breaking news
Prakasam District Latest News
-
నాడు వెలుగులు..నేడు చీకట్లు
● నిలిచిన మార్కాపురం మెడికల్ కాలేజీ పనులు మార్కాపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెడికల్ కాలేజీ పనులు ఆగిపోయాయి. ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పనులను నిలిపేసింది. దీంతో ఆ ప్రాంతమంతా చిల్లచెట్లతో నిండిపోయింది. నిర్మాణ సంస్థ కూడా అక్కడున్న మెటీరియల్ను తరలించింది. దీంతో మార్కాపురం జిల్లా ఇచ్చారన్న ఆనందం ఈ ప్రాంత ప్రజల్లో కనిపించడం లేదు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మార్కాపురం వద్ద ప్రారంభించిన మెడికల్ కాలేజీ ఎన్నికల నాటికి దాదాపు 70 శాతం పూర్తికాగా కూటమి ప్రభుత్వం రాగానే చీకట్లు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో 76 మంది డాక్టర్లలో 350 పడకలతో రెండు ఆక్సిజన్ ప్లాంట్లతో రోజుకు 650 నుంచి 700 మధ్య ఓపీ ఉన్న జీజీహెచ్ లో వైద్యసేవలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కేవలం 15 నుంచి 20 మంది డాక్టర్లు మాత్రమే రోగులకు సేవలు అందిస్తున్నారు. ఓపీ కూడా 300 మధ్య ఉంటోంది. క్రిటికల్ కేసులను ఒంగోలుకు రెఫర్ చేస్తున్నారు. నాడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో సిబ్బంది క్వార్టర్స్, నర్సింగ్ కళాశాల, జంట్స్, లేడీస్ హాస్టల్స్, సెంట్రల్ క్యాంటిన్ ఇలా అనేక భవన నిర్మాణ పనులను దాదాపు పూర్తయ్యాయి. జీజీహెచ్లో 420 బెడ్లను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఇవన్నీ కనిపించడం లేదు. ప్రస్తుతం సెక్యూరిటీ గార్డు, ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే ఉన్నారు. జీజీహెచ్లో కూడా అధునాతన మెడికల్ సామగ్రిని రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలకు, వైద్యశాలలకు తరలించారు. దీంతో ఇక్కడి సేవలు తగ్గిపోయాయి. మెరుగైన వైద్యసేవల కోసం ఒంగోలు, గుంటూరుకు తరలిస్తున్నారు. -
సిటీ స్కానింగ్ కోసం పరుగులు...
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేరుకు 50 వరకు పీహెచ్సీలు ఉన్నాయి. 15 యూపీహెచ్సీలు ఉన్నాయి. ఒంగోలు, మార్కాపురంల్లో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులు ఉన్నాయి. మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించినా ఇక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు. ప్రజారోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జీజీహెచ్కు 76 మంది వైద్యులను కేటాయించగా చంద్రబాబు ప్రభుత్వం రాగానే వారందరినీ బదిలీ చేసింది. ఇప్పుడు కేవలం 20 మంది వైద్యులు మాత్రమే మిగిలారు. జీజీహెచ్ పరిస్థితి ఇలా ఉంటే పీహెచ్సీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గత ప్రభుత్వంలో ఒక్కో పీహెచ్సీకి ఇద్దరు వైద్యులను నియమించారు. నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న దోర్నాల, యర్రగొండపాలెం, గిద్దలూరు, కంభం మండలాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యుల కొరత వేధిస్తోంది. యర్రగొండపాలెం ప్రభుత్వ 100 పడకల ఆస్పత్రిలో 22 మంది వైద్యులకు గాను 15 మంది మాత్రమే ఉన్నారు. రెగ్యులర్ రేడియాలిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. దాంతో పీజీలను కాంట్రాక్ట్ పద్ధతిలో వినియోగిస్తున్నారు. సివిల్ సర్జన్, జనరల్ మెడిసిన్ వైద్యుల కొరత ఉంది. ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఇద్దరు మాత్రమే ఉన్నారు. పీడియాట్రిక్ సీఎస్ఎస్ కూడా లేకపోవడంతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. గిద్దలూరు 100 పడకల ఆస్పత్రిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ముగ్గురు గైనకాలజిస్టులకు గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. కాన్పుల కోసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. జనరల్ డాక్టర్ లేరు. స్టాఫ్నర్సు పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఎంతో ముఖ్యమైన ఫార్మాసిస్టు పోస్టు కూడా ఖాళీగా ఉంది. ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎక్కడ చూసినా వైద్యుల కొరత కనిపిస్తోంది. వారానికి ఒకసారే సిజేరియన్ ఆపరేషన్లు... నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రిలో వింత పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఇద్దరు గైనకాలజిస్టులకు గాను ఒక్కరు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా అనస్తీషియన్ లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్లకు ఇబ్బందిగా మారింది. దాంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇక్కడ ఒక అనస్తీషియన్ను కేటాయించారు. వారానికి ఒకసారి మాత్రమే దోర్నాలకు వచ్చి పోతుంటారు. అనస్తీషియన్ డ్యూటీకి వచ్చిన రోజు మాత్రమే ఆపరేషన్లు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వస్తే ప్రైవేటు వైద్యశాలలే దిక్కవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్... వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో కంభం ప్రభుత్వ వైద్యశాలలో కోటి రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దాన్ని పక్కన పడేశారు. హైవే రోడ్డు ఏర్పాటు చేసిన తరువాత ఇటీవల కాలంలో కంభంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారికి ఒక్కోసారి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. గుండె జబ్బుల్లో కూడా కొంతమందికి ఆక్సిజన్ అవసరమవుతుంది. ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న ఆక్సిజన్ ప్లాంటును వినియోగంలోకి తీసుకొస్తే ప్రాణాపాయంలో ఉన్న వారికి ఉపయోగపడుతుంది. ఈ సమస్య కూటమి పాలకులకు పట్టడంలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అనేక పీహెచ్సీలు, యూపీహెచ్సీల్లో మందులను బయటి మెడికల్ షాపులకు రాసిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో కనీసం బ్యాండేజీ క్లాత్, దగ్గు మందులు, ఆయింట్మెంట్లు లేవని తెలుస్తోంది. సంజీవని పేరుతో నాటకాలు... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసింది. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలకు సమానంగా విలేజి క్లినిక్లను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అండగా నిలిచింది. జగనన్న సురక్ష పథకంలో పట్టణం, గ్రామం అనే తేడా లేకుండా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగుల వివరాలను డిజిటలైజ్ చేసింది. అంతేకాకుండా రోగులను ఎప్పుటికప్పుడు ఫాలో చేయడం, మందులు వేసుకుంటున్నారో లేదో గమనించడం, దీర్ఘకాలిక రోగులు రెగ్యులర్గా ఆస్పత్రికి వచ్చి చికిత్స కొనసాగించేలా చేయడం వంటివి అందులో పొందుపరిచారు. ఎన్నికలు రావడంతో అది ఆగిపోయింది. ఇప్పుడు దాన్నే కూటమి ప్రభుత్వం సంజీవని పేరుతో కలరింగ్ ఇస్తోంది. పేషంట్ కేర్ కో ఆర్డినేటర్లను నియమించి వారి ద్వారా రోగుల వివరాలను డిజిటలైజ్ చేస్తామని, రోగి వైద్య చికిత్స కొనసాగించేలా వారు చూస్తారని చెబుతోంది. పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడం, ఎల్లో మీడియాలో కొత్త పథకంలాగా ప్రచారం చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు శనివారం గిద్దలూరు మండలంలోని కేఎస్ పల్లిలో సంజీవని పథకాన్ని ప్రారంభిస్తుండడంతో జనాలు జగనన్న సురక్షను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. గిద్దలూరు రూరల్: సీఎం చంద్రబాబు సంజీవని పథకం ప్రారంభించేందుకు గిద్దలూరు వస్తున్నారు. ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలను ఒకసారి పరిశీలిస్తే..అన్నీ సమస్యలే కనిపిస్తున్నాయి. వారానికి వెయ్యి ఓపీలు ఉంటాయి. స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా అత్యాధునిక వైద్య పరికరాలు లేవు. దీంతో రోగులు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు పొందాల్సిన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ ఉంది. అయితే శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేవు. ఎముకల శస్త్రచికిత్స నిపుణులు ఉన్నా పరికరాలు లేకపోవడంతో ఆపరేషన్లు జరగడం లేదు. గైనకాలజిస్టులు ముగ్గురు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఫలితంగా మహిళలు అవస్థలు పడుతున్నారు. రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉంది. సీటి స్కానింగ్ లేదు. అంబులెన్స్ మరమ్మతులకు గురైంది. 3 నెలలుగా వైద్యశాలలో పక్కన పడేసి ఉంచారు. ఆల్ట్రాసౌండ్ మిషన్ పాతది కావడంతో మొరాయిస్తోంది. గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాల 100 పడకల వైద్యశాలగా రికార్డుల ప్రకారం ఉన్నప్పటికీ వైద్యశాలలో కేవలం 80 పడకలు మాత్రమే ఉన్నాయి. ప్రధానమైన ప్రభుత్వ వైద్యశాలలోనే ఇన్ని సమస్యలు తిష్టవేసుకుని కూర్చుంటే మారుమూల ప్రాంతంలోని కేఎస్.పల్లెలోని పీహెచ్సీలో కొత్తగా సంజీవని ప్రజల ప్రాణాలను నిలబెడుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు పెదవి విరుస్తున్నారు.మార్కాపురం జిల్లాలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల మార్కాపురం సమీపంలోని పలకల క్వారీ వద్ద బస్సు ప్రమాదంలో 14 మంది మృత్యువాత పడగా 20 మందికి పైగా గాయపడడం తెలిసిందే. గాయపడిన వారికి అత్యవసరంగా చేయడానికి సిటీ స్కానింగ్ కోసం కొంతమందిని వెంటనే ఒంగోలు జీజీహెచ్ తరలించాల్సి వచ్చింది. తరచుగా ఇదే ఘటనలు పునరావృతమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా తీవ్రంగా గాయపడ్డా, పక్షవాతం వచ్చి ప్రాణపాయంలో పడినా సిటీ స్కానింగ్ అవసరం చాలా ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అయినా మార్కాపురం జీజీహెచ్లో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయడానికి కూటమి పాలకులకు మనసొప్పడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు, యర్రగొండపాలెం 100 పడకల ఆస్పత్రుల్లో కూడా సిటీ స్కానింగ్ సౌకర్యం లేదు. కనీసం ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయాలన్నా రేడియాలజిస్టులు లేరు. -
మాకు అన్యాయం జరిగింది
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ హౌస్ మ్యాపింగ్లో అన్యాయం జరిగింది. నా పేరు సాల్వ వెంకటేశ్వర్లు మాది గొట్టిపడియ గ్రామం. అక్కడ 47 సంత్సరాల నుంచి నివసిస్తున్నాను. మాకు అన్ని అధారాలు ఉన్నా పునరావాస ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు. హౌస్ మ్యాపింగ్లో కొత్త ఇల్లు అని పడిందని అధికారులు చెప్పారు. న్యాయం చేయాలని కోరుతున్నాం. – సాల్వ వెంకటేశ్వర్లు, గొట్టిపడియ గ్రామం. ప్యాకేజీలో అన్యాయం నా పేరు కొర్రపోలు పేతురు. గొట్టిపడియలో 40 ఏళ్ల నుంచి నివసిస్తున్నాను. మాకు అన్ని ఆధారాలు ఉన్నా ప్యాకేజీ లిస్టులో పేరు లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, స్కూల్ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్న ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు. – కొర్రపోలు పేతురు, గొట్టిపడియ గ్రామం. -
శనివారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2026
రెండేళ్లుగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన చంద్రబాబు సంజీవని పేరుతో కొత్త డ్రామాలకు తెరదీశారు. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు స్పెషాలిటీ వైద్యం,పేద బిడ్డలకు వైద్య విద్యను అందించే మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్రలు మొదలుపెట్టారు. నిరుపేదలకు ఆరోగ్య భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. విలేజీ క్లినిక్లకు తాళం వేసేసి సంజీవనితో ప్రపంచస్థాయి వైద్యసేవలు ప్రజలకు అందిస్తామని గొప్పలు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కొత్త వైద్యం..పాత చికిత్స! -
ప్యాకేజీలో మాయ!
బాబు ఇంతేనయా.. మార్కాపురం రూరల్/మార్కాపురం: సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను, నివాసాలను తీసుకుని, వారికి దక్కాల్సిన పరిహారం విషయంలో కఠినంగా వ్యవహరించడం చంద్రబాబు సర్కారుకు అలవాటుగా మారింది. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దీనికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని 11 గ్రామాల్లో 2019 సంవత్సరం నాటికి 18 ఏళ్లు నిండిన 7350 కుటుంబాలతో పాటు, ప్రభుత్వం గుర్తించి, గెజిట్లో మిస్సైన కుటుంబాలకు చెందిన మరో వెయ్యి మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీ 2019 అక్టోబర్ అనంతరం గడచిన ఎనిమిదేళ్లలో 18 సంవత్సరాల వయసు నిండిన యువతీ, యువకులకు వివాహాలు జరిగి కుటుంబాలుగా విడిపోయిన వారు 11 గ్రామాల పరిధిలో దాదాపు 1500 కుటుంబాలు పైగా ఉన్నారు. వారందరి వివరాలను సేకరించి నిర్వాసితుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ను సర్కారు పెడచెవిన పెట్టింది. మూడు జిల్లాల రైతులు, ప్రజల కోసం, సర్వం త్యాగం చేసి, పుట్టి పెరిగిన గ్రామాలను ఖాళీ చేసేందుకు సిద్ధపడి, త్యాగం చేసిన నిర్వాసితులపై ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం సవతి ప్రేమ చూపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించేందుకు శనివారం రానున్నారు. గొట్టిపడియలో రూ.25 కోట్లు ఎగనామం మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన 60 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్అండ్ఆర్ (పునరావాసం, పునరుద్ధరణ) ప్యాకేజీని అడ్డగోలుగా ఎగ్గొట్టేందుకు కుట్ర పన్నింది. దాదాపు 200 మంది నిర్వాసితులకు దక్కాల్సిన రూ.25 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి, వారిని నట్టేట ముంచేందుకు సిద్ధమైంది. రేషన్ కార్డులు, ఆధార్, పాన్ కార్డులు వంటి అన్ని రకాల ధ్రువపత్రాలు గ్రామ చిరునామాతోనే ఉన్నప్పటికీ, అధికారులు ఉద్దేశపూర్వకంగానే వీరి పేర్లను జాబితాలో చేర్చలేదు. ఒక్కొక్కరికి రూ.12.50 లక్షల చొప్పున పరిహారం దక్కాల్సి ఉండగా, ప్రభుత్వం కుట్రపూరితంగాా ఈ కుటుంబాలను మినహాయించింది. ఒకే కుటుంబంలో వివక్ష అధికారుల వివక్ష ఏ స్థాయిలో ఉందంటే.. ఒకే కుటుంబంలో కొడుకు పేరు జాబితాలో ఉండగా, అదే కుటుంబంలోని తల్లి పేరును తొలగించారు. ఈ విచిత్రమైన, అన్యాయపూరితమైన నిర్ణయానికి ప్రాతిపదిక ఏంటో చెప్పాలని బాధితులు అడిగినా అధికారులు సమాధానం దాటవేస్తున్నారు. తమ ఇళ్లను ‘కొత్త ఇళ్లు‘గా నమోదు చేసి, ప్యాకేజీ నిలిపివేయడం వెనుక భారీ కుట్ర ఉందని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరగాలని అధికారులను బతిమాలినా ఫలితం లేకపోవడంతో, ‘మేము ఏం పాపం చేశాం?’ అంటూ బాధితులు నిలదీస్తున్నారు. పోరాటమే మార్గం! తమ హక్కులను కాలరాసి, రూ.25 కోట్ల పరిహారాన్ని ఎగ్గొట్టాలని చూస్తున్న సర్కారు తీరుపై నిర్వాసితులు మండిపడుతున్నారు. వెంటనే స్పందించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్యాకేజీ వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తమ హక్కుల కోసం ఎంతవరకు పోరాడానికై నా సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. 60 కుటుంబాలకు న్యాయం చేయాలి గ్రామం అధికారులు చుట్టూ తిరిగిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో పేర్లు రాకపోవడం అందరూ ఊర్లో ఉండి వారికి ప్యాకే జీ రాకపోవడం చాలా బాదాకరంగా ఉంది.అన్ని అధారాలు ఉన్న లిస్టులో పేరు రాలేదు.60 కుటుంబాలకు న్యాయం చేయాలి. – తుమ్మ వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్, గొట్టిపడియ నిర్వాసితులపై కపట ప్రేమ 2016, 2017లో వెలిగొండ నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. గొట్టిపడియ, గుండంచర్ల గ్రామ నిర్వాసిత కాలనీలో మౌలిక సౌకర్యాలు కరువయ్యాయి. సదరు రెండు గ్రామాల నిర్వాసితులకు నేటికీ నివేశన స్థల పట్టాలు ఇవ్వకపోవడం ప్రభుత్వ తీరుకు నిదర్శనం. వెలుగొండ ప్రాజెక్టు నల్లమలసాగర్కు నీటిని విడుదల చేసి గ్రామాలను ఖాళీ చేసేందుకు, సదరు నిర్వాసితులు గృహాలు నిర్మించుకునేందుకు కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుంది. రేపు నీరు విడుదల చేసి మరుసటి రోజు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తే నిర్వాసితులు ఎక్కడ తలదాచుకుంటారు. నిర్వాసితుల త్యాగాన్ని కేవలం డబ్బుతో కొలవవద్దు. వారిపట్ల ఉదారంగా వ్యవహరించాలి. – డీకేఎం రఫీ, సీపీఎం నాయకుడు -
బాధితులకు న్యాయం చేయాలి
గ్రామంలో కొత్త ఇల్లు కింద హౌస్ మ్యాపింగ్ అయిన బాధితులకు న్యాయం చేయాలి. పూర్వం నుంచి గ్రామంలో నివసిస్తున్నా, గజిట్లో పేర్లు ఉన్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. బాధితులు కూలి పనుల కోసం వలసగా వేరే ఊరికి వెళ్లిన 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరి నివాసులైన వారికి ఆధారాలు ఉన్నా ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో అన్యాయం జరిగింది. అధికారులు బాధితులకు న్యాయం చేయాలి. – నల్లబోతుల కొండయ్య, రాష్ట వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, గొట్టిపడియ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరులేదు నా పేరు కొమ్మతొటి బాబు. మాది గొట్టిపడియ గ్రామం. 56 ఏళ్ల నుంచి ఉంటున్నా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లిస్టులో పేరు రాలేదు. – కొమ్మతోటి బాబు, గొట్టిపడియ గ్రామం. -
జేపీ చెరువులో జోరుగా అక్రమ మద్యం
● పత్తా లేని ఎకై ్సజ్ అధికారులు రాచర్ల: రాచర్ల మండలం జేపీ చెరువులో బెల్టుషాపుల దందా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలను పక్కనబెట్టి, అనుములపల్లె వైన్స్ యజమానులు అక్రమంగా మద్యం బాక్సులను ఆటోల్లో తరలిస్తూ గ్రామాల్లో విక్రయిస్తున్నారు. మొహర్రం పండుగ సందర్భంగా శుక్రవారం మద్యం సరఫరా జోరుగా సాగింది. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ఎంఆర్పీ కంటే రూ.50 నుంచి రూ.70 వరకు అదనంగా వసూలు చేస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుండటంతో నిత్యం గొడవలు జరుగుతున్నాయని, తమకు ప్రశాంతత కరువైందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ దందాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎకై ్సజ్ సీఐకి వినతిపత్రం అందజేసినా స్పందన కరువైంది. ఎకై ్సజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించి, బెల్టుషాపులను శాశ్వతంగా మూసివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. -
రైతులు లేకుండా పొగాకు బోర్డు ఎవరి కోసం
● సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ధ్వజం ఒంగోలు టౌన్: పొగాకు బోర్డు రైతుల కోసం ఏర్పాటు చేశారో లేక కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేశారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబు చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ప్రశ్నించారు. రైతులు లేకుండా పొగాకు బోర్డు ఎవరి కోసం, ఎందుకోసం ఏర్పాటు చెప్పాలన్నారు. పొగాకు రైతుల కోసం ఏర్పాటు చేసిన బోర్డులో రైతుల ప్రాతినిధ్యం లేకుండా పోయిందని, ఎవరో వచ్చి పెత్తనం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సంక్షేమాన్ని విస్మరించి కార్పొరేట్ శక్తులకు తొత్తుగా మారిన బోర్డుకు రైతులు లేకుంటే ఉనికే ఉండదని ప్రభుత్వం గ్రహించాలని చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం మూడో రోజుకు చేరాయి. రైతు కూలీ సంఘ జిల్లా నాయకురాలు ఎస్ లలిత కుమారి, ఏఐకేఎస్ నాయకురాలు బి.పద్మ అధ్యక్షత వహించిన ఈ దీక్షలో రమాదేవి మాట్లాడుతూ పొగాకు కొనుగోళ్లలో ప్రభుత్వం మాట చెల్లుబాటు కావట్లేదని, ఐటీసీ, జీపీఏ వంటి కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యమే చెల్లుబాటవుతుందని విమర్శించారు. రైతుల శ్రమతో వేలాది కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం రూ.1000 కోట్లు కేటాయించి రైతులను ఆదుకోలేకపోవడం సిగ్గుచేటన్నారు. కంపెనీలకు బీమా వసతితో పాటు లాభాలు వస్తుంటే రైతులకు కష్టాలు, నష్టాలు వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోకుంటే ఉద్యమం మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ పొగాకు బోర్డు కంపెనీలకు గులాంగిరి చేస్తోందని, రైతుల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తూ బడా బాబుల వ్యాపార లాభాల కోసం పాటుపడుతోందని ఆరోపించారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు మాట్లాడుతూ 45 రోజులుగా రైతులు రోడ్డెక్కి ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే శనివారం నుంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి రైతులు భారీగా తరలి వచ్చి తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రభుత్వం దిగివస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఉండి కూడా పొగాకు రైతులకు న్యాయం చేయలేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేని మోదీ సర్కార్ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ శిబిరంలో రాష్ట్ర సేవా సమాఖ్య అధ్యక్షుడు బెజవాడ వెంకటరావు, రైతు నాయకులు ఎస్కే మాబు, సీఎస్ సాగర్, కంకణాల అంజనేయులు, నెరుసుల వెంకటేశ్వర్లు, మంజుల, కామేపల్లి శ్రీనివాసరావు, కంచర్ల సుబ్బారావు, వడ్డే హనుమారెడ్డి, కె.వీరారెడ్డి, శ్రీకాంత్, సింగయ్య, పమిడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిరసన దీక్షలు చేస్తున్న పొగాకు రైతులు -
యువకుని దారుణ హత్య
పెద్దదోర్నాల: మండల కేంద్రంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ఓ బ్రాందీ షాపు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. యువకుడి తలపై బండరాయితో మోది కిరాతకంగా చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు పెద్దారవీడు మండలం గొట్టిపడియ గ్రామానికి చెందిన కొర్రపోలు నాగరాజు(23)గా గుర్తించారు. ఇతడు చిన్నపాటి దొంగతనాలకు పాల్పడుతుంటాడని, గతంలో ఈ విషయంలో పోలీసులు మందలించారని బంధువులు చెప్పారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చిన నాగరాజు పెద్దదోర్నాలలో శవమై పడి ఉన్నట్లు సమాచారం అందుకున్న హసనాబాద్కు చెందిన సోదరి రూతు, మేనమామలు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సమీపంలోని పంట పొలాల్లో ఇటీవల విద్యుత్ తీగలు చోరీకి గురయ్యాయని, ఆ కక్షతోనే పొలాల యజమానులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న యర్రగొండపాలెం సీఐ అజయ్కుమార్, ఎస్సై వెంకట రమణయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. తలపై బండతో మోదినట్లుగా ఆనవాళ్లు పెద్దదోర్నాలలో ఓ బ్రాందీషాపు వద్ద ఘటన -
యువకుడి ఆత్మహత్యాయత్నం భగ్నం
మార్కాపురం రూరల్: ఆత్మహత్యకు పాల్పడబోతున్నానని పోలీసులకు సమాచారం అందించిన ఓ యువకుడిని అధికారులు సకాలంలో స్పందించి రక్షించారు. ఈ ఘటన శుక్రవారం మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ వంతెన వద్ద ఉన్న చాతరాశి వెంకట శివ (26) తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మార్కాపురం టౌన్ ఎస్సై విశ్వనాథరెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన ఎస్సై పోలీస్ సిబ్బందిని హుటాహుటిన సంఘటన స్థలానికి పంపారు. అక్కడ ఉన్న యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీస్స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. యువకుడి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ● డ్రైవర్, క్లీనర్కు తీవ్ర గాయాలు హనుమంతునిపాడు: హైపో క్లోరైడ్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. శుక్రవారం కర్నూలు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ హనుమంతునిపాడు మండలంలోని వేములపాడు ఘాట్ మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ట్యాంకర్ పల్టీ కొట్టి రోడ్డు పక్కన పడిపోవడంతో లోపల ఉన్న రసాయన ద్రవం బయటకు కారుతోంది. ప్రమాదంలో డ్రైవర్ ఎ.రాజశేఖర్, క్లీనర్ ఎస్.మహ్మద్ రఫీక్ తీవ్రంగా గాయపడ్డారు. అదే మార్గంలో వెళ్తున్న వాహనదారులు గమనించి వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ● తుమ్మలబైలు వద్ద కనిపించిన అడవిదున్న పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని నల్లమల అభయారణ్యంలోని తుమ్మలబైలు గిరిజన గూడెం సమీపంలో అడవిదున్న సంచరిస్తూ స్థానికుల కంటపడింది. దీంతో కొందరు యాత్రికులు తమ వద్ద నున్న సెల్ఫోన్లలో అడవిదున్న సంచరిస్తున్న దృశ్యాలను బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. 1870 కు ముందు ఒక్కసారిగా మాయమైన అడవిదున్న 152 ఏళ్ల తరువాత 2022లో నల్లమల అభయారణ్యంలోని గుండ్లబ్రహ్మేశ్వరం అడవుల్లో ప్రత్యక్షం కావటం అప్పట్లో చర్చనీయాంశఽమైంది. కొన్నేళ్ల తరువాత మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని పంట పొలాల్లో ప్రత్యక్షమైన అడవిదున్న కొన్ని రోజుల అనంతరం మళ్లీ నల్లమల అభయారణ్యంలో స్థానికులకు తారసపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ గౌర్, ఇండియన్ బైసన్గా పిలుచుకునే అడవిదున్నలు నీలగిరి, మధ్యప్రదేశ్ అభయారణ్యాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. వీటిని నల్లమల అభయారణ్యాలకు తరలించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. కాగా అడవిదున్న సంచారంపై ఫారెస్ట్ రేంజి అధికారి హరిని సంప్రదించగా కొద్ది రోజులుగా గుండ్ల బ్రహ్మేశ్వరం, మార్కాపురం ఏరియాలో సంచరించిన అడవిదున్నే తిరిగి నల్లమల అభయారణ్యంలోకి ప్రవేశించి ఉండొచ్చని ఆయన తెలిపారు. -
పాలనలో కూటమి పూర్తిగా విఫలం
ముండ్లమూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు..రాష్ట్రంలో ఎక్కడా ఒక్క అభివృద్ధి పనీ జరగడం లేదు.. సంక్షేమం మూలన కూర్చుంది.. అభివృద్ధి అటకెక్కింది... రాష్ట్రంలో అప్పులు మాత్రం రూ.3.50 లక్షల కోట్లు దాటిపోతున్నాయి. మొత్తంగా కూటమి ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పూరిమెట్ల గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి తిరుణాళ్ల సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి చేయకపోయినా రూ.లక్షల కోట్ల అప్పులు ఎందుకవుతున్నాయని ప్రశ్నించారు. అప్పు చేసిన డబ్బంతా ఎటుపోతోందని ప్రభుత్వాన్ని నిలదీశారు. అన్నీ స్కాములు చేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండేళ్లు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఎవరినైతే కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో ప్రతి కుటుంబానికి బూచేపల్లి కుటుంబం అండగా ఉంటుందన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో, ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్క నాయకుల్ని వదిలిపెట్టేది లేదని, దెబ్బకు దెబ్బ రుచి చూస్తారని స్పష్టం చేశారు. తాను దర్శి నియోజకవర్గంలోనే ఉంటాను, ఇక్కడే పోటీ చేస్తాను, ఏ వైఎస్సార్సీపీ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా అండగా ఉంటానని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని వివరించారు. 2024లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమని, జగనన్న మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసపు మాటలను ప్రజలు ఇకపై నమ్మరని బూచేపల్లి శివప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ చింతా శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సూదిదేవర అంజయ్య, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుంకర బ్రహ్మానందరెడ్డి, డగ్లస్, గ్రామస్తులు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే దెబ్బకు దెబ్బ రుచి చూస్తారు 2029లో జగన్ సీఎం కావడం ఖాయం దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి -
బాధితులకు అన్యాయం.. నిందితులకు అభయం
ఒంగోలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దత్తత తీసుకున్న ఈదుమూడి గ్రామంలో గొర్రెల కాపరులపై దాడి జరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈదుమూడి గ్రామంలో యాదవ కులానికి చెందిన గొర్రెల కాపరులపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం ఒంగోలులోని హైదరీ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఈనెల 7వ తేదీన ఈదుమూడిలో వడ్లమూడి మధు, యల్లావుల అనిల్ అనే గొర్రెల కాపరులపై ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు తదితరులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని, అంతేకాకుండా కులం పేరుతో దూషిస్తూ, మహిళలతో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారన్నారు. దీనిపై నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో కేసు (57/2026) నమోదై మూడు వారాలు గడుస్తున్నా, నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. నిజమైన బాధితులపైనే కాకుండా, నిందితుల పక్షాన కౌంటర్ కేసు (58/2026) నమోదు చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వక్తలు నిలదీశారు. బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, నిందితుల కొమ్ము కాస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేయడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయన్నది స్పష్టమవుతోందని ఆరోపించారు. సీఎం దత్తత గ్రామంలోనే గొర్రెల కాపరులకు రక్షణ లేకపోతే, ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ఈదుమూడి ఘటనలో నిందితులను కాపాడుతున్న అసలు సూత్రదారులు ఎవరు? అని సమావేశంలో వక్తలు ప్రశ్నించారు. వెంటనే 57/2026 కేసులో నిందితులను అరెస్టు చేయాలని, బాధితులపై బనాయించిన కౌంటర్ కేసును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర శతాబ్ది ఉత్సవ అధ్యక్షుడు బొట్లా రామారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జాతీయ ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మోహన్కుమార్ ధర్మా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు తాటిపర్తి వెంకటస్వామి, సమాజ్ వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు, ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షులు కృష్ణారావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డక ఆంజనేయమూర్తి, జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి, బాపట్ల జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన లక్ష్మీప్రసాద్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు షేక్ అజీజ్, బీసీ నాయకులు గవిని శ్రీను, గుళ్లాపల్లి వీరభద్రాచారి, పులి హరికృష్ణ, ఆతిన వెంకటరావు, వడ్లమూడి భాస్కరరావు, జడ బాల నాగేంద్ర, బంకా చిరంజీవి, మసిముక్కు భాస్కర్, బాధితులు వడ్లమూడి మధు, ఎల్లావుల అనిల్, గొర్ల పెంపకం దారుల సంఘం నాయకులు కిలారు పెద్దబ్బాయి, తిరుపతిరావు, బుర్రి ఆంజనేయులు, ఫణిదపు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈదుమూడిలో గొర్రెల కాపరులపై దాడిని ముక్త కంఠంతో ఖండించిన ప్రజా సంఘాలు ఘటన జరిగి మూడు వారాలైనా నిందితులను అరెస్టు చేయకపోవడంపై నిలదీత సీఎం దత్తత గ్రామంలోనే ఇంత అరాచకమా అని మండిపాటు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
బేస్తవారిపేట: హైవేపై కారు అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో బేస్తవారిపేట గాంధీబజార్కు చెందిన దూదేకుల రసూల్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి చింతలపాలెం సమీపంలో తోకపల్లె–కడప హైవేరోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరులో కారు సర్వీసింగ్ చేయించుకుని ఒంటరిగా స్వగ్రామానికి వస్తుండగా, బేస్తవారిపేట సమీపంలో టిప్పర్ను ఓవర్టేక్ చేసే క్రమంలో మార్జిన్ గుంత కారణంగా వాహనం అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, రసూల్ అక్కడికక్కడే మరణించాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి రసూల్ను కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య తస్లీమా, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో తల్లిదండ్రులు చంటి, మస్తానమ్మ,, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు బేస్తవారిపేట సమీపంలో సంఘటన -
వైభవంగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
సింగరాయకొండ: పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈనెల 24న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం హంస వాహనంపై స్వామి వారు భక్తులకు కనువిందు చేశారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేశామని ఈవో పి.కృష్ణవేణి తెలిపారు. శనివారం రాత్రి స్వామి వారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆమె పేర్కొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పెద్దదోర్నాల/గిద్దలూరు రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం గిద్దలూరు మండలంలోని కిష్టంశెట్టిపల్లె, పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద వెలుగొండ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద పర్యటించనున్నారు. కిష్టంశెట్టిపల్లె ‘సంజీవని’ కార్యక్రమ ప్రారంభోత్సవం, బహిరంగ సభా స్థలం వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుక్రవారం పరిశీలించారు. గంటవానిపల్లెలోని హెలిప్యాడ్, సభా వేదిక వద్ద ఏర్పాట్లను కలెక్టర్ విజయ సునీత పర్యవేక్షించారు. వీఐపీల పార్కింగ్, ప్రజలకు అవసరమైన వసతులు, ఇతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఎస్పీ వెంట మార్కాపురం డీఎస్పీ యు.నాగరాజు తదితరులు ఉన్నారు. సీఎం రాక.. వాహనదారులకు తిప్పలు గిద్దలూరు రూరల్: వుుఖ్యమంత్రి చంద్రబాబు శనివారం గిద్దలూరు మండలంలోని కిష్టంశెట్టిపల్లె పర్యటనకు వస్తున్న నేపథ్యంలో, అధికారులు విధించిన ట్రాఫిక్ ఆంక్షలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పలు రూట్లలో వాహనాలను మళ్లించారు. నంద్యాల నుంచి గిద్దలూరుకు కేవలం 60 కి.మీ. దూరం ఉండగా, ఆంక్షల వల్ల ఆళ్లగడ్డ, మైదుకూరు, పోరుమామిళ్ల, కలసపాడు మీదుగా సుమారు 150 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. అలాగే మార్కాపురం నుంచి నంద్యాల వెళ్లే వాహనాలను తాటిచెర్ల, కొమరోలు మీదుగా మళ్లించారు. ఈ ఆంక్షలతో ప్రయాణ దూరం భారీగా పెరిగి, సమయం వృథా కావడంతోపాటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
విమర్శలకు ‘స్వాగతం’!
● ప్రజల సొమ్ముతో టీడీపీ నేత దర్పం దర్శి: నగర పంచాయతీలో అధికార పార్టీ నేతల అరాచకం పతాక స్థాయికి చేరింది. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన ‘వెల్కమ్ బోర్డు’ సాక్షిగా అధికార దుర్వినియోగం వెలుగుచూసింది. పట్టణ ప్రవేశద్వారం వద్ద మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేసిన భారీ స్వాగత తోరణంలో.. ప్రజలు తిరస్కరించిన టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి ఫొటోలు దర్శనమివ్వడంపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధుల ఫొటోలు ఉండాల్సిన చోట, ఎన్నికల్లో ఓడిపోయిన నాయకురాలి చిత్రాన్ని ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధి పేరుతో వసూలు చేసిన పన్నుల సొమ్మును టీడీపీ నేత ప్రచారానికి వాడుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ ఏర్పాట్లపై కమిషనర్ అర్జున్రావును వివరణ కోరగా.. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలి ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు జె.పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ డౌన్లో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గుడ్లూరుకు చెందిన గద్దె కార్తీక్ (23), హని, సునీల్ యాదవ్ ముగ్గురు ఒకే బైక్పై ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళుతున్నారు. మండల పరిధిలోని జాగర్లమూడివారిపాలెం జాతీయ రహదారిపై ఫైఓవర్ పై నుంచి కిందకి దిగుతూ ఒక్కసారిగా వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక వస్తున్న టాటా ఏసీ వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో గద్దె కార్తీక్(23) అక్కడికక్కడే మృతి చెందగా హనీ, సునీల్ యాదవ్కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై రేణింగవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ హామీ ఏమైంది?
పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది పెదారికట్ల ప్రభుత్వ హోమియో వైద్యశాల పరిస్థితి. సుమారు 51 ఏళ్లుగా చుట్టుపక్కల నాలుగు గ్రామాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్న ఈ ఆసుపత్రి, ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యంతో మూతపడింది. రెండేళ్ల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఉన్న ఏకై క కాంపౌండర్కు డిప్యూటేషన్ పేరుతో మన్నేపల్లికి పంపారు. దీంతో అప్పటి నుంచి వైద్యశాలకు తాళం పడింది. గదిలోనే మందులు నిరుపయోగంగా మగ్గిపోతున్నాయి. ఐదు నెలల క్రితం ’సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన ఆయుష్ శాఖ ఉపసంచాలకులు.. వైద్యశాలలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. -
చెమ్మగిల్లకే.. గుండ్లకమ్మ..!
మార్కాపురం పట్టణ సమీపంలోని గుండ్లకమ్మ చెత్త వ్యర్థాల కేంద్రంగా మారి కంపు కొడుతోంది. పట్టణంలో ఉన్న చెత్తాచెదారాన్ని తీసుకొచ్చి గుండ్లకమ్మలో పోస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవుతోంది. నదిలో నీరు కలుషితమై ఆకుపచ్చని రంగులోకి మారడంతో దుర్వాసన వస్తోంది. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం నెమలిగుండం నుంచి ప్రారంభమయ్యే గుండ్లకమ్మ ప్రవాహం 3 జిల్లాల్లోని 7 నియోజకవర్గాలను కలుపుతూ ఒంగోలు రూరల్ మండలంలోని ఉలిచి వద్ద సముద్రంలో కలుస్తోంది. అయితే ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిపోయిన పండ్లు, ఖాళీ కొబ్బరి బొండాలు, మాంస వ్యర్థాలు గుండ్లకమ్మలో పడేస్తుండటంతో సమీప ప్రాంతాల్లో దోమలు విజృంభించి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గతంలో స్వచ్ఛమైన నీటితో గలగలా పారే గుండ్లకమ్మ ప్రస్తుతం గుర్రపుడెక్క, వ్యర్థాలు, పిచ్చిచెట్లతో నిండిపోయింది. ఈ పరిణామం నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. తుఫాన్ల సమయంలో నీటి ఉధృతికి గుండ్లకమ్మలో వ్యర్థాలన్నీ కొట్టుకుపోయినా కొద్ది కాలానికే పరిస్థితి మొదటికొస్తోంది. గుండ్లకమ్మలో వ్యర్థాలు వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – మార్కాపురం -
టౌన్ ప్లానింగ్ కార్యాలయం ఖాళీ...
ఏసీబీ సోదాలతో ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలోని టౌన్ ప్లానింగ్ విభాగం భవనం ఖాళీ అయింది. 13 మంది ఇళ్లలో సోదాలు జరుగుతుండటంతో మిగతా సిబ్బంది కూడా కార్యాలయానికి రాకుండా డుమ్మా కొట్టారు. సర్వేయర్ కూడా కార్యాలయంలో లేరు. ప్రజలు మాత్రం కార్యాలయం చుట్టూ తిరిగి ఎవరూ లేకపోవటంతో అర్ధంగాక వెనుదిరిగారు. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు ఇంజినీరింగ్, పారిశుధ్యం, రెవెన్యూ విభాగాలకు చెందిన ముఖ్య అధికారులు కూడా కార్యాలయానికి డుమ్మా కొట్టారు. కమిషనర్ వెంకట కృష్ణయ్య నూతనంగా వచ్చి విధులు నిర్వర్తిస్తుండటంతో ఆయన మాత్రం కార్యాలయంలోనే తన పనులు తాను చేసుకుంటూ కనిపించారు. -
హోమియో సేవలకు గ్రహణం
కొనకనమిట్ల: ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ హోమియో వైద్యశాలలు సిబ్బంది కొరతతో కుదేలవుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ హోమియో వైద్యశాలలు ప్రస్తుతం మూతపడి దర్శనమిస్తున్నాయి. నామమాత్రంగా ఉన్న సిబ్బందిని సైతం బదిలీలు, డిప్యుటేషన్ల పేరుతో తరలించడంతో వైద్యసేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల నిరుపేద రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొనకనమిట్ల మండలంలోని పెదారికట్ల, కొమరోలు మండలంలోని రెడ్డిచర్ల, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం, యర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం, త్రిపురాంతకం మండలంలోని దూపాడు, పెద్దారవీడు మండలంలోని సానికవరం, పుల్లలచెరువు మండలంలోని యండ్రపల్లి గ్రామాల్లో హోమియో వైద్యశాలల తలుపులు మూసుకుని ఏళ్లు గడుస్తోంది. డాక్టర్లు, కాంపౌండర్లు లేకపోవడంతో ఆసుపత్రుల్లో ఉన్న విలువైన మందులు, సామగ్రి దుమ్ము పడుతున్నాయి. గతంలో పలుమార్లు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫిర్యాదులు చేసినా, మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ అధికారుల స్పందన శూన్యం. గతంలో ’ఆయుష్’ శాఖాధికారులు మూతపడిన వైద్యశాలలను పునఃప్రారంభిస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి. నిరంతరం నిధుల కేటాయింపులు, బడ్జెట్ అంటున్న ప్రభుత్వం, కనీసం ఈ వైద్యశాలలను నిర్వహించడంలో ఎందుకు విఫలమవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రోగుల ఆవేదన హోమియో మందుల మీద నమ్మకంతో చాలా మంది ప్రజలు ఇన్నాళ్లు ఈ ఆసుపత్రులకు వచ్చేవారు. ఇప్పుడు వైద్యశాలలు తెరవకపోవడంతో చికిత్స కోసం దూరప్రాంతాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఖాళీగా ఉన్న డాక్టర్, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని, మూతపడిన ఆసుపత్రులను వెంటనే తెరిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్కాపురం జిల్లాలో మూతపడిన ప్రభుత్వ హోమియో ఆస్పత్రులు పెదారికట్లలో డాక్టర్ లేరు.. డిప్యుటేషన్లో కాంపౌండర్ మరో ఆరు వైద్యశాలలదీ ఇదే దుస్థితి.. హోమియో వైద్యశాలను తెరిపించాలని వేడుకుంటున్న ప్రజలు -
అవినీతి ప్లానింగ్..!
ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి రాజ్యమేలుతోంది. ఇక్కడ ప్రతి పనికీ ఒక రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా టౌన్ప్లానింగ్ విభాగం వసూళ్లకు అడ్డాగా మారిపోయింది. ఈ విభాగంపై వస్తున్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్న 13 మందిపై కేసులు నమోదు చేయడం, గురువారం ఏకకాలంలో వారి ఇళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. అవినీతికి చిరునామాగా మారిన కార్పొరేషన్పై ‘సాక్షి’ పలు కథనాలను కూడా ప్రచురించింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు నగరపాలక సంస్థ అనినీతి, అక్రమాలు పెచ్చుమీరాయి. అన్ని విభాగాలపై ఆరోపణలు వస్తున్నప్పటికీ.. టౌన్ ప్లానింగ్లో జరుగుతున్న అవినీతికి అంతే లేకుండా పోయింది. నగరంలో జరుగుతున్న వేలాది అక్రమ నిర్మాణాలకు కర్త, కర్మ, క్రియ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులనే విషయం విధితమే. మూటలు అందితే చాలు.. అది ఎంతటి అక్రమమైనా సక్రమమైపోతుంది. భవన నిర్మాణానికి ప్లాను ఉంటే ఒక రేటు.. ప్లాను లేకుంటే మరో రేటు అన్నట్టుగా ఒంగోలు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ రూటే సప‘రేటు‘గా మారింది. దీంతో నగరంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. తాజాగా ప్రభుత్వం అమలు చేసిన అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్) స్కీంను ఒంగోలు నగరపాలక సంస్థ అధికారులకు వరంగా మార్చుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. క్రమబద్ధీకరణ మాటున కార్పొరేషన్లో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకూ అందిన కాడికి దోచుకుని జేబులు నింపుకున్నారన్న ఆరోపణలున్నాయి. నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఇళ్లపై గురువారం ఒంగోలు ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి సోదాలు నిర్వహించడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నగర పాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఈ ఏడాది మార్చి 10వ తేదీ అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో వెలుగు చూసిన వివరాలను పరిశీలించిన ఏసీబీ అధికారుల కళ్లు బైర్లుగమ్మాయి. ఒక టౌన్ ప్లానింగ్ అధికారికి చెందిన ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంల ద్వారా దాదాపు రూ.75 లక్షలకుపైగా లావాదేవీలు జరిగాయని తెలుస్తోంది. మరో రూ.43 లక్షల లావాదేవీలు వివిధ స్థాయి అధికారులు, సిబ్బంది ఫోన్ల ద్వారా జరిగాయని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. బీపీఎస్ ద్వారా అధికారులు నొక్కింది సుమారు రూ.3.36 కోట్లు. అందులో ఫోన్ పేల ద్వారా రూ.1.18 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు. బీపీఎస్ స్కీమ్కు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని నిర్ధారణకు వచ్చాక ఏసీబీ అధికారులు రెండు రోజుల క్రితం 13 మందిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదాయానికి మించిన ఆస్తులపై గురువారం పెద్ద ఎత్తున సోదాలు చేశారు. విస్తృతంగా తనిఖీలు... టౌన్ ప్లానింగ్ టీపీఎస్ ఎస్కే రసూల్తో పాటు టీపీబీఓలు ఎం.ప్రకాశ్రెడ్డి, కే మణిరావు, కే ముకేష్ కుమార్, బి.ప్రవీణ్ కుమార్, డి.రవి తేజ, బి.శరత్, జీ శ్రీకాంత్, డి.శశిధర్తో పాటు మరో ముగ్గురు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న సమాచారంతోనే తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ప్రకాశం జిల్లా ఏసీబీకి ఇన్చార్జ్ డీఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఒంగోలు సీఐలు టీవీ శ్రీనివాస్, బి.రమేష్బాబుతో పాటు గుంటూరు నుంచి ఐదుగురు సీఐలు, నెల్లూరు నుంచి మరో ఇద్దరు సీఐలతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి మొత్తం 40 మందికిపైగా సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం పెద్ద ఎత్తున కలకలం రేపింది. పాత కమిషనర్పైనా విచారణ... దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన పాత కమిషనర్పై కూడా ఏసీబీ అధికారులు నూతనంగా విచారణ చేపట్టారు. మార్చి పదో తేదీ ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో సదరు అధికారి అక్రమాలు కూడా వెలుగుచూసినట్టు తెలిసింది. ఆయన భార్యతో పాటు కుటుంబీకులకు దాదాపు రూ.70 లక్షల వరకూ ఫోన్ పే లావాదేవీలు జరిపినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆయనపై అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, శానిటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న తనకు అనుకూలమైన ఉద్యోగులను బినామీలుగా ఏర్పాటు చేసుకున్న కీలక అధికారి భారీ ఎత్తున ముడుపులు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పాలకవర్గం గడువు తీరడంతో ఆ అధికారి ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. నగరంలో ఒక్కో భవన నిర్మాణానికి భారీగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాల అనుమతుల్లో సుమారు రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో భవన నిర్మాణాలు చేపట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. సదరు అధికారి చెత్త సేకరణ నుంచి పన్నులు వసూలు చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ పనుల్లో 7 శాతం వసూలు చేసేవారని సమాచారం. అందరివీ కలిపి 15 శాతం వరకూ తనకే ఇవ్వాలని హుకుం జారీ చేశారని తెలిసింది. నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ‘సాక్షి’ దినపత్రిక పలు కథనాలను ప్రచురించిది. కార్పొరేషన్లోని పలు విభాగాల్లొ జరుగుతున్న దందాను వెలుగులోకి తెచ్చింది. ఏసీబీ అధికారుల దాడులతో సాక్షి కథనాలు అక్షర సత్యాలుగా నిలిచాయి. -
జేసీబీపై పడిన గ్రానైట్ రాయి
● ఆపరేటర్ మృతి చీమకుర్తి రూరల్: జేసీబీపై గ్రానైట్ రాయి పడి దాని ఆపరేటర్ మృతిచెందిన సంఘటన చీమకుర్తి మండలంలోని రామతీర్థం వద్ద ఉన్న వాసవీ గ్రానైట్ క్వారీలో గురువారం చోటుచేసుకుంది. క్వారీలో జేసీబీ మిషన్తో గ్రానైట్ షీట్ (రాయి)ను కిందపడేసేందుకు ఎదురు నుంచి లాగుతుండగా ఒక్కసారిగా జేసీబీ మిషన్పై ఆ షీట్ పడింది. దీంతో జేసీబీ ఆపరేటర్ మహేష్ యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతను జార్ఖండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. హుటాహుటిన అదే క్వారీలో ఉన్న ఆరు జేసీబీ మిషన్ల సహాయంతో గ్రానైట్ షీట్ను పక్కకు తొలగించారు. మహేష్ యాదవ్ మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కలెక్టరేట్ను ముట్టడిస్తాం
ఒంగోలు టౌన్: పొగాకు పంటకు గిట్టుబాటు ధరల కోసం గత 45 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ధ్వజమెత్తారు. పొగాకు రైతుల సమస్యను అత్యవసర సమస్యగా పరిగణించి పరిష్కారానికి చొరవ చూపకపోతే ఈ నెల 27వ తేదీ కలెక్టరేట్ ఎదుట వేలాది మందితో సామూహిక దీక్షలు చేపట్టి ముట్టడిస్తామని హెచ్చరించారు. పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించాలని, ఎస్టీసీ, మార్క్ఫెడ్, పొగాకు సమాఖ్య ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం రెండో రోజుకు చేరాయి. రైతు కూలీ సంఘ జిల్లా నాయకులు పరిటాల కోటేశ్వరరావు, సీఎస్ సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చుండూరి రంగారావు పాల్గొని మాట్లాడారు. రైతుల సామూహిక దీక్షలకు ప్రతి గ్రామం నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, పొగాకు ఆధారిత కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెలన్నరగా పొగాకు రైతులు న్యాయం కోసం పోరాడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం రైతుల పట్ల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. రైతులు ఐక్య పోరాటాలు చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని పొగాకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పొగాకు బోర్డు ద్వారా పొగాకు కొనుగోలు చేయడమొక్కటే పరిష్కారమని, కేంద్రంపై తగిన స్థాయిలో ఒత్తిడి చేయకపోతే ప్రయాజనం ఉండదని తేల్చి చెప్పారు. క్వింటా ధర రూ.25 వేలుగా నిర్ణయించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ మాట్లాడుతూ పొగాకు పండించడానికి ఆరుగాలం శ్రమిస్తున్న రైతులు.. ఆ పంటను అమ్ముకోవడానికి రోడ్డెక్కాల్సి రావడం బాధాకరమన్నారు. పొగాకు ద్వారా ఏడాదికి సుమారు రూ.50 వేల కోట్ల లాభాలను ఐటీసీ పొందుతోందన్నారు. కానీ, పొగాకు రైతు మాత్రం గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవ్వడం వెనక ఉన్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు భవిష్యత్తులో గట్టి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల కంటే కంపెనీ లాభాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. రైతుల శ్రమ శక్తిని దోచుకుంటున్న కంపెనీలు, వ్యాపారులను నియంత్రించాల్సిన ప్రభుత్వాలు వారికి కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. పొగాకు రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిరాహార దీక్షలో రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఎంఎస్ సాయి, ఆర్.మోహన్, సర్దార్, జి.శేషయ్య, లక్ష్మీనారాయణ, హనుమారెడ్డి, అబ్బూరి వెంకటేశ్వర్లు, పెద్దబ్బాయి, పి.కల్పన, ఎల్.రాజశేఖర్, టి.శ్రీకాంత్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
కనులపండువగా ధ్వజారోహణం
సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ధ్వజారోహణం కనులపండువగా నిర్వహించారు. స్వామిని ప్రత్యేక అలంకరణలో ఆలయంలో ఊరేగించి ధ్వజస్తంభం వద్ద వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామి గరుడ ప్రసాదాన్ని భక్తులకు అందజేసారు. గరుడ ప్రసాదం స్వీకరించిన మహిళలు ప్రసాదాన్ని నిష్ఠగా ఆరగించి 9 రోజులు పాటు నిష్టగా ఉంటే పండంటి బిడ్డ పుడతాడని ప్రతీతి. ఈ గరుడ ప్రసాదం కోసం రాష్టంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. చంద్రప్రభ వాహనంపై స్వామివారు వరాహాలక్ష్మీనరసింహస్వామి రాత్రికి ప్రత్యేక అలంకరణలో చంద్రప్రభ వాహనం పై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఊరేగింపు నిర్వహించి తరువాత గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవాల ఆలయాన్ని విద్యుద్దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రికి హంసవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారని ఆలయ ఈఓ పి.కృష్ణవేణి వివరించారు. ధ్వజారోహణ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరసింహాచార్యులు, ఉదయగిరి నందకిషోర్, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చంద్రప్రభ వాహనంపై వరాహ లక్ష్మీనరసింహస్వామి -
ప్రజల విశ్వాసం కోల్పోయిన కూటమి
వేదికపై మాట్లాడుతున్న అన్నా రాంబాబు, పాల్గొన్న నాయకులు హాజరైన ప్రజలు ● వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నా రాంబాబు మార్కాపురం రూరల్: ఎన్నికల హామీలు అమలు చేయకపోగా, పరిపాలనలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం రెండేళ్లకే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో ఏటా పెద్ద ఎత్తున నిర్వహించే పీర్ల పండుగ సందర్భంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన పాట కచేరిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3,000 భృతి అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రెండేళ్లు గడిచినా వాటిని అమలు చేయలేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని వివరించారు. 2024లో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడంతో 2029 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం ఖాయంగా కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మోసపు మాటలను ప్రజలు ఇకపై నమ్మరని అన్నా రాంబాబు అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు అన్నా కృష్ణచైతన్య, గోలమారి శ్రీనివాస్రెడ్డి, భూలక్ష్మి రామసుబ్బారెడ్డి, గాయం శ్రీనివాస్రెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, అక్బర్ అలీ, కోలగట్ల వెంకటేశ్వరరెడ్డి, పఠాన్ అబ్దుల్లా, సయ్యద్ మబ్బులి, మాజీ సర్పంచ్ షాజహాన్, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఉత్తం తదితరులు పాల్గొన్నారు. -
13 మందికి కారుణ్య నియామక ఉత్తర్వులు
● అందజేసిన జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఒంగోలు సిటీ: జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం పరిధిలో పనిచేస్తూ మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అందజేశారు. 8 మందిని ఆఫీస్ సబార్డినేట్లుగా, ఐదుగురిని జూనియర్ సహాయకులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు అందించారు. గుంజి శ్రీదేవిని కరవది జెడ్పీ హైస్కూల్కు, ఎస్.పవన్గణేష్ను ఇనమనమెల్లూరు జెడ్పీ హైస్కూల్కు, పల్లెపోగు స్వప్నను ఈస్ట్ గంగవరం జెడ్పీ హైస్కూల్కు, జి.అమోష్బాబును తర్లుబాడు ఎంపీడీఓ కార్యాలయానికి, ఆర్.ఆదిలక్ష్మిని గుడ్లూరు ఎంపీపీకి, సీహెచ్ హనూక్ను దొనకొండ ఎంపీడీసీఓ కార్యాలయానికి, ఎస్కే జాకీర్హుస్సేన్ను కొత్తపట్నం ఎంపీపీకి, డి.రసూల్బాషాను కొమరోలు ఎంపీపీలో ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. అలాగే జూనియర్ సహాయకులుగా ఏ సుభాష్కీర్తిని ఈపూరుపాలెం జెడ్పీ హైస్కూల్కు, ఎ.వెంకటసాయి యశ్వంత్ను పోకూరు జెడ్పీ హైస్కూల్కు, బి.మురళీకృష్ణను చినగంజాం ఎంపీపీకి, పి.వాసవ్కుమార్ను కారంచేడు ఎంపీపీకి, ఎన్.సాయి చరణ్ను బి.పేట ఎంపీపీకి నియమించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, డీవైఈఓ పి.బాలమ్మ పాల్గొన్నారు. -
ఎస్టీ యువకునికి అన్యాయం.. కేసు నమోదులో జాప్యం
