రణస్థలం/జి.సిగడాం: వైఎస్ జగన్ రాకతో జాతీయ రహదారి జన రహదారిగా మారిపోయింది. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి కుశాలపురం వరకు భారీ ఎత్తున ప్రజ లు వైఎస్ జగన్ను చూసేందుకు వచ్చారు. ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రణస్థలం యుబీ పరిశ్రమ నుంచి రణస్థలం టౌన్ దారి పొడవునా మహిళలు, యువత వైఎస్ జగన్ను అనుసరించి పరుగులు తీశారు. రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు మండలాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. రహదారి చుట్టుపక్కల మేడలపైకి ఎక్కి అభిమాన నాయకుడిని చూశారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ యువనాయకులురాలు బొత్స అనూష, విజయనగరం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్లు మాజీ సీఎం జగన్కు పైడిభీమవరంలో స్వాగతం పలికారు.
ముఖద్వారం.. కేరింతల మయం
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం అర్బన్/ ఎచ్చెర్ల: శ్రీకాకుళం ముఖద్వారమైన కుశాలపురం–నవభారత్ జంక్షన్ వద్దకు వైఎస్ జగన్ కాన్వాయ్ చేరుకోగానే యువత కేరింతలు, డ్యాన్సుల మధ్య సందడి నెలకొంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం శివారు ప్రాంతాల నుంచి భారీగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు జనం తరలివచ్చి గంటల సమయం నిరీక్షించి తమ అభిమాన నేత ను చూసి పులకించిపోయారు. రహదారిపైనే వైఎస్ జగన్కు మద్దతుగా డ్యాన్స్లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అంపోలు జంక్షన్ వద్ద..
శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా అంపోలు జైలు వద్దకు వెళ్లే మార్గం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మండుటెండలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వారు కనీసం వంతెన కిందకు కూడా పోలీసులు రానీయలేదు. దీంతో ఒక్కసారిగా వందల్లో ఉన్న ప్రజలు అక్కడ బారికేడ్లను తోసుకుంటూ బ్రిడ్జి కిందకు చేరా రు. అనంతరం అక్కడి నుంచి వాహనాలను అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగు లు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తదితరులు వైఎస్సార్ సీపీ నాయకుల వాహనాలు అడ్డుకోవడంతో వారు కాలినడకనే వెళ్లారు. ఆఖరకు వైఎస్ జగన్ కాన్వాయ్తో వచ్చిన అంబులెన్స్ను కూడా పది నిమిషాల పాటు వెళ్లనీయలేదు. వైఎస్ జగన్ రాక ఆలస్యమైనా ప్రజలు విసుగు లేకుండా వేచి ఉన్నారు.
ధర్మాన నివాసం వద్ద
శ్రీకాకుళం రూరల్/ శ్రీకాకుళం: వైఎస్ జగన్ రాక సందర్భంగా శ్రీకాకుళంలోని ధర్మాన నివాసం వద్ద జనాలు పోటెత్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జగన్ రాక కోసం ధర్మాన బంగ్లా పరిసర ప్రాంతాల్లో జనాలు ఎదురు చూశారు. సాయంత్రం వైఎస్జగన్ రావడంతో చూసేందుకు పోటెత్తారు.
పోలీసులతో వాగ్వాదం
జిల్లా పోలీసులు ఉదయం నుంచే ఆంక్షలు విధించారు. హొటల్ గ్రాండ్ వద్ద, ధర్మాన నివాసం వద్ద సుమారు 20 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 3 గంటలు సమయంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కాన్వాయ్ వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నా రు. వెంటనే ఆయన దిగారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. సాయంత్రం 3.30 సమయంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి వస్తుండగా ధర్మాన నివాసం వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆమె నడుచుకుంటూ ముందుకు వెళ్లారు.


