కాలికంగా వేసిన షెడ్లు గాలికి ఎగిరిపోతున్నాయి. – జీరు శివ, మూలపేట గ్రామస్తుడు పనుల్లో నిర్లక్ష్యం... మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తుల త్యాగాలకు ప్రతీక మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు. జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలనే లక్ష్యంతో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంతానికి పోర్టు తీసుకొచ్చారు. నౌపడ వద్ద పునరావాస కాలనీ నిర్మాణానికి నిధులు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలనీ సంగతే మర్చిపోయారు. మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇబ్బందిపెడుతున్నారు. ఇకనైనా పాలకులు చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, టెక్కలి నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మూలపేట పోర్టు కోసం సర్వస్వం త్యాగంచేసిన మూలపేట, విష్ణుచక్రం తదితర గ్రామాల ప్రజల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో కనీస సదుపాయాలు కల్పించకుండా చోద్యం చూస్తోంది. రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి వసతులు కల్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. పునరాలోచన చేయాలి చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ల ధర విషయమై పునరాలోచన చేయాలి. ఒకేసారి 993 పెంచడం వల్ల హోటల్, రెస్టారెంట్ యాజమా న్యాలు ఇబ్బందులు పడతాయి. ఇవి మూతపడితే పలు కుటుంబాలు పనులు లేక రోడ్డున పడతారు. – మెట్ట నాగరాజు, హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మౌలిక వసతులకు నోచుకోని మూలపేట పోర్టు పునరావాస కాలనీ మంచినీరు, రోడ్లు, కాలువలు లేక ఇక్కట్లు కొద్దిపాటి వర్షం పడినా చిత్తడే పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
‘మందుల మాఫియాను అరికట్టాలి’
అరసవల్లి: జిల్లాలో మందుల మాఫియా పేట్రేగిపోతుందని, చాలా మందుల షాపులు లైసెన్స్లు లేకుండానే నడుస్తున్నాయని, వీటిని వెంటనే మూసివేయించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. మందుల మాఫియా జిల్లాలో విస్తృతంగా ప్రభావం చూపుతోందని, డాక్టర్ల చీటీలు లేకుండానే మందులను ఇచ్చేస్తున్నారని, దీంతో ప్రాణాంతక పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, డ్రగ్స్ నియంత్రణాధికారులు లంచాల మాటున పనిచేస్తున్నారని, దీంతో ఈ మాఫియా విచ్చలవిడితనం పెరిగిపోతోందనన్నారు. దీన్ని నియంత్రణ చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటా యని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఫెడరేషన్ నేతలు వై.వేణు, అన్నాజీ, జి.వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం డీఎంహెచ్ఓ కె.అనితకు వినతిపత్రాన్ని అందజేశారు. చెట్టు నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బట్టేరు గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు పెంటబోయిన అప్పారావు (45) తాటిచెట్టుపై నుంచి జారిపడి గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య తవిటమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా : 8 మందికి గాయాలు పలాస: గొప్పిలి నుంచి పలాసకు వస్తున్న ఆటో అదుపు తప్పి అల్లుకోల చెరువు వద్ద గురువారం బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న ఆటో అదుపు తప్పడంతో చెరువులోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవరు సవర జేమ్స్తో పాటు మరో 7 మందికి తీవ్రగాయా లయ్యాయి. గాయాలయిన వారిలో ఇప్పిలి సంపత్, వి.ఆర్.