● చంద్రబాబుది క్రెడిట్ చోరీ ● 2024 నాటికే 85 శాతం పనులు పూర్తి చేశాం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట: ‘భోగాపురం విమానాశ్రయానికి కొబ్బరికాయ కొట్టింది మేమే.. గుమ్మడి కాయ కొట్టింది మేమే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలే కూటమి హయాంలో ఈ ప్రాజెక్టుకు ఏమీ చేయలేదనే నిజానికి నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎద్దేవా చేశారు. రెండు రోజులుగా భోగాపురం ఎయిర్ పోర్టుకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై కృష్ణదాస్ స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్నది అంతా క్రెడిట్ చోరీయేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల ముందు ఎలాంటి అనుమతులు, భూ సేకరణ పూర్తి కాకుండానే చంద్రబాబు హడావుడిగా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సుమారు రూ.1200 కోట్లుతో భూ సేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ 2203 ఎకరాలను నిర్మాణ సంస్థకు అప్పగించి పనులు శరవేగంగా జరిగేందుకు కార్యాచరణ చేపట్టారన్నారు. 2024 నాటికి 85 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. విమానాశ్రయానికి ఒక రూపు తీసుకువచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రంగులు వేసి ఇదంతా తామే చేశామని టీడీపీ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పచ్చ పత్రికలు ఎంతగా తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించినా జనాలకు విషయం తెలుసని అన్నారు.
‘టీడీపీ నేతలు క్రెడిట్ చోరీ మానుకోవాలి’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భోగాపురం ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణ చేసి ఆయా ప్రాంత రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీకోసం రూ.1200 కోట్లుకి పైగా ఇచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమని తూర్పుకాపు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. శంకుస్థాపన చేసిన రోజునే వైఎస్ జగన్మోహన్రెడ్డి 2026 నాటికి ఎయిర్పోర్టు ప్రారంభిస్తామని చెప్పా రని, రెండేళ్లలోనే దాదాపుగా 85శాతం పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్సార్సీపీదేనని అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం మానుకోవాలన్నారు.
మామిడి శ్రీకాంత్