● విచారణ చేపట్టిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మద్దిపాడు: మండలంలోని కొలచనకోట ఎస్టీ కాలనీకి చెందిన యాకసిరి నాగసాయి కార్తీక్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మంచాన పడటంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. బాధితుడికి న్యాయం చేయాలని, తన కుమారుడి పరిస్థితిని గాలికొదిలేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరినా మద్దిపాడు పోలీసులు స్పందించకపోవడంపై బాధితుని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, విచారణ చేపట్టారు. ఇదీ జరిగింది.. డిగ్రీ పూర్తి చేసిన నాగసాయి కార్తీక్ జీవనోపాధి కోసం స్థానిక కేబుల్ ఆపరేటర్ వద్ద పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 7న విధుల్లో భాగంగా కేబుల్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కార్తీక్ చికిత్స పొందుతున్నప్పటికీ, యజమాని కనీసం పట్టించుకోకపోవడంతో తల్లి మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుని తల్లి ఒంగోలు గ్రీవెన్స్లో జేసీ కల్పనాకుమారి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో స్పందించిన జేసీ, వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మద్దిపాడు ఎస్సైని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరగకపోవడంతో వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఈ వ్యవహారం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి దృష్టికి వెళ్లడంతో, వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నెల్లూరు ఐటీడీఏ (యానాది ప్లెయిన్ ఏరియా) పీఓకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, నెల్లూరు ఐటీడీఏ ఏపీఓలు నిరంజన్, అంకయ్య కొలచనకోటకు చేరుకున్నారు. బాధితుడి పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. తక్షణ వైద్య అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. విచారణ నివేదికను డైరెక్టర్కు అందజేస్తామని తెలిపారు. మరోవైపు, పోలీసులు ఇప్పటికై నా స్పందించి కేసు నమోదు చేయకపోతే సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద అన్ని కుల సంఘాలతో కలిసి భారీ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
డిజిటలైజేషన్ వేగవంతం చేయండి
ఒంగోలు వన్టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో డిజిటైజేషన్ను వేగవంతం చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు బీఎల్ఓలనుఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా సర్ కార్యక్రమంజరుగుతున్న తీరును పరిశీలించేందుకు నగరంలోని కబాడీపాలెంలో గురువారం పర్యటించారు. ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్న విధానాన్ని పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ 87 శాతం పూర్తయిందని, మిగిలిన ఓటర్లు అందుబాటులో లేరని అధికారులు తెలిపారన్నారు. ఇటువంటి వారి ఆచూకీ తెలుసుకునేందుకు బీఎల్ఏల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఈ పత్రాల డిజిటైజేషన్పై ప్రత్యేక దృష్టిసారించి పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ చంద్రశేఖర్నాయుడు, తహసీల్దార్ కృష్ణమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు: ఫుట్బాల్ బాలబాలికల సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ క్రీడాకారుల ఎంపికను ఈ నెల 28వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అంచిపోగు రమేష్బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 జనవరి ఒకటి నుంచి 2014 డిసెంబర్ 31వ తేదీ మధ్య జన్మించిన వారు సబ్ జూనియర్స్ విభాగానికి అర్హులని తెలిపారు. అదేవిధంగా 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్ 31 మధ్య జన్మించిన వారు జూనియర్స్ విభాగానికి హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఉదయం 8 గంటలకు స్థానిక డీఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.రోజర్బిన్ని (9908822193)ని సంప్రదించాలని కోరారు. ఒంగోలు వన్టౌన్: ఒంగోలు రూడ్సెట్ సంస్థ ఆధ్వర్యంలో జూలై 6వ తేదీ నుంచి మహిళలకు మగ్గం వర్క్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్ పెయింటింగ్లో శిక్షణ ఉంటుందన్నారు. 31 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నిరుద్యోగ మహిళలు అర్హులని తెలిపారు. అభ్యర్థుల వయసు 19 నుంచి 50 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి కూడా పూర్తి ఉచితంగా కల్పించనున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు 95733 63141 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ● జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి రామకృష్ణ ఒంగోలు టౌన్: మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు నాశనం అవుతుందని, అనారోగ్యానికి గురికావడమే కాకుండా ఆర్థికంగా కూడా చితికిపోతారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇన్చార్జి కార్యదర్శి సీహెచ్ రామకృష్ణ తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులకు గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మానసిక రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలైన వారు సమాజంలో చిన్నచూపునకు గురవుతారని తెలిపారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవించినా, రవాణా చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన శిక్షలుంటాయని హెచ్చరించారు. ప్రతిఒక్కరూ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, ఈగిల్ సభ్యులు, జీజీహెచ్ నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
మేదరమెట్లలో చోరీ
● 20 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ మేదరమెట్ల(అద్దంకి): తాళం వేసిన గృహంలో చోరీ జరిగిన ఘటన కొరిశపాడు మండలంలోని మేదరమెట్లలో గురువారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మేదరమెట్ల గ్రామంలో కొల్లా శ్రీలక్ష్మి అనే మహిళ నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీన ఇంటికి తాళం వేసి పుట్టిల్లైన పర్చూరు మండలంలోని వీరన్నపాలెం గ్రామానికి వెళ్లింది. తిరిగి గురువారం ఇంటికి చేరుకుంది. తలుపు తీసి చూడగా, ఇంటి వెనుక వైపున ఉన్న గ్రీల్స్కు వేసిన తాళం పగులగొట్టి ఉంది. దుండగులు అటు నుంచి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 20 సవర్ల బంగారు ఆభరణాలు అపహరించినట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..చోరీ జరిగిన గృహాన్ని ఎస్సై రఫీ పరిశీలించారు. క్లూస్టీంను పిలిపించి వేలిముద్రలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఇన్చార్జి ఎస్పీ హర్షవర్థన్రాజు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని గంటవానిపల్లె వద్ద ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షించారు. జేసీ పులి శ్రీనివాసులుతో కలిసి హెలిప్యాడ్, నిర్వాసితుల సభా వేదికను పరిశీలించారు. మార్కాపురం, దర్శి డీఎస్పీలు నాగరాజు, బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
‘రూపాయి పన్ను’పై డీపీఓ విచారణ
దొనకొండ (కురిచేడు): మండల కేంద్రమైన దొనకొండ మేజర్ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరగలేదని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఎం.అనుపమ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 200 వాణిజ్య భవనాలకు ఆస్తి పన్ను రూపాయి చొప్పున వసూలు చేశారనే ఫిర్యాదుపై ఆమె గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణచైతన్య ఆదేశాల మేరకు స్థానిక అధికారులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో రూపాయి పన్ను నమోదు చేసిన 173 అసెస్మెంట్లను గుర్తించారు. వాటిని శిథిలావస్థకు చేరిన భవనాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, హాస్టళ్లు, మాజీ సైనికుల ఇళ్లుగా తేల్చారు. నిబంధనల ప్రకారం వీటికి పన్ను మినహాయింపు ఉండగా, సాఫ్ట్వేర్లో సదరు అసెస్మెంట్లను తొలగించే ఆప్షన్ లేని కారణంగా నామమాత్రంగా రూపాయి నమోదు చేసినట్లు ఆమె వివరించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని విచారణలో స్పష్టమైందని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వసంతరావు నాయక్, డిప్యూటీ ఎంపీడీఓ బండారి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు. ● 11 మంది జూదరుల అరెస్టు ● రూ.50,160 నగదు, 8 బైకులు స్వాధీనం పొదిలి రూరల్: పొదిలి మండలం ఉప్పలపాడు పంచాయతీ గోగినేనివారిపాలెంలో బుధవారం అర్ధరాత్రి నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సమాచారం అందుకున్న సీఐ రాజేష్కుమార్ ఆదేశాలతో ఎస్సై సూరెడ్డి రాజేష్ తన సిబ్బందితో కలిసి పొలాల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50,160 నగదు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళా క్రికెటర్ల ఎంపికకు విశేష స్పందన
ఒంగోలు: జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలను బుధవారం నిర్వహించగా విశేష స్పందన లభించింది. స్థానిక మంగమూరు రోడ్డులోని ఏసీఏ సబ్ సెంటర్స్లో మహిళా క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహించింది. అండర్ 19, 23 విభాగాల్లో ఈ ఎంపిక నిర్వహించగా, బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపికై న అండర్ 19 జట్టు జూలై 4 నుంచి 9వ తేదీ వరకు మంగళగిరిలో పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు జట్లతో తలపడుతుందన్నారు. ఈ ఎంపికను చీఫ్ సెక్రటరీ, సీనియర్ క్రికెటర్ పీవీ సుధారాణి పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియను పరిశీలించిన వారిలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్కుమార్, క్రికెట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నవీన్కుమార్, సంయుక్త కార్యదర్శి బొచ్చు శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, రాము, నాదెండ్ల శ్రీను, కోచ్ లెఫ్ట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పెద్దదోర్నాల: ఈ నెల 27న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ విజయ సునీత, ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్రాజు బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఘంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న హెలిప్యాడ్, సభాప్రాంగణం వద్ద భద్రతా పరమైన అంశాలు, వసతులపై కలెక్టర్, ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఇరిగేషన్ ఎస్ఈ అబూతాలిమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కంభం: కంభంలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న మాజీ సైనికుడు పి.శ్రీనివాసులు బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి మార్కాపురం వెళ్లాడు. 11 గంటల సమయంలో ఇంట్లో నుంచి శబ్దాలు వస్తుండటంతో గమనించిన పైఇంటి వారు వచ్చి చూసేసరికి దొంగలు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గృహాన్ని పరిశీలించగా, ఇంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు బీరువా తాళాలు పగలగొట్టడాన్ని గుర్తించారు. రూ.5 వేల నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలిసింది. మార్కాపురం క్లూజ్టీమ్ వారు వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఒంగోలు సబర్బన్: జిల్లా పంచాయతీ అధికారిగా (డీపీఓ) ఎం.అనుపమ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ పి.రాజాబాబును మర్యాద పూర్వకంగా కలిసి మొక్క బహూకరించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న అనుపమ 2007 గ్రూప్–1 బ్యాచ్కి చెందిన అధికారిణి. 2025లో పదోన్నతి పొందిన ఆమె ఏలూరు జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేశారు. బదిలీపై ప్రకాశం జిల్లా డీపీఓగా బాధ్యతలు చేపట్టారు. -
రెరా చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
● ఏపీ రెరా చైర్మన్ శివారెడ్డి ఒంగోలు సబర్బన్: ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ–అమరావతి (ఏపీ రెరా) చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ రెరా చైర్మన్ ఆరె శివారెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియంలో బుధవారం రెరా చట్టం– 2016 నిబంధనలు, వాటి అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివారెడ్డి మాట్లాడుతూ రెరా చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించడం, చట్టం అమలులో భాగస్వాముల బాధ్యతలను వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రియల్ ఎస్టేట్ (నియంత్రణ అండ్ అభివృద్ధి) చట్టం–2016లోని ముఖ్య నిబంధనలను వివరించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రెరా చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇతర భాగస్వాములు చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్న వారు ప్రాజెక్టుల నమోదు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ల నమోదు, ప్రాజెక్టుల గడువు పొడిగింపు, చట్టపరమైన నిబంధనలు, ఇతర అనుసరణ అంశాలపై పలు సందేహాలను వ్యక్తం చేయగా, చైర్మన్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రెరా ప్రాజెక్టుల నమోదు శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, అర్హత కలిగిన అన్ని ప్రమోటర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ రెరా సభ్యులు, డైరెక్టర్ జి.వి.జి.ఎస్.ప్రసాద్ హాజరై చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ ప్రమోటర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు. -
చెరబట్టి.. గండ్లు కొట్టి..
చెరువుల్లో మట్టి మాఫియా విధ్వంసం అక్రమార్కుల ఆగడాలపై అధికారుల మౌనం మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువుల కట్టలు, మంచినీటి వనరులు అన్న విచక్షణ లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, ఒంగోలు సమీపంలోని కొప్పోలు గ్రామాల్లో సాగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు చెరువులో మాఫియా కనుసన్నల్లో జేసీబీలు, పొక్లెయిన్లు నిరంతరం పని చేస్తున్నాయి. చెరువు కట్టను కూడా వదలకుండా మట్టిని తవ్వేస్తుండటంతో కట్ట బలహీనపడింది. లారీల రాకపోకల కోసం ఏకంగా కట్టకు గండికొట్టారు. ఇక చెరువు పక్కన ఉన్న చిన్నపాటి చప్టాపై నుంచి భారీ లోడ్తో టిప్పర్లు వెళ్తుండటంతో, అది ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కొప్పోలు గ్రామంలోని మంచినీటి చెరువు పరిస్థితి మరీ దారుణం. మట్టి తత్వకాలతో చెరువు గర్భంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న మరో చెరువులో సైతం మట్టి తవ్వి సమీపంలోని ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై దుమ్ము రేగకుండా ట్యాంకర్లతో తడుపుతూ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులు దెబ్బతింటున్నా, అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది స్థానికుల ప్రశ్న. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చెరువుల వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి, ఒంగోలు -
దొంగిలించిన కారులో జల్సాగా తిరుగుతుండగా..
ఒంగోలు టౌన్: దొంగిలించిన కారులో జల్సాగా తిరుగుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ కృష్ణ, వన్టౌన్ సీఐ వెంకటేశ్వరరావు ఆ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని తంగెళ్ల ఖాశీం వీధికి చెందిన కొండపి వెంకట రాజశేఖర్ బలరాం కాలనీ శివారులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి ముందు కారు నిలిపి ఉంచారు. ఈ నెల 20వ తేదీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గేటు తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంటి తాళాన్ని కూడా పగులగొట్టి లోపల ఉన్న కారు తాళాలు తీసుకుని ఐ10 కారుతో ఉడాయించారు. రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాలూకా సీఐ విజయకృష్ణ, వన్టౌన్ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం పేర్నమిట్ట సమీపంలోని పాలకేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, చోరీకి గురైన కారులో ఉన్న ఆగంతకులు చీమకుర్తి వైపు నుంచి ఒంగోలు వస్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును ఆపి విచారించగా, బలరాం కాలనీలో దొంగలించిన కారుగా నిర్ధారణ అయింది. కారులో ఉన్న గుంటూరు జిల్లా పొన్నూరు నేతాజీనగర్కు చెందిన షేక్ మదార్, అదే ప్రాంతానికి చెందిన కట్ట వాసుదేవ్ ఉరఫ్ టింకు, షేక్ బాజీ, ఏలూరు జిల్లా పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన సత్తెనపల్లి రాకేష్లను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీరు చోరీలు చేసినట్లు నిర్ధారణ అయింది. దాంతో నిందితుల నుంచి కారుతో పాటుగా పొన్నూరులో దొంగలించిన ఒక హోండా షైన్ మోటారు బైకు, బుల్లెట్, టంగుటూరులో చోరీ చేసిన బజాజ్ పల్సర్, సింగరాయకొండ సుందరయ్య నగర్లో దొంగిలించిన గ్లామర్ మోటారు బైకు, ఒంగోలు ఆర్టీసీ బస్టాండు వద్ద చోరీ చేసిన వీవో మొబైల్ ఫోన్, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐలతో పాటు తాలూకా ఎస్సై శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ అన్వర్ బాషా, రామకృష్ణ, ఒంగోలు వన్టౌన్ ఏఎస్సై సురేష్, హెడ్కానిస్టేబుల్ సాయి, విజయ్, పీసీ అనిల్, టెక్నికల్ అసిస్టెంట్ వెంకట్ను ఎస్పీ హర్షవర్థన్రాజు అభినందించారు. అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుంచి కారు, పలు మోటారు బైకులు, మొబైల్ ఫోన్ స్వాధీనం -
బీకేఎస్ రాష్ట్ర కో కన్వీనర్గా ధారా రవికుమార్
ఒంగోలు సబర్బన్: భారతీయ కిసాన్ సంఘటన్ (బీకేఎస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో కన్వీనర్గా ధారా రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ కిసాన్ సంఘటన్ నేషనల్ జనరల్ సెక్రటరీ యర్రం వెంకటరెడ్డి బుధవారం నియామక పత్రం అందించారు. ఒంగోలుకు చెందిన ధారా రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ దక్షిణ భారతంలో విస్తరణ దిశగా దేశంలోని ప్రముఖ ప్రజాస్వామ్య రైతు సంస్థ రైతుల సమగ్ర అభివృద్ధి, స్వాలంబన దిశగా ముందుకు పోతున్నామన్నారు. గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్గా (ఎంపీహెచ్ఏ, ఫిమేల్)గా విధులు నిర్వహిస్తున్న 79 మందికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్స్గా (ఎంపీహెచ్ఎస్) పదోన్నతి లభించింది. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటుగా హెడ్నర్సులుగా పనిచేస్తున్న నలుగురికి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లుగా, హెల్త్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్న ఒకరికి డెమోగా పదోన్నతి ఇచ్చారు. కౌన్సిల్ ప్రక్రియలో ఆర్డీ డాక్టర్ జి.శోభారాణి, డీడీ బండి పాల్ సుధాకర్, ఆఫీస్ సూపరింటెండెంట్ సత్యం, సీనియర్ అసిస్టెంట్ బూసి శ్యామ్ అనిల్ పాల్గొన్నారు. -
అగ్రహావేశాలు!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా టీడీపీలో ఇద్దరు అగ్ర నేతల మధ్య కోల్డ్ వార్ తార స్థాయి చేరింది. ఆ ఇద్దరిలో ఒకరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరొకరు రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరు నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. సింగరాయకొండలో విగ్రహం దగ్గర మొదలైన వివాదం... కనిగిరి వేదికగా రచ్చకెక్కింది. తాజాగా ఇద్దరి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. సింగరాయకొండలోని బాలయోగి నగర్ సెంటర్లో దివంగత మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం ఉంది. అయితే బాలయోగినగర్కు చెందిన వార్డు అధ్యక్షుడు నరశింహ రోడ్డు విస్తరణ పనుల పేరిట సుబ్బరామిరెడ్డి విగ్రహాన్ని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ సమాచారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దృష్టికి స్థానిక టీడీపీ నాయకులు తీసుకెళ్లారు. దాంతో హుటాహుటిన మాగుంట నేరుగా అక్కడకు వెళ్లి తొలగిస్తున్న స్థానిక నాయకుడితో మాట్లాడారు. మంత్రి చెబితే చేస్తున్నానని చెప్పటంతో మాగుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతని లిక్కర్ ఫ్యాక్టరీకి చెందిన అధికారులను పిలిపించి, స్థానిక కొంతమంది టీడీపీ నాయకులను దగ్గర పెట్టి ధ్వంసం చేసిన దిమ్మెను పునర్నిర్మింపజేశారు. తరువాత విగ్రహానికి దిమ్మెకు రంగులు కూడా వేయించారు. ఇది ఆరు నెలల క్రితం జరిగిన తంతు... కనిగిరి వేదికగా.. కనిగిరిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రి కూడా వచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరశింహా రెడ్డిల ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే సమయంలో మంత్రి స్వామి కలుగజేసుకొని కొండపి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, నిధులు ఖర్చు చేసే విషయంలో తనకు సమాచారం కూడా ఇవ్వటం లేదని మాగుంటను ఉద్దేశించి అన్నారు. తన విషయంలో ప్రొటోకాల్ కూడా పాటించటం లేదని ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న ఎంపీ మాగుంట మంత్రికి ఘాటుగానే సమాధానమిచ్చారు. కొండపి నియోజకవర్గంలో ఎంపీ అన్న గౌరవం మీరు ఇస్తున్నారా అని నిలదీశారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో సమావేశంలో ఉన్న కేంద్రం మంత్రి, రాష్ట్ర మంత్రులు నివ్వెరపోయారు. మాగుంట సర్కిల్ బోర్డును పీకేయించిన మంత్రి స్వామి... నాలుగు రోజుల క్రితం బాలయోగి నగర్ సెంటర్లోని మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద సింగరాయకొండ, పకీరు పాలెంకు చెందిన మాగుంట అనుచరులు మాగుంట సర్కిల్ అని బోర్డు పెట్టారు. ఆ సమాచారం టీడీపీలోని కొందరు నాయకులు ఆ విషయాన్ని మంత్రి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఆ బోర్డును పీకేయించిన మంత్రి స్వామి దాని స్థానంలో పసుపురంగు వేసిన బోర్డుపై బాలయోగి నగర్ సర్కిల్ అని రాయించారు. మాగుంట సర్కిల్ బోర్డు స్థానంలో నూతనంగా ఏర్పాటు చేశారు. దీనిపై మాగుంట రాష్ట్ర మంత్రి స్వామిపై రగిలిపోతున్నారు. అనంతరం సింగరాయకొండ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి వస్తానని చెప్పిన మాగుంట సింగరాయకొండలో ఉన్నా కూడా మంత్రి స్వామి పాల్గొన్న కార్యక్రమం కాబట్టి పాల్గొనకుండా ఒంగోలు వెళ్లిపోయారు. -
క్రీడా సామగ్రి పంపిణీ అడ్డుకోవడం దారుణం
అద్దంకి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయాల్సిన క్రీడా సామగ్రిని (స్పోర్ట్స్ కిట్స్) అడ్డుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు ఎంతటి నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందజేయాలని నిర్ణయించామని, పది రోజుల క్రితమే ప్రధానోపాధ్యాయులతో చర్చించామని ఆయన వివరించారు. అయితే, విద్యార్థుల ప్రయోజనం కోసం ఉద్దేశించిన కిట్లను స్వీకరించకుండా పాఠశాల యాజమాన్యాలను కొందరు బెదిరిస్తున్నారని అశోక్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజకీయాల్లో డీసెంట్గా వ్యవహరిస్తారని ఆశించాను, కానీ చిన్న పిల్లల ఆట వస్తువులను కూడా వద్దని చెప్పేంత ’లోక్లాస్’ మైండ్సెట్తో వ్యవహరించడం చూస్తుంటే బాధేస్తోంది. రాజకీయంగా ఎదుగుతున్నాననే అక్కసుతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాఠశాలల్లో అనుమతించకపోయినా, బహిరంగ ప్రదేశంలో కిట్లు ఉంచి విద్యార్థులందరికీ అందజేస్తానని వెల్లడించారు. జూలై 4న ‘పల్నాడు హాస్పిటల్’ ప్రారంభం రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా అద్దంకిలో కొత్తగా ’పల్నాడు హాస్పిటల్’ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని డాక్టర్ అశోక్కుమార్ ప్రకటించారు. తక్కువ ఫీజుతో అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం చిన్నారుల భవిష్యత్ను బలి చేయకండి వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ అశోక్కుమార్ మండిపాటు -
చంద్రబాబు మాటకు విలువ లేదు
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు కిలో రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చారని, అయితే వ్యాపారులు మాత్రం కేవలం రూ.160లకు కొనుగోలు చేస్తున్నారని, సీఎం చంద్రబాబు మాటకు విలువలేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం మాటలకు విలువుంటే వ్యాపారుల మీద ఒత్తిడి చేసి చెప్పిన ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. త్రోవగుంట సమీపంలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. వేలం ఎలా జరుగుతుంది.. ఎంతకు కొంటున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన పొగాకు తీసుకొచ్చినా బాగాలేదని సాకులు చెప్పి గ్రేడ్ తగ్గించి వేస్తున్నారని కొందరు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రేటుకు పొగాకు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. దీంతో పొగాకు రైతులు ఐక్య పోరాటాలు చేస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని, ప్రభుత్వం దిగివస్తుందని శ్రీనివాసరావు చెప్పారు. లేకపోతే ప్రభుత్వం చెప్పేది ఒకటి వ్యాపారులు చేసేది మరొకటి ఉంటుందన్నారు. పొగాకు రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం మద్దతుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, జయంతి బాబు, పమిడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
‘‘సర్’’లో నిబంధనలు ఉల్లంఘించరాదు
ఒంగోలు సబర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్) నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించరాదని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్ ఏటూరి భాను ప్రకాష్ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ కుమార్లతో కలిసి బుధవారం ఆయన ఒంగోలు వచ్చారు. జిల్లాలో ‘సర్’ ప్రక్రియలో పురోగతిపై కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారిలతో కలిసి ప్రకాశం భవనంలో వీరు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ చేస్తున్న తీరు, పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారమే ఈ ప్రక్రియ జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు సమర్థంగా పనిచేస్తేనే పారదర్శకమైన ఓటర్ల జాబితా సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా ఈఆర్వోలు తమ పరిధిలోని ఏఈఆర్వోలు, సూపర్వైజర్లు, బీఎల్ఓలతో నిత్యం సంభాషిస్తూ పురోగతిని గమనిస్తూ ఉండాలని ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయి సిబ్బంది రోజులో కనీసం ఐదు గంటలు ఫీల్డ్లో ఉండాలని డిప్యూటీ కమిషనర్ స్పష్టం చేశారు. అప్పుడే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. కేవలం ‘సర్’ మాత్రమే కాకుండా పోలింగ్ కేంద్రాల మార్పిడి, వాటి పరిధిలో మార్పు కోరుకుంటున్న ఓటర్ల వంటి విషయాలు ఇప్పుడు గమనిస్తేనే ఎన్నికల సమయంలో ఇబ్బందులు లేకుండా చేయవచ్చన్నారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. రాజకీయ పార్టీలు కూడా వాటి తరఫున బీఎల్ఏలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ సగటున 80 శాతం వరకు ఉందని, డిజిటైజేషన్ ప్రక్రియలో కూడా పురోగతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ఓటర్లు అందరూ జాబితాలో ఉండేలా చూస్తున్నామన్నారు. ఎవరిదైనా ఓటు లేకపోతే ఫారం–6 నింపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని అవగాహన కల్పించామన్నారు. సమావేశంలో సబ్ కలెక్టర్ డి.హిమవంశీ, డీఆర్ఓ మాధురి, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు పాల్గొన్నారు. -
‘బై నాన్న’ అన్న కూతురు.. నిమిషాల్లోనే మృత్యుఒడిలోకి తండ్రి!
