Prakasam District News
-
వేలం పాటల ఆదాయం రూ.13.77 లక్షలు
సింగరాయకొండ: పాత సింగరాయకొండ వరాహలక్ష్మీ నరశింహస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయానికి వేలం పాటల ద్వారా రూ.13.77 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈఓ పీ కృష్ణవేణి తెలిపారు. జెయింట్ వీల్ ద్వారా రూ.12.25 లక్షలు, కొబ్బరికాయలు అమ్ముకొనేందుకు రూ.1.52 లక్షలు వేలం నిర్వహించినట్లు ఆమె వివరించారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యన్నారాయణ, అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరశింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరశింహాచార్యులు, సిబ్బంది బ్రహ్మయ్య, దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్చార్జి డ్వామా పీడీగా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ విజయసునీతను కలిశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతరావు గతంలో మార్కా పురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తించారు. ● మంత్రి రామానాయుడు పెద్దదోర్నాల: నల్లమల సాగర్ను నింపటమే లక్ష్యంగా వెలుగొండ ప్రాజెక్టు పనులు జరుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులతో పాటు, ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్లు రిటైనింగ్ వాల్, వింగ్స్ రిటర్న్ పనులతో పాటు, టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి పరిహారాన్ని అందిస్తామన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ. రమేష్, ఎస్ఈ అబూతాలిం తదితరులు పాల్గొన్నారు. -
సర్ సర్వేలో ఏకపక్షంగా బీఎల్ఓలు
మార్కాపురం టౌన్: సర్ సర్వేలో కొందరు బీఎల్ఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన సర్ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో బీఎల్ఓ మొదటి రోజైన సోమవారం అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ వైస్ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత బాలయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామస్తుల్లో కొందరికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఇక గజ్జలకొండ, గొట్టిపడియ, నాగులవరం గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. ఎన్యుమరేషన్ పూర్తిచేసే ఫారంలో, 2002, 2025 ఓటర్ల జాబితా సవరణ చూసి ఫారం నింపే సమయంలో ఎటువంటి ఫారాలు బీఎల్ఓకు అందజేయాలనే విషయంలో కూడా పలు చోట్ల గందరగోళం నెలకొంది. ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిచేసి బీఎల్ఓకు ఇచ్చిన తరువాత ఓటరుకు అక్నాలెడ్జ్మెంటు స్లిప్ ఇచ్చే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో ఓటర్లకు, బీఎల్ఓలకు మధ్య వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు బీఎల్ఓలు తమకు కేటాయించిన గ్రామాల్లో ముందుగా అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి వారిని తీసుకుని ఓటర్ల ఇంటి వద్దకు వెళ్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సర్’ పట్ల కొరవడిన అవగాహన ● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పొదిలి: ఓటర్ల పూర్తి స్థాయి ప్రక్షాళనకు సంబంధించి సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీఎల్ఓలు, బీఎల్ఏలు, ఓటర్లలో పూర్తి స్థాయి అవగాహన కొరవడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సర్ పట్ల పూర్తి స్థాయి అవగాహన, విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలో 257 మంది బీఎల్ఓలు ఉన్నారని, అయితే వారిలో కొందరు అవగాహన లోపించి పలు రకాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో బీఎల్ఏలలో ఓటర్లలో అయోమయం నెలకొందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, బాలారిష్టాలు అనే విధంగా వ్యవహారం ఉన్నా, గడువు తీరితే ఇబ్బంది వస్తుందన్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి కమిషన్ ఆదేశాలను ఏకరూపంగా అనుసరించటం ద్వారా ఎవరికీ సమస్య లేకుండా ఉంటుందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు కొంత మంది బీఎల్ఓలు నింపడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారం నింపటం మాకు సంబంధం లేదని బీఎల్ఓలు కొందరు సమాధానం చెబుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారికి ఎన్యుమరేషన్ ఫారాలు నింపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఐడీ కార్డులు ఎవరి ఇష్టానుసారం వారు అడుగుతున్నారని, ఏ కేటగిరీకి ఎన్ని ఐడీ కార్డులు ప్రూఫులు అవసరమో అన్ని మాత్రమే తీసుకునేలా బీఎల్ఓలకు ఆదేశాలివ్వాలన్నారు. రిసిప్టులు ఇవ్వకుండా, రెండు ఫారాలు బీఎల్ఓలే స్వాధీనం చేసుకుంటున్నారని, అలాంటప్పుడు ఓటర్ల వద్ద ఆధారం ఏమీ ఉండదు కదా అని ఆయన ప్రశ్నించారు. రసీదులు ఇచ్చేలా బీఎల్ఓలకు సూచనలు ఇవ్వాలన్నారు. మరి కొందరు బీఎల్ఓలు కార్యాలయానికి వచ్చి అవసరమైన ఫారాలు తీసుకెళ్లాలని చెబుతున్నారని, అలా కార్యాలయాలకు వెళ్లాలంటే ఓటర్లకు, బీఎల్ఏలకు సమస్యగా మారుతుందని చెప్పారు. దీంతో ప్రక్రియ వేగవంతం తగ్గుతుందన్నారు. అధికారులైనా, బీఎల్ఓలైనా బీఎల్ఏలను అందరినీ ఒకే రకంగా చూడాలని, బీఎల్ఏలకు వచ్చే అనుమానాల నివృత్తి కోసం, సంబంధిత అధికారి ఫోన్ నంబర్ ఏదైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ పేరుతో ఎకరా భూమి 99 పైసలకే ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం నిధులు లేవని ఒట్టి చేతులు చూపుతోందని, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తీవ్రంగా విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూలై 10వ తేదీన చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ ఇంద్రావతి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అంగన్వాడీలకు 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని చెప్పారు. మినీలను మెయిన్ చేయడం యూనియన్ ఫలితంగానే జరిగిందన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు గ్రాట్యూటీని ఏపీలో కూడా ఇవ్వాలని, ఈ విషయం గురించి మార్చిలో చలో విజయవాడ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 5 సంవత్సరాల్లోపు చిన్నారులను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చుకోకుండా జీఓ ఇవ్వాలని, ప్రీ స్కూల్ సక్రమంగా అమలయ్యేలా అంగన్వాడీలకు ఇతర పనులు అప్పగించరాదని కోరారు. రకరకాల యాప్లతో అంగన్వాడీలపై ఒత్తిడి పెంచడం వలన అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 10వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ వేయమని కోరుతున్నా వేయకపోవడం దారుణమన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఐవీఆర్ కాల్స్కు ప్రజలు ఫోన్ ఎత్తక పోయినా, ప్రభుత్వానికి అనుకూలంగా మెసేజ్ ఇవ్వకపోయినా అంగన్వాడీలకు మెమోలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఫోన్లను ప్రజలు రిసీవ్ చేయకపోతే దానికి అంగన్వాడీలు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను వేధించడం మానుకోవాలని కోరారు. సమావేశంలో ధనలక్ష్మి, హేమిమా, క్రాంతి కుమారి, చిన్నమ్మాయి పాల్గొన్నారు. -
మాట్లాడదామని పిలిచి.. మహిళపై కత్తితో దాడి
అర్ధవీడు: ‘సమస్యేదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం రండి’ అంటూ నమ్మించి పిలిచి.. ఒక మహిళపై కత్తితో ఘాతుకానికి తెగబడిన సంఘటన అర్ధవీడు మండల పరిధిలోని మాగుటూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, వైఎస్సార్ సీపీ బీఎల్ఏ యాబాకుల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం యాబాకుల రజిత (38) ఇంటి ముందర శుభ్రం చేసి నీళ్లు చల్లుతుండగా, పక్కనే ఉండే ఓబినేని వెంకటలక్షమ్మతో చిన్నపాటి వివాదం జరిగింది. అనంతరం రజిత, వెంకటేశ్వరుర్లు ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో నాలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ‘సమస్య పరిష్కరించుకుందాం రండి’ అని వారిని తన ఇంట్లోకి పిలిచాడు. రజిత ఇంట్లోకి వెళ్లగానే ముందస్తు పథకం ప్రకారం తలుపులు వేశారు. ఆమె భర్త వెంకటేశ్వర్లు లోపలికి రాకుండా వరండా ఐరన్ గ్రిల్స్ మూసివేశారు. అదే సమయంలో ఇంట్లో మాటు వేసిన ఓబినేని ప్రవీణ్కుమార్, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మ ఒక్కసారిగా రజితపై దాడికి పాల్పడ్డారు. కత్తితో ఆమె వీపు, మెడ భాగాలపై నాలుగు సార్లు విచక్షణారహితంగా పొడిచారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రజిత భర్తతోపాటు గిద్దలూరు సరోజ అనే మహిళను సైతం నిందితులు గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రజితను స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని అర్ధవీడు పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓబినేని ప్రవీణ్కుమార్, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకోబోయిన భర్త, మరో మహిళకు గాయాలు నలుగురు నిందితులపై కేసు నమోదు -
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడు మృతి
● మరో ఇద్దరికి గాయాలు బల్లికురవ: పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వలస వచ్చిన కార్మికుల జీవితాల్లో మద్యం చిచ్చు రేపింది. మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాన్ని బలిగొనగా, మరో ఇద్దరిని ఆసుపత్రి పాలుచేసింది. ఈ విషాదకర ఘటన సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి – అనంతవరం ఆర్అండ్బీ రోడ్డులో వేమవరం జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన చరణ్(40), మరో కార్మికుడు కలిసి సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగారు. అనంతరం వారిద్దరూ వేమవరం జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక బైక్ వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వలస కార్మికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన చరణ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడితో పాటు బైక్పై నుంచి కిందపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
ట్రావెల్స్ బస్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్
● 8 మందికి గాయాలు గుడ్లూరు: హైవే మార్జిన్ వెంట నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై గుడ్లూరు మండలం శాంతినగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి నాగూర్(నాగపట్నం) వైపు వెళ్తున్న భార్గవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో విజయవాడ నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి, ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న జామాయిల్ తోటలోకి దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు ఎస్సై తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న గడికోట ధనలక్ష్మి, జనసూత్రపు రాజేశ్వరి, తుమ్మలపల్లి రేష్మా, కోరా రాధమ్మ, కోడలూరు నాగమణి, దుక్కపాటి మార్తమ్మ, బెల్లం జయరాం, కోడూరు సుబ్బారావు సహా మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
బలిపశువులైంది బడుగులే!
నాగులుప్పలపాడు: కూటమి నాయకుల ఆధిపత్య పోరుకు నిరుపేద జీవాల కాపరులు బలైపోయారు. పరాయి గ్రామం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన బడుగుల జీవితాలను కూటమి నాయకుల పంతాలు, పగలు చిన్నాభిన్నం చేశాయి. బాపట్ల జిల్లా పెదగంజాంకు చెందిన గొర్రెల కాపరులు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కావూరి వాసు చేలో గొర్రెల పెంట కట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పక్కనే చేనున్న టీడీపీ నాయకుడు ఉప్పల సుబ్బారావుకు, వాసుకు పాత కక్షలు ఉన్నాయి. వాసుపై ఉన్న కక్షను సుబ్బారావు అమాయక గొర్రెల కాపరులపై చూపించాడు. గత పంటకు సంబంధించిన ఒకటి రెండు మొక్కజొన్న మొలకలను గొర్రెలు మేశాయనే నెపంతో ఎల్లావుల అనీల్పై సుబ్బారావు తొలుత దాడికి దిగాడు. అంతటితో ఆగక తన అనుచరులను పిలిపించి అనీల్ను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడిలో అనీల్ భుజం కీలు జారిపోయింది. ప్రాధేయపడిన మరో కాపరి వడ్లమూడి మధును సైతం శ్రీగొల్ల నా కొడకల్లారాశ్రీ అంటూ కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణా రహితంగా కొట్టారు. గాయపడిన యువకులు న్యాయం కోసం సాయంత్రం గ్రామంలోని పెద్దమనుషుల వద్దకు వెళ్లగా, టీడీపీ కార్యాలయం వద్ద అధికార పార్టీ ఉన్న నిందితులు మరోమారు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని పక్కదోవ పట్టించేందుకు సుబ్బారావు డ్రామాలకు తెరలేపాడు. చేలో పచ్చిరొట్ట ఎరువు పంటను గొర్రెలు మేసేశాయంటూ అబద్ధాలు ప్రచారం చేశాడు. అసలు చేలో పంటే లేకపోవడంతో, అధికారులు వస్తే తన బండారం బటయపడుతుందని మంగళవారం ఉదయం హడావిడిగా చేనును దున్నేశాడు. దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం వత్తాసు పలకడం గమనార్హం. బాధితుల ఫిర్యాదును కేవలం సాధారణ దాడిగా చిత్రీకరిస్తూ, ఎదురు దాడి చేసిన వారి ఫిర్యాదుతో బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాలి ఈ అన్యాయంపై అఖిల భారత యాదవ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులతో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడంతో పాటు, జూన్ 15న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. బాధితులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈదుమూడి ఘటనకు కూటమి నాయకుల ఆధిపత్య పోరే కారణం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం -
జవహర్ నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మార్కాపురం టౌన్: మార్కాపురం లోని జవహర్ నవోదయ విద్యాలయ–2లో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతిలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, సైన్సు, గణితం సబ్జెక్టులు ఎంచుకోదలచిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులో 60 శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 25వ లోపు నవోదయ కార్యాలయం పనిచేసే సమయాల్లో అందించాలన్నారు. ● ఇద్దరు విద్యార్థులు డీబార్ ఒంగోలు టౌన్: ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం లా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, మార్కాపురంలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు గాను 760 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 725 మంది హాజరయ్యారు. 35 మంది గైర్హాజరయ్యారని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి.సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు 170 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 156 మంది పరీక్షలకు హాజరయ్యారని, మిగిలిన 14 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలకు 46 మందికి గాను 42 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి గాను పరీక్ష కేంద్రాల్లో యూనివర్శిటీ పరీశీలకులను, తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యూనివర్శిటీ తనిఖీ బృందం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు తెలిపారు. -
పటిష్టంగా నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జేసీ కల్పనా కుమారి ఒంగోలు సబర్బన్: నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ ఒంగోలు నగరంలో నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అందుకుగాను చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం, డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పీఎం జవహర్ నవోదయ విద్యాలయం, డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలుర హైస్కూల్లో జరగనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
దివి వర్సెస్ ఇంటూరి నువ్వా..నేనా.!
కందుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఎప్పటికప్పుడు బహిర్గతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య అంతర్గత పోరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చిన శివరాం, తిరిగి మరోసారి అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావుకి చెక్ పెట్టాలనే వ్యూహంతో తెరవెనుక పావులు కదుపుతూనే సీనియర్లను అవమానిస్తున్నారంటూ బహిరంగంగానే ప్రకటించారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఎమ్మెల్యే ఇంటూరి వర్గం కూడా అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం. కందుకూరు: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు మధ్య అంతర్గత పోరు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. వారి మధ్య ఎన్నికల ముందు నుంచే విభేదాలున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం మౌనంగా ఉన్న శివరాం తిరిగి ఇటీవల కాలంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కందుకూరు పట్టణంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు చిరకాలం గుర్తుండిపోయే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశారని, దశాబ్దాల పాటు అభివృద్ధి చేస్తేనే ప్రస్తుతం పట్టణంలో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. తన తండ్రి దివి కొండయ్యచౌదరి, మానుగుంట ఆదినారాయణరెడ్డి, మహీధర్రెడ్డి, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తు లేవా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మొత్తం అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. నలుగురు వైఎస్సార్ సీపీ వాళ్లను పార్టీలో చేర్చుకుని అదే బలం అనుకుంటే పొరపాటు అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని గుర్తించాలంటూ ప్రత్యక్షంగానే ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. అలాగే నియోజకవర్గంలో గంజాయి విక్రయాలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ ప్రకటించారు. ఇలా ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ అవుతూనే ఉన్నారు. అసంతృప్త నాయకులు, కార్యకర్తలను కూడగట్టేందుకు జోరుగా ప్రయత్నాలు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సరైన గుర్తింపు లేకపోవడం, కాంట్రాక్టు పనులు, పదవుల్లో ప్రాధాన్యత దక్కకపోవడం, ఎమ్మెల్యే వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ పార్టీకి కొంత దూరంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను తనవైపు తిప్పుకునేందుకు దివి శివరాం కొంత కాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి అనుగుణంగా పార్టీలో ప్రాధాన్యత లేని నాయకులు శివరాం దగ్గరకి రావాలంటూ ఆయన వర్గం వాట్స్యాప్ గ్రూపుల్లో ప్రకటించడం గమనార్హం. అదే సందర్భంలో అసంతృప్త నాయకుల కోసం ఓ గ్రూపును కూడా క్రియేట్ చేశామంటూ చెప్తున్నారు. అందరూ కలిసి వస్తే శివరాం ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసి బాధలు చెప్పుకుందామని, నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిని పెద్దలకు చెప్పుకుందామంటూ సమీకరించే పనిలో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. శివరాంపై అధిష్టానానికి ఫిర్యాదులు అదే సందర్భంలో శివరాం ప్రయత్నాలకు చెక్పెట్టే పనిలో ఎమ్మెల్యే ఇంటూరి వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు, పార్టీలో విభేదాలు సృష్టించేలా శివరాం వ్యవహరిస్తున్నారంటూ పార్టీ అధిష్టానానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు లేవనే చెప్పాలి. ఇలా పార్టీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో ప్రస్తుతం అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి. తెరవెనుక రాజకీయ వ్యూహం... ఇటీవల కాలంలో శివరాం పార్టీలో తన స్పీడ్ పెంచడం పట్ల భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందని ఆ వర్గం చెప్పుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడంతో పాటు, తన సోదరుడైన దివి రవీంద్రనాఽథ్ని ఎన్నికల బరిలో దింపేందుకు ఇప్పటి నుంచి తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఇటీవల రవీంద్రనాఽథ్ పట్టణంలో సొంత ఇంటిని నిర్మించుకోవడం, ఇక నుంచి తాను ఇక్కడే ఉంటానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోల్పోయిన దివి వంశ ప్రాబల్యాన్ని మళ్లీ నిలబెట్టాలనే పట్టుదలలో భాగంగా శివరాం తెరవెనుక కథ నడుపుతున్నారు. అందుకు అనుగుణంగా ఇటీవల కాలంలో నియోజకవర్గంలో శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు తన సోదరుడు రవీంద్రనాఽథ్ను వెంటబెట్టుకుని శివరాం తిరుగుతున్నారు. అంటే పార్టీలో కార్యకర్తలు, నాయకులకు తన సోదరుడిని పరిచయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి నుంచి తన వెంట వర్గాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ సీనియర్ నాయకుడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే. -
ఈదురుగాలుల బీభత్సం..
మార్కాపురం రూరల్/కొండపి/యర్రగొండపాలెం: : మార్కాపురం, కొండపి మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలుల కారణంగా పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులే స్వచ్ఛందంగా శ్రమించి చెట్లను తొలగించారు. వర్షం ధాటికి తక్కువ వ్యవధిలోనే రహదారులు జలమయమయ్యాయి. ఇంటిపై పడ్డ చెట్టు.. తప్పిన ప్రమాదం కొండపి, పొన్నలూరు మండలాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కోయవారిపాలెం గ్రామంలో మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఓ చెట్టు ఇంటిపై పడగా, ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.యర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్లోని బీసీ కాలనీ సమీపంలో చెట్టు విరిగి తీగలపై పడటంతో దాదాపు 3గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏఈ కిషోర్ తెలిపారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించాలి
ఒంగోలు సబర్బన్: రొయ్యల ఫీడ్ కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని జిల్లా రొయ్యల రైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రొయ్యల రైతుల సంఘ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట రొయ్యల రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రొయ్యల రైతులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యలు సాగు చేస్తున్నారన్నారు. రొయ్యల సాగులో పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన రొయ్యల ధరల వలన వనామీ రొయ్యలు సాగు చేసిన రైతులకు 60 కౌంట్ వరకు పెంచితేగానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రావటం లేదన్నారు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు పెంచిన రైతులకు కౌంట్ల వారీగా కేజీకి రూ.40 నుంచి రూ.30 వరకు పెట్టిన పెట్టుబడిలో నష్టపోతున్నారని, టైగర్ రొయ్యలు సాగు చేసిన రైతులకు 40 కౌంటు వరకు పెంచితే గానీ పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఫీడ్ కంపెనీలు వనామి ఫీడును కేజీకి రూ.10, టైగర్ ఫీడ్ను రూ.12 అప్సడా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రైతుల అభ్యంతరం పట్టించుకోకుండా ఏకపక్షంగా పెంచాయన్నారు. పెంచిన ఫీడ్ ధరలను ఖర్చులో పరిగణలోకి తీసుకుంటే వనామీ సాగుచేసిన రైతులకు 40 కౌంటుకు రొయ్యలను పెంచితే గానీ పెట్టుబడి ఖర్చులు రావన్నారు. వనామి రొయ్యల మొత్తం సాగులో కేవలం 10 శాతం మాత్రమే 40 కౌంట్కు రొయ్యలు ఎదుగుతాయని, మిగతా 90 శాతం రైతులు 100 నుంచి 50 కౌంట్ లోపే రొయ్యలను హార్వెస్ట్ చేస్తారని చెప్పారు. టైగర్ రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన రొయ్యల ఫీడ్ ధరలు వలన 30 కౌంట్కు పెరిగితే గానీ పెట్టుబడి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పెరిగిన ఫీడ్ ధరలు ఇదే విధంగా కొనసాగితే మొత్తం రొయ్యల రైతుల్లో ఒక సంవత్సరంలోపే 80 శాతం మంది రొయ్యల సాగుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల ఉత్పత్తి తగ్గి ప్రాసెసింగ్ ప్లాంట్స్ మూతపడే ప్రమాదం ఉందన్నారు. ధర్నాకు ముందు మత్స్యశాఖ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు రొయ్యల రైతులు నిరసన ప్రదర్శన చేశారు. రొయ్యల రైతులకు హ్యాచరీ అసోసియేషన్, ఫీడ్ షాప్ల అసోసియేషన్ మద్దతు పలికాయి. ధర్నాలో రొయ్యల రైతులు సంఘ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కుంతురి సుబ్బారెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సంఘం సలహాదారుడు చేపల రమణయ్య, ఉపాధ్యక్షుడు సింగమనేని అంజిబాబు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్ రెడ్డి, నార్నె రమేష్, సంఘం జిల్లా నాయకులు ఉప్పలపాటి నాగరాజు, నార్ని సతీష్, కొంక రంగారావు, గోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున రొయ్యల రైతులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
టంగుటూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కారుమంచి, జయవరం గ్రామాల మధ్య సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారుమంచి, జయవరం గ్రామాల మధ్య ముసివాగులో ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఇద్దరు క్షేమంగా బయటికి వచ్చారు. వారిలో మన్నం కార్తీక్ మృతి చెందాడు. కార్తీక్ జెడ్పీ హైస్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఈ విషయంపై టంగుటూరు పోలీస్స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. గిద్దలూరు రూరల్: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట – చలమ మధ్య నల్లమల అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడేందుకే రైలు వచ్చే సమయంలో ట్రాక్ మధ్యలో ఉండటం వలనే రైలు పట్టాల మధ్యలో ఉండిపోయినట్లు రైల్వే పోలీసులు అంచనా వేశారు. రైలు ఢీకొట్టడంతో మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. మృతుడు పాచీ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. నంద్యాల జీఆర్పీఎఫ్ ఎస్సై కుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కల్లోల కడలిపై .. ఆకలి వేట
● ముగిసిన రెండు నెలల విరామం ● నిషేధం తర్వాత సంద్రంలోకి గంగపుత్రులు ● రెండేళ్లుగా కడలి పుత్రుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం ● వరుస విపత్తులు.. సోనాబోట్ల దాడులతో నష్టపోయిన మత్స్యకారులు ● ఈసారైనా కరుణించు తల్లీ అంటూ పూజలు ఆకలి వేటఅపార మత్స్య సంపదకు నిలయమైన సంద్రమే వారికి జీవనాధారం. ఎగసి పడుతున్న అలలకు ఎదురొడ్డి.. ప్రాణాలకు తెగించి బతుకు నావతో ప్రయాణం. వేట సాగితేనే పూట గడవని గంగపుత్రులు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ అలలపై ఆశల వేటకు సిద్ధమయ్యారు. మత్స్య సంపద వృద్ధి కోసం విధించిన వేట నిషేధం నేటితో ముగిసింది. వేకువ జామునే గంగమ్మకు పూజలు నిర్వహించారు. వేట సజావుగా సాగాలని వేడుకున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సారైనా కరుణించు తల్లీ అంటూ కడలిపుత్రులు సంద్రంలోకి అడుగు పెట్టారు. లంగరు వేసిన బోట్లు తెల్లవారు జామునే తీరానికి చేర్చి సాగర మథనానికి సిద్ధమయ్యారు. సోమవారం జిల్లాలో తీరం సందడిగా మారింది. సింగరాయకొండ: జిల్లాలో రెండు నెలల చేపల వేట నిషేధం తరువాత సోమవారం నుంచి ఎంతో ఆశలతో చేపల వేట ఆరంభమైంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో తొలి రోజు ఆశాజనకంగా ఉందని మత్స్యకారులు సంబర పడ్డారు. ఒక్కో బోటుకు రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పైగా విలువజేసే చేపలు లభించాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా చేపల వేట సక్రమంగా రోజుకు ఒక్కసారి మాత్రమే చేపల వేట సాగిస్తూ వస్తున్నారు. ఈ సారైనా గట్టెక్కుతామా అంటూ కోటి ఆశలతో వేట మొదలెట్టారు. 70 కిలో మీటర్లు..39 గ్రామాలు.. జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా, సుమారు 5,500 గృహాలు ఉండగా చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగాా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్ బోట్లు, 642 నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంగపుత్రులకు గడ్డురోజులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్స్యకార భరోసా ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. మూడో ఏడాది రకరకాల నిబంధనలతో ఇబ్బందులకు గురిచేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా అన్నీ ఒడిదుడుకులే.. వరుస ప్రకృతి విపత్తులు ఒకవైపు...తమిళనాడు కడలూరు, పాండిచ్చేరి కరెక్కల్ సోనాబోట్ల దాడులతో రెండేళ్లుగా చేపల వేట ఆశాజనకంగా లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తుఫాన్లు, అల్పపీడనాలు రావటంతో వేట సక్రమంగా సాగలేదని, ఒకవేళ వేటకు వెళ్లినా మత్స్య సంపద సక్రమంగా పడలేదని, చివరికి ఖర్చులు కూడా రాలేదు. తమిళనాడు రాష్ట్రం కడలూరు, పాండిచ్చేరి కరైకల్కు చెందిన సోనాబోట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. ప్రాణాలకు తెగించి పాండిచ్చేరి కరైకల్కు చెందిన నాలుగు సోనాబోట్లు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచామని, అయితే వాటిని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కుట్రలు చేసి వదిలేశారని ఆరోపించారు. వారితో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకుని బోట్లను వదిలేసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారులకు తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార పెద్దలు మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి దోషులను గుర్తించినా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. పాలేల్లో ప్రత్యేక పూజలు మత్స్య సంపద వృద్ధి కోసం ఏప్రిల్ 14వ తేదీ నుంచి 61 రోజుల పాటు ప్రభుత్వం చేపల వేటకు నిషేధం విధించింది. నిషేధకాలం ముగియడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి తీరంలో సందడి మొదలైంది. తమను చల్లగా కాపాడు. తిరిగి వచ్చేలా చూడమ్మా.. అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అదే విధంగా మత్స్య సంపదతో సిరిసంపద పెరిగేలా చూడాలని కోరుకున్నారు. మత్స్యకార మహిళలు సముద్రంలో కుంకుమ, పసుపు సమర్పించారు..కొత్తబోట్లు, వలలు కొనుక్కున్న మత్స్యకారులు మాత్రం తీరంలో పూజలు చేసుకుని టెంకాయ కొట్టి వేట ప్రారంభించారు. రెండేళ్లుగా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో చేపల వేట సక్రమంగా సాగలేదని గత సంవత్సరం అయితే చేపల వేట మరీ దారుణంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. ఈసారైనా కరుణించమ్మా అంటూ గంగపుత్రులు వేడుకున్నారు. తొలి రోజు శుభసూచకంగా ఉందని, మత్స్య సంపద పుష్కలంగా లభించిందని మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత శనివారం నాగూర్మీరాసాహెబ్కు పూజలు నిర్వహించి జెండాలు పాలెంలో ఊరేగించారు. వారం రోజుల ముందునుంచే బోట్లు, వలలకు మరమ్మతులు చేసుకుని వేటకు సిద్ధమయ్యారు. తమిళనాడు బోట్ల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ బోటును ఏర్పాటు చేసినట్టు రామాయపట్నం మైరెన్ సీఐ శివన్నారాయణ తెలిపారు. -
బీసీల ప్రాణాలకు రాష్ట్రంలో రక్షణ కరువు
ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో బీసీల ప్రాణాలకు, ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని ఈదుమూడిలో గొర్రెల కాపరులపై అగ్రకులస్థుల దాడే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈనెల 7వ తేదీన గొర్రెలు మేపుకుంటున్న యాదవ యువకులపై దాడి చేసిన అగ్రకులస్తులను వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్నాలో నాగార్జున యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గొర్రెల కాపరులపై చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే సీఐ శేషగిరిరావు నిందితులకు వత్తాసుపలుకుతూ మాట్లాడటమే కాకుండా ఈ దాడిపై చిన్న కేసు నమోదు చేసి..నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపైనే కేసు కట్టారన్నారు. జరిగిన సంఘటనపై జ్యుడీషియరీ విచారణ నిర్వహించాలన్నారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న 139 బీసీ కులాల సంఘ చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ గొర్రెల కాపరులపై అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐ శేషగిరిరావు అగ్రకుల నిందితుల ఫిర్యాదుతో బాధితులపైనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 139 బీసీ కులాల జేఏసీ నాయకుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్రకుల వ్యక్తులు చేసిన దాడిలో మధు, అనిల్ అనే ఇద్దరు గొర్రెల కాపరులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారన్నారు. బాధితులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, కావూరి నాగార్జున, ఉప్పల సుబ్రహ్మణ్యం, బాచిన రంగారావు, ఉప్పల వెంకట్రావు, ఉప్పల ప్రసాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అగ్రకులాల వారికి కొమ్ముకాస్తూ సీఐ శేషగిరిరావు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గొర్రెలను చెల్లాచెదురు చేయడమే కాకుండా, గొర్రెల కాపరులను కాళ్లతో పదేపదే తంతూ, అసభ్యంగా దూషించారని పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని గొర్రెలు కనిపించకుండా పోయాయన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ గొర్రెల కాపరలపై దాడి చేసిన దుర్మార్గులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐ శేషగిరిరావును సస్పెండ్ చేయాలన్నారు. ఈదుముడి గ్రామంలో అన్యాక్రాంతమైన మేత భూములను వెలికి తీసి గొర్రెల కాపరులకు, పశు పోషకులకు హక్కు కల్పించాలని, 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు, పశుపోషకులకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా హరి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కన్వీనర్ బోట్ల రామారావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు బంకా చిరంజీవి, పీఎల్పీ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ పీఏసీ చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు యనమల నాగార్జున యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు లాకా వెంగళరావు, హైకోర్టు అడ్వకేట్ వీరు యాదవ్, నర్రావుల శ్రీనివాసరావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, జీహెచ్పీఎస్ నాయకులు పేరం సత్యం, బాధితులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు మినీ స్టేడియం వద్ద నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జె.జయంతి బాబు కోరారు. ఆదివారం సంతనూతలపాడులోని సుందరయ్య భవన్లో నిర్వహించిన రైతు సంఘ మండల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతులను అప్పుల బారిన పడకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభమైన పొగాకు ధర.. నేడు రూ.160కి పడిపోయిందని ఆందోళన చెందారు. రోజురోజుకీ ధర దిగజారుతోందని అన్నారు. కానీ, ప్రభుత్వాలకు రైతుల పట్ల చిన్నచూపు ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చంనాయుడు పొగాకు పండే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాలు తీసుకుని రైతులకు మంచి ధర వస్తుందని, సంతృప్తిగా ఉందని మాట్లాడటమే అందుకు నిదర్శనమని అన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయని ప్రభుత్వాలు.. ఆ పంట ఎందుకు వేశావని రైతులపై ఎదురు దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను దివాలా తీయించి రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. రైతులను ఆ భూముల్లో కూలీలుగా మార్చే విధానాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా పొగాకు రైతులంతా మేల్కొని ఐక్యంగా గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ట్రాక్టర్ల ర్యాలీలో ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్తో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రైతు సంఘ మండల అధ్యక్షుడు హనుమంతరావు అధ్యక్షత వహించగా, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి నల్లూరి వెంకట నరసింహ, రైతు సంఘ నాయకులు కిలారి పెద్దబ్బాయి, ముండ్లమూరి నారాయణ, బత్తుల సుబ్బారావు, పోతినేని చిన్న అంజయ్య, ఆర్.సీతారామయ్య, ఎన్.శ్రీనివాసరెడ్డి, షేక్ కమాల్ తదితరులు పాల్గొన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం 19న ఒంగోలులో ర్యాలీ -
మట్టి దొంగలు
ఉలవపాడు: ‘‘నేను ఎమ్మెల్యే బంధువుని...ఈ మండలంలో పెత్తనం నాదే... గ్రావెల్ తరలింపు మొత్తం నాకు తెలిసి నేను తోలాల్సిందే...’’ ఇదీ ప్రస్తుతం మండలంలో ఓ నాన్లోకల్ టీడీపీ నేత పెత్తనం. దీనికి స్థానికంగా ఉన్న మరో టీడీపీ నేత సహకారంతో భారీగా గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. ఉలవపాడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాజుపాలెం చెరువును అడ్డాగా చేసుకుని భారీగా గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. రాజుపాలెం చెరువు నుంచి హైవేకు నేరుగా చేరుకునేలా రోడ్డు ఏర్పాటు చేసుకుని టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చెరువులో జేసీబీలు ఏర్పాటు చేసుకుని టిప్పర్లలో నింపుకుని తరలిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 100 ట్రిప్పుల పైనే గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్న చందంగా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్జన మొత్తం నాన్ లోకల్ నేత ఆధ్వర్యంలోనే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలోని బడానేత ఉలవపాడు మండలానికి ఒక ఇన్చార్జ్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పెత్తనం అంతా ఆయనే చేసేవాడు. ఆయన ఆధ్వర్యంలో అన్నీ నడిచేవి. ఇన్చార్జికి, పెద్దనేతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఇప్పుడు ఆ నేతకు బంధువుగా ఉన్న మరో నాన్లోకల్ నేత ఈ గ్రావెల్, మట్టి దోపిడీ, రెవెన్యూ కార్యాలయంలో పనులు అన్నీ తానై చూస్తున్నాడు. అధికారులు సైతం మట్టి, గ్రావెల్ ఎంత తోలుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు. ఒక్కో టిప్పర్ కు సదరు నాన్లోకల్ నేతకు సుమారు రూ.3 వేల ఆదాయం ఉంది. అంతే కాకుండా ఉలవపాడు బైపాస్లో ఉన్న సుమారు 75 ఎకరాల వెంచర్కు భారీగా గ్రావెల్ అవసరం ఉంది. దీనికి తోలడానికి ఉలవపాడు మండలంలోని చెరువుల నుంచి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇలా మండల పరిధిలో గ్రావెల్, మట్టి భారీ దోపిడీ జరుగుతోంది. నిద్రలో ఉన్న అధికారులు... నిద్రపోతున్న వారిని లేపవచ్చు కానీ నిద్రనటిస్తున్న అధికారులను లేపడం కష్టతరంగా మారింది. ప్రస్తు తం ఉలవపాడు మండలంలో అధికారుల పరిస్థితి అలాగే ఉంది. ఈ నాన్లోకల్ నేత గ్రావెల్, మట్టి తోలుతుంటే, నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖలు కనీసం పట్టించుకోరు. ఎవరైనా ఫోన్ చేసినా స్పందించరు. ఆ వైపునకు రారు. ఇలా పకడ్బందీగా జరుగుతున్న గ్రావెల్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రియల్టర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ అజయ్కుమార్ పుల్లలచెరువు: రియల్టర్ను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 10వ తేదీన పుల్లలచెరువు మండలంలోని శతకోడు గ్రామంలో జరిగిన రియల్టర్ రవికుమార్ హత్య కేసు వివరాలను ఆదివారం సీఐ అజయ్కుమార్ విలేకర్లకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. శతకోడుకు చెందిన జువ్వా అనీల్కుమార్కు ఉన్న 67 ఎకరాల అసైన్మెంట్ భూమిని అదే గ్రామానికి చెందిన వరకూటి చిన్న పోలిరెడ్డి, మృతుడు రవికుమార్లు కలిసి హైదరాబాద్కు చెందిన సైదారావు గ్రూపునకు విక్రయించారు. ఈ క్రమంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కొన్ని రోజుల తర్వాత చిన్నపోలిరెడ్డి, రవికుమార్ల మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. కాగా, ఆ భూమికి దారి సమస్య ఏర్పడటానికి రవికుమారే కారణమని చిన్నపోలిరెడ్డి భావించాడు. రవికుమార్ను అంతమొందించాలనే ప్లాన్తో, పొలం కొలతల నెపంతో పోలిరెడ్డి తన కుమారుడి చేత రవికుమార్కు ఫోన్ చేయించి పిలిపించాడు. పొలం వద్దకు వెళ్ళాక దారి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రవికుమార్ సమాధానంతో ఆగ్రహానికి గురైన చిన్నపోలిరెడ్డి.. రవికుమార్ పొలం కంచె దాటుతున్న సమయంలో యాకసిరి యల్లయ్య వద్ద ఉన్న గొడ్డలి తీసుకుని వెనుక నుంచి దాడి చేశాడు. రవికుమార్ మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొడ్డలిని, రక్తంతో తడిసిన దుస్తులను సంఘటన స్థలం సమీపంలో విసిరేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఐ సాంబశివరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ముటుకుల గ్రామ సమీపంలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ అజయ్కుమార్, ఎస్ఐ సాంబశివరావు మరియు సిబ్బందిని ఎస్పీ హర్షవర్థన్రాజు, డీఎస్పీ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. -
పచ్చని పొలాల్లో ఇనుప ముప్పు!
