● తండ్రితో వెళ్లిపోయిన ప్రేమించి పెళ్లాడిన యువతి ● తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు
శ్రీకాకుళం క్రైమ్: కారు డ్రైవర్గా పనిచేసే ఆ యువకుడు ఒకప్పుడు గంజాయికి బానిస. కానీ ఏడాది క్రితం ప్రేమించిన యువతిని పెళ్లాడడంతో పూర్తిగా మారిపోయాడు. అయితే ఆ యువతి మనసును తండ్రి మార్చివేసి ఇటీవల తీసుకెళ్లిపోవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి మరలా రాదనే బాధతో చివరికి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలోని ఒక వైద్యుడి వద్ద కారు డ్రైవర్గా పనిచేస్తున్న మజ్జి హేమంత్ (24) అనే యువకుడు కెల్లావీధిలో తల్లి కమలతో కలిసి నివసిస్తున్నాడు. మొదట్లో అల్లరచిల్లరగా వ్యసనాలకు లోనై తిరిగిన హేమంత్ ఏడాది క్రి తం బలగలో ఉంటున్న ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అప్పటినుంచి పూర్తిగా మారిపోయాడు. కాగా ప్రేమించి పెళ్లాడి వెళ్లిపోయిందనే కారణంతో యువతితో ఆమె తల్లిదండ్రులు మాట్లాడడం మానేశారు. అయితే నెలక్రితం సదరు యువతి పసగా డ సూర్యనారాయణ జంక్షన్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో పనిచేసేందుకు చేరింది. దీంతో అక్కడికి ఆమె తండ్రి పాపారావు వచ్చి కలుసుకోవడం జరిగింది. అనంతరం నెమ్మదిగా ఆమె మనసు మార్చేసిన తండ్రి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు.
దుస్తులు పంపించేయమని మెసేజ్ పెట్టడంతో..
దీంతో హేమంత్ పలుమార్లు తన భార్యకు ఫోన్చేసి రమ్మన్నా ఇదిగో అదిగో అంటూ దాటవేసేది. అయితే గతనెల 29న తన దుస్తులు పంపించేయమని హేమంత్కు మెసేజ్ పెట్టడంతో మరి తన వద్దకు రాదని తట్టుకోలేకపోయాడు. అప్పటినుంచి పూర్తి డిప్రెషనల్లోకి వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి తన తల్లి కమలమ్మ సోదరి జోఫ్ణవి ఇంట్లో పడుకోవడానికి వెళ్తుందన్న విషయం తెలుసుకున్న హేమంత్ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం
తల్లి వచ్చి చూసేసరికి ఉరికి వేలాడుతూ కుమారుడు కనిపించడంతో శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రెండో పట్టణ ఎస్ఐ–2 బి.హైమావతి ఘటనా స్థలానికి క్లూస్ టీమ్తో చేరకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