పొదిలి: ‘బై నాన్న’ అని పాఠశాల గడప దాటిన కూతురు మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతుండగానే.. ఆ తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. పొదిలి పట్టణంలోని రథం రోడ్డులో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాలు.. స్థానిక దర్శి రోడ్డు ఎస్ఎస్ఆర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చెరుకూరి రవికుమార్(48) వృత్తిరీత్యా కార్పెంటర్. బుధవారం తన కుమార్తెను మహర్షి పాఠశాలలో వదిలిపెట్టేందుకు బైక్పై వెళ్లాడు. పాఠశాల వద్ద కుమార్తెను దించి, ’బై నాన్న’ అని ఆ చిన్నారి చెప్పిన మాటలు మనసులో మెదులుతుండగా ఇంటికి బయలుదేరాడు. రథం రోడ్డు వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ రవికుమార్ బైక్ను ఢీకొట్టింది. దీంతో అతను అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ రవికుమార్ మీదుగా వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న సీఐ రాజేష్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవికుమార్ మృతితో భార్య, ఇద్దరు పిల్లల రోదనలు మిన్నంటాయి. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పరిస్థితి చూసి అక్కడున్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు. మితిమీరిన వేగమే కారణమా? ఇంటికి, పాఠశాలకు, పని ప్రదేశానికి అతి తక్కువ దూరంలోనే నివసించే రవికుమార్, ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంపై పట్టణ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ల మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమని, అధికారులు ఇప్పటికై నా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ట్రాక్టర్, టిప్పర్ రూపంలో దాపురించిన మృత్యువు పొదిలి రథం సెంటర్ వద్ద ప్రమాదం -
మహదేవపురంలో నిధులు స్వాహా
కందుకూరు రూరల్: కందుకూరు మండలంలోని మహదేవపురం పంచాయతీలో నిధులు స్వాహా జరిగినట్లు పంచాయతీ రాజ్శాఖ కమిషనర్ కృష్ణతేజ గుర్తించారు. మంగళవారం ప్రకాశం జిల్లా అధికారులో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతూ కందుకూరు మండలంలోని మహదేవపురంలో ఏడు లీటర్ల ఆయిల్కు రూ.12 లక్షలు నిధులు ఖర్చు చేసినట్లు బిల్లు ఉందని ప్రస్తావించారు. ఈ విధంగా డీజిల్, పెట్రోల్కు ఇంత నిధులు ఖర్చు చేస్తున్నారని దీనిపై విచారించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో డీపీఓ పి.వెంకటేశ్వర్లు బుధవారం మహదేవపురం సచివాలయానికి వచ్చారు. రికార్డులన్నీ తనిఖీలు చేసి, ఎం బుక్లు పరిశీలించారు. తనిఖీల్లో ఏడు వర్క్లు రూ.13.4 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు ఉండగా ఇందులో డీజిల్, పెట్రోల్ హెడ్ కింద ఏడు లీటర్లకు రూ.12 లక్షలు ఖర్చు అయినట్లు బిల్లు నమోదు చేసి ఉందన్నారు. ఏడు వర్కులు కింద సైడు డ్రైన్లు, రోడ్డు, పైపు లైన్ల నిర్మాణంకు నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. నిర్మించిన సైడ్ డ్రైన్లు, రోడ్డును పరిశీలించారు. వీటితోపాటు బ్లీచింగ్ కింద రూ.42 వేలు, పారిశుధ్య కార్మికులకు జీతాల కింద రూ.31 వేలు, ఆఫీస్ మెయిటినెన్స్ కింద రూ.76 వేలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఇవి గడిచిన నాలుగైదు నెలల్లో ఖర్చు చేసినట్లు ఉంది. ఈ వర్క్లకు సంబంధించిన నిధులన్నీ డీపీఓ లాగిన్లో అప్రూవల్ అయిన తర్వాతనే నిధులు డ్రా చేయాల్సి ఉందన్నారు. కానీ పంచాయతీ కార్యదర్శి సద్దాం, కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా డీపీఓ అప్రూవల్ లేకుండా నిధులు డ్రా చేశారని తెలిపారు. అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు వర్క్లకు అని నమోదు చేయబోయి ఏడు లీటర్లు అని నమోదు అయినట్లుగా చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి సద్దాం బదిలీపై వెళ్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్ ఒత్తిడితో జనరల్ ఫండ్లోని నిధులు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఇతర ఫండ్లో బిల్లులు చేయాలంటే త్వరగా కావనే ఉద్దేశంతో డీపీఓ అప్రూవల్ లేకుండా వక్రమార్గంలో కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్ నిధులు డ్రా చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది. మహదేవపురం పంచాయతీలో ఏడు లీటర్లకు రూ.12 లక్షల నిధులు డ్రా చేసిన విషయం చర్చనీయాంశమైంది. అయితే పంచాయతీలో డీజిల్, పెట్రోల్ వాడే వాహనాలు ఏమున్నాయని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పంచాయతీకి చెత్త సేకరించేందుకు ఒక ఆటోను ఉంది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకటి, రెండు నెలలు చెత్త కోసం తిరిగింది. తర్వాత చెత్త బండి ఎప్పుడో ఒక రోజు వాడుతుంటుంటారు. ఆ చెత్త ఆటోకి ఆయిల్ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే సంక్రాంతి పండగ రోజు మినహా తర్వాత పంచాయతీలో బ్లీచింగ్ చల్లిన పాపనపోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా పంచాయతీలో సచివాలయం మెయింటినెన్స్ కింద నాలుగైదు నెలలకు రూ.76 వేలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ విధంగా ఒక పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్తుంటే కాంట్రాక్టర్కు జేబు నింపేందుకు రకరకాల పనులు పేర్లు పెట్టి నిధులు డ్రా చేసి ఇచ్చారు. ఇందులో అధికారుల వాటా కూడా ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డీపీఓ వెంట ఇన్చార్జ్ ఎంపీడీఓ పి.ఓబులేసు, ఇన్చార్జ్ కార్యదర్శి సీహెచ్.స్వప్న, స్వచ్ఛభారత్ కో ఆర్డినేటర్ ఎం.రమణయ్య ఉన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
ఒంగోలు నగరపాలక సంస్థలో అవినీతి కంపుకొడుతోంది. చెత్త సేకరణ పేరుతో భారీ ఎత్తున దందా జోరుగా సాగుతోంది. నగరంలోని వేలాది ఇళ్ల నుంచి ప్రైవేటు ఆటోల ద్వారా నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ అధికారులు జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశుధ్య విభాగంలోని కొందరు అధికారుల అండదండలతో జరుగుతున్న ఈ దందాలో లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నామంటున్న అధికారులు, ఆ సంపదను కార్పొరేషన్ ఖజానాకు కాకుండా కొందరి జేబుల్లోకి మళ్లిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రుణాలు ఇతోధికంగా మంజూరు చేయండి
● డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాల్లో కలెక్టర్ రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో ప్రాధాన్యత రంగాలకు నిర్దేశించిన లక్ష్యాలు చేధించాలని, ఇతోధికంగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ పి. రాజాబాబు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాలులో మంగళవారం బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో 2025– 26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కేటాయించిన రుణాల లక్ష్యాలను బ్యాంకర్లు పూర్తిగా కచ్చితంగా సాధించాలన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. డ్వాక్రా సంఘాలకు, యువత స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు చేయడంతో పాటు యూనిట్ల ఏర్పాట్లలో కూడా వారికి సాంకేతిక సహాయం అందించి త్వరిగతిన యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో లీడ్ జిల్లా మేనేజర్ రమేష్, నాబార్డు అధికారి రవికుమార్, ఆర్బీఐ ఏజీఎం కిషన్ కుమార్, డీఆర్డీఏ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నారాయణ, విజయలక్ష్మి, వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్లు ఎస్.శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, సీపీడీసీఎల్ ఎస్ఈ కట్టా వెంకటేశ్వరరావు, జిల్లా సెరికల్చర్ అధికారి డాక్టర్ సుజయ్, రూడ్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసుల రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి
పెద్దదోర్నాల: మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓట్ల మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నాయకులు, బూత్ కన్వీనర్లకు సూచించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నే అవకాశం ఉందన్నారు. పార్టీకి చెందిన ఓట్లు కోల్పోకుండా ప్రతి ఒక్క కార్యకర్త జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజంట్లు తప్పని సరిగా కార్యక్రమంలో నిమగ్నం కావాలని కోరారు. ఓటు హక్కు కలిగిన వారికి సంబంధించిన ఫారాలను భర్తీ చేసి అందజేయటం, ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి ఆధారాలు సమర్పించాలనే విషయాలపై ఓటర్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఓట్లలో లోపాలను సరిదిద్ది బీఎల్ఓలకు సమర్పించేలా అందరూ పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాలకు బీఎల్ఓలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు వారి వెంట ఉండి ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు. నెల రోజుల పాటు ప్రక్రియ జరుతుంది కాబట్టి ఏ ఒక్క ఓటు రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటంతో టీడీపీపై ప్రజలు ఆగ్రహంలో ఉన్నారన్నారు. ఈ ప్రక్రియలో పొరబాటున ఒక్క ఓటు తొలగిపోతే మళ్లీ చేర్చేందుకు ఎంతో సమయం పడుతుందని అన్నారు. ఇంటి వద్దకు బీఎల్ఓలు వస్తే ఇంట్లోని పేర్లను సరిచూసుకొని వారి వద్ద నుంచి రసీదు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్ టాస్క్ఫోర్స్ సభ్యులు పత్తి రవిచంద్ర మొబైల్ యాప్లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు చిట్టె వెంకటేశ్వరరెడ్డి, గుమ్మాయల్లేష్, గంటా గురవారెడ్డి, దూదేకుల రసూల్, బొగ్గరపు రమేష్, ఒంటేరు నాగేశ్వరరావు, చిట్యాల యోగయ్య, గుండారెడ్డి రమణారెడ్డిలతో పాటు మండలానికి చెందిన ముఖ్య నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ -
గంజాయి కేసులో ఇద్దరు అరెస్టు
కందుకూరు: గంజాయి సరఫరాకు సంబంధించిన కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందుకూరు ప్రాంతంలో గంజాయి విక్రయాలు, సరఫరా, రవాణాకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైల్కు పంపామన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో కీలక నిందితులను వరుసగా అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్న పట్టణంలోని బండపాలెంకు చెందిన కత్తుల కిశోర్, గుడ్లూరు గ్రామానికి చెందిన కామంచి రాజేష్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ గంజాయి సరఫరాలో కీలక నిందితులుగా ఉన్నారని, కందుకూరు ప్రాంతంలో ప్యాకెట్లుగా గంజాయి విక్రయించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కొంత కాలంగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి అదుపులోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 2.350కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే ఈ కేసులో మరికొంత మంది నిందితుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. గంజాయి విక్రయించే వారు, తాగుతున్న వారి వివరాలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే కందుకూరు పోలీస్ అధికారులు 9121102202, 9121102203 నంబర్లకు, 9121102266 అనే వాట్సప్ నంబర్కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సీఐ షేక్ అన్వర్బాష, రూరల్ ఎస్సై బాలక్రిష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 2.350 కేజీల గంజాయి స్వాధీనం గంజాయి కేసులో ప్రతి నిందితున్ని అరెస్టు చేస్తాం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం -
చిన్నోడైనా...చితక్కొట్టాడు
● అండర్ 16లో ట్రిపుల్ సెంచరీ సాధించిన పృధ్వీరాజ్ ● వాటిలో 61 బౌండరీలతో పరుగుల వరద ● అభినందనలు తెలిపిన ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కందుకూరు రూరల్: వయసుచిన్నదైనా.. వచ్చిన బాళ్లను వచ్చినట్లు చితక్కొడుతూ ట్రిపుల్ సెంచరీ బాదేశాడా చిచ్చరపిడుగు. అండర్ 16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు కృష్ణాజిల్లా మూలపాడులో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లాపై ప్రకాశం జట్టులోని ఎంఎల్ పృధ్వీరాజ్ అద్భుత ప్రతిభ చూపించాడు. కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన పృధ్వీరాజ్ అండర్ 16 విభాగంలో ప్రకాశం జిల్లా క్రికెట్ జట్టకు ఎంపికై సెంట్రల్ జోన్ పోటీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రకాశం జిల్లా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 508 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. ప్రకాశం జిల్లా జట్టులోని ఎంఎల్ పృధ్వీరాజ్ రికార్డు స్థాయిలో 317 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్లో 61 బౌండరీలు ఉండటం విశేషం. దీనికి ముందు కృష్ణా జిల్లాతో జరిగిన మ్యాచ్లో కూడా 19 ఫోర్స్, 1 సిక్సర్ తో 122 పరుగులు, బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రకాశంజిల్లా టీంకు మంచి ఆల్ రౌండర్గా నిలిచాడు. దీనిపై ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు, అధ్యక్షుడు పోతుల నవీన్, పృధ్వీరాజ్ తండ్రి రాజాతో పాటు, కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. -
ధనవంతుల కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం
ఒంగోలు టౌన్: చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల పొట్టలు కొట్టి ధనవంతుల కొమ్ము కాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్కుమార్ విమర్శించారు. సీఐటీయూ సీనియర్ నాయకుడు కాలం సుబ్బారావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ...షెడ్యూల్ పరిశ్రమల్లోని 71 రంగాల్లో వేతనాలు సవరించుకోవడంతో కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలు కారుచౌకగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణాల్లో వేతనాలు పెంచినా మన రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వేతనాలు పెంచడం లేదని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు నూరుశాతం పెరిగాయని, కుటుంబ వ్యయం విపరీతంగా పెరిగిందని చెప్పారు. గ్రానైట్, ఆక్వా, స్పిన్నింగ్ మిల్లులు, రైస్, ఆయిల్ మిల్లులు, గోడౌన్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటళ్లు, పెట్రోలు పంపుల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెట్రోలు, గ్యాస్ ధరలు పెరగడంతో పేదల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. వలస కార్మికులకు నివాస వసతులు కల్పించకపోవడంతో పశువుల కొట్టాల వంటి చిన్న చిన్న నివాసాలలో బతుకీడుస్తున్నారని తెలిపారు. రోజుకు 14 గంటలు పనిచేస్తున్నా ఓటీ అమలు చేయడంలేదని, స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, ఎండీఎం, వీఓఏలకు వేతనాలు పెంచకుండా ప్రభుత్వాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీఎం కార్మికులకు రూ.3 వేల వేతనాలు ఇస్తూ జీవించే హక్కును ప్రభుత్వమే కాలరాస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 ఏళ్ల సర్వీసు ఉంటే రెగ్యులర్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా జూలైలో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జీవీ కొండారెడ్డి, పి.కల్పన, మంజుదార్, పి.ఆంజనేయులు, జి.రమేష్, వెంకటేశ్వర్లు, టి.రాము, ఆదిలక్ష్మి, చిరంజీవి, వీరాంజనేయులు పాల్గొన్నారు. -
యువతి హత్యాచార ఘటనలో ఇద్దరికి యావజ్జీవం
చీరాల: చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో 2024 జూన్లో యువతిపై లైంగికదాడికి పాల్పడి హత్యచేసిన ఇద్దరు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా, మూడో ముద్దాయికి ఐదేళ్ల శిక్ష, రూ.2 వేల జరిమానా విఽధిస్తూ సోమవారం ఒంగోలు కోర్టు రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత తీర్పు చెప్పారు. ఆ వివరాల ప్రకారం... 2024 జూన్ 21న చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్స్టేషన్ పరిధిలో ఈపూరుపాలెం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్ (26), కారంకి మహేష్బాబు (23) ఆమెను ఈపూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ గోడ వెనుక రైల్వేట్రాక్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి హత్య చేశారు. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు అపహరించారు. అనంతరం ఇద్దరు నిందితులు దేవరకొండ శ్రీకాంత్ (24) వద్దకు వెళ్లగా అతడు వారికి ఆశ్రయం కల్పించి దాచిపెట్టాడు. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. అప్పటి రూరల్ సీఐ ఎన్.సత్యనారాయణ కేసు విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ముగ్గురు నిందితులు నేరానికి పాల్పడినట్లు తగిన సాక్ష్యాలతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఒంగోలు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణకు రాగా, డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ, ఎస్ఐలు, కోర్టు కానిస్టేబుల్ షేక్ కరిముల్లా సాక్షులను హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేవీ రామేశ్వరరెడ్డి, ఎన్.అవనీష్ కోర్టులో వాదనలు వినిపించి నిందితులపై మోపిన నేరాభియోగాలను తగిన సాక్ష్యాధారాలతో నిరూపించారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి పి.లలిత మొదటి ముద్దాయి దేవరకొండ విజయ్, రెండో ముద్దాయి కారంకి మహేష్బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా, మూడో ముద్దాయి దేవరకొండ శ్రీకాంత్కు ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. అలానే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు. నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు తీర్పు వెలువరించిన ఒంగోలు రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత -
బ్రేకుల్లేని రేషన్ దందా..!