ఓ చౌదరి లీలారాణి, ఆలేటి అచ్చమ్మ, దువ్వాడ లక్ష్మీదేవి, కుమ్మర త్రినాథ్, సాన మన్మధరావు, పల్లా రాజేశ్వరిలు ఉన్నారు. ఇందులో ఇప్పిలి సంపత్కు కాళ్లు విరిగిపోయాయి. పలాస ప్రభుత్వం ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మిగతా వారు కూడా పలాస ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం పలాస కాశీబుగ్గ పట్టణంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాశీబుగ్గ ఎస్ఐ సునీల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: మండలంలోని కె.కొత్తూరు గ్రామ సమీప జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన జలుమూరు గోవిందరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కురుడు గ్రామంలో జరిగిన ఒక పెళ్లికి టెక్కలి నుంచి కారు తీసుకెళ్లారు. పెళ్లి అనంతరం వాహనం తిరిగి ఇచ్చేందుకు కారులో ఇద్దరు వ్యక్తులు టెక్కలి రాగా వారిని తిరిగి తమ గ్రామానికి తీసుకు వెళ్లేందు కు బైక్పై పెళ్లి కొడుకు తమ్ముడు గోవిందరావు టెక్కలి వస్తుండగా.. చాకిపల్లి గ్రామం వద్ద కోటబొమ్మాళి నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో హుటాహూటిన హైవే సిబ్బంది టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం తరలించారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. -
ఓపెన్ స్కూల్ ఫలితాలు ‘ఢమాల్’
● అట్టడుగు స్థానాల్లో నిలిచిన సిక్కోలు తరగతి పరీక్షలకు ఉత్తీర్ణులు ఉత్తీర్ణత టెన్త్ 666 119 17.87 ఇంటర్ 1300 316 24.31 శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ఫలితాలు ఢమాల్ మన్నాయి. ఓపెన్ స్కూల్ పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. టెన్త్, ఇంటర్లో జిల్లాలో దారుణమైన ఉత్తీర్ణత నమోదు కావడం అధికారులను సైతం కలవరపాటుకు గురిచేసింది. పదో తరగతి పరీక్షల్లో 17.87 శాతం, ఇంటర్ పరీక్షల్లో 24.31 శాతం ఉత్తీర్ణ తను నమోదు చేసి అట్టడుగు స్థానంలో నిలిచాయి. 10 తర్వాత మార్క్స్ మెమోలు పొందండి.. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల మార్క్స్ మెమోలు మే 10వ తేదీ తర్వాత వారివారి అభ్యసన కేంద్రాలో సంబంధిత హెచ్ఎం/ప్రిన్సిపాల్ ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు తెలిపారు. అలాగే విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఏపీ ఆన్లైన్ ద్వారా లేదా పేమెంట్ గేట్వే ద్వారాగాని నిర్దేశించిన ఫీజులు చెల్లించి మే 2 నుంచి 11వ వరకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
ఖజానా శాఖ డీడీపై విచారణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం ఖజానా శాఖ డీడీ కార్యాలయంలో గడచిన నెల రోజులుగా వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాలు చినికిచినికి గాలివానగా మారుతున్నాయి. తాజాగా జిల్లా ఖజానా అధికారి, డీడీ రవికుమార్పై విచారణకు ఆదేశాలు వచ్చాయి. రాష్ట్ర ఖజానా కార్యాలయంలో జేడీగా పనిచేస్తున్న వనజారాణిని విచారణ అధికారిగా నియమించారు. నెల రోజుగా ఈ శాఖలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తొలుత ఒకరిపై ఒకరు ఫిర్యాదు, పోలీస్ స్టేషన్లో రాజీలు చేసుకొన్నారు. ఇక్కడితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ శాఖలో ఏడుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన వ్యవహారంతో మళ్లీ ఈ వివాదాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారాలు ఖజానా శాఖ డైరెక్టరేట్కు చేరాయి. దీంతో ఈ వ్యవహా రంపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా వనజారాణి డీడీ రవికుమార్కు ఓ మెమో పంపించారు. కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు అందజేయా లని ఆమె కోరారు. ఏటీఓ సెలవు లో ఉన్నప్పుడు ఆయన లాగిన్లోకి వెళ్లి కొన్ని బిల్లులు పాస్ చేయాల్సిన పరిస్థితులు, ఏడుగురు ఉద్యోగుల ను సస్పెండ్ చేయడం, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి రాజీ చేయడం వంటి అంశాలు ఉన్నాయి.


