వజ్రపుకొత్తూరు రూరల్: నీట్ పేపర్ లీక్తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవి డిమాండ్ చేశారు. పలాస – కాశీబుగ్గలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ సంఘాలు సంయుక్తంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు బుధవారం నివాళులర్పిస్తూ కాగడాల ప్రదర్శన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో రాష్ట్రంలో దాదాపుగా 83 వేల మంది విద్యార్థులు నష్టపోయారని, దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎందుకు మౌనం వహిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనలో విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు సాయి, సుందర్, వాసు, చంటి, వెంకటరావు, విజయ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