టంగుటూరు: ఐరన్ ఓర్ మైనింగ్ అంశం టంగుటూరుతోపాటు చుట్టుపక్కల మండలాల్లో కాకరేపుతోంది. పర్యావరణం దెబ్బతింటుందని, తాగునీటి లభ్యత తగ్గిపోతుందని, భూగర్భ జలాలకు సైతం ముప్పు వాటిల్లుతుందని, పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ప్రధానంగా రైతులతోపాటు ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎస్డబ్ల్యూ పరిశ్రమను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దంటూ టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు, ఎర్రజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు గత సోమవారం మూకుమ్మడిగా ఒంగోలు వెళ్లి గ్రీవెన్స్లో కలెక్టర్ రాజాబాబుకు అర్జీ సమర్పించారు. రైతుల జీవనంపై దెబ్బ టంగుటూరు మండలం మర్లపాడు, కొణిజేడు, ఎరజర్ల, కందులూరు పరిసర గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇక్కడి రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. పొగాకుతో పాటు నిమ్మ, జామ, మామిడి వంటి వాణిజ్య తోటలను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశంలో ఐరన్ ఓర్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాని నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, దుమ్ముధూళి, దట్టమైన పొగ వల్ల సారవంతమైన భూములు నిర్జీవంగా మారిపోతాయని రైతులు వాపోతున్నారు. భూగర్భ జలాలు విషమయం ఇప్పటికే అట్టడుగుకు పడిపోయిన భూగర్భజల మట్టాలు మైనింగ్ పరిశ్రమ ఏర్పాటు తర్వాత మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత రసాయన జలాలు భూమిలోకి ఇంకితే, చుట్టుపక్కల గ్రామాల్లోని తాగునీటి బావులు, బోర్లు పూర్తిగా విషపూరితంగా మారుతాయి. ఇది కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా, తాగడానికి బొట్టు నీరు కూడా దొరకని భయానకమైన నీటి కొరతను సృష్టిస్తుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రాణహాని పరిశ్రమ నుంచి వెలువడే బొగ్గు పొడి, ఇనుప రజను, ప్రాణాంతక విషవాయువులు గాలిలో కలవడం వల్ల ఈ ప్రాంతం కాలుష్య కాసారంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ఆందోళన వెలిబుచ్చుతున్నా పాలకులు కనీసం పట్టించుకోకపోవడం ప్రజలు రగిలిపోతున్నారు. జింపెక్స్ పోరాటం గుర్తుందా? పరిశ్రమల కాలుష్యంపై ఈ ప్రాంత ప్రజల పోరాటం ఈనాటిది కాదు. గతంలో 2011 డిసెంబర్ 17వ తేదీన అప్పటి ‘జింపెక్స్’ పరిశ్రమ ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మర్లపాడు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాలుష్య భూతాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. 15 ఏళ్ల క్రితమే తాము తిరస్కరించిన కాలుష్య కారక పరిశ్రమలను, ఇప్పుడు మళ్లీ కొత్త పేర్లతో తమపై రుద్దాలని చూస్తే సహించేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సారవంతమైన భూములు బీడువారే ప్రమాదం ఉందని ఆందోళన భూగర్భ జలాలు విషతుల్యమై, వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన 2011 రణరంగాన్ని గుర్తుచేస్తూ ‘పరిశ్రమ వద్దు.. ‘ప్రాణాలు ముద్దు’ అంటున్న స్థానికులు ప్రజా వ్యతిరేకత, పర్యావరణ ముప్పును పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ గత సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేత జిందాల్ పరిశ్రమకు అనుమతులివ్వొద్దు మర్లపాడు గ్రామంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ పరిశ్రమ మైనింగ్ చేయడానికి అనుమతులు ఇవ్వరాదు. తలపెట్టిన ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని కాదని ముందుకు వెళితే గతంలో కంటే తీవ్రమైన ప్రజా ఉద్యమం చేపడతాం. చట్టపరమైన పోరాటం చేస్తాం. ప్రజల ఆరోగ్యం దష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – సింగమనేని బ్రహ్మయ్య, మర్లపాడు భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం జిందాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తారు. ఫలితంగా ఎరజర్ల, మర్లపాడు, కందూలురు చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున పరిశ్రమ ఏర్పాటుపై పునరాలోచించాలి. – బుర్ర అంకరాజు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పు జిందాల్ ఇనుము శుద్ధి కర్మాగారం ఏర్పాటు వల్ల దాని నుంచి వచ్చే కాలుష్యకారకాల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వృద్ధులు చిన్నపిల్లలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. పరిశ్రమ ఏర్పాటుపై ఒంటెద్దు పోకడలు సరికాదు. – ఈదర అమర్నాథ్ చౌదరి, మర్లపాడు -
వేలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒంగోలు డెయిరీ నేడు పాడుబడింది. టీడీపీ పాలకవర్గ హయాంలో అంతులేని అవినీతికి, దుబారాకు పాల్పడి పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు. తాజాగా వేలకోట్ల రూపాయల విలువైన డెయిరీ ఆస్తులపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇప్పటికే అత
చీమకుర్తి: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి వేలాది మంది పాడిరైతులకు ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒంగోలు డెయిరీ బ్రాండ్తో నిర్వహిస్తున్న ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్) ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని టాప్ 5 పాలకేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. 2015–16 నాటికి అది అత్యధిక స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 125 పాలకేంద్రం సొసైటీల ద్వారా 45 వేల మంది రైతుల సభ్యత్వానికి చేరుకుంది. జిల్లాలోని 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు అయిన కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, దర్శి, తూర్పు గంగవరం, వీఆర్ కోట, కొండమంజులూరు కేంద్రాల నుంచి రోజుకు 3 లక్షల లీటర్లను సేకరించి ఒంగోలు డెయిరీకి పంపించేవారు. 2013లో ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్)గా పేరు మార్చారు. అప్పటి వరకు అధికారుల చేతుల్లో ఉన్న నిర్వహణ బాధ్యతలు పీఎంపీసీఎల్ చేతికొచ్చాక లాభాల్లో ఉన్న డెయిరీ కాస్త అప్పుల్లో కూరుకుపోయింది. 2013 నుంచి 2017 మధ్య బాధ్యతలను చేపట్టిన అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన చల్లా శ్రీనివాసరావు చైర్మన్గా ఉన్న పాలకవర్గం అవినీతి అక్రమాల కారణంగా లాభాల్లో ఉన్న డెయిరీ నెలకు రూ.90 లక్షల అప్పులు చెల్లించాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి చేరుకుంది. కొన్ని మిల్క్ కూలింగ్ సెంటర్లలో సొసైటీల ప్రెసిడెంట్లుగా ఉన్న వారు, డెయిరీకి పాలకవర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లో పాల ధరలు, వెన్న శాతం ధరలను ఎక్కువ చూపించి డెయిరీకి వచ్చే లాభాలను స్వాహా చేశారు. అవినీతి తార స్థాయికి చేరటంతో అప్పుల పాలై చివరకు ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. రూ.109 కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఈలోపు జిల్లాలోని పాలను సరఫరా చేసే 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు కూడా ఒక్కొక్కటి మూతపడ్డాయి. చివరకు పీఎంపీసీఎల్ నిర్వహించలేక అప్పులుపాలు కావడంతో మధ్యలో అమూల్ సంస్థ బాధ్యతలను స్వీకరించినప్పటికీ గతంలోని పాలకవర్గం చేసిన అప్పుల ఊబిలోనుంచి బయట పడలేక అమూల్ పక్కకు తప్పుకుంది. ఒంగోలు డెయిరీకి వైఎస్సార్ సీపీ చేయూత: 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఎంపీసీఎల్ డెయిరీని ఆదుకునే క్రమంలో అప్పుగా తేలిన రూ.109 కోట్లకు గాను రూ.69 కోట్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా 2023లో ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ల ద్వారా చెల్లించేందుకు రూ.13.29 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో పాటు మార్టిగేజ్లో ఉన్న పీఎంపీసీఎల్ ప్రాపర్టీ డాక్యుమెంట్ల్ను విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం మరో రూ.18 కోట్లను 2023లోనే విడుదల చేసింది. ఇంకా రూ.38 కోట్లను విడుదల చేయాల్సి ఉండగా ఈ లోగా ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అడ్హాక్ కమిటీతో కాలం నెట్టుకొస్తోంది. దానిని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఎండీ చైర్మన్గా, జేసీ, వెటర్నరీ జేడీ, డీడీ డైరెక్టర్లుగా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసి కొంతకాలం నెట్టుకొచ్చారు. అప్పులు చెల్లించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయకపోగా దానిని పునరుద్ధరించే ప్రయత్నాలను పక్కన పెట్టి పీ–4 పద్ధతిలో ఎవరికో ఒకరికి కట్టబెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శిథిలావస్థలో మిల్క్ ప్లాంట్ మిషనరీ, వాహనాలు: ఒంగోలు డెయిరీలో పాల ప్యాకెట్లు, వెన్న, జున్ను, మలయ్ లడ్డు, పాలపొడి వంటి పలు రకాల పాల పదార్థాలను తయారు చేయటానికి అవసరమైన రూ.30– రూ.40 కోట్ల విలువైన పరికరాలు మిల్క్ప్లాంట్లో ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు పాలకేంద్రం వద్దే 30 వేల లీటర్ల పాలను విక్రయించేవారు. రోజుకు 30 టన్నుల పాలపొడిని అక్కడే ఉన్న పౌడర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసేవారు. అలాంటి విలువైన కోట్లాది రూపాయల విలువ చేసే మిషనరీ ఇప్పుడు పూర్తిగా తుప్పుబట్టి పాడైపోయాయి. పాలను సేకరించేందుకు ఉపయోగించిన మూడు ట్యాంకర్లు ఇప్పుడు నిరుపయోగంగా మిగిలాయి. అధికారుల నిర్వహణకు ఉపయోగించే 2 జీపులు, 2 పశువుల అంబులెన్స్లు, 1 కారు, 2 బైకులు శిథిలావస్థలో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పీఎంపీసీల్ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు, అధికారులు, పాడి రైతులతో ఏర్పాటు చేసే సమావేశాల కోసం నిర్మించిన పాలక మండలి భవనాలు, సాంకేతిక భవనాలు పూర్తిగా శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. పాడుబడిన పాలక భవనం డెయిరీ ఆస్తుల విలువ రూ.1500 కోట్ల పైమాటే ఒంగోలు డెయిరీకి చెందిన భూములు మొత్తం 90 ఎకరాలు ఉంది. పేర్నమిట్ట–ఒంగోలు మధ్య కర్నూలు రోడ్డు ఫేసింగ్లో డెయిరీ నిర్మించిన 78 ఎకరాల స్థలం, దానికి అనుబంధంగా ఉన్న కొండమంజులూరులో మరో 12 ఎకరాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.1500 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 6 ఎకరాల్లో ఆక్రమణలు ఒంగోలు డెయిరీ ఉన్న ప్రదేశంలో కొంతమంది అక్రమార్కులు సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంట్రెన్స్లో తూర్పు వైపు 25 సెంట్లు, ప్లాంట్కు వెనుక 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఒక ఎకరం, వెనుకనే సుబాబులు వేసి ఉన్న ప్రాంతంలో మరో 5 ఎకరాలను అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకొన్నారు. దానిపై అధికారులు కోర్టుకెక్కారు. తుప్పుబట్టి ముళ్ల పొదల మధ్య నిరుపయోగంగా మారిన మిల్క్ ట్యాంకర్ పాల పదార్థాలను తయారు చేసే భవనాల దుస్థితి తుప్పు పట్టిన విలువైన పరికరాలుతిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం డెయిరీ అప్పులు రూ.109 కోట్లుగా ఉంది. దానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలు పోగా ఇంకా ప్రభుత్వం రూ.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. డెయిరీలో పనిచేసే 72 మంది రెగ్యులర్, 48 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.13 కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ ద్వారా సెటిల్ చేశాతం. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే పీ–4 పద్ధతిలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. – రాజమోహన్, సీఈఓ, పీఎంపీసీఎల్(ఒంగోలు డెయిరీ) పాలకవర్గం ఇష్టానుసారంగా తిన్నారు నేను 2000 సంవత్సరం నుంచి పాలకేంద్రం మూసే వరకు నాలుగు విడతలుగా ఓబచెత్తపాలెం పాలకేంద్రానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. పాలకేంద్రానికి చెందిన డబ్బులను పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు ఇష్టానుసారంగా ఖర్చుచేశారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగితే పొట్టేళ్లను కొసి పాలకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను కూడా పిలిపించుకొని చేసిన ఖర్చంతా ఒంగోలు డెయిరీ బిల్లులలోనే చూపించేవారు. అలా డెయిరీకి చెందిన లాభాలన్నీ పోగా చివరకు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమైంది. దాని మీద ఆధారపడి వేలాది మంది పాడి రైతులు ఆధారపడ్డారు. చివరకు పాలకేంద్రాన్ని తెరిపించే దిక్కు లేదు. – గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, మాజీ పాలకేంద్రం సొసైటీ ప్రెసిడెంట్, చీమకుర్తి పచ్చ నేతలవే -
నవోదయలో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
ఒంగోలు టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్ ప్రథమ సంవత్సరం మిగులు సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సి.శివరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివి పాసై ఉండాలని చెప్పారు. మొత్తం 60 శాతం మార్కులతో పాటు సైన్స్ సబ్జెక్టులో 60 శాతం, గణితంలో 60 శాతం మార్కులు కచ్చితంగా వచ్చి ఉండాలని వివరించారు. 2025–26 కంటే ముందు పాసైన విద్యార్థులు అనర్హులని తెలిపారు. అభ్యర్థులు 01–06–2009 నుంచి 31–07–2011 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి దరఖాస్తు వివరాలు పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల లిస్టుపై హెడ్మాస్టర్ సంతకంతో అటెస్ట్ చేయించాలన్నారు. ఆదాయ, నివాస స్టఫికెట్లు సమర్పించాలని, నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ● 5 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం కనిగిరి రూరల్: మండలంలోని యడవల్లి శివారు ప్రాంతంలో ఈత చెట్ల తోపు పరిసరాల్లో నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులు అనే వ్యక్తిని ఆదివారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ (ఒంగోలు) కే విజయ్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులును పట్టుకుని అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారా, బజాజ్ పల్సర్ బైక్ సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు కనిగిరి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ ఆర్.విజయ భాస్కర్రావు తెలిపారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జేఎస్డబ్ల్యూతో ఏపీఎండీసీ ఒప్పందం
టంగుటూరుతోపాటు పరిసర మండలాల్లో సుమారు 800 మిలియన్ టన్నుల మాగ్నటైట్ నిక్షేపాలు భూగర్భంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర గనుల శాఖ పరిశోధనల్లో తేలింది. ఇక్కడ లభ్యమయ్యే మాగ్నటైట్ రకానికి చెందిన ముడి ఖనిజంలో సహజంగా ఇనుము శాతం కొంత తక్కువగా అంటే సుమారు 18 నుంచి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. తక్కువ గ్రేడ్ ఖనిజం అయినప్పటికీ, అధునాతన టెక్నాలజీ ద్వారా మలినాలు తొలగించి, ఇనుము శాతాన్ని పెంచి స్టీల్ తయారీకి వినియోగించేందుకు జేఎస్డబ్ల్యూ సిద్ధమైంది. లోగ్రేడ్ ఇనుప ఖనిజాన్ని హైగ్రేడ్గా మార్చడం కోసం ఉక్కు దిగ్గజం జేఎస్డబ్ల్యూతో ఏపీఎండీసీ చేతులు కలిపింది. ఎంఓయూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1300 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూకు కట్టబెట్టింది. ఈ పరిణామం టంగుటూరు, వలేటివారిపాలెం తదితర మండలాల్లో ప్రజలను ఆందోళనలోకి నెట్టింది. ఇనుము శుద్ధి కర్మాగారంలో ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలని జేఎస్డబ్ల్యూ భావిస్తుండగా.. ఇది పర్యావరణానికి, పంటల సాగుకు, భూగర్భ జలాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
● ఏపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ మార్కాపురం: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీయూఎస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఐఆర్ 30 శాతం ఇవ్వాలని, 2003 డీఎస్సీ వాళ్లకి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దిలీప్, ఏపీయూఎస్ జిల్లా నాయకులు కే శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్ కుమార్, కోశాధికారి బీవీ గుణప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగని శ్రీనివాసులు, కోశాధికారి రమణయ్య, జిల్లా సంఘటన కార్యదర్శి విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణ, అల్లూరయ్య, రమణయ్య, బుర్రి శ్రీనివాసులు, అన్నీ మండలాల సభ్యులు కార్యకర్తలు, తదతరులు పాల్గొన్నారు. అనంతరం తర్లపాడు మండలంలో ఎంఈఓగా పదవీ విరమణ పొందిన అచ్యుత సుబ్బారావును ఘనంగా సన్మానించారు. -
హైవేపై హాహాకారాలు
యర్రగొండపాలెం: ఆధ్యాత్మికత కోసం ఆలయానికి వెళ్తున్న వారు ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారంతా రక్షించండి అంటూ పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. యర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లి వద్ద హైవే రోడ్డుపై ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కారు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన అప్పిరెడ్డి వెంకటరమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తున్న కారు, శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురయ్యాయి. అదే సమయంలో వై.కొత్తపల్లిలోని తన గెస్ట్ హౌస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోన్ చేసి 108 అంబులెన్స్, హైవే అంబులెన్స్ రప్పించారు. క్షతగాత్రులు విలపిస్తుండగా మాజీ మంత్రితోపాటు ఆయన వెంట ఉన్న కార్యకర్తలు, స్థానికులు కలిసి బాధితులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారిని స్వయంగా వాహనాల్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులతో మాట్లాడి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
బల్లికురవ: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన బల్లికురవ–కొమ్మాలపాడు ఆర్అండ్బీ రహదారిపై బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు మలుపులో ఆదివారం చోటుచేసుకుంది. చెన్నుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి రామయ్య (48) సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో అమ్మవారి కొలుపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన రామయ్యను స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి మార్టూరు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భూలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు టౌన్: నగరంలోని రావి ఆంజనేయులు వీధిలో పేకాట శిబిరంపై ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఇన్చార్జి సీఐ కమలాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి పేకాటరాయుళ్ల నుంచి రూ.4,860 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన వారిని నగదుతో సహా తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. ● మహిళకు తీవ్ర గాయాలు ● విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్పై ప్రమాదం సింగరాయకొండ: మండల పరిధిలోని జాతీయ రహదారిపై గల విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్పై ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసుల కథనం ప్రకారం.. చైన్నెకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో విజయవాడ వెళ్తున్నారు. మార్గమధ్యంలో కారు సింగరాయకొండ పరిధిలోని విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్పై ఉన్న కుంభకోణం కాఫీ షాప్ సమీపంలోకి రాగానే, అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సిమెంటు దిమ్మెతో సహా కారు నెల్లూరు వైపు వెళ్లే రోడ్డు మధ్యలోకి దూసుకెళ్లి ఆగింది. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులో ప్రయాణిస్తున్న గోమతి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో, హైవే అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎల్.సుధీర్కుమార్ పరిశీలించారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా హైవే పోలీసు సిబ్బంది శశిధర్రెడ్డి చర్యలు చేపట్టారు. -
ఆర్టీసీ ఆర్ఎం లేక తిప్పలు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం తాత్కాలికంగా జనవరి మొదటి వారంలో ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్ఎంను మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఆర్ఎంగా నియమించారు. అయితే 6 నెలలు కావస్తున్నా ప్రభుత్వం రెగ్యులర్ ఆర్ఎంను నియమించకపోవడం, ఆర్ఎం కార్యాలయానికి సంబంధించిన పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్లు సిబ్బందిని నియమించకపోవడంతో ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు గ్రీవెన్స్ కోసం గతంలో లాగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా పరిధిలో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోల్లో సుమారు 1500 మంది సిబ్బంది పనిచేస్తుండగా 303 బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 1,21,945 కిలోమీటర్ల మేర తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. 6 నెలలు కావస్తున్నా డిపోలో శాశ్వత ఆర్ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. సిబ్బందిని కూడా నియమించలేదు. దీనితో ఏదైనా అవసరం వస్తే ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికీ ఒంగోలు కేంద్రంగా కార్యకలాపాలు: మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ రెగ్యులర్ ఆర్ఎం కార్యాలయం, ఆర్ఎంను నియమించకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని ప్రజలు ఫిర్యాదులు, ప్రత్యేక బస్సుల డిమాండ్, కొత్త సర్వీసుల ప్రతిపాదనలు ఇవ్వాలంటే ఒంగోలు వెళ్లాల్సిందే. దీంతో జిల్లా ప్రజలకు ఆర్టీసీ సేవలు సకాలంలో అందడం లేదు. బస్సుల కొరత, కొత్త రూట్లు, డిపో అభివృద్ధి, బస్టాండు సౌకర్యాలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రయాణికులు నేరుగా ఆర్ఎంను కలిసే అవకాశం తగ్గుతోంది. సిబ్బంది అప్పీల్ కోసం ఒంగోలుకు వెళ్తున్నారు. ఆర్ఎం కార్యాలయ ఏర్పాటుకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. రెగ్యులర్ ఆర్ఎంను నియమిస్తే దాదాపు 15 మంది సిబ్బంది వస్తారు. ప్రయాణికులకు, సిబ్బందికి మెరుగైన సేవలు వస్తాయి. ప్రస్తుతం చిన్నపనికి కూడా ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం డిపోలో 406 మంది ఉద్యోగులు, గిద్దలూరులో 356, కనిగిరిలో 388, పొదిలి 333 మంది సిబ్బందితో పాటు అదనంగా మరికొంత మంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఏవైనా సమస్యలు వస్తే ప్రస్తుతం ఒంగోలు వెళ్తున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైనా ఒంగోలు కేంద్రంగానే కార్యకలాపాలు గ్రీవెన్స్ కోసం ఒంగోలుకు వెళ్లక తప్పని ఇక్కట్లు మార్కాపురం జిల్లాలో మండలాలు: 21 మార్కాపురం జిల్లాలో డిపోలు : 4 జిల్లా పరిధిలో ఉన్న బస్సులు: 303 4 డిపోల పరిధిలో ఉన్న సిబ్బంది: 1500 రోజూ బస్సులు తిరిగే కిలోమీటర్లు: 1,21,945 -
మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు
దర్శి: ఓ యువకుడు మద్యం తాగి కారును నడుపుతూ పలువురిని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రం దర్శి పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు ఒంగోలులోని ఓ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడు. వ్యక్తిగత పని కోసం దర్శి వచ్చిన అతను మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు తోలాడని, రోడ్డు వెంబడి ఉన్న ఆటోలతో పాటు పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు చెప్తున్నారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
మహిళను హత్య చేసిన నిందితుడికి సంకెళ్లు
లింగసముద్రం: మండలంలోని పెంట్రాలలో జయంపు గోవిందమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రాపూరి పోలమ్మ మూడో కుమార్తె జయంపు గోవిందమ్మకు గతంలో కావలికి చెందిన రమణయ్యతో వివాహమైంది. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. అనంతరం ఆమె నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేటకు చెందిన పాలకీర్తి వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. వెంకటేశ్వర్లు నిత్యం గోవిందమ్మను అనుమానిస్తూ మానిసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులను తట్టుకోలేక గోవిందమ్మ సుమారు వారం రోజుల క్రితం పెంట్రాలలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నెల 10వ తేదీన ఉదయం వెంకటేశ్వర్లు ఆమెను తనతో రావాలని కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి వచ్చి మరోసారి ఇద్దరూ గొడవపడ్డాడు. 11వ తేదీ తెల్లవారు జామున పెంట్రాల గ్రామంలో ఇంటి వెనుక భాగంలో ఆమె నిద్రిస్తోంది. ఆ సమయంలో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేస్తుండగా కేకలు వేసింది. కేకలు వినిపించడంతో పోలమ్మ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. కత్తితో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు దాడి చేస్తున్నట్లు గమనించారు. వారిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లి పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లింగసముద్రం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు సీఐ నరేష్కుమార్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గుడ్లూరు సీఐ తన సర్కిల్ పరిధిలోని లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం ఎస్సైలు జి.రాంబాబు, వి.వెంకటరావు, బి.ప్రేమ్కుమార్తో మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయిపేట శివారు ప్రాంతంలో అతడి ఆచూకీ కనుగొని వెంకటేశ్వర్లును శుక్రవారం అదుపులోకి తీసుకుని గుడ్లూరు పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ కోసం కందుకూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసు నమోదు చేసి రెండు రోజుల్లో నిందితుడిని అత్యంత చాకచక్యంగా ఆరెస్టు చేసిన దర్యాప్తు అధికారి నరేష్కుమార్, ఎస్సైలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
మార్కాపురంలో భారీ వర్షం
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంతో పాటు తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. శనివారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కురిసిన వర్షంతో మార్కాపురంలో 6.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తర్లుపాడులో 12.2 మిల్లీమీటర్లు, పెద్దారవీడులో 8.6, పుల్లలచెరువులో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మార్కాపురం నుంచి కుంట, తర్లుపాడు, తర్లుపాడు నుంచి బొడిచర్ల గ్రామాలకు వెళ్లే రహదారులపై వాగులు పొంగి ప్రవహించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం వేకువజామున మంగమూరి రమణయ్యకు చెందిన పొలంలో ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో కాలిపోయింది. ఆ చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. చెన్నారెడ్డిపల్లి ఎస్సీకాలనీలో భారీగా వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గృహాల్లోకి వర్షం నీరు రావడంతో అవస్థపడ్డారు. కాలనీల్లో మురుగునీరు పోయేందుకు కాలువలు కట్టి అంతర్గత రోడ్లు వేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం పట్టణంలోని భగత్సింగ్కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, పీఎస్ కాలనీ, ఎస్టేట్, రాజ్యలక్ష్మికాలనీ, తదితర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. మధ్యాహ్నం వరకూ ప్రజలు బయటకు రాలేక తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒంగోలులో ఈదురు గాలులతో వర్షం... ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒంగోలులో రాత్రి పది గంటల నుంచి ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు మరింత ఇబ్బందిపడ్డారు. -
19న ఒంగోలులో ట్రాక్టర్లతో ర్యాలీ
● పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం.. సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మినీ స్టేడియం, పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయ సమీపంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. వేలాదిగా పొగాకు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా గ్రామాల్లో ఆయన పర్యటించారు. సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, చండ్రపాలెం, తక్కెళ్లపాడు, చిలకపాడు, మద్దులూరు, చీమకుర్తి మండలంలోని పిడతలపూడి గ్రామాల్లో శనివారం పర్యటించి రైతులను కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వలన రోజురోజుకూ పొగాకు ధరలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా రైతాంగం అప్పులపాలై రోడ్డున పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి వేలం కేంద్రాల్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు క్వింటాకు రూ.30 వేలు ధరలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, జిల్లా నాయకుడు సాగర్, రైతు సంఘ నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, పొగాకు రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని జార్లపాలెం సమీపం రేణింగవరం రహదారిపై శనివారం జరిగింది. ఫారెస్ట్ బీట్ అధికారి రమేశ్ కథనం ప్రకారం.. జార్లపాలెం గ్రామ సమీపంలో ఒక జింక రోడ్డుపై పడి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఫారెస్టు బీట్ అధికారి రమేశ్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆయన జింక కళేబరాన్ని పరిశీలించి వివరాలు సమోదు చేసుకున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వాహనదారులు వేగ నియంత్రం పాటించాలన్నారు. వణ్యప్రాణులను ఢీకొట్టి చంపడం నేరమన్నారు. ఫారెస్ట్ చట్టం ప్రకారం వారు నేరస్తులవుతారని హెచ్చరించారు. కుక్కల దాడిలో దుప్పి బలి రాచర్ల: కుక్కలు దాడి చేయడంతో చుక్కల దుప్పి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రం రాచర్ల పెద్ద చెరువులో శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాచర్ల పెద్ద చెరువులో నీరు తాగేందుకు వచ్చిన చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫారెస్టు సబ్ డీఎఫ్వో బాలరాజు, డీఆర్వో కృష్ణకుమారిలు సంఘటన స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పశువైద్యాధికారి హరిబాబుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి శవపంచనామా చేశారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ లక్ష్మనాయక్ ఉన్నారు. -
టీడీపీ నేత అత్యుత్సాహం
ఉలవపాడు: మండల కేంద్రం ఉలవపాడుకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడి కుమారుడు, టీడీపీ నాయకునిగా చెలామణీ అవుతున్న రాచగల్ల శివప్రసాద్ ఉపాధి కూలీలపై శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన చేష్టలకు కూలీలు తిరగబడ్డారు. వివరాలు.. ఉలవపాడు దర్గా సెంటర్కు చెందిన 15 మంది కూలీలు రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. శనివారం ఉదయం కూడా పనులకు వెళ్తున్న సమయంలో సదరు టీడీపీ నాయకుడు కూలీలు వెళ్తున్న ఆటోను ఆపి మీరు కరువు పనికి రావద్దని వారితో వాగ్వాదానికి దిగాడు. మీరు పనికి వెళ్తే మిగిలిన వారికి కూడా మష్టర్ వేయనని బెదిరించాడు. అదే సమయంలో మేట్కు ఫోన్ చేసి ఆ 15 మంది కూలీలకు మష్టర్ వేయవద్దని హుకుం జారీ చేశాడు. అయినా ఆ కూలీలు పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. మీకు హాజరు వేయలేనని మేట్ స్పష్టం చేశాడు. మిగిలిన కూలీలు కూడా ఆ 15 మంది కూలీలకు మీరు పనులకు రావొద్దని చెప్పారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. రెండో శనివారం కావడంతో కార్యాలయం మూత వేసి ఉంది. అక్కడకు వచ్చిన సదరు టీడీపీ నాయకుడిని ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీయడంతో అందరూ గుమిగూడారు. టీడీపీ నాయకులకు తమ ఉపాధి పనిపై పెత్తనం ఏంటని తిరగబడ్డారు. 15 మంది కూలీల్లో కూడా అధిక శాతం మంది టీడీపీ సానుభూతిపరులు కావడం విశేషం. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి మండలంలో నెలకొంది. అంతేకాకుండా ఫొటోలు తీస్తున్న కొందరు పత్రికా విలేకరులపై కూడా సదరు టీడీపీ నేత చిందులు తొక్కడం గమనార్హం. తారు రోడ్డుపై మట్టి పోయడంపై విమర్శలు మరో వైపు ఉపాధి హామీ పథకం కింద జాతీయ రహదారి నుంచి వీరేపల్లి మీదుగా పాజర్ల వెళ్లే తారు రోడ్డుపై ఉపాధి కూలీలతో మట్టి పోసి గుంతలు పూడ్చడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. పంచాయితీరాజ్ ఽఆధ్వర్యంలో ఉన్న తారు రోడ్డుపై ఉపాధి పనులు ఎందుకు చేయిస్తున్నారో తెలియదు. పక్కనే ఉన్న మట్టి ఎత్తి పోసి మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంఽధించి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి పోసి ఉపాధి కూలీలకు మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదని, తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని పీఆర్ ఏఈ రమణమూర్తి చెప్పడం గమనార్హం. తిరగబడిన ఉపాధి కూలీలు -
బైకును ఢీకొన్న ఆటో
● కుమార్తె దుర్మరణం ● తండ్రికి తీవ్ర గాయాలు పొన్నలూరు: ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రాజోలుపాడు సమీపంలో ఓవీ రోడ్డుపై శనివారం జరిగింది. బాధితుల బంధువుల కథనం ప్రకారం.. దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి అశోక్రెడ్డికి మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన వెన్నపూస మాలతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి దానవితో పాటు ఏడాది బాబు ఉన్నాడు. అశోక్రెడ్డి కర్నూలులోని విత్తనాల దుకాణంలో పనిచేస్తూ రెండు రోజుల క్రితం భార్య, పిల్లలు చెన్నిపాడులో ఉండటంతో వారిని చూడటానికి వచ్చాడు. దీంతో శనివారం ఉదయం తన కుమార్తె దానవి, ఏడాది బాబుని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని టిఫిన్ కోసం కె.అగ్రహరం సెంటర్కు వెళ్లాడు. అక్కడ టిఫిన్ పార్శిల్ తీసుకుని తిరిగి చెన్నిపాడు బయల్దేరాడు. ఈ క్రమంలో రాజోలుపాడు సమీపంలోకి రాగానే కందుకూరు నుంచి నేరేడుపల్లె వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కిందపడిపోయారు. దీంతో అశోక్రెడ్డి, కుమార్తె దానవికి తీవ్ర గాయాలు కాగా ఏడాది బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం కందుకూరు తరలించారు. చిన్నారి దానవికి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దానవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కేజీ రూ.160కి తగ్గడానికి లేదు
● వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులకు తేల్చిచెప్పిన పొగాకు రైతులు ఒంగోలు సబర్బన్: ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఎఫ్–3 రకం పొగాకును కేజీ రూ.160కి తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని, అంతకన్నా తగ్గించడానికి వీల్లేదని పొగాకు రైతులు తేల్చి చెప్పారు. సదరన్ బ్లాక్ సాయిల్ (ఎస్బీఎస్), సదరన్ లైట్ సాయిల్స్ (ఎస్ఎల్ఎస్) భూముల రైతులు శనివారం ఒంగోలులోని పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. మూడు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాలకు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. లో గ్రేడ్ రకం పొగాకు అసలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఎఫ్–3 రకం పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, కానీ, కేజీ పొగాకు ధరను రూ.160 కంటే తగ్గిస్తే అంగీకరించేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు. 2026–27 సీజన్కు క్రాపు సైజు ఎంత ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రీజియన్లకు సమాన నిష్పత్తి ప్రకారం ఎంతవస్తే అంత కొనాలని వ్యాపారస్తులు, పొగాకు బోర్డు అధికారులను డిమాండ్ చేశారు. 2025–26 సీజన్కు ఇచ్చిన క్రాప్ సైజు ప్రకారం 142 మిలియన్ల పొగాకు కొంటామని గతంలో వ్యాపారస్తులు అంగీకారం తెలిపారన్నారు. అంతవరకై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత పంట కాలంలో ఇచ్చిన కోటా ప్రకారం కచ్చితంగా వ్యాపారులు కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ భూముల్లో పండించిన పొగాకుకు కేజీకి రూ.222 ఖర్చయిందని, గత సంవత్సరం ఇచ్చిన కోటాపోను మిగతా పొగాకును వచ్చే సంవత్సరం వేలం ద్వారా అమ్ముకుంటామని రైతులు తేల్చారు. 2026 జూన్ 8వ తేదీ గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత తేలిక నేలలు, నల్లరేగడి నేలలు, ఉత్తర ప్రాంత తేలిక నేలలకు సంబంధించిన అన్ని వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు, వ్యాపారస్తులతో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, చైర్మన్ యశ్వంత్ సమక్షంలో సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో ఆథరైజేషన్ కలిగి ఉన్న 142 మిలియన్ల పొగాకు వ్యాపారస్తులకు అవసరం లేకుంటే మిగతా పొగాకును వచ్చే సీజన్లో అమ్ముకుంటామని రైతులు తేల్చి చెప్పారు. వ్యాపారులెవరూ పొగాకు బోర్డు ఈడీ ఆదేశాల ప్రకారం కొనకపోగా, ఈడీ సమావేశం తర్వాత కేజీకి రూ.15 నుంచి రూ.20 తగ్గించి కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలకు చెందిన పొగాకు వేలం కేంద్ర రైతు నాయకులు నాగినేని భాస్కర్ చౌదరి, బి.బ్రహ్మ, ఏ శేషగిరిరావు, బి.వి.కృష్ణారెడ్డి, ఎస్.గురవారెడ్డి, గుండాల కేదారనాథ్, ఎం.మాధవరావు, ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
చెరువులను చెరబట్టీ..
సింగరాయకొండ: మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, కుంటలతో పాటు దేవదాయ భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. పాతసింగరాయకొండ, శానంపూడి, జరుగుమల్లి మండలం కే బిట్రగుంట ప్రాంతాల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ఇక్కడ తవ్విన గ్రావెల్ను పక్క మండలాలైన ఉలవపాడు, టంగుటూరు, కందుకూరు మండలాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పర్కు రూ.10 వేలు ఒక్కో టిప్పరును రూ.8 నుంచి రూ.10 వేలకు దూరాన్ని బట్టి అమ్ముతున్నారని ప్రతిరోజు భారీగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఈ అక్రమ దందా మొదలవుతుందన్నారు. కె.బిట్రగుంట చెరువును వదల్లేదు.. బిట్రగుంట చెరువులో 20 రోజులుగా మట్టిని తవ్వుతూ టంగుటూరు మండలానికి తరలిస్తున్నారు. ఈ మట్టిని తరలించటానికి ట్రాక్టర్లు రాంగ్రూట్లో వస్తున్నా జరిమానా వేసిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా గ్రావెల్, మట్టి అక్రమ రవాణా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమ మైనింగ్ చెరువుల్లో అక్రమ తవ్వకాలు అక్రమ మైనింగ్తో పాటు ఆక్రమణలో చెరువులు భారీగా లబ్ధిపొందుతున్న ఇటుక బట్టీల వ్యాపారులు ప్రభుత్వానికి, మైనింగ్ ఆదాయానికి భారీగా గండి చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు -
స్పెషల్
పేరుకే ఖాకీ ఉద్యోగం.. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. సిఫార్సు లేఖల వ్యాపారం.. అధికార పదవులు ఇప్పిస్తామంటూ ద్వితీయశ్రేణి నేతలతో బేరసారాలు.. ఇదంతా ఒక ఎత్తయితే విచ్చలవిడి అవినీతి మరో ఎత్తు.. ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖ గాడి తప్పింది. సీఐల మొదలు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, రైటర్లు, కానిస్టేబుళ్ల వరకు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పోలీసు శాఖకు తలనొప్పిగా మారింది. వీటిపై పోలీస్బాస్ హర్షవర్దన్రాజు ఆరా తీస్తున్నట్టు సమాచారం. వసూళ్లలోసాక్షి టాస్క్ఫోర్స్: పోలీస్ శాఖకు సంబంధించి ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా పోలీసు శాఖలో అత్యంత కీలకమైన స్పెషల్ బ్రాంచి పోలీసుల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో అంతర్గత వ్యవహారాలు చూడాల్సిన స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ ఒకరు పక్కా అఽధికార పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా కీలకనేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో పదవుల వ్యవహారంలో తలదూర్చి గందరగోళం సృష్టిస్తున్నాడని ఆ పార్టీ నాయకులు కీలక నేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను ప్రతిపాదించిన అభ్యర్థికే డిప్యూటీ మేయర్ పదవి దక్కుతుందని చెప్పి కొందరు నాయకులను తన చుట్టూ తిప్పుకుంటున్నట్లు సమాచారం. అతడితో పాటు ఎస్బీలో పనిచేసి ఇటీవల రిటైరైన ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఏఎస్సైలు ఏకంగా కులనాయకులుగా కూడా అవతారమెత్తినట్లు సహచరులే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కందుకూరు, ఒంగోలు, దర్శి ఎస్బీ సిబ్బంది విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్లు క్షేత్రస్థాయి పోలీసులు చెప్పుకుంటున్నారు. కందుకూరు గంజాయి వ్యవహారంగానీ, దర్శి బెట్టింగు వ్యవహారం గురించిగానీ పత్రికల్లో వచ్చేంత వరకు ఎస్పీకి సమాచారం అందించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. రైటర్ లీలలు ఎన్నెన్నో... ఇటీవల సస్పెండైన రైటర్పై వస్తున్న ఫిర్యాదుల చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా తన టీంను ఏర్పాటు చేసుకుని పేకాట, భూ సెటిల్మెంట్లు వంటి అనేక వ్యవహారాలు నడిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేత వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని పలువురు కానిస్టేబుళ్లకు సెక్టార్ రైటర్లుగా డీఓ వేయించినట్లు సమాచారం. ఒక కానిస్టేబుల్ను తనకు ఆర్డర్లీగా నియమించుకుని అతడిచే ఇంటి పనులు చేయించుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏఆర్లో పనిచేస్తున్న ఒక ఎస్సై, ఒక రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్, మరొక హెడ్ కానిస్టేబుల్తో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల రిటైరైన హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజూ పోలీసు స్టేషన్కు వచ్చి వ్యవహారాలలో తలదూర్చుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా నగరంలో అత్యంత వివాదాస్పదమైన కొప్పోలు, ముంగమూరు భూ వివాదాలలో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఈ సెటిల్మెంట్లలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఈ రైటర్కు పోటీగా మరో రైటర్ కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఐ వీఆర్లో ఉన్న సదరు పోలీసు స్టేషన్లో ఇన్చార్జిగా బాధ్యతలు చూస్తున్న ఎస్సైతో కుమ్మకై ్కన రైటర్.. ఆ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులు కురిపిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు... నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పైకి ఆ వ్యవహారం సాఫీగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.. లోపల మాత్రం భారీ ఎత్తున ముడుపుల వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. ఒంగోలు వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని కొందరు పోలీసులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబుల వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, మధ్యలోనే కొందరి వద్ద రూ.10 వేల వరకు డబ్బు తీసుకుని వదిలిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లా నుంచి రోజుకు ఎన్ని డీఎస్ఆర్లు వస్తున్నాయి.. ఎన్ని కేసులు డిస్పోజ్ అవుతున్నాయి.. ఎన్ని కేసులు నమోదు చేశారని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో పోలీసుస్టేషన్ది ఒక్కో తీరు... ఒంగోలులో వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం టూటౌన్ సీఐ వీఆర్లో ఉన్నారు. తాలూకా పోలీసు స్టేషన్ సీఐ కూడా వీఆర్లోనే ఉన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో ఎస్సై, రైటర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక, తాలూకా సీఐ బాధితుల లిస్టు చాంతాడంత ఉందని పోలీసులే గుసగుసలాడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్లే కాకుండా చివరికి వ్యభిచారం కేసుల్లో వచ్చిన వారి నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ దామోదర్ హయాంలో ఐడీ పార్టీని రద్దు చేయడం తెలిసిందే. అయితే, తాలూకాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మాత్రం ఐడీ కానిస్టేబుల్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్టౌన్లో ఒక ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఒక ఏఎస్సై విధులు నిర్వహించకుండా కీలక నేత చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా.. నగరంలోని ఏ పోలీసు స్టేషన్లో చూసినా డ్యూటీ కంటే రాజకీయ నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత పనులు చేసుకుంటూ తిరుగుతున్న వారి వివరాలన్నీ ఎస్పీ చేతికి వచ్చినట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ సొమ్ము స్వాహా ఐడీ పార్టీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్ -
బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక ప్రకాశం భవనంలోని తన చాంబర్లో శుక్రవారం కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పిల్లలు ఒక భాగమని, వారిని కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బాల్యం అంటే చదువుకుని వృద్ధిలోకి రావడం అని, పనిచేయడం కాదని చెప్పారు. చిన్నారులు చదువుకుంటూ బడిలో ఉండాలని, పని ప్రదేశాల్లో పనిచేస్తూ కాదని అన్నారు. ఎక్కడైనా పిల్లలు పనిచేస్తుంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు. పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి జీజీహెచ్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లేబర్ కమిషనర్ గౌస్ బాషా, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్, ఆహటా ఎస్సై నాగమణి, ఎన్జీవో పీ సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలకు బాబు వెన్నుపోటు
దర్శి: దేశంలో కుటుంబ సభ్యులకు..ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో విజయం సాధించిన ఒకే ఒక్క దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు అని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి జనం పోటెత్తారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టుకుని వైఎస్సార్ సీపీ జెండాలతో నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు జగనన్న పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పడంతో పాటు అదనంగా 140 కొత్త హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయకుండా పేదలను మోసం చేసి దారుణంగా వెన్నుపోటు పొడిచారని శివప్రసాద్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచారన్నది వాస్తవమా కాదా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు రూ.1500 ఇస్తామన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క మహిళకై నా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇది వారికి వెన్నుపోటు పొడవటమేనన్నారు. డిగ్రీ పాసైన అందరికీ రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారని, వాటిలో ఒక్క నిరుద్యోగికై నా ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ నియోజకవర్గంలోనే 10 వేల మందికి పైగా నిరుద్యోగులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జగనన్న సుమారు 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు, నివాసాలు కట్టించి ఇస్తే... మీరిచ్చిన ఒక సెంటు, అర సెంట్లు సమాధులకు కూడా చాలవని చెప్పి ఎగతాళి చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి దగా డీఎస్సీ అమలు చేశారన్నారు. మెరిట్ లిస్ట్ లేకుండా రూ.15 లక్షలు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చి మెరిట్ విద్యార్థులను దారుణంగా వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే ఎవరూ భయపడేది లేదన్నారు. ప్రతి కార్యకర్త మన దేవుడు, మన దైవం జగనన్నను సీఎం చేసుకునేందుకు కంకణం కట్టుకున్నారన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం అమలు చేయకుండా ప్రజలకు దారుణంగా వెన్నుపోటు పొడిచారన్నారు. పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు మాదాసి వెంకయ్య మాట్లాడుతూ మెగా డీఎస్సీ అని చెప్పి దానిని దగా డీఎస్సీ గా మార్చారన్నారు. స్టేట్ ఫస్ట్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం రాలేదన్నారు. అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి డీఎస్సీని అవినీతిమయం చేశారన్నారు. వలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు ఊడపీకారన్నారు. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ -
చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు ఒంగోలు టౌన్: చిన్నారులు ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జరిగే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వైద్యాధికారులు, సూపర్వైజర్లకు ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మొదటి రోజు నిర్దేశించిన కేంద్రంలో జీరో నుంచి 5 సంవత్సరాల వయసున్న చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. మిగిలిన చిన్నారులకు రెండో రోజు, మూడో రోజు ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర వలస కార్మికుల పిల్లలు ఏ ఒక్కరూ మిస్ కాకుండా పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. జాతీయ పోలియో దినం రోజున నిర్దేశించిన కేంద్రాలకు తల్లిదండ్రులు స్వయంగా వారి పిల్లలను తీసుకొచ్చేలా చూడాలన్నారు. జనసాంధ్రత ఎక్కువగా ఉండే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లు, కూరగాయల మార్కెట్లలోని చిన్నారులకు ట్రాన్సిట్ బూత్ల ద్వారా పోలియో చుక్కలు వేయాలని చెప్పారు. 100 శాతం పోలియో చుక్కలు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు. ఈ శిక్షణలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.కమల శ్రీ, మాస్మీడియా అధికారి బెల్లం శ్రీనివాసులు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కొండపి: కుక్కల దాడిలో జింక మృతి చెందిన సంఘటన మండలంలోని కొండపి పంచాయతీ ముక్కోటిపాలెం గ్రామ శివారుల్లోని వైష్ణవి డైరీ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ముక్కోటిపాలెం చిన్నకండ్లగుంట సమీపంలోని పొలాల్లో జింకలు రాత్రి వేళలో తిరుగుతూ ఉంటాయి. శుక్రవారం తెల్లవారుజామున నీటి కోసం జింక ముక్కోడిపాలెం గ్రామంలోకి వచ్చింది. జింకను గమనించిన కుక్కలు వెంబడించడంతో జింక తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేసి విఫలమైంది. కుక్కల నుంచి తప్పించుకునే క్రమంలో కుక్కల దాడిలో కొంతమేర గాయపడి వైష్ణవి డైరీ వద్ద ఉన్న నీటి కుంటలో పడడంతో తల, ఇతర భాగాలు దెబ్బతిన్నాయి. ఉదయం గమనించిన స్థానికులు జింకను బయటకు తీయడంతో అప్పటికే మరణించింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు, పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ముక్కోడిపాలెం సమీపంలోని ప్రభుత్వ స్థలంలో పంచనామా నిర్వహించి జింకను ఖననం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు అటవీశాఖ అధికారులు భూషణ్, రామకృష్ణ, రంగనాయకులు, వెటర్నరీ డాక్టర్ చంద్రశేఖర్ సిబ్బంది శ్రీను, సిద్దు, హర్ష, పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ● రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించిన కలెక్టర్ ఒంగోలు సబర్బన్: పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ పి.రాజాబాబు కోరారు. ఈనెల 15 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకూ బీఎల్వోలు ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యుమరేట్ చేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో శుక్రవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరూ ఓటర్ల జాబితాలో ఉండాలన్నదే ఎలక్షన్ కమిషన్ చేపట్టిన శ్రీసర్శ్రీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా లోపరహితంగా రూపొందించేందుకు 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్వోలు ఈ ప్రక్రియ నిర్వహించే సమయంలో రాజకీయ పార్టీల తరఫున బీఎల్ఏలకు కూడా అందుబాటులో ఉండి సహకరించేలా చూడాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నెల రోజులపాటు జరిగే మ్యాపింగ్ ప్రక్రియకు సంబంధించిన పురోగతిని, క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకునేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రతివారం ఇలాంటి సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ మాధురి, ఆర్డీవోలు విజయ జ్యోతి కుమారి (అద్దంకి), చంద్రశేఖర్ నాయుడు (ఒంగోలు), ఒంగోలు, కందుకూరు మున్సిపల్ కమిషనర్లు, అద్దంకి, చీమకుర్తి, దర్శి, కందుకూరు తహసీల్దార్లు, ఇతర అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీడీపీ అట్టర్ఫ్లాప్.. వైఎస్సార్ సీపీ సూపర్ సక్సెస్...
వైఎస్సార్ సీపీ, టీడీపీ ర్యాలీలపై ప్రజల్లో తీవ్ర చర్చ సాగింది. ఒకే సమయంలో రెండు పార్టీల ర్యాలీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో అటు జనాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ, ఆసక్తిని రేకెత్తించాయి. అధికారంలో ఉండి కూడా అట్టర్ఫ్లాప్ షోతో జనాల్లో పరువు పోగొట్టుకున్నారంటూ టీడీపీ ర్యాలీపై విమర్శలు వినిపించాయి. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దాదాపు అదే అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో వైఎస్సార్ సీపీ ర్యాలీ సూపర్ సక్సెస్ అంటూ అటు జనాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. -
సమస్యారంభం కరిష్యామి!
వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటిరోజే పుస్తకాలిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో, తీవ్రమైన ఎండల్లో విద్యార్థులు తాగునీరు లేక అల్లాడిపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తొలిరోజు హాజరు కూడా వెలవెలబోయింది. ప్రకాశం జిల్లాలో 1508 స్కూళ్లలో 97,682 మందికి గాను 43,763 మంది హాజరయ్యారు. మార్కాపురం జిల్లాలో 1330 స్కూళ్లలో 90,115 మందికిగాను 46515 మంది మాత్రమే బడిబాట పట్టారు. – సాక్షి నెట్వర్క్ తాగునీటి కొరతహెచ్ఎంపాడు స్కూల్లో పనిచేయని ఆర్వో కొనకనమిట్ల జెడ్పీ స్కూల్లో పని చేయని ఆర్వో ప్లాంట్పామూరు ఎస్టీ కాలనీలో చిరిగిన బ్యాగులతో విద్యార్థులు -
అధికార పార్టీ అభాసుపాలు.!
