ఒంగోలు సబర్బన్: మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి స్వామి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఒంగోలు నగరంలోని బృందావనం కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వివిధ పథకాల కింద మెప్మా మహిళలకు రూ.18.60 కోట్లు, డీఆర్డీఏ మహిళలకు రూ.314.61 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.67.28 కోట్ల విలువైన బ్యాంకు చెక్కులను ఆర్థిక రుణాలుగా అందించారు. ఆ ప్రాంగణంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును కలెక్టర్ పి.రాజాబాబు ప్రారంభించి అర్హులైన బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించారు. మెప్మా, ఐసీడీఎస్, పోలీస్, డీఆర్డీఏ, ఏపీఎంఐపీ, బ్యాంకింగ్, పరిశ్రమలు, ఏపీఎస్ ఆర్టీసీ విభాగాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి, కలెక్టర్తో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇతర అతిథులు వీక్షించారు. రాయితీ ద్వారా మంజూరైన ఒక ట్రాక్టర్, మూడు ఆటోలను లబ్ధిదారులకు అందించారు. ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్, డీఆర్వో చిన ఓబులేసు, డీఆర్డీఏ పీడీ నారాయణ, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, ఎస్డీసీ కళావతి, ఎల్డీఎం రమేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, ఐసీడీఎస్ పీడీ నాగమణి, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


