శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్నారి హక్కుల పరిరక్షణ, సంక్షేమానికి తమ కమిషన్ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణరాజు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, వసతి గృహాల్లో సౌకర్యాలపై రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయి పరిశీలనలు వేగవంతం చేసినట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా కమిషన్ సభ్యులు గంగా సూర్యనారాయణరాజు, డాక్టర్ పి.నాగమానస, డాక్టర్ శ్రీనివాసమూర్తిలతో కలిసి శ్రీకాకుళం నగరంలోని మావూరివీధి అంగన్వాడీ కేంద్రం, అనంతరం అరసవల్లిలోని శిశు గృహాలను సందర్శించి చిన్నారులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. బాలల హక్కులకు భంగం కలిగినా, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం వహించినా సహించేది లేదని హెచ్చరించారు. బుధవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించే సమీక్ష సమావేశానికి అన్ని శాఖల అధికారులు సమగ్ర నివేదికలతో హాజరుకావాలని, కమిషన్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ఎస్.సువర్ణ, బాలల రక్షణ అధికారి కేవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