కందుకూరు: తాను తీసుకున్న గొయ్యిలో తానేపడినట్లు.. వైఎస్సార్ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు కందుకూరులో అధికార టీడీపీ చేసిన కుట్ర బెడిసికొట్టి చివరకు జనాల్లో నవ్వులపాలైంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకి పోటీగా టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ పూర్తిగా తేలిపోయింది. టీడీపీ నాయకులు చేపట్టిన ర్యాలీ జనాలు లేక వెలవెలబోయింది. అదే సమయంలో వైఎస్సార్ సీపీ ర్యాలీ సూపర్ సక్సెస్ కావడం అటు సాధారణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు అనవసర ప్రయత్నం చేసి పరువు పోగొట్టుకున్నారంటూ టీడీపీపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయోత్సవం అంటూ.. వెలవెలబోయి... రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన దానికి నిరసనగా వైఎస్సా ర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించేందుకు 10 రోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. శుక్రవారం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు అధికార టీడీపీ నాయకులు రాత్రి రాత్రే కుట్రకు తెరలేపారు. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ ర్యాలీ చేస్తామంటూ సోషల్ మీడియాలో గురువారం రాత్రి ప్రకటించారు. అది కూడా వైఎస్సార్ సీపీ ర్యాలీ జరిగే సమయానికే చేస్తామంటూ ప్రచారం చేశారు. పోలీసులను రంగంలోకి దించడంతో ముందుగా టీడీపీ ర్యాలీకి అనుమతిచ్చారు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు టీడీపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడే టీడీపీ నాయకులకు షాక్ తగిలింది. విజయోత్సవ ర్యాలీకి భారీగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వస్తారని భావించగా.. కనీసం వందల మంది కూడా లేకపోవడంతో ర్యాలీ పూర్తిగా వెలవెలబోయింది. వైఎస్సార్ సీపీ ర్యాలీలో కదంతొక్కిన వేల మంది... ముందుగానే ప్రకటించినప్పటికీ వైఎస్సార్ సీపీ ర్యాలీకి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గురువారం రాత్రి నుంచే రంగంలోకి దిగి శుక్రవారం ఉదయం చేయాల్సిన ర్యాలీని సాయంత్రానికి మార్చుకోవాలంటూ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్పై ఒత్తిడి తెచ్చారు. దీనికి ససేమిరా అన్న బుర్రా.. తాము పది రోజుల క్రితమే ర్యాలీ ఉంటుందని అనుమతి కోరామని, ప్రకటించిన సమయానికి తమ ర్యాలీ ఉంటుందంటూ తెగేసి చెప్పారు. అయితే టీడీపీ ర్యాలీ పూర్తయిన తరువాత అనుమతిస్తామంటూ పోలీసులు చెప్పారు. ఉదయం 11 గంటలకు కనిగిరి రోడ్డులోని మెర్సి స్కూల్ ఆవరణ నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉండగా, టీడీపీ ర్యాలీ పూర్తి కాలేదు.. మీరు అప్పుడే రావద్దంటూ పోలీసులు అడ్డుచెప్పారు. కనీసం ప్రచార వాహనాన్నిగానీ, మైక్ పర్మిషన్గానీ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అప్పటికే భారీగా వైఎస్సార్ సీపీ శ్రేణులు మెర్సి స్కూల్ ఆవరణకు చేరుకుని ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువవుతున్నా టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా అంబేడ్కర్ విగ్రహం వద్ద సభ పెట్టి మాట్లాడుతూ ఆలస్యం చేశారు. ఆ విషయం గ్రహించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు పోలీసుల అడ్డుగోడలను తొలగించుకుని ముందుకు కదిలారు. వేలాది మంది ఒకేసారి రావడంతో పోలీసులు చేసేదేమీ లేక ర్యాలీకి అక్కడక్కడా బ్రేక్లు వేస్తూ.. టీడీపీ నాయకులను వీలైనంత త్వరగా అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పంపించే ప్రయత్నాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా ముందుకు కదిలారు. వేల మంది కార్యకర్తలతో అంబేడ్కర్ విగ్రహం వరకు కనిగిరి రోడ్డు కిక్కిరిసిపోయింది. వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీకి పోటీగా కందుకూరులో టీడీపీ విజయోత్సవ ర్యాలీ రెండు పార్టీల ర్యాలీలు ఒకే సమయంలో కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ ముందుగా టీడీపీ ర్యాలీకి పోలీసుల అనుమతి వైఎస్సార్ సీపీ ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు ప్రజల నుంచి స్పందన లేక పూర్తిగా తేలిపోయిన టీడీపీ ర్యాలీ ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు తూతూమంత్రంగా ర్యాలీ అదే సమయంలో వేల మందితో అంబేడ్కర్ విగ్రహం వరకు వైఎస్సార్ సీపీ ర్యాలీ రెండు పార్టీల ర్యాలీలను పోల్చుకుని టీడీపీ ర్యాలీ అట్టర్ఫ్లాప్ అంటూ జనాల్లో చర్చ -
నారాసుర పాలనపై.. ఎగసిన ఆగ్రహం..
యర్రగొండపాలెంలో నిరసన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కొండపిలో నిరసన ర్యాలీగా వస్తున్న ప్రజలు, బ్యానర్తో ఆదిమూలపు సురేష్ ఆందోళనదర్శిలో భారీ ర్యాలీ, ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, వెంకాయమ్మ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, మోసపూరిత పాలన సాగించిందంటూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాగ్రహం ఎగిసింది. వైఎస్సార్ సీపీ శ్రేణులతోపాటు వేలాదిగా ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చిన నిరసనలతో హోరెత్తించారు. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ప్రదర్శనలతో కూటమి సర్కారు వైఫల్యాలను ప్లకార్డులతో ఎండగట్టారు. సూపర్ సిక్స్ హామీలు, బాబు షూరిటీ– భవిష్యత్ గ్యారెంటీ పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఆర్థిక భరోసా, రైతులకు మద్దతు, విద్యార్థులకు సహాయమంటూ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. పలు చోట్ల బూటకపు హామీలకు ప్రతీకగా బాబు షూరిటీ పత్రాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, వృద్ధులు భారీ సంఖ్యలో నిరసనల్లో పాల్గొనడం కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనంగా నిలిచింది. వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమం దర్శిలో విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ పరిశీలకుడు డాక్టర్ మాదాసి వెంకయ్య హాజరయ్యారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా హాజరై కూటమి ప్రభుత్వ చర్యలను ఖండించారు. డీఎస్సీ పేరుతో దగా ఎన్నికల హామీలను విస్మరించి చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా శుక్రవారం పట్టణంలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘సూపర్ సిక్స్’ను ‘సూపర్ ఫ్లాప్’ చేసి, మహిళలను, నిరుద్యోగులను ప్రభుత్వం వంచించిందన్నారు. మెగా డీఎస్సీ2025 నియామకాలన్నీ దగా అని, అభ్యర్థులకు కాల్ లెటర్లు వచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందని స్పష్టం చేశారు. ఎడ్ల బండిపై ర్యాలీ.. కొండపి నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ర్యాలీని ప్రారంభించి ముందడుగు వేశారు. కూటమి పరిపాలనా తీరును ఎండగట్టారు. ఎటు చూసినా ఉత్సాహం ఉరకలేసింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెద్దకండ్లగుంట సర్పంచ్ భువనగిరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బండి ర్యాలీ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. సురేష్ ప్రసంగిస్తున్న సమయంలో స్వల్ప అనారోగ్యానికి గురైనా.. కొంత విశ్రాంతి తీసుకొన్న వెంటనే శ్రేణులను ఉత్తేజపరచడానికి కూర్చొని తన ప్రసంగాన్ని కొనసాగించారు. సంతనూతలపాడులో కదంతొక్కి.. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే పేరుతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సంతనూతలపాడులో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జనం కదంతొక్కారు. ఉదయం 11:30 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది. ఒంగోలు–కర్నూలు రోడ్డులోని సంతనూతలపాడు పోలీస్స్టేషన్, బస్టాండ్ కూడలి, పెద్దబజారులోని బ్రహ్మంగారి దేవస్థానం మీదుగా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి.. ఒంగోలులో అంబేడ్కర్ భవన్ నుంచి చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వరకు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, తదితరులు పాల్గొని వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా తరలివచ్చి చర్చి సెంటర్లోని వైఎస్సార్ విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. వసూల్ రాజాల పాలనకు రెండేళ్లు.. కందుకూరు నియోజకవర్గంలో వసూల్ రాజా పాలనకు రెండేళ్లు గడిచిపోయాయంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్యాదవ్ ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో శుక్రవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కందుకూరు పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ర్యాలీని అడ్డుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీ చేసిన కుట్ర బెడిసికొట్టి జనాల్లో నవ్వులపాలైంది. విజయోత్సవ ర్యాలీ పేరుతో ఆ పార్టీ నాయకులు చేపట్టిన ర్యాలీ జనాలు లేక వెలవెలపోగా.. వైఎస్సార్ సీపీ ర్యాలీ సూపర్సక్సెస్ అయింది. బాబు పాలనలో విధ్వంసమే.. అధికారం కోసం సూపర్–6తోపాటు నోటికొచ్చిన హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కగానే నిజస్వరూపం బయటపెట్టారని మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మార్కాపురం పట్టణం తూర్పువీధిలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. జనసంద్రంగా గిద్దలూరు.. గిద్దలూరులో జనసంద్రం పోటెత్తింది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. పేరుతో నిరసన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేపట్టారు. వేణుగోపాలస్వామి ఆలయం మీదుగా గణేష్ నగర్, పొట్టిశ్రీరాముల సెంటర్, మెయిన్బజార్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి పోయాం మోసం.. పోయాం మోసం అంటు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. కనిగిరిలో కూటమి మేనిఫెస్టో ప్రతుల దహనం కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి దద్దాల నారాయణయాదవ్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఒంగోలు బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పట్ట ప్రధాన వీధుల గుండా ర్యాలీ స్థానిక పామూరు బస్టాండ్ చర్చి సెంటర్ వరకు సాగింది. స్థానిక సుగుణావతమ్మ ఆస్పత్రి సెంటర్లో మేనిఫెస్టో ప్రతులను పార్టీ శ్రేణులు దహనం చేశారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతు, విద్యార్థి, మహిళా, యువత వివి ధ విభాగాల శ్రేణులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. అద్దంకిలో భారీ ర్యాలీ.. అద్దంకిలో వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం విజయవంతమైంది. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ నేతృత్యంలో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు హాజరై కూటమి ప్రభుత్వ చర్యలను ఖండించారు. కందుకూరులో భారీ జనసందోహం, అంబేడ్కర్కి నివాళులర్పిస్తున్న బుర్రా సంతనూతలపాడులో నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున అద్దంకిలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న చింతలపూడి అశోక్కుమార్, పార్టీ నేతలుఒంగోలు.. భారీ ర్యాలీలో బత్తుల, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు -
సెల్ఫీ సరదా.. ప్రాణం తీసింది!
ఉలవపాడు: సెల్ఫీ సరదా.. ఆ యువకుడి పాలిట మృత్యుపాశమైంది. సరదాగా ఫొటోలు దిగుదామని నీటిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యువకుడు.. ప్రమాదవశాత్తూ చెరువులోని లోతైన గుంతలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన ఉలవపాడు మండలం రాజుపాలెం చెరువులో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్కు చెందిన శోభిత్(23) జాతీయ రహదారి భద్రతా వాహనం సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా శుక్రవారం తన తోటి సిబ్బందితో కలిసి టంగుటూరు నుంచి వాహనాన్ని తనిఖీ చేసుకుంటూ రాజుపాలెం వద్దకు వచ్చారు. అక్కడ జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువును చూసి, సరదాగా ఫొటోలు దిగాలని శోభిత్ ఆశపడ్డాడు. మిత్రులకు ఫోన్ ఇచ్చి ఫొటోలు తీయమన్నాడు. ఈ క్రమంలో నీటిలో ముందడుగు వేసిన ఆయన, అక్కడ అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతను గమనించలేకపోయాడు. ఒక్కసారిగా అడుగు లోపలికి పడటంతో నీటిలో మునిగిపోయాడు. అది చూసి నిర్ఘాంతపోయిన తోటి మిత్రులు.. వెంటనే హైవే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు తక్షణమే స్పందించి గజఈతగాళ్లను రప్పించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే శోభిత్ గ్రావెల్ మట్టిలో కూరుకుపోయి శ్వాస ఆడక మృతి చెందాడు. ఈతగాళ్లు శ్రమించి ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. శోభిత్ మృతికి రాజుపాలెం చెరువులో అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతులే కారణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు టౌన్: గంజాయి తరలిస్తున్న ఒక పాత నేరస్తుడిని పోలీసులు పట్టుకుని భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడాన్ని కట్టడి చేయడంలో భాగంగా ఒంగోలు టూటౌన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుళ్లు ఇద్దరు శుక్రవారం సాయంత్రం నగరంలోని బాలాజీ నగర్ పరిసరాలకు వెళ్లారు. అదే సమయంలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు ఒడిశా నుంచి పూరి ఎక్స్ప్రెస్లో గంజాయి తీసుకొచ్చి ఒంగోలు రైల్వేస్టేషన్లో రైలు దిగారు. ప్రధాన గేటు వైపు రైలు దిగితే పోలీసు ఉంటారని భావించి కొత్తగా నిర్మించిన 5వ నంబర్ ప్లాట్ఫాం వైపు దిగి బాలాజీ నగర్ వైపు వెళ్లారు. అక్కడు పోలీసులకు అనుమానం రావడంతో వారిని వెంబడించారు. వారిలో ఇద్దరు యువకులు భయపడి పరారయ్యారు. మన్నెం భవానీ ప్రకాష్ అనే నిందితుడు పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని తాలూకా పోలీసులకు అప్పగించారు. నగరానికి చెందిన ఒక గిరిజన యువకుడిని నగర శివారుకు తీసుకెళ్లి చితకబాది మొహం మీద మూత్రం పోసిన కేసులో ప్రధాన నిందితుడైన మన్నెం రామాంజనేయులు, అతని తమ్ముడు భవానీ ప్రకాష్లు సుధీర్ అనే యువకుడితో కలిసి ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఆ మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. -
గుండెపోటుతో డీఎస్పీ శ్రీరాం కన్నుమూత
ఒంగోలు టౌన్: ఇంటలిజెన్స్ డీఎస్పీ వేలమూరి శ్రీరాం(55) గుండెపోటుతో గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసు శాఖ విషాదంలో మునిగిపోయింది. ఒంగోలులోని మంగమూరు రోడ్డులో గాయత్రి నగర్లో నివసిస్తున్న ఆయనకు బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో గుండెలోనొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను స్థానికంగా కార్పొరేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు రెండు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీరాం తండ్రి కృష్ణమూర్తి కూడా పోలీసు కానిస్టేబుల్గా పనిచేశారు. జిల్లాలో ఎస్సైగా దోర్నాల, మార్టూరు, గిద్దలూరు, చీరాల టుటౌన్, కందుకూరు, ఒంగోలు తాలుకా, మార్కాపురంలలో పనిచేశారు. ఆ తరువాత సీఐగా పదోన్నతి పొంది కందుకూరు, గిద్దలూరు, దర్శి, పొదిలిలో విజిలెన్స్ సీఐగా పనిచేశారు. దీర్ఘకాలంగా ఒంగోలు ఇంటలిజెన్స్లో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. గత నెలలో డీఎస్పీగా పదోన్నతి రాగా ఇంటలిజెన్స్లోనే కొనసాగుతున్నారు. ఆయన ఎక్కడ విధులు నిర్వహించిన అక్కడి ప్రజలతో మమేకమౌతూ వారి మన్ననలు పొందారు. పనిచేసిన చోటల్లా తనదైన ముద్ర వేసుకున్నారు. జిల్లా ప్రజలకు ఆయన బాగా సుపరచితులు. సాహితీ ప్రియుడు... పోలీసు శాఖలో బిజీగా ఉన్నా ఏమాత్రం తీరికదొరికినా పుస్తకాలు చదవడం ఆయనకు చాలా ఇష్టం. మంచి సాహితీ ప్రియుడు. ఆయన కార్యాలయంలో గదిలో ఎటు చూసినా పుస్తకాలు కనిపిస్తాయి. ప్రసిద్ధిచెందిన రచయితల పుస్తకాలను తెప్పించుకుంటారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన కథలు, కవిత్వంపై గంటల తరబడి చర్చిస్తారు. ఎందరో సాహితీవేత్తలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఫిలాసఫీ, వామపక్ష, బహుజన సాహిత్యం అధికంగా చదివేవారు. ఆయన మృతి చెందారని తెలిసి పోలీసు శాఖలోనే కాకుండా ఎంతో మంది సాహిత్య వేత్తలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఇంటలిజెన్స్ ఏడీజీ మహేష్చంద్ర లడ్హా, ఇంటలిజెన్స్ ఎస్పీలు రామ్మోహన్రావు, లావణ్యలక్ష్మీ, ఎస్పీ హర్షవర్థన్ రాజు, ఇంటలిజెన్స్ అధికారులు రమాదేవి, ఖాదర్ బాషా, డీస్పీలు, సీఐలు శ్రీరామ్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఇంటలిజెన్స్ సిబ్బంది, పోలీసులు, విఽవిధ శాఖల ఉన్నతాధికారులు శ్రీరామ్ మృతికి నివాళులర్పించారు. సాయంత్రం ఆర్టీసీ బస్టాండ్ వెనుక ఉన్న హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
ఉప్పు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి
సింగరాయకొండ: ఉప్పు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. మండలంలోని ఊళ్లపాలెం పంచాయతీ పరిధిలోని ఉప్పు కొఠార్లను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప్పు తయారీ విధానాన్ని తెలుసుకొని ఉప్పుకొఠారులలో దిగి స్వయంగా ఉప్పు లాగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో సుమారు 1,500 ఎకరాల్లో ఉప్పు కొఠారులు ఉన్నాయని వీటిని లీజు పద్ధతిలో సాగు చేసుకుంటున్నామని తెలిపారు. అయితే 2027తో లీజు గడువు ముగుస్తుందని, కానీ తరువాత లీజు రెన్యువల్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఈ భూములపై యాజమాన్య హక్కులు ఇప్పించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పు కొఠార్లకు విద్యుత్ సబ్సిడీ లేదని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, దీంతో అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు పండించిన పంటకు దళారుల సిండికేట్ కారణంగా గిట్టుబాటు ధర రావడం లేదని, వారు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. దీనిపై స్పందించిన డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి ఉప్పు రైతులు ఎదుర్కొంటున్న సమస్యను తీసుకుని వెళ్లి వారి సహకారంతో సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప్పు రైతుల సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, మాజీ సర్పంచ్ పివిరెడ్డి, నాటారు సుబ్బారెడ్డి, నాటారు ఆదినారాయణరెడ్డి, పుట్టా శ్రీనివాసులరెడ్డి, కావూరి ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
నాడు–నేడు పనులపై దృష్టేదీ..
గత వైఎస్సార్ సీపీ హయాంలో రెండో విడత నాడు –నేడులో జిల్లాలో 979 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేశారు. వీటితో పాటు అంగన్వాడీలు, డైట్ కళాశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 417.31 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో కొన్ని పాఠశాలల్లో నిర్మాణాలను పూర్తి చేయగా, కొన్నింట్లో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. ఆ తరువాత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాఠశాలల్లో నాడు–నేడు పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ రెండేళ్లలో పాఠశాలల్లో వసతులపై ఏనాడూ దృష్టి సారించలేదు. పాఠశాలల్లో 563 టాయిలెట్స్, 670 కిచెన్షెడ్స్, 522 అదనపు తరగతి గదులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. విద్యార్థులకు శుద్ధ జలాలు అందించాలని ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు చాలా నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని మరమ్మతులు కూడా చేయకపోవడంతో విద్యార్థులు తాగునీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. -
వివిధ హోదాల్లో వైఎస్సార్ సీపీ నాయకుల నియామకం
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఒంగోలుకు చెందిన బొజ్జా సురేంద్ర చక్రవర్తిని నియమించారు. అలాగే కొండపి నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీని నియమించారు. కొండపి నియోజకవర్గ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్గా కొంగల శ్రీలక్ష్మిని, కొండపి నియోజకవర్గ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీలుగా షేక్ రియాజ్ఖాన్, పి.వెంకటేశ్వర్లును, లీగల్ సెల్ సెక్రటరీలుగా ప్రమోద్, శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా అల్లాడి సునీల్కుమార్, చిమటా కోదండపాణిలను నియమించారు. మార్కాపురం టౌన్: మార్కాపురం జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్గా ఆర్ కొండారెడ్డి నియమితులయ్యారు. గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సిబ్బంది నియామకం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఓపెన్ స్కూల్ ప్రవేశాలువంటి కార్యక్రమాలు మార్కాపురం జిల్లా నుంచే జరుగుతాయన్నారు. అలాగే ఎన్ఎంఎంఎస్, ఎన్టీఎస్ఈ, ప్రతిభా పాటవ పరీక్షలు, బీఈడీ, టెట్ పరీక్షలను మార్కాపురం నుంచే అసిస్టెంటు కమిషనర్, డీఈఓ పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. అనంతరం కొండారెడ్డిని సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ సుబ్బారావు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు. పుల్లలచెరువు: భూ వివాదం కారణంగానే మొలబంటి రవికుమార్ దారుణహత్యకు గురైనట్లు పోలీసులు విచారణలో తేలినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..తాడేపల్లి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన మొలబంటి రవికుమార్(52) పుల్లలచెరువు మండలంలోని శతకోడులో బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మృతుడు రవికుమార్ సోదరుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న వివరాల ప్రకారం.. మృతుడు రవికుమార్ శతకోడు గ్రామానికి చెందిన వరికూటి చిన్న పోలిరెడ్డితో కలిసి కొన్నాళ్లుగా శతకోడు ప్రాంతంలో వ్యవసాయ భూముల కొనుగోలు, అమ్మకాలు చసేఉ్తన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలతో రవికుమార్, పోలిరెడ్డి మధ్య వివాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న చిన్న పోలిరెడ్డి రవికుమార్ను బుధవారం నాడు శతకోడు గ్రామానికి పిలిపించి తన అనుచరులతో కలిసి హత్య చేసినట్లుగా మృతుని సోదరుడు ఉమామహేశ్వరరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు ఎస్సై సాంబశివరావు కేసు నమోదు చేశారు. సీఐ అజయ్ కుమార్ గురువారం సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మృతుని భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు -
అడవిపందిని ఢీకొట్టి వ్యక్తి మృతి
కంభం: అడవిపందిని ఢీకొట్టి ద్విచక్రవాహనదారుడు మృతిచెందిన సంఘటన కంభం మండలంలోని నల్లకాల్వ సమీపంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గిద్దలూరు మండలంలో క్రిష్ణమూర్తిపల్లికి చెందిన భూపని తిరుమలయ్య (44) సోమవారం రాత్రి కంభం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. నల్లకాల్వ సమీపంలో అకస్మాత్తుగా అడ్డొచ్చిన అడవిపందిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అడవిపంది చనిపోగా, కిందపడిన తిరుమలయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకృష్ణారెడ్డి తెలిపారు. అద్దంకి రూరల్: అద్దంకిలోని ఇటుక బట్టీలో వెట్టిచాకిరీ చేస్తున్న 10 మంది కార్మికులకు మంగళవారం విముక్తి లభించింది. కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో మండల రెవెన్యూశాఖ, విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ, లేబర్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఒంగోలు వారు సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా అద్దంకిలోని కలవకూరు రోడ్డులో రెండు ఇటుక బట్టీలను తనిఖీలు చేశారు. ఒడిశాకు చెందిన 10 మంది కార్మికులను వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి వారి స్వగ్రామాలకు పంపినట్లు లేబర్ ఆఫీసర్ కోటేశ్వరరావు తెలిపారు. -
రాళ్లపాడు ప్రాజెక్టులో వ్యర్థాలు ఉపయోగించలేదు
లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం కోసం ఎటువంటి వ్యర్థాలు ఉపయోగించలేదని ప్రాజెక్టు ఈఈ మునిరత్నం తెలిపారు. ఇటీవల కందుకూరు నియోజకవర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు, సోషల్ మీడియా గ్రూపులు ద్వారా రాళ్లపాడు ప్రాజెక్టులో చేపల పెంపకం కోసం వ్యర్థ పదార్థాలు ఉపయోగిస్తూ నీటిని కలుషితం చేస్తున్నారంటూ ప్రచారం చేశారని, దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నాని ఈఈ తెలిపారు. జలవనరులశాఖ ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణలో రాళ్లపాడు ప్రాజెక్టు ఉంటుందని, ప్రాజెక్టులో చేపల పెంపకందారులు ఎటువంటి వ్యర్థ పదార్థాలు, ఎరువులు, ఇతర కాలుష్యకారక పదార్థాలు ఉపయోగించలేదని చెప్పారు. అలాగే, గ్రామీణ నీటి సరఫరాశాఖ కందుకూరు, గుడ్లూరు, లింగసముద్రం వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల వద్ద సేకరించే నీటి నమూనాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నీటి నాణ్యతకు సంబంధించి ఎటువంటి అభ్యంతరకర పరిస్థితులు గుర్తించలేదన్నారు. వినియోగానికి అనుకూలంగానే తాగునీరు ఉందని సంబంధిత అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9 అడుగుల మేరకు నీరు నిల్వ ఉందని, నీటిమట్టం తగ్గేకొద్దీ నీటిలో సహజసిద్ధంగా మసకదనం పెరిగే అవకాశం ఉంటుందని అన్నారు. దీనికి చేపల పెంపకం కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని ప్రజలు గమనించాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రాజెక్టులో వ్యర్థ పదార్థాలు కలుపుతున్నారని నిరాధార, అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఫిర్యాదు చేస్తామని ఈఈ హెచ్చరించారు. ఒంగోలు సిటీ: స్థానిక ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల నియామకాలకు జారీ చేసిన ప్రకటనకు సంబంధించి దరఖాస్తుల సమర్పణ గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీ వరకు నిర్ణయించిన ఆన్లైన్ దరఖాస్తు గడువును 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వ సాధారణ నియామక పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. అదేవిధంగా దరఖాస్తుల హార్డ్ కాపీలు, ధ్రువీకరణ పత్రాలు, స్వీయ ఽధ్రువీకరణ పత్రాలు విశ్వవిద్యాలయానికి చేర్చాల్సిన గడువును ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర నిబంధనలు, షరతులు యథాతథంగా అమలులో ఉంటాయని తెలిపారు. సింగరాయకొండ: జాతీయ రహదారిపై జంక్షన్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో సింగరాయకొండ మండల పరిధిలోని పెరల్ డిస్టిలరీ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ పోకిరి దానయ్యకు కుడి కాలు విరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పెరల్ డిస్టిలరీ సమీపంలో లారీ యూటర్న్ తీసుకునే ప్రయత్నంలో ఉండగా వెనకాల అతివేగంగా వచ్చిన గుంటూరు డిపోకు చెందిన గుంటూరు–తిరుపతి సూపర్లగ్జరీ బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. లారీ వెనుక భాగం, బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేగాన్ని నియత్రించుకోలేక ఆర్టీసీ బస్సు రోడ్డుకు ఎడమవైపున్న గుంతలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు డ్రైవర్ స్వగ్రామం గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం కాగా, 108లో ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. ప్రయాణికులను ఇతర ఆర్టీసీ బస్సుల్లో హైవే పెట్రోలింగ్ పోలీసులు పంపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధీర్కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. సంతమాగులూరు (అద్దంకి రూరల్): పాతకక్షల నేపథ్యంలో మహిళపై రాడ్డుతో వ్యక్తి దాడిచేసిన ఘటన మంగళవారం సంతమాగులూరు మండలంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కామేపల్లి గ్రామానికి చెందిన లక్కిపోగు దిబ్బమ్మ, బుల్లి అంకయ్య, దీనమ్మల మధ్య పాత గొడవలున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అంకయ్య ఆగ్రహంతో రాడ్డుతో దిబ్బమ్మపై దాడికి పాల్పడ్డాడు. క్షతగాత్రురాలిని వైద్యం కోసం సంతమాగులూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేశారు. -
అధికార పార్టీ అండతో బరి‘తెగింపు’
కనిగిరి రూరల్: అక్రమార్జన కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఓవైపు ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు జలధార, జలహారతి పేరుతో ఒక్క నీటిబొట్టు కూడా వృథా కాకుండా ప్రతి చెరువులోని నీటి చుక్కను రక్షించుకోవాలని, చెరువుల్లో వర్షం నీరు నిలిపేందుకు అధికార యంత్రాంగం, అధికారులు పూర్తిగా పనిచేయాలని ఉపోద్ఘాతాలు చేస్తూ ప్రచారాల డప్పు కొడుతుంటే.. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ నేతలు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ వేలాది ఎకరాల ఆయకట్టు ఉన్న చెరువుకు గండి కొట్టారు. కేవలం చేపల కాంట్రాక్టర్ కోసం తొర్రలు పెట్టి నీరు వృథా చేశారు. ఈ సంఘటన మంగళవారం కనిగిరిలో జరిగింది. మండలంలోని నేలటూరి గొల్లపల్లి చెరువు మోంథా తుఫాన్ వర్షాలకు చాలా కాలం తర్వాత నిండింది. ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్ కింద సుమారు 3 వేలకుపైగా అధికారిక ఆయకట్టు ఉండగా, కనిగిరి, వెలిగండ్ల మండలాల కింద దాదాపు 15 గ్రామాలకు చెందిన రైతుల భూములకు కూడా ఉపయోగం కలుగుతోంది. అంతేగాకుండా మండలంలోని సుమారు 20 గ్రామాల్లో ఆ రిజర్వాయర్లోని నీటి నిల్వలతో భూగర్భ జలమట్టం పెరిగి కొంతకాలంగా గ్రామాల్లో నీటి సమస్య కూడా అంతగా లేదు. లక్షల సంఖ్యలో ఉన్న పశువులు, మేకలు, గొర్రెలకు దాహార్తి తీరుస్తోంది. అలాంటి గొల్లపల్లి రిజర్వాయర్కు గండికొట్టడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల కాంట్రాక్టర్ కోసం అధికారమే అండగా గండి... అధికార పార్టీ చోటా నేతల అండతో చేపల గుత్తేదారుల కోసం ఎన్.గొల్లపల్లి చెరువు తూము గండికొట్టడంతో లక్షల లీటర్ల నీరు వృథాగా పోతోంది. అయినప్పటికీ సచివాలయం, ఇరిగేషన్, పంచాయతీ అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. చేపల కాంట్రాక్టర్తో పార్టీ చోటా నేతలు కుమ్మకై ్క ప్రజలు, రైతులకు ఉపయోగపడే నీటిని వృథా చేయడంపై అందరూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, డీఈలకు దద్దాల నారాయణ యాదవ్ ఫిర్యాదు... ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్లో సంవృద్ధిగా ఉన్న నీటిని కేవలం చెరువులోని చేపలు పట్టుకునేందుకు, చేపల కాంట్రాక్టర్కు మేలు చేసేందుకు అధికార పార్టీ నాయకులు గండి కొట్టి వృథా చేయడం దారుణమని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. కలెక్టర్, ఆర్డీఓ, ఇరిగేషన్ డీఈఈకి ఆయన ఫిర్యాదు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్కు గండి కొట్టడం వలన రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సుమారు 30 గ్రామాల్లో భూగర్భ జాలాల నీటి మట్టం పడిపోయి భవిష్యత్తులో నీటి సమస్య ఏర్పడుతోందని, అనేక మూగజీవాల దాహార్తికి నీరు లేక అల్లాడుతాయని వివరించారు. కేవలం అధికార పార్టీ నాయకులు వారి ఆదాయం కోసం రైతుల కడుపు కొట్టేందుకు దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణం అధికారులు స్పందించి చెరువుకు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, నీరు వృథా కాకుండా శాశ్వత మరమ్మతులు చేపట్టాలని దద్దాల కోరారు. ఎన్.గొల్లపల్లి చెరువుకు గండికొట్టిన దుండగులు చేపల కోసం తూముకు తొర్ర చెరువులోని నీరంతా వృథా గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఆర్డీఓ, డీఈఈలకు దద్దాల నారాయణ ఫిర్యాదు ఫిర్యాదు చేస్తున్నాం : గుర్తు తెలియని వ్యక్తులు ఎన్.గొల్లపల్లి రిజర్వాయర్ తూముకు గండి కొట్టారు. దీంతో నీరు వృథాగా పోతోంది. ఈ విషయాన్ని తెలుసుకుని నీరు నిలిచే విధంగా చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం నీటి వృథా ఆగింది. తూముకు శాశ్వత మరమ్మతులకు నివేదికలు పంపాం. చెరువుకు గండి కొట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నాం. మధుబాబు, ఇరిగేషన్ ఏఈ, కనిగిరి -
ఇంటి సర్వే మాకొద్దు...
● నిలిపేసిన ఇందిరా నగర్ గిరిజనులు ఉలవపాడు: భూ సేకరణ ప్రక్రియలో భాగంగా కరేడు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీ(ధర్మారెడ్డి సంగం)లో ఇంటింటి సర్వేను గిరిజనులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం కరేడు గ్రామ సచివాలయ సిబ్బంది భూ సేకరణకు సంబంధించి ఇంటింటి సర్వే ప్రారంభించగా గ్రామస్తులందరూ కలసి అడ్డుకున్నారు. ప్రజలకు ముందస్తుగా తెలియచేయకుండా తమ ఇళ్లను సర్వే చేసి ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఈ సర్వే చేయడానికి తాము ఒప్పుకోమని సర్వే సిబ్బందికి తెలియజేశారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామంలో సమావేశం నిర్వహించకుండా ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. భూ సేకరణ, ఇళ్ల తొలగింపు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లాంటి సమావేశాలు పెట్టకుండా, సమాచారం ఇవ్వకుండా సర్వే చేయనివ్వమని గిరిజనులు అడ్డుపడడంతో సర్వేను నిలిపేశారు. గిరిజనులు ఈ భూ సేకరణకు సంబంధించి కుల సమావేశం నిర్వహించుకుని తరువాత అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియచేస్తామని సర్వే సిబ్బందికి తెలియచేశారు. దీంతో వారు వెనుతిరిగారు. -
కాసుల వేట
కనిగిరిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు సహజ వనరులను కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. అధికారం మాది.. అడ్డగోలుగా తవ్వేస్తాం.. అడ్డొచ్చారో.. అధికారులతో అక్రమ కేసులు బనాయించి లోపల తోస్తాం అంటూ నియోజకవర్గ ముఖ్యనేత అండతో బెదిరింపులకు దిగుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. చెరువు మట్టి..సాక్షి టాస్క్ఫోర్స్: కనిగిరి నియోజకవర్గం హెచ్ఎంపాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులో పది రోజులుగా అధికార పార్టీ నేతలు భారీ వాహనాలతో తవ్వకాలు జరుపుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా చెరువు మట్టిని తరలించేస్తున్నారు. భారీ పొకై ్లనర్, జేసీబీలతో సుమారు 5 నుంచి 10 మీటర్లకు పైగా లోతుగా తవ్వి మట్టిని తోడేస్తున్నారు. రియల్ వెంచర్లకు తరలింపు.. అధికార తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత అండతో జరుగుతున్న మిట్టపాలెం చెరువు మట్టి అక్రమ తవ్వకం నేరుగా.. టీడీపీ నేతల అధికార వెంచర్లకు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కనిగిరి– కంభం రోడ్డులోని శ్రీరంగాపురం సమీపంలో ఓ పెద్దనేత వెంచర్కు తరలిస్తున్నట్లు గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మరికొంత మట్టిని అక్రమార్కులు ఇతర వెంచర్లకు పట్టణంలోకి తరలిస్తున్నట్లు తెలిసింది. అయితే సింహ భాగం హెచ్ఎంపాడు రోడ్డులోని వెంచర్లకే వెళుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మౌనం దాల్చుతున్న అధికారులు.. సహజంగా ఓ ఇంటి నిర్మాణానికి ట్రాక్టర్ మట్టి తవ్వుకుంటే.. ఆఘమేఘాలపై వాలిపోయి రచ్చరచ్చ చేసే.. సచివాలయ, పంచాయతీ, మైనింగ్, పీఆర్, ఇరిగేషన్ అధికారులు.. పది రోజులుగా పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తుంటే తమకేమీ తెలియదన్నట్లు మౌనం దాల్చుతుండడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో చెరువులో మట్టిని మాయం చేస్తున్నారు. అధికారులు ఏమంటున్నారంటే.. దీనిపై పీఆర్ ఏఈని ‘సాక్షి’ అడగ్గా.. మిట్టపాలెం కుంట తమ పరిధిలోకి రాదని.. తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శిని అడగ్గా తాను కొత్తగా ఇటీవలే జాయిన్ అయ్యానని.. గ్రామ చెరువు కుంటలో తవ్వకాల సంగతి తనకు తెలియని చెప్తుండడం గమనార్హం. ఎమ్మెల్యే బంధువులు బెదిరిస్తున్నారు: మేకల రాజు మిట్టపాలెం చెరువులో రెండు వారాలుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఆ తర్వాత రెండ్రోజుల నుంచి మా పట్టా భూమిలో జేసీబీలు, పొక్లైన్లతో భారీగా టిప్పర్లు తెచ్చి.. మా పట్టా భూమిలో కూడా తవ్వకాలు ప్రారంభించారు. మా పూర్వీకుల నాటి పొలం పూర్తి హక్కులున్నాయని, మా భూమిలో మట్టిని తవ్వడం సరికాదని అడ్డుకున్నాం. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే బంధువులం మాకే అడ్డు చెబుతావా అని బెదిరిస్తున్నారు. మా పట్టా భూమిలో కూడా భారీగా తవ్వకాలు చేసి, మట్టిని రియల్ వెంచర్లకు తరలిస్తున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో, రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. కనీసం పట్టించుకోవడం లేదు. పైగా మా పైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అసలు మీకు హక్కులు లేవు. ఎక్కువ మాట్లాడితే కేసు కడతామని అధికారులు, అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం. మట్టి మాఫియాగాళ్లు చెరువులనే కాదు దాని పక్కనున్న పట్టా భూముల్లో సైతం దౌర్జన్యంగా తవ్వకాలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమంతునిపాడు మండలం మిట్టపాలెం గ్రామ పంచాయతీకి చెందిన మేకల చిన్నవీర, మేకల రాఘవయ్య తెలిపిన వివరాల ప్రకారం..1983 ఏప్రిల్ 5న చీరాల తాలూకా గ్రామం నల్లగాంధీ బొమ్మ వెనుక నివాసం ఉంటున్న శనగవరపు వెంకటేశ్వర్లు కుమారుడు పరదేశి శాసీ్త్ర విక్రయ స్వాధీన అగ్రిమెంట్ సర్వే నంబర్ 436లో 6.39 ఎకరాలున్న సెటిల్మెంట్ భూమి విక్రయ అగ్రిమెంట్ పొందారు. ఆయన తండ్రి మృతి చెందడంతో ఆ భూమిని తన పేరుపై ఉన్న పాస్బుక్లో ఎంటర్ చేయించుకున్నట్లు చెప్పారు. అయితే ఆ భూమి ఆన్లైన్కు ఎక్కలేదు. ఈ విషయాన్ని గ్రహించిన అక్రమార్కులు చెరువు పక్కనే ఉన్న సర్వే నంబర్ 436లో కలిగిన భూమిలో మట్టి తవ్వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదేమిటని తాను ప్రశ్నించగా భూమి నీది కాదని, ప్రభుత్వ భూమని మీ గ్రామస్తులు చెప్పారని దబాయిస్తూ దౌర్జన్యంగా మట్టిని తోడేస్తున్నారని వాపోతున్నాడు. పొలం అంతా భారీగా లోతు గుంటలు చేశారని మేకల రాఘవయ్య వెల్లడించారు. -
చంద్రబాబు చరిత్రే వెన్నుపోటుమయం
మాట్లాడుతున్న బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతున్న బూచేపల్లి వెంకాయమ్మ, పక్కన బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిదర్శి: చంద్రబాబు చరిత్రే వెన్నుపోటుమయం అని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ ఇన్చార్జ్, మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాలులో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు రౌండ్్ టేబుల్ సమావేశానికి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు బూచేపల్లి, వైఎస్సార్ సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి మాట్లాడుతూ నమ్మి ఓట్లేసిన వారికి వెన్నుపోటు పొడవటమే చంద్రబాబు ప్రత్యేకత అన్నారు. తన అన్నకు, మామకు వెన్నుపోటు పొడిచారని, ఆయన జీవితం అంతా వెన్నుపోట్లమయమే అని చెప్పారు. గత ఎన్నికల ముందు కూటమి కట్టి అబద్ధపు హామీలు ఇచ్చి రెండేళ్లయినా ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. పాలన చేయడం చేతకాక ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని మండిపడ్డారు. జిల్లాలో బూచేపల్లి శివప్రసాద్రెడ్డి వైఎస్సార్ సీపీని మరింత బలోపేతం చేసి ఇక్కడ పార్టీని విజయవంతంగా నడిపిస్తున్నారని అన్నారు. ఆయన ధాటికి తట్టుకోలేక ఆయన క్వారీలపై దాడులు చేయించి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఇలాంటి వాటికి భయపడరని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. రానున్న జగనన్న పాలనలో కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్ల పాలన ఎలా ఉందో...గత జగనన్న పాలనలో కరోనా కష్టకాలం వచ్చినా జగనన్న పాలన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. రైతులకు ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టపోయినా రూపాయి విదిలించింది లేదన్నారు. చంద్రబాబు దోచుకోవడం కోసం పేదలకు ఉచితంగా వైద్యం అందించాల్సిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తూ పేదలకు వైద్యం అందకుండా వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య అని స్పష్టం చేశారు. ఒక సారి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తేనే అబద్ధపు హామీలు ఇవ్వకుండా ఉంటారన్నారు. చంద్రబాబు అన్నీ కులాలకు, అన్నీ మతాలకు, పేదలు, రైతులకు అన్నీ చేస్తామని ఏమీ చేయకుండా అందరినీ మోసంి చేసి వెన్నుపోటు పొడిచారన్నారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు మోసపూరిత మాటలు చెప్తారని, అటువంటి మాటలు ప్రజలు నమ్మవద్దన్నారు. సూపర్సిక్స్, సూపర్సెవెన్ అంటూ సుమారు 140 హామీలిచ్చి నమ్మబలికి ఓట్లు వేయించుకున్న చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్లు చంద్రబాబు చేసింది ఇసుక మాఫియా, మద్యం మాఫియా అని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్యాకేజీలకు లొంగిపోయి ప్రశ్నించడం మానుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రతి కార్యకర్త గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న తీరు ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. తాను జగనన్న పక్కన ఉన్నానన్న ఉద్దేశంతో తన క్వారీలు మూసివేసే కుట్రలు చేస్తున్నారని ఎటువంటి కుట్రలు చేసినా జగనన్న తోనే తన పయనం ఉంటుందన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బెదిరింపులకు లొంగిపోయే వ్యక్తి తాను కాదన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రాజకీయాల్లో మాట తప్పని మడమ తిప్పని ఒకే ఒక్క నాయకుడు జగనన్న అని చెప్పారు. నాడు–నేడు, అమ్మఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఇచ్చిన 100 శాతం హామీలు నెరవేర్చిన సీఎంగా దేశ చరిత్రలో నిలిచిపోయారన్నారు. చంద్రబాబు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ప్రతి నెల రూ.1500, రాష్ట్రంలో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉద్యోగం లేని నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ రూ.20 వేలు ఇస్తామని రైతులను మోసం చేశారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలన పేద పిల్లలకు ఇచ్చిన బ్యాగులు చూస్తేనే అర్థమవుతుందన్నారు. మూడు రోజులకే చినిగిపోయిన బ్యాగులు, నాణ్యత లేని భోజనాలు తినలేక చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతే రూపాయి విదిలించింది లేదన్నారు. ఇటువంటి దుర్మార్గపు పాలనను పారదోలేందుకు రైతులు, ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో దర్శి, తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు, దొనకొండ మండల కన్వీనర్లు వెన్నపూస వెంకటరెడ్డి, తూము వెంకటసుబ్బారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, యన్నాబత్తిన సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, ఎంపీపీలు బొరిగొర్ల ఉషామురళి, జెడ్పీటీసీలు నుసుం వెంకటనాగిరెడ్డి, తాతపూడి రత్నరాజు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు కొల్లా ఉదయ్భాస్కర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 2029లో సీఎం జగనన్నే -
పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోని పీజీ కళాశాలల్లో 2025–26 విద్యా సంవత్సారానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ఏకేయూ వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్.మూర్తి మంగళవారం విడుదల చేశారు. ఈ పరీక్షలకు వివిధ కోర్సులకు సంబంధించి మొత్తం 1,027 మంది విద్యార్థులు హాజరవగా, వారిలో 80.62 ఉత్తీర్ణత శాతంతో 828 మంది విద్యార్థులు పాసైనట్లు పరీక్షల నియంత్రణాధికారి (సీఈ) ప్రొఫెసర్ జి.సోమశేఖర తెలిపారు. యూనివర్సిటీ స్థాయిలో, ఆయా కళాశాలల స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను వీసీ మూర్తి, రిజిస్ట్రార్ హరిబాబు, సీఈ సోమశేఖర, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ భారతిదేవి అభినందించారు. మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాల విడుదల కార్యక్రమంలో పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కో ఆర్డినేటర్ (నాన్ – కాన్ఫిడెన్సిల్ విభాగం) డాక్టర్ ఎ.అమతవల్లిదేవి, బీఎడ్ కోర్సుల కో ఆర్డినేటర్ (నాన్ – కాన్ఫిడెన్సిల్ విభాగం) డాక్టర్ ఆర్.శ్రీనివాసు పాల్గొన్నారు. యర్రగొండపాలెం: మద్యం మత్తులో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం యర్రగొండపాలెంలోని కొలుకుల రోడ్డులో ఉన్న పున్నయ్య మిల్లు వద్ద జరిగింది. పుల్లలచెరువు తండాకు చెందిన కప్పలగుంట్ల పవన్కుమార్ నాయక్(24) మద్యానికి బానిస కావడంతోపాటు తాను వివాహం చేసుకున్న భార్యను వదలిపెట్టి రెండేళ్లుగా మరొకరితో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి మద్యం తాగుతున్న ఆ యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపల నుంచి గడి పెట్టుకొని పై కప్పునకు తాడు బిగించి ఉరివేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పవన్ కుమార్ నాయక్ తండ్రి బాలు నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ తెలిపారు. -
బాలల అక్రమ రవాణా గుట్టు రట్టు
ఒంగోలు సబర్బన్: పోలీసులు, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ కమిటీ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల జాయింట్ ఆపరేషన్లో బాలల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. బీహార్ నుంచి చైన్నెకి 15 మంది బాలలను అక్రమంగా తరలిస్తున్నారని బీహార్ నుంచి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రకాశం జిల్లాలోని హెల్ప్ స్వచ్ఛంద సంస్థతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఒంగోలు మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల సంక్షేమ కమిటీ, ఒంగోలు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు, షార్ట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్ ఫర్ సోషల్ వలంటీర్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. దీంతో ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా అలజడి నెలకొంది. రైల్వే స్టేషన్లోని మూడో ప్లాట్ ఫాంలోకి సాయంత్రం 6.15 గంటలకు బీహార్ రాష్ట్రం జోగ్పూర్ నుంచి చైన్నె ఈ రోడ్కు వెళ్లే ట్రైన్(16602) వచ్చి ఆగింది. అంతే భారీ స్థాయిలో ఉన్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు, వివిధ శాఖల అధికారులు ట్రైన్కు ముందు, వెనుక ఉన్న జనరల్ భోగీలను చుట్టుముట్టి భోగీలలోకి ప్రవేశించారు. బీహార్ నుంచి వచ్చిన సమాచారం మేరకు వాళ్లను గుర్తించి అన్ని భోగీల నుంచి దాదాపు 23 మందిని తమ ఆధీనంలోకి తీసుకొని రైల్వే స్టేషన్లోనే ఉన్న జీఆర్పీ పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో 15 మంది మైనర్ బాలురు ఉన్నారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ కల్పనాకుమారి ముందు బాలలను ప్రవేశ పెట్టారు. జాయింట్ కలెక్టర్ బాలలను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వారు బీహార్ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలలను అక్రమంగా తరలిస్తున్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బాలలను జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మా నాయక్ ఆధ్వర్యంలో వారిని తొలుత అంబేడ్కర్ భవన్కు తరలించారు. అక్కడ నుంచి వేరే సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. బాల కార్మికులను రక్షించటంలో కమిటీ చైర్మన్ నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పీ.దినేష్ కుమార్, ఒంగోలు ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ వై కొండయ్య, జీఆర్పీ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్, స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ఆర్ సునీల్ కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బీవీ సాగర్, అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్ శ్రీకాంత్, ఏపీడీఆర్. డాక్టర్ ప్రహసిత్, సాడ్స్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, సుమన్తో పాటు పలువురు భాగం పంచుకున్నారు. -
వామపక్షాల నిరసన ఉద్రిక్తం
ఒంగోలు టౌన్: పెంచిన పెట్రోలు, డీజిల్ఽ, వంటగ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లా కేంద్రమైన ఒంగోలు ఆర్టీసీ బస్టాండు సెంటర్లో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తతంగా మారింది. సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన రాస్తారోకోలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ప్రజా సంఘాల నాయకులను తాలూకా సీఐ చొక్కా పట్టుకొని లాక్కెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మే నెలలో 4 సార్లు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడంపై వామపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ చౌరస్తాలో వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా తాలూకా సీఐ విజయ కృష్ణ, ఇద్దరు ఎస్సైలు, రక్షక్ టీం బందోబస్తు నిర్వహించారు. రాస్తారోకో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు జీవీ కొండారెడ్డి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురాం, సీపీఐ ఎంఎల్ నాయకులు నాంచార్లు, ఆర్.మోహన్లను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. తాలూకా సీఐ విజయకృష్ణ సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావును చొక్కా కాలర్ పట్టుకొని లాక్కెళ్లడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా నిరసనకారులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను తాలూకా పోలీసు స్టేషన్కు తరలించి గంట తరువాత వారిని విడిచిపెట్టారు. కేంద్ర ప్రభుత్వ అసమర్ధత వల్లనే పెట్రో సమస్య... గల్ఫ్ యుద్ధం సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లనే దేశంలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు విమర్శించారు. మన నౌకలను అడ్డుకోకుండా ఇరాన్ స్నేహధర్మాన్ని పాటిస్తే హార్మోజ్ జలసంధి వెలుపల మోహరించిన అమెరికా సైన్యాలు మన పడవలను అడ్డుకోవడంతోనే అసలు సమస్య తలెత్తిందని వివరించారు. అయినా మన దేశం అమెరికా, ఇజ్రాయిల్లకు పూర్తిస్థాయి మద్దతు ఇవ్వడం దారుణమని చెప్పారు. మన రాష్ట్రంలో గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్న చమురును గుజరాత్, మహారాష్ట్రలకు తరలించి రిలయన్స్ కంపెనీ లాభపడుతోందని ఆరోపించారు. కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్లో చట్టపరంగా 50 శాతం వాటా మన రాష్ట్రానికి రావాల్సి ఉందని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూటమి పాలకులు మౌనంగా ఉండడం వలన రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. మోదీ భజన చేస్తున్న కూటమి పాలకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జి.రమేష్, కె.రమాదేవి, బంకా సుబ్బారావు, కేజీ మస్తాన్, శ్రీరాం శ్రీనివాసులు, ఎంఏ సాలార్, రామకృష్ణ, ఆర్.మోహన్, బి.పద్మ, ఎస్.లలిత కుమారి, సాయి, పరిటాల కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
గంజాయి కేసులో 16 మంది అరెస్ట్
కందుకూరు: కందుకూరు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వారితో పాటు వినియోగిస్తున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు స్థానిక డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు... కందుకూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గంజాయి అమ్మకం, వినియోగంపై పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. పట్టణంలోని ఆనందపురం రోడ్డులో డంపింగ్యార్డు వద్ద 14 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 473 గ్రాముల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, గుడ్లూరు రోడ్డులోని టవర్ వద్ద ఇద్దరిని అరెస్టు చేసి 2.400 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పట్టణంలోని బూడిదపాలేనికి చెందిన అప్రోజ్, శ్రీరామ్నగర్ కాలనీకి చెందిన ఆరితోటి వెంకట్, పోతురాజుమిట్టకు చెందిన కుంచాల చందు, ఖాజీపాలేనికి చెందిన ఎస్కే సుభాని, ఉప్పుచెరువు కాలనీకి చెందిన షేక్ కరీం, అబుతలహా, బండపాలేనికి చెందిన మడతసాయి, చిన్న కత్తుల జిలాని, బలిజపాలేనికి చెందిన మంగమూరి శివకృష్ణ, తుమ్మా చెంచుమాధవ, ఓగూరు గ్రామానికి చెందిన నాగులూరి ఆమోస్, కోట మహేష్, జంగిలి విగ్నేష్, ఏకలవ్యనగర్కు చెందిన పల్లా లాజర్, విప్పగుంట రోడ్డులోని గురునాథం బలరాంతో పాటు మైనర్ అయిన మరో యువకుడు ఉన్నారు. వీరి వద్ద నుంచి మొత్తం 2.873 కేజల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిలో అప్రోజ్, గురునాథం బలరాం అనే ఇద్దరు గంజాయి తెచ్చి అమ్ముతుంటారని, మిగిలిన వారంతో వినియోగించే వారేనని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరు వైజాగ్, ఒడిశా ప్రాంతాల నుంచి గంజాయి తెప్పిస్తారని, ఈ ప్రాంతానికి గంజాయి సరఫరా చేసే ముఠా ఒకటి ప్రత్యేకంగా ఉందని డీఎస్పీ తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాలకి ఈ ముఠానే గంజాయి సరఫరా చేస్తోందని, మిగిలిన వారి కోసం కూడా పోలీసుల అన్వేషణ సాగుతోందని తెలిపారు. గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని పోలీస్ స్టేషన్లకు ఎన్డీబీ కిట్లు... ప్రభుత్వం నుంచి ఎన్డీబీ కిట్లు కూడా వచ్చాయని, అన్ని పోలీస్ స్టేషన్లకు వాటిని సరఫరా చేశామని డీఎస్పీ తెలిపారు. వాటి ద్వారా గంజాయి తాగారా లేదా అనేది వెంటనే నిర్ధారణ చేయవచ్చని చెప్పారు. గంజాయి వినియోగించే వారి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు చెప్పాలని కోరారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ హర్షవర్ధన్రాజు ప్రత్యేకంగా అభినందించారని డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ అన్వర్బాషా, కందుకూరు టౌన్, రూరల్, ఉలవపాడు ఎస్సైలు పులి శివనాగరాజు, బాలకృష్ణ, సుబ్బారావు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. తమ పిల్లలను అన్యాయంగా ఇరికించారంటూ తల్లిదండ్రుల ఆవేదన... గంజాయి కేసులో తమ పిల్లలను అన్యాయంగా ఇరికించారంటూ నిందితుల తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి తమ ఇళ్లకు వచ్చిన పోలీసులు బలవంతంగా తమ పిల్లలను తీసుకెళ్లారని, గంజాయి ప్యాకెట్లు చేతుల్లో పెట్టి ఫొటోలు తీశారని ఆరోపించారు. తాము అడిగితే వెంటనే పంపిస్తామని చెప్పారని, కానీ, ఇలా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పట్టుబడిన వారిలో గంజాయి విక్రయదారులు, వినియోగదారులు వారి వద్ద నుంచి 2.873 కేజీల గంజాయి స్వాధీనం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ బాధితుల బంధువుల ఆవేదన -
వాగులో పడి గొర్రెల కాపరి మృతి
ముండ్లమూరు: ప్రమాదవశాత్తూ కాలుజారి చిలకలేరు వాగు బావిలో పడి గొర్రెల కాపరి మృతిచెందాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని చిలకలేరు వాగులో మంగళవారం చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పసుపుగల్లు పంచాయతీ పరిధిలోని చింతలపూడి గ్రామానికి చెందిన కాటూరి శ్రీనివాసరావు (50) గొర్రెల కాపరిగా ఉన్నాడు. ప్రమాదశాత్తూ కాలుజారి గ్రామానికి సమీపంలో చిలకలేరు వాగులో ఉన్న బావిలో పడిపోయాడు. తనకున్న గొర్రెలను మేత కోసం గ్రామానికి సమీపంలో ఉన్న చిలకలేరు వాగు వద్దకు తోలుకెళ్లిన సమయంలో ఒక పొట్టేలు పిల్ల దాహం తీర్చుకునేందుకు వాగులోకి దిగింది. దాంతోపాటు మిగతా జీవాలు కూడా వెళ్లడంతో వాటిని అదుపు చేసేందుకు శ్రీనివాసరావు వెళ్లాడు. వాగులో నేలబావి ఉన్న విషయాన్ని గుర్తించకపోవడంతో అందులో జారి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలోని పశువుల కాపర్లు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపారు. వాళ్లు వచ్చి చూసేసరికే చనిపోయి ఉన్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. శ్రీనివాసరావుకు భార్య అంజమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ముండ్లమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్నేహితుడే చితకబాది..
