● ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్
బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభం
● తొలిరోజు క్వాలిఫయింగ్ నిర్వహణ
● నేటి నుంచి మెయిన్ డ్రా పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: బాయ్, ఏపీబీఏ సహకారంతో శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా నాలుగు రోజులపాటు జరుగుతున్న ఏ పీ రాష్ట్రస్థాయి (అంతర్జిల్లాల) సీనియర్స్ పురుషులు, మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీలు ఆదివారం ప్రారంభమ య్యాయి. నాలుగు రోజుల ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు ఆదివారం క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోటీలు నిర్వహించారు. మెయిన్డ్రాకు అర్హత సాధించడానికి నిర్వహించిన ఈ క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోరుకు రాష్ట్ర నలుమూలల నుంచి 200 మంది వరకు షట్లర్లు హాజరుకావడం విశేషం. వీరిలో 1:4 నిష్పత్తిలో సుమారు 40 నుంచి 50 మంది మెయిన్డ్రాకు అర్హత సాధించనున్నారని జిల్లా బ్యాడ్మింటన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, బ్యాడ్మింటన్ జిల్లా సీఈఓ సంపతిరావు సూరిబాబు వెల్లడించారు.
నేటి నుంచి మెయిన్డ్రా మొదలు..
తొలిరోజు క్వాలిఫైయింగ్ రౌండ్స్ పోటీలు జరగగా.. సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మెయిన్ డ్రా పోటీ లు జరగనున్నాయి. మొత్తం 5 కేటగిరీల్లో అనగా పురుషుల సింగిల్స్, డబుల్స్, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ పోటీలను నిర్వహించనున్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన (క్రీడాకారులు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందాన్ని త్వరలో భువనేశ్వర్ వేదికగా జరగనున్న ఆలిండియా నేషనల్స్ సీనియర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు ఏపీబీఏ ఉపాధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్, టోర్నీ మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ పేర్కొన్నారు. ఈ పోటీలకు చీఫ్ రిఫరీగా అంతర్జాతీయ అంపైర్ జిలానీ భాషా, రిఫరీగా రామకృష్ణయ్య, టెక్నికల్ అఫీషియల్స్గా మరో 40 మంది వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేనప్పటికీ.. ఈ బ్యాడ్మింటన్ స్టేట్ మీట్కు జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిదులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు.