మద్దిపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలో రేషన్ దందా కొత్తపుంతలు తొక్కుతోంది. పేదల బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి చాలా కాలంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. కేవలం యాభై నుంచి వంద కేజీల వరకూ బియ్యం రేషన్ డీలర్ల ద్వారా పక్కదారి పట్టేవి. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో అధికార టీడీపీ ముఖ్య నాయకుడి కనుసన్నల్లో యథేచ్ఛగా జరుగుతోంది. పల్నాడుకు చెందిన వ్యక్తి ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటున్నాడు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్కో మండలానికి ఇద్దరు అనుచరులను పెట్టుకుని మరీ బియ్యం దందా సాగిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సివిల్ సప్లయిస్, ఎన్ఫోర్స్మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఎవరి స్థాయిలో వారు మామూళ్లు తీసుకుంటూ చోద్యం చూస్తున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని పంచుకుని తింటున్నారు. రేషన్ డీలర్ వద్ద రూ.15 నుంచి రూ.17 వరకూ కొనుగోలు... సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలంలో 51 రేషన్ షాపులు ఉన్నాయి. వాటికి 331 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అదేవిధంగా సంతనూతలపాడు మండలంలో 35 షాపులకు 242 మెట్రిక్ టన్నులు, మరో 8 షాపులకు ఒంగోలులోని ఎంఎల్ఎస్ పాయింట్ ద్వారా 25 మెట్రిక్ టన్నులు, మద్దిపాడు మండలంలోని 31 రేషన్ షాపులకు 220 మెట్రిక్ టన్నులు, నాగులుప్పలపాడు మండలంలోని 53 రేషన్ షాపులకు 275 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. మొత్తం 1093 మెట్రిక్ టన్నుల బియ్యంలో కనీసం వెయ్యికిపైగా మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ రేషన్ దందా ద్వారా కోట్లాది రూపాయలను అధికార పార్టీ నాయకులు, అధికారులు బొక్కేస్తున్నారు. రేషన్ దుకాణదారుడు కేజీకి రూ.11 చొప్పున కార్డుదారునికి ఇచ్చి బియ్యం కొనుగోలు చేస్తుండగా, డీలర్ వద్ద నుంచి కాంట్రాక్టర్ రూ.15 నుంచి రూ.17 వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. ఆ బియ్యాన్ని వారికి అనువైన రైస్ మిల్లులకు తరలించి అక్కడ పాలిషింగ్ చేయించడం, లేకపోతే అదే బియ్యాన్ని వేరే బస్తాల్లోకి మార్చి కేజీ రూ.30కిపైగా అమ్మడం చేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నెల మామూళ్లు... రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎక్కడా బ్రేకులు పడకుండా ఉండేందుకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ సంబంధిత అధికారులకు నెలవారీగా మామూళ్లు ఇస్తున్నారు. దానికితోడు అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుడి కనుసన్నల్లోనే దందా మొత్తం జరుగుతుండటంతో ఎవరూ దాని గురించి మాట్లాడలేని పరిస్థితి. గతంలో నాయకుల మధ్య విభేదాలతో పట్టుబడిన బియ్యం... నాగులుప్పలపాడు మండలంలో కూటమి ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యనాయకుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా రేషన్ బియ్యం పట్టుబడిన విషయం చర్చనీయాంశమైంది. గత సంవత్సరం జూన్ 6వ తేదీ మద్దిపాడు సమీపంలోని ఒక రైస్మిల్లులో 2,108 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ గుండ్లాపల్లి వద్ద పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక లారీ ప్రమాదవశాత్తూ తిరగబడగా, అందులో రేషన్ బియ్యం బయటపడింది. ఈ రెండు సంఘటనలు మినహా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడా అధికారులు రేషన్ షాపులు, గోడౌన్లు, రైస్ మిల్లులపై దాడి చేయకపోవడం చూస్తుంటే.. రేషన్ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది. మద్దిపాడు మండలంలోని రైస్మిల్లులో సీజ్ చేసిన రేషన్ బియ్యంతో అధికారులు (ఫైల్)రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ గత సంవత్సరం గుండ్లాపల్లి వద్ద తిరగబడిన లారీ సంతనూతలపాడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుని కనుసన్నల్లో పేదల బియ్యం పక్కదారి చక్రం తిప్పుతున్న పల్నాడుకు చెందిన వ్యక్తి మండలానికి ఇద్దరు అనుచరులను పెట్టుకుని మరీ కార్యకలాపాలు మామూళ్ల మత్తులో అధికారులుపల్నాడు జిల్లా వ్యక్తి చక్రం తిప్పడంపై రగిలిపోతున్న స్థానిక నాయకులు... సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధం లేని పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి కాంట్రాక్టర్గా వ్యవహరిస్తూ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుడి ఆశీసులతో ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున అనుచరులను ఏర్పాటు చేసుకుని రేషన్ దందాలో చక్రం తిప్పడంపై ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు రగిలిపోతున్నారు. రేషన్ షాపుల వద్ద నుంచి బియ్యం సేకరించి గోడౌన్లకు చేర్చుతూ తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఎవరి మామూళ్లు వారికి అందిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడని టీడీపీ నాయకులే గుర్రుమంటున్నారు. నియోజకవర్గానికిగానీ, జిల్లాకుగానీ సంబంధం లేని వ్యక్తి ఇలా చక్రం తిప్పడం ఏంటని కొందరు నాయకులు మండిపడుతున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
దర్శి (కురిచేడు): ప్రజా సమస్యలు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్దన్రాజు తెలిపారు. పోలీస్ అధికారులతో కలిసి సోమవారం దర్శి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఎస్పీ స్వయంగా వాటిని స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్య పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకున్నా రు. చట్టపరంగా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో సమీక్షించారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ వహించి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం అన్ని సబ్ డివిజన్ల పరిధిలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దర్శిలో మొత్తం 69 ఫిర్యాదులు అందాయన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఒంగోలు డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ శ్రీహరి నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి కూడా 65 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వెల్లడించారు. పెండింగ్ కేసులపై శ్రద్ధ వహించాలి పెండింగ్ కేసులపై శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్దన్రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. దర్శిలో సోమవారం పోలీస్ మీ కోసం కార్యక్రమం అనంతరం పోలీసు అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. దర్శి సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసులపై సమీక్షించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్, దర్శి సీఐ రామారావు, అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్, దర్శి సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ హర్షవర్దన్రాజు దర్శిలో ప్రత్యేకంగా పోలీస్శాఖ మీ కోసం కార్యక్రమం -
సకాలంలో అర్జీలు పరిష్కరించాలి
ఒంగోలు సబర్బన్: ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్ఓ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సకాలంలో, సహేతుకంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కరించలేని పక్షంలో అందుకుగల కారణాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, పునరావృతం అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులందరూ తమ లాగిన్లో పెండింగ్ ఉన్న అర్జీలను ప్రతిరోజూ పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్తో పాటు పల్లెనిద్ర, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మీ కోసంలో కలెక్టర్ పి.రాజా బాబు -
కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టాలి
పుల్లలచెరువు: కూటమి నాయకుల కుట్రలు తిప్పికొట్టేందుకు వైఎస్సార్ సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పుల్లలచెరువు రైస్ మిల్ వద్ద బీఎల్ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో అప్రమత్తంగా లేకుంటే కుట్రలు చేయడంలో ఆరితేరిన చంద్రబాబు మోసాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఆ కుట్రను ధైర్యంగా ఎదుర్కొవాలంటే బీఎల్ఏలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలతోనే దేశంలోని ప్రముఖ వ్యక్తులు ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న బీఎల్ఏలు తగు సమాచారంతో జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల విషయంలో పకడ్బందీగా లేకుంటే ఓట్లు తొలగించేందుకు కూటమి నాయకులు కుట్రలు చేసే అవకాశం ఉందన్నారు. ప్రతి బీఎల్ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలను సేకరించి ఓట్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. సర్ ప్రక్రియ వచ్చిన తరువాత మొదటిసారి స్థానిక ఎన్నికలు ఎదుర్కొవాల్సి వస్తుందని, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలోని ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా ఉంటూ బీఎల్ఓను అనుసంధానం చేసుకుంటూ ఓట్లు అన్ని ఉండేలా చూడాలన్నారు. వైఎస్సా ఆర్ సీపీ అధికారంలోకి రావాలంటే బీఎల్ఏలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీని ఇంటికి పంపేందుకు ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు. కుట్రలు, కుతంత్రాలకు మారు పేరుగా ఉన్న కూటమి నాయకుడు చంద్రబాబు చేసే పనులకు ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా తండ్రీ, కొడుకు విహారయాత్రలు చేస్తున్నారని, రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రతి మండలకేంద్రంలో సర్ ప్రక్రియకు సంబంధించి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 87 కేంద్రం బీఎల్వోపై ఫిర్యాదు పుల్లలచెరువు మండలంలోని 87 పోలింగ్కేంద్రంలో పనిచేస్తున్న బీఎల్వో ఆ కేంద్రంలో వైఎస్సార్ సీపీ పార్టీ తరపున పనిచేస్తున్న బీఎల్ఏకు సమాచారం ఇవ్వకుండా విధులు నిర్వహించిన విషయం స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎమ్మెల్యే స్పందించి బీఎల్ఓతో ఫోన్లో మాట్లాడారు. బీఎల్ఏ సంతకం ఉండాలని తనకు తెలియదని, తాను బీఎల్ఏను సంప్రదించకుండా పనిచేశానని, ఆ విషయం తనకు తెలియదని ఎమ్మెల్యేకు తెలిపింది. సర్ ప్రక్రియకు సబంధించిన విషయాలు తెలుసుకోకుండా బీఎల్వోగా ఏలా పనిచేస్తున్నావని ఎమ్మెల్యే ప్రశ్నంచారు. ఈ విషయంపై ఈఆర్వో వద్ద ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సదస్సుకు పార్టీ మండల అధ్యక్షుడు దోమకాలు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా ఎస్ఐఆర్ పార్టీ టాస్క్ఫోర్స్ జిల్లా సభ్యుడు పత్తి రవిచంద్ర, నియోజికవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి బీఎల్ఏలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ వింగ్ వైస్ ప్రెసిడెంట్ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ జాయింట్ సెక్రటరీ ఎల్.రాములు, జిల్లా కార్యవర్గసభ్యుడు కె.రఘు, నాయకులు కోటిరెడ్డి, రమణారెడ్డి, రవణమ్మ, కాశయ్య, హరినాయక్, శంకర్రెడ్డి, కాశయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి సర్ ప్రక్రియపై జాగ్రత్తలు అవసరం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ -
యమపురి దారులు..
సంతమాగులూరు(అద్దంకి): ప్రకాశం జిల్లాలో రోడ్లు యమపురికి రహదార్లుగా మారాయి. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల పెద్దఖర్మకు వెళుతూ ముగ్గురు, అమ్మవారికి పొంగళ్లు కార్యక్రమానికి వెళ్లి వస్తూ ఒకరు, ఆర్వో ప్లాంట్ వద్ద నీళ్లు నింపుకుని వెళ్తూ మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారు జాము సంతమాగులూరు మండలంలోని కామేపల్లి గ్రామ సమీపంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. వీరంతా పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే వేల్పూరు గ్రామానికి చెందిన దావులూరి ఏడుకొండలు(50), ముండ్రు రవణమ్మ(52), ఎలవర్తి సుబ్బులు, ముండ్రు సుబ్బాయమ్మ, గుత్తి సుబ్బాయమ్మ, ముండ్రు వెంకటరామయ్య, బోయపాటి అనురాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ, డీ చిన్న యోగమ్మ గ్రామానికి చెందిన కుంకలగుంట మీరావలి ఆటోలో నరసరావుపేటలోని తన బంధువు పెద్ద ఖర్మకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారి ఆటో సంతమాగులూరు మండలంలోని వినుకొండ–నరసరావుపేట హైవేపై, కామేపల్లి–వెల్లచెరువు గ్రామాల మధ్యలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డుకు సమీపంలోని వీర హనుమాన్ గ్రానైట్ ఫ్యాక్టరీ నుంచి పొడవైన లారీ రోడ్డుమీదకు వస్తోంది. షడన్గా రోడ్డుపైకి వచ్చిన లారీని గుర్తించని ఆటో డ్రైవర్ లారీని ఢీ కొట్టడంతో ఆటో పక్కకు పడిపోయింది. ఈ ఆటోలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా, అందులోని దావులూరి ఏడుకొండలు, ముండ్రు రవణమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాల పాలైన ఏడుగురిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎలవర్తి సుబ్బులు(70) మృతిచెందింది. ముండ్రు సుబ్బాయమ్మ, గుత్తి సుబ్బాయమ్మ, ముండ్రు వెంకటరామయ్య నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాల పాలైన బోయపాటి అనూరాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డీ చిన్న యోగమ్మ చిన్న చిన్న దెబ్బలు కావడంతో ఆమె వెంటనే ఇంటికి వెళ్లిపోయింది. ఘోర ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు గుర్తించి వెంటనే ఆటోలో సంతమాగులూరు వైద్యశాలకు తరలించారు. ఘటన వివరాలు తెలుసుకున్న సంతమాగులూరు ఎస్సై పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు. పోలేరమ్మ పొంగళ్లకు వెళ్లొస్తూ.. మర్రిపూడి: పోలేరమ్మ పొంగళ్లకు వెళ్లి తిరిగి వస్తూ చీమకుర్తి గ్రానైట్ క్వారీ డంపింగ్ ఆపరేటర్ ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మర్రిపూడి మండలంలోని రాజుపాలెం సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిన్న బసప్ప(51) చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలో డంపింగ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం తన స్నేహితుడు పొక్లైయిన్ ఆపరేటర్ పాపత్తు బల్లూరెడ్డితో కలిసి కనిగిరి మండలం ఎనిమిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పోలేరమ్మ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగళ్ల కార్యక్రమం ముగించుకుని గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా ద్విచక్రవాహనంపై తిరిగి చీమకుర్తి వస్తున్నారు. మండలంలోని రాజుపాలెం సమీపంలోని హైవేపై ఉన్న రాళ్ల గుట్టలను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న చిన్న బసప్ప(51) తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన బల్లూరెడ్డిని ఒంగోలు జీజీహెచ్కి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. విషయం తెలుసుకున్న రమేష్బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి ● మరో వ్యక్తి తీవ్ర గాయాలు ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీ సిద్దారెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు మేరకు గార్లపేట గ్రామానికి చెందిన రాగిపిండి వెంకటేశ్వరరెడ్డి ఆర్వోప్లాంట్కు ఏర్పాటు చేసుకున్న ఆటోకు నీళ్లు నింపుకుని కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి వెళ్లాడు. ఆదివారం రాత్రి నీళ్లు అమ్ముకుని తన ఆటోలో సింగిల్ లైట్ వేసుకుని తన సొంత గ్రామమైన గార్లపేటకు వస్తున్నాడు. అదే సమయంలో గ్రీన్ఫీల్డ్ హైవేలో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనం పై కనిగిరి వైపు వెళుతున్నారు. సిద్దారెడ్డిపల్లి గ్రామ శివారులో సింగిల్ లైట్తో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ సంఘటనలో మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా హనుమన మండల పరిధిలోని చరైయా గ్రామానికి చెందిన దయాకర్ జైస్వాల్(44) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కూలీ నీరజ్కు కుడికాలు విరగ్గా ఇంకో కూలీకి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108లో కనిగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. -
బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలి
● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు ఒంగోలు వన్టౌన్: బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మికుల నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు కోరారు. కమిషన్ సభ్యుడు వి.గాంధీతో కలిసి సోమవారం ఒంగోలులో ఆయన పర్యటించారు. బాలల సంక్షేమం, రక్షణ, బాలికల హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఒంగోలులోని పలు స్కానింగ్ సెంటర్లను సందర్శించి గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ నిషేధించే చట్టం అమలుపై తనిఖీలు చేశారు. రికార్డుల నిర్వహణ, నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించారు. ఆడ శిశువుల రక్షణకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాల సదన్ను సందర్శించిన చైర్మన్.. అక్కడి బాలల వసతి, ఆహారం, విద్య, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత, భద్రత, సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రేమతో కూడిన సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, పిల్లలపై లైంగిక నేరాల నివారణ, బాలల పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై విస్తృతంగా చర్చించారు. ప్రతి బాలుడు, ప్రతి బాలిక భద్రత, విద్య, ఆరోగ్యం, గౌరవంతో కూడిన జీవితాన్ని పొందడం అనేది సమాజం, ప్రభుత్వ ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.నాగమణి, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యురాలు నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పైసాచికం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పారిశ్రామిక రంగంలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే టాప్ 2–3 స్థానంలో ఉంటుంది. గ్రానైట్, ఆక్వా, పలకలు, ఇతర పరిశ్రమలపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న, మధ్య తరహా యూనిట్లు సుమారు 10 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లో అధిక సంఖ్యలో ఎక్కువ యూనిట్లు ఉన్నాయి. వాటన్నిటికీ రావాల్సిన రాయితీలే సుమారు రూ.300 కోట్లకు పైగా ఉన్నట్లు పరిశ్రమల శాఖలోని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి. రాయితీల కోసం రెండేళ్లుగా పోరాటం.. రెండేళ్ల నుంచి రావాల్సిన ప్రోత్సాహకాల కోసం దళిత పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోని పరిశ్రమల శాఖలోని కమిషనర్ను, సచివాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసి పలు మార్లు వినతిపత్రాలు అందజేశారు. నెలవారి వాయిదాలను చెల్లించలేకపోవడంతో బ్యాంకర్ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలే శరణ్యమని అధికారులు, పరిశ్రమల శాఖ మంత్రితో గోడు చెప్పుకున్నారు. అయినా ఏ మాత్రం వారిలో చలనం లేదు. గంతలో ఎన్నడూ లేని విధంగా కులాలు, పార్టీల వారీగా పరిశ్రమల యజమానులను విడగొట్టి 20 శాతం రాయితీలను ఇచ్చి చేతులను దులుపుకున్నారు. అదే కార్పొరేట్ సంస్థలైన కియా కార్ల సంస్థలకు, పరిశ్రమల మంత్రికి సంబంధించిన వాటికి మాత్రం 100 శాతం రాయితీలు విడుదల చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితులు, మిగిలిన వర్గాలకు మాత్రం 20 శాతం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ ఏడాది గడిచినా ఇంత వరకు పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను ఎప్పుడు ఇస్తారో తెలియక బ్యాంకర్ల ఇబ్బందులు తాళలేక పరిశ్రమలను ఎందుకు పెట్టుకున్నామురా దేవుడా...? అని బోరున విలపించిన పరిశ్రమల యజమానులు పడుతున్న ఇబ్బందులపై సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానెల్స్, ప్రింట్ మీడియాలలో ప్రధాన వార్తలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో కాస్తయినా చలనం లేదంటే ఏపీ రాష్ట్రంలో పరిశ్రమలకు నూకలు చెల్లాయని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువగళం కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు మండలాల్లోని పరిశ్రమల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. అలవికాని హామీలు ఇచ్చారు. మీరు ఎంత మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తే అంత పెద్ద మొత్తంలో రాయితీలను అందిస్తామని లోకేష్ ఇచ్చిన హామీని చూసి పారిశ్రామికవేత్తలు మురిసిపోయారు. గడిచిన రెండేళ్లలో ఒక్కహామీ కూడా అమలు కాకపోవడంతో చంద్రబాబు, లోకేష్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అందక ఆర్థికంగా కుదేలవుతుంటే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం నగరంలోని ఓ కళ్యాణమండపంలో ‘‘బిజినెస్ ఎలైట్ మీట్’’ నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని బల్లికురవ, చీమకుర్తిలోని గ్రానైట్, రామాయపట్నంలోని పోర్టు వంటి పలు రంగాలను చూపించి పెట్టుబడులను ఆకర్షించాలని చేసే ప్రయత్నంపై పరిశ్రామిక యజమానులు పెదవి విరుస్తున్నారు. ముందు పెట్టిన పెట్టుబడులక్చు రావాల్సి వందల కోట్ల ప్రోత్సాహాలను ఇప్పించాలని అంటున్నారు. రెండేళ్ల నుంచి పారిశ్రామిక రంగానికి పాడెగట్టిన ఆనవాళ్లు కళ్లెదుటే కనిపిస్తుంటే మళ్లీ పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడులు పెట్టిన వారికి ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు పలికేదెవరు...పట్టించుకునేదెవరు..? ముందున్న వారినే పట్టించుకోకపోతే ఇప్పుడొచ్చిన వారిని పట్టించుకుంటారా...? అంటూ ప్రభుత్వం నూతనంగా ఆహ్వానిస్తున్న పారిశ్రామికవేత్తలలో నిరుత్సాహం నెలకొందని ఆయా రంగాల ప్రతినిధులు వాపోతున్నారు. -
ఆర్టీసీని ప్రైవేటుపరం చేయవద్దు
నారాయణస్వామి ఆలయ ఆదాయం రూ.19.02 లక్షలు సీఎస్పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయానికి హుండీల ద్వారా రూ.19,02,353 ఆదాయం వచ్చినట్లు దేవదాయ ధర్మాదాయశాఖ కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్ జీ.ఏ.సత్యనారాయణ, ఆలయ ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు, వ్యవస్థాపక ధర్మకర్త కొమ్మినేని చిన్న ఆదినారాయణ తెలిపారు. సోమవారం స్థానిక ఆలయ ప్రాంగణ భవనంలో కందుకూరు డివిజన్ ఇన్స్పెక్టర్, ఆలయ ఈఓ, ధర్మకర్త పర్యవేక్షణలో 2 నెలల 28 రోజులకు సంబంధించి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇందులో ప్రధాన హుండీ ద్వారా రూ.17,30,395, అన్నదానం హుండీల ద్వారా రూ.1,71,958 ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు టౌన్: ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కోరుతూ జిల్లా వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ డిమాండ్ చేసింది. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు మితికెల గురవయ్య నిరుపేదల జీవన చక్రం సజావుగా కొనసాగేందుకు మధ్య తరగతి, నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సంస్థను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సమంజసం కాదన్నారు. వేలాది మంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతను దెబ్బతీసేలా ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపితే చంద్రబాబు తిరిగి ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నాలు చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటి యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్, ఒంగోలు 22వ డివిజన్ అధ్యక్షుడు కుట్టుబోయిన సురేష్ పాల్గొన్నారు. -
27న సీఎం పర్యటన
● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ గిద్దలూరు రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27వ తేదీ గిద్దలూరు మండలంలోని కె.ఎస్.పల్లె గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా సీఎం కో ఆర్డినేటర్ వెంకటేష్తో కలిసి మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత, ఎస్పీ హర్షవర్దన్రాజు సోమవారం ఆ గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలోని పీహెచ్సీలో సంజీవని కార్యక్రమం ప్రారంభోత్సవానికి సీఎం వస్తుండగా, సంబంధిత ఏర్పాట్లను వారు పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పరిసరాలతో పాటు వైద్యశాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సభకు వచ్చే వీఐపీల కార్ల పార్కింగ్, ప్రజలకు కావాల్సిన వసతి, తదితర ఏర్పాట్లపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. వారి వెంట జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అశోక్రెడ్డి, ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డి, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కాపురం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 39 అర్జీలు అందాయి. మార్కాపురం డీఎస్పీ యు..నాగరాజు పాల్గొని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, పామూరు సీఐ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జాయింట్ కలక్టర్ కల్పనాకుమారి అన్నారు. పీజీఆర్ఎస్ భవన్లో పల్స్ పోలియోకు సంబంధించిన పోస్టర్ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం పల్స్ పోలియో టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పనా కుమారి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రములో ప్రతి జిల్లా అధికారి పాల్గొని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రసుత్తం జిల్లాలో ఐదేళ్ల లోపు 156477 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 1062 పోలియో కేంద్రాలు, 34 ట్రాన్సిట్ పోలియో కేంద్రాలు, 69 మొబైల్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 4937 మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు, వలంటీర్లను నియమించినట్లు వెల్లడించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమల, ఇతర అధికారులు పాల్గొన్నారు. ● డ్రైవర్కు గాయాలు పెద్దారవీడు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో చట్లమిట్ల గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జాతీయ రహదారి చట్లమిట్ల గ్రామం సమీపంలో రోడ్డుకు అడ్డంగా గెదే వెళ్తుంది. గెదేను తప్పించే క్రమంలో బస్సు చెట్టును ఢీకొట్టింది. ఇంతలోనే గెదే బస్సు కింద పడి చనిపోయింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవర్ కదిరి రాంబాబు స్టీరింగ్లో చిక్కుకున్నాడు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను బయటకు తీసి 108 వాహనంలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు వైద్యశాలకు తీసుకెళ్లారు. -
కూటమి ప్రభుత్వంలో ఓటు గల్లంతు ఖాయం
యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ వర్గీయుల ఓట్లు గల్లంతు కావడం ఖాయమని, గ్రామాల్లో బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల బీఎల్ఏల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితిలేదని, ఆయన వెన్నుపోటులతోనే అధికారంలోకి వస్తుంటారన్నారు. తిరిగి అధికారంలోకి రావటానికి తమ ఓట్లు గల్లంతు చేస్తారన్న విషయాన్ని గమనించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్సార్ సీపీ వర్గీయుల ఓట్లు తీసివేసే ప్రక్రియ కచ్చితంగా సాగుతుందన్నారు. ఇటీవల రెండు సంవత్సరాల వెన్నుపోటు కార్యక్రమానికి ప్రజలు హాజరు కాలేదని, యర్రగొండపాలెంలో జరిగిన విజయోత్సవానికి కేవలం వందమంది మాత్రమే పాల్గొన్నారని అన్నారు. దీనినిబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎంత బలంగా పెరుగుతోందో చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించి తమపై ఉన్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించడమే చంద్రబాబు ఎత్తుగడ అన్నారు. బీఎల్ఏ పెద్ద బాధ్యత తీసుకున్న వ్యక్తని, కూటమి నాయకులు మూడు పార్టీల నుంచి ముగ్గురు బీఎల్ఏలను పెట్టుకుంటారని, గ్రామంలోకి బీఎల్ఓ వస్తుంటే ఆ రోజు తమ సమయాన్ని వెచ్చించి ఆయనతోపాటే ఉండాలని సూచించారు. ఓడిపోవటానికి, గెలవటానికి ఒక్క ఓటు చాలని, అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు ఒక్క ఓటుతోనే ఓడిపోయిన వారున్నారని, ఆ ఒక్క ఓటేకదా అని ఆలోచిస్తే దెబ్బతగిలేది ఎమ్మెల్యేకే కాదని మొదటి సారి గ్రామాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుందని అన్నారు. ఆయా బూత్లలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి... మరణించినవారు ఎంతమంది ఉన్నారు. వైఎస్సార్ సీపీకి సంబంధించి కొత్తగా చేరాల్సినవారు ఎంతమంది ఉన్నారు. ఈ గణాంకాలను తీసుకోవాలన్నారు. వాళ్లకు కావలసిన ఓట్లు అదనంగా ఉంచుకుంటారని, వద్దనుకునే ఓట్లు తీసివేయిస్తారని, ఈ ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రల్లో విజయవంతంగా చేయగలిగారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారి ఓట్లు తొలగింపచేయకుండా, డబుల్ ఓట్లు ఎంట్రీ కాకుండా చూడాల్సిన పెద్ద బాధ్యత తమపై ఉందన్నారు. సదస్సుకు పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించగా ఎస్ఐఆర్ పార్టీ టాస్క్ఫోర్స్ జిల్లా సభ్యుడు పత్తి రవిచంద్ర, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి బీఎల్ఏలకు అవగాహన పరిచారు. కార్యక్రమంలో వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, వై.వెంకటేశ్వరరెడ్డి, సూరె వెంకట రమేష్, షేక్.కాశింపీరా, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్కుమార్, పి.రాములు నాయక్, సింగా ప్రసాద్, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, యక్కలి రాంబాబు పాల్గొన్నారు. -
శిద్దాకు అమెరికన్ డాక్టరేట్ ప్రదానం
● ఆధ్యాత్మిక, వ్యాపార సేవలకు గుర్తింపుగా.. చీమకుర్తి: మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన మేరీల్యాండ్ యూనివర్శిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. యూనివర్శిటీ చాన్సిలర్, వైస్ చాన్సిలర్లు డాక్టర్ జాన్ ఎన్ కలరస్, సోఫియా సుభాని నిర్వహణలో ఉత్తమ సేవలలో ప్రతిభ కలిగిన వారిలో శిద్దా రాఘవరావును ఎంపిక చేశారు. డాక్టరేట్ అవార్డు ప్రదానోత్సవానికి శిద్దా రాఘవరావు అనివార్య కారణాల వలన అమెరికా వెళ్లలేకపోవడంతో గత 15 రోజుల క్రితం యూనివర్శిటీ ప్రతినిధుల ద్వారా ఒంగోలులోని ఆయన స్వగృహంలో అవార్డు అందించారు. ఆదివారం ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవరావుకు వచ్చిన డాక్టరేట్ అవార్డును ప్రదర్శించారు. ఆయనను పలువురు అభినందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వ్యాపార రంగాలలో చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా మేరీల్యాండ్ యూనివర్శిటీ వారు డాక్టరేట్ అందించారని శిద్దా రాఘవరావు తెలిపారు. ఈ అవార్డు ద్వారా తాను చేస్తున్న సేవలకు గుర్తింపు దక్కడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ● 51 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు చోరీ సింగరాయకొండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్కు చెందిన మల్లెల వెంకటేశ్వర్లు నివాసంలో దొంగలు చోరీకి పాల్పడి సుమారు రూ.6 లక్షల విలువైన 51 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.23 వేల నగదు చోరీ చేసినట్లు బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం తాను బేల్దారీ పనిచేసుకుని జీవిస్తానని, శనివారం స్వగ్రామమైన కందుకూరు మండలం వెంకన్నపాలేనికి భార్య ప్రమీలతో సహా వెళ్లానని తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయన్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్కుమార్ తెలిపారు. -
రైతుల కడగండ్లు
ఒక్క నీటి బొట్టూ వృథా కాకూడదు..జలరక్షణే బాధ్యత అంటూ.. జలధార –జలహారతి పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు టీడీపీ చోటా నేతల చేష్టలు జల సంరక్షణ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. అధికార పార్టీ అండతో చేపల కాసుల వేట కోసం... చెరువులకు గండ్లు కొడుతున్నారు. ఫలితంగా లక్షల లీటర్ల నీరు నేల పాలై వృథాగా పోతున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు దీనిపై మౌనం దాల్చుతున్నారు. కనిగిరిరూరల్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల చేపల కోసం చెరువులను, రిజర్వాయర్లకు, వాగులకు గండ్లు వేసిన ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల తూర్పు ప్రకాశంలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా చేపల కాంట్రాక్టర్లు స్థానిక నాయకులు, అధికారుల అండతో గండ్లు కొట్టారు. గత ఏడాది జిల్లాలోనే పెద్ద రిజర్వాయర్లలో ఒకటైన మోపాడు రిజర్వాయర్ అలుగు వాగుకు గండి కొట్టారు. దీంతో అప్పట్లో వామపక్ష నాయకులు, రైతులు తీవ్ర ఆందోళన చేశారు. రిజర్వాయర్కు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే గండి పూడ్చాలని కలెక్టర్కు, జిల్లా ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటనకు కారకులు చేపల కాంట్రాక్టర్లే అని తీవ్ర ప్రచారం కూడా జరిగింది. తాజాగా కనిగిరి నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్కు కొందరు అక్రమార్కులు గండికొట్టారు. తూము రంధ్రానికి తొర్ర పెట్టడంతో లక్షల లీటర్ల నీళ్లు వృథా అయ్యాయి. రిజర్వాయర్కు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణం శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కలెక్టర్, ఇరిగేషన్ జిల్లా అధికారికి, ఆర్డీఓకు ఫిర్యాదు కూడా చేశారు. ఇరిగేషన్ అధికారులు తాత్కాలిక మరమ్మతు చర్యలు చేపట్టి నీటి వృథాను అరికట్టారు. కారణాలు ఏమైనా.. కారకులు ఎవరైనా.. రిజర్వాయర్కు గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, నీటి సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ తర్వాత దానిపై ఎటువంటి చర్యలు లేవు. అవసాన దశలో ప్రధాన రిజర్వాయర్లు.. కనిగిరి అనగానే గుర్తుకొచ్చేది నీటి సమస్య. అలాంటి కరువు ప్రాంతానికి సాగు, తాగునీటికి శాశ్వత వనరులు లేవు. ఇక్కడి ప్రజలకు వర్షాధారిత పంటలే.. వర్షపు ప్రతి నీటి బొట్టు విలువైనదే. అయితే మూడేళ్ల క్రితం వచ్చిన తుఫాను వర్షాలకు, ఇటీవల అకాల వర్షాలకు దాదాపు అన్ని ప్రధాన రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వ ఉంది. వాటి వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి సమస్య అంతగా లేదు. అలాంటి పరిస్థితుల్లో నీటి వనరులను పూర్తిగా సంరక్షించుకోవాల్సిన అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా చేపల వేట కోసం.. కాసుల కక్కుర్తి పడి ఉన్న నీటి వనరులకు గండి కొడుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని 135 పంచాయతీల్లో సుమారు 132 రిజర్వాయర్లు, చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన రిజర్వాయర్లు అయిన మోపాడు, మాకేరు వాగు, పందువ గండి, నేలటూరి గొల్లపల్లి, పునుగోడు రిజర్వాయర్లలో ప్రస్తుతం సంవృద్ధిగా నీళ్లున్నాయి. అయితే వీటన్నింటికీ తూములు, షట్టర్లు, కట్టలు దెబ్బతిని తాత్కాలిక మరమ్మతులతో ఉన్నాయి. తుఫాను లాంటి వర్షాలు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు, పాలకులు, ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. కారణాలు ఏమైనా.. గత రెండేళ్లుగా శాశ్వత మరమ్మతులు జరిగిన దాఖలాలు లేవు. కనీస రక్షణ ఏదీ.. రిజర్వాయర్లకు గండ్లు అధికారులకు తెలిసే జరుగుతున్నాయా..? అనే అనుమానాలు రైతుల్లో, ప్రజల్లో రేకెత్తుతున్నాయి. కనీసం ప్రధాన రిజర్వాయర్ల వద్ద కూడా వాచ్మెన్లు లేరు. ప్రస్తుతం ప్రభుత్వం, అధికారులు, నీటి రక్షణకు ప్రథమ ప్రాధాన్యత అంటున్నారు. మరి అలాంటప్పుడు చెరువులకు గండ్లు కొడుతుంటే.. నీటి వనరుల పట్ల ఇరిగేషన్ అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఇటీవల జిల్లాలో, కనిగిరి నియోజకవర్గంలో జరిగిన చెరువులకు గండ్లు వేసిన ఘటనలు ఇరిగేషన్ అధికారుల నిజాయితీని ప్రశ్నిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల తీరుపై ప్రజల్లో, రైతుల్లో తీవ్ర అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రధాన నీటి వనరుల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల పై ఉంది. ఇరిగేషన్ ఏఈ ఏమంటున్నారంటే.. దీనిపై కనిగిరి ఇరిగేషన్ ఏఈ మధుబాబును వివరణ అడగ్గా.. ‘‘నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్ తూముకు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం నీటి వృథాను అరికట్టాం. నీరు బయటకుపోవడం లేదు. రిజర్వాయర్ల శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. కనిగిరి పెద్దచెరువు అభివృద్ధికి రూ.40 లక్షలతో, పునుగోడు రిజర్వాయర్కు రూ.45 లక్షలతో, ఎన్ గొల్లపల్లి రిజర్వాయర్కు రూ.50 లక్షలతో మరమ్మతులు, అభివృద్ధి పనులకు నివేదికలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం’’ అని చెప్పారు. -
ఇద్దరు యువకుల దుర్మరణం
మేదరమెట్ల: లారీని బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన మేదరమెట్ల ఉత్తర బైపాస్ ప్రాంతంలోని కొండ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..కందుకూరుకు చెందిన శ్రీరామచక్రి(22), ఓగూరుకు చెందిన చిట్టాల గోపీ(26)తో కలిసి మోటార్ బైక్పై విజయవాడ అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. వీరు మేదరమెట్ల ఉత్తర బైపాస్ కొండ ప్రాంతానికి రాగానే ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొన్నారు. ప్రమాదంలో శ్రీరామచక్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో చిట్టాల గోపీ తీవ్రంగా గాయపడగా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని ఎస్సై మహ్మద్ రఫీ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి శ్రీరామచక్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీని ఢీకొన్న బైక్ మేదరమెట్ల కొండ సమీపంలో ప్రమాదం -
భారత సంస్కృతిని చాటిచెబుతున్న తాన్య
ఒంగోలు టౌన్: ఆమె పక్కా భారతీయురాలు. పుట్టింది యూరప్లో. పెరిగింది బెంగళూరు, చైన్నె, ఒంగోలులో. ఆమె పేరు గోపి తాన్య. తండ్రి గోపి వెంకట్ వృత్తిరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. తల్లి ప్రవీణలత కొంతకాలం భర్తతో పాటే అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశారు. తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఒంగోలులో యోగా ట్రైనర్గా పనిచేస్తున్నారు. తాన్య ప్రస్తుతం చైన్నెలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తూనే విభిన్న కళల్లో రాణిస్తున్నారు. తాను చదువుతున్న కళాశాల కల్చరల్ విభాగానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న తాన్య.. వ్యాఖ్యతగా రాణిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ మెడిటేషన్ బోధిస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ దాని ప్రాముఖ్యతను ఇతరులకు తెలియజేస్తున్నారు. భగవద్గీత శ్లోకాలు చెబుతూ... ఆధునిక విద్యనభ్యసిస్తున్న తాన్య భగవద్గీతను కంఠస్తం పట్టారు. అందులోని శ్లోకాలను స్పష్టంగా చెప్పి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. భగవద్గీత పఠనం ద్వారా ఆద్యాత్మిక విలువలు పెంపొందించుకోవడం గురించి వివిధ వేదికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వామీ వివేకానందుడి బోధనలకు ప్రభావితురాలైన ఆమె.. మోటివేషన్ టీచర్గా కూడా రాణిస్తున్నారు. చిన్నారులకు ఉపయోగపడే విధంగా ది షంట్ ఆబ్సేషన్ అనే పుస్తకాన్ని రచించారు. తాన్యకు హిందీ భాషపై మంచి పట్టు ఉంది. హిందీలో ఆధ్యాత్మిక ఆంశాలతో కూడిన గజల్స్ రచిస్తున్నారు. కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తూ... ప్రభుత్వ శిక్షణ సంస్థలో కూచిపూడిలో శిక్షణ పొందిన తాన్యకు భారతీయ నృత్యం అంటే ఎంతో ఇష్టం. అందుకే భారత సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో బెంగళూరు, చైన్నె, నెల్లూరు, ఒంగోలులో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వందేళ్ల వేడుకల్లో కూడా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ఇప్పటి వరకు దేశ విదేశాలలో 150 ప్రదర్శనలిచ్చి శభాష్ అనిపించుకున్నారు. చిన్నవయసులోనే భారతీయ సంస్కృతి గురించి ప్రచారం చేస్తున్న తాన్యను పలువురి అభినందిస్తున్నారు.వివేకానందుడి వేషధారణలో... నాట్యం చేస్తున్న తాన్య -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● పోలీసు పరేడ్ గ్రౌండ్లో యోగాలో పాల్గొన్న కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్పీ హర్షవర్థన్ రాజు ఒంగోలు టౌన్: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, శారీరకంగానే కాకుండా మానసికంగా ఆత్మవిశ్వాసనం పెంపొందిస్తుందని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ హర్షవర్థన్ రాజు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా వ్యాప్తంగా 3.63 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అంతకుమించి హాజరయ్యారని తెలిపారు. గత 15 రోజులుగా జిల్లా వ్యాప్తంగా 4428 వేదికలపై యోగాభ్యాసన నిర్వహించినట్లు తెలిపారు. ఎస్పీ హర్షవర్థన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యవంతులుగా జీవించాలని సూచించారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం కుదుట పడుతుందని, సానుకూల దృక్పథంతో జీవించవచ్చని చెప్పారు. 2 వేల మంది మహిళలతో యోగా... ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు జరిగిన ఈ యోగా కార్యక్రమంలో 2 వేలకు పైగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నగర ప్రజలు పాల్గొన్నారు. అనంతరం రెండు వారాలుగా యోగాసనాల్లో శిక్షణ ఇచ్చిన గురువులను ఘనంగా సత్కరించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలను స్వీకరించబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మాధురి, జిల్లా పర్యాటక అధికారి తేళ్ల రవికుమార్, యోగాంద్ర నోడల్ ఆఫీసర్ భీమ్నాథ్, డీఎస్పీలు శ్రీనివాసరావు, బాల మురళీకృష్ణ, గురునాథ బాబు తదితరులు పాల్గొన్నారు. -
రాచర్ల మండలంలో 23 మి.మీ వర్షం
రాచర్ల: మండలంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలంలోని గౌతవరం, అనుమలవీడు, రాచర్ల, అనుములపల్లె, సోమిదేవిపల్లె, పాలకవీడు, గంగంపల్లె, కాలువపల్లె, ఆకవీడు, చోళ్లవీడు, జేపీ చెరువు గ్రామాల్లో దాదాపు 400 హెక్టర్లలో పత్తి పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం కురిసిన వర్షం పత్తి పంటకు ప్రాణం పోసిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పదును వాన కురవడంతో వ్యవసాయ బోర్ల కింద సాగుచేసిన పత్తికి నీటి తడులు కట్టే బాధ తప్పిందని రైతులు తెలిపారు. వర్షం కారణంగా పొలాల్లో నీరు చేరడంతో చెరువులను తలపించాయి. అనుమలవీడులోని నక్కలవాగు, గౌతవరంలోని పితురువాగులు వర్షం నీటితో నిండుకుండలా దర్శనమిచ్చాయి. మార్కాపురం జిల్లాలోనే రాచర్ల మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలంలో 23 మిల్లీమీటర్లు, బేస్తవారిపేట 10.2, కొమరోలు 3.6, కంభం 3.2, గిద్దలూరు మండలంలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. -
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
అక్రమార్జనే పరమావధిగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. వాగులు, వంకలు, చెరువులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వి తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటికి ప్రధాన ఆధారమైన గుండ్లకమ్మ వాగును చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుకను ఇష్టారీతిగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. ఇసుక తవ్వకాలపై స్థానికులు సమాచారం ఇచ్చినా రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇంకా తవ్వకాలకు తెగబడుతున్నారు. -
సజావుగా నీట్ పరీక్ష
ఒంగోలు సిటీ: మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన ’నీట్’ పరీక్ష ఒంగోలు నగరంలోని ఆరు కేంద్రాల్లో సజావుగా జరిగింది. మొత్తం 1821 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, 1624 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. 197 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష కేంద్రాల్లో అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు. నగరంలోని నవోదయ, కేంద్రియ విద్యాలయం, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీఆర్ఆర్ఎం పాఠశాల, పీవీఆర్ బాలుర పాఠశాలల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి నీట్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ప్రారంభానికి ముందు భద్రతాపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు అన్ని సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. అభ్యర్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్, మొబైల్ పెట్రోలింగ్ బృందాల ద్వారా నిరంతర నిఘా, పర్యవేక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం ఆరు పరీక్ష కేంద్రాలను రెండు జోన్లుగా విభజించి, భద్రతా పర్యవేక్షణ కోసం ప్రతి జోన్కు అదనంగా ఒక ఇన్స్పెక్టర్ను కేటాయించామన్నారు. రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్ల వద్ద ప్రత్యేక హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, సీఐలు ఉన్నారు. -
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
అద్దంకి: ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంలోని పోతురాజు గండి ప్రాంతంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కావలి గ్రామానికి చెందిన ఎస్ నందు(22) గత నాలుగేళ్లుగా వివాహాది శుభకార్యాల ఈవెంట్లలో పొల్గొని జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా తనతో పాటు ఈవెంట్లలో పాల్గొనే విజయవాడకు చెందిన యువతితో కలిసి పట్టణంలోని పోతురాజు గండి ప్రాంతంలో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో ఇద్దరో చెరో బెడ్రూంలో నిద్రించారు. ఉదయాన్నే లేచిన ఆ యువతి నందు రూం తలుపుకొట్టగా ఎంతకూ తీయపోవడంతో పోలీసులకు సమాచారం అందించింది. వారు సంఘటనా స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి చూడగా నందు ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న బంధువులకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలతో యోగా డే
కంభం: యోగాంధ్ర–2026 కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అధికారులు నిర్వహించే యోగా కార్యక్రమాలకు ప్రజల్లో ఆదరణ కరువవడంతో జనసమీకరణ కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గతేడాది యోగా కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు చనిపోయిన వారికి, వృద్దులకు సైతం సర్టిఫికెట్లు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన యోగా కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కూడా వారు శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన యోగా డే కార్యక్రమాల్లో అధికారులు, ప్రజల కంటే డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలే ఎక్కువగా ఉండటం విశేషం. ఎక్కువశాతం ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలుండగా కొందరు విద్యార్థులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి రోజు కూలిపనులు చేసుకునే తమకు ఈ యోగా పాట్లేంటని ఉపాధి కూలీలు తలలు పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు హుకుం జారీ చేయడంతో తప్పని సరిపరిస్థితుల్లో వృద్దులు సైతం వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి సిబ్బంది అక్కడికి హాజరైన వారి పేర్లు నమోదు చేసుకుంటూ కనిపించారు. తమకు కూలీ డబ్బులు వేస్తామని చెప్పారని మరి వేస్తారో లేదో తెలియడం లేదని అక్కడికి వచ్చిన ఉపాధి కూలీలు చెప్పుకుంటున్నారు. 60–70 ఏళ్ల వయస్సులో మాకేంటి ఈ పాట్లను పలువురు వృద్ద మహిళలు వాపోతున్నారు. -
గుండ్లకమ్మ..గుండె కోత
మద్దిపాడు: చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తెలుగు తమ్ముళ్లు అక్రమార్జన కోసం ఎంతకై నా తెగిస్తున్నారు. మండలంలోని గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాన్ని చెరబట్టి సర్వనాశనం చేస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో దొరికే నాణ్యమైన ఇసుక వారికి ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా మల్లవరం, కొలచనకోట, కెల్లంపల్లి, మద్దిపాడు, రాచవారిపాలెం, ఇనమనమెళ్లూరు గ్రామాల్లో నది పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇసుక తరలిస్తూ లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇస్తే వారు అక్రమార్కులకు సమాచారం చేరవేసి, అక్రమ ఇసుక రవాణాదారులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత సోదాలు చేయడానికి వెళుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తులు కొందరు అన్ని స్థాయిల్లో అధికారులతో మాట్లాడి వారికి మామూళ్లు ముట్టజెప్పి పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొలచనకోట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసు శాఖకు సమాచారం ఇచ్చినా అక్కడ ఉన్న జేసీబీలను వదిలేసి రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి మమ అనిపించారు. జేసీబీలు సీజ్ చేయకపోవడానికి వాటి యజమానులు అధికార పార్టీ నాయకులు కావడం, మామూళ్లు అందడమే కారణమన్నది బహిరంగ రహస్యం. ఇసుక రీచ్ అడ్డుకుని..అక్రమంగా దండుకుని.. ఇసుక రీచ్ను ఏర్పాటు చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగినా ఇసుక అక్రమ రవాణాదారులు పలు మార్గాల్లో అడ్డుకున్నారు. ఇసుక రీచ్ లేకపోవడంతో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా రవాణా చేయడానికి వీలు దొరికినట్లయింది. ఇసుక దందాలో స్థానిక నాయకులతో పాటు పైస్థాయి నాయకునికి, మండల, ఉన్నత స్థాయి అధికారులకు వాటాలు అందుతుండడంతో ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉండిపోతున్నారన్నది ప్రజల అభియోగం. ఇసుకను గుండ్లకమ్మ నది నుంచి బయటకు తరలించి డంప్ చేసి, కావలసిన వారికి ట్రాక్టర్ రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం ఇసుక అక్రమ రవాణాదారులకు సర్వసాధారణమైపోయిందని మండిపడుతున్నారు. ఇటీవల నాలుగు రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణాపై నివేదిక ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఇంటలిజెన్స్ ఏఎస్ఐపై కూడా దౌర్జన్యంగా మాట్లాడడం, రెవెన్యూ కింది స్థాయి అధికారులైన వీఆర్ఏలను ట్రాక్టర్లతో తొక్కిస్తామని ముందుకు ట్రాక్టర్పై దూసుకొచ్చిన ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఏఎస్ఐ ఫిర్యాదు చేయడం, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇంత దౌర్జన్యంగా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. పంచాయతీలకో, మైనింగ్ శాఖకో రావాల్సిన ఆదాయాలకు గుండి కొట్టి జేబులు నింపుకుంటున్నారు. గుండ్లకమ్మ నది సమీపంలో ఉండే గ్రామాల్లో వారు స్థానికంగా నిర్మాణాలు చేసుకునేందుకు ఇసుక కోసం వెళితే వారిని బెదిరించి బయటకు పంపేస్తున్నారని, తమకు చెబితే తామే తోలుతామంటున్నారని స్థానికులు కొందరు తెలిపారు. తమ గ్రామం నుంచి ఇసుక తీసుకెళ్లి వేరే మండలాల్లో అమ్ముకుంటూ ఇక్కడి వారిపై దౌర్జన్యం చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను నిలిపేసి స్థానికుల అవసరాలకు అనుగుణంగా ఇసుక లభ్యత కల్పించాలని కోరుతున్నారు. -
రైతులను మోసం చేసేందుకు కుయుక్తులు
● సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల ధ్వజం ఒంగోలు టౌన్: పొగాకు రైతులను దెబ్బ తీసేందుకు కొందరు లాలూచీపరులతో బోర్డు అధికారులు సమావేశాల నాటకాలాడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ధ్వజమెత్తారు. క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా సమావేశాల పేరుతో రైతులను మోసం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్న బోర్డు అధికారుల తీరు బాగాలేదని విమర్శించారు. బోర్డు అధికారుల మోసపూరిత వైఖరికి నిరసనగా ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో ప్రకాశం భవనం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ రైతు సంఘాల జిల్లా నాయకులు జజ్జురి జయంతి బాబు, వీరారెడ్డి, ఎస్.లలితకుమారి, సీఎస్ సాగర్, ఎస్కే మాబు తదితరులు మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా పొగాకు క్వింటా రూ.20 వేలకు కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. నో బిడ్లలో ఎలాంటి మార్పులేదని తేల్చి చెప్పారు. దిద్దుబాటు చర్యల పేరుతో వ్యాపారులకు మరింత లాభాలు కలిగించే విధంగా , రైతుల కష్టాన్ని దోచుకునే కుట్రలో భాగంగా ప్రీ వారికేటర్స్ పేరుతో కొందరు వ్యక్తులను రంగంలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం రైతులను దగా చేసే వారికేటర్స్ను పక్కన పెట్టి ఎలాంటి జాప్యం లేకుండా వర్జీనియో పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించి రైతులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బ్యార్నీకి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. క్వింటా పొగాకును రూ.20 వేల కంటే తక్కువకు కొనుగోలు చేస్తే రైతులు వేలాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. -
పోలీసులపై కేసు నమోదు చేయాలి
ఒంగోలు వన్టౌన్: విజయవాడలో కృష్ణలంక సీఐ, పోలీసుల వేధింపులతో బలవన్మరణం చెందిన పెరిపోగు క్రాంతిమాదిగ సంఘటనకు సంబంధించి పోలీసులపై కేసు నమోదు చేయాలని, అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ క్రాంతి మాదిగ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించారు. దానిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే హోంమంత్రి అనిత, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మౌనం వహించారని అన్నారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. రాష్ట్రంలోని ఎస్సీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా చంద్రబాబు నియమించిన మాజీ మంత్రి కేఎస్ జవహర్ తన సొంత మాదిగ సామాజిక వర్గానికి చెందిన క్రాంతి కుమార్ మాదిగ బలవన్మరణం కేసులో కనిపించకుండా పోయారన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రతిపక్షాలను విమర్శించడానికి రాష్ట్రంలోని మంత్రులందరి కంటే ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. చంద్రయ్య మాదిగ ఇంటికి వెళ్లి డప్పు కొట్టిన మాదిగ పక్షపాతి చంద్రబాబు.. టీడీపీ మద్దతుదారుడు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పెరిపోగు వెంకటేశ్వరరావు కొడుకు క్రాంతికుమార్ మాదిగ పోలీస్ వేధింపులతో బలవన్మరణం చెందితే వారింటికి ఎందుకు వెళ్లలేదన్నారు. అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజు, పోలీసుల హింసతో శవం కూడా కనిపించని కాపు కులానికి చెందిన సాయి కృష్ణ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి ఓదార్చిన ముఖ్యమంత్రి.. మాదిగలను మాత్రం పరామర్శించలేదన్నారు. తెనాలిలో రౌడీ షీటర్ల పేరుతో ముగ్గురు మాల యువకులకు నడిరోడ్డుపై ముగ్గురు సీఐలు అరికాళ్ల కోటింగ్ ఇస్తే.. పోలీసులు కొడితే తప్పేమిటి అన్న రాజ్యాంగ నిపుణురాలు హోం మంత్రి అనిత.. విజయవాడలో జరిగిన కాపు యువకుడు సాయి కృష్ణ, క్రాంతి కుమార్ మాదిగ పోలీస్ హత్యలపై కూడా పోలీసులు చంపితే తప్పేమిటని అంటారేమోనని సందేహంగా ఉందని నీలం నాగేంద్రరావు ఎద్దేవా చేశారు. మాదిగ కుల ప్రతినిధిగా ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిలో ఉన్న మాజీ మంత్రి కేఎస్ జవహర్ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఉన్నప్పటికీ.. సాటి మాదిగ ఉద్యమకారుడు, టీడీపీ సానుభూతిపరుడు, పోలీస్ హింసతో బలవన్మరణం చెందిన క్రాంతి మాదిగ తండ్రి పెరిపోగు వెంకటేశ్వరరావును ఎందుకు పరామర్శించలేదన్నారు. హోం మంత్రి అనిత, ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. క్రాంతికుమార్ శవానికి పోస్టుమార్టం చేయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం విజయవాడ పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, సామాజిక ఉద్యమ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, బొమ్మల వంశీ, మాల సభ కన్వీనర్ మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు. క్రాంతి మాదిగ బలవన్మరణంపై హోం మంత్రి, ఎస్సీ కమిషన్ చైర్మన్ స్పందించాలి దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ -
నల్లమల నిండా.. ప్లాస్టిక్ వ్యర్థాలే!