● చనిపోయాడనుకుని తొట్లో వేసి... ముండ్లమూరు: స్నేహితుడే చితకబాది చనిపోయాడనుకుని తొట్లో వేసి వెళ్లాడు. తీవ్రగాయాలతో బతికిబయటపడిన బాధితుడు ఆస్పత్రికి చేరాడు. ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిట్టిబోయిన వెంకట్రావు, చిట్టిబోయిన రామబ్రహ్మం స్నేహితులు, బంధువులు కూడా. వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. సుంకరవారిపాలెంలోని తన ఇంట్లో వెంకట్రావు ఉండగా, స్నేహితుడు రామబ్రహ్మం మోటార్ సైకిల్పై వచ్చి నీతో పని ఉంది అంటూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లాడు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నాయుడుపాలెం పొలాల్లోని ఎత్తిపోతల పథకం వద్ద మద్యం సేవించారు. అనంతరం ఇద్దరూ అద్దంకి వెళ్లి పొద్దుపోయిన తర్వాత నాయుడుపాలెం పొలాల్లోనే ట్యాంకు దగ్గరకు వచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రామబ్రహ్మం రాయితో వెంకటరావుపై తీవ్రంగా దాడి చేశాడు. చనిపోయాడనుకుని నీటి తొట్టిలో పడేసి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చింది. పూరిమెట్ల వైపు ఒక పశువుల షెడ్డు దగ్గరకి అతి కష్టం మీద వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును బంధువులు వెళ్లి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్కి అతన్ని తరలించారు. దాడి జరిగిన విషయం అద్దంకి పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి ముండ్లమూరు పోలీసులకు పంపారు. వారి మధ్య ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
వెన్నుపోటులో బాబు.. ఆరుతేరారు
పెగ్గు మీద పెగ్గెయ్... అంటూ మందుబాబులు ఫుల్లుగా తాగేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మద్యం దుకాణాలను బార్లా తెరవడంతో ప్రజలు బానిసలుగా మారుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు నెలల్లో సుమారు రూ.131 కోట్ల మేర విక్రయాలు తాజా పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గత ఏడాది ఈ రెండు నెలల్లో వచ్చిన ఆదాయం పోల్చుకుంటే రూ.6 కోట్లు అదనమని అధికార వర్గాలు చెబుతున్నాయి. వేసవిలో తాగునీటి నీరు లభించని ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ మందు దొరకని గ్రామం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒంగోలులో మాట్లాడుతున్న బత్తుల బ్రహ్మానందరెడ్డి, పక్కన చుండూరి రవిబాబు, కాకుమాని, కుప్పం ప్రసాద్, కఠారి శంకర్ తదితరులు సింగరాయకొండలో రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వైపాలెంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పాల్గొన్న నాయకులు కనిగిరిలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ వాల్ పోస్టర్ను ప్రదర్శిస్తున్న దద్దాల నారాయణ యాదవ్, పార్టీ నేతలు బాబు రెండేళ్ల పాలనకు నిరసనగా కందుకూరులో నల్ల బెలూన్లు ఎగరేస్తున్న బుర్రా మధుసూదన్ యాదవ్, నాయకులు మద్దిపాడులో మాట్లాడుతున్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున సూపర్ సిక్స్ పేరుతో అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేయకుండా ప్రజలను వంచించారు. సంక్షేమ పథకాలకు తూట్లుపొడిచి ప్రజలను మోసం చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనా వైఫల్యాలపై ప్రజలతో కలిసి వైఎస్సార్ సీపీ నాయకులు గళమెత్తారు. కూటమి నాయకుల అవినీతిని ఎండగట్టారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాల్లో భాగంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించారు. కూటమి నేతల వైఫల్యాలపై నినదించారు. ప్రజలకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాటాలు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమాల్లో ఆయా నియోజకవర్గాల ఇన్చార్జ్లు పాల్గొన్నారు. – సాక్షి నెట్వర్క్ ● డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ మార్కాపురం: ప్రజల ఆర్ధికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ కోరారు. స్థానిక వెలుగు కార్యాలయంలో బ్యాంకర్లు, వెలుగు సిబ్బందికి సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్షాప్లో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 6 వేల మైక్రో క్రెడిట్ ప్లాన్స్ (సూక్ష్మ రుణ ప్రణాళికలు) అప్రూవల్ ఇచ్చామని, వాటికి సంబంధించి బ్యాంకు శాంక్షన్, డిస్పాచ్ పెండింగులో ఉందని, బ్యాంకు మేనేజర్లు వీటిని త్వరగా మంజూరు చేయాలని కోరారు. మహిళలు జీవనోపాధులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలకు పీఎంఈజీపీ, ఉమెన్ లెడ్, పీఎంఎఫ్ఎంఈ, పథకాల కింద రుణాలు ఇవ్వాలని కోరారు. పలువురు తీసుకున్న రుణాలను చెల్లించేలా తమకు సహకరించాలని వివిధ బ్యాంకు మేనేజర్లు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో లీడ్బ్యాంకు మేనేజరు ఎస్కే షాహీద్, యూపీఐ, డీజీఎం రవికుమార్, ఏపీజీబీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, ఎస్బీఐ చీఫ్ మేనేజరు రామకృష్ణ, కెనరా బ్యాంకు చీఫ్ మేనేజరు గౌరీ, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మార్కాపురం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పరిమిత సంఖ్యలో మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రజలకు మద్యాన్ని దూరం చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తాగరా.. తాగి ఊగరా.. అన్న చందంగా ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. వైన్ షాపులతోపాటు బెల్టుషాపుల్లో కూడా 24 గంటలూ మద్యాన్ని అందుబాటులో ఉంచింది. దీంతో మగవాళ్లు తమ సంపాదన మొత్తం తాగుడుకే తగలేస్తున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో బెల్టుషాపుల ద్వారా డోర్ డెలివరీలు జరుగుతుండగా పట్టణాల్లో సమయ పాలన మరిచి బ్యాక్డోర్ బిజినెస్ ఎక్కువగా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ దాడులు చేయడంలేదన్న విమర్శలు ఉన్నాయి. మార్కాపురం జిల్లాతోపాటు ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని మొత్తం 120 వైన్ షాపుల్లో ఏప్రిల్, మే నెలల్లో ప్రజలు తాగుడుకు రూ.131.43 కోట్లు ఖర్చు చేశారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలతో పోల్చితే ఈ ఏడాది రూ.6 కోట్లు అదనంగా ప్రజలు తాగుడుకు ఖర్చుచేశారంటే మద్యం ఎంత సులభంగా దొరుకుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ వైన్షాపుల యజమానులపై ఒత్తిడి పెంచి ప్రభుత్వం మద్యం అమ్మకాలు సాగిస్తోంది. ఏప్రిల్ నెల కంటే మే నెలలో మద్యం అమ్మకాలు ఎక్కువగా సాగాయి. అందులో బీరు అమ్మకాలు అత్యధికంగా ఉన్నాయి. సమయ పాలన పాటించకుండా లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉదయం పూట 6 గంటల నుంచే బ్యాక్ డోర్ బిజినెస్లు బాగా జరుగుతున్నాయి. షాపు ముందుభాగం తాళం వేసి ఉంటుంది. వెనుకవైపు నుంచి మందుబాబులకు లిక్కర్ బాటిళ్లు ఈజీగా దొరుకుతున్నాయి. సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చుపెట్టడంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని, అప్పుల పాలవుతున్నామని పలువురు మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రూ.64.58 కోట్ల లిక్కర్, బీరు అమ్మకాలు జరగగా, మే నెలలో రూ.66.85 కోట్ల అమ్మకాలు జరిగాయి. 2025 ఏప్రిల్లో రూ.62.67 కోట్ల లిక్కర్, బీరు అమ్మకాలు జరగగా, గత ఏడాది మే నెలలో లిక్కర్, బీరు కలిపి రూ.61.93 కోట్ల విక్రయాలు జరిగాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది సుమారు రూ.6 కోట్ల ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. తాగి..ఊగి..గత ఏడాది(2025) ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు నెల లిక్కర్ బీర్ (కేసుల్లో) ఏప్రిల్ 77,079 52,142 మే 78,558 44,492 ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలు నెల లిక్కర్ బీర్ (కేసుల్లో) ఏప్రిల్ 74,661 57,606 మే 73,720 75,576 -
మెగా డీఎస్సీలో దేశంలోనే అతిపెద్ద అవినీతి
ఒంగోలు సబర్బన్: భారతదేశంలోనే అతిపెద్ద అవినీతి రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో జరిగిందని రాష్ట్ర మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు మాదిగ ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీలో జరిగిన అవినీతిపై సోమవారం కలెక్టరేట్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత అంబేడ్కర్ భవన్ నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్ వరకూ వచ్చారు. మధ్యలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసనలో కొమ్మూరి కనకారావు మాదిగ మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అవినీతిపై తక్షణమే సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీలోని క్రీడల కోటాలో అతిపెద్ద అవినీతి చోటుచేసుకుందన్నారు. ప్రధాన క్రీడలను వదిలేసి తాడుపట్టి లాగే ఆటకు, పబ్జీకి కూడా క్రీడల కోటాకింద మెగా డీఎస్సీలో నియామకం చేయటం అత్యంత హాస్యాస్పదంగా ఉందన్నారు. యువగళంలో లోకేష్తో నడిచిన తన అనుచరులకు, తన సైన్యానికి మెగా డీఎస్సీలో ఉద్యోగాలు కల్పించేందుకు డీఎస్సీలోని నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ ఎంపికలో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. రిజర్వేషన్లో లేని ఆటలను చూపించి ప్రతిభ కలిగిన వారికి, ర్యాంకులు వచ్చిన వారికి తీవ్రంగా అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గాలిమూటి దేవప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం దోచుకోవడం.. దాచుకోవడం..పంచుకోవటమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి యూనివర్శిటీ విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. చివరకు విద్యావ్యవస్థనే నిర్వీర్యం చేసే స్థాయిలో రాష్ట్రం దిగజారి పోయిందన్నారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇవ్వటం దేశంలో ఎక్కడా ఈ రకంగా జరగలేదన్నారు. కళ్లుండీ చూడలేని చంద్రబాబు ప్రభుత్వం, నోరుండీ మాట్లాడలేని స్థితికి తీసుకెళ్లారంటే వీళ్ల అవినీతి, అరాచకాలు పెచ్చుమీరి పోయాయన్నారు. ప్రజలకు మేలు జరిగిన దాఖలాలు లేవని, కానీ రాష్ట్రంలో అప్పులు మాత్రం అనకొండలా పేరుకుపోతున్నాయని విమర్శించారు. అనంతరం మీ కోసం కార్యక్రమంలో ఉన్న కలెక్టర్ పి.రాజాబాబుకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉన్నం జనార్దన్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి యరిజర్ల రమేష్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కందుల డానియెల్, సంయుక్త కార్యదర్శి దుడ్డు వినోద్, జిల్లా కార్యదర్శి రామారావు, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షుడు డి.రమణయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మేళం గురవయ్య (మధు), జిల్లా ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు పాలెపోగు డగ్లస్, ఎస్సీ సెల్ దర్శి నియోజకవర్గ అధ్యక్షుడు జి.ఏసుదాస్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, నాయకులు కరుణాకర్, యోహాను, పీటర్ అచ్చయ్య, కిరీటి తదితరులు పాల్గొన్నారు. ర్యాంకర్లను, ప్రధాన క్రీడలను వదిలేసి తాడుపట్టి లాగే ఆట, పబ్జీలకు అవకాశం -
కాచిగూడలో అదృశ్యమై.. సింగరాయకొండలో శవమై..
కాచిగూడ/సింగరాయకొండ : ప్రేమ విఫలమైన నేపథ్యంలో హైదరాబాద్లోని కాచిగూడలో అదృశ్యమైన ఓ విద్యార్థి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో శవమై తెలాడు. ఈ సంఘటన వివరాలను కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ సోమవారం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన అంకం రాజేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్ స్టేషన్లో యువకుడు అదృశ్యం కేసు నమోదు చేశారు. సైదాబాద్లోని లక్ష్మీకళ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న అంకం రాజేశ్వర్ కుమారుడు అంకం రాహుల్ (21) బీటెక్ చదువుతున్నాడు. తన స్నేహితుడి మోటార్ సైకిల్పై కాచిగూడ టూరిస్ట్ హోటల్ జంక్షన్ వరకు గత నెల 27వ తేదీ వచ్చాడు. అక్కడ బైక్ దిగి తాను స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పాడు. అప్పటి నుంచి రాహుల్ కనిపించకుండా పోయాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన కాచిగూడ పోలీసులు అన్నికోణాల్లో గాలించి ఆధారాలు సేకరించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి రైలెక్కి ఒంగోలు వెళ్లిపోయాడని తెలుసుకున్నారు. ఏపీ పోలీసులు, తండ్రి రాజేశ్వర్, కుటుంబ సభ్యులు ఒంగోలులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ దర్యాప్తు బృందానికి కీలక సమాచారం లభించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బావిలో గత నెల 30వ తేదీ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని, దానిపై అక్కడ కేసు నమోదైందని పోలీసులు తెలుసుకున్నారు. సింగరాయకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతదేహం వద్ద లభించిన వస్తువులు, ఇతర ఆధారాలను పరిశీలించారు. అవన్నీ అదృశ్యమైన విద్యార్థి అంకం రాహుల్ వివరాలతో సరిపోయాయని పోలీసులు తెలిపారు. ఈ సమాచారాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అధికారికంగా అందించిన కాచిగూడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రేమ విఫలమైన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి ఓ పాడుబడిన బావిలో మృతదేహం లభ్యం -
అభివృద్ధే ధ్యేయంగా గాదె పనిచేశారు
ఇంకొల్లు (చినగంజాం): రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించిన ప్రజల మనిషి మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కొనియాడారు. ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలోని గాదె స్వగృహంలో సోమవారం నిర్వహించిన గాదె వెంకటరెడ్డి దశదిన కర్మ, సంస్మరణ కార్యక్రమంలో వైవీ పాల్గొని నివాళులర్పించారు. గాదె కుమారుడు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గాదె మధుసూదనరెడ్డి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాదె వెంకటరెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని అన్నారు. ఆయన జీవితం.. రాజకీయ ప్రస్థానం అంతా రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా కొనసాగిందన్నారు. వైవీతో పాటు దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఆరే శ్యామల, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, కనుమూరి బాపిరాజు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రేపల్లె ఇన్చార్జ్ పీతా నాగమోహన్, ఎమ్మెల్యే విజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య, నాయకులు బసవ పున్నారెడ్డి, కొమ్మూరి కనకారావు, కృష్ణచైతన్య, పులఖండం వెంకారెడ్డి రాష్ట్రంలోని పలువురు సీనియర్ నాయకులు, నియోజకవర్గంలోని ఆరు మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పాల్గొని గాదె వెంకటరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి సంస్మరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి -
ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి
యర్రగొండపాలెం: ప్రజల నుంచి సమస్యలపై వచ్చే ప్రతి అర్జీ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి చట్టప్రకారం విచారణ జరిపి త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ హర్షవర్దన్రాజు ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మార్కాపురం జిల్లా స్థాయి పోలీస్ గ్రీవెన్స్లో ఆయన పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పట్ల నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఆ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా నివేదిక అందించాలన్నారు. గ్రీవెన్స్లో కుటుంబ కలహాలు, భర్త, అత్తారింట వేధింపులు, భూమి, ఆస్తి వివాదాలు, తదితర సమస్యలపై మొత్తం 31 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు, ఎస్బీ సీఐ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, త్రిపురాంతకం, పొదిలి, మార్కాపురం సీఐలు అస్సన్, రాజేష్ కుమార్, అల్తాఫ్ హుసేన్, యర్రగొండపాలెం ఎస్సై ఎం.దేవకుమార్ పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్దన్రాజు -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
మార్కాపురం రూరల్: రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన వెల్లలచెరువు రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల ఓ గుర్తుతెలియని వ్యక్తి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన మృతిచెంది పడి ఉన్నాడు. నీలం రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు రంగు పూల డిజైన్ చొక్కా ధరించి ఉన్నాడు. ఆదివారం ఉదయం మార్కాపురం నుంచి రైలు టికెట్ తీసుకుని ప్రయాణం ప్రారంభించినట్లు ప్రాథమిక సమాచారం మినహా ఇతర వివరాలేమీ లేవని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9247585720, 7013600365 నంబర్లను సంప్రదించాలని కోరారు. చీమకుర్తి రూరల్: మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని పుట్టచెరువుపాలెంలో సుంకర రమణయ్య ఇంట్లో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. రమణయ్య ఒక పోర్షన్లో నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు కిటికీ ద్వారా ఇంట్లోని రెండో పోర్షన్లోకి ప్రవేశించారు. బీరువా తెరిచి అందులోని నాలుగు సవర్ల బంగారం, 20 తులాల వెండి, రూ.10 వేల నగదు దొంగిలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సోమవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రమణయ్య నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. అద్దంకి రూరల్: వివాహం కావడం లేదని మనస్తాపంతో ఓ యువకుడు గడ్డి మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సోమవారం అద్దంకి మండలంలోని నాగులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొప్పుల అంజి (25)కి వివాహం కాకపోవటంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో గడ్డి మందు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొనే జిల్లా పురుషుల జట్టు ఎంపిక సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. సోమవారం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా హాకీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్న క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారితో జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు సత్యసాయి జిల్లా ధర్మవరంలో జరగబోయే రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి సుందర రామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, రవి వెంకట్రావు, హాకీ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ తిరుమలశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్టూరు:ఆహార పదార్థాల విక్రయం, తయారీ విషయంలో నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రీజినల్ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. మార్టూరులో సోమవారం రాత్రి రీజినల్ విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మొదట రవీంద్ర బేకరీలో రెండు శాంపిల్స్ సేకరించారు. అనంతరం ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీనివాస స్వీట్స్ అండ్ బేకరీ షాపును తనిఖీ చేశారు. జీఎస్టీ సర్టిఫికెట్తో వ్యాపారం చేయాలని సూచించారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని తులసి సూపర్ మార్కెట్ను రాత్రి 7:30 గంటల వరకు అధికారులు తనిఖీ చేశారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, గుంటూరు రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కే చంద్రశేఖర్, తహసీల్దార్ లక్ష్మీమాధవి, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. -
పదో తరగతి సప్లిమెంటరీ మూల్యాంకనం ప్రారంభం
ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం సోమవారం ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హైస్కూల్లో ప్రారంభమైంది. మూల్యాంకన శిబిరానికి క్యాంప్ ఆఫీసర్గా జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి.రేణుక వ్యవహరించారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు రాసిన సమాధానాలకు అనుగుణంగా సరైన మార్కులు కేటాయించాలని తెలిపారు. మార్కుల నమోదుకు సంబంధించి స్పెషల్ అసిస్టెంట్లకు ట్యాబ్ల ద్వారా ఎంట్రీ చేసే విధానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ కమిషనర్ ఎం.శ్రీనివాసరావు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్, ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి టి.కిషోర్బాబు, అసిస్టెంట్ క్యాంప్ వాల్యుయేషన్ ఆఫీసర్లు, జరుగుమల్లి మండల విద్యాశాఖ అధికారి బి.నాగేంద్రవదన్, జరుగుమల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.సుధాకర్ పాల్గొన్నారు. -
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం
ఒంగోలు సబర్బన్: యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తాయని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సాధన కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఒంగోలులోని ప్రకాశం భవనం ఎదురుగా ఉన్న రోడ్డులో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక తన క్యాంపు కార్యాలయం నుంచి నడుచుకుంటూ వచ్చి పాల్గొన్న కలెక్టర్.. యోగాసనాలు వేసి ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ కోసం ప్రజలంతా యోగా సాధన చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 15 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, ఆయుష్ విభాగ సీనియర్ వైద్యులు భ్రమరాంబ, భీమ్నాథ్, డీఎస్డీవో రాజరాజేశ్వరి, ఇతర అధికారులు, పతంజలి యోగా సంస్థ గురువులు, ప్రజలు పాల్గొన్నారు. 45 నిమిషాల పాటు చేసే కామన్ యోగా ప్రొటోకాల్ను తెలిపే పోస్టర్ను మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు ఆవిష్కరించారు. యోగాతో సంతోషంగా జీవిద్దాం మార్కాపురం టౌన్: యోగాతో ప్రతిఒక్కరూ ఆరోగ్యకర, సంతోకరమైన జీవితాన్ని పొందాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయసునీత పిలుపునిచ్చారు. సోమవారం మార్కాపురంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వేల సంవత్సరాల క్రితమే యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన భారత దేశం ఎంతో గొప్పదని అన్నారు. ఈ నెల 21 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 9న కంభం చెరువుకట్ట వద్ద యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 17న త్రిపురాంతకంలోని ఆలయం వద్ద వెయ్యిమందితో యోగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పెద్దఎత్తున యోగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. యోగాలో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసిందని, కార్యక్రమాల్లో యువత, విద్యార్థులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ శివరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ రాజాబాబు -
గేమ్ ఛేంజర్..!
కందుకూరు రూరల్: ఆడపిల్ల అనగానే అవి చేయవద్దు.. ఇవి చేయవద్దు.. చక్కగా చదువుకో.. లేదా ఇంటి దగ్గరే ఉండు అని తల్లిదండ్రులు, బంధువులు చెబుతుంటారు. అందులోనూ క్రీడలంటే ఆడపిల్లలను పంపించడానికి అసలు ఇష్టపడరు. అలాంటింది.. ఒక ఆటలోనే కాకుండా నాలుగు ఆటల్లో నైపుణ్యం సాధించి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది కందుకూరుకు చెందిన పొనుగోటి మానస. హ్యాండ్బాల్, తైక్వాండో, సాఫ్ట్బాల్, కబడ్డీ క్రీడల్లో ప్రతిభ చూపింది. ప్రస్తుతం హ్యాండ్బాల్ ఇండియా టీమ్కు ఎంపికై ంది. తైక్వాండోతో మొదలై... కందుకూరులోని బృందావనంకు చెందిన పొనుగోటి రమేష్, చెన్నమ్మ దంపతులకు నలుగురు సంతానం. మూడో సంతానమైన పొనుగోటి మానసను ఆమె మేనత్త పెంచుకుంది. ఆమెకు మూడేళ్ల వయస్సులో బృందావనం పక్కనే ఉన్న టీఆర్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో మాస్టర్ ఎస్కే అబ్దుల్ సలాం నేర్పించే తైక్వాండోలో మేనత్త భర్త చేర్పించారు. ఆనాడు మొదలైన క్రీడలపై ఆసక్తి అలాగే కొనసాగుతూ వచ్చింది. ఒకవైపు చదువుతూనే మరోవైపు తైక్వాండో క్రీడపై పట్టు పెంచుకుని బ్లాక్ బెల్ట్ సాధించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు కూడా సాధించింది. అదే సమయంలో పాఠశాల స్థాయిలో హ్యాండ్బాల్, కబడ్డీ, సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొంటూ సత్తాచాటుతూ వచ్చింది. మానస ప్రతిభను గుర్తించిన శాప్ అధికారులు 2019లో భద్రాచలంలోని ఆకాడమీలో చేర్పించారు. అక్కడ ఐదేళ్లపాటు హ్యాండ్బాల్లో శిక్షణ పొందింది. ఇంటర్, డిగ్రీ చదువుతూనే అకాడమీలో శిక్షణ పొందింది. హ్యాండ్బాల్ పోటీల్లో ప్రతిభ చూపి ఆంధ్రప్రదేశ్ తరఫున పతకాలు సాధించింది. మూడుసార్లు ఇండియా జట్టుకు ఎంపికై నప్పటికీ.. పాస్పోర్టు, ఇతర సమస్యల కారణంగా ఆడలేకపోయింది. ఈ ఏడాది మరోసారి ఇండియా జట్టుకు ఎంపికై ంది. ఈసారి కచ్చితంగా ఆడేందుకు పాస్పోర్టు, ఇతర సమస్యలేమీ లేకుండా సిద్ధం చేసుకుంటోంది. త్వరలో జరగబోయే అంతర్జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఇండియా జట్టులో ఆడనుంది. ఇప్పటి వరకు సాధించిన పతకాలు... 2017లో తెలంగాణలో జరిగిన 3వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో బంగారు పతకం కై వసం చేసుకుంది. కేరళలో జరిగిన 14వ సీనియర్ జాతీయ స్థాయి సౌత్జోన్ చాంపియన్షిప్ ఉమెన్స్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2018లో హిమాచల్ప్రదేశ్లో జరిగిన 41వ జూనియర్ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంది. 63వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి బాలికల హ్యాండ్ బాల్, 2019లో ఢిల్లీలో జరిగిన 65వ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొంది. 2020లో ఉత్తరప్రదేశ్లో జరిగిన 41వ జూనియర్ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో బంగారు పతకం గెలుచుకుంది. 2021 ఉత్తరప్రదేశ్లో జరిగిన 43 జూనియర్ బాలికల జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో సత్తాచాటింది. న్యూఢిల్లీలో జరిగిన 48వ జూనియర్ ఉమెన్స్ జాతీయ స్థాయి పోటీలు, 2023లో ఉత్తర ప్రదేశ్లో జరిగిన 53వ సీనియర్ ఉమెన్స్ జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ చాంపియన్షిప్లో పాల్గొని ప్రతిభ కనబరిచింది. అలాగే వెస్ట్బెంగాళ్లో సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. వీటితోపాటు తైక్వాండోలో అనేక బంగారు పతకాలు సాధించింది. క్రీడాకారులంటే సహజంగా వారికి ఆసక్తి ఉండి ఎంచుకున్న ఏదో ఒక ఆటలో శిక్షణ పొంది రాణించడం చూస్తుంటాం. కానీ, కందుకూరుకు చెందిన ఓ యువతి మాత్రం నాలుగు క్రీడల్లో రాణిస్తోంది. రెండు క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తాచాటుతోంది. మరో క్రీడలో ఏకంగా దేశం తరఫున ఆడేందుకు ఎంపికై ంది. దేశం కీర్తి ప్రతిష్టలు పెంచేలా ఆడతానని, ప్రతిభ చూపుతానని చెబుతోంది. తద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించాలనే తన కలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆటలు మారుస్తూ.. అన్నింట్లో రాణిస్తూ... నాలుగు క్రీడల్లో సత్తా చాటుతున్న కందుకూరు యువతి హ్యాండ్బాల్ పోటీల్లో దేశం తరఫున ఆడేందుకు ఎంపిక తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాఫ్ట్బాల్, కబడ్డీ పోటీల్లోనూ జాతీయ స్థాయిలో రాణింపు నా భర్త సహకారంతో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధిస్తా : హ్యాండ్బాల్లో ఇండియా టీమ్కు ఇప్పటికే నాలుగుసార్లు ఎంపికయ్యాను. మూడుసార్లు ఆర్థిక పరిస్థితులు బాగా లేక కనీసం పాస్ట్పోర్టు తీసుకోలేక ఆగిపోయాను. ప్రస్తుతం నా భర్త కలవకూరి మనోజ్కుమార్ నాకు సపోర్టుగా ఉన్నారు. ఆయన సహకారంతో ఇండియా టీమ్లో ఆడేందుకు ఇతర దేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నా. అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా. త్వరలో ఇండియా తరఫున ఆడనున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. బాగా ఆడి ఇండియాకు పేరు తీసుకురావాలని పట్టుదలతో ఉన్నా. ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో రైల్వేలోగానీ, పోలీస్ డిపార్ట్మెంట్లోగానీ ఉద్యోగం సాధించాలని ఉంది. వివాహానికి ముందు ఎక్కడికై నా దూర ప్రాంతాలకు వెళ్లి ఆడాలంటే ఇబ్బందిగా ఉండేది. ప్రసుత్తం ఆ పరిస్థితి లేదు. నా భర్త అన్ని విధాలు ప్రోత్సహిస్తున్నారు. హ్యాండ్ బాల్ కోచ్, అధికారులు కూడా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. పొనుగోటి మానస -
తొలకరి పలకరింపు
● జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వర్షాలు మార్కాపురం: మృగశిర కార్తె ప్రవేశంతోనే తొలకరి వర్షాలు మార్కాపురం జిల్లా ప్రజలను పలకరించాయి. జిల్లాలో 13 మండలాల్లో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకూ వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధం కాగా గత 2 నెలల నుంచి తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడిన ప్రజానీకానికి తొలకరి జల్లులు హాయినిచ్చాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్లలో 63.4 మి.మీ వర్షం కురవగా, తర్లుపాడు మండలంలో 34.8 మి.మీ, కంభంలో 28.6, కొమరోలులో 24, వైపాలెంలో 21.4, మార్కాపురంలో 11.6, పుల్లలచెరువులో 13.8 మి.మీ వర్షం పడింది. ఇంకా పెద్దారవీడు, పెద్దదోర్నాల, బేస్తవారిపేట, అర్ధవీడు, గిద్దలూరు తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సోమవారం ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఖరీఫ్ సీజన్ సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సజ్జ, జొన్న, కంది, ఆముదం, పత్తి పైర్లు వేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు రైతులు తమ పొలాలను దుక్కులు దున్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు సీడ్ బాల్స్(విత్తన బంతులు) వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ పి.రాజా బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లోని మీ కోసం పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ఫారెస్ట్ అధికారులతో కలిసి సీడ్ బాల్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు, చెట్లు పెంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలన్నారు. అందులో భాగంగా రిజర్వు ఫారెస్ట్ (రెగ్యులర్), సోషల్ ఫారెస్ట్ విభాగాల ద్వారా జిల్లా వ్యాప్తంగా 14 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. అందుకోసం నూతనంగా డ్రోన్ల ద్వారా కూడా ఈ సీడ్ బాల్స్ను రిజర్వు ఫారెస్ట్తో పాటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో వేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద, పెద్ద పాఠశాలలను ఎంపిక చేసుకొని విద్యార్థుల ద్వారా కూడా ఈ సీడ్ బాల్స్ చేయించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తద్వారా విద్యార్థులకు కూడా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు మొక్కలు పెంచే అలవాటును విద్యార్థి దశ నుంచే అలవాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రహరీలు ఉన్న పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నామన్నారు. వర్షాలు పడటం ప్రారంభమైన తరువాత సీడ్ బాల్స్ వెదజల్లుతారన్నారు. కార్యక్రమంలో రిజర్వు ఫారెస్ట్(రెగ్యులర్) డీఎఫ్ఓ కుట్టుబోయిన వినోద్ కుమార్, సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ కే.రాజశేఖర్, సబ్ డీఎఫ్ఓ టి.శ్రీనివాసులు, ఇన్చార్జి డీఆర్ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, ఫారెస్ట్ అధికారులు కే.శశి భూషన్ యాదవ్, పి.కరిముల్లాతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
ఒంగోలు సబర్బన్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం పనికిరాదని, బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమంలో జేసీ కల్పనా కుమారితో కలిసి ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని అధికారులను హెచ్చరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సత్వరం పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏదైనా కారణంతో ఆ సమస్యను పరిష్కరించలేని పక్షంలో అర్జీదారునికి అర్థమయ్యే విధంగా తెలియజేసి ఎండార్స్మెంటు ఇవ్వాలని ఆయన చెప్పారు. అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలన్నారు. మీకోసం అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ మాధురి, జెడ్పీ సీఈవో చిరంజీవి, డీపీఓ వెంకటేశ్వరరావు, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. మార్కాపురంలో మీ కోసంకు 243 అర్జీలు... మార్కాపురం టౌన్: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని చెప్పారు. మార్కాపురం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నూరు శాతం పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి 161 అర్జీలు, ఇతర శాఖలకు సంబంధించి 82 అర్జీలు వచ్చాయని తెలిపారు. త్వరలో యర్రగొండపాలెం నియోజకవర్గ స్థాయిలో ఒక నెలలో 4 వారాల పాటు 4 ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి శివరామిరెడ్డి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి మనిష్యే, జిల్లా పంచాయతీ అధికారి బాలునాయక్, విద్యుత్ శాఖ ఎస్సీ అబ్దుల్ కరీం, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రావు, జిల్లా రవాణాశాఖ అధికారి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు మీ కోసం కార్యక్రమంలో అధికారులతో కలెక్టర్ రాజాబాబు -
ఓగూరు చెరువును తవ్వేస్తున్నారు..!
కందుకూరు రూరల్: మండలంలోని ఓగూరు పంచాయతీ పరిధిలో ఉన్న చెరువు మట్టిని తవ్వేస్తున్నారు. జేసీబీలతో మట్టిని తవ్వి 167బీ జాతీయ రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి తరలిస్తున్నారు. ఓగూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడికి చెందిన సుమారు ఏడు ఎకరాలకు పైగా ఉన్న పొలాల్లో చెరువు నుంచి రాత్రింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. పేరుకు వ్యవసాయ పొలంలోకి మట్టిని తరలిస్తున్నట్లు ఇరిగేషన్ అధికారుల వద్ద అనుమతులు పొందారు. కానీ అక్కడ జరుగుతుంది రియల్ఏస్టేట్ వ్యాపారం అని గ్రామస్తులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఉండడంతో వెంచర్ కోసమే మట్టిని తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భారీ తవ్వకాలతో అనుమానాలు.. ఈ చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. అయితే అనుమతులతో ఒక లెవలింగ్ వరకు మాత్రమే తవ్వకాలు చేయాలి. కానీ ఈ చెరువులో లోతుగా తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీలతో తవ్వకాలు చేస్తుండటంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఆ గుంతల్లో నీరు చేరి ప్రమాదకరంగా మారతాయంటున్నారు. లోతుగా ఉన్న గుంతలు తెలియక పశు కాపరులు గానీ, రైతులు గానీ చెరువులో దిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలాగే కొండికందుకూరులోని చెరువు నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి పెద్ద పెద్ద గుంటలు ఏర్పడ్డాయి. దీనిని గమనించి పశువులు కడిగేందుకు చెరువులో దిగి గుంటల్లో కూరుకుపోయి యువకుడు మృతి చెందాడు. ఇవన్ని తెలిసిన అధికారులు కూడా ఇష్టానుసారంగా అక్రమంగా మట్టిని తరలిస్తుంటే ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన వారు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిపే ఏ అధికారి ఆ వైపు కన్నెత్తి చూడరు. జేసీబీలతో భారీ తవ్వకాలు ఓగూరుకు చెందిన నాయకుడి పొలానికి మట్టి తరలింపు టీడీపీ నాయకులైతే ఏ అధికారి పట్టించుకోరు మట్టిని దోచుకుంటున్న అధికార పార్టీ నాయకులు లెవలింగ్ ప్రకారమే తవ్వుకోవాలి ఓగూరు చెరువు నుంచి పొలాలకు మట్టిని తోలుకునేందుకు అనుమతులు తీసుకున్నారు. చెరువులో కూడా పెద్ద పెద్ద గుంతలు లోతుగా తవ్వకాలు చేయకుండా ఒక లెవలింగ్ ప్రకారం తవ్వుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సీతారామయ్య, ఇరిగేషన్ ఏఈ -
సోమవారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2026
బల్లికురవ, సంతమాగులూరు మండలాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. క్వారీల యాజమానుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా గ్రానైట్ తవ్వకాలు సాగిస్తూ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకున్నా రాత్రిపూట కూడా తవ్వేస్తున్నారు. తక్కువ వేతనాలకు వచ్చే నైపుణ్యం లేని కార్మికులతో పనులు చేయిస్తున్నారు. మైన్స్ సేఫ్టీ అధికారులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మైన్స్ సేఫ్టీ అధికారులు నిత్యం క్వారీలను తనిఖీ చేయాలి. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రమే వీరంతా క్వారీలకు వచ్చి హడావుడి చేస్తుంటారు. మిగిలిన సమయాల్లో క్వారీల వైపు కన్నెత్తి కూడా చూడరు. క్వారీల్లో జరిగే భద్రత వారోత్సవాలకు సైతం గురిజేపల్లి, చీమకుర్తి, బల్లికురవ క్వారీల్లో పని చేసే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ మేనేజర్లనే టీములుగా నియమించుకోవడం వల్ల అంతా బాగున్నాయనే కితాబిచ్చి వెళుతుంటారు. మూడు నెలలుగా ఎండలు, వడ గాల్పుల ఉధృతి అధికంగా ఉంది. ఉదయం 10 గంటలకే 45 డిగ్రీల ఉష్ణోగ్రత వడగాల్పుల ఉధృతి నమోదవుతోంది. ఈ పరిస్థితుల్లో కార్మికులు తలకు గుడ్డలు, టోపీలు పెట్టుకొని మధ్యాహ్నం 12 గంటల సమయంలోను పనులు చేస్తున్నారు. క్వారీల్లో రాయి తీయగా ఏర్పడిన గుంటల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరింది. ఆ గుంటల చుట్టూ కార్మికుల చేత పనులు చేయిస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బెంచ్ కటింగ్ నిబంధనలు ఏ క్వారీలోనూ పాటించడం లేదు. పైనుంచి క్వారీని తొలిచే క్రమంలో ఒక్కో వరుసలో ఏడు మీటర్ల వెడల్పు వదిలి పనులు చేయాలి. అలా చేస్తే నష్టపోవాల్సి వస్తుందని గ్యాప్ లేకుండానే పనులు చేయించడం వల్ల తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది ఆగస్టు 3న ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో పైనుంచి పెద్ద బండరాయి దొర్లి డ్రిల్లింగ్ చేస్తున్న కార్మికులపై పడటంతో పదిమంది పైగా మృత్యువాత పడ్డారు. ఒకళ్లిద్దరు చనిపోతే పాము కరిచింది అంటూ నమ్మించి గుట్టు చప్పుడు కాకుండా సెటిల్ చేయడం ఇక్కడ ఆనవాయితీ.నిబంధనలు కల్ల.. -
మీ కోసం ఉదయం 8 గంటలకే..
