● మత్స్యకారులకు చిక్కని చేప
● నెల రోజులుగానే అరకొర వేట
● పొగురుతో వేట సాగక అవస్థలు
పొగురు తొలగించాలి
మత్స్యశాఖ అధికారులు పొగురు( ఇసుక మేటలు)తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తుపాను అనంతరం కూడా జెట్టీ నుంచి మెకనైజ్డ్ బోట్లు వేటకు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతుంది. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేసిన బోట్లు పాడైపోతాయి. వలలు, ఐస్బాక్స్లు, బోట్లు సబ్సిడీపై అందించాలి.
– కె.సింహాచలం, మత్స్యకారుడు, మంచినీళ్లపేట
చేప చిక్కడం లేదు
గత ఏడాది ఈ సీజన్లో అడపా దడపా చేపలను అమ్ముకున్నాం. కానీ ఈ ఏడాది చేప మాత్రం చిక్కడం లేదు. అలలు ఎగసి ప డుతున్నాయి. అలల ధాటికి తీ రం కోతకు గురైంది. వేటలేక పస్తులు ఉంటున్నా.
– సీహెచ్ భీమారావు,
మత్స్యకారుడు, మంచినీళ్లపేట
వజ్రపుకొత్తూరు:
గంగ పుత్రులకు నెల రోజులుగా బెంగ పట్టుకుంది. సంద్రంలో వేట సరిగ్గా సాగకపోవడంతో పూట గడవడం లేదు. అటు శ్రీలంక నుంచి ఇటు విశాఖపట్నం వరకు పెద్ద ఎత్తున మర పడవలు గంగపుత్రుల సముద్ర సంపదను ఎత్తుకు పోతున్నా యి. కోస్ట్ గార్డు, ఇతర నిఘా విభాగాలు అటుగా దృష్టి సారించకపోవడంతో అపారమైన మత్స్య సంపద స్థానికులకు అందకుండా పోతోంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలలతో కుస్తీ పట్టి సంద్రంలోకి వెళ్తున్న మత్స్యకారులు ఖాళీ వలలతో ఇంటికి వస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి ఇటు రణస్థలం తీరం వరకు మత్స్యకారులకు ఇదే పరిస్థితి.
వేట సాగేది ఎలా..?
వేట నిషేధ కాలంలో మర పడవల దొంగ వేట, కర్మాగారాల నుంచి విడుదలయ్యే విష జలాలు, కలుషితమవుతున్న నదీ జలాలు సంద్రంలో కలుస్తుండడం వల్ల చేపల పునరుత్పత్తి తగ్గుతోంది. విష జలాలు, మర పడవల కారణంగా చేపల గుడ్లు వి చ్ఛిన్నమై సంతతి అభివృద్ధి తక్కువైపోతోంది. దీంతో సీజన్లో దొరకాల్సిన రొయ్యిలు, కానాగత్తలు, కవ్వళ్లు, మొరవలు, ట్యూనా, కోనేం, నెత్తళ్లు, మాగ లు తదితర చక్కటి ఆదాయాన్నిచ్చే చేపలు దొరకం లేదు. గత ఏడాది జిల్లాలో దాదాపు 520 టన్నుల వరకు రొయ్యిలు, 1320 టన్నుల వరకు కానాగత్త లు లభించాయి. కానీ నేడు అందులో సగం కూడా రాలేదని మత్స్యకారులు చెబుతున్నారు. గత ఏడాది కోనేం అస్సలు కనిపించకపోగా.. ఈ ఏడాదీ అదే దుస్థితి దాపురించింది. దీంతో వేటపైనే ఆధారపడుతున్న ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థ లం మండలాల పరిధిలోని దాదాపు 27 వేల మంది మత్స్యకారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది.
కోతకు గురవుతున్న తీరం
తుపానులు, సముద్రం కల్లోలంగా ఉన్న సమయాల్లో తీరం పెద్ద ఎత్తున కోతకు గురవుతోంది. ఇది ప్రధానంగా మంచినీళ్లపేట, దేవునల్తాడ, అక్కుపల్లి, గుణుపల్లి, డోకులపాడు తీరాల్లో అలల ధాటికి తీరం కోతకు గురవుతోంది. మంచినీళ్లపేట, నువ్వలరేవు మత్యకారులకు ఏటా పొగురు (తీరంలో ఇసుక మేటలు) జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఏటా రూ.3లక్షలు వరకు ఖర్చు చేస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. సముద్ర తీరానికి ఫిషింగ్ జెట్టీకి మధ్య ఇసుక మేటలు పేరుకుపోయి ఉండడంతో మంచినీళ్లపేట ఫిషింగ్ జెట్టీ వద్ద లంగరు వేసి 76 మెకనైజ్డ్ బోట్లకు మరో 100 సంప్రదాయ తెప్పలు వేటకు వెళ్లకుండా అక్కడే ఉండిపోయాయి. దీని ప్రభావంతో వేటపై ఆధార పడుతున్న సుమారు 350 మంది మత్స్యకారులు 20 రోజులుగా వేట లేక అవస్థలు పడుతున్నారు.
అంతంత మాత్రంగా వేట
సముద్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న వాతావరణ మార్పులు కారణంగా వేట సాగడం లేదని మత్స్యకారులు కొమర సింహాచలం, సీహెచ్ భీమారావు, కొర్లయ్య, దానయ్య, తదితరులు చెబుతున్నారు. చిరిగిన వలలకు మరమ్మతులు చేసుకుంటున్నామని తెలిపారు. మత్స్య సంపద బాగా తగ్గిపోయిందని, సీజన్లో పడాల్సిన చేపలు వలకు చిక్కడం లేదన్నారు.
వేట నిషేధం అనంతరం ఏటా ఈ సీజన్లో విలువైన రొయ్యిలు, కానాగత్తలు ఇతర చేపలు వలకు చిక్కాలి. కానీ ఆ పరిస్థితి లేదు. నెలలో రూ. 20వేలు వరకు డీజిల్ ఖర్చు చేసి వేటకు వెళ్లినా మదుపు రావడం లేదని వాపోతున్నారు. దీంతో యువకులు కాండ్లా, గుజరాత్, గోవాతో పాటు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.


