ఆగస్టు 2 వరకు ఉద్దానం నీటి సరఫరా బంద్
అరసవల్లి: హిరమండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కొత్తగా ప్రెషర్ మెయిన్ పైప్లైన్ ఏర్పాటు చేయనున్న కారణంగా ఈనెల 29 నుంచి వచ్చేనెల 2వ తేది వరకు ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సరఫరా నిలిపివేస్తున్నట్లుగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శంకర్బాబు తెలియజేశారు. ఈ మేరకు పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లోనూ భద్రతా కారణాల దృష్ట్యా తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నామని, ప్రజలు ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. పనులు పూర్తవ్వగానే యథావిధిగా మంచినీటిని సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు.
నందిగాం: నందిగాం మండలానికి జీవనాధారమైన ఆఫ్షోర్ రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తా రో వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యుడు నంబూరు షణ్ముఖరావు ప్రశ్నించారు. సోమవారం సీపీఎం ప్రతినిధుల బృందం ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాంతంలో పర్యటించిన అనంతరం నందిగాంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పెండింగ్ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆఫ్షోర్ పూర్తయితే నందిగాం మండలంలోని 12వేల90 ఎకరాలు, టెక్కలిలో 1820 ఎకరాలు, పలాసలో 6800 ఎకరాలు, మెళియాపుట్టిలో 3890 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే పలాస మున్సిపాలిటీకి తాగునీటి సమస్య తీరుతుందని అన్నారు.
చాపర నుంచి రిజర్వాయర్కు 17 కిలోమీటర్ల మేర ఫ్లడ్ ఫ్లో కెనాల్ సగం కూడా పని కాలేదని ఆరోపించారు. వంశధార రిజర్వాయర్, వంశధార– నాగావళి అనుసంధానం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడం లేదన్నారు.