ఒంగోలు సబర్బన్: ఒంగోలు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో వేసవి కాలం ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ప్రజలు మార్పును గమనించాలని కోరారు. ప్రజలు నిర్దేశించిన సమయానికి కార్యక్రమానికి చేరుకొని వారి వారి సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేయాలని సూచించారు. మార్కాపురంలో 10 గంటలకు మీకోసం మార్కాపురం టౌన్: మార్కాపురం పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయసునీత ఆదివారం తెలిపారు. ప్రజలు సమస్యలను అర్జీల రూపంలో రాసుకొచ్చి అధికారులకు అందజేయాలన్నారు. అలాగే 1100 నంబరుకు ఫోన్కాల్ చేసి అర్జీని నమోదు చేసుకోవడంతోపాటు అర్జీ ఏ స్ధితిలో ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు. ఒంగోలు సిటీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనం ఈ నెల 8వ తేదీ నుంచి స్థానిక డీఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో ప్రారంభమవుతుందని డీఈఓ సీవీ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అడ్వాన్స్డ్ పరీక్షల మూల్యాంకనానికి సంబంధించి జిల్లాకు 10,329 జవాబు పత్రాలు అందాయన్నారు. మూల్యాంకన ప్రక్రియ కోసం సుమారు 200 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగుతుందని, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మార్చిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల మాదిరిగానే ఈసారి కూడా ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదు విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. యర్రగొండపాలెం: మండలంలోని అమానిగుడిపాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే..వి.సంతోష్ కుమార్, వి.రూబెన్, ఎ.యాకోబులు మోటారు బైక్పై అమానిగుడిపాడు నుంచి గుర్రపుశాలకు వెళ్తున్న సమయంలో నీళ్ల ట్యాంకర్తో వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో మోటారు బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందిన వారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.దేవకుమార్ పేర్కొన్నారు. సంతమాగులూరు(అద్దంకి): ఒంటరిగా బిక్కుబిక్కు మంటూ ఎండలో ఏడుస్తూ నిస్సహాయ స్థితిలో ఉన్న రెండేళ్ల పాపకు సంతమాగులూరు పోలీసులు ఆదివారం ఆశ్రయం కల్పించారు. వివరాల్లోకి వెళితే..శనివారం మధ్యాహ్నం సంతమాగులూరు మండలం కొప్పరంలో ఒక పాప ఒంటరిగా ఉండగా స్థానికులు గమనించారు. ఆ పాపను వివరాలు అడగ్గా.. ఏం చెప్పలేకపోయింది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పాప తల్లిదండ్రుల కోసం చుట్టుపక్కల గ్రామాల్లో శనివారం రాత్రి వరకు విచారించారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో పాప పరిస్థిని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్ట్ బీవీ సాగర్, బాలల సంరక్షణ అధికారి పి.దినేష్కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో వారు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారి పి. నాగమణి సహకారంతో పాపకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. పరీక్షలు అనంతరం ఒంగోలు రాంనగర్లోని శిశుగృహలో చేర్పించారు. అయితే ఆ పాప తల్లిదంద్రులు ఎవరు, ఎందుకు అక్కడ ఎందుకు వదిలేశారో ఎవరికీ తెలియడం లేదు. -
ఈ జాప్యం.. దోపిడీ కోసం!
మార్కాపురం: చెరువుల మరమ్మతు పనులపై నీలినీడలు అలుముకున్నాయి. వాటాల లెక్క తేలకపోవడంతో పనులకు సంబంధించిన టెండర్ల ఖరారులో జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్ల వ్యవధిలో వర్షాలు కురిసినా చెరువులకు సక్రమంగా నీరు చేరలేదు. నిండు కుండలా మారిన చెరువులు సైతం తూముల లీకేజీలతో ఒట్టిపోయాయి. ఈ నేపథ్యంలో చెరువులను బాగు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా చంద్రబాబు సర్కారు రెండేళ్ల తర్వాత ఆలస్యంగా స్పందించింది. జల సంరక్షణ పేరుతో హడావుడి చేస్తోందో తప్ప ఆచరణలో మాత్రం ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టు పరిస్థితి తయారైంది. జిల్లాలోని వివిధ చెరువుల మరమ్మతులకు ఇటీవల ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తవుతాయన్న నమ్మకం రైతుల్లో కలగడం లేదు. జిల్లాలోని 22 చెరువులకు ఆర్ఆర్ఆర్(రిపేర్ రెనోవేషన్ రీస్టోరేషన్) కింద 13.47 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, అభివద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. దీంతోపాటు ఓఅండ్ఎమ్(ఆపరేషన్ అండ్ మెయింటెన్స్) కింద 42 వర్కులకు గాను 3.32 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వీటితో చెరువులు, చెరువు కాలువల మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని పనులకు టెండర్లు పిలవగా, మరికొన్ని పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభించలేదు. మరికొన్ని పనులకు కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. నీటి పారుదల శాఖ అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య పర్సెంటేజీల విషయమై పొత్తు కుదరకపోవడంతో పనులకు బ్రేక్ పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామం ఆయకట్టు రైతులకు ఇబ్బందికరంగా మారింది. రూ.10 లక్షల్లోపు పనులు పచ్చ నేతలకే.. చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు కాగానే టీడీపీ, జనసేన నాయకుల్లో కొందరు పనులు దక్కించుకునేందుకు పావులు కదిపారు. వర్క్ ఆర్డర్ల కోసం నియోజకవర్గ ముఖ్య నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. 10 లక్షల రూపాయల లోపు పనులను నామినేషన్ పద్ధతిపై నీటి సంఘాలకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించడం కూటమి నాయకులకు ఆర్థికంగా మేలు చేయడం కోసమేనన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మార్కాపురం చెరువుకు రూ.1.17 కోట్లు యర్రగొండపాలెం చెరువుకు రూ.43 లక్షలు, దూపాడు చెరువుకు రూ.66.50 లక్షలు, బద్వీడు చెరువుకు రూ.51 లక్షలు, పెద్దబొమ్మలాపురం చెరువుకు రూ.4.92 కోట్లు, బోడపాడు బంధంవాగుకు రూ.23 లక్షలు, బోడిరెడ్డిపల్లి చెరువుకు రూ.46.50 లక్షలు, కొలుకుల చెరువుకు రూ.27 లక్షలు, పెద్దనాగులవరం చెరువుకు రూ.22.50 లక్షలు, త్రిపురాంతకం చెరువుకు రూ.39 లక్షలు కేటాయించారు. కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతునిపాడు చెరువుకు ఓఅండ్ఎమ్ పథకం కింద రూ.2 కోట్లు, కంభం, బేస్తవారపేట, అర్ధవీడు, రాచర్ల, తర్లుపాడు చెరువులకు నిధులు మంజూరయ్యాయి. చిన్నాచితక పనుల సంగతి అటుంచితే భారీ మొత్తంలో నిధులు మంజూరైన చెరువులకు సంబంధించిన పనులు అప్పగించేందుకు కాంట్రాక్టర్లతో టీడీపీ నేతలు బేరాలు ఆడుతున్నట్లు సమాచారం. ఆయకట్టు సాగు ప్రశ్నార్థకం చెరువుల మరమ్మతు పనులు ఇప్పటికే దాదాపు పూర్తి చేయాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటనే యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఉంటే వేలాది ఎకరాల భూములకు సాగునీరు సక్రమంగా అందేది. జూన్ 2వ వారం నుంచి ఖరీఫ్ సీజన్, వర్షాకాలం ప్రారంభం కానుంది. ఇంత వరకు పనులే ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది చెరువుల మరమ్మతులు పూర్తి చేయడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మార్కాపురం చెరువులో సుమారు 7 నుంచి 8 అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. చెరువుతోపాటు కాలువల్లో కూడా చిల్లచెట్లు భారీగా మొలిచాయి. కొద్దిపాటి వర్షానికే చెరువు నిండి నీరు వృథాగా పోతోంది. గిద్దలూరు నియోజకవర్గంలో పలు చెరువులకు గతంలో పడిన గండ్లు పూడ్చడంలో అలవిమాలిన జాప్యం చేయడం, పామూరు, పీసీపల్లి, రాచర్ల తదితర మండలాల పరిధిలోని చెరువుల తూములకు షట్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువుల మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెరువుల మరమ్మతులు ఈ ఏడాది కష్టమే! వర్షాలు ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి కావడం గగనమే ఇంకా కొన్ని చెరువులకు ఖరారు కాని టెండర్లు రూ.10 లక్షల లోపు పనులు పచ్చ చొక్కాలకు కట్టబెట్టే ఎత్తుగడ పనుల్లో జాప్యం, పాలకుల తీరుపై ఆయకట్టు రైతుల ఆగ్రహం -
18 మంది తహశీల్దార్లు బదిలీ
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో 18 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఎం.విజయసునీత శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా కొంతమంది తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లను బదిలీ చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో పలువురు తహశీల్దార్లను సెక్షన్ సూపరింటెండెంట్లుగా నియమించారు. మార్కాపురం తహశీల్దార్ చిరంజీవిని పొదిలి తహశీల్దార్గా, పెద్దారవీడు తహశీల్దార్ శిరీషను తర్లుపాడు తహశీల్దార్గా, పొదిలి తహశీల్దార్ ఎంవీ కృష్ణారెడ్డిని మార్కాపురం తహశీల్దార్గా నియమించారు. కొనకనమిట్ల తహశీల్దార్ సురేష్ను పెద్దారవీడుకు బదిలీ చేశారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయంలో కేఆర్ఆర్సీ తహశీల్దార్గా పనిచేస్తున్న వీవీ నాగరాజును కలెక్టరేట్ సమన్వయ విభాగం సూపరింటెండెంట్గా, యర్రగొండపాలెం తహశీల్దార్ మంజునాథరెడ్డిని కలెక్టరేట్ ల్యాండ్స్–1 విభాగం సూపరింటెండెంట్గా, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి కే అర్జున్రెడ్డిని కలెక్టరేట్ ల్యాండ్స్ 2 విభాగం సూపరింటెండెంట్గా బదిలీ చేశారు. పామూరు తహశీల్దార్ ఏ లక్ష్మీనారాయణను కొనకనమిట్ల తహశీల్దార్గా నియమించారు. పామూరు అడహక్ తహశీల్దార్ ఆర్ వాసుదేవరావును పీసీపల్లి రీసర్వే డిప్యూటీ తహశీల్దార్గా, తర్లుపాడు అడహక్ తహశీల్దార్ కే కిశోర్కుమార్రెడ్డిని తర్లుపాడు డీటీగా, బేస్తవారిపేట తహశీల్దార్ ఏ జితేంద్రకుమార్ను పెద్దారవీడు రీసర్వే డిప్యూటీ తహశీల్దార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాచర్ల అడహక్ తహశీల్దార్ ఎస్కే రఫీ మార్కాపురం రీసర్వే డిప్యూటీ తహశీల్దార్గా, కంభం ఎమ్ఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి యూ హర్షవర్ధనాచారిని సీఎస్పురం డిప్యూటీ తహశీల్దార్గా, ఎస్ శివరామ ప్రసన్నను పొదిలి నుంచి వైపాలెం రీసర్వే డిప్యూటీ తహశీల్దార్గా బదిలీ చేశారు. సీఎస్పురం తహశీల్దార్ కేవీ ప్రసాద్ను కలెక్టరేట్లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కనిగిరి తహశీల్దార్ ఎన్ జయలక్ష్మిని యర్రగొండపాలెం తహశీల్దార్గా, డిప్యూటీ తహశీల్దార్ డీ పార్వతీబాయిని వెలిగండ్ల డిప్యూటీ తహశీల్దార్గా బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. బేస్తవారిపేట: మలేషియాలో ఈనెల 2 నుంచి 5వ తేదీ వరకు జరిగిన 2వ ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్షిప్–2026 పోటీల్లో బేస్తవారిపేట మండలం ఆర్ కొత్తపల్లెకు చెందిన పీ రాయుడు సత్తాచాటాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఎడుగురు క్రీడాకారుల్లో మన రాష్ట్రం తరఫున పీ రాయుడు పాల్గొన్నారు. ఏషియన్ చాంపియన్షిప్ పోటీల్లో ఇండియా టీం కాంస్య పతకం సాధించింది. అంతర్జాతీయ వేదికపై ఇండియా పేరు నిలబెట్టడం ఆనందంగా ఉందని, భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తులో ఎగరవేయడానికి నిరంతరం శ్రమిస్తానని రాయుడు తెలిపారు. మార్కాపురం టౌన్: రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో మార్కాపురం విద్యార్థి ఎం.జోషితారెడ్డి 3వ స్థానం సాధించినట్లు శిక్షణ ఇచ్చిన కరాటే నిర్వాహకులు మారంరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జూన్ 4 నుంచి 7 వరకూ ఉత్తరాఖండ్లోని డెహరాడూన్లో కరాటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కియో సబ్ జూనియర్ కాడెట్–జూనియర్ కరాటే ఛాంపియన్ షిప్–2026 పోటీల్లో 12 సంవత్సరాల బాలికల విభాగంలోని కటా చాంపియన్షిప్లో జోషిత రెడ్డి ఏపీ తరఫున పతకం సాధించినందుకు అభినందనలు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ముండ్లమూరు: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బావబామ్మర్దులైన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలై దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ముండ్లమూరు మండలంలోని పులిపాడు శివాలయం ఎదురుగా అద్దంకి–దర్శి ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు.. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డుకు చెందిన రేగళ్ల మణికంఠ(30), చాట్ల నాగరాజు తమ బైక్పై ముండ్లమూరు మండలం కెల్లంపల్లి వైపు నుంచి స్వగ్రామం వెళ్తున్నారు. వీరి బైక్ పులిపాడు శివాలయం సమీపంలోకి రాగానే పొదిలి వైపు నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ సమీపంలో లేకపోవడంతో అరగంటసేపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. ఆ తర్వాత ముండ్లమూరుకు చెందిన 108 వాహనం వచ్చి క్షతగాత్రులను దర్శి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మణికంఠ మృతి చెందాడు. నాగరాజును మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. బైక్ను ఢీకొట్టిన లారీ ఆగకుండా వెళ్తుండగా సంఘటనా స్థలంలో ఉన్న ఏఎస్సై పవన్ కుమార్, తమ సిబ్బందితో కలిసి ట్రేస్ చేశారు. లారీని పోలీస్ స్టేషన్లో ఉంచారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విద్యాశాఖ వత్తాసు
సింగరాయకొండ: ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తన వ్యాపార ప్రచారం కోసం ఆలిండియా ఆల్ వర్కర్స్ అసోసియేషన్ అని చెప్పి పదో తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు ఎన్టీఆర్ అవార్డుల పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద పెట్టిన కార్యక్రమానికి విద్యాశాఖ వత్తాసు పలికి అభాసుపాలైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా ఎంఈఓలకు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. దీంతో ఎంఈఓలు ఆ సమాచారాన్ని ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయటంతో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఈ అవార్డు కార్యక్రమానికి ఎంతో ఆశతో వెళ్లి.. చివరికి ఇది ప్రభుత్వ అధికారిక అవార్డు ఫంక్షన్ కాదని, ఇది కేవలం రియల్ ఏస్టేట్ వెంచర్ పబ్లిసిటీ కార్యక్రమం అని తెలిసి నిశ్చేష్టులయ్యారన్నారు. దీనిని బట్టి విద్యాశాఖ టీడీపీ తొత్తుగా ఏవిధంగా పనిచేస్తుందో అర్థమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి నారాలోకేష్, నందమూరి బాలకృష్ణ, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరవుతారని కరపత్రికను రియల్ ఏస్టేట్ వ్యాపారి విడుదల చేశారని ఆరోపించారు. ఈ సమాచారాన్ని డీఈఓ ఎలా నమ్మారో, లేదా రియల్ఏస్టేట్ వ్యాపారి ప్రలోభానికి లొంగారో తెలియదు కానీ డీఈఓ అధికారికంగా మెసేజ్లు పెట్టారన్నారు. తీరా ఆ కార్యక్రమం రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన వెంచర్ ప్రచారంలో భాగమని తెలిసి అధికారులంతా ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లాగా చల్లగా జారుకున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సహకరించిన విద్యాశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనను బట్టి విద్యాశాఖ మీద ఎవరికీ పట్టులేదనేది తేటతెల్లమవుతోందని, దీనికి విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వ్యవస్థలన్నీ రాజకీయమయం అయ్యాయనటానికి ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల కు చెందిన దాదాపు 5 వేలకు పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు భారీగా హాజరయ్యారని, వీరికి ప్రశంసపత్రాలు, షీల్టు ఇస్తామని నానా హంగామా చేశారని చివరికి అక్కడ మాత్రం సమాచారం ఇచ్చేవారే కరువవటంతో కార్యక్రమం రసాభాసగా మారిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారన్నారు. ఈ ఘటనలో విద్యాశాఖలోని ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆరోపించారు. -
ఆన్లైన్ పార్శిల్స్...అదుర్స్
ఉలవపాడు: మామిడి వ్యాపారం కొత్తపుంతలు తొక్కుతోంది. గతంలో ఉలవపాడు మామిడి కాయలు కావాలంటే ఉలవపాడు ప్రాంతానికి రావాల్సిందే. లేదంటే బంధువుల ద్వారా తీసుకెళ్లేవారు. కానీ కాలం మారింది... ఇప్పుడు ఫోన్ చేస్తే చాలు నేరుగా వారి వద్దకే పార్శిల్స్ అందించే పరిస్థితి వచ్చేసింది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఉలవపాడు మామిడి కాయలు ఇప్పుడు పార్శిల్స్ ద్వారా దేశవ్యాప్తంగా నలుమూలలకు చేరుతున్నాయి. గత నాలుగేళ్లుగా ఈ వ్యాపారం జరుగుతున్నా ఈ ఏడాది మాత్రం అధిక శాతం పార్శిల్స్ ద్వారా మామిడికాయలు తరలివెళుతున్నాయి. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతంలో ఈ ఆన్లైన్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. మండల పరిధిలోని కార్గో సెంటర్లు, తెలంగాణ కార్గో సెంటర్లు, ప్రైవేటు ట్రావెల్స్ ఆఫీసుల వద్ద ఎక్కడ చూసినా మామిడికాయల బాక్స్లు దర్శనమిస్తున్నాయి. రోజుకు సుమారు 2 వేల బాక్స్లు పైనే తరలివెళుతున్నాయి. సాయంత్రం అయితే చాలు కాయలు బాక్స్లు పంపేవారితో సందడిగా మారుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మామిడికాయలు పంపించడానికి చాలా మంది వ్యాపారులు తమ ఫోన్ నంబర్లు పెడుతున్నారు. వారికి ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే వారు పార్శిల్స్ పంపిస్తున్నారు. యూపీఐ ద్వారా నగదు పంపిస్తున్నారు. ప్రస్తుతం అధిక శాతం మంది మామిడి ప్రియులు ఈ ఆన్లైన్ పార్శిల్స్ ద్వారా మామిడిని దిగుమతి చేసుకుంటున్నారు. మామిడి వ్యాపారులకు సైతం ఈ ఆన్లైన్ వ్యాపారం లాభసాటిగా ఉంది. నలుమూలలకూ ఉలవపాడు మామిడి.. ప్రస్తుతం ఉలవపాడు మామిడి నలుమూలలకు చేరుతోంది. ప్రస్తుతం ఉలవపాడు ప్రాంతం నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, ముంబాయి, కోల్కత్తా, భువనేశ్వర్, తిరుపతి, విజయవాడ, గుంటూరు తోపాటు తెలంగాణలోని అన్ని పట్టణాలకు ప్రస్తుతం పార్శిల్స్ పంపిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ట్రావెల్స్ బస్సుల్లో ఈ పార్శిళ్లు పంపిస్తున్నారు. ఈ వాహనాలు సరిపోక కార్గో ఏజంట్లు ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటుచేసి డోర్ డెలివరీ చేస్తున్నారు. ఉలవపాడు మామిడి ఇప్పుడు దేశవ్యాప్తంగా డోర్ డెలివరీ ద్వారా అందుతున్నాయి. ఆన్లైన్ వ్యాపారం అదుర్స్.. ప్రస్తుతం ఆన్లైన్ వ్యాపారం భారీగా జరుగుతోంది. ఉలవపాడు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన దుకాణదారులందరూ ఆన్లైన్ ద్వారా కాయలు పంపుతున్నారు. వాహనదారులు ఈ దుకాణాల వద్దకు వచ్చి కొనుగోలు చేసే సమయంలో వారి నంబర్లు తీసుకుని పంపాలని కోరుతున్నారు. వారు బాక్స్ల్లో అందంగా ప్యాక్ చేసి కాయలు పంపిస్తున్నారు. ఇక ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ల ద్వారా కూడా కొందరు వ్యాపారులు తమకు ఫోన్ చేస్తే కాయలు పంపిస్తామని తెలియజేస్తున్నారు. వారి ద్వారా కూడా ఆన్లైన్ వ్యాపారం నడుస్తోంది. గత నాలుగేళ్లుగా ఇలానే పార్శిళ్లు వేస్తున్నా ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా మామిడి కాయలు పంపించడం బాగా అధికమైందని మామిడి వ్యాపారులు అంటున్నారు. మామిడి కాయల ప్యాకింగ్ బాక్స్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. సాధారణ సమయంలో రూ.50 ఉండే అట్ట బాక్స్ ప్రస్తుతం రూ.200కు అమ్ముతున్నారు. ఆన్లైన్ ద్వారా పంపించేవి పచ్చి కాయలు ఉండాలి కాబట్టి రేటు కూడా అధికంగా ఉంది. అందువలన మామిడి రైతులు సైతం ఆన్లైన్ ద్వారా పంపడమే మేలనుకుంటున్నారు. ప్రస్తుతం బంగినపల్లె రకం కేజీ రూ.100 చొప్పున ఆన్లైన్ అమ్మకాలు సాగిస్తున్నారు. అట్టపెట్టెలు, రవాణా చార్జీలు అధికంగా ఉంటాయి. ఇలా ప్రస్తుతం ఉలవపాడులో ఆన్లైన్ ద్వారా వ్యాపారం భారీగా జరుగుతోంది. -
తూములు రిపేరు చేయాలి
మార్కాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం లోపే చెరువలకు మరమ్మతులు చేపట్టాలి. బలహీనంగా ఉన్న చెరువు కట్టలను రిపేర్లు చేయాలి. ముఖ్యంగా మార్కాపురం చెరువు కాలువలు చిల్లచెట్లతో మూసుకుపోయాయి. కాలువలు బాగుచేయడంతోపాటు తూములు కూడా రిపేరు చేయాలి. అప్పుడే చెరువుకు నీళ్లొస్తే ఉపయోగం ఉంటుంది. రైతులు పొలాలు సాగుచేసుకుంటారు. – జి శ్రీనివాసరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్, మార్కాపురం చెరువులకు మరమ్మతులు ఎప్పుడు? శతాబ్ధాల చరిత్ర కలిగిన మార్కాపురం చెరువుకు మరమ్మతులు ఎప్పుడు చేస్తారో అర్థం కావడం లేదు. చెరువులో పూడిక పేరుకుపోయింది. చెరువు కాలువలు, తూములు, పంట కాలువలకు మరమ్మతులు చేస్తే ఉపయోగంగా ఉంటుంది. జల వనరుల శాఖ అధికారులు త్వరగా పనులు ప్రారంభించాలి. – జి సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి టెండర్లు పూర్తయ్యాయి ఈ ఏడాది మార్కాపురం నీటి పారుదలశాఖ పరిధిలో ఆర్ఆర్ఆర్ పథకం కింద 22 వర్కులకు రూ.13.47 కోట్లు, ఓఅండ్ఎమ్ కింద 42 వర్కులకు 3.35 కోట్లు మంజూరయ్యాయి. చాలా వరకూ టెండర్లు ఫైనల్ అయ్యాయి. అగ్రిమెంట్లు కూడా చాలావరకు అయ్యాయి. పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి. – హర్షింగ్ నాయక్, ఇరిగేషన్ ఈఈ, మార్కాపురం -
జనసేన నుంచి వైఎస్సార్ సీపీలోకి
టంగుటూరు: మండలంలోని జమ్ములపాలెం అంబేడ్కర్నగర్కు చెందిన 10 కుటుంబాలు జనసేన పార్టీని వీడి ఆదివారం వైఎస్సార్ సీపీ చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాన్కోటి, టంగుటూరు పట్టణ అధ్యక్షుడు కొమ్ము సురేంద్ర, టంగుటూరు అరుంధతి నాయకులు రోషన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పేదల పార్టీ అన్నారు. ఏ కష్టం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో నెరుసుల గౌతమ్, స్టీఫెన్, కసుకుర్తి ఏప్రాయం, ఇడిగాటి వంశీ, ఇడిగాటి సాత్విక్, మెడబలిమి అనిల్, తిప్పగుడిసె మహేష్, సలగల మోజెస్, సలగల బ్రేనాట్, పులగర క్రాంతి తదితరులు వైఎస్సార్ సీపీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరిబాబు, కట్టా బాబురావు, పందిటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ గ్యాస్ బండ
మార్కాపురం: ఇరాన్, అమెరికా యుద్ధం ప్రజలపై పెనుభారం మోపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న వంట గ్యాస్ సిలిండర్పై రూ.60 పెంచగా, ఆదివారం మళ్లీ రూ.29 పెంచడంతో సిలిండర్ ధర రూ.987 కు చేరింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలపై నెలకు సుమారు రూ.2 కోట్ల అదనపు భారం పడుతోంది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద 7,03,090 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సిలిండర్పై రూ.29 పెరగడంతో జిల్లా వ్యాప్తంగా రూ.2,03,89,610 అదనపు భారం పడుతోంది. 14.2 కిలోల గృహ వినియోగదారులకు కేంద్రం గ్యాస్ సిలిండర్ అందజేస్తోంది. సిలిండర్ బుక్ చేసుకునే వ్యవధిని గ్యాస్ ఏజెన్సీలు 45 రోజులకి పెంచాయి. అంటే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న 45 రోజుల తరువాతే మరో సిలిండర్ను బుక్ చేసుకునే అవకాశం ఉంది. గతంలో బుక్ చేసుకున్న 3వ రోజే గ్యాస్ డెలివరీ అయ్యేది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడటంతో గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ బుకింగ్ సమయాన్ని పెంచాయి. ఇదే సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, నూడిల్స్ బండ్లు, టీ షాపుల వారు కమర్షియల్ సిలిండర్ ధర ఎక్కువగా ఉండటం, బ్లాక్ మార్కెట్లో కూడా అధిక ధర ఉండటంతో డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్నారు. ఇటు డొమెస్టిక్, అటు కమర్షియల్ సిలిండర్ల ధరలు రెండూ పెరిగిపోతుండటంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్ల ధరల పెరుగుదల ఇలా.. ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకూ కమర్షియల్ సిలిండర్ ధర రూ.1932 ఉండగా మార్చి 4న రూ.31 పెంచడంతో రూ.1963కు చేరింది. మార్చి 12న మరో రూ.114 పెరగడంతో రూ.2077కు చేరింది. ఏప్రిల్ 2న మళ్లీ రూ.196 పెంచడంతో రూ.2273 అయింది. మళ్లీ ఇటీవల రూ.993 పెంచడంతో రూ.3266కు చేరింది. ఇదే సమయంలో కొరత కూడా ఎక్కువగా ఉండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీ, టీ స్టాల్స్, స్వీట్ షాపుల యజమానులు పల్లెలకు వెళ్లి బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని తమపై లేకుండా వినియోగదారులపైనే వేస్తున్నారు. దీంతో మొత్తం ధరలను వ్యాపారులు పెంచారు. ఇబ్బందిగానే ఉంది: గృహ అవసరాల సిలిండర్ ధరల పెంపుదల అందరికీ భారమే. సిలిండర్ లేనిది వంటింట్లో ఏపనీ కాదు. కాఫీ తాగాలన్నా.. వంట చేయాలన్నా.. సిలిండర్ అవసరమే. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం నుంచి రూ.29 ధర పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ ఇబ్బందిగానే ఉంది. – పి.విజయలక్ష్మి, గృహిణి, మార్కాపురం ఉమ్మడి జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 7,03,090 మార్కాపురం జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 3,22,279 -
పొగాకు రేకులషెడ్కు దుండగుల నిప్పు
మర్రిపూడి: గుర్తు తెలియని వ్యక్తులు రేకుల షెడ్కు నిప్పు అంటించడంతో ఆరుగాలాల పాటు కష్టించి పండించిన పొగాకు అగ్నికి ఆహుతైంది. ఈ సంఘటన మండలంలోని కెల్లంపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. బాధితుల వివరాల మేరకు..మండలంలోని కెల్లంపల్లి హరిజనవాడ అంబేడ్కర్ విగ్రహం సమీపంలో మల్లెల రోశయ్య రేకుల షెడ్కు గుర్తు తెలియని దుండగులు ఆదివారం ఉదయం నిప్పుపెట్టారు. దీంతో పెద్ద ఎత్తున మంటల వ్యాపించి షెడ్లో ఉన్న పొగాకు బేళ్లు అగ్నికి అహుతయ్యాయి. మల్లెల రోశయ్య షెడ్లో అదే గ్రామానికి చెందిన రైతు పాపినేని శ్రీను 10 పొగాకు బేళ్లు దాచుకోగా, మల్లెల వెంకటేశ్వర్లు మరో 10 క్వింటాళ్లు పొగాకు నిల్వ చేసుకున్నాడు. క్యూరింగ్ అనంతరం ర్యాక్ల్లో ఉన్న సుమారు 1500 కర్ర సైతం పూర్తిగా కాలి బూడిదైంది. షెడ్లోని తాటి దబ్బలు, ఇంజన్, ఫ్యాన్లు, ట్రాక్టర్ సామాన్లు అన్నీ బుగ్గిపాలైయ్యాయని బాధితులు వాపోయారు. విషయం గమనించిన స్థానికులు కొండపి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. అప్పుటికే పూర్తిగా కాలిపోయినట్లు తెలిపారు. ఈ సంఘటనలో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుఅంటించి ఉంటారా? లేదా ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందా? అనే తెలియాల్సి ఉంది. అగ్నికి ఆహుతైన పొగాకు బేళ్లు రూ. 10 లక్షల ఆస్తి నష్టం -
టీడీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
● ఓ వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తన దర్శి: టీడీపీలోని ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మందికి గాయాలు కాగా, ఓ వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ప్రకాశం జిల్లా బండి వెలిగండ్లలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలోని మాజీ రేషన్ డీలర్ యాదాల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు, ప్రస్తుత డీలర్ కంట బాబు, కంట రామయ్య, యాదాల గురునాథంల మధ్య రాజకీయ కక్షలతో ఒకరిపై ఒకరు రాళ్లతో, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాలకి గాయాలయ్యాయి. గాయపడిన వారిని దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గొడవ జరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు రెండు గంటల సేపు ఘర్షణ జరిగింది. ఆ వీడియోల్లో ఓ ఇంటిపై రాళ్లు విసిరేసి ఇంట్లో వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. ఒక వ్యక్తి ప్యాంట్ విప్పి మహిళలకు చూపించినట్లు ఉంది. ఘర్షణలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పోలీసులు ఈ కేసుని రాజీ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం. బేస్తవారిపేట: మండలంలోని పూసలపాడులో అభయాంజనేయస్వామి వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో బండ పందెం పోటీలు ఆదివారం నిర్వహించారు. నంద్యాల జిల్లా సంబవరానికి చెందిన జూపల్లి ప్రభాకరరెడ్డి ఎడ్లు 3292 అడుగుల దూరంలాగి మొదటి స్థానంలో నిలిచాయి. నంద్యాల జిల్లా గోసపాడు మండలం సంబవరానికి చెందిన బీరం బుల్స్ ప్రభాకరరెడ్డి ఎడ్లు 2671 అడుగుల దూరంతో ద్వితీయ స్థానం, బాపట్ల జిల్లా పంగులూరు మండలం జే పంగులూరుకు చెందిన చిలుకూరి నాగేశ్వరరావు ఎడ్లు 2545 అడుగులతో తృతీయ స్థానంలో, నంద్యాల జిల్లా నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన బోరెడ్డి జనార్థనరెడ్డి 2521 అడుగుల దూరంతో నాల్గొవ స్థానంలో నిలిచాయి. మార్కాపురం జిల్లా కంభం మండలం దరగకు చెందిన కృష్ణయ్యయాదవ్ ఎడ్లు 2500 అడుగుల దూరంతో ఐదో స్థానం సాధించాయి. పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు మొదటి, రెండో, మూడో, నాల్గోవ, ఐదోవ బహుమతులు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలను దాతలు పంపిణీ చేశారు. -
నెమలిగుండ్లకు పోటెత్తిన భక్తులు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు. ఉదయం 10 గంటలకు స్వామి వారికి ఆలయ అర్చకులు అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం వెంకటరంగచార్యులు ఆధ్వర్యంలో పట్టువస్త్రాలను ప్రత్యేక పూలతో అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలో నిల్చొని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఈవో మల్లవరపు నాగయ్య, చైర్మన్ సిద్ధం నరసింహులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. -
కలెక్టరేట్ వద్ద ధర్నా రేపు
మార్కాపురం: ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణ మానుకోవాలని, పెరిగిన ధరల అనుగుణంగా మధ్యాహ్న భోజనం కార్మికులు కనీసవేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ స్థానిక జిల్లా పరిషత్ బాలల ఉన్నత పాఠశాలలో ఎంఈఓ రాందాస్ నాయక్కు శనివారం వినతిపత్రం ఇచ్చినట్టు సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి డీకేఎం రఫీ తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో మధ్యాహ్నం భోజన పథకాన్ని కార్పొరేటర్ సంస్థలకు అప్పజెప్పడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని ఈ ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం భోజనం పథకంపై ఆధారపడి వేల కుటుంబాలున్నాయని ప్రైవేటీకరణ వల్ల వారు ఉపాధికి దూరమవుతారన్నారు. ప్రస్తుతం కార్మికులకు గౌరవ వేతనం పేరుతో కేవలం 3000 మాత్రమే ఇస్తోందని 3 వేలతో కుటుంబాలు గడవడం ఇబ్బందిగా ఉన్నాయన్నారు. వంట గ్యాస్ రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వమే వంటగ్యాస్ను సరఫరా చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను ఒక విద్యార్థికి 20 రూపాయలు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. వేతనాలు, బిల్లులు కూడా ప్రతి నెలా ఇవ్వడం లేదని దీంతో అప్పు తెచ్చి పథకాన్ని నిర్వహించ పరిస్థితి ఏర్పడిందని దీంతో కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన చెందారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని, కార్మికుల కనీస వేతనం పెంచాలని ఈనెల 8న కలెక్టరేట్ వద్ద జరుగు ధర్నాలో మధ్యాహ్నం భోజన కార్మికులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు జమ్ముల నాగరాజు, మధ్యాహ్న భోజన కార్మికులు, రామిరెడ్డి, లక్ష్మి, వరాలు, కాశింబి, లక్ష్మీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
జీపు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి
● స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం మేదరమెట్ల: డిగ్రీ చదువుతున్న యువకుడు తన స్నేహితుని పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు జీపు నుంచి రోడ్డుపై పడి తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన కొరిశపాడు మండలం దక్షిణ బైపాస్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. వివరాలు.. మండల పరిధిలోని పాత దామావారిపాలేనికి చెందిన షేక్ ఆసీఫ్ (19) తన స్నేహితుని పుట్టిన రోజు సందర్భంగా మరో ఐదుగురు స్నేహితులతో కలిసి టాప్లెస్ జీపులో శుక్రవవారం రాత్రి అద్దంకి నుంచి మద్దిపాడు మండల పరిధి గుండ్లాపల్లి డాబాకు వెళ్లారు. పుట్టిన రోజు వేడుకలు ముగించుకుని తిరిగి అద్దంకి వెళ్లేందుకు జీపుపై బయల్దేరారు. జీపు మేదరమెట్ల దక్షిణ బైపాస్ సమీపానికి రాగానే అందులో ఉన్న ఆసీఫ్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆసీఫ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మిగిలిన స్నేహితులు అదే జీపులో ఒంగోలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆసీఫ్ మృతి చెందాడు. మృతుడు ఖాజావలి, చాంద్బీ దంపతుల రెండో కుమారుడు. విశాఖపట్నంలో రెండో సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దోచుకోవడమే‘దారి’!
మార్కాపురం రూరల్: కూటమి ప్రభుత్వ హయాంలో చేపడుతున్న రహదారి పనుల నాణ్యతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మార్కాపురం మండలంలోని బోడపాడు–యాచవరం గ్రామాల మధ్య రూ.1.50 కోట్ల వ్యయంలో ఇటీవల నిర్మించిన తారు రోడ్డు పది రోజుల కూడా గడవకముందే పలుచోట్ల గుంతలు పడటంతో పనుల నాణ్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల మధ్య ప్రధాన రాకపోకలకు ఉపయోగపడే ఈ రహదారి నిర్మాణం పూర్తయిన కొద్దిరోజుల్లోనే దెబ్బతినడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోడ్డు బిల్లులు కూడా పూర్తిగా చెల్లించకముందే గుంతలు ఏర్పడటంతో అఽధికారులు, కాంట్రాక్టర్లు హడావిడిగా ప్యాచ్లు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ‘పని నాణ్యతగా జరిగి ఉంటే పది రోజుల్లోనే గుంతలు ఎందుకు పడ్డాయి..?ప్యాచ్లు అవసరం ఎందుకు వచ్చింది..?’అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తారుపొర మందం, నాణ్యత ప్రమాణాలు, మెటీరియల్ వినియోగం, సాంకేతిక పర్యవేక్షణ వంటి అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వంలో రోడ్డు పనులు ఎక్కువగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే కేటాయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టెండర్లలో ఇతర కాంట్రాక్టర్లు పాల్గొనకుండా ఒత్తిళ్లు, బెదిరింపులు ఉన్నాయంటూ స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో పోటీ లేకుండా పనులు దక్కించుకుని నాణ్యతను గాలికొదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్యాచ్లు చేసిన ప్రాంతాలు మళ్లీ దెబ్బతినే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైతే రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి, తర్వాత మరమ్మతుల పేరిట అదనపు ఖర్చులు పెట్టడం సరైన విధానం కాదని ప్రజలు మండిపడుతున్నారు. బోడపాడు–యాచవరం రహదారి పనులపై ఉన్నతాధికారులు సాంకేతిక విచారణ జరిగి, నాణ్యత లోపాలు ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా వేసిన రోడ్డు పది రోజుల్లోనే గుంతలమయం కావడం వెంటనే ప్యాచ్ వర్క్లకు దిగడం కూటమి ప్రభుత్వ అభివృద్ధి పనుల నాణ్యతకు నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. -
అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కనిగిరి రూరల్: పట్టణంలోని ఒంగోలు బస్టాండ్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర ఆహార శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వన్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి చిరాగ్ పాశ్వన్ మాట్లాడుతూ మన అందరి నేత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కీర్తించారు. బీఆర్ అంబేద్కర్ గోప్ప దార్శనీకుడని కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వంగలపుడి అనిత, డోలా వీరాంజనేయస్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ ఎం. విజయ సునీత, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, ఎంఎస్ రాజు, ఇంటూరి నాగేశ్వరరావు, కందుల నారాయణరెడ్డి, ఎం.ఆశోక్రెడ్డి, ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి పాల్గొన్నారు. మార్కాపురం టౌన్: కుటుంబ కలహాలతో ఎలుకల మందు తిని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మార్కాపురం పట్టణంలోని షాదీఖానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చింతగుంట్ల గ్రామానికి చెందిన రెడ్డెపోగు నాగభూషణం (45) శనివారం మార్కాపురంలోని కంభం సెంటరులో ఉన్న షాదీఖానా వద్ద నిర్జీవంగా పడి ఉన్నాడు. అతని వద్ద ఎలుకల మందు ప్యాకెట్, బాదంపాలు గ్లాసు ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. కుటుంబ సభ్యులతో ఏర్పడిన గొడవ కారణంగా ఎలుకల మందు తిని చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్రిపురాంతకం: స్థానిక వైన్ షాప్ పరిసరాల్లో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రిపురాంతకంలోని మార్కాపరుం రోడ్డు వైన్ షాపు సమీపంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. త్రిపురాంతకానికి చెందిన డి.వెంకటరెడ్డిగా స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతనునాలుగు రోజులుగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం పోలీసులు విచారిస్తున్నారు. -
ముండ్లమూరు ఠాణా..ఆగడాలు ఆగేనా..!
