కంచిలి: మండలంలోని జలంత్రకోట జాతీయ రహ దారి కూడలిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు దాసరి చంద్రశేఖర్(58) మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సోంపేట మండలంలోని బేసి రామచంద్రాపురం పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. అతను గురువారం విధు లు ముగించుకొని సోంపేట పట్టణానికి ఏదో పని నిమిత్తం వెళ్లి, తిరిగి జాతీయ రహదారి మీదుగా తన స్వగ్రామం సోంపేట మండలం ఉప్పలాం పంచాయతీ పరిధి డొంకలూరు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి నిర్వహణ పనులు జరుగుతుండడంతో అక్కడ ఇరుకు మార్గంలో వెళ్తుండగా కుప్పగా వేసిన మెటీరియల్ వలన బండి అదుపుతప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. కానీ అతనికి ఏర్పడిన గాయాలు చూస్తే ఏదో వాహనం శరీర భాగాలకు రాసుకొని వెళ్లడంతో తీవ్రగాయాలు అయినట్లు కన్పిస్తోంది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం కాశీబుగ్గలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపడుతున్నట్లు కంచిలి హెచ్సీ జె.రూప్కుమార్ తెలిపారు. చంద్రశేఖర్ మృతితో గ్రామంలో విషాదచాయలు అల ముకున్నాయి. అతనికి భార్య వనిత కుమారి, కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో రోడ్డు పక్కన మెటీరియల్ వేయడం వలన సోంపే ట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన ఒక కుటుంబం ప్రమాదానికి గురై స్వల్ప గాయాలపాలైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో స్థానికులు ఎన్హెచ్–16 సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ జంక్షన్ సమీప ఆర్ట్స్ కళాశాల మార్గంలో బుధవారం అర్ధరా త్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ వి. రామారావు తెలిపిన వివరాల మేరకు.. పొందూరు మండలం వీఆర్ గూడేంకు చెందిన యారాడ గిరిధర్రావు (55)కు వివాహం జరగకపోవడంతో అతని సోదరుడే బాగోగులు చూసుకుంటున్నాడు. అయితే అతనికి మతిస్థిమితం సరిగా లేకపోతుండడంతో అప్పుడప్పుడూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటాడు. ఈక్రమంలో ఈనెల 4వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం బుధవారం రాత్రి ఆర్ట్స్ కళాశాల మార్గంలో రోడ్డు మధ్యలో పడుకునిపోయాడు. సరిగ్గా 11.30 గంటల ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీకి చెందిన బస్సు ఉద్యోగులను దించే క్రమంలో అటువైపుగా వచ్చి డ్రైవర్ గమనించకపోవడంతో గిరిధర్రావు పైనుంచి వెళ్లిపోవడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడిని కుటుంబీకులు గుర్తించడంతో పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.


