పైనున్న ఆయకట్టు కాదని కిందకు సాగునీరు తరలిస్తున్న అధికారులు జేసీబీ పెట్టి డ్రాపులు పగలగొట్టడంపై రైతుల ఆగ్రహం మంత్రి ఒత్తిడితోనే దుశ్చర్య అంటూ విమర్శలు
పోలాకి:
ఎల్నినో ఎఫెక్ట్తో వర్షాలు లేకపోవటంతో శివారు కాలువల పరిధిలో సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లతో వంశధార అధికారులు పైనున్న ఆయకట్టుకు నీటితడి అందకుండానే కిందకు తరలించే ప్రయత్నాలు చేయడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందులోనూ వంశధార సాగునీటి ప్రాజెక్టు తీర్మానాలతో నిర్మాణం చేపట్టిన డ్రాపులు పగలగొట్టి కిందకు నీటిని తరలించడంతో మేఘవరం చానెల్పై రేగుపాడు బూసయ్య డ్రాపు వద్ద శుక్రవారం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీఎల్పురం చానెల్, 16ఆర్ (ప్రియాగ్రహారం) తోపాటు దాదాపు 8వేల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందించటంలో ఈ డ్రాపు ప్రధానమైంది. అలాంటి డ్రాపును జేసీబీతో వంశధార సిబ్బంది తొలగించటంపై రైతుల్లో ఆగ్ర హం కట్టలు తెంచుకుంది. కేవలం మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలోని శివారు గ్రామాలకు నీరందించాలనే అధికారులు పనిచేస్తున్నారని రైతులు ఆరోపణలు చేశారు.
ఆయకట్టు పరిధిలోని రైతులు అక్కడకు చేరుకుని డ్రాపు తొలగించిన చోటే తాత్కాలిక ఇనుప రేకుతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుని నీటిని నిలువరించారు. ఈ పరిణామాన్ని వంశధార అధికారులు ఊహించలేదు. దీంతో కిందనున్న రైతుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పోలాకి తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎస్ఐ రంజిత్ అక్కడకు చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. డ్రాపును మళ్లీ నిర్మించేందుకు వంశధార సిబ్బంది హామీ ఇచ్చారని చెప్పటంతో శాంతించారు.