ముండ్లమూరు: స్థానిక పోలీస్స్టేషన్కు రెండు నెలలకుపైగా ఎస్సై లేకపోవడం, ఏఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలు, సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతుండటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. నేరాలు, ఘోరాలు, చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసు స్టేషన్లోనే ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నారని, మండలంలో జరిగే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని ప్రజల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముండ్లమూరు పోలీస్స్టేషన్కు ఎస్సైగా పనిచేస్తున్న కమలాకర్ రెండు నెలల క్రితం బదిలీ అయ్యారు. అనంతరం తాత్కాలిక ఎస్సైగా దర్శి డీఎస్పీ కార్యాలయం నుంచి గుర్రం ప్రసాద్ అనే ఎస్సైని నియమించినప్పటికీ కేవలం మూడు రోజులే పనిచేసి తిరిగి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిపోయారు. ఏఎస్సై తీరే అందుకు కారణమని స్టేషన్ సిబ్బందిలో అప్పట్లో చర్చ నడిచింది. ఏడాది క్రితం కొమరోలు నుంచి వచ్చి ముండ్లమూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న ఏఎస్సై.. అధికార పార్టీ నాయకులతో సన్నిహితంగా మెలుగుతూ రెండు నెలలుగా ఇక్కడకు ఎస్సైని నియమించకుండా అడ్డుకుంటున్నాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు... ముండ్లమూరు ఏఎస్సై తీరుతో మండల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పోలీస్స్టేషన్ను సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కోడి పందేలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ల నిర్వాహకులతో చేతులు కలిపి ప్రోత్సహిస్తూ భారీ మొత్తంలో ముడుపులు పుచ్చుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఘర్షణ కేసులు, ఇతర నేరాలపై పోలీస్ స్టేషన్లోనే ప్రైవేటు పంచాయితీలు చేస్తున్నాడని, అందుకు భారీగా వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని 21 పంచాయతీలలో 52 గ్రామాలుండగా.. నిత్యం ఏదో ఒక గ్రామంలో గొడవలు జరుగుతుంటాయి. వాటిని అడ్డం పెట్టుకుని ఏఎస్సై సెటిల్మెంట్లు చేసి నిందితుల వద్ద నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. మండలంలో దొంగతనాలను కట్టడి చేయని వైనం... మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. రోజురోజుకూ చోరీలు పెరిగిపోతున్నాయి. కానీ, దొంగలను పట్టుకోవడంపై శ్రద్ధ పెట్టకుండా దందాలు, సెటిల్మెంట్లపైనే ఏఎస్సై ఆసక్తి చూపిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో జరిగిన దొంగతనాల్లో పెద్ద ఎత్తున వెండి, బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. కానీ, వాటి రికవరీ గురించి ఏఎస్సై పట్టించుకున్న పాపాన పోలేదు. కొన్ని నెలల కిందట పోలవరం గ్రామంలోని లక్ష్మీపురంలో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లినా.. నేటికీ నిందితుడి ఆచూకీ కనిపెట్టలేదు. అదేవిధంగా పెద్ద ఉల్లగల్లులో శంకర్రావు ఇంట్లో చోరీ జరిగింది. పోలీస్స్టేషన్ పక్కనే పట్టపగలే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి లక్ష రూపాయలు తీసుకెళ్లారు. ఇవి కాకుండా కొన్ని నెలల నుంచి 50కిపైగా రైతుల ట్రాన్స్ఫార్మర్లు దొంగల పాలయ్యాయి. ఇలా చెప్పుకుంటూపోతే.. మండలంలో ఎన్నో భారీ, చిల్లర దొంగతనాలు జరుగుతున్నాయి. వాటిని కట్టడి చేసేందుకు కనీస చర్యలు కూడా తీసుకోకుండా.. కేవలం అవినీతి అక్రమాలపైనే ఏఎస్సై దృష్టి సారిస్తున్నారని ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. జూదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ ఆరోపణలు... దర్శి నియోజకవర్గంలోని ఓ పోలీసు అధికారితో లాలూచీపడి ముండ్లమూరు మండలంలో జూదాన్ని ఏఎస్సై పెంచిపోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదివారం వస్తే చాలు.. అగ్రహారం, నూజెళ్లపల్లి, కెల్లంపల్లి గ్రామాల్లో కోడి పందేలు, సుంకరవారిపాలెం, పూరిమెట్ల, అగ్రహారం, మారెళ్ల, శంకరాపురం, కొమ్మవరం గ్రామాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. వాటి నిర్వాహకుల వద్ద ముడుపులు పుచ్చుకుని పైఅధికారికి వాటాలు పంపిస్తూ చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలలకుపైగా లేని ఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఏఎస్సై స్టేషన్లోనే ప్రైవేటు పంచాయితీలు, దందాలు అవినీతికి పాల్పడుతూ అసాంఘిక కార్యకలాపాలను పెంచిపోషిస్తున్నాడంటూ ఆరోపణలు భయాందోళనకు గురవుతున్న మండల ప్రజలు పట్టించుకోని పోలీసు ఉన్నతాధికారులునాకెవరూ ఫిర్యాదు చేయలేదు ముండ్లమూరు పోలీసుస్టేషన్పైగానీ, ఏఎస్సైపైగానీ నాకెవరూ ఫిర్యాదు చేయలేదు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరగడం సహజం. వాటిపై కేసులు నమోదు చేసే సమయంలో విచారించడం మామూలే. మా దృష్టిలో ముండ్లమూరు పోలీస్స్టేషన్ పనితీరు బాగానే ఉంది. త్వరలో కొత్త ఎస్సై కూడా వస్తారు. – రామారావు, సీఐ, దర్శి గ్రామాల్లో మద్యం బెల్టు షాపులు నిర్వహించే వారి వద్ద నెల మామూళ్లు వసూళ్లు చేసి మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారని కూడా ఏఎస్సైపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులే బెల్టు షాపులు నిర్వహించాలనే నిబంధనలు అమలుచేస్తూ మద్యం మాఫియాని పెంచిపోషిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పోలీస్స్టేషన్లో అంతా తానై వ్యవహరిస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆ స్టేషన్కు ఎస్సై రాకుండా మేనేజ్ చేస్తూ వస్తున్నారని ఏఎస్సైపై బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నప్పటికీ.. పోలీసు ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంలో మతలబు ఏమిటో అర్థంకావడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. స్టేషన్కు కొత్త ఎస్సైని నియమించి ఏఎస్సై ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుంటున్నారు. -
పోలవరం డొంకకు సర్వేతో అభివృద్ధి
అద్దంకి: ఆక్రమణలకు గురై, పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బంది పడుతున్న పోలవరం డొంకను కలెక్టర్ రాజాబాబు శనివారం పరిశీలించారు. పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని తిమ్మాయపాలెంలో కలెక్టర్ రెండో రోజు ఉదయం గ్రామస్తులు అర్జీలు అందజేసిన సమస్యల ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులందరికీ ఉపయోగకరమైన డొంకను వెంటనే సర్వే చేసి అభివృద్ధి చేయాలని సర్వేయర్, సంబంధిత అధికారులను ఆయన అదేశించారు. గ్రావెల్ తోలి తామే అభివృద్ధి చేసుకుంటామని గ్రామస్తులు కలెక్టర్తో చెప్పారు. తొలుత గ్రామంలోని చెత్త సంపద నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి ఆదాయం వచ్చేలా నిర్వహణ కేంద్రం పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం తిమ్మాయపాలెం రక్షిత నీటి పథకాన్ని, ఎత్తిపోతల పథకాన్ని సందర్శించి సంబంధిత పథకాల వివరాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో కలసి మొక్కలు నాటారు. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించి, నీటిని క్లోరినేషన్ చేస్తున్న విధానంపై కలెక్టర్ ఆరా తీశారు. రాష్ట్రీయ గోకుల మిషన్ కింద ఏర్పాటు చేసిన లేగదూడల ప్రదర్శనను కలెక్టర్ తిలకించారు. ఎస్సీ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించి, శ్మశాన వాటిక స్థలానికి ప్రహరీ కట్టించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎస్సీ కాలనీని సందర్శించి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరుగుతున్న తీరును పరిశీలించారు. గ్రామంలో చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియ విధానాన్ని పరిశీలించడంతో పాటు ఎంత శాతం ప్రక్రియ పూర్తి చేశారు, ఏ విధంగా చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అత్యంత పారదర్శకత, నాణ్యత ఉండాలని, నిబంధనల ప్రకారం మ్యాపింగ్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి, మండల రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
73 పొగాకు బేళ్లు తిరస్కరణ
కొండపి: స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో 73 బేళ్లు తిరస్కరణకు గురైనట్లు వేలం కేంద్ర నిర్వహణాధికారి ఎం.శంకర్ రావు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని పచ్చవ గ్రామానికి చెందిన రైతులు 293 బేళ్లను వేలానికి తీసుకురాగా 220 బేళ్లను కొనుగోలు చేసి 173 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.180, సరాసరి ధర రూ.223.31గా నమోదైంది. వేలంలో 10 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి కొనుగోలు చేస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి పోతున్నామని వాపోతున్నారు. వేలానికి తీసుకువచ్చే బేళ్లను సగటు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. గరిష్ట ధర రూ.300 తగ్గకుండా కొనుగోలు చేస్తేనే నష్టాలు కొంత మేర తగ్గించుకొని అప్పులు లేకుంటా ఉంటామని రైతులు పేర్కొంటున్నారు. టంగుటూరు: స్థానిక పొగాకు వేలం కేంద్రం పరిధిలో శనివారం జరిగిన వేలంలో 525 పొగాకు బేళ్లు కొనుగోలు చేశారు. టంగుటూరు, చిర్రికూరపాడు, పంగులూరివారిపాలెం గ్రామాల రైతులు 698 బేళ్లను వేలానికి తీసుకురాగా 525 బేళ్లను కొనుగోలు చేసి 173 బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.180, సరాసరి ధర రూ.223.16గా నమోదైంది. వేలంలో 9 మంది వ్యాపారులు పాల్గొన్నారు. -
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ (సివిల్ సప్లయీస్) హమాలీల సమస్యలు పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ బియ్యం గోడౌన్లలో పనిచేస్తున్న హమాలీలు శనివారం సంతపేటలోని సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ ఉమ్మడి ప్రకాశం జిల్లా అసిస్టెంట్ మేనేజర్ ఉషారాణికి ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల సంస్థ హమాలీల యూనియన్ ప్రకాశం జిల్లా కమిటీ (సీఐటీయూ) సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన సమస్యల్లో ప్రతినెలా మొదటి వారంలో బిల్లు చెల్లించాలన్నారు. డీలర్లకు తోలే సరుకుల బిల్లులు స్టేజ్ వన్ పద్ధతుల్లోనే హమాలీల ఖాతాలకు ప్రతినెలా మొదటి వారంలోనే వేయాలని కోరారు. స్కూళ్లకు తోలే సరుకులు డీలర్ల దగ్గర తోలే విధంగానే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సంస్థలో పనిచేసే హమాలీలు అందరికీ సీపీఎఫ్ నంబర్లు ఇచ్చి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయాలని, జనవరి ఒకటో తేదీ నుంచి వేతన ఒప్పంద కాల పరిమితి అయిపోయిందని, కూలి రేట్లు పెంచి బకాయిలతో సహా చెల్లించాలని కోరారు. చనిపోయిన, రిటైర్ అయిన, మానుకున్న వారి పీఎఫ్ క్లెయిమ్లు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత స్టాక్ పాయింట్ పరిధిలో ఉన్న రేషన్ షాపులను మార్పులు చేసేలా మానుకోవాలని, ఏ స్టాక్ పాయింట్ పరిధిలో ఉన్న మండలాలు ఆ పరిధిలోనే కొనసాగించాలని మార్పులు, చేర్పులు చేసి కార్మికులకు నష్టం చేకూర్చే చర్యలు చేపట్టవద్దని చెప్పారు. రేషన్ షాపులకు సరుకులు ప్రతినెలా 20వ తేదీ నుంచి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ గిడ్డంగుల్ని నిర్మించాలని, ఉన్న గిడ్డంగులని ఉపయోగించుకోవాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్ లో సమ్మెకు సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, హమాలీల యూనియన్ జిల్లా అధ్యక్షుడు బిందె ఆంజనేయులు, ఓ ప్రసాదరావు, సునీల్, వెంకటరావు, నాగార్జున, వెంకటయ్య, నాగిరెడ్డి, అడకా నాగరాజు, ఓరుగుంట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో వసతులపై దృష్టి పెట్టాలి
● అధికారులతో కలెక్టర్ రాజాబాబు సమీక్ష ఒంగోలు సబర్బన్: జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో టాయిలెట్లు, తాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పనపై తక్షణమే దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. శనివారం ఆయన అధ్యక్షతన ప్రకాశం భవనంలో జిల్లాస్థాయి తాగునీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. జలజీవన్ మిషన్ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. జల జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలో తాగునీరు, టాయిలెట్లు, ఇతర పారిశుధ్య సదుపాయాలపై ప్రత్యేకంగా చర్చించారు. మరమ్మతులు, ఇతర నిర్వహణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామ పంచాయతీ, సీఎస్ఆర్ నిధులతో పాటు దాతల సహాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డీపీఓ వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ నారాయణ, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో చిరంజీవి, ఏపీసీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈవో రేణుక, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
ఆగడాలు ఆగేనా.. ముండ్లమూరు ఎస్సై రెండు నెలలుగా లేరు. దీంతో అక్కడున్న ఏఎస్సై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్లో ప్రైవేటు పంచాయితీలు, దందాలు చేస్తున్నారు.రెండో టన్నెల్లో టీబీఎం మిషన్ తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ ప్రక్రియను వెలుగొండ ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులు 7 గ్యాండ్రిల్గా విభజించారు. ఒక గ్యాండ్రిల్ మాత్రమే ఇప్పటి వరకూ తొలగించగలిగారు. ఈ ప్రక్రియ పూర్తికావాలంటే రెండు, మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. టీబీఎం 9.8 మీటర్ల వ్యాసార్థంతో 176 మీటర్ల పొడవు ఉంది. ఇది టన్నెల్ లోపల 11.85 కిలోమీటర్ల వద్ద ఉంది. ముక్కలు ముక్కలుగా చేసి బయటకు తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇందుకోసం పెద్దఎత్తున టన్నెల్ లోపలికి టిప్పర్లను పంపి దోర్నాల మండలం కొత్తూరు వైపు నుంచి బయటకు తెస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే రెండో టన్నెల్ ద్వారా నీళ్లు బయటకు వస్తాయి. ఇటు టీబీఎం పనులు పూర్తికాక.. అటు పరిహారానికి నిధులు ఇవ్వకుండా వెలుగొండకు నీళ్లు ఎలా ఇస్తారో.. కూటమి పెద్దలకే తెలియాలని పశ్చిమ ప్రకాశం ప్రజలు నిట్టూరుస్తున్నారు.మూడు జిల్లాల ప్రజల కలల ప్రాజెక్టు పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు ఇప్పట్లో మోక్షం లభించేలా కనిపించడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం విదులుస్తున్న అత్తెసరు నిధులతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. నీళ్లు ఇచ్చే తేదీలు మారుతున్నాయి కానీ ఇప్పట్లో కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు లేనట్టేనని నిట్టూర్పులు సర్వత్రా వినిపిస్తున్నాయి. మంత్రి రామానాయుడు హడావుడి పర్యటనలతో ఓనగూడింది ఏమీలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీబీఎం మిషన్ తొలగింపు పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఇంత వరకూ నిర్వాసితులకు పరిహారం ఊసేలేదు. ఇవన్నీ చూస్తుంటే పాలకులు ప్రకటిస్తున్న సమయానికి వెలుగొండ నీరు పారేది ప్రశ్నార్థకంగా మారింది. నిధులు పారక..వెలుగొండ సాగక..! -
జాతిపిత విగ్రహానికి అడ్డుగా టీడీపీ ఫ్లెక్సీ
కొండపి: జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి అడ్డుగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీ కట్టి ప్రజలకు ఆ మహానుబావుని విగ్రహం కనిపించకుండా చేసిన సంఘటన మండలంలోని నేతివారిపాలెంలో చోటుచేసుకుంది. అందిన వివరాల ప్రకారం.. గతంలో ఇప్పుడు ఉన్న గాంధీ విగ్రహానికి పక్కనే మరో గాంధీ విగ్రహాన్ని చాలా సంవత్సరాల క్రితం ప్రతిష్టించారు. ఇప్పుడు పాత విగ్రహం ఉన్న స్థలంలో టీడీపీ నాయకుల విగ్రహాలు పెట్టాలన్న ఉద్దేశంతో పాత గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆ స్థలంలో పనులు ప్రారంభించారు. నూతనంగా పక్కనే రచ్చబండ ఉన్న ప్రదేశంలో గాంధీ విగ్రహాన్ని కొన్ని నెలల క్రితం ప్రతిష్టించారు. మహానాడు సందర్భంగా నేతివారిపాలెంలోని టీడీపీ నేతలు ఆ రచ్చబండ ప్రదేశంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీ ప్రజలకు గాంధీ విగ్రహాన్ని కనబడకుండా చేసింది. కొన్ని రోజులుగా అలానే ఉన్న పంచాయతీ సెక్రటరీ, ఇతర అధికారులు గాంధీ విగ్రహానికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీని తొలగించడానికి సాహసం కూడా చేయలేదు. -
జ్ఞానప్రకాశ్ శిక్షణ పరిశీలించిన డీఈఓ
ఒంగోలు సిటీ: స్థానిక సీపీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జ్ఞానప్రకాశ్ 6 రోజుల ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) శిక్షణ కార్యక్రమాన్ని శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి డీఈఓ రేణుక మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాల అభివృద్ధికి ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. అలాగే మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, వినూత్న కార్యక్రమాలను తల్లిదండ్రులకు తెలియజేసి మరింత మంది విద్యార్థులను ఆకర్షించాలని సూచించారు. ప్రస్తుత శిక్షణలో నేర్చుకున్న అంశాలను తరగతి గదిలో సమర్థవంతంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థుల మరలింపునకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కోర్స్ డైరెక్టర్ డి.వెంకారెడ్డి, మద్దిపాడు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు, జరుగుమల్లి మండల విద్యాశాఖ అధికారి నాగేంద్రవదన్, ఎస్ఆర్పీలు, డీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి
సింగరాయకొండ: పాతసింగరాయకొండ వరాహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈనెల 24వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆలయ ఈఓ పి.కృష్ణవేణి అన్నారు. ఆలయ ఆవరణలో శనివారం దేవస్థాన అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రధానంగా పోలీసు శాఖ ప్రధానపాత్ర పోషించాలన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన తాగునీరు, బయో టాయ్లెట్స్, దర్శనం ఏర్పాట్లు సజావుగా జరిగేటట్లు జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. సీఐ పి.శ్రీహరి, తహశీల్దార్ రాజేష్, ఎంపీడీఓ డి.జయమణి, ఎస్సై ఎల్ సుధీర్కుమార్, డాక్టర్ వంశీధర్, డాక్టర్ హజరత్, విద్యుత్శాఖ ఏఈ సాంబశివరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమేష్, ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు, వీఆర్ఓ సింహాద్రి, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఏబీసీలో పడి యువకుడు మృతి
బల్లికురవ: ప్రమాదవశాత్తూ అద్దంకి బ్రాంచ్ కెనాల్ (ఏబీసీ)లో పడి ఈత రాక ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం బల్లికురవ మండలంలోని ముక్తేశ్వరం పంచాయతీలో సూరేపల్లి గ్రామ సమీపంలో జరిగింది. సూరేపల్లికి చెందిన రావులపల్లి శ్రీనివాసరావు, రాగమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు వంశీ (23) గ్రామ సమీపంలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్ పవర్ ప్లాంట్ వద్ద నీటి ప్రవాహ ఉధృతిని పరిశీలించేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తూ కాలు జారి కాలువలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చనిపోయి ఉండటంతో బయటకు తీశారు. మృతుడు అవివాహితుడు కాగా, చేతికందివచ్చిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు భోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
మార్జిన్లోకి దిగితే.. బూడిదే..!
టంగుటూరు: వాహనదారులు, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలన్నా.. రవాణా వ్యవస్థ సక్రమంగా సాగాలన్నా రహదారులు ఎంతో కీలకం. అలాంటి రహదారుల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది. రోడ్ల నిర్మాణం అంటేనే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అందుకే.. ఒకసారి నిర్మిస్తే పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడేలా చూడాలి. కానీ, కోట్లు ఖర్చు చేసి నిర్మించిన రోడ్లు కూడా కొందరి అలసత్వం కారణంగా ప్రజలకు సౌకర్యం కలిగించకపోగా.. అసౌకర్యం కలిగిస్తున్నాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుతో వెళ్లినా ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అలాంటి పరిస్థితులే టంగుటూరు మండల కేంద్రంలో నెలకొన్నాయి. స్థానిక బైపాస్ నుంచి పట్టణంలోని సెంటర్ వరకు సుమారు 6 కోట్ల 39 లక్షల రూపాయలతో ఇటీవల సిమెంట్ రోడ్డు నిర్మించారు. కొండపి – టంగుటూరుకు ప్రధాన రహదారి అయినప్పటికీ ఈ రోడ్డు మార్జిన్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ కక్కుర్తి పడి మార్జిన్లను మరీ అధ్వానంగా నిర్మిస్తున్నాడు. ఎందుకూ పనికిరాని బూడిద కలిసిన బురద మట్టిని రోడ్డు మార్జిన్లకు తోలుతున్నాడు. దానివలన మార్జిన్లోకి వాహనం దిగితే టైర్లు దిగబడి అదుపుతప్పి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వచ్చేది వర్షాకాలం కావడంతో మార్జిన్లకు వాడిన బూడిద, మట్టి కరిగిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. నిత్యం వందల వాహనాలు, వేల మంది ప్రయాణికులు, రైతులు తిరిగే రోడ్డు మార్జిన్లను ఇంత అధ్వానంగా నిర్మిస్తుండటంపై ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. కాంట్రాక్టర్, అధికారులు కుమ్మకై ్క మార్జిన్లను దారుణంగా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులైనా స్పందించి సిమెంట్ రోడ్డు మార్జిన్లను నాణ్యంగా నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026
మార్జిన్లోకి దిగితే బూడిదే.. టంగుటూరులో రూ.6.39 కోట్లతో నిర్మించిన సిమెంటు రోడ్డు మార్జిన్లను కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మిస్తున్నారు. సరిహద్దులు చెరిపేశారు.. డివిజన్లను చెల్లాచెదురు చేసేశారు.. డివిజన్ల ఏర్పాటులో పారదర్శకత లోపించింది. ఒంగోలు నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అంతా అడ్డగోలుగా సాగింది. నిబంధనల ప్రకారం పునర్విభజన ప్రక్రియ సాగితే ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించిన కూటమి నేతలు కుట్రలకు తెరతీశారు. అధికారులతో నిబంధనలు గాలికొదిలేసి విభజనకు శ్రీకారం చుట్టారు. అంతా అశాసీ్త్రయంగా సాగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో నగర వాసులతో పాటు తాజామాజీ కార్పొరేటర్లు న్యాయం కోసం హైకోర్టు మెట్లెక్కారు. విచారణ జరిపిన కోర్టు.. ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో దొడ్డిదారిలో విజయం సాధించాలన్న టీడీపీ, జనసేన కుట్రలు భగ్నమయ్యాయి. నగరపాలక సంస్థలో అధికార పార్టీ విజయమే లక్ష్యంగా జరుగుతున్న పునర్విభజన ప్రక్రియపై మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్ఖాన్ అధికారులకు తన అభ్యంతరం తెలిపారు. అయినప్పటికీ అధికారుల నుంచి తగిన స్పందన లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, అది పూర్తికాకముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వలన బీసీలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2027 జనగణన నిబంధనల ప్రకారం 31.12.2025లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 1.1.2026 నుంచి 1.4.2027 వరకు జనగణన నేపథ్యంలో మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందని కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ వార్డుల విభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో ఉన్నత న్యాయస్థానం డీ లిమిటేషన్ ప్రక్రియపై తాత్కాలిక స్టే విధించింది. -
గృహాల నిర్మాణాలు సత్వరం పూర్తి చేయాలి
ఒంగోలు వన్టౌన్: జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన నిర్దేశించిన గృహాల నిర్మాణాలను సెప్టెంబర్లోపు పూర్తి చేయాలని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ పీ అరుణ్ బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాకు వచ్చిన ఆయన శుక్రవారం జిల్లా హౌసింగ్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖలో పని చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గృహ నిర్మాణ లక్ష్యాలు, సాధించిన పురోగతి, పీపీపీ పీఎంఏవై–యు 2.0 కార్యక్రమాల అమలు పురోగతిపై విపులంగా సమీక్ష నిర్వహించారు. నిర్ణీత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని, పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఎండీ పలు సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లాలో బేస్మెంట్ స్థాయిలో 4,814 ఇళ్లు, లింటెల్ స్థాయిలో 716 ఇళ్లు, రూఫ్ స్థాయిలో 1,333 ఇళ్లు మొత్తం 6,863 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నట్లు వివరించారు. ఈ ఇళ్లన్నింటినీ సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా, ఆగస్టు 2026 నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన 3,997 ఇళ్లను జిల్లా లక్ష్యంగా నిర్దేశించినందున, వాటిని కూడా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. అదే విధంగా గృహ నిర్మాణ కార్యక్రమాల అమలులో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పెరుగు శ్రీనివాస ప్రసాద్, ప్రకాశం జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, అసిస్టెంట్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి అన్నారు. విద్యుత్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటానికై నా వెనకాడేది లేదన్నారు. మూడో ఏపీ సీపీడీసీఎల్ డిస్కం జనరల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఒంగోలులో నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్కం నూతన కమిటీని ఎన్నుకున్నారు. డిస్కం అధ్యక్షుడుగా రాచగర్ల సంజీవరావు, డిస్కం కార్యదర్శిగా నందిగామ శర్మ, డిస్కం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బొర్రా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గణపతి మాట్లాడుతూ యూనియన్ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. నూతనంగా ఎన్నికై న డిస్కం అధ్యక్షుడు రాచగర్ల సంజీవరావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి డిస్కం అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. యూనియన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల సమస్యలపట్ల అనునిత్యం యాజమాన్యంతో పోరాడదామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ను మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి వీఎస్ఆర్కే ఎన్నికల అధికారిగా నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు వి.దేవేందర్ రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆర్.సంజీవరావు, అదనపు ప్రధాన కార్యదర్శులు ఎన్.శ్రీనివాసరావు, మల్లేశ్వర రెడ్డి తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. -
చెరువు ఆక్రమణలు తొలగించండి
అద్దంకి: గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో ఆక్రమణలు తొలగించి ప్రహరీ నిర్మించాలని, శివాలయం పక్కనే ఉన్న చెరువులో ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయాలని కలెక్టర్ రాజాబాబుకు తిమ్మాయపాలెం గ్రామస్తులు అర్జీ సమర్పించారు. అదే విధంగా గ్రామం నుంచి పోలవరం వెళ్లే చారిత్రక డొంక ఆక్రమణలు తొలగించి, రహదారి నిర్మాణం చేయాలని కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. గ్రామంలో కొన్ని డ్వాక్రా సంఘాలు కలిపి ఒక కుటీర పరిశ్రమను పెట్టుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. శుక్రవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ రాజాబాబు మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని బొడ్డురాయి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులతో, యువతతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందుతున్న తీరుపై ఆరా తీశారు. గ్రామ సమస్యలపై దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం గ్రామస్తుల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. పిల్లలను ప్రభుత్వ బడులకు పంపించాలని, డ్వాక్రా రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహిళలకు సూచించారు. రామాయపాలెంలోని తన భూమిని ఆన్లైన్ చేయించాలని, తిమ్మాయపాలెంలో తన పొలం పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన బట్టీని తొలగించాలని ఓ రైతు అర్జీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, అద్దంకి ఆర్డీవో విజయ జ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డీపీవో వెంకటేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ఎండిపోయిన లక్ష్యం..!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టర్ల నుంచి మండల స్థాయి అధికారులు, సిబ్బంది వరకూ మొక్కలు నాటారు. ప్రజలంతా మొక్కలు నాటి పెంచాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. కానీ, క్షేత్రస్థాయిలో వారి పనితీరు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రోడ్ల డివైడర్లపై నాటిన మొక్కలను గమనిస్తే ఆ విషయం అర్థమవుతోంది. నగరపాలక సంస్థ పర్యవేక్షించాల్సిన మొక్కలకే దిక్కు లేకుండా పోయింది. డివైడర్లపై నాటిన మొక్కలకు నీరు పోసి పర్యవేక్షించే వారు లేక ఎండిపోయాయి. ప్రభుత్వం, అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని, మొక్కుబడి పనులను వెక్కిరిస్తున్నాయి. వీరందరి నిర్లక్ష్యంతో ప్రభుత్వాల లక్ష్యం నీరుగారిపోయిందంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. – సాక్షి, ఒంగోలు -
రెండేళ్ల రాక్షస పాలనపై విసిగిన ప్రజలు
యర్రగొండపాలెం: చంద్రబాబు నాయకత్వంలో రెండేళ్లుగా కొనసాగుతున్న రాక్షస పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, కూటమి నాయకుల పతనానికి సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాల్లో కదంతొక్కిన ప్రజలను చూస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందని, దుర్మార్గపు పాలనలో రాష్ట్రం అతలాకుతలమవుతోందని అన్నారు. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సక్రమంగా అమలుచేయలేకపోయారని, సంపద సృష్టి అంటూ కూటమి నాయకుల సంపాదనకు బాటలు వేశారని విమర్శించారు. రేషన్ బియ్యం, మట్టి, ఇసుక పోటాపోటీగా అక్రమంగా రవాణాచేస్తూ కోట్లాది రూపాయలు దాచేసుకుంటున్నారని అన్నారు. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడంలో టీడీపీ నాయకులు ఆరితేరి ఉన్నారని, ఆ ప్రాంతం రైతుల భూములు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో అమలు చేసిన నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని అన్నివర్గాలకు చెందిన పేదలు ఆనందంగా ఉన్నారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రెండేళ్లపాటు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని, త్వరలో జరిగే స్థానిక సంస్ధల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తారని అన్నారు. 8న సర్పై బీఎల్ఏలతో సమావేశం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై ఈ నెల 8వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బూత్లెవెల్ ఏజెంట్ (బీఎల్ఏ)లతో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిషన్ పెట్టిన ప్రభుత్వ ఉద్యోగితో బీఎల్ఏలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేస్తామని, బోగస్ ఓటర్ల పేరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగించకుండా చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఇండోర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ మీటింగ్లో చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, రైతులకు చేసిన మోసాలపై చర్చిస్తారని, రెండేళ్ల రాక్షస పాలనకు నిరసనగా నల్లబెలూన్లు ఎగురవేసే కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ఒంగోలు సబర్బన్: పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రకాశం భవనంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్.. ప్రకాశం భవనం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కలెక్టర్ సంతకం చేశారు. అనంతరం ప్రకాశం భవనం నుంచి మినీ స్టేడియం వరకు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అవకాశం ఉన్నంత వరకు నడక, ప్రజా రవాణా వ్యవస్థ, కలిసి ఒకే వాహనంలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ మాధురి, డీఎఫ్ఓ వినోద్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ విజయ్ మోహన్, ఒంగోలు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామ్భూపాల్రెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వైష్ణవి, ఇతర అధికారులు, వావ్, ఐటీసీ, సార్డ్స్ స్వచ్ఛంద సంస్థలు, భగీరథ కెమికల్స్, మున్నంగి సీ ఫుడ్స్, జేసీ బయోటిక్స్ పరిశ్రమల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. హరితాంధ్రప్రదేశ్ సాధనగా ముందుకు సాగాలి : మార్కాపురం కలెక్టర్ విజయ సునీత మార్కాపురం టౌన్: పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములై హరితాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కృషి చేయాలని మార్కాపురం కలెక్టర్ ఎం.విజయ సునీత పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కాపురంలోని కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం – తర్లుపాడు మెయిన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు జేసీ పి.శ్రీనివాసులు, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డితో కలిసి సైకిల్పై వచ్చి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలన్నారు. పర్యావరణాన్ని భావితరాలకు ఆస్తిగా అందించాలన్నారు. భూ, జల, వాయు కాలుష్యంతో మానవాళికి ముప్పు వాటిల్లుతోందన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి కాలుష్య రహిత సమాజానికి పాటుపడాలన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ శివరామిరెడ్డి, డీఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్, అటవీశాఖ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలకు ప్రకాశం కలెక్టర్ రాజాబాబు పిలుపు -
జూన్ 8న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపిక
సంతనూతలపాడు(చీమకుర్తి రూరల్): ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన సంతనూతలపాడు మండలం మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమణారెడ్డి, సుందర రామిరెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పదో తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికెట్)తో అదే రోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని కోరారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 01011992 తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాలకు తిరుమలశెట్టి రవికుమార్, పీఈటీ మైనంపాడు మొబైల్ నంబర్ 9951578357 ను సంప్రదించాలని కోరారు. ఒంగోలు: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఒకటో అదనపు జిల్లా న్యాయయూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ తాత్కాలిక చైర్పర్సన్ టి.రాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక జిల్లా న్యాయస్థానాల సముదాయం ఆవరణలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రకృతిపరమైన అనేక అనర్థాలకు పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడమే కారణమన్నారు. ఈ ఏడాది వేసవికాలం ప్రత్యక్షంగా ప్రజలు అనుభవిస్తున్న అధిక ఎండలు కూడా పర్యావరణం మీద మనం చూపించే నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం పర్యవేక్షించి చెట్లుగా పెరిగేలా పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ తాత్కాలిక కార్యదర్శి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వి.పల్లవి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒంగోలు సిటీ: ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో నీటి కుంటలో మునిగి చనిపోయిన నలుగురు చిన్నారుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు డిమాండ్ చేశారు. ఒంగోలు రిమ్స్ మార్చురీ వద్ద బాధిత కుటుంబాల సభ్యులను సీపీఎం జిల్లా కమిటీ నేతలు పరామర్శించారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన తండ్రి కరేటి కళ్యాణ్ చక్రవర్తి, మృతి చెందిన ఇల్లా దినేష్ తల్లి లక్ష్మిని ఓదార్చి మనోధైర్యంతో ఉండాలని కోరారు. చిన్నారుల మృతి పట్ల సంతాపం ప్రకటించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు మాట్లాడుతూ నీటి కుంటలో పడి నలుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకర విషయమన్నారు. చెరువుకొమ్ముపాలెంలో మట్టి అక్రమ తవ్వకాలు జరిగి కుంటలోకి నీరు చేరిందని, లోతు తెలియని చిన్నారులు అందులోకి దిగి మరణించారన్నారు. గనులు, భూగర్భ జల శాఖ అక్రమ తవ్వకాలను నివారించుంటే ఇటువంటి ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. చెరువుకొమ్ముపాలెంలో అక్రమ మట్టి తవ్వకాలు అరికట్టేందుకు గనుల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మరణించిన నలుగురు చిన్నారుల కుటుంబాలను ఆదుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఎం ఒంగోలు నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు బీ రఘురాం పాల్గొన్నారు. -
విద్యుత్ శ్రామిక రక్షణ భవనం ప్రారంభం
ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ప్రకాశం ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ‘‘విద్యుత్ శ్రామిక రక్షణ భవనం’’ను శుక్రవారం ప్రారంభించారు. పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయం వెనుక తూర్పు వైపున ఉన్న అన్నవరప్పాడు కాలనీ 4వ లైన్లో నిర్మించిన ఈ స్వంత భవనాన్ని రాష్ట్ర అధ్యక్షుడు వి.దేవేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణపతి వీఎస్ఆర్కే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, సభ్యుల సహకారంతో నిర్మించిన ఈ భవనం ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రబిందువుగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో యూనియన్ కార్యకలాపాలకు ఈ భవనం మరింత బలోపేతంగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అతిథులుగా ఆర్.సంజీవరావు, ఎ.శ్రీనివాసరావు, వై.మల్లేశ్వర రెడ్డి, యన్.శర్మ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు, కార్యకర్తలు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. -
ముగిసిన చిన్నారుల అంత్యక్రియలు
ఒంగోలు టౌన్: స్థానిక చెరువుకొమ్ముపాలెంలోని కందులూరు కుంటలో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయిన స్థానికులైన నలుగురు చిన్నారుల అంత్యక్రియలు శుక్రవారం ముగిసాయి. ఒంగోలు జీజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం చిన్నారులు కరేటి అభిరామ్, సుశాంత్, పొదిలి చిన్ను, దినేష్ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. నలుగురి మృతదేహాలను అంబులెన్సులో గ్రామానికి తరలించారు. చిన్నారుల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బోరున విలపించారు. గ్రామంలో ఎటుచూసినా విషాద వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చిన్నారులకు అంత్యక్రియలు నిర్వహించారు. చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఒంగోలు: చెక్బౌన్స్ కేసులో నిందితుడు ఎస్.రత్నరాజుకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ స్థానిక ప్రత్యేక మొబైల్ కోర్టు న్యాయమూర్తి వి.వెంకటేశ్వరరావు శుక్రవారం తీర్పు చెప్పారు. 2015 జనవరి 22న ఫిర్యాది ఆనంద్కుమార్ వద్ద నిందితుడు తన కుటుంబ అవసరాల కోసం రూ.4 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోవడంతో ఆనంద్కుమార్ కోర్టును ఆశ్రయించాడు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం నిందితునిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ఏడాది జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఫిర్యాదికి రూ.5.90 లక్షల నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కొమరోలు (బేస్తవారిపేట): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి కొమరోలు మండలంలోని బాదినేనిపల్లె సమీపంలో చోటుచేసుకుంది. బాదినేనిపల్లెకు చెందిన ఎర్రి మధు (25) వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కనుమల గ్రామంలో అత్తగారింట్లో ఉన్న భార్యాపిల్లలను చూసేందుకు వెళ్లాడు. అతనికి ఐదు రోజుల క్రితమే కుమారుడు జన్మించాడు. కనుమల నుంచి తిరిగి బాదినేనిపల్లెకు మోటారు సైకిల్పై వస్తూ ఆ గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై అదుపుతప్పి పైనుంచి కింద ఉన్న పులివాగులో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం ఉదయం వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ప్రమీల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగరాయకొండ: చేపల వేట చేస్తూ మత్స్యకారుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం ఉదయం సింగరాయకొండ మండలంలోని పాకల పల్లెపాలెం సమీపంలో సముద్రం వద్ద గల పగురులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక మత్స్యకారుడు పిన్ని వెంకటేశ్వర్లు (60) కూర కోసం తెప్పలో సముద్రానికి సమీపంలోని పగురులో చేపల వేట చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాళ్లకు వల చుట్టుకుంది. దీంతో నీటిలో పడి చనిపోయాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్కుమార్ తెలిపారు. పెద్దదోర్నాల: శ్రీశైలం ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద శుక్రవారం పోలీసులు కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేశారు. గతంలో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్ మాయం కావడంపై శుక్రవారం సాక్షి దినపత్రిక జిల్లా పేజీలో ‘కాన్వెక్స్ మిర్రర్లు మాయం’ అనే శీర్షికతో ఫొటో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి స్పందించిన యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, ఎస్సై వెంకట రమణయ్యలు హుటాహుటిన పెద్దమూల టర్నింగ్లో ఆకతాయిలు మాయం చేసిన కాన్వెక్స్ మిర్రర్ స్థానంలో కొత్త కాన్వెక్స్ మిర్రర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించి యాత్రికుల రక్షణ కోసం ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్లు ఎంతో ముఖ్యమైనవని, వాటిని తొలగించడం చట్టరీత్యా నేరమని అన్నారు. -
మిస్టరీ వీడని దంపతుల అదృశ్యం కేసు
యర్రగొండపాలెం: దంపతుల అదృశ్యం కేసులో ఇంకా చిక్కుముడి వీడలేదు. పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నా వారి ఆచూకీ తెలియడం లేదు. స్థానిక కొలుకుల రోడ్డులో నివాసం ఉంటున్న గోపిదేశి వెంకట లక్ష్మీనారాయణ, పద్మ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ 27వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. వారు తమ బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని బంధువులంతా భావించారు. గత నెలలో గుంటూరులోని ఒక లాడ్జి నుంచి వారి ఫోన్ ద్వారా కుమారుడు రఘుకు కాల్ వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన దంపతులు రెండు రోజుల తర్వాత గుంటూరులోని లాడ్జికి వెళ్లారని, అక్కడ తమ వెంట తీసుకెళ్లిన బట్టల సంచి, రెండు ఫోన్లు అక్కడే వదిలేసి ఎటో వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. వారికి ఇద్దరు వివాహిత కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రఘునాథ్ హైదరాబాద్లో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాడని, పెద్ద కుమార్తె భర్తతో కలహాలతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కుటుంబంలో ఉన్న సమస్యలతోనే వారు ఇంటి నుంచి వెళ్లి పోయి ఉంటారని భావిస్తున్నారు. దాదాపు 40 రోజులుగా దంపతులు కనిపించకుండా పోవడమే కాకుండా వారి గురించి తగు సమాచారం తెలియక పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఒక కానిస్టేబుల్ను కేటాయించి దర్యాప్తు జరిపిస్తున్నట్లు ఎస్సై దేవకుమార్ తెలిపారు. అదృశ్యమైన లక్ష్మీనారాయణ, పద్మ దంపతుల ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు -
9న ధరల పెంపుపై రాస్తారోకో
మార్కాపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయని, ఫలితంగా నిత్యవసరాలన్నీ ప్రజలకు భారంగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి దగ్గుపాటి సోమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పేర్కొన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఎం కార్యాలయంలో వామపక్షాలు సంయుక్తంగా ఫాంప్లేట్ను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా సోమయ్య, ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ.. తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరా చేస్తామని కొన్ని దేశాలు భారతదేశానికి అవకాశం ఇచ్చినా మోదీ ఉపయోగించుకోలేకపోతున్నారన్నారు. అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని బూచిగా చూపి దేశ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని మండిపడ్డారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పొదుపు మాత్రం జపిస్తోందని ఎద్దేవా చేశారు. చౌకగా చమురు అందుబాటులో ఉన్నా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ హయాంలో ధరలన్నీ రెట్టింపు అయ్యాయన్నారు. పెరిగిన ధరలకు తోడు రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు పన్నులు విధించడంతో మరింత భారంగా మారిందన్నారు. నిత్యావసరాలే కాకుండా రైతులకు అవసరమైన ఎరువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ ప్రజలను సమీకరిస్తామని హెచ్చరించారు. ధరలు తగ్గించేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని చెప్పారు. కమ్యూనిస్టు నాయకులు డీకేఎం రఫీ, షేక్ ఖాశిం, గుమ్మా బాలనాగయ్య, పొదిలి మల్లికార్జున, ఏనుగుల సురేష్ కుమార్, వందన్ కుమార్, కె.వి కృష్ణ గౌడ్, జేవీవీ నాయకులు ఏనుగుల రవికుమార్, గాలి కాశిరెడ్డి, పాల్గొన్నారు. సీపీఐ, సీపీఎం నాయకుల వెల్లడి పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు తగ్గించాలని డిమాండ్ -
గుండె చెమ్మ!
చెరువుకొమ్మ.. పిల్లల నవ్వులు.. సందడితో కళకళలాడిన ఆ ఇళ్లు ఇప్పుడు కన్నీటి వాకిళ్లుగా మారాయి. తమ బిడ్డలు బాగా చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని కన్న కలలు కళ్లముందే కూలిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు ప్రతీ హృదయాన్ని కదిలిస్తున్నాయి. భర్తను కోల్పోయి.. కొడుకే జీవనాధారంగా బతికిన ఓ తల్లి, ఇద్దరు కుమారులే లోకంగా భావించిన మరో దంపతులు, పేదరికంతో పోరాడుతూ బిడ్డను చదివించాలనుకున్న ఇంకో కుటుంబం... ఇలా మూడు కుటుంబాల ఆశల దీపాలను కందులూరుకుంట ఒక్కసారిగా ఆర్పేసింది. చెరువుకొమ్ముపాలెం అంతా కన్నీటి సంద్రమైంది. గ్రామ వీధుల్లో నిశ్శబ్దం అలముకుంది. ఎవరిని పలకరించినా కళ్లలో నీళ్లు, గుండెల్లో బాధ మాత్రమే కనిపిస్తోంది. ప్రతి వీధీ ఓ కన్నీటి గాథగా మారింది ఒంగోలు టౌన్: ఒంగోలు నగరపాలక సంస్థలోని చెరువుకొమ్ముపాలేనికి చెందిన కరేటి కళ్యాణ చక్రవర్తి, లక్ష్మీజానకి దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దర్నీ బాగా చదివించాలన్నది భార్యభర్తల లక్ష్యం. కళ్యాణ చక్రవర్తి ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న ఆస్పత్రిలో కాంపౌండర్గా పనిచేస్తూ ఇంటి వద్ద ఆర్ఎంపీగా వైద్యం చేస్తున్నాడు. లక్ష్మీజానకి కూడా ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. పెద్దోడు అభిరామ్ ఈ ఏడాది 8వ తరగతి పూర్తి చేసి 9కి వచ్చాడు. చిన్నోడు సుశాంత్ ఇప్పుడు 7వ తరగతిలో చేరాడు. కష్టపడి సంపాదించి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న వారి తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. గురువారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు నీటమునిగి చనిపోయారు. ఒకే దుర్ఘటనలో ఇద్దరు పిల్లలు చనిపోవడంతో ఆ దంపతులు కోలుకోలేకపోతున్నారు. నిన్నటి దాకా సందడి చేసిన పిల్లలు తిరిగిరాని లోకాలకు తరలివెళ్లడంతో ఆ ఇల్లు బోసిపోయింది. నాడు భర్త.. నేడు కుమారుడు... ఇక పొదిలి నాగరాజది మరో కన్నీటి వ్యథ. కళ్యాణ చక్రవర్తి చెల్లైలెన నాగరాజకు 13 ఏళ్ల క్రితం పొదిలి రవితో వివాహం జరిగింది. వారికి ఒక బాబు పుట్టాడు. సంతోషంగా ఉన్న సమయంలో విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదంలో రవి దుర్మరణం పాలయ్యాడు. ఎన్నో కలలతో అత్తాగారింట అడుగు పెట్టిన నాగరాజ.. బిడ్డతో పుట్టింటికి చేరింది. ఇప్పుడిప్పుడే భర్తను కోల్పోయిన విషాదం నుంచి తేరుకుంటోంది. ఒంగోలులోని ఒక ప్రైవేటు స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కుమారుడు చిన్ను కోసం ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పనికి చేరింది. కందులూరు కుంటలో ఈతకు వెళ్లిన చిన్ను కూడా చనిపోవడంతో ఆమె అల్లాడిపోయింది. అటు భర్తను కోల్పోయి.. ఇటు కుమారుడిని కోల్పోయిన నాగరాజ.. ఇక ఎవరి కోసం తాను బతకాలంటూ రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. పేదింట పెను విషాదం... నిరుపేద యానాది కుటుంబానికి చెందిన ఇల్లా మాలయ్య బేల్దారి పనులకు వెళ్లి భార్యాబిడ్డల్ని పోషించుకుంటున్నాడు. అతనికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు కూడా తండ్రికి తోడుగా పనులకు వెళ్తున్నాడు. సమీపంలోని తుఫాను పునరావాస కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలలో రెండో కుమారుడు దినేష్ ఒకటో తరగతి చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో దినేష్ మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రాణాలు తీసిన మట్టి తవ్వకం... మట్టి తవ్వకం వలనే నలుగురు పిల్లల ప్రాణాలు గాలిలో కలసిపోయాయా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. 15 ఏళ్ల క్రితం హైవే పనుల కోసం మట్టి తరలించేందుకని ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తి 6 ఎకరాల పొలం కొనుగోలు చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా 15 నుంచి 20 అడుగుల లోతు వరకు గుంత తవ్వి మట్టి తరలించాడు. ఆ తర్వాత దాన్ని అలాగే వదిలిపెట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
వృద్ధ దంపతుల దుర్మరణం
సింగరాయకొండ: రోడ్డు క్రాస్ చేసేందుకు ఆగి ఉన్న మోటార్ సైకిల్ను ఓవర్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో వృద్ధ దంపతులు షేక్ అల్లిసాహెబ్ (75), షేక్ నాగూర్బీ (60) దుర్మరణం చెందారు. వారి మనువడికి గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం రాత్రి 10 గంటల సమయంలో మండల పరిధిలోని జాతీయ రహదారిపై విమానాల రన్వేపై వెంకటేశ్వర కళ్యాణ మండపం సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం మంగమూరు గ్రామానికి చెందిన షేక్ అల్లీసాహెబ్, షేక్ నాగూర్బీలు కందుకూరులో తమ బంధువుల వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో మండలంలోని మూలగుంటపాడులో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు తమ మనువడు షేక్ నాగూర్వలితో కలిసి మోటారు సైకిల్పై బయల్దేరారు. రోడ్డు దాటే ప్రయత్నంలో వెంకటేశ్వర కల్యాణ మండపం సమీపంలోకి రాగానే ఒక వైపు రోడ్డు దాటి రోడ్డు మధ్యలో ఆగారు. నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు గమనించి రోడ్డు దాటే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో ఒంగోలు వైపు భారీ లోడ్తో లారీ వెళ్తోంది. ఈ లారీలో సరుకు క్యాబిన్ దాటి వెడల్పు లోడ్తో ఉంది. ఈ క్రమంలో రోడ్డు మధ్యలో ఉన్న వీరిని అదనపు లోడ్ తగలటంతో మోటారు సైకిల్పై నుంచి వృద్ధ దంపతులు ఒకరి తర్వాత ఒకరు కింద పడిపోయారు. వీరిపై లారీ టైర్లు ఎక్కడంతో అక్కడికక్కడే మరణించారు. మనవడు నాగూర్వలీ పక్కకు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో హైవే పెట్రోలింగ్ పోలీసులు గుళ్లాపల్లి టోల్గేట్ సమీపంలో లారీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏఎస్సై శేషారెడ్డి, హైవే పెట్రోలింగ్ పోలీసులు శశిధర్రెడ్డి పర్యవేక్షించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. -
నీళ్లచెమ్మా..