పెద్దదోర్నాల: ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా నిన్నమొన్నటి వరకు కళకళలాడిన నల్లమల అభయారణ్యం ఇప్పుడు కళావిహీనంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలు, తినుబండారాల కవర్లు, తదితర వాటితో ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలోని రహదారులు నిండిపోయాయి. ఒకప్పుడు ప్లాస్టిక్ బాటిళ్లను రోడ్లపై పడేస్తే జరిమానాలు విధిస్తూ యాత్రికులకు ముచ్చెమటలు పట్టించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు ఆ సంగతే మరిచారు. దీంతో పాటు గణపతి చెక్పోస్టు వద్ద శ్రీశైలం వెళ్లే పర్యాటకుల నుంచి నీటి బాటిళ్లను బలవంతంగా తీసుకున్న అధికారులు.. నేడు ఆ నిబంధనలను గాలికి వదిలేశారు. ప్రయాణికులు, యాత్రికులు పారవేసే ప్లాస్టిక్ నీటి బాటిళ్లు, రేపర్లలో ప్యాక్ చేసిన తినుబండారాల ప్యాకెట్లను ఏరేసే స్వచ్ఛ సేవక్లకు 15 రోజులుగా ఇతర పనులు అప్పగించి చోద్యం చూస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతంలోని రహదారులు ప్లాస్టిక్ వ్యర్థాలు, రేపర్లలో ప్యాక్ చేసిన తినుబండారాల ప్యాకెట్లతో పూర్తిస్థాయిలో నిండి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు చికాకు కలిగిస్తున్నాయి. సీడ్బాల్స్ తయారీలో స్వచ్ఛ సేవక్లు... నల్లమల అభయారణ్యంలో విధులు నిర్వహించే స్వచ్ఛ సేవక్లు గత నెల 3వ తేదీ నుంచి వారి విధులకు హాజరు కాకుండా ఉన్నతాధికారుల అదేశాల మేరకు సీడ్బాల్స్ తయారీ పనుల్లో బిజీగా మారారు. సీడ్బాల్స్ తయారీ మంచి కార్యక్రమమే అయినప్పటికీ స్వచ్ఛ సేవక్లు 15 రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో రోడ్లకు ఇరువైపులా ప్లాస్టిక్ బాటిళ్లు వేలాదిగా పేరుకుపోవడంతో నల్లమలలోని వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. సాధారణంగా సీడ్బాల్స్ తయారీని స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న కూలీల ద్వారా చేయించాల్సి ఉంది. నిరంతరం రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ను ఏరివేసే స్వచ్ఛ సేవక్లను సీడ్బాల్స్ తయారీకి వినియోగించటం ఎంత వరకు సబబని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. వన్యప్రాణులకు ప్రాణహాని... శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు సాధారణంగా మార్గమధ్యంలో భోజనం, అల్పాహారాలు చేయడంతో పాటు నీటి బాటిళ్లు, ప్లాస్టిక్ రేపర్లలో ప్యాక్ చేసిన తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. అలా కొనుగోలు చేసిన ఆహార పదార్థాల వ్యర్థాలను, ప్లాస్టిక్ కవర్లను, నీటి బాటిళ్లను మార్గమధ్యంలో అభయారణ్యంలోని రోడ్లపై విసిరేస్తుంటారు. అలా సగం తిని వదిలేసిన తినుబండారాలను నల్లమలలో సంచరించే మూగజీవాలు తింటాయి. అవి వ్యర్థాలను తినటంతో మూగజీవాల జీర్ణవ్యవస్థలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకొని వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు అభయారణ్యంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. స్వచ్ఛ సేవక్లకు ఇతర పనులు అప్పగించిన అధికారులు శ్రీశైలం మార్గం పొడవునా పేరుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్న మూగజీవాల్లో జీర్ణకోశ వ్యాధులు -
తప్పులు మీరు చేసి మాపై కేసులా..?
దర్శి: తప్పులు మీరు చేసి ఆ తప్పులు పక్కదారి పట్టించేందుకు కేసులు మాత్రం మా నాయకులపై పెడుతున్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గొంగటి శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాం కేసులో కారుమూరి సునీల్ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గొంగటి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ కేసులో కారుమూరి సునీల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కారుమూరి సునీల్కుగానీ, ఆయన తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు గానీ లిక్కర్ వ్యాపారంతో వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వారికి ప్రజల్లో ఉన్న ఆదరణను తట్టుకోలేక వారిని ఈ లిక్కర్ స్కాం కేసులో ఇరికించి అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గంగా ఉందన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులెవరూ భయపడరని చెప్పారు. వాటిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యం సరఫరా, విక్రయాలు పారదర్శకంగా జరిగాయన్నారు. అక్రమ మద్యాన్ని పూర్తిగా నియంత్రించడంతో పాటు ప్రభుత్వమే స్వయంగా మద్యం షాపులు నిర్వహించిందన్నారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు పూర్తిగా రద్దు చేశారన్నారు. అయినా మద్యం కేసు సృష్టించి పార్టీ పెద్దలను ఇరికించే కుట్ర చేస్తున్నారన్నారు. కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి మద్యం రవాణాలో అక్రమాలు చేశారంటూ కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2014–19 మధ్య మద్యం సరఫరా, విక్రయాల్లో నాటి సీఎం చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారన్నారు. బార్లకు మేలు చేకూర్చేలా ప్రివిలేజ్ ఫీజును రద్దుచేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని గుర్తు చేశారు. ఎంపిక చేసిన డిస్టిలరీ నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేశారన్నారు. మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్ల చేతుల్లో ఉంచుకుని పర్మిట్ రూములు, వాడ వాడలా బెల్ట్ షాప్లు నిర్వహించి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించి జనాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. మద్యం ఎక్కువ విక్రయాలు జరిగినా ప్రభుత్వ ఆదాయం పెరగలేదని, మద్యం సరఫరా విక్రయాల్లో అక్రమాలపై చంద్రబాబుపై ఆ తర్వాత కేసు కూడా నమోదైదన్నారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే ఆ కేసును మాఫీ చేసుకోవడంతో పాటు జనం దృష్టిని మళ్లించడం కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరాలో అక్రమాలు జరిగాయంటూ లేని కేసును సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారని మండి పడ్డారు. కార్యక్రమంలో కురిచేడు, ముండ్లమూరు మండలాల కన్వీనర్లు యన్నాబత్తుని సుబ్బయ్య, చింతా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధుసూదన్ రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుంటు పోలయ్య, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి చైతన్య రెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి యరమల మధు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, యువజన విభాగం కురిచేడు మండల అధ్యక్షుడు శివారెడ్డి, యువజన విభాగం తాళ్లూరు మండల అధ్యక్షుడు విష్ణు చౌదరి, యువజన విభాగం దర్శి మండల అధ్యక్షుడు బాబు, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు మేడగం బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్యానంద్ ఒంగోలు: జాతీయ లోక్ అదాలత్ జూలై 11న జరుగుతుందని, అందులో జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.సత్యానంద్ కోరారు. శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో బ్యాంకు అధికారులు, సంబంధిత బ్యాంకుల న్యాయవాదులతో జాతీయ లోక్ అదాలత్పై ఆయన చర్చించారు. కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకునేందుకు బ్యాంకు అధికారులు కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి టి.రాజ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.పల్లవి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్వీ రామకృష్ణ, న్యాయవాదులు బొడ్డు రామలింగం, రహీంబేగ్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతుల కోసం ధర్నాకు సిద్ధం
మద్దిపాడు: జిల్లాలోని పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ధర్నాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, వారిని ప్రభుత్వం ఆదుకోకుండా మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. సుమారుగా ఎకరాకు దున్నకాలు, నారు, నాట్లు కూలి ఖర్చులు పొగాకు కాల్చడం, రవాణా ఇలా అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు రూ.2 లక్షల వరకూ అవుతుందని, దీనికి తోడు మధ్యలో వర్షం పడి పొగాకు పంట పోతే మళ్లీ నాట్లు వేస్తారని, దీనికి అదనంగా మరో రూ.20 వేల వరకూ ఖర్చు వస్తుందన్నారు. ఒక బ్యారన్ వేసే రైతుకు రూ.20 లక్షల వరకూ ఖర్చు వస్తుందన్నారు. రైతు 80 క్వింటాళ్ల పొగాకు పండిస్తే అందులో సుమారు 50 శాతం మేలిమి రకం పొగాకు దిగుబడి అవుతుందని, మిగిలిన 50 శాతం బ్రౌన్, గ్రీన్ టాప్లీఫ్, మాడు వస్తాయని పొగాకు మొత్తాన్ని సరాసరిన కేజీ రూ.250 పైన కొనుగోలు చేస్తే రైతు అప్పులేకుండా బయపడతాడన్నారు. కానీ వ్యాపారులు మాత్రం మేలిమి రకం పొగాకునే రూ.170 నుంచి రూ.200 లోపు కొనుగోలు చేస్తున్నారన్నారు. మేలిమి రకం పొగాకునే ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన 50 శాతం ఎఫ్ 5 రకం పొగాకును వీరు ఎంతకు కొనుగోలు చేస్తారో ఊహించవచ్చన్నారు. పొగాకు కొనుగోళ్లు ఇలాగే సాగితే బ్యారన్కు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. ఇలా కొనుగోలు చేయడం వలన పొగాకు రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పొగాకు రైతులను ఆదుకోవడానికి రూ.300 కోట్లతో మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు రైతులన్నా, వ్యవసాయమన్నా చులకన భావం ఉందని, అందుకే వారికి రైతులకు సహాయం చేద్దామన్న ఆలోచన ఉండదని విమర్శించారు. చంద్రబాబు కేజీ రూ.200లకు తగ్గకుండా కొనుగోలు చేయమని చెబుతున్నారని కానీ వేలం కేంద్రాల్లో ముఖ్యమంత్రి చెప్పినట్లు కొనుగోళ్లు జరగడం లేదన్నారు. కార్పొరేట్లకు దోచి పెట్టడమే పరమావధిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన విమర్శించారు. మార్క్ఫెడ్ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం మనలేదన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అన్ని పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకుని ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని మేరుగు నాగార్జున హెచ్చరించారు. -
పశువులకు కృత్రిమ గర్భధారణ మేలు
● ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు కొత్తపట్నం: పశువులకు మేలైన కృత్రిమ గర్భధారణ చేయడం వలన రైతుకు ఆర్థికంగా లాభం చేకూరడమే కాకుండా పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. కొత్తపట్నం మండలంలోని ఆలూరు గ్రామంలో శనివారం లింగనిర్ధారిత వీర్యం ద్వారా గర్భం దాల్చిన చూడి పశువుల ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పశుసంవర్థకశాఖ, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించడం వలన 90 శాతం కచ్చితత్వంతో కేవలం పెయ్యి దూడలే పుడతాయని, తద్వారా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని తెలిపారు. శాసీ్త్రయ పునరుత్పత్తి విఽధానం ద్వారా సంతానయోగ్యమైన ప్రతి పశువుకు వ్యక్తిగత పర్యవేక్షణలో చూలు కట్టించడం, క్రమబద్ధమైన ఈతలను పొందడం ద్వారా అధిక పాల ఉత్పత్తి సాధించడానికి పశువులు కేంద్రీకృత పునరుత్పత్తి నిర్వహణ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. ప్రకాశం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ బి.మురళీకృష్ణ మాట్లాడుతూ శాసీ్త్రయ పునరుత్పత్తి విధానం పాటించకపోవడం వలన యుక్త వయసుకు వచ్చిన పడ్డలు సకాలంలో గర్భం ధరించకపోవడం, పశువుల ఈతల మధ్య వ్యవధి పెరగడం వలన పాడి రైతులకు ఆర్థికంగా నష్టం కలుగుతుందని తెలిపారు. త్రోవగుంట పశువైద్యశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి.బసవశంకరరావు మాట్లాడుతూ ఈనిన ప్రతి పశువుతో మళ్లీ 45 నుంచి 60 రోజుల్లోగా శాసీ్త్రయంగా చూలు కట్టించి ఈతల మధ్య వ్యవధి తగ్గించడం ద్వారా పాడి వైతులకు ఆర్థిక స్వావలంబన కలుగుతుందని తెలిపారు. పశు ప్రదర్శనలో మండలంలోని ఆలూరు, గాదెపాలెం, బీరంగుంట, గుత్తికొండవారిపాలెం గ్రామాలకు చెందిన లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కృత్రిమ గర్భధారణ పొందిన 68 చూడి పశువులను ఉంచారు. పాడి రైతులకు బలవర్థక మందులు, ఖనిజ లవణ మిశ్రమం, కాల్షియం, టానిక్, నట్టల నివారణ మందులు, పాల క్యాన్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో పశుసంవర్థకశాఖ ఒంగోలు డివిజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎన్.జగత్ శ్రీనివాస్, ప్రాంతీయ పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఒంగోలు ఉపసంచాలకులు డాక్టర్ సంధ్య, పశువుల ఉత్పత్తి కేంద్రం చదలవాడ సంచాలకులు డాక్టర్ బి.రవి, ఈతముక్కల, అల్లూరు, యరజర్ల పశువైద్యాధికారులు సీహెచ్ అమూల్య, ఎం.సోమశేఖర్, డాక్టర్ వై.భూపాల్, డాక్టర్ యు.ఆశ, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్లు కె.లక్ష్మయ్య, టీవీ రమణమ్మ, కొత్తపట్నం, ఒంగోలు మండలాల పశువైద్య సిబ్బంది, వివిధ కంపెనీల ఫార్మ ప్రతినిధులు పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్ట్
పర్చూరు (చినగంజాం): మహిళపై లైంగికదాడికి పాల్పడిన కేసులో మైనర్ అయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పర్చూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మార్టూరు రూరల్ సీఐ నాగభూషణం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 36 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివసిస్తోంది. ప్రతిరోజూ చిలకలూరిపేట పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూలి పనుల కోసం ఆమె వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉద యం 8 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగానే కూలి పనుల కోసం చిలకలూరిపేట గాంధీ పార్కు వద్ద ఎదురుచూస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి మార్టూరులోని ఒక అపార్ట్మెంట్లో శుభ్రం చేయడానికి ఆడమనిషి కావాలని చెప్పి తన మోటారు సైకిల్పై ఎక్కించుకున్నాడు. ఒంగోలు వైపు వెళుతూ మార్గం మధ్యలో తాతపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద నుంచి సూరావారిపల్లె వెళ్లే రోడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి కింద పడేసి లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె సెల్ఫోన్ లాక్కుని అక్కడి నుంచి మోటార్ సైకిల్పై పరారయ్యాడు. ఆ మహిళ ఆ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి అదే రోజు రాత్రి యద్దనపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంగోలులో బైక్ చోరీ చేసి వస్తుండగా అదుపులోకి... సీఐ నాగభూషణం శనివారం ఉదయం తన సిబ్బందితో పర్చూరులోని వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, లైంగిక దాడి కేసులోని నిందితుడు గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దొంగతనం చేసిన మోటార్ సైకిల్పై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తూ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కు తిప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పోలీసులు పట్టుకుని విచారించారు. సదరు యువకుడు బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన మైనర్ కాగా, ప్రస్తుతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో ఉంటున్నట్లు గుర్తించారు. అతడు పోలీసుల విచారణలో నేరాలు అంగీకరించడంతో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితురాలి సెల్ ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు క్రిమినల్ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. విలేకరుల సమావేశంలో పర్చూరు ఎస్ఐ పులిగోపి, యద్దనపూడి ఎస్ఐ డీ వెంకటరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
స్కూల్ బస్సు – బైకు ఢీకొని వ్యక్తి మృతి
కురిచేడు: స్కూల్ బస్సు – బైకు ఎదురెదురుగా ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కురిచేడులోని దర్శి రోడ్డులో అయ్యప్పస్వామి ఆలయం ఎదురుగా శనివారం చోటుచేసుకుంది. కురిచేడు మండలంలోని నమశ్శివాయపుర అగ్రహారం గ్రామానికి చెందిన బరిగే బాలయ్య (62) దర్శి రోడ్డులోని పెట్రోలు బంకులో తన ద్విచక్ర వాహనానికి పెట్రోలు పోయించుకుని వస్తున్నాడు. అదే సమయంలో స్థానిక హుస్సేనియ పాఠశాల బస్సు కురిచేడు నుంచి దర్శి రోడ్డులోని పాఠశాలకు వెవెళ్తోంది. రోడ్డు దాటే క్రమంలో ఎదురెదురుగా వచ్చిన బస్సు – ద్విచక్ర వాహనం ఽఢీకొన్నాయి. ఈ ఘటనలో బాలయ్య తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కురిచేడులోని పోలీసుస్టేషను వెనుక వైపు నివసిస్తున్న బాలయ్యకు భార్య, వివాహమైన కుమార్తె ఉన్నారు. -
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
చీమకుర్తి రూరల్: అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 10 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు చీమకుర్తి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ సీఐ సుకన్య తెలిపారు. శనివారం చీమకుర్తి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని సంతనూతలపాడు మండలం కొనగానివారిపాలెంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నల్లమోతు శ్రీనివాసరావు నుంచి 10 బాటిళ్లు స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు. టంగుటూరు: వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన సంఘటన టంగుటూరులోని ఎల్సీ 191 గేటు ఉత్తరం వైపు శనివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ టి.శ్రీరామ్ తెలిపిన వివరాల మేరకు.. సుమారు 30 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తిని వందేభారత్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు మెరూన్ కలర్ అరచేతుల నెక్ టీ షర్ట్, నీలిరంగు జీన్స్ ప్యాంటు, కుడిచేతికి కడియం ధరించి ఉన్నాడు. ఎత్తు సుమారు 5.5 అడుగులతో చామన చాయలో ఉన్నాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని శ్రీరామ్ కోరారు. ఒంగోలు: ప్రకాశం జిల్లా అండర్ 19, అండర్ 23, సీనియర్ మహిళా క్రికెట్ జట్లను ఈ నెల 23వ తేదీ ఎంపిక చేయనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని క్రీడాకారులు అర్హులని అన్నారు. ఆసక్తి గల వారు ఉదయం 8.30 గంటలకు స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్ సెంటర్లో జరిగే ఎంపికకు నేరుగా హాజరుకావాలని సూచించారు. క్రీడాకారులు తప్పనిసరిగా కలర్ డ్రస్, షూ, సొంత కిట్, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5), ఆధార్కార్డు, స్టడీ సర్టి ఫికెట్తో హాజరుకావాలని కోరారు. ఎంపికై న జట్లు జూలైలో మంగళగిరి, పేరేచర్లలో జరిగే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు కోచ్ పి.శ్రీనివాస్ (9573424360), బి.చంద్రశేఖర్ (9246222999)ను సంప్రదించాలని నాగేశ్వరరావు తెలిపారు. -
ఆదివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2026
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు స్థోమత లేకపోయినా పిల్లలకు మంచి చదువు దక్కుతుందన్న ఆశతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల దోపిడీకి తెరతీశాయి. వేలాది రూపాయల ఫీజులకు తోడు యూనిఫాం, బుక్స్, యాక్టివిటీ ఫీజుల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కరువు కాలంలో పనులు లేక అల్లాడుతున్న తల్లిదండ్రులకు ఈ ఫీజుల దోపిడీ మరింత పెనుభారంగా మారింది. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమవడంతో ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. విద్యాశాఖ మంత్రి ఫీజుల వివరాలను ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రదర్శించాలని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. అనేక ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, విద్యాసామగ్రిని పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పెరుగుతోంది. సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారంగా మార్చకుండా చూడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ విద్యా సంవత్సరంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల స్కూల్ ఫీజులను తమకు ఇష్టం వచ్చినట్టుగా భారీగా పెంచాయి. ప్రతి ఏడాది స్కూల్ ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో స్కూల్ బుక్కులు, యూనిఫాంలు కూడా వారివద్దనే కొనాలనే నిబంధన పెట్టారు. ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్ధలను తనిఖీ చేసి పెంచిన ఫీజులు తగ్గించడంతోపాటు స్కూల్ పుస్తకాలు, యూనిఫాంను తమకు ఇష్టమైన చోట కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతోపాటు ప్రైవేటు టీచర్లకు కూడా కనీస వేతనాలను అమలు చేయాలి. – విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఒంగోలు సిటీ/మార్కాపురం: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నా, ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూనే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకంటే దీటుగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు, షూలు, టై, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఇచ్చేవారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలపై నిఘా పెట్టేవారు. దీంతో తమ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తుందన్న ఆశతో అప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపైనా నియంత్రణ ఉండేది. నేడు ఇలా.. చంద్రబాబు ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. రెండేళ్లుగా నాడు–నేడు పథకం కింద అసంపూర్తిగా మిగిలిన పాఠశాలలను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులు అరకొర వసతుల మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కొనసాగిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు మెరుగైన విద్య దక్కుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు.. ఒకటో తరగతి విద్యార్థికే రూ.30 వేలకు పైన, పదో తరగతి విద్యార్థికి రూ.70 వేల నుంచి లక్ష రూపాయిల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. గత ఏడాది మూడో తరగతికి రూ.40 వేలు ఉంటే ఈ సంవత్సరం ఫీజు రూ.50 వేలుకు అంటే రూ.10 వేలు పెంచుతున్నారు. ఒక్కో తరగతికి రూ.10 వేలు చొప్పున పెంచుతున్నారు. ప్రకాశం జిల్లాలో 443 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 230 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి దగ్గరే యూనిఫాం, బుక్స్ కొనాలి.. నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు సుమారు రూ.10 నుంచి రూ.15 వేలు పుస్తకాలకు, మరో రూ.5 వేలు యూనిఫాం కింద తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. దీంట్లోనే 50 శాతం మేర ఆదాయం వస్తోంది. మరికొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తమ స్కూల్డ్రస్, పుస్తకాలను షాపులకు కాంట్రాక్టు ఇవ్వడంతో ఆయా స్కూల్స్ యూనిఫారాలు అక్కడ మాత్రమే దొరుకుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ షాపుల్లోనే వారు చెప్పిన ధరకే అవి ధరకు తగ్గ నాణ్యత లేకపోయినా కొనాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు, స్టేషనరీతో అదనపు ఆదాయం వస్తోంది. జూనియర్ కళాశాలల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా మొత్తం మీద సుమారు 130 జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో సుమారు 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ ఎక్కడ? ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపుపై పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ఫీజులపై ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చినా వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు ఫీజుల నిర్మాణం, అదనపు వసూళ్లు, మెస్ చార్జీలు, ప్రత్యేక కోర్సుల పేరుతో జరుగుతున్న దోపిడీ పై సమగ్రంగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. మెస్ ఛార్జీలు, అదనపు వసూళ్లపై పారదర్శకత తీసుకురావాలి. ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలి: ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాల ఫీజు వివరాలను బహిరంగంగా ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా సేవగా చూడాలని, అధిక ఫీజులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూళ్ల దోపిడీపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. – వినోద్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి -
జిల్లాలో పెరిగిన పోలింగ్ కేంద్రాలు
● రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇన్చార్జ్ డీఆర్ఓ మాధురీలత సమావేశం ఒంగోలు సబర్బన్: జిల్లాలో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలు పెరిగాయని జిల్లా ఇన్చార్జ్ డీఆర్ఓ మాధురీలత వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ జిల్లాలో 1649 పోలింగ్ స్టేషన్లు కాస్తా 1725 పోలింగ్ స్టేషన్లకు పెరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 76 పెరిగాయన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 259 నుంచి 271కి.. అనగా 12 పోలింగ్ స్టేషన్లు పెరిగాయన్నారు. ఓటు నమోదు చేసుకునేటప్పుడు రెండు పాస్పోర్ట్ సైజు ఫొటోలు, బీఎల్వోలు అడిగిన నమోదు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ మాట్లాడుతూ జిల్లాలో, ఒంగోలు నగరంలో డోర్ నంబర్లు కొన్ని చోట్ల వెయ్యలేదని, సర్ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. సర్ కార్యక్రమంలో అధికార పార్టీ వారి ప్రలోభాలకు లొంగి నిజమైన ఓటర్లను తొలగిస్తే ఆ ఓటరు భారతదేశ పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఓటరును 2 ఫొటోలు అడుగుతున్నారని, ప్రతి ఓటరు తమ ఫొటోలు ఫొటో స్టూడియోకెళ్లి తీయించుకొని ఇవ్వాలంటే రూ.300 ఖర్చవుతుందని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ.300 చొప్పున చెల్లించి అందరూ ఫొటోలు తీయించుకునే పరిస్థితి లేదని డీఆర్ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారాన్ని ఓటరు భరించే పరిస్థితి లేనందున ఎన్నికల సంఘం ఫొటోగ్రాఫర్ను పెట్టి ఫొటోలు తీసే కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఒక కుటుంబంలో చనిపోయిన వారుంటే వారి ఓటు తొలగించడానికి డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారని, ప్రస్తుతం ఒక డెత్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలంటే ఒక్కో సర్టిఫికెట్కు రూ.10 వేల నుంచి రూ.15 వేల లంచం ఇవ్వందే వచ్చే పరిస్థితి లేదని అన్నారు. డెత్ సర్టిఫికెట్ లేకుండానే చనిపోయిన వారి ఓట్లను తొలగించే ఏర్పాట్లు చేయాలని క్రాంతికుమార్ కోరారు. -
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హనుమంతునిపాడు: ఫ్యాన్కు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో వెంగపల్లి ఎస్సీకాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మేళం వెంకటేశ్వర్లు, శాంతి దంపతుల కుమార్తె మేళం గీతాంజలి (16) కనిగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులు సాధించడంతో యాజమాన్యం రూ.2 వేలు నగదు బహుమతి కూడా అందించింది. పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదువుతూ ఇంటర్ ఫస్టియర్లోనూ మంచి మార్కులు సాధించింది. కాగా, గీతాంజలి అప్పుడప్పుడు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటుంది. తండ్రి వెంకటేశ్వర్లు కనిగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్కు డ్రైవర్గా పనిచేస్తుంటారు. తల్లి కనిగిరిలోని పెట్రోల్ బంకులో పనిచేస్తుంటుంది. రోజూ రాత్రి 7 గంటలకు వారు ఇంటికి వస్తారు. గీతాంజలికి కళాశాలకు సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూలాగే పనికి వెళ్లి గురువారం రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె గీతాంజలి ఫ్యాన్కు ఉరేసుకుని ఉండటంతో వారు కుప్పకూలిపోయారు. కడుపునొప్పి తాళలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, కుమారుడు ఒంగోలు చదువుతున్నాడు. మృతురాలు గీతాంజలి రెండో సంతానం. గ్రామంలో నూతనంగా పోలేరమ్మ గుడి నిర్మించి గురువారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కార్యక్రమానికి కూడా గీతాంజలి వెళ్లివచ్చిందని, భోజన ఏర్పాట్లకు సంబంధించి కూరగాయలు కూడా కోసి వచ్చిందని, ఇంతలోనే ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బంధువులంతా కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజ్కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. కడుపునొప్పి తాళలేకనే తమ కుమార్తె ఉరేసుకుని మృతి చెంది ఉంటుందని తల్లిదండ్రులు చెప్పడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కన్నతండ్రే కాలయముడై..
