● నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి ● ఎమ్మెల్సీ నర్తు రామారావు
ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలోని ప్రతీ అంశాన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.


