సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇంత ఘోరమా.. పోలీసులు కూడా అడ్డగోలు ఫిర్యాదులు చేస్తారా? పోలీసులను చంపుతానని నేను బెదిరించానా? అదెక్కడ? నాపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారా? ఇదెక్కడి పోలీసు వ్యవస్థ? దీన్ని తేలికగా తీసుకోను. పోలీసులపైనే ప్రైవేటు కేసు పెడతాను’ అని వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అంటున్నారు. ఇలాగే వదిలేస్తే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపేలా ఉన్నారని, ఇప్పటికే న్యాయవాదులతో సంప్రదింపులు చేశానని, పోలీసులపై కేసు పెడతానని ‘సాక్షి’తో చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
ఈనెల 22వ తేదీన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ కేసులో పోలీసులు చేసిన అరెస్టును నిరసిస్తూ ఆ రోజు రాత్రి టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ మరికొందరు కాశీబుగ్గలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ను తిలక్తో పాటు మరికొందరు బెదిరించారని ఆ హెడ్ కానిస్టేబుల్ కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో పలు ఆశ్చర్యకరమైన అంశాలు ప్రస్తావించారు. ‘మా నాయకుడిని అరెస్టు చేసి తీసుకు వెళ్తారా, మీ అంతు చూస్తాం’ అంటూ గట్టిగా అరవడమే కాకుండా.. మా విధులను ఆటంకం పరిచి, మమ్మల్ని చంపుతామని బెదిరించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాన్ని ఆధారంగా చేసుకుని పలు సెక్షన్లు తిలక్తో పాటు మరికొందరిపై కేసు పెట్టారు. ఆ రోజు రాత్రి అదుపులోకి తీసుకుని మరుసటి రోజు రాత్రి విడిచి పెట్టారు. అయితే ఈ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై తిలక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆరోజు నిరసన ర్యాలీ చేసినప్పుడు ఏ ఒక్క పోలీసూ అడ్డుకోలేదని, తనను అసలు కలవలేదని, తాను చంపుతానని ఎక్కడా బెదిరించలేదని, తప్పుడు ఫిర్యాదు చేశారని అంటున్నారు. అంతేకాకుండా అక్కరెన్స్ రిపోర్టులో తన సంతకం కూడా ఫోర్జరీ చేశారని, వీటిన్నింటిపైన పోలీసులపై ప్రైవేటు కేసు పెడతానని, ఇప్పటికే న్యాయ వాదులతో సంప్రదింపులు చేశానని చెప్పారు.
హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు కాపీ
పోలీసులను నేను చంపుతాను అన్నానట?
తప్పుడు కేసు పెట్టడానికి ఇంత బరి తెగిస్తారా
పోలీసులపై ప్రైవేటు కేసు వేస్తా
తీవ్రంగా స్పందించిన వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్
న్యాయవాదులతో సంప్రదించినట్లు ప్రకటన


