సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
నిఘా ముసుగులో ఓ విభాగం వసూళ్ల దందా సాగిస్తోంది. కీలక నేత సోదరుడు పెత్తనం చెలాయిస్తున్న ఆ విభాగం బరితెగించి ముడుపులు దండుకుంటోంది. నిత్యం ఏదో ఒక రంగానికి చెందిన వ్యాపారుల ముక్కుపిండి వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు ప్రస్తుతం ఎరువుల దుకాణాలపై పడ్డారు. ఇప్పుడంతా ఎరువుల సీజన్ కావడంతో ఇదే అదునుగా తీసుకుని ప్రాంతానికి ఒకరిని బ్రోకర్గా పెట్టి వసూలు చేయిస్తున్నారు. అడ్డగోలు బాగోతానికి పెద్ద వ్యాపారులు సహకరిస్తున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు.
జిల్లాలో ఓ నిఘా వ్యవస్థ అక్రమ దందాకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. పర్యవేక్షణ ముసుగులో సొమ్ము చేసుకుంటున్నారు. వ్యాపారం లెక్కలు తేల్చేస్తాం, లొసుగులు బయటపెడతాం అంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్ల దందా సాగిస్తున్నారు. సీజనల్ వారీగా వ్యాపారులను దోచుకుంటున్నారు. ధాన్యం సేకరణ సమయంలో మిల్లర్ల నుంచి తవ్వకాలు, రవాణా పేరుతో గ్రానైట్ కంపెనీల నుంచి, నిల్వల పేరుతో వివిధ వ్యాపారుల ద గ్గరి నుంచి, ఆకస్మిక తనిఖీల పేరుతో మరికొందరి నుంచి ముడుపులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎరువుల సీజన్ కావడంతో ఎరువుల వ్యాపారులపై పడ్డారు. జిల్లాలో 270కి పైగా ఎరువుల దుకా ణాలుండగా, ప్రతి దుకాణం నుంచి రూ.10వేలు ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేశారు. దాని కోసం సంబంధిత వ్యాపారుల్లోని ఒకర్ని బ్రోకర్గా పెట్టుకున్నారు. వారి చేత ఆ ప్రాంతంలో ఉన్న వ్యా పారులందరి దగ్గరి నుంచి వసూలు చేయిస్తున్నారు. ఎవరైనా ఇవ్వకపోతే తమ పేరు చెప్పండని సదరు బ్రోకర్లకు చెప్పడంతో చెలరేగిపోతున్నారు. ఆ నిఘా వ్యవస్థ ముసుగులో బ్రోకర్లు కూడా కొంత అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్ల దందాకు పెద్దల అండదండలుండంతో బరి తెగించేశారు.
ఆ నిఘా వ్యవస్థపై ఓ కీలక నేత సోదరుడు అజమాయిషీ ఉండటంతో వ్యాపారులు కూడా భ యపడుతున్న పరిస్థితి నెలకొంది. కాదంటే టార్గెట్ చేస్తారేమో అని కక్కలేక, మింగలేక సతమతమవుతున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన వారే చేతు లు చాపుతున్నారు. కంచె చేను మేసినట్టు అవినీతికి పాల్పడుతున్నారు. వ్యాపారమంటే చిన్నా చితక లొసుగులు ఉండొచ్చు. వాటిని పెద్దవిగా చూపించి కొంప ముంచేస్తారేమో అని బడా వ్యాపారులు అడిగినంత ఇచ్చేస్తున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం చితికిపోతామని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తు తం పరిస్థితులు అంత అనుకూలంగా లేవని, ఇ లాంటప్పుడు ఎలా ఇవ్వగలమని బయటకు చెప్పుకోలేక.. లోపల దాచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం ముడుపుల డ్రైవ్ కొనసాగుతోంది. వసూలు రాయుళ్ల పంట పండుతోంది. టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, పలాస, నరసన్నపేట, రణస్థలం,పాతపట్నం తదితర ప్రాంతాల్లో దీనిపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
నిఘా నేత్రం ముసుగులో ముడుపుల పర్వం
ఎరువుల దుకాణాల నుంచి అడ్డగోలు వసూళ్లు
270 షాపుల నుంచి మామూళ్లు డిమాండ్
ఒక్కో దుకాణానికి రూ. 10వేలు ఫిక్స్
బెంబేలెత్తిపోతున్న
చిరు వ్యాపారులు


