వజ్రపుకొత్తూరు: ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో ప్రతిరైతూ పంటల బీమా నమోదు చేసుకోవాలని వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ జిల్లా పీడీ జగన్మోహనరావు కోరారు. మండలంలోని పాతటెక్కలిలో ఎల్నినో ప్రభావం, పంటల మార్పిడి, మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు బుధవారం అవగాహన కల్పించారు. ఎకరాకు రూ.16లు చెల్లిస్తే రూ.40 వేల వరకు పంటల బీమా వర్తిస్తుందని తెలిపారు. రైతులు స్వల్పకాలిక, మద్యస్థ వరి రకాలు వేసుకోవాలని సూచించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు అనూష, భాగ్యలక్ష్మి, ఉదయ్బాబులు మాట్లాడుతూ వర్షాభావం ఉన్నందున ప్రతీరైతు నీటి ఎద్దడి నుంచి కాపాడుకునేందుకు వెద, నారు మడులకు 19.19.19 లేదా 13045 మందును వ్యవసాయాధికారుల సూచనతో పిచికారీ చేయాలని సూచించారు. వరిలో కాలిబాటలు తీయడం వల్ల గాలి, వెలుతురు తగిలి తెగుళ్లు సోకకుండా దిగుబడి ఆశించిన మేర వస్తుందన్నారు. ఆగస్టు 15లోపు వర్షాలు కురవకుంటే మెట్టు భూములు ఉన్న రైతులు ప్రత్యామ్నాయ పంటలైన కంది, అపరాల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నారు. జీడి, కొబ్బరిలో లద్దె పురుగులు ఎక్కువగా ఉన్నపుడు మిడాక్లోరాపిడ్ మందును వాడుకోవాలని స్పష్టం చేశారు. ప్రైవేటు నర్సరీల్లో దొరికే మొక్కలు నాటుకోవద్దని, బాపట్ల పరిశోధన కేంద్రం అందిస్తున్న జీడిమామిడి, కొబ్బరి మొక్కలు నాటుకుంటే అధిక దిగుబడులు వస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలాస వ్యవసాయ సహాయ సంచాలకురాలు శారద, మండల వ్యవసాయాధికారి బమ్మిడి ధనుంజయరావు, ఉద్యానవన శాఖ అధికారి శంకర్దాసు తదితరులు పాల్గొన్నారు.


