● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్ఎస్కు 187 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే వినతులపై అధికారులు ప్రతిరోజూ సమీక్షించుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతిరోజూ అర్జీలపై సమీక్ష చేస్తే పెండింగ్లో ఉండవన్నారు. ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తంగా 187 అర్జీలు స్వీకరించగా.. వీటిలో రెవెన్యూ 45, పంచాయతీ రాజ్ 23, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 19, స్వర్ణ గ్రామం – స్వర్ణ వార్డు 19, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 6, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 4, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 8, రూరల్ వాటర్ సప్లయ్ 4, ఏపీఈపీడీసీఎల్ 6, స్కూల్ ఎడ్యుకేషన్ 4, సమగ్ర శిక్ష 3, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 3, రూరల్ డవలప్మెంట్ 2, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2, హోం, ఆర్అండ్బీ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, వ్యవసాయం శాఖ, మత్స్యశాఖ తదితర శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి అర్జీ చొప్పున స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహిళా, శిశు సంక్షేమ శాఖకు సంబంధించి తల్లిపాల వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు.
పలు వినతులు పరిశీలిస్తే...
● తన దివ్యాంగత శాతాన్ని తగ్గించడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కోల్పోతున్నానని శ్రీకాకుళం నగరంలోని కొత్తపేటకు చెందిన బొమ్మాలి పోలినాయుడు గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. తనకు రెండు కాళ్లులేవని, నడవలేని స్థితిలో ఉన్నానని తెలిపారు. తనకు పూర్తస్థాయి దివ్యాంగ ధ్రువపత్రం ఇప్పించాలని కోరారు.
● రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న విద్యుత్ బస్సులు ప్రైవేటు ఆర్గనైజేషన్కి ఇవ్వాలన్న ఆలోచన ఆపాలని, ఈ నిర్వహణ ఆర్టీసీ నిర్వహించాలని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జిల్లాలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల అందరి సంతకాలతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్కు అందజేసి ముఖ్యమంత్రికి సమర్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా నడపాలనే విధానాన్ని పూర్తిగా విరమించుకొని, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు పి.తేజేశ్వరరావు, వై.అయ్యప్ప తదితరులు కోరారు.
● పాతపట్నంలోని ఒక ప్రైవేటు కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన (ఏపీవై) రాష్ట్ర నాయకులు సల్లా శాంతారావు, రాజ్యాంగ పరిరక్షణ సంఘం సభ్యులు పీజీఆర్ఎస్లో కోరారు. అర్హత లేని ఉపాధ్యాయులతో బోధన చేయించడం, అనుమతులు లేని హాస్టళ్లు నిర్వహించడం, విద్యార్థులపై వేధింపులు ఇతర అక్రమాలకు పాల్పడుతున్న ఆ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి కోరారు.


