కవిటి: దేశానికి అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని అందించి, రాష్ట్రపతిగా, విద్యావేత్తగా బహుముఖ సేవలు అందించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు నిరుపమానమని అని వక్తలు అన్నారు. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా పెద్ద ఎర్రగోవింద పుట్టుగలో సోమవారం ఆయన చిత్రపటానికి హెచ్ఎం దేవదాస్ బెజ్జిపల్లి, చిన్నారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కలాం సేవలను దేవదాస్ చిన్నారులకు వివరించారు.
మోకాళ్లపై కూర్చుని నిరసన
ఆమదాలవలస: స్టాంపు వెండర్ల పొట్ట కొట్టే ఆలోచనలు మానుకోవాలని, డాక్యుమెంట్ రైటర్లపై అవలంబిస్తున్న మొండి వైఖరి సర్కా రు విడనాడాలని శ్రీకాకుళం జిల్లా స్టాంపు వెండర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బగాది తేజేశ్వరరావు అన్నారు. సోమవారం ఆమదాలవలసలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో చేస్తున్న 8వరోజు పెన్డౌన్ కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంట్ రైటర్స్ మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని కోరారు.
తప్పని పడిగాపులు
హిరమండలం: మండలంలోని కొండరాగోలు రైతుసేవా కేంద్రం వద్ద ఎరువుల కోసం రైతులు సోమవారం అష్టకష్టాలు పడ్డారు. సచివాలయలంలో యూరియా విక్రయిస్తారన్న సమాచారంతో సచివాలయ పరిధిలోని కొంగరాగోలు, ఎగువకొండరాగోలు నడుమ కొండరాగోలు దుర్బలాపురం తదితర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. బస్తా యూరియా కోసం ఆధార్ కార్డు, సెల్ఫోన్లు పట్టుకుని తిరగాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
జీజీహెచ్ ప్రయోగ శాలకు ఎన్ఏబీఎల్ గుర్తింపు
శ్రీకాకుళం: హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షల్లో నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ జి.సౌమిని స్పష్టం చేశారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని హెచ్ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి ‘నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్’ (ఎన్ఏబీఎల్) గుర్తింపు లభించినట్లు సోమవారం ఆమె తెలిపారు. ఈ సందర్భంగా వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. లక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ బి.ఎస్.ఎస్.విజయశ్రీ, డాక్టర్ బి.రాధిక, టెక్నికల్ ఆఫీసర్ ఎం.స్వప్నతో పాటు ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్ల బందానికి ఎన్ఏబీఎల్ అక్రిడిటేషన్ ధ్రువపత్రాన్ని ఆమె అందజేశారు. హెచ్ఐవీ, సీడీ–4 పరీక్షల్లో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం ద్వారా రోగులకు మరింత మెరుగైన సంరక్షణ లభిస్తుందని సూచించారు.


