మెళియాపుట్టి: గత ప్రభుత్వం హయాంలో ఐటీడీఏ నిధులు రూ.1.72 కోట్లతో రింపి నుంచి ఆంపురం గ్రామానికి వెళ్లే రహదారి మంజూరైంది. పనులు ప్రారంభం సమయానికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. కానీ ఇప్పటికీ ఆ రహదారి నిర్మాణాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో రహదారి అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఆంపురం గ్రామంలో బందపల్లి గౌరేశు, రంకిణి మల్లేశు, నేలబొంతు నాగేష్, బందపల్లి ఆదిలక్ష్మీ, డొలిబేరు లక్ష్మీ తోపాటు పలువురు గ్రామస్తులు ‘సాక్షి’తో మాట్లాడారు. రహదారి అస్తవ్యస్తంగా తయారై రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో అత్యవసర సమయాల్లో అవస్థలు పడుతున్నామని, పట్టించుకునే వారే కరువయ్యారని తెలిపారు. వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని కోరారు.


