● ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి 35వేల మందిని తరలించడమే లక్ష్యం
● పంచాయతీ కార్యదర్శులకు, వెలుగు గ్రామ సహాయకులకు బాధ్యతలు
● జన సమీకరణ బాధ్యత మేట్లు, డ్వాక్రా సంఘాలకు అప్పగింత
● క్షేత్రస్థాయిలో కనిపించని స్పందన
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అధికారులకు, చిరు ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు పీక మీద కత్తిలా తయారైంది. ప్రధానమంత్రి మోడీ హాజరయ్యే సభ కోసం ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్తున్నారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. అదే సమయంలో డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్లకు, పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 35వేల మందిని తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టింది. తీసుకెళ్లిన దగ్గరి నుంచి భోజనం అందించేవరకు బాధ్యత తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు, వెలుగు గ్రామ సహాయకులకు ఆదేశించింది. కానీ, ప్రజల నుంచి ఆ స్థాయిలో స్పందన లేకపోవడంతో ఏం చేయాలో తలలు పట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలోని ప్రయాణికులకు కూడా ఈ రోజు కష్టాలు తప్పవు. దాదాపు 150 కిపైగా బస్సులు మోదీ సభకు తరలించడంతో జిల్లాలోని చాలా రోడ్ల బస్సు సర్వీసులు రద్దు కానున్నాయి.
జిల్లా నుంచి 35వేల మందిని తీసుకురావాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు ఆదేశించారు. వారికి అవసరమైన రవాణా, భోజనం ఇతరత్రా అన్నీ సమకూర్చుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులకే అప్పగించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి 150ఆర్టీసీ బస్సులను కేటాయించింది. వాటితో పాటు ప్రైవేటు బస్సులన్నీ ఎయిర్పోర్టుకే ఒత్తిడితో తిప్పుతోంది. ఇవి చాలదన్నట్టు ప్రైవేటు స్కూల్స్కు సెలవులు ఇచ్చి, ఆ బస్సులన్నింటినీ మోదీ సభకు మళ్లించింది. రవాణా శాఖ ద్వారా ఎన్ని చేయాలో అన్నీ చేసింది. దీంతో ప్రయాణికులు ఈ రోజు కష్టాలు పడాల్సిందే. చాలావరకు ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు. ఇచ్ఛాపురం, సోంపేట, పలాస, పాతపట్నం, హిరమండలం, ఆమదాలవలస, బత్తిలి, టెక్కలి, సారవకోట, నరసన్నపేట, రాజాం, బొబ్బిలి తదితర రూట్లలో ఆర్టీసీ సర్వీసులు తగ్గించేశారు. ఉదాహారణకు ఒక రూట్లో రోజుకి 10 సర్వీసులు తిరిగితే.. ఇప్పుడు ఐదు సర్వీసులే తిరగనున్నాయి. దాని ఫలితంగా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. పబ్లిక్, ప్రైవేటు బస్సులన్నీ అధికారుల చేతిలో పెట్టుకుని, గ్రామానికో బస్సు చొప్పున జనాలను తరలించేందుకు కేటాయించారు. ఈ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు, వెలుగు గ్రామ సహాయకులకు అప్పగించారు. జనాల్ని తరలించాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలా మంది చెప్పడంతో ఇరకాటంలో పడ్డారు. ఒక వైపు కూటమి నాయకుల టార్గెట్లు, మరోవైపు అధికారుల ఒత్తిళ్లు వెరసి జనసమీకరణ, తరలింపు బాధ్యతలతో ఉద్యోగులు, చిరుద్యోగులు తీవ్రంగా సతమతమవుతున్నారు.
ఏఎన్ఎంల తరలింపు
టెక్కలి: భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనాల తరలింపులో భాగంగా అత్యవసరంగా గ్రామాల్లో వైద్య సేవలను అందజేసే ఏఎన్ఎంలను సైతం తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్కలి మండలానికి సంబంధించి సుమారు 20 మంది ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రతీ నెలా చిన్న పిల్లలకు అందజేస్తున్న ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1 మొదటి శనివారం గ్రామాల్లో ఇమ్యునైజేషన్ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. చిన్నారులకు అందజేయాల్సిన ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా అధికారులు ఆరోగ్య కార్యకర్తలను భోగాపురం తరలించడం విస్మయానికి గురి చేస్తోంది. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సైతం బస్సులు లేక వెలవెలబోయింది.


