వజ్రపుకొత్తూరు రూరల్: జీడి పరిశ్రమలు సంక్షోభం ఎదుర్కొంటున్న నేపథ్యంలో పలాస జీడి పరిశ్రమలు 10 రోజులు పాటు బంద్కు పిలుపునిచ్చాయని, బంద్ విరమణ తర్వాత కార్మికులకు జీవనోపాధి కల్పించాలని లేబర్ యూనియన్ సంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి కోరారు. పలాస లేబర్ యూనియన్ సంఘ భవనంలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. జీడి వ్యాపారాలు ఒడిదుడుకుల నేపథ్యంలో ఇండస్ట్రీయల్ ఏరియా పరిధిలో ఉన్న పరిశ్రమలు ఈనెల 25 నుంచి ఆగస్టు 3 వరకు బంద్ ఉంటుందన్నారు. అలాగే పలాస (పీసీఎంఏ) పరిధిలో ఉన్న పరిశ్రమలు ఈనెల 27 నుంచి ఆగస్ట్ 5 వరకు బంద్ పాటిస్తాయని తెలిపారు. ఈ పరిశ్రమల బంద్కు ఇండస్ట్రీయల్ ఏరియా కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్లు సహకరిస్తాయని పేర్కొన్నారు. కాగా బంద్ ముగిసిన వెంటనే ఫ్యాక్టరీలు తెరిపించి జీడి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. సమావేశంలో యూనియన్ సంఘ ప్రధాన కార్యదర్శి సాన ఈశ్వరరావు, కోశాధికారి కోనారి రాము, గౌరవ అధ్యక్షుడు బొంపల్లి సింహాచలం, సంఘ ఉప కార్యదర్శులు లక్ష్మీనారాయణ, మోహన్, రమణ, అప్పలమ్మ తదితరులు పాల్గొన్నారు.


