నందిగాం: ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధమవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కోనారి మోహనరావు, జిల్లా కమిటీ సభ్యుడు పి.ప్రసాద్, నంబూరు షణ్ముఖరావులు పిలుపునిచ్చారు. సోమవారం సీపీఎం పార్టీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ ప్రతినిధుల బృందం మండలంలోని పెద్దలవునిపల్లి, కంచిఊరు, కామధేనువు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఎందుకు ఆఫ్షోర్కు నిధులు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు నిధులు విడుదల చేయించడంలో విఫలం అవుతున్నారని ఆరోపించారు. అచ్చెన్నాయుడికి రైతాంగంపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో ఆఫ్షోర్ రిజర్వాయర్ సాధన పోరాట కమిటీ సభ్యులు పి.ధర్మారావు, వజ్జ సింహాచలం, పిన్నింటి కృష్ణమూర్తి, సాయి, కణితి ధీనబందు, పాపారావు, కిల్లి దుర్వాసులు, వజ్జ విద్యాసాగర్, పినకాన తులసయ్య, సీపీఏం నాయకులు కొల్లి ఎల్లయ్య, హనుమంతు ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి, బగాది వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్తో యువకుడు మృతి
వజ్రపుకొత్తూరు రూరల్: పలాస మండలం సరియాపల్లిలో సోమవారం విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పెద్ద నారాయణపురం గ్రామానికి చెందిన యువకుడు మురపాక లోకేశ్వరరావు(30) సోమవారం ఉదయం సరియాపల్లిలో విద్యుత్ మోటర్ మరమ్మతుల పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో పలాస ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు స్థానిక ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా యువకుడి మృతితో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.


