శ్రీకాకుళం: రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలల్లో ఉన్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి విధులు బహిష్కరించనున్నారు. మూడు ప్రధాన డిమాండ్లతో ఈ సమ్మెను చేయనున్నట్లు జూనియర్ డాక్టర్లు శనివారం తెలిపారు. ఆదివారం అధికారులందరికీ సమ్మె నోటీసును అందించి సోమవారం నుంచి సమ్మె చేయనున్నారు. శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కళాశాలలో మాత్రం మంగళవారం నుంచి సమ్మెలో వీరంతా పాల్గోనున్నారు. ప్రధానంగా స్టైఫండ్ పెంచాలని, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచకూడదని, వైద్య కళాశాలలో ఇటీవల ఎంఎస్సీ, ఎంఫిల్తో పాటు మరికొన్ని వైద్యేతర పీజీ డిగ్రీ వారిని బోధనకు నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. వైద్య విద్యార్థులకు ఎంఎస్సీ, పీహెచ్డీలు చేసినవారు ఏవిధంగా బోధిస్తారని వారు నిలదీస్తున్నారు. అలాగే ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసు పెంచడం వలన తమకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో అన్ని ఖర్చులు పెరిగాయని, దీనికి అనుగుణంగా స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.


