జలుమూరు: పోరాటాలతోనే ఆదివాసీల హక్కులు సాధించుకోగలమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కుల సమన్వయకర్త వి.ఎస్.కృష్ణ అన్నారు. మండలంలోని ఎస్టీ మాకివలసలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగీశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం జరిగిన భూ పోరాట విజయోత్సవ సభలో మాట్లాడారు. 1/70 చట్టాన్ని సవరిస్తూ సుప్రీంకోర్టులో గిరిజనేతరులు కేసులు వేస్తుండడం దుర్మార్గమన్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన ఐదో షెడ్యూల్ పిసా చట్టం పక్కాగా అమలు చేయాలన్నారు. మాకివలస భూ పోరాటం అత్యంత అరుదైనదిగా అభివర్ణించారు. ఆదివాసీలు ఐక్యతతో ముందుకు వెళ్తే సాధించనది ఏదీ ఉండదని పేర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన థింసా నృత్యం పలువురుని ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీను, అఖిల భారత కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మాధవరావు, వివిధ సంఘాల నాయకులు ఉదయ్ భాస్కర్, కోత ధర్మారావు, కేవీ జగన్నాథరావు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


