న్యూస్రీల్
శ్రీకాకుళం
బ్యాగ్ పెయిన్విద్యార్థులకు బాధ్యతలతో పాటు బరువులు పెరుగుతున్నాయి. బ్యాగులు మోయలేకపోతున్నారు. –8లో
మంగళవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2026
● రోజురోజుకీ పెరుగుతున్న
చంద్రబాబు ప్రభుత్వ కుట్రలు
● కక్షలే పరమావధిగా సాగుతున్న
పాలన
● పోలీసు వ్యవస్థను అడ్డంగా
పెట్టుకుని
కక్షపూరిత
రాజకీయం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
చంద్రబాబు ప్రభుత్వం తన వికృత కోణాలను బయటపెడుతోంది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నేతలను వేధించడమే పనిగా పెట్టుకుంది. దాని కోసం పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కక్ష పూరిత రాజకీయాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు, అరెస్టులు తప్ప మరొకటి కనిపించడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన పనులకు తమ రంగులేసి క్రెడిట్ చోరీకి పాల్పడటం తప్ప చేసిందేమి లేదని జనాలకు అర్థమైంది. సూపర్ సిక్స్ కాస్త సూపర్ మోసంగా మారిపోయింది. సంక్షేమ పథకాలు కనుమరుగైపోతున్నాయి. ఎవరో చేసిన అభివృద్ధి పనులను ప్రచారం చేసుకుని, ప్రత్యేక ఈవెంట్లు చేసుకుని, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైంది. ఆఖరకు ప్రధాన మంత్రి హాజరయ్యే సభలకు సైతం గతి లేని పరిస్థి తుల్లో లేనిపోని ప్రలోభాలు, ఆశలు కల్పించి, దగ్గరుండి బస్సులు పెట్టి, భోజనాలు అందించి తీసుకెళ్తున్న దుస్థితికి చేరిపోయింది. అదే సమయంలో జరిగిన వైఎస్ జగన్ పర్యటనకు స్వచ్ఛందంగా తరలివచ్చిన జనాలను చూసి సర్కారుకు కళ్లు బైర్లు కమ్మాయి.
ఈ పరిస్థితులపై జనం దృష్టి మరల్చేందుకు వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడు తూ విష రాజకీయానికి తెరలేపింది. ఇప్పటికే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమ కేసులో అరెస్టు చేసి ఇబ్బందులు పెడుతోంది. వీరి అరెస్టు ను నిరసిస్తూ జిల్లా అంతా భగ్గుమంటోంది. మత్స్యకార సామాజిక వర్గమైతే మండిపడుతోంది. టీడీపీకి బుద్ధి చెబుతామంటూ హెచ్చరిస్తోంది. అంతటితో ఆగలేదు. తాజాగా ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు 21 మందిపై అక్రమ కేసులు పెట్టింది. మహిళా ఎస్ఐ ప్రవళ్లిక ఆత్మాభిమానం టీడీపీ నాయకులే దెబ్బ తీసి, వైఎస్సార్సీపీ నాయకులు అనుచితంగా వ్యవహరించా రని లేనిపోని సెక్షన్లు నమోదు చేసింది. ఆ కేసులో ఏ–9గా ఉన్న గరుగుబిల్లి తేజేశ్వరరావు తన కుమా ర్తె అడ్మిషన్ కోసం పంజాబ్ వెళ్తే.. ఇక్కడ ఉన్నట్లు అక్రమ కేసు బనాయించింది. తాను పంజాబ్లో ఉన్నానని ఫొటోలు, వీడియోలు, టిక్కెట్లు పెట్టి తప్పుడు కేసు బాగోతం బయటపెట్టారు. అదే విధంగా వైఎస్ జగన్ పర్యటన సమయంలో కోర్టు లో ఉన్న న్యాయవాది దానేటి రామ్మోహన్రావుపై ఏ–8గా, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న డాక్యుమెంట్ రైటర్ నాను పాత్రును సురేష్పై ఏ–11గా కేసులు పెట్టిందంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్న మాజీ ఎమ్మె ల్యే గొర్లె కిరణ్కుమార్తో పాటు 23 మందిపై అక్రమ కేసులు బనాయించింది. మరికొందరిపైన కేసులు పెడతామని లీకులిస్తోంది. దీన్ని బట్టి చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను చూసి ఎంత భయపడుతుందో స్పష్టమవుతోంది. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులతో ప్రతిపక్ష నాయకులను భయపెడితే భయపడే రకం కాదని, మరింత గొంతెత్తుతామని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు.
‘న్యాయవాదిని నిందితుడిగా
చేర్చడం తగదు’
ఆమదాలవలస: గత నెల 30వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆమదాలవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో విధుల్లో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది దానేటి రామ్మోహన్రావును పోలీసులు ఎ–8గా చేర్చడం సరికాదని ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కణితి విజయలక్ష్మిబాయి తోపాటు బార్ అసోసియేషన్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు కోర్టు ఆవరణలో సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అసలు వైఎస్ జగన్ పర్యటనకే వెళ్లని రామ్మోహన్ రావు మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసు నమోదు చేయడం హేయనీయమన్నారు. న్యాయవాదులను ఇలాంటి బురద జల్లే కేసుల్లో ఇరికించడం వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకువస్తుందని తెలిపారు. దీనిపై రెండు రోజులు పాటు న్యాయవాదులమంతా విధులు బహిష్కరిస్తున్నట్లు వారు వెల్లడించారు.