దోచేస్తున్నారమ్మా! చంద్రబాబు చెప్పిన ‘సంపద సృష్టి’ మంత్రాన్ని టీడీపీ చోటా నాయకులు నిరంతరం జపిస్తున్నారు! ‘ఆదాయాన్ని పంచుతా’ అని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన హామీ ఏనాడో అటకెక్కింది. కానీ, పచ్చ నేతల దోపిడీ రెండేళ్లుగా అప్రతిహతంగా సాగుతోంది. ఇసుక, మట్టి, గ్రావెల్, గ్రానైట్, రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులను తమ అవినీతి అక్రమాలకు వనరుగా ఎంచుకున్న పచ్చ ముఠా.. చివరకు మంచినీటినీ వదల్లేదు. మండు వేసవిలో నీళ్లకు ఉన్న డిమాండ్ను తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకునే పనిలో మునిగి తేలుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటి నీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే.. తమకు ధనమే ముఖ్యం అంటూ నదులు, కాలువలు, పట్టా భూముల్లో సైతం పదుల సంఖ్యలో బోర్లు వేసి విద్యుత్ మోటార్లు అమర్చి ట్యాంకర్లకు నీరు నింపుతున్నారు. స్థానిక ఎమ్మెల్యేల అండతో నీళ్ల దందా సాగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మద్దిపాడు మండలం పాతబూరేపల్లి గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది ఒడ్డున బోర్లు వేసి నీటిని ట్యాంకర్లకు నింపుతుండగా, అదే ప్రాంతంలోని పాత అన్నంగి గ్రామ సమీపంలో నేరుగా గుండ్లకమ్మ నదిలోకి పైపులు వేసి మోటార్లతో ట్యాంకర్లు నింపి సొమ్ము చేసుకుంటున్నారు. మద్దిపాడు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం పరిసరాల్లో జాతీయ రహదారికి అతి సమీపంలో ఓ టీడీపీ నాయకుడు కాలువ పక్కన ఉన్న తన భూమిలో బోర్లు వేసి యథేచ్ఛగా ట్యాంకర్లకు నీరు అమ్ముకుంటున్నాడు. ఒంగోలు నగరంలోని వడ్డెపాలెంలో స్థానిక టీడీపీ నాయకుడు పట్టా భూమిలో బోర్లు వేసి ఇంజన్ల సాయంతో ట్యాంకర్లు నింపి సొమ్ము చేసుకుంటున్నాడు. ఒక్కో ట్యాంకర్ రూ.3 వేల నుంచి దూరాన్ని బట్టి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, కార్పోరేట్ హాస్పిటళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు, రెస్టారెంట్లకు నీటిని తరలిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో బోర్లు వేసి, ఇంజన్లతో నీటి తోడేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఒంగోలు -
ఏర్పాట్లు సిద్ధం ‘సర్’!
మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఈనెల 5 నుంచి ‘సర్’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం ప్రారంభమవుతోంది. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో మొత్తం 9,08,626 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని 1103 మంది బీఎల్ఓలు తమ పరిధిలోని గృహలకు వెళ్లి ఓటర్ల వివరాలను తనిఖీ చేయనున్నారు. నిబంధనల ప్రకారం ఓటర్లు ఉన్నారా.. లేదా.., మృతులు, అనర్హుల ఓట్ల వివరాలను సేకరించి తొలగించడంతో పాటు 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు కల్పించనున్నారు. శ్రీసర్శ్రీ ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలకు శుక్రవారం నుంచి 14వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలు సేకరించి మ్యాపింగ్ చేస్తారు. జూలై 21న ముసాయిదా జాబితా విడుదల చేసి, ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిష్కరించి సెప్టెంబర్ 22న తుది జాబితాలు విడుదల చేస్తారు. ఇప్పటికే వివిధ పార్టీల నాయకులతో రెవెన్యూ అధికారులు సమావేశాలు ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లాలో వైపాలెం మినహా మిగిలిన 3 నియోజకవర్గాల్లో కొత్తగా 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కాగా ఇంటింటి సర్వేకు వచ్చే ఎన్నికల సిబ్బందికి ప్రజలు సహకరించాలని, 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్ఓ శివరామిరెడ్డి సూచించారు. పెద్దదోర్నాల: యాత్రికుల రక్షణ కోసం ఘాట్ రోడ్లలో ఏర్పాటు చేసిన కాన్వెక్స్ మిర్రర్లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి. ఇటీవల ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశాల మేరకు మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొన్ని ప్రమాదకర మలుపుల వద్ద పోలీసులు కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు చేశారు. మండల కేంద్రంలోని పెద్ద మూల టర్నింగ్తో పాటు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొన్ని మిర్రర్లను వాటి ప్రాధాన్యం తెలియని కొందరు ఆకతాయిలు మాయం చేశారు. ఐరన్ పోల్స్ మాత్రమే ఘాట్రోడ్లో దర్శనమిస్తున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించే అద్దాలు ఇలా మాయం కావడంపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి ఎలక్షన్ సెల్ సిబ్బందికి శిక్షణ ఈ నెల 15 నుంచి ఇంటింటి సర్వే నియోజకవర్గం ఓటర్లు బీఎల్ఓలు మార్కాపురం 2,15,515 257 గిద్దలూరు 2,42,143 284 కనిగిరి 2,42,680 297 యర్రగొండపాలెం 2,08,288 265 -
పొగాకు రైతులతో చెలగాటం
మద్దిపాడు: పొగాకు రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. మండలంలోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. వేలం జరుగుతున్న తీరును పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 25 వేల మంది రైతులు పొగాకు పండిస్తున్నారని, వారికి అనుసరిస్తూ దాదాపు లక్ష మంది కూలీలు పనిచేస్తున్నారని, రైతులు నష్టపోతే వీరందరి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో పొగాకు పంట సాగు చేస్తారని, ఆయా జిల్లాల వారీగా ఇన్ని వేల మంది రైతులు రోడ్డున పడటం కూటమి సర్కార్కు సంతోషంగా ఉన్నట్లుందన్నారు. పొగాకు రైతుల రోదనలు కూటమి చెవికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో కేజీ పొగాకు రూ.360 వరకు చేరిందని, కానీ కూటమి ప్రభుత్వంలో రూ.150లకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఏదో ఒక వేలంద్రాన్ని సందర్శిస్తే పొగాకు రైతులు కష్టాలు తెలుస్తాయన్నారు. కేవలం ఒక్కరోజు యోగా నిర్వహించడానికి రూ.300 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం పొగాకు రైతుల బాధలు తీర్చడానికి రూ.500 కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.200 కోట్లు ఇచ్చి మార్క్ఫెడ్ను రంగంలోకి దిగడంతో రైతులకు మంచి ధరలు లభించాయన్నారు. ధరలు ఇలానే కొనసాగితే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఆ నష్టాన్ని తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తాయన్నారు. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు పొగాకు రైతులు రోడ్డెక్కి బేళ్లను తగలబెట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. రెండేళ్లలో ప్రభుత్వం రూ.3.60 లక్షల కోట్లు అప్పులు చేశారని, కేవలం రూ.500 కోట్లు మార్క్ఫెడ్కు కేటాయిస్తే పొగాకు రైతులు గట్టున పడతారని చెప్పారు. గత ఏడాది పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పొదిలి వేలం కేంద్రానికి వస్తే రైతులపై కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి బెదిరించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. పార్టీలకతీతంగా పొగాకు రైతులకు అండగా నిలవాల్సిన ఉందన్నారు. మాజీమంత్రి, సంతనూతలపాడు ఇన్చార్జి మేరుగ నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో హయాంలో రైతు రాజులాగా బతికితే కూటమి రెండేళ్ల పాలనలో రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారన్నారు. రైతుల విషయంలో ఎప్పుడూ వారికి అండగా నిలవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక వైపు, రైతులకు ఎటువంటి మద్దతు ధర లభించకుండా చేస్తూ ఆ పంట వేయొద్దు ఈ పంట వేయొద్దు అని చెప్పే చంద్రబాబు ఒక వైపని, ఇద్దరి మధ్య తేడా ఏంటో ప్రజలు గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ వ్యవసాయ విభాగం ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ మారెల్ల బంగారు బాబు, సీనియర్ నాయకులు ఇనగంటి పిచ్చిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు, ఉపాధ్యక్షుడు వాకాకోటిరెడ్డి, వ్యవసాయ విభాగం మండల పార్టీ నాయకుడు పల్లకి సత్యనారాయణరెడ్డి, దర్శి ఏఎంసీ మాజీ డైరెక్టర్ కొర్రపాటి శరత్ బాబు, సన్నపురెడ్డి రవణమ్మ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
టెన్త్ టాపర్స్కు అరుదైన అవకాశం
చీమకుర్తి: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలనే కోరిక ప్రతి వారిలో ఉంటుంది. అదే మధ్య తరగతి కుటుంబాల్లో ఆ కోరిక ఆశగానే మిగులుతోంది. అలాంటిది విద్యార్థిగా ఉండగానే ఆ కోరికకు రెక్కలు వచ్చి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విమానం ఎక్కితే ఆ ఆనందానికి అవధులే ఉండవు. అలాంటి అదృష్టం సంతనూతలపాడు మండలంలోని ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులకు వచ్చింది. మండలంలోని ప్రభుత్వ, గురుకుల, జిల్లా పరిషత్ హైస్కూళ్లు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించి స్కూల్ టాపర్గా నిలిచిన వారిని ఒకరు చొప్పున 10 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిని విమానం ఎక్కేందుకు అదే మండలం ఎనికపాడు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ విక్రమ్ తారాబాయి అవకాశం కల్పించారు. ఈ నెల 3వ తేదీన గన్నవరం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో దిగారు. హైదరాబాద్లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించి తిరిగి సంతనూతలపాడుకు తీసుకొచ్చారు. ఎన్ఆర్ఐ విక్రమ్ తారాబాయ్ ఎనికపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థి. విద్యార్థులకు అహ్లాదాన్ని కలిగించే కార్యక్రమంలో భాగంగా విమానం ఎక్కించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతూ విమానాంలోనే సెల్ఫీలు తీసుకుంటూ సంతోషంగా గడిపారు. -
కమర్షియల్ సెల్లార్లు సీజ్
మార్కాపురం టౌన్: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో కమర్షియల్ కాంప్లెక్సుల సెల్లార్లను పార్కింగ్కు వినియోగించకుండా షాపులకు లీజుకు ఇవ్వడంతో సదరు యజమానులకు మున్సిపల్ అధికారులు గురువారం నోటీసులిచ్చారు. మొత్తం 35 మంది యజమానులకు నోటిసులిచ్చామని, ఐదు సెల్లార్లు సీజ్ చేశామని కమిషనర్ డీవీ నారాయణరావు తెలిపారు. పార్కింగ్ కోసం కేటాయించిన సెల్లార్లను అద్దెకివ్వడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని చెప్పారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో ఈ నెల 18వ తేదీన పలువురు షాపింగ్ కాంప్లెక్స్ యజమానులకు నోటిసులిచ్చామన్నారు. స్పందించకపోవడంతో గురువారం తమ సిబ్బందితో వెళ్లి 5 సెల్లార్లకు సీల్ వేసినట్లు పేర్కొన్నారు. వాణిజ్య అవసరాలకు ఉపయోగించిన సెల్లార్లను సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి సీల్ వేస్తామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రంలోగా కమర్షియల్ సెల్లార్లను ఖాళీ చేసి పార్కింగ్కు కేటాయించాలని స్పష్టం చేశారు. -
ఓటేసినందుకా.. వెన్నుపోటు
రాష్ట్ర అప్పులు రూ.3 లక్షల కోట్లకు చేరాయి. రెండేళ్లలో కొత్త పింఛను ఒక్కటీ ఇవ్వలేదు. అభివృద్ధి ఊసేలేదు. మహిళలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా? అంటూ చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ నేతలు నిప్పులు చెరిగారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం టీడీపీ మేనిఫెస్టో ప్రతులను తగలబెట్టారు. – సాక్షి నెట్వర్క్ అద్దంకిలో పార్టీ నేతలతో కలిసి టీడీపీ మేనిఫెస్టోను తగలబెడుతున్న చింతలపూడి అశోక్కుమార్ కొత్తపట్నంలో టీడీపీ మేనిఫెస్టో దహనం చేస్తున్న చుండూరి రవిబాబు పామూరులో నిరసన ర్యాలీలో పాల్గొన్న దద్దాల నారాయణ, నాయకులు -
కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు
దర్శి: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వెన్నుపోటు ప్రభుత్వమని మరొక సారి రుజువు చేసుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. కూటమి వెన్నుపోటుకు రెండేళ్లు అయిన సందర్భంగా ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన పథకాలే కాకుండా ఇతర పథకాలు కూడా అమలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా ఒక్కొక్కరికి రూ.1500 ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రం లో 20 లక్షల పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మభ్య పెట్టాడని చెప్పారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తానని చెప్పి ఒక్కరికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు పథకానికి తూట్లుపొడుస్తూ ఆర్టీసీ డిపోలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా దాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కొన్నింటిని పూర్తిచేయగా, మిగిలిన అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేయకుండా వాటిని ప్రైవేటుపరం చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి మంగళంపాడారన్నారు. మోంథా తుఫాను బాధితులకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని చెప్పారు. చంద్రబాబుకు ఓట్లేసి మోసపోయామని, మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఈనెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని, ఈనెల 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, ఈనెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మేధావులు అందరు పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాల కన్వీనర్లు వెన్నపూస వెంకట రెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బయ్య, కాకర్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదనరెడ్డి, దర్శి పట్టణ అధ్యక్షుడు ముత్తినీడి సాంబయ్య, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు జీ దేవప్రసాదు, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కొల్లా భాస్కర్, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాంభూపాల్రెడ్డి, జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షుడు బండి గోపాల్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పాత నేరస్తుడు మృతి
చీమకుర్తి: బైకుపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎదురుగా వచ్చిన గ్రానైట్ కంటైనర్ను ఢీకొట్టి రోడ్డు మీద పడ్డారు. అదే సమయంలో బైకు వెనుకే వస్తున్న ట్రాక్టర్ వారిలో ఒకరిని తొక్కించుకుంటూ పోవడంతో మృతిచెందగా, రెండో వ్యక్తి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం చీమకుర్తి బైపాస్లో కూనంనేనివారిపాలెం రోడ్డు వైపు ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కనిగిరికి చెందిన నాగులూరి శాంసన్ (29) గతంలో పొదిలి, చీమకుర్తిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వాటిలోని రాగి తీగ దొంగతనం చేసి దాదాపు 30కిపైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. చీమకుర్తిలో 2023లో ట్రాన్స్ఫార్మర్ చోరీ కేసులో కూడా శాంసన్ ఉన్నాడు. పొదిలి కేసులో పీటీ వారంట్పై సంతనూతలపాడు పోలీసులు కూడా గతంలో శాంసన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని సంతనూతలపాడు ఎస్సై కూడా ధ్రువీకరించారు. మృతుడి బంధువులు రావడంలో జాప్యం కావడంతో పూర్తి వివరాలు సేకరించాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలిని చీమకుర్తి సీఐ డీ ప్రసాదరావు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, బైకు మీదున్న రెండో వ్యక్తి పోలా ప్రసాద్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. -
వార్డు వెల్ఫేర్ సెక్రటరీ సస్పెన్షన్
● పెన్షన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ ఒంగోలు వన్టౌన్: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దిబ్బలరోడ్డు సచివాలయంలో వార్డు వెల్ఫేర్, డెవలప్మెంట్ సెక్రటరీగా పని చేస్తున్న భీమవరపు సాయికుమార్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య బుధవారం ఆదేశాలు జారీ చేశారు. పింఛన్ల పంపిణీలో అవకతవకలపై బుధవారం సాక్షిలో ‘విలపింఛెన్’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ రాజాబాబు స్పందించారు. పెన్షన్లను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పంపిణీ చేయడంలో విఫలం కావడంతో పాటు, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడం, విధుల్లో నిర్లక్ష్యం వహించడం వంటి వాటిపై విచారణకు ఆదేశించారు. ఆమేరకు మున్సిపల్ అధికారులు విచారణ నిర్వహించి కలెక్టర్కు నివేదిక అందించారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సాయికుమార్ను మున్సిపల్ అధికారులు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సింగరాయకొండ: గంజాయి అమ్ముతున్న యువకుడిని బుధవారం అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఒకటిన్నర కేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ పీ శ్రీహరి కథనం ప్రకారం కుటుంబ ఆర్ధిక సమస్యలతో మద్యం, గంజాయికి బానిసైన మండల కేంద్రంలోని డ్రైవర్పేట 4వ లైనులో నివసిస్తున్న తన్నీరు శివమహేష్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందేందుకు గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నాడు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుకు వెళ్లి కేజీ రూ.5 వేలకు తీసుకొచ్చి ఇక్కడ చిన్నచిన్న ప్యాకెట్లుగా విభజించి గుర్తుతెలియని వ్యక్తులకు కేజీ రూ.20 వేలకు అమ్ముతున్నాడు. ఎప్పటిలాగా గంజాయి తీసుకొచ్చిన శివమహేష్ వేరొకరికి అమ్మేందుకు ఒంగోలు–సింగరాయకొండ సర్వీసు రోడ్డులోని కే బిట్రగుంట రిక్వెస్ట్ బస్టాపు వద్ద వేచి ఉండగా అటుగా వస్తున్న సీఐ వాహనం చూసి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిని పట్టుకుని విచారించి అతని వద్ద ఉన్న ఒకటిన్నర కేజీ గంజాయిని స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్స్టేషన్కు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్ సుధీర్కుమార్ వివరించారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు సబర్బన్: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్)పై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. బుధవారం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్–2026)పై గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వివేక్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించి నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని, క్షేత్రస్థాయిలో బీఎల్ఓల పనితీరుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వర్చువల్ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మాధురి పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
జిల్లాలో కాలేజీ విద్యార్థులు గంజాయికి బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులతో పాటుగా చివరికి ఇంటర్మీడియెట్ విద్యార్థులు కూడా నిత్యం గంజాయి తాగుతున్నట్లు సమాచారం. దీంతో తరచుగా కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. అంతేకాకుండా గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు చోరీలు, చైన్స్నాచింగ్లు వంటి నేరాలకు పాల్పడుతున్నారని, పేకాట, కోడిపందేలు ఆడుతున్నారని తెలుస్తోంది. గంజాయికి అలవాటు పడిన 17 ఏళ్ల ఒక మైనర్ బాలుడిని రిమాండ్కు పంపించినట్లు సమాచారం.జిల్లాలోని పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. విద్యార్థులు గంజాయి మత్తులో చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు కూడా గంజాయి భారీగా తరలిపోతోంది. ఒంగోలులో బుధవారం ఒక మినీ లారీలో సుమారు 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.ఇటీవల కాలంలో సింగరాయకొండ గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిందని పోలీసుల్లో ప్రచారం జరుగుతోంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడులో గంజాయి విక్రేతల వివరాలు పోలీసుల వద్ద ఉన్నాయని సమాచారం. మంగళవారం సింగరాయకొండలో ఒక వృద్ధురాలిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకొని ఆమె నుంచి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఆమెను పోలీసులు పలుమార్లు పట్టుకున్నారు. ఆ మధ్య సదరు వృద్ధురాలు రిమాండ్కు వెళ్లి వచ్చింది. అయినా ఆమె గంజాయి విక్రయాలు ఆపడం లేదు. జిల్లాలో వలస కార్మికులు అధికంగా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బీహార్, ఒడిశా నుంచి వచ్చిన కార్మికులు గతంలో గంజాయి తీసుకొచ్చి విక్రయించేవారు. ఇటీవల పోలీసు తాకిడి ఎక్కువ కావడంతో బీహారీలు కేవలం బీహారీలకు, ఒడిశా వాళ్లు ఒడిశా వాళ్లకు మాత్రమే గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం. స్థానికులకు గంజాయి అమ్మడంలేదని సమాచారం. టాస్క్ఫోర్స్ పోలీసుల దాడులు ఎక్కువ కావడంతో ఒంగోలు పరిసరాల్లో గంజాయి తీసుకునేవారు ఇటీవల సూరారెడ్డిపాలెంలోని ఒక పాత గ్రానైట్ డంప్ను అడ్డాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే నగరంలోని కొత్త కూరగాయల మార్కెట్లో ఒక పోలీసు ఉద్యోగి కనుసన్నల్లో గంజాయి విక్రయాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కందుకూరులో అధికార పార్టీ నాయకుడి కనుసన్నల్లో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. రెండు రోజుల క్రితం కందుకూరులో పోలీసులు హడావుడి చేయడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా కేంద్రమైన ఒంగోలు గంజాయి కారిడార్గా మారినట్లు కనిపిస్తోంది. ఒడిశా, వైజాగ్ నుంచి ఒంగోలు మీదుగా తమిళనాడు, కేరళకు ప్రతి నిత్యం గంజాయి భారీగా తరలిపోతోంది. హైవే, రైల్వే మార్గాల గుండా గంజాయి ముఠా సభ్యులు గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్నారు. ఒంగోలు శివారులోని కొప్పోలు ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో బుధవారం ఒక మినీ లారీలో భారీగా గంజాయి పట్టుబడడంతో పోలీసు అధికారులు విస్తుపోయారు. సుమారు 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. ఈ ఏడాది మార్చిలో గూడూరు వద్ద కూడా ఇదే తరహాలో గంజాయి పట్టుబడింది. జిల్లా మీద నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలించడం అటుంచితే గత రెండేళ్లలో జిల్లాలో గంజాయి విక్రయాలు విపరీతంగా పెరిగాయి. మారుమూల మండలాల్లో కూడా గంజాయి పట్టుబడుతోంది. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మద్యం తాగడానికి అలవాటు పడిన విద్యార్థులు ఇప్పుడు గంజాయి తీసుకొని మత్తుగా జోగుతున్నారు. మత్తులో చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తమ కళ్ల ముందే కన్నబిడ్డలు గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటుంటే చూడలేక తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మేము అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే గంజాయిని నూరు శాతం కట్టడి చేశామని డబ్బాకొట్టుకుంటున్నారు. 250 కిలోలకు పైగా గంజాయి పట్టివేత... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 250 కిలోలకు పైగా గంజాయి పట్టుబడడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బుధవారం తెలవారుజామున రెండు గంటల సమయంలో ఒంగోలు శివారులోని కల్వరి టెంపుల్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక మినీ లారీని మోటారు బైకు మీద వస్తున్న కొడియం లోకేష్ (21) వెనక నుంచి ఢీకొన్నాడు. సమాచారం తెలుసుకున్న తాలుకా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనుమానం వచ్చి ఘటనా స్థలంలో ఉన్న ఏషర్ మినీ లారీని పరిశీలించగా అందులో బియ్యం తవుడు మధ్య రహస్యంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. మొత్తం 9 బస్తాల గంజాయి లభ్యమైంది. ఇందులో సుమారు 280 నుంచి 300 కిలోల గంజాయి ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి ముందు 4 నుంచి 5 గంటల వరకు ఈ లారీ అక్కడే నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రమాదం కనుక జరగకపోయి ఉంటే గుట్టు చప్పుడు కాకుండా గంజాయి రాష్ట్రం సరిహద్దులు దాటి ఉండేది. నాలుగైదు గంటలపాటు ఒక మినీ లారీ రోడ్డు పక్కన నిలబెట్టి ఉంచినా కనీసం ఒక్క పోలీసు అధికారి కూడా వాకబు చేయకపోవడం గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు నిఘా వైఫల్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడ్లూరు సమీపంలో కూడా ఇదే తరహాలో... ఈ ఏడాది మార్చి 16వ తేదీ గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో అక్రమంగా తరలిస్తున్న 19 కిలోల గంజాయి పట్టుబడింది. అతివేగంగా వెడుతున్న కారు గుడ్లూరు మండలం మోచర్ల వద్ద కూలీలతో ఉన్న ఆటోను వెనకనుంచి ఢీ కొట్టడంతో ఇద్దరు కూలీలు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న గంజాయి ప్యాకెట్లను తీసి నిందితులు ముళ్ల పొదల్లో దాచారు. ఆ తరువాత విచారణలో గంజాయి గుట్టు రట్టయింది. సరిగ్గా రెండు నెలల తరువాత ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ రెండు సంఘటనల్లోనూ ప్రమాదాలే గంజాయిని పట్టించాయి. గంజాయి తరలింపునకు జంక్షన్గా మారిన ఒంగోలు జిల్లా మీద నుంచి భారీగా గంజాయి అక్రమ రవాణా నేషనల్ హైవే, రైల్వే మార్గాలగుండా తరలిస్తున్న ముఠా రోడ్డు ప్రమాదంతో ఒంగోలులో బయటపడిన భారీ గంజాయి తమిళనాడుకు తరలిస్తున్న 250 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మొన్న కందుకూరు, నిన్న సింగరాయకొండ, నేడు ఒంగోలులో వరుసగా గంజాయి పట్టివేత జిల్లాలో యథేచ్ఛగా గంజాయి విక్రయాలు గంజాయికి అలవాటు పడుతున్న ఇంటర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులు -
కోల్డ్ స్టోరేజీకి అష్ట కష్టాలు!
మార్కాపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్లో 1,52,190 మంది రైతులు 86,349 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు వాణిజ్య పంటలో ప్రధానమైన మిర్చిని 27,077 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే పొగాకు, కంది, శనగ, సజ్జ, మొక్కజొన్న పంటలు సైతం పండిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దళారులు చెప్పిన రేటుకే తెగనమ్ముకుని ఆర్థికంగా కుదేలైపోయారు. మిర్చి రైతులు మాత్రం ఆర్థిక ఇబ్బందులైనా గుంటూరుకు వెళ్లి అక్కడ ప్రైవేటు కోల్డు స్టోరేజీల్లో నిల్వ ఉంచుకుంటున్నారు. అడుగుముందు పడని నిర్మాణం సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్కాపురం మార్కెట్ యార్డులో నాటి పంచాయతీరాజ్, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్న నారాలోకేష్ 2018 నవంబరు 29వ తేదీన కోల్డు స్టోరేజీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. హడావుడిగా పనులు ప్రారంభించారు. 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంలో శీతల గిడ్డంగి (కోల్డ్ స్టోరేజీ) నిర్మాణం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రూరల్ డెవలప్మెంట్ ఫండ్ (ఆర్డీఎఫ్) నిధులు రూ.5 కోట్లు మంజూరు చేసింది. మొక్కబడిగా నిధులు ఇవ్వడంతో కాంట్రాక్టర్ పిల్లర్లు వేసి నిలిపేశాడు. 2019 ఎన్నికల ముందే పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా శీతల గిడ్డంగి విషయాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం కోల్డు స్టోరేజీ లేకపోవడంతో ప్రైవేటు కోల్డు స్టోరేజీలను ఆశ్రయించడం లేక దళారులు చెప్పిన ధరకు అమ్ముకోవడమో జరుగుతోంది. మిర్చి రైతులకు ఎంతో మేలు జిల్లాలో 27,077 ఎకరాల్లో మిర్చి సాగవుతుంది. అత్యధికంగా మార్కాపురం, తర్లుపాడు, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల్లో మిర్చిని పండిస్తున్నారు. ఇక్కడే కోల్డు స్టోరేజీల్లో అందుబాటులోకి వస్తే మంచి ధర వచ్చిన తరువాత అమ్ముకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిర్చి ధరలు నేలచూపు చూస్తున్నాయి. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక ఆర్థికంగా కుదేలయ్యారు. మార్కాపురం మార్కెట్ యార్డులో మార్క్ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నా కూటమి ప్రభుత్వం వైపు నుంచి స్పందనలేదు. ఇటు కోల్డుస్టోరేజీ లేకపోవడం, అటు మిర్చి కొనుగోలు కేంద్రం రాకపోవడంతో మిర్చి, పప్పుశనగ, కందులు సాగుచేస్తున్న రైతులు తమ ఉత్పత్తులను పొలాల్లో, ఇళ్లల్లో నిల్వ ఉంచుకోలేక తక్కువ ధరకే తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్ యార్డులో అసంపూర్తిగా ఉన్న కోల్డుస్టోరేజీ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పగలు ఎండ.. రాత్రి వాన
● ఉమ్మడి జిల్లాలో భిన్న వాతావరణం ● 22 మండలాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతల నమోదు ● సాయంత్రానికి పలుచోట్ల వర్షం ఒంగోలు టౌన్: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వారం రోజుల నుంచి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచే వేడి మొదలై మధ్యాహ్నంకల్లా ఎండ ప్రచండ రూపం దాలుస్తోంది. తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి మొదలుకొని రాత్రి వరకు భయంకరమైన ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో జనాలు పగలంతా ఎండతో, రాత్రయితే ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో భయం భయంగా గడుపుతున్నారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. అద్దంకి, బల్లికురవలో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బేస్తవారిపేట, కంభం, చీమకుర్తి మండలాల్లో 43.3 డిగ్రీలు, జె.పంగులూరులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మద్దిపాడు, పెద్దారవీడులో 42.8 డిగ్రీలు, ముండ్లమూరు, నాగులుప్పలపాడు, తాళ్లూరు, త్రిపురాంతకంలో 42.6 డిగ్రీలు నమోదైంది. ఒంగోలు, సంతనూతలపాడు, రాచర్లలో 42.5 డిగ్రీలు, హనుమంతునిపాడు, పామూరు, కురిచేడులో 42.4 నమోదు కాగా, పుల్లల చెరువు, కొనకనమిట్లలో 42.3, ఉలవపాడులో 42.2, టంగుటూరులో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
వెన్నుపోటులో దిట్ట చంద్రబాబు
ఒంగోలు టౌన్: నాడు పిల్లనిచ్చి పెళ్లి చేసిన తండ్రిలాంటి మామను వెన్నుపోటు పొడిచి నేడు ఓట్లేసి గెలిపించిన రాష్ట్ర ప్రజలను రెండేళ్లుగా మాయమాటలు చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నాడని, వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్టని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు పార్లమెంటు పార్టీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్లతో కలిసి ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందరర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలన్నిటినీ కొనసాగిస్తామని, ఇంకా అదనంగా కొత్త పథకాలను అమలు చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నమ్మిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ ఆడబిడ్డ నిధి ద్వారా నెలకు రూ.1500 అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలోపు ప్రతి ఒక్కరికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టారన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఏడాది ఆలస్యంగా ప్రారంభించిన చంద్రబాబు ఏడాది తిరక్కుండానే ఆర్టీసీ డిపోలను ప్రైవేటుపరం చేయడం ద్వారా ఉచిత బస్సు పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చెప్పాడని, మొదటి సంవత్సరం మొండిచేయి చూపి, రెండో సంవత్సరం అరకొరగా ఇచ్చారని, మూడో సంవత్సరం అసలు ఆ పథకం అమలవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని, ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు రైతులను నట్టేట ముంచారని తెలిపారు. జగనన్న పాలనలో రైతన్నలకు ఉచిత బీమా పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులే ప్రీమియం చెల్లించాల్సి వస్తుందని, ఇది రైతులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అతలాకుతం చేసిన మోంథా తుఫానుకు లక్షల ఎకరాల పంట దెబ్బతిందని, ఇప్పటి వరకు వారికి నష్టపరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీసం సబ్సిడీలు కూడా అందించలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని చెప్పారు. రాష్ట్రంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అవస్థలు పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల బకాయిలు ఉంటే వాటిని ఇవ్వకుండా ఒన్టైం సెటిల్మెంట్ పేరుతో హాస్పిటల్ యాజమాన్యాలను వేధిస్తున్నారని తెలిపారు. జగనన్న హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందని ప్రచారం చేసుకుంటూ డ్యాన్సులు వేస్తున్న కూటమి పాలకులను చూసి ప్రజలు విస్తుపోతున్నారని, చంద్రబాబు మాయ మాటలు నమ్మి ఓట్లువేసి మోసపోయామని ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకొచ్చిన జగనన్న పరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 4వ తేదీ నుంచి నిరసనలు.. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ఈ నెల 4వతేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బూచేపల్లి వెల్లడించారు. 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని, చంద్రబాబు మోసాన్ని ఎండగట్టడం కోసం, కూటమి పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా 12వ తేదీన నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు వివరించారు. నిరసన కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ విగ్రహాల ధ్వంసం పైశాచికం... కూటమి పాలనలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని బూచేపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం చేయలేదని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో 715 హత్యలు జరిగాయని, అందులో అత్యధికంగా రాజకీయ హత్యలేనని చెప్పారు. మహిళల మీద అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బొట్లా రామారావు, వైవీ వెంకటేశ్వర్లు, కేవీ రమణా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, యరజర్ల రమేష్, దేవరపల్లి అంజిరెడ్డి, భూమిరెడ్డి రవణమ్మ, దుపా చెంచిరెడ్డి, షేక్ మీరావలి, నాగమల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ లొసుగులపై విచారణ చేయాలి
● ‘ఎక్స్’లో ఎమ్మెల్యే తాటిపర్తి డిమాండ్ యర్రగొండపాలెం: చంద్రబాబు ప్రభుత్వంలో చోటు చేసుకున్న డీఎస్సీ–2025లో మెగా లొసుగులపై సైబర్ క్రైం నిపుణులు, సిట్టింగ్ జడ్జితో కూడిన హైలెవెల్ టెక్నికల్ కమిటీతో విచారణ జరిపించి, పరీక్షా సర్వర్ల ఐటీ ఆడిట్ రిపోర్టును బహిర్గతం చేయాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం మెగా డీఎస్సీ కుంభకోణంపై ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. ఈ కుంభకోణంపై వివరణ ఇవ్వటానికి పాఠశాలల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ పడిన పాట్లు చూస్తుంటే జాలి వేస్తుందని, మంత్రి లోకేష్ ఇవ్వాల్సిన వివరణ చాకచక్యంగా తప్పించి ఐఏఎస్ అధికారిని బలి పశువును చేయడం బాధాకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మెగా డీఎస్సీ కుంభకోణంపై నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నారా లోకేష్ సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యంత కఠినంగా ఉండే డీఎస్సీ సిలబస్లో నెగిటివ్ మార్కులు లేకపోయినా మీ దగ్గర పనిచేసే ఒక సాధారణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం వెనక ఎవరి అండదండలు ఉన్నాయని, సర్వర్ లాగ్స్ ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఈ వివాదం బయటకు రాగానే విద్యాశాఖ సదరు అభ్యర్ధి అభ్యర్ధిత్వం రద్దు చేసి చేతులు దులుపుకుందన్నారు. అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయడం కాదు, అతను ఏ కంప్యూటర్ సిస్టం నుంచి పరీక్ష రాశాడు... ఆ సిస్టం ఐపీ అడ్రస్ ఏమిటి.. పరీక్ష రాస్తున్నప్పుడు సర్వర్లో ఏమైనా అసాధారణ యాక్టివిటీ జరిగిందా అన్నది ఎందుకు తేల్చలేదని నిలదీశారు. డేటా డిలీషన్ ఎందుకు చేశారని, తప్పు చేయనప్పుడు అధికారిక వెబ్సైట్లో ఆ అభ్యర్థి పేరు, వివరాలను అర్ధరాత్రి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల యాక్సెస్ కంట్రోల్ లాగ్ ఎవరి దగ్గర ఉన్నాయి... ఎవరెవరు లాగిన్ అయ్యారని చెప్పటానికి ఎందుకు భయపడుతున్నారన్నారు. డీఎస్సీ పరీక్ష కేంద్రాల్లోని సిస్టం టెక్నికల్ ఆడిట్ జరిపించారా.. ఒక ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అంశం కాదు సెలెక్టెడ్గా కొంతమంది ఎగ్జాం సిస్టం రిమోట్ యాక్సెస్ అయిందని నిరుద్యోగుల సంఘాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ఒరిజినల్ టెట్ కన్వీనర్ను ఉన్నపళంగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. అభ్యర్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. -
మెగా కాదు..దగా డీఎస్సీ
ఒంగోలు సిటీ: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, నిరుద్యోగులకు ఆశ చూపించి చివరకు వారి భవిష్యత్తో చెలగాటం ఆడిందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో సోమవారం ధర్నా నిర్వహించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక అంబేడ్కర్ భవన్ నుంచి పార్టీ నాయకులు, అభిమానులు, నిరుద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎస్సీ అనేది లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన సున్నితమైన ప్రక్రియ అన్నారు. డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం, మెరిట్లిస్టులు బహిరంగంగా ప్రకటించకపోవడం, కేవలం ఎంపికై న అభ్యర్థులకు మాత్రమే ఎస్ఎంఎస్లు పంపడం, కాల్ లెటర్ల విషయంలో సృష్టించిన గందరగోళం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నారు. డీఎస్సీ నియామకాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో న్యాయ విచారణ జరిపించాలని కోరారు. ప్రశ్నా పత్రాల తయారీ, అప్లోడ్ నిర్వహణలో పాల్గొన్న అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బంది పాత్రపై పూర్తి విచారణ జరపాలన్నారు. మెరిట్ లిస్టులు, మార్కులు, ఎంపిక వివరాలను పూర్తిగా ప్రజలకు వెల్లడించాలన్నారు. అక్రమంగా ఎంపికై న వారిపై చర్యలు తీసుకొని, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో పోస్టులు కేటాయించారని, ఒక్కో పోస్టుకు లక్షల రూపాయలు పెట్టి పోస్టులు కొనుగోలు చేశారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అర్హులైన అభ్యర్థులకు పోస్టులు ఇవ్వకపోవడం, కోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై నిర్లక్ష్యాన్ని చూపుతోందన్నారు. ఈ డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం నిరుద్యోగ యువత భవిష్యత్తు బలి కాకూడదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, ప్రచార విభాగం జిల్లా అధ్యక్షుడు శేషారెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవప్రసాద్, వివిధ నియోజకవర్గాల యూత్ అధ్యక్షులు సన్ని, అన్వేష్, గంగాధరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రమోహన్, రాజశేఖరరెడ్డి, రాష్ట్ర యూత్ జనరల్ సెక్రటరీ మహానందరెడ్డి, రాష్ట్ర యూత్ కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్నకుమార్, సంతనూతలపాడు మండల అధ్యక్షుడు దుంపా చెంచిరెడ్డి, రాష్ట్ర క్రిష్టియన్ మైనార్టీ సెల్ సెక్రటరీ గుంటు పోలయ్య, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దామరాజు క్రాంతికుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
సర్వర్ మొరాయించి.. పంపిణీ నెమ్మదించి!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రహసనంలా మారింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటల కొద్దీ లబ్ధిదారులు అవస్థలు పడ్డారు. పింఛన్ల పంపిణీ కోసం సోమవారం ఉదయాన్నే ప్రభుత్వ సిబ్బంది పింఛన్దారుల వద్దకు వెళ్లారు. అయితే అధికారుల వేలిముద్రలు, ఐరిస్ తీసుకునే మిషన్లు సర్వర్ సమస్య కారణంగా మొరాయించాయి. ఉదయం తొమ్మిది గంటలైనా సర్వర్లు పనిచేయలేదు. ప్రధానంగా వృద్ధులు, వికలాంగులు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వేసవి ఎండలతో ఇబ్బందులు పడుతున్న వారికి చాలా ప్రాంతాల్లో తాగడానికి నీళ్లులేక ఇక్కట్లపాలయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,59,185 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రూ.158 కోట్లు మంజూరు చేసింది. ప్రకాశం జిల్లాలో 2,18,184 మందికి గాను రూ.95.41 కోట్లు, మార్కాపురం జిల్లాలో 1,41,001 మంది ఉండగా రూ.68 కోట్లు మంజూరయ్యాయి. ఇదిలా ఉండగా సాంకేతిక సమస్య కారణంగా పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యమైంది. దీంతో ఒక పింఛన్ ఇవ్వడానికి అర గంట నుంచి గంట వరకు సమయం తీసుకున్నారు. ఒక్కో వ్యక్తికి దాదాపు 60–80 పింఛన్లను పంపిణీ చేసేందుకు కేటాయిస్తారు. వాటిని గతంలో మధ్యాహ్నానికి పంపిణీ పూర్తి చేసుకునేవారు. లాగిన్ అయ్యి ఇద్దరికి పింఛన్లు ఇచ్చే సరికి మళ్లీ సర్వర్ మొరాయించింది. ఫలితంగా సాయంత్రం నాటికి ప్రతి ఒక్కరూ 40 నుంచి 50 పింఛన్లు పంపిణీ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీలో ఉన్న సిబ్బంది ఎండల తీవ్రత కారణంగా ఇబ్బంది పడ్డారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం–3 లో అయితే కొందరు సచివాలయ సిబ్బంది ఇంటికి రాకపోవటంతో లబ్ధిదారులు గ్రామ సచివాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి పడిగాపులు కాశారు. సచివాలయ సిబ్బందికి ఫోన్ చేసినా పింఛన్ పంపిణీ లో ఉన్నామని, వస్తున్నామని చెప్పడంతో వారి కోసం మధ్యాహ్నం 12.15 వరకు నిరీక్షించారు. ఆకలి దప్పులతో అల్లాడారు. కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని వరిగచేను సంఘం, చైతన్యనగర్ వంటి ప్రాంతాల్లో పింఛనుదారులు సచివాలయాల వద్దకు వెళ్లారు. అక్కడా సిబ్బంది లేకపోవడంతో ఆందోళన చెందారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఈ సమస్యతో పింఛన్ల పంపిణీ చాలా ఆలస్యంగా జరిగింది. దర్శి నియోజకవర్గంలో దర్శి నియోజకవర్గంలో నత్తనడకన పింపిణీ సాగింది. సాధారణ రోజుల్లో రెండు గంటల వ్యవధిలో తమకు కేటాయించిన 50 నుంచి 80 పింఛన్లు పంపిణీ పూర్తి చేస్తారు. అయితే సాంకేతిక సమస్య కారణంగా 60 శాతం మేరకు మాత్రమే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంపిణీ చేసినట్టు తెలిసింది. ఆగి..సాగిన పింఛన్ల పంపిణీ కనిగిరి నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఆగి సాగింది. ఉదయాన్నే గంటకు పైగా సర్వర్ సమస్యతో పింఛన్ల పంపిణీ ఆలస్యమైంది. ఆతర్వాత కూడా మధ్యలో కొన్ని మండలాల్లో గంటకు పైగా సర్వర్ నిలిచింది. పింఛన్దారులకు తొందరగా పింఛన్ నగదు చేరకపోవడంతో ఇబ్బంది పడ్డారు. కనిగిరి పట్టణంతో పాటు, మిగతా కొన్ని మండలాల్లో సచివాలయ సిబ్బంది తమ టార్గెట్ను పూర్తి చేసుకునేందుకు రాత్రి వరకు పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. 2 గంటల పాటు టెన్షన్.. టెన్షన్.. మార్కాపురం: జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులు పింఛను కోసం పడిగాపులు కాశారు. సర్వర్లో సమస్య రావడంతో సచివాలయ సిబ్బంది చాలా సేపు రాలేదు. ఇదే సమయంలో లబ్ధిదారులు పింఛను అందక టెన్షన్ పడ్డారు. ఒక్కొక్క చోట ఒక్కో ప్రాంతంలో సర్వర్ సమస్య గంట నుంచి రెండు గంటల పాటు ఉంది. సోమవారమే పింఛన్లు పంపిణీ పూర్తికావాలని ప్రభుత్వం ఆదేశించడంతో సచివాలయ సిబ్బంది సర్వర్ పనిచేయక హైరానా పడ్డారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, యర్రగొండపాలెం, దోర్నాల, పుల్లలచెరువు, అర్ధవీడు తదితరమండలాల్లోని పలు గ్రామాల్లో సర్వర్ సమస్య ఏర్పడింది. దీనితో పింఛను పంపిణీ ఆలస్యంగా జరిగింది. -
లారీని ఢీకొట్టిన బైక్
● ప్రమాదంలో యువకుడు దుర్మరణం జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రేణింగవరం శివ శక్తి వే బ్రిడ్జి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. మంగళగిరికి చెందిన చెల్లూరి రామసుబ్రమణ్యం(22) కావలిలో బంధువుల ఇంట శుభకార్యానికి బైక్పై వెళ్తున్నాడు. జాతీయ రహదారిపై రేణింగవరం సమీపంలో వే బ్రిడ్జి వద్ద ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మంగళగిరిలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. మృతుడికి తల్లిదండ్రులు లేరు. సంఘటన స్థలాన్ని రేణింగవరం పోలీసులు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీ సేవలు ఎప్పటికీ మరువం ● ఎస్పీ హర్షవర్ధన్రాజు ఒంగోలు సిటీ: సుదీర్ఘకాలం ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూ నిబద్ధతతో అందించిన సేవలు ఎప్పటికీ మరువమని ఎస్పీ హర్షవర్ధన్రాజు అన్నారు. పోలీసు శాఖలో ఉద్యోగ విరమణ పొందిన ఎస్సైలు, ఏఎస్సైలు, సిబ్బందిని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రిటైర్మెంట్ ప్రయోజనాలు సకాలంలో అందేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఉద్యోగ విరమణ తర్వాత ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ అన్ని వేళలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. జి.సుబ్రహ్మణ్యం, బి.రాంబాబు, ఏ.సత్యం, కట్టా రమణయ్యలు ఉద్యోగ విరమణ చేశారు. కార్యక్రమంలో ఆర్ఐ సీతారామిరెడ్డి, ఏఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026
వేసవి తీవ్రతతో చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి బోర్లలోనూ నీరు అడుగంటుతోంది. పల్లె, పట్నం తేడా లేకుండా జనం నీటి కోసం అల్లాడుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో అధిక శాతం వ్యవసాయం బోర్లపైనే ఆధారపడి చేస్తున్నారు. పరిమితికి మించి వాడటంతో నీటి కొరత మరింత తీవ్రమైంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 91 గ్రామాల్లో కొత్త బోర్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. మార్కాపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజకవర్గంలో 18 గ్రామాలు, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది. వీటితో పాటు ప్రకాశం జిల్లాలోని దర్శి, అద్దంకి, కొండపి, కందుకూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత వేధిస్తోంది. బోర్లలో నీరు అడుగంటడంతో పాటు ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా కాకపోవడంతో జనం నీటి కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.● అడుగంటుతున్న భూగర్భ జలాలు ● పరిమితికి మించి వాడటంతో మంచినీటికి డేంజర్ బెల్స్ ● ఉమ్మడి జిల్లాలో 91 గ్రామాల్లో కొత్త బోర్లపై నిషేధం ● తాగు, సాగునీటికి అల్లాడుతున్న జనం 91 గ్రామాల్లో బోర్లు నిషేధం జిల్లాలో మొత్తం 91 గ్రామాల్లో నూతన బోర్లను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాల్టా చట్టం పటిష్టంగా అమలుచేస్తాం. ప్రజలు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్న నేపథ్యంలో ప్రతి నీటిబొట్టు విలువైనదే. నీటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం. విచ్చలవిడిగా బోర్లువేసి నీటిని వృథా చేయడం మానుకోవాలి. వర్షపు నీటిని నిల్వచేసుకునేందుకు రైతులు పొలాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యాన పంటలు సాగుచేస్తున్న రైతులు డ్రిప్ సిస్టంను వాడుకోవాలి. – జీ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్, గ్రౌండ్ వాటర్, ఒంగోలుమార్కాపురం: రోజురోజుకూ ఎండలు ఎక్కువ కావడం, మూడు నెలల నుంచి జిల్లాలో వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో జిల్లాలోని 12 మండలాల్లో ఉన్న 91 గ్రామాల్లో పరిమితికి మించి నీటి వాడకం ఉండటంతో కొత్తబోర్లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లాలో ఎక్కువ భాగం రైతులు పంటల సాగుకు బోర్ల ద్వారా నీటిని వినియోగిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. మార్కాపురం, కంభం, దొనకొండ, దోర్నాల, గిద్దలూరు, కురిచేడు, ముండ్లమూరు, పెద్దారవీడు, పుల్లలచెరువు, రాచర్ల, త్రిపురాంతకం, వైపాలెం మండలాల్లో ప్రమాదకరమైన స్థితిలోకి భూగర్భ జలాలు వెళ్లిపోయాయి. ఈ గ్రామాల్లో కొత్త బోర్లు నిషేధం: కంభం మండలంలోని కంభం, జంగంగుంట్ల, కందులాపురం, ఎల్కోట, దొనకొండ మండలంలోని అనంతవరం, కొచ్చర్లకోట, మల్లంపేట, మంగినిపూడి, రుద్రసముద్రం, దోర్నాల మండలంలోని చిన్నదోర్నాల, దోర్నాల, నల్లగుంట్ల, పెద్దబొమ్మలాపురం, ఎగువచెర్లోపల్లి గ్రామాల్లో నూతన బోర్లకు అనుమతిని ప్రభుత్వం నిషేధించింది. గిద్దలూరు మండలంలోని చట్టిరెడ్డిపల్లి, గడికోట, కంచుపల్లి, క్రిష్ణంశెట్టిపల్లి, మోడంపల్లి, ముండ్లపాడు, నర్సింహునిపల్లి, సంజీవరాయునిపేట, తిమ్మాపురం, కురిచేడు మండలంలోని ఆవులమంద, కల్లూరు, ముష్లగంగవరం, వెస్ట్ కాశీపురం, మార్కాపురం మండలంలోని బడేఖాన్పేట, భూపతిపల్లి, బొందలపాడు, చింతగుంట్ల, జమ్మనపల్లి, కోలభీమునిపాడు, మాల్యవంతునిపాడు, నికరంపల్లి, పెద్దనాగులవరం, వేములకోట, ముండ్లమూరు మండలంలోని ఈదర, జమ్మలమడక, కంభంపాడు ఈస్టు, కొమ్మవరం నూజెళ్లపల్లి, పూరిమెట్ల, పెద్దారవీడు మండలంలోని బద్వీడు, బోయదగుంపుల, చట్లమిట్ల, కంభంపాడు, దేవరాజుగట్టు, గొబ్బూరు, ఒబులక్కపల్లి, పెద్దారవీడు, ప్రగళ్లపాడు, ఎస్ కొత్తపల్లి, సానికవరం, తంగిరాలపల్లి, తోకపల్లి గ్రామాల్లో కొత్త బోర్లను ప్రభుత్వం నిషేధించింది. పుల్లలచెరువు మండలంలోని అయ్యగారిపల్లి, చాపలమడుగు, చెన్నపాలెం, చౌటపాచర్ల, చౌటపల్లి, గారపెంట, ఇసుక త్రిపురవరం, కవలకుంట్ల, కొమరోలు, మానేపల్లి, మర్రివేముల, ముటుకుల, నర్సాపురం, పుల్లలచెరువు, రాచకొండ, శతకోడు, యండ్రపల్లి, రాచర్ల మండలంలోని ఆకవీడు, చినగానిపల్లి, చోళ్లవీడు, త్రిపురాంతకం మండలంలోని గణపవరం, లేళ్లపల్లి, మాధవవానిపల్లి, మేడపి, నర్సింగాపురం, రామసముద్రం, విశ్వనాథపురం గ్రామాల్లో కొత్తబోర్లు వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. యర్రగొండపాలెం మండలంలోని అల్లీపాలెం, అమానిగుడిపాడు, బిళ్లగొందిపెంట, గుర్రపుసాల, లింగంవానిపల్లి, మిళ్లంపల్లి, రామచంద్రాపురం, యర్రగొండపాలెం గ్రామాల్లో కొత్తబోర్లను ప్రభుత్వం నిషేధించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మార్కాపురం, యర్రగొండపాలెం, తర్లుపాడు, రాచర్ల, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్దారవీడు, గిద్దలూరు, దోర్నాల, దొనకొండ మండలాలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం 8 మీటర్లు దాటితే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్టే లెక్క. దీంతో డీప్బోర్లు కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడుతోంది. పశ్చిమ ప్రకాశంలోని పలు గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఏప్రిల్ 12 నాటికే తీవ్రత ఎక్కువగా ఉంది. మేనెల పూర్తయ్యేటప్పటికి పరిస్థితి మరింత దిగజారింది. నాతనంపల్లిలో డీప్ బోరు ఎండిపోయి నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంకుతాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న దర్శి మండలం చలివేంద్రం గ్రామస్తులు (ఫైల్)తీవ్రమవుతున్న తాగునీటి సమస్య -
మద్యం మత్తులో కత్తితో దాడి
● వ్యక్తికి తీవ్ర గాయాలు పామూరు: మద్యం మత్తులో వ్యక్తితో గొడవపడి కత్తితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి మండలంలోని బొట్లగూడూరులో జరిగింది. ఎస్సై కట్టా అనూక్ తెలిపిన వివరాలు... పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కోమటిగుంట్ల శివ శనివారం పామూరు మండలం కోడిగుంపల గ్రామంలోని తన బావ మహేంద్ర ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి నెల్లూరుజిల్లా వరికుంటపాడు మండలం వేంపాడు గ్రామంలో జరిగే తిరునాళ్లకు వెళుతున్నారు. మార్గమధ్యంలో బొట్లగూడూరు గ్రామానికి చేరుకున్న వారు అక్కడ మజ్జిగ తాగి వెళ్దామని దుకాణం వద్ద ఆగాడు. ఆ సమీపంలో బొట్లగూడూరు గ్రామానికి చెందిన ఆవుల వేణుగోపాల్ అనే వ్యక్తి కేకలు వేస్తుండగా ఎందుకు అరుస్తున్నావని ప్రశ్నించారు. దీంతో వేణుగోపాల్ పక్కనే ఉన్న కత్తి తీసుకొని శివ గొంతుపై పొడవడంతో తీవ్ర గాయమైంది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో ఆ వాహనంలో కందుకూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలుప్ర భుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యశాలకు వెళ్లి క్షతగాత్రుని పరిశీలించిన ఎస్సై కట్టా అనూక్ కేసునమోదుచేసి దర్యాప్తుచేస్తున్నాడు. -
ప్రత్యేక పూజలు
శింగరకొండలో వైవీ దంపతులఅద్దంకి: మండలంలోని శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం మాజీ టీటీడీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన పేరిట 40 రోజులు మన్యుసూక్తపారాయణ, మన్యుసూక్త హోమం అర్చకులు నిర్వహించారు. 41వ రోజైన ఆదివారం మండపారాధన తోపాటు ప్రత్యేక పూజలతో పూర్ణాహుతి నిర్వహించారు. హోమం పూర్తయిన తరువాత సుబ్బారెడ్డి దంపతులు లక్ష తమలపాకుల అర్చనలో పాల్గొన్నారు. వైవీ దంపతులను అర్చకులు స్వామి వారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆశీర్వచనం ఇచ్చారు. తదుపరి తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్, బాపట్ల జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, కొండపి మాజీ ఇన్చార్జి వెంకయ్య, రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ సెక్రటరీ కోయి అంకారావు, నాయకుడు జజ్జర ఆనందరావు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్పై విద్వేష పూరిత వ్యాఖ్యలా..
