ఇచ్ఛాపురం: మున్సిపాలిటీ 15వ వార్డు దాంపేటలో పుట్టుకతోనే 89శాతం అంగవైకల్యం కలిగిన ఎనిమిదేళ్ల శుభం మహరాణ పరిస్థితిపై అధికారులు స్పందించారు. చిన్నారి పరిస్థితిని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసా ద్ రెడ్డి వెలుగులోకి తీసుకురాగా.. సోమవారం ‘సాక్షి’లో ఈ వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేర కు ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల ఉపాధ్యాయ సిబ్బంది సోమవారం దివ్యాంగ చిన్నా రి ఇంటికి వచ్చి పూర్తి వివరాలు సేకరించారు. సంబంధిత నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కి పంపించారు. మంగళవారం సదరం కోసం రిమ్స్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
విద్యార్థినిని కాపాడిన లోకో పైలెట్
పాతపట్నం: విశాఖపట్నం నుంచి గుణుపూర్ వెళుతున్న రైలు పాతపట్నం రైల్వే స్టేషన్ వచ్చే సమయంలో ఓ విద్యార్థిని సెల్ఫోన్లో మాట్లాడుతూ ట్రాక్పై పడిపోయింది. లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై ట్రైన్ ఆపడంతో విద్యార్థి స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖపట్నం నుంచి గుణుపూర్ రైలు పాతపట్నం రైల్వే స్టేషన్కు వచ్చే సమయంలో ఎదురుగా పాతపట్నం మహేంద్ర డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్న బురల్ల రామజ్యోతి రైల్వే ప్లాట్ఫారంపై సెల్ ఫోన్లో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్పై పడిపోయింది. వెంటనే లోకో పైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో విద్యార్థిని స్వల్ప గాయాలతో బయటపడింది. స్థానికులు 108 సాయంతో ఆమెను పాతపట్నం సీహెచ్సీకి తరలించారు.
పిడుగు పడి వివాహిత మృతి
టెక్కలి రూరల్: కోటబొ మ్మాళి మండలం చిట్టేయవలస పంచాయతీ చవితిపేట గ్రామానికి చెందిన సంపతిరావు సుజాత(40) అనే వివాహిత సోమవారం పిడుగు పడి మృతి చెందారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. చవితిపేట గ్రామానికి చెందిన ఎస్.సుజాత తన పొలంలో పనులు చేసేందుకు వెళ్లారు. కలుపు మొక్కలను తీస్తుండగా ఒక్కసారిగా వర్షం పడటంతో ఆమె అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో సమీపంలో పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే పడిపోయింది. సమీపంలో పనిచేస్తున్న తోటి పనివారు ఆమె వద్దకు పరుగున వెళ్లి పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద రోదించారు. విషయం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త సింహాచలం, కుమారుడు లక్ష్మణరావు, కుమార్తె త్రివేణి ఉన్నారు.