అద్దంకి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అవమానకరంగా మాట్లాడిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అద్దంకి పోలీస్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ మహా న్యూస్ ఛానల్కు చెందిన వంశీ అనే వ్యక్తి, అలాగే శ్రీనివాసరాజు అనే వ్యక్తి ప్రజా వేదికలపై, సోషల్ మీడియా వేదికగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ గురించి అత్యంత అవమానకరంగా, అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఓ గొప్ప ప్రజా నాయకుడిని ఉద్దేశించి ఈ తరహా వికృత వ్యాఖ్యలు చేయడం వల్ల కోట్లాది మంది వైఎస్సార్ అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని, వైఫల్యాలను బయటపెట్టిన ప్రతిసారీ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరిగాయో, అర్హులైన అభ్యర్థులు ఏ విధంగా నష్టపోయారో ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోందన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ ఉద్యమం మొదలుపెట్టగానే కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. అలాగే మొన్న కురిసిన వర్షాలకు అమరావతిలో ఏ విధంగా నీరు చేరిందో అందరికీ తెలుసన్నారు. దాన్ని పక్కదారి పట్టించేందుకు గండ్లు కొట్టి పొలాల్లోకి వదలడం వల్ల రైతులు ఎంతలా ఇబ్బంది పడ్డారో అందరూ చూశారన్నారు. ఈ వైఫల్యాలన్నింటినీ పక్కదోవ పట్టించేందుకే సరికొత్త డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. మహానేతపై చేసిన వీడియో ఆధారాలను పరిశీలించి, మహా న్యూస్ వంశీ, శ్రీనివాసరాజులపై భారతీయ న్యాయ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గుజ్జుల జగన్మోహన్రెడ్డి, ముస్లిం మైనారిటీ సెల్ నాయకుడు బాజీ, మాజీ కౌన్సిలర్ బాషా, వాణిజ్య విభాగం నాయకుడు ఊడత్తు సురేశ్, న్యాయ విభాగం నాయకుడు న్యాయవాది రమేశ్, మోటుపల్లి శివరమకృష్ణ, కే శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మట్టిని తవ్వేస్తూ..జేబులు నింపుకొంటూ..!
గ్రావెల్ తవ్వకాలు జరిపిన పొలం పక్కనే మామిడి తోటలు వ్యవసాయ భూముల్లో గ్రావెల్ మట్టి తవ్వకాలుకందుకూరు రూరల్: టీడీపీ నేతల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆదాయమే పరమావధిగా అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇష్టం వచ్చినట్లు ఇసుక, మట్టి తవ్వకాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మండలంలోని ఓగూరు రెవెన్యూ పరిధిలో ఉన్న దళితుల భూముల్లో ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ మట్టిని తవ్వేస్తున్నారు. ఓగూరు రెవెన్యూలో సర్వే నంబర్ 173లో అసైన్డ్ భూములను దళితులకు గతంలో పట్టాలు ఇచ్చారు. వీటిల్లో కొందరు మామిడి తోటలు సాగు చేయగా, మరికొన్ని భూముల్లో జామాయిల్ సాగు చేశారు. అయితే కొందరు భూములను ఖాళీగా ఉంచుకున్నారు. ఈ పొలాల్లో గ్రావెల్ మట్టి నాణ్యమైంది. దీంతో అధికార పార్టీ నాయకుల కన్ను ఆ భూములపై పడింది. ఖాళీగా ఉన్న దళితుల భూములను ఎకరా ఐదారు లక్షలు చొప్పున టీడీపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు కూడా కేవలం గ్రావెల్ మట్టిని తోలుకునే ఉద్దశ్యంతోనే కొనుగోలు చేస్తున్నారు. ఐదారు లక్షలు కొనుగోలు చేసిన భూముల్లో గ్రావెల్ మట్టిని తవ్వి లక్షలు ఆదాయం పొందుతున్నారు. గ్రావెల్ మట్టిని అమ్ముకోగా తిరిగి భూమి మిగులుతుంది. ఎవరైనా భూమి అమ్మాలంటే టీడీపీ నాయకులకు తెలియకుండా విక్రయించడానికి లేదు. ఒక లక్ష ఎక్కువైనా పర్వలేదు టీడీపీ నాయకులే భూములు కొనుగోలు చేయాలి. ఇదే టార్గెట్గా దళితుల భూములను మరొకరు కొనుగోలు చేయకుండా టీడీపీ నాయకులు భూములు కొనుగోలు చేసుకొని గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పరిధిలో సుమారు ఐదు ఎకరాల్లో మట్టిని తవ్వకాలు చేశారు. ప్రస్తుతం రెండు ఎకరాల్లో మట్టిని పది అడుగుల మేర తవ్వేశారు. దీంతో పక్క పొలాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. లోతు ఎక్కువగా తీయడంతో పక్క వర్షాలు పడితే అంచులు విరిగి పడుతున్నాయి. దీంతో పాటు గ్రావెల్ తవ్వకాలు జరిపిన పొలాల నుంచి పై పొలాలకు రైతులు వెళ్లేందుకు దారి కూడా ఇబ్బందిగా మారింది. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు రాకపోకలకు అంతరాయంగా మారింది. వ్యవసాయ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారు. కానీ ఆ ప్రాంతాల్లోని పక్క పొలాల రైతులు ఇబ్బందులను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిపై అధికారులకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ మట్టి తవ్వకాలు ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తుండడంతో తారు రోడ్లు కూడా మట్టి రోడ్లుగా మారుతున్నాయి. రాత్రిల్లో ఎక్కువగా మట్టిని తరలిస్తున్నారు. కందుకూరు ప్రాంతాల్లోని వెంచర్లకు, సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాల్లోకి ఈ మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వ్యవసాయ పొలాల్లో గ్రావెల్ తవ్వకాలను నిలిపివేయాలని రైతులు కోరుతున్నారు. దళితుల భూములను తవ్వేస్తున్నటీడీపీ నేతలు తక్కువ ధరలకు భూమి కొనుగోలు గ్రావెల్ మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న వైనం 10 అడుగుల మేర తవ్వకాలతో పక్క పొలాల రైతులకు ఇబ్బంది పట్టించుకోని అధికారులు -
అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం
● అటవీ శాఖ అధికారులకు అప్పగించిన యువకులు పొన్నలూరు: మండలంలోని పరుచూరివారిపాలెం సమీపంలో పాలేరు వద్ద అరుదైన నక్షత్ర తాబేలు దర్శ నమిచ్చింది. గ్రామానికి చెందిన యువకులు మన్మధ, శేఖర్ ఆదివారం గ్రామానికి సమీపంలోని పాలేరు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో అరుదైన నక్షత్ర తాబేలు వారి కంటపడింది. తాబేలును పట్టుకుని గ్రామానికి చేరుకోగా పెద్దల సూచన మేరకు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న అరుదైన నక్షత్ర తాబేలును యువకులు సంరక్షించి తీసుకురావడం అభినందనీయమని అటవీశాఖ అధికారి పేర్కొన్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
సంతమాగులూరు (అద్దంకి): విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కామేపల్లిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కామేపల్లి గ్రామానికి చెందిన దుద్దుకూరి రామాంజి(30) చిలకలూరిపేటకు చెందిన లక్ష్మితో వివాహమైంది. అయితే మనస్ఫర్థలతో మూడేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. ఈ క్రమంలో కామేపల్లి ఎస్సీ కాలనీలో సుజాత అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 30వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో బయటకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఎంతసేపటికి రాకపోవడంతో సుజాత బయటకు వచ్చి చూడగా..పక్కనే ఉన్న విద్యుత్ వైరు తగిలి విద్యుదాఘాతానికి గురైనట్లు గుర్తించింది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లింది. విషయం తెలుసుకున్న రామాంజీ తల్లి చాయమ్మ, బంధువులు ఆటోలో నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పట్టాభి రామయ్య తెలిపారు.రాగి వైరు మళ్లీ చోరీ ● మరమ్మతులు చేసిన 24 గంటల్లోనే మళ్లీ అపహరించిన దుండగులు ● గ్రామానికి నిలిచిన తాగునీటి సరఫరా టంగుటూరు: మండలంలోని మర్లపాడులో మంచినీటిని సరఫరా చేసే మోటార్ రాగి వైర్లు వరుసగా చోరీకి గురవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో రెండు రోజులక్రితం పైలెట్ ప్రాజెక్టు పథకం కింద పంపు హౌస్లో మోటార్ నుంచి వచ్చే రాగి వైర్ చోరీకి గురైంది. దీంతో గ్రామస్తులు, నాయకులు పోలీసులు సమాచారం ఇచ్చారు. అనంతరం శనివారం రాత్రి పది గంటలకు పంపు హౌస్లో వైర్లు మరమ్మత్తులు చేశారు. అయితే ఆదివారం మధ్యాహ్నం సమయంలో మళ్లీ పంపు హౌస్లో మరొకసారి కాపర్ వైర్లు దుండగులు అపహరించారు. దీంతో గ్రామస్తులు తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టు గ్రామానికి దూరంగా ఉండటంతో దుండగులు వైర్లు చోరీకి చేస్తున్నారు. -
కంట్రోలర్ను హెచ్చరించిన రైల్వే అధికారులు
సింగరాయకొండ: స్థానిక రైల్వేస్టేషన్లో శనివారం ఉదయం చైన్నె వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ రైలును 2,3 ప్లాట్ఫాం లైనులో కాకుండా మధ్య లైనులో ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇబ్బందులపై సాక్షిలో ‘ఇంత నిర్లక్ష్యమేల..రైలెక్కదెలా.?’ అన్న శీర్షికన కథనం రావడంతో రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఆదివారం విచారణ చేపట్టారు. రికార్డులను పరిశీలించి కంట్రోలర్ బాధ్యుడిగా గుర్తించి అతనికి హెచ్చరికలు జారీచేశారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా తగిన జాగ్రత్తలు పాటించనున్నట్లు రైల్వేశాఖ ఒక ప్రటకనలో స్పష్టం చేసింది. -
మట్టి దోపిడీని ఆపండి..!
కొత్తపట్నం: ‘ఇష్టం వచ్చినట్లు మట్టి తవ్వకాలు చేస్తే రైతులు అన్యాయమవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం చెరువు మట్టిని అక్రమంగా తరలించడం అన్యాయ’మని పలువురు నాయకులు ఖండించారు. మండలంలోని అల్లూరులో చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువు 1800 ఎకరాలు ఉంది. ఈ చెరువు కింద వేలాది ఎకరాలు చిన్న, సన్నకారు రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుడు కొప్పోలులో వేస్తున్న వెంచర్ల కోసం అల్లూరులోని చాపాయి, చక్రాయి ఇరిగేషన్ చెరువులో వారం రోజుల నుంచి మట్టిని తవ్వుతున్నారు. దీనిపై గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అల్లూరులో ఆదివారం వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, గ్రామస్తులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా వైఎస్సార్ సీపీ మండల అద్యక్షుడు, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ 2014 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ నీరు–చెట్టు పథకం పేరుతో మట్టిని విచ్చలవిడిగా అమ్ముకున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ జలహారతి, జలధార పథకాలు పెట్టి మట్టిని ఇష్టం వచ్చినట్లు తవ్వుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ఈ పథకాల ఉద్దేశం శ్మశానాల లెవలింగ్, ప్రభుత్వ రోడ్లు, ప్రభుత్వ భవనాలకు, చెరువులు అభివృద్ధి కోసమేనని, కానీ టీడీపీ నేతలు అధికారం ఉందని చెరువు నుంచి అక్రమంగా తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చెరువులో ఇష్టంవచ్చినట్లు తవ్వకాలు చేస్తే చెరువు ఉప్పునీరుగా మారుతుందన్నారు. వెంటనే మట్టి దోపిడీని ఆపాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగం జనరల్ సెక్రటరీ ఆళ్ల రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ చెరువు కింద ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్న కారు రైతులు బతుకున్నారని, వారికి పదో, ఇరవై బస్తాల వడ్లు పండుతాయని, అవి పండకుంటే చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒంగోలు మండలంలో, కొప్పోలులో చాలా చెరువులు ఉన్నాయని, అక్కడ తోలుకోవచ్చని, కానీ అక్కడ గ్రామస్తులు వ్యతిరేకించేసరికి ఇక్కడకు వచ్చారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలోనే చెరువును అభివృద్ధి చేశామన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామలింగం వెంకట్రావు మాట్లాడుతూ చెరువు మట్టిని గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఉపయోగించాలే తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం కాదన్నారు. పంచాయతీ అధికారులను సంప్రదించకుండా నేరుగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకొని ఎలా మట్టి తవ్వుతారని ప్రశ్నించారు. సీపీఎం నాయకుడు ఎస్ స్వామిరెడ్డి మాడ్లాడుతూ చాప్రాయి, చక్రాయి చెరువు నుంచి ఇష్టం వచ్చినట్లు మట్టిని తవ్విస్తే నీరు ఉప్పుగా మారి రైతుల పొలాలు పండవన్నారు. జలహారతి, జలధార పథకం ద్వారా గ్రామాలు, చెరువులు అభివృద్ధి చేయాలే తప్ప వెంచర్లకు మట్టి తోలడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎంపీటీసీ మిట్నసల శాంతారావు మాట్లాడుతూ ఈ చెరువులో లోతుగా మట్టి తోలడం వల్ల ఇద్దరు దళిత పిల్లలు గుంతలో పడి చనిపోయారని గుర్తు చేశారు. చెరువులో మట్టి తవ్వకాలు ఇష్టం వచ్చినట్లు చేస్తే పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. గ్రామస్తుల అనుమతి లేకుండా ఏ విధంగా మట్టి తవ్వి వెంచర్లకు తరలిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సామంతుల తోటారెడ్డి, వి.రామచంద్రారెడ్డి, జెట్టి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామలింగారెడ్డి, స్వర్ణ శివారెడ్డి, శ్రీనారెడ్డి, బుర్ల సుధాకర్రెడ్డి, కె. చిట్టిబాబు, తుళ్లూరి వెంకటనారాయణ, మల్లిఖార్జున, ఎం. హరిబాబు, తాతా నాంచార్లు, తంబి వెంకటేశ్వర్లు, బేల్దారి నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తే పంటలకు ఇబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రైతులకు అన్యాయం చేయొద్దు పంచాయతీ అనుమతి లేకుండా ఎలా తవ్వకాలు చేస్తారు విలేకరుల సమావేశంలో ప్రశ్నించిన పార్టీల నేతలు -
అవయవదానం చాలా గొప్పది
● అవయవదానం చేసిన లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు కలెక్టర్ రాజాబాబు సత్కారం ఒంగోలు సబర్బన్: అవయవదానం ఎంతో గొప్పదని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. కొమ్మూరి లక్ష్మయ్య అనే వ్యక్తి అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపిన అతని భార్య, కుటుంబ సభ్యులను శనివారం ప్రకాశం భవనంలోని తన కార్యాలయంలో కలెక్టర్ సత్కరించారు. జిల్లాలోనే తొలిసారిగా ఈ అవయవాలను సమర్థవంతంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ అభినందించారు. ఒంగోలు నగర శివారులోని ముక్తినూతలపాడు ప్రాంతానికి చెందిన కొమ్మూరి లక్ష్మయ్య (52) ఒంగోలులోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి పూర్తిగా విషమించింది. తీవ్ర విషాదంలో ఉన్నప్పటికీ ఆ పేద కుటుంబ సభ్యులు పెద్దమనసు చూపారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో కిమ్స్ వైద్యులు అతని కాలేయం, కిడ్నీలు, కళ్లను తీసి ఇతరులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకున్నారు. ఒక కిడ్నీని అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి విజయవంతంగా అమర్చారు. మరో కిడ్నీని గుంటూరు రమేష్ ఆస్పత్రికి, కళ్లను ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రికి పంపారు. డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు ద్వారా ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్.. లక్ష్మయ్య భార్య నాగదేవి, కుమారుడు షాలోమ్ రాజవర్దన్, కూతుళ్లు, అల్లుళ్లను తన చాంబర్కు పిలిపించి సత్కరించారు. లక్ష్మయ్య అవయవాలను దానం చేయడానికి ముందుకొచ్చి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రశంసించి జీవనదాన్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. లక్ష్మయ్య భార్యకు ఒంగోలు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికురాలుగా ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లక్ష్మయ్య వైద్య ఖర్చులకు అయిన రూ.70 వేలను ఆ కుటుంబానికి చెక్ రూపంలో కిమ్స్ వైద్యులు తిరిగిచ్చేశారు. లక్ష్మయ్య కుమారుడు ప్రస్తుతం ఐటీఐ రెండో సంవత్సరం చదువుతున్నాడని, కోర్సు పూర్తికాగానే తమ వద్దే ఉద్యోగం ఇస్తామని కూడా వైద్యులు తెలిపారు. తమ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి మరో లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా అందేలా చూస్తామని వారు ప్రకటించారు. దాత కుటుంబానికి అండగా నిలిచి అవయవదానాన్ని ప్రోత్సహించిన కిమ్స్ వైద్య బృందాన్ని కూడా కలెక్టర్ సత్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, కిమ్స్ సీఓఓ అంకిరెడ్డి, మెడికల్ డైరెక్టర్ శ్రీహరిరెడ్డి, వైద్యులు రమేష్ బాబు, రమణారెడ్డి, రామకృష్ణ, జగదీష్, బాలమురళి, అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
ఇంత నిర్లక్ష్యమేల.. రైలెక్కేదెలా.?
● అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైలు ఎక్కేందుకు తీవ్రంగా ఇబ్బందిపడిన ప్రయాణికులు సింగరాయకొండ: సింగరాయకొండ రైల్వేస్టేషన్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా శనివారం ఉదయం పినాకిని ఎక్స్ప్రెస్ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పినాకినీ రైలు ప్రతిరోజూ రెండో నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తుంటుంది. శనివారం మాత్రం అధికారులు రైలు వచ్చే ముందుగా ప్లాట్ఫాం నంబర్ మార్చడంతో పాటు మార్చిన ప్లాట్ఫాంపైకి కాకుండా మరో ట్రాక్పైకి రావడంతో ప్రయాణికులు నానా రకాలుగా అవస్థ పడ్డారు. చెన్నె వైపు వెళ్లే పినాకిని ఎక్స్ప్రెస్ రోజూలాగే రెండో నంబర్ ప్లాట్ఫాంపైకి రావాల్సి ఉంది. కానీ, చివరి క్షణంలో మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి వస్తుందని ప్రకటించారు. దీంతో ప్రయాణికులంతా రెండో నంబర్ నుంచి మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి పరుగులు తీశారు. తీరా చూస్తే.. రైలు మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి కూడా రాకుండా ఆ రెండు ప్లాట్ఫాంల మధ్య ఉన్న లూప్లైన్లోకి వచ్చి ఆగింది. దీంతో ఆ రైలు ఎక్కేందుకు ప్లాట్ఫాం లేకుండా పోయింది. అప్పటికే మూడో నంబర్ ప్లాట్ఫాంపైకి పరుగులు తీసి ఉన్న వందలాది మంది ప్రయాణికులు లూప్లైన్లో ఆగిన రైలు ఎక్కేందుకు పట్టాలపైకి దిగి మళ్లీ పరుగులు పెట్టారు. బ్యాగులు, పసిపిల్లలతో ఉన్న వారితో పాటు మహిళలు, వృద్ధులు రైలు ఎక్కేందుకు నరకం చూశారు. రైలు దిగాల్సిన వారు సైతం రెండువైపులా ప్లాట్ఫాంలు లేకపోవడంతో నానా తంటాలు పడ్డారు. సింగరాయకొండ రైల్వేస్టేషన్లో ఇటీవల ఇలా జరగడం నిత్యకృత్యమైందని, రైల్వే అధికారులు ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
గాలివాన బీభత్సం
పెద్దదోర్నాల అయ్యప్పస్వామి దేవాలయం వద్ద విరిగిన విద్యుత్ స్తంభం పెద్దదోర్నాల మండల కేంద్రంలో కురుస్తున్న వర్షం కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై నేలకూలిన చెట్టు పెద్దదోర్నాల: గాలివాన బీభత్సం సృష్టించడంతో కొన్ని గంటల పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దదోర్నాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు గంటన్నర పాటు తీవ్ర స్థాయిలో గాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి మండల కేంద్రం అతలాకుతలమైంది. గాలివాన తీవ్రతకు మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, చెట్ల కొమ్మలతో పాటు పలు దుకాణాలకు సంబంధించిన పైకప్పు రేకులు నేలకూలాయి. స్థానికంగా శ్రీశైలం రహదారిలో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం వద్ద ఓ విద్యుత్ స్తంభం విరిగిపడింది. ఆ స్తంభానికి ఉన్న విద్యుత్ తీగలు రోడ్డుపై వేలాడుతూ ఉండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాటు శ్రీశైలం రహదారిలోని పలు దుకాణాలకు సంబంధించిన పైకప్పు, రేకులు నేలకూలాయి. కర్నూలు, గుంటూరు రహదారిలోని యడవల్లి వద్ద తిరుమలనాథస్వామి ఆలయ సమీపంలో ఓ భారీ వృక్షం నేలకూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై వెంకట రమణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించడంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం రహదారిలో రోడ్డుకు ఇరువైపులా కొందరు యజమానులు వారి వారి స్థలాలను ఎత్తు పెంచుకోవటంతో భారీగా వర్షం నీరు పల్లంలోకి చేరి ఆ ప్రాంతమంతా చెరువును తలపించింది. దీంతో మోకాళ్ల లోతుకు చేరిన వర్షం నీటిలో ప్రయాణించేందుకు పలుపురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిన మండల ప్రజలు శనివారం కురిసిన భారీ వర్షానికి సేద తీరారు. పత్తి పంటలో భారీగా చేరిన వర్షం నీరు పెద్దదోర్నాల మండలంలో కురిసిన వర్షానికి మండల పరిధిలోని ఐనముక్కల, యడవల్లి తదితర ప్రాంతాల్లో సాగులో ఉన్న పత్తి పంటలో భారీగా నీరు నిలిచింది. ఆయా ప్రాంతాల్లోని నర్సరీలు గాలివాన తీవ్రతకు నేలవాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. పత్తి పంటలో నిలిచిన వర్షం నీరు రోడ్డుపై చెట్లు నేలకూలడంతో కర్నూలు–గుంటూరు రహదారిపై నిలిచిన వాహనాలు పెద్దదోర్నాలలో గంటన్నర పాటు ఈదురుగాలులతో భారీ వర్షం అయ్యప్పస్వామి ఆలయం వద్ద నేలకొరిగిన విద్యుత్ స్తంభం కర్నూలు – గుంటూరు రహదారిపై కూలిన భారీ వృక్షం వర్షం నీరు చేరి చెరువును తలపించిన శ్రీశైలం రహదారి -
గోవుల కేసులో నిందితుల అరెస్ట్
మార్కాపురం టౌన్: పట్టణంలో రెండు రోజులుగా గోవులను వధిస్తూ మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఎస్సై విశ్వనాథరెడ్డి శనివారం తెలిపారు. గోవులను ఎవరైనా వధించి మాంసాన్ని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గోవధ, గోవులను తరలించే విషయంపై సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలపాలని కోరారు. ఒంగోలు టౌన్: జిల్లాలోని సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కే కమలాకర్, దర్శి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎం.మురళి, టాస్క్ఫోర్స్ ఎస్సై వెంకట కృష్ణయ్యలను ఎస్పీ హర్షవర్దన్రాజు శనివారం అభినందించారు. పదోన్నతి పొందిన ఎస్సైలు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. బల్లికురవ: తిరుపతి వెంకన్నస్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న బృందంలో ఓ యువకుడిని గుర్తు తెలియని కారు ఢీకొనడంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురై పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి మృతిచెందాడు. శనివారం మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు బల్లికురవ ఎస్సై వై.నాగరాజు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బల్లికురవ మండలంలోని కొప్పరపాడు గ్రామానికి చెందిన గాలి నాగరాజు (40) అదే గ్రామానికి చెందిన మరికొంతమందితో కలిసి ఈ నెల 24వ తేదీ తిరుపతికి కాలినడకన వెళ్తుండగా, ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన నాగరాజును 108 వాహనంలో కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొంతమేరకు కోలుకోవడంతో రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు గ్రామానికి తీసుకొచ్చారు. కానీ, గాయాల నుంచి పూర్తిగా కోలుకోనందున పరిస్థితి విషమించి చనిపోయినట్లు పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే నాగరాజు మృతితో గ్రామంలో విషాదం అలముకుంది. -
టీడీపీలో విగ్రహ రచ్చ
● ఎన్టీఆర్ విగ్రహం ప్రారంభంలో వివాదం ● ఆవిష్కరించిన టీడీపీ ఎన్ఆర్ఐ ● మళ్లీ కొందరు టీడీపీ నేతలు ముసుగు వేయడంతో ఘర్షణ ఉలవపాడు: ఉలవపాడులో ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు విగ్రహం వివాదాలకు కేంద్రంగా మారింది. చివరికి తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఉలవపాడు బస్డాండ్ సెంటర్లో ఏడేళ్ల క్రితం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలో స్థలం విషయంలోనూ పలు వివాదాలు వచ్చాయి. అప్పుడు వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పోతుల రామారావు సహకారంతో స్థానిక టీడీపీ నాయకులు చందాలు వేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విగ్రహాన్ని ఆవిష్కరించలేదు. పెద్ద నాయకులు వస్తారు.. చేయించాలని చెప్పి ఏడేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి ముసుగు తీయలేదు. ఈ నేపథ్యంలో మహానాడు పూర్తయిన తరువాత గురువారం ఎన్టీఆర్ జయంతి నాడు ఉలవపాడుకు చెందిన ఒక ఎన్ఆర్ఐ తన కార్యకర్తలతో వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సదరు ఎన్ఆర్ఐ అనుచరుని కుమార్తె విగ్రహం ఏర్పాటుకు అధిక నగదు ఇచ్చినట్లు సమాచారం. అయితే, తమకు తెలియకుండా ఎలా ఆవిష్కరిస్తారంటూ కొందరు తెలుగు తమ్ముళ్లు, పదవుల్లో ఉన్న వారు కలిసి మళ్లీ విగ్రహానికి ముసుగు వేశారు. శనివారం మళ్లీ సదరు ఎన్ఆర్ఐ వచ్చి ముసుగు తీసి దండలు వేశారు. మళ్లీ టీడీపీ నాయకులు వచ్చి ముసుగు వేయడంతో మండలంలో వివాద వాతావరణం నెలకొంది. శనివారం విగ్రహం వద్దకు వచ్చిన ఎన్ఆర్ఐపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడు, అతని కుమారుడు దాడి చేసినట్లు పోలీసులకు సదరు ఎన్ఆర్ఐ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ నేతలకు మద్దతుగా కొల్లూరుపాడు, ఆత్మకూరు నుంచి మరో ఇద్దరు నేతలు వచ్చి ముసుగు వేసినట్లు తెలిసింది. విగ్రహం ముసుగు వేయడం.. తీయడం వలన ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దనేత మాత్రం ఈ సమస్య పెద్దది కాకుండా చూడాలని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. -
బావిలో మృతదేహం
● నడుముకు తాడుతో రాయి ● అనుమానాస్పదస్థితిలో గుర్తుతెలియని యువకుడి మృతి సింగరాయకొండ: సుమారు 28 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని యువకుడికి నడుముకు తాడుతో రాయి కట్టి పాడుబడిన బావిలో పడేసిన సంఘటన శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మండలంలోని పాతసింగరాయకొండ పంచాయతీ వరాహలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన దేవునితోటలో ఉన్న పాడుబడిన బావిలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం బావి పరిసరాలలో దుర్వాసన వస్తుండటంతో గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి చూశారు. యువకుని మృతదేహం తేలాడుతూ ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు.. యువనేస్తం ఫౌండేషన్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పరిశీలించారు. అతని ఒంటికి తాడు కట్టిన రాయి ఉంది. మొహం బాగా ఉబ్చి ఉంది. మోహంపై పురుగులు పాకటంతో గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉందని పోలీసులు తెలిపారు. ఒంటిమీద ఎటువంటి గాయాలు లేవన్నారు. ఎర్ర రంగు టీషర్టు, బులుగు రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడని చెప్పారు. అయితే, ఇది ముమ్మాటికీ హత్యేనని స్థానికులు ఆరోపిస్తుండగా.. పోలీసులు మాత్రం ఇది హత్యా.. లేక ఆత్మహత్య అనేది తమ విచారణలో తేలుతుందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. సంఘటన స్థలాన్ని సీఐ పి.శ్రీహరి పరిశీలించారు. మృతదేహం ఉన్న స్థితిని బట్టి ఘటన జరిగి మూడు రోజులై ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.సుధీర్కుమార్ తెలిపారు. -
సింగరాయకొండలో కూలిన భారీ వృక్షం...
సింగరాయకొండ: స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుకవైపు రోడ్డులో శనివారం భారీ చెట్టు కూలిపడింది. శుక్రవారం రాత్రి ఈదురుగాలులు వీచడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ కండక్టర్ తెగింది. దీంతో విద్యుత్శాఖ అధికారులు ఆ చెట్టుకు విద్యుత్ పరికరాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యుత్ కండక్టర్ ఏర్పాటు చేసి తాత్కాలికంగా విద్యుత్ను పునరుద్ధరించారు. అయితే, శనివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో హఠాత్తుగా ఆ చెట్టుకు విద్యుత్ పరికరం ఏర్పాటు చేసిన ప్రాంతంలో మంటలు చెలరేగాయి. స్థానికులు దూరంగా పరిగెత్తుతుండగానే.. ఒక్కసారిగా భారీ వృక్షం కూలి రోడ్డుపై అడ్డంగా పడింది. ముందుగా మంటలు రావడంతో అక్కడున్నవారు అప్రమత్తమవడంతో ప్రాణ నష్టం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్టును తొలగించిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
పరిశ్రమబండబారి
చీమకుర్తి: జిల్లాలోని చీమకుర్తి పరిసరాల్లో వందకుపైగా చిన్నా, పెద్దా క్వారీలు ఉన్నాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల రాబడికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న గ్రానైట్ పరిశ్రమ నేడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం గ్రానైట్ ఎగుమతులు దాదాపు సగానికి పైగా తగ్గిపోయాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ పెనుభారంగా మారింది. క్వారీలను నడపలేక యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధానంగా రామతీర్థానికి ఉత్తరం, పడమర కేంద్రంగా ఎర్రకొండ నుంచి కర్నూల్ రోడ్డు వరకు, ఆర్ఎల్పురం, బూదవాడ సరిహద్దు పరిధిలోనున్న గ్రానైట్ క్వారీలు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. కర్నూల్ రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్న క్వారీల్లో నాణ్యత లేని గ్రానైట్ కారణంగా కంపెనీలు పూర్తిగా దెబ్బతిని మూతపడగా, మరికొన్ని సబ్లీజుల పేరుతో కనాకష్టంగా నడుపుకొస్తున్నారు. దాదాపు 20కి పైగా క్వారీలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి. భారంగా మారిన రాయల్టీ.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గ్రానైట్ క్వారీలు చెల్లించాల్సిన రాయల్టీని భారీగా పెంచటం, వసూళ్ల బాధ్యత ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించటం క్వారీలకు మరింత కష్టకాలంగా మారింది. కరోనా కాలం నుంచి ఎగుమతులు కూడా పూర్తిగా దెబ్బతిన్నా ఇటీవల కొద్దో గొప్పో కోలుకుంటుందనుకుంటున్న దశలో పశ్చిమాసియా యుద్ధం గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. పుండుమీద కారం చల్లినట్లు ఎగమతులు లేక, భారంగా మారిన గ్రానైట్ క్వారీలకు పెరిగిన డీజిల్ భారం మరింత అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితులు కల్పించాయి. రోజుకు సరాసరిన 70 వేల లీటర్ల డీజిల్ కావాల్సి వస్తుందని గ్రానైట్ యజమానులు చెబుతున్నారు. నెల రోజుల క్రితం వరకు రూ.97 ఉన్న డీజిల్ తాజాగా రూ.112కు పైగా పెరగటం, ఇండస్ట్రీ అవసరాలకు అయితే లీటర్ రూ.150కు పైగా ధర ఉండటం గ్రానైట్ పరిశ్రమపై మరింత భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో మరిన్ని కష్టాలు.. అప్పుల్లో కూరుకుపోయి అమ్మకానికి కూడా సిద్ధంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమ మనగడకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఏమాత్రం ఊరట లభించడంలేదని క్వారీ యజమానులు వాపోతున్నారు. సహకారం అందించకపోగా ఉన్న రాయల్టీని ఏజన్సీల ద్వారా పెంచటం, క్వారీలను రెన్యువల్ చేయకుండా నెలల తరబడి ముడుపుల కోసం వేధించటం వంటి కారణాలతో యజమానులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వేధింపులు భరించేకంటే క్వారీలను అమ్ముకొని పోతేనే మేలేమోనని యజమానులు అంటున్నారు. క్వారీల నుంచి దోచుకుందామనే ఆలోచనే తప్ప కాస్త అండగా నిలిచి గ్రానైట్ పరిశ్రమను ఆదుకుందామనే ఆలోచన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి ఏమాత్రం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులపై తీవ్ర ప్రభావం.. గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుండడంతో దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి. ఇరాన్ యుద్ధం, వేసవి ఎండలు, బెంగాల్ ఎన్నికల కారణంగా ఊర్లకు పోయిన కార్మికులు తిరిగి రాకపోవడం, ఉన్న కార్మికులకే ఉపాధి అవకాశాలు దెబ్బతినటంతో కార్మికుల జీవితాలు కకావికలమవుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. -
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు మందగించాయి. ఆదాయం బాగా పడిపోతుండడంతోఈ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీనికి తోడు రాయల్టీ వసూలు కోసం ప్రభుత్వం నియమించిన ఏఎంఆర్ సంస్థ గ్రానైట్ పరిశ్రమకు గుదిబండలా తగులుకుంది. ఫలితంగా క్వారీలు నిర్వహించలేక చాలా మంది యజమానులు చేతులెత్తేస్తున్నారు. ప్రొడక్షన్కు, వస్తున్న రాబడికి పొంతన లేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికే కొన్ని క్వారీలు మూతపడగా, మరికొన్ని అదేబాట పడుతున్నట్టు తెలుస్తోంది.