చీమకుర్తి: కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రే ముగ్గురు కుమార్తెల ప్రాణాలను బలితీసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం చివరకు కోర్టుకెక్కి మూడేళ్లుగా సాగుతోంది. సమస్య పరిష్కారం కాకముందే పిల్లల తండ్రి మరణ శాసనం రాశాడు. తానూ బలవన్మరణం చెందాడు. శుక్రవారం చీమకుర్తి మండలం కేవీ అగ్రహారం గ్రామంలో తండ్రి తన ముగ్గురు కుమార్తెలకు కూల్డ్రింక్లో విషం కలిపి ఇచ్చి చంపేసి..ఆపై తానూ ఉరేసుకుని చనిపోవడం ఆ గ్రామాన్ని విషాదంలో ముంచింది. ఈ సంఘటనలో ఏకుల సుధాకర్ (33) వేపచెట్టుకు ఉరేసుకున్నాడు. తొలుత గురువారం రాత్రే ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్లో మత్తు పదార్థాలు ఇచ్చి బలవంతంగా వారి ప్రాణాలు తీశాడు. సుధాకర్ భార్య వెంకటేశ్వరమ్మకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయి. దాంతో భార్య వెంకటేశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లింది. ముగ్గురు పిల్లల్లో పెద్ద కుమార్తె గోఅచ్చుత బండ్లమూడి జిల్లా పరిషత్ హైస్కూలులో 8వ తరగతి చదువుతోంది. రెండో పాప పూజిత స్థానిక అగ్రహారం గ్రామంలోనే 5వ తరగతి, మూడో కుమార్తె లోహితశ్రీ 4వ తరగతి చదువుతున్నారు. ఇంతలో సుధాకర్, వెంకటేశ్వరమ్మ మధ్య వివాదం కోర్టు వరకు వెళ్లింది. తన భార్యతో తనకు విడాకులు కావాలని సుధాకర్ కోర్టులో కేసు వేశాడు. భార్య వెంకటేశ్వరమ్మ మాత్రం తనకు తన భర్త, పిల్లలు కావాలని కోర్టులో విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. కనీసం పిల్లలనైనా ఇవ్వాలని భార్య విజ్ఞప్తి చేసింది. మరో నాలుగు రోజుల్లో కోర్టు వాయిదా ఉండటంతో ఎలా తీర్పు వస్తుందనుకున్నాడో ఏమో సుధాకర్ నాలుగు రోజుల ముందే పిల్లలను చంపి తాను చావాలనుకున్నాడని జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇంట్లో రెండు గేదెలు ఉంటే వాటిని రూ.1.20 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం చీమకుర్తి వెళ్లి నైలాన్ తాడుతో పాటు కూల్ డ్రింక్స్ సీసాలను తెచ్చాడు. ఇంటిపైన మద్యం సీసాలు కూడా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో బయటపడింది. మద్యం తాగాకే పిల్లలకు కూల్ డ్రింక్లో విష పదార్థాలను కలిపి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలకు తండ్రి కుతంత్రం తెలియక తమను చీమకుర్తిలో సినిమాకు తీసుకెళ్లమని అడిగారు. తీసుకెళ్తానని నమ్మించి పసిబిడ్డల ఉసురు తీశాడు. పైగా సుధాకర్ తన తల్లికి జరిగిన నిజాలు చెప్పకుండా ఉదయాన్నే బయటకు వెళ్లి టిఫిన్ తెస్తానని చెప్పి తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు. సుధాకర్ ప్రైవేటు పాఠశాలలోని స్కూలు బస్సుకు డ్రైవర్గా వెళ్తూ ఇటీవల వచ్చిన వేసవి సెలవుల్లో రామతీర్థంలోని ఒక గ్రానైట్ క్వారీలో డ్రైవర్గా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. చివరకు భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం చిన్నదైనా ఇరువైపులా పెద్ద మనుషులు నచ్చచెప్తే సమస్య పరిష్కారమయ్యేది. అలా జరగకపోవడంతో చివరకు సుధాకర్ తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురి పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో చివరి వాడు సుధాకర్ వద్దే అతని తల్లి ఏకుల సుశీల ఉంటూ తన ముగ్గురు మనవరాళ్లను చూసుకుంటూ కాలం గడుపుతోంది. తీరా ఇప్పుడు చేరదీసిన కొడుకు లేడు. పిల్లలు, భర్తను కోల్పోయిన సుధాకర్ భార్య వెంకటేశ్వరమ్మ జీవితం కూడా ఒంటరైంది. తండ్రి, ముగ్గురు కుమార్తెల శవాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. సుధాకర్ తల్లి సుశీల ఫిర్యాదు మేరకు సీఐ డీ.ప్రసాద్, ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
పొదిలి రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన పొదిలి మండలంలోని మల్లవరం సబ్ స్టేషన్ సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కుంచేపల్లి గ్రామానికి చెందిన మేడమ్ లింగారెడ్డి (52) ఆ గ్రామ సమీపంలోని మల్లవరం గ్రామంలో ఓ ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తున్నాడు. మల్లవరం సబ్స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని ఓ ప్రైవేటు వాహనంలో పొదిలి ప్రభుత్వాస్పత్రికి తరలించి మార్చురీలో ఉంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో లింగారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
శనివారం శ్రీ 20 శ్రీ జూన్ శ్రీ 2026
ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలతో కోట్ల విలువైన సహజ సంపదను పెద్ద ఎత్తున దోచేస్తున్న పచ్చమంద జోలికి వెళ్లని మైన్స్ అధికారులు తప్పుడు ఫిర్యాదులను ఆసరా చేసుకుని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్రెడ్డికి చెందిన గ్రానైట్ క్వారీలపై వరుస తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయల పెనాల్టీలు విధించారు. అన్ని అనుమతులూ ఉన్నా రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా రాజకీయ వేధింపులకు పాల్పడుతూ ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్రలు పన్నుతున్నారు. రాజకీయ విభేదాలతో గ్రానైట్ పరిశ్రమలను లక్ష్యంగా చేసుకోవడంపై పరిశ్రమ వర్గాలు మండిపడుతున్నాయి.సూర్య గ్రానైట్ క్వారీలో తనిఖీలు చేస్తున్న మైన్స్ అధికారులు (ఫైల్) -
ఆలస్యమవుతుంది తల్లీ..!
బేస్తవారిపేట: టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయని ఆశపడ్డ తల్లులకు, విద్యార్థులకు చంద్రబాబు సర్కారు తొలిరోజే కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ముందు తల్లికి వందనం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన బాబు..తీరా కుర్చీ ఎక్కాక మాట మార్చారు. బడ్జెట్ సాకులు చెప్తూ ఈ పథకాన్ని మరో రెండు నెలల పాటు అడ్డగోలుగా వాయిదా వేసి, లబ్ధిదారుల ఆశలపై చన్నీళ్లు చల్లారు. అటు స్కూళ్లు తెరిచి రోజులు గడుస్తున్నా..విద్యార్థులకు అందాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్యాకానుక, అమ్మ ఒడి పథకాలు నవరత్నాల్లా సాగిపోయాయి. కానీ, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఆ ఊసే కరువైంది. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ న్యాయం చేస్తామన్న హామీని అమలు చేయడంలో సర్కారు మీన మేషాలు లెక్కిస్తోంది. మరో నెలన్నర రోజుల వరకు నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని సర్కారు తేల్చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని లక్షలాది మంది తల్లులు లబోదిబోమంటున్నారు. స్కూళ్లు రీఓపెన్ అయిన తరుణంలో పుస్తకాలు, యూనిఫారాలు కొనుక్కోవడానికి చేతిలో పైసల్లేక పేద తల్లులు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దాదాపు 2,838 పాఠశాలలు ఉండగా వాటిలో చదువుకుంటున్న 1.87 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్ను కూటమి సర్కారు అంధకారంలోకి నెట్టేస్తోంది. అటు తల్లులకు ఇచ్చే డబ్బులకూ దిక్కులేదు, ఇటు పిల్లలకు ఇచ్చే కిట్లకూ మోక్షం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు మార్క్ ‘పాలన’ అంటే ఇదేనా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద సుమారు రూ.1700 కోట్లకు పైగా నిధులు ఏటా జూన్ తొలివారంలోనే అందజేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ నిధులు అందాయి. టీడీపీ ప్రభుత్వంలో మాత్రం విద్యార్థుల సంఖ్యను కత్తెర పెట్టేందుకు సిద్ధమైందన్న ఆరోపణలు క్షేత్ర స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి. పథకానికి అర్హత సాధించాలంటే నిబంధనలు, సాంకేతిక కారణాలు సాధారణ పేద కుటుంబాలకు శాపాలుగా మారాయి. కూటమి సర్కారు ఉదాసీనత వల్ల ప్రతి ఏటా అర్హులైన వేలాది మంది విద్యార్థులు పథకానికి దూరవుతున్నారు. పథకం అమలు బాధ్యతలను విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మ్యాపింగ్ యాప్లు సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కారణంగా డేటా నమోదు నిలిచిపోయింది. విద్యార్థుల ఆధార్, ఇతర వివరాలు సరిచూసుకోవడానికి ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ, బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్ వంటి అంశాలపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. తల్లిదండ్రులు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే మ్యాపింగ్ అస్తవ్యస్తంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ ఉమ్మడి జిల్లాలో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులైనా మెజారిటీ విద్యార్థులకు ఇంకా కిట్లు అందలేదు. ఎక్కడో ఒకచోట పంపిణీ చేసినా..అందులో నోట్బుక్స్, యూనిఫాం సైజులు సరిపోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థను ఈ సర్కారు గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన ‘నాడునేడు’ లాంటి పథకాలను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు..కనీసం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు ఇవ్వడం లేదు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కనీస నిధులు విడుదల కాకపోవడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందని విద్యామిత్ర కిట్లు నేటికీ అందని బ్యాగులు, షూ, బెల్ట్, డిక్షనరీలు, యూనిఫామ్స్ మౌలిక వసతులను పట్టించుకోని చంద్రబాబు సర్కారు మౌలిక వసతులకు నిధులు నిల్.. క్షేత్ర స్థాయిలో అడ్డంకులెన్నో.. తల్లికి వందనం..వంచనవిద్యార్థి మిత్ర..అగమ్యగోచరం.. -
పొగాకు రైతు పోరుబాట
ఒంగోలు టౌన్: పొగాకు రైతుల నినాదాలతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. వందలాది మంది రైతులు ఉదయం 9 గంటల నుంచే నగరానికి చేరుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, పొగాకు కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రుపాయలు కేటాయించి ఆదుకోవాలని రైతులు పెద్దపెట్టున నినదించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో సుమారు 500 వరకు ట్రాక్టర్లు పాల్గొన్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీకి సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా నేరుగా ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని టొబాకో బోర్డుకు సమీపంలోని మినీ స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ మండుటెండను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగింది. ప్రకాశం భవన్, అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, కర్నూలు రోడ్డు మీదుగా ఒంగోలు బైపాస్ వరకు ర్యాలీ జరిగింది. రైతు నాయకులను ఢిల్లీకి పిలుచుకోవాలి: గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పొగాకు గిట్టుబాటు ధరల కోసం రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి లేఖలు రాయడం వలన ఉపయోగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్రానికి చెందిన పొగాకు రైతులను, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులను, కౌలు రైతు సంఘాల నాయకులను నేరుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు పిలుచుకొని వెళితే ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. పొగాకు పంట వలన ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం కేవలం వేయి కోట్లు కేటాయించలేని దుస్థితిలో ఉందంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఏమై పోయాయో చెప్పాలని ప్రశ్నించారు. టుబాకో బోర్డు, కంపెనీలు సిండికేట్గా తయారై పొగాకు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కంపెనీ కోరల్లో పొగాకు రైతులు విలవిల: చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొగాకు ఽకొనుగోలు విషయంలో కంపెనీలు సిండికేట్గా తయారయ్యాయని, రైతుల శ్రమను దోచుకునేందుకు నో బిడ్ నాటకాలాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కిలో రూ.200కు కొనుగోలు చేస్తే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని చెప్పారు. పొగాకు పంట ద్వారా రూ.లక్షల కోట్ల ఆదాయం పొందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు న్యాయంగా దక్కాల్సిన ధరలు దక్కకుండా కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పొగాకు రైతులను దగా చేస్తున్న చంద్రబాబు: ఎం.ప్రభాకర రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొగాకు ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.250 కు పైగానే ఉందని, అయితే కిలో పొగాకు రూ.200 కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించడం రైతులను దగా చేయడమేనని ఏపీ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర రెడ్డి మండిపడ్డారు. గత ఏడాది కూడా ఇలాగే నమ్మించే ప్రయత్నాలు చేశారని, రైతుల పోరాటాల ఫలితంగానే నల్ల బర్లీ, తెల్ల బర్లీ పంటలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. రైతు కూలి సంఘ జిల్లా నాయకులు ఎస్ లలిత కుమారి మాట్లాడుతూ... పొగాకు రైతుల ఓట్ల కోసం వచ్చే పాలకులకు వారి సమస్యలు మాత్రం పట్టకపోవడం దారుణమన్నారు. బోర్డు దగ్గర రైతుల డబ్బులు ఉన్నాయని, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించి, క్వింటా పొగాకు రూ.30 వేలకు కొనుగోలు చేసేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి నగరంలో అడుగడుగునా సంఘీభావం పలికారు. అద్దంకి బస్టాండు సెంటర్ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.వెంకటరావు, రైతు సంఘం నాయకులు పమిడి వెంకటరావు, జజ్జురి జయంతి బాబు, సాగర్, హనుమారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కల్పన, రమాదేవి, కేజీ మస్తాన్, కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బీఎల్ఓ ఇష్టారాజ్యం
● సర్ మ్యాపింగ్లో పక్షపాతం ● సచివాలయానికి పిలిపించుకొని ఓటర్ల సమాచారం సేకరిస్తున్న వైనం ● సచివాలయంలో బీఎల్ఓను నిలదీసిన వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట వార్డు సచివాలయం పరిధిలో ఓటర్ల వెరిఫికేషన్కు సంబంధించి సర్ మ్యాపింగ్ విషయంలో బీఎల్ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. సర్ మ్యాపింగ్లో అధికార పార్టీ వాళ్లకు ఒక రకంగా.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అభిమానులకు మరో రకంగా చేస్తున్నాడని విమర్శలు రేకెత్తాయి. 2002 ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉంటే ఓటరు లిస్టులు మీరే తెచ్చుకోండి అని కొంతమందికి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని కొందరు వాపోతున్నారు. దానికి తోడు సచివాలయం పక్కనే ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ సెంటర్ను ఏర్పాటు చేయించి వచ్చిన ఓటర్లను డబ్బులిచ్చి పక్కనే ఉన్న కంప్యూటర్ సెంటర్కు వెళ్లి ఓటరు లిస్టులు తెచ్చుకోండని చెబుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ ఇస్లాంపేట వార్డు సచివాలయానికి వెళ్లి బీఎల్ఓ లక్ష్మీ పుల్లయ్యను నిలదీశాడు. తమ వద్ద 2002 ఓటరు లిస్టులు లేవని, అందుకే కంప్యూటర్ సెంటర్కు వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్నామని సమాధానం చెప్పారు. దాంతో కఠారి శంకర్ సచివాలయంలో లేని ఓటరు లిస్టులు పక్కన ఉన్న కంప్యూటర్ సెంటర్లో ఏవిధంగా ఉంటాయని నిలదీశారు. అనంతరం కంప్యూటర్ సెంటర్కు వెళ్లి నిర్వాహకుడిని ఓటరు లిస్టులు నీ వద్ద ఎందుకు ఉన్నాయని నిలదీశాడు. దాంతో ఎలక్షన్ కమిషన్ సైట్లోకి వెళ్లి 2002 ఓటరు లిస్టులు తీస్తున్నానని సమాధానం చెప్పాడు. దాంతో కఠారి శంకర్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. -
అక్రమ అరెస్టులతో భయపెట్టలేరు
ఒంగోలు సిటీ: అక్రమ అరెస్ట్లతో భయపెట్టాలనుకోవడం కూటమి ప్రభుత్వం భ్రమ అని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అన్నారు. శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు కూటమి పాలకులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. లేని మద్యం కేసులు సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడం చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి అతని కుమారుడు కారుమూరి సునీల్ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్నారు. 2014–19లో జరిగిన మద్యం అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం.. తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతు చెరపలేరన్నారు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ నాయకత్వాన్నిగానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్నిగానీ అణచలేరన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులపైనే వరుసగా కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే.. రాజకీయ కక్షసాధింపులకు దర్యాప్తు సంస్థలను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. వేధింపులు పక్కనపెట్టి ఆధారాలతో కూడిన నిష్పక్షపాత విచారణ చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సమర్థవంతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనలో 16 మంది మృతి చెందినా కారణాలు వెలుగులోకి రాలేదన్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనలోనూ బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం స్పందించడం పరిస్థితికి అద్దం పడుతోందని బొట్ల సుబ్బారావు అన్నారు. కారుమూరి సునీల్ యాదవ్కు అండగా ఉంటాం... డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జ్ కారుమూరి సునీల్కుమార్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేశారని బొట్ల సుబ్బారావు అన్నారు. డీఎస్సీ–2025 కుంభకోణం, తునిలో చిన్నారి అదృశ్యం, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య వంటి ఘటనలపై చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్ సీపీ ఎండగడుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. అలా అనుకోవడం కూటమి ప్రభుత్వ భ్రమ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కారుమూరి సునీల్ అరెస్టు బీసీ యువనేతగా సునీల్ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్ర లేని మద్యం కేసుతో వైఎస్సార్ సీపీ నాయకులను వేధిస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు 2014–19లోనే అసలైన మద్యం స్కాం... 2014–19 మధ్యలో చంద్రబాబు పాలనలోనే అసలైన మద్యం స్కాం జరిగిందని అందరికీ తెలుసని బొట్ల సుబ్బారావు ఆరోపించారు. కానీ, ఇప్పుడు మద్యం రవాణా పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం సందుసందుకీ బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం బాటిల్పై అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారన్నారు. ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తోందో ప్రభుత్వం చెప్పాలని సుబ్బారావు ప్రశ్నించారు. మద్యం ధరలపై ఆందోళన చేసినా.. అక్రమాలకు పాల్పడిన దుకాణాలపై చర్యలు తీసుకోలేదన్నారు. ఆక్వా రైతులు రోడ్లపైకి వచ్చి ఫీడ్ బస్తాలను దహనం చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జరిగిందన్నారు. గతంలో ధరలు పెరిగితే జే ట్యాక్స్ అని విమర్శించిన వారు, ఇప్పుడు జరుగుతున్న దోపిడీ ఎవరి ట్యాక్సో చెప్పాలని పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సహా అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఆ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభమైనా తల్లికి వందనం పథకం జాడ లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు ఫణిదపు సుధాకర్, షేక్ మీరావలి, కె.రాము, తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ను ఢీకొట్టిన లారీ
● ఒకరు మృతి బేస్తవారిపేట: టిప్పర్ను లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లోడు కోసం గిద్దలూరు వైపునకు వెళ్తున్న టిప్పర్ను ఎదురుగా వచ్చిన డోన్ నుంచి గుంటూరు వైపునకు వెళ్తున్న ఎరువులు, పురుగుమందుల లారీ (ఐచర్) రాంగ్రూట్లో ఢీకొట్టింది. ఈ సంఘటనలో అర్థవీడు మండలం చిన్నకందుకూరుకు చెందిన టిప్పర్ డ్రైవర్ పుప్పాల దానమయ్య (45) అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ బీ సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతన్ని కర్నూలు తరలించారు. ఈ సంఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుడికి భార్య మరియమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి
సీఎస్ పురం (పామూరు): రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు. మండల కేంద్రమైన సీఎస్ పురంలోని ఆర్ఎంఎస్ కల్యాణ మండపంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూములను ఆన్లైన్ చేయడం, ఇతర భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని తెలిపారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, సీఎస్ పురంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్ఎస్లపై త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీలపై ఉదాసీనంగా వ్యవహరించకుండా నిబంధనలను అనుసరించి పరిష్కరించాలని, అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పరిహారం ఇప్పించాలని వినతి... గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోయిన రైతులు కలెక్టర్ను కలిశారు. ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని, తక్షణమే పరిహారం ఇప్పించాలని కోరుతూ మండలంలోని దర్శితిమ్మక్కపల్లి గ్రామ రైతులు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జేసీ పులి శ్రీనివాసులు.. పూర్తిస్థాయిలో రికార్డులతో 29వ తేదీ మార్కాపురం రావాలని తహసీల్దార్ ధర్మతేజను ఆదేశించారు. రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, పీజీఆర్ఎస్లో మొత్తం 254 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించి 224 అర్జీలు అందాయి. ఇతరాలకు సంబంధించి 30 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ తోట అజయ్కుమార్, హౌసింగ్ పీడీ మోహన్రావు, జిల్లా మైనింగ్ అధికారి రవిప్రసాద్, ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ పద్మావతి, డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ, డీడీఓ కే శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ వి.ప్రతాప్రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓలు రాజాల కొండారెడ్డి, జె.ప్రసాదరావు, పామూరు, వెలిగండ్ల, కనిగిరి, పీసీ పల్లి, హెచ్ఎం పాడు మండలాల అధికారులు పాల్గొన్నారు. అర్జీదారుని సమక్షంలోనే సమస్య పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ విజయ సునీత కనిగిరిలో నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం -
గంజాయి కేసులో వ్యక్తి అరెస్టు
● 1.10కేజీల గంజాయి స్వాధీనం కందుకూరు: కందుకూరు ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న కీలక నిందితున్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రమైన గుడ్లూరులోని ఎరుకలపాలెంకు చెందిన నాగులూరి తిరుపతయ్య అనే వ్యక్తి విశాఖ ప్రాంతం ఉంచి గంజాయి తీసుకొచ్చి కందుకూరు ప్రాంతంతో పాటు, ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయిని సరఫరా చేసేవాడు. ఇతని కోసం గత కొంత కాలంగా పోలీసులు నిఘా ఉంచారు. దీనిలో భాగంగా బుధవారం పట్టణ సమీపంలో ఉండగా అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తిరుపతయ్య వద్ద నుంచి 1.100 గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులోని మరికొందరు కీలక నిందితుల కోసం గాలింపు చేపడతామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయం, సరఫరా, వినియోగం సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112, 1972 కందుకూరు పట్టణ ఎస్సై సెల్ నంబర్ 9121102203, సీఐ 91221102202, పోలీస్ వాట్స్యాప్ నంబర్ 9121102266 నంబర్కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ అన్వర్బాష, పట్టణ ఎస్సై శివనాగ రాజు తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్ శ్రీ 2026
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఏవిధంగా దోపిడీ చేయవచ్చో కందుకూరు టీడీపీ నేతలను చూసి నేర్చుకోవచ్చు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ కందుకూరు పట్టణంలోని ఏంఐజీ (మిడిల్ ఇన్కమ్ గ్రూపు) లేవుట్లో ప్లాట్ల (ఇంటి స్థలం)లో జరిగిన దోపిడీ వ్యవహారమే. ఆన్లైన్ విధానంలో బహిరంగంగా ప్రజలందరికీ తెలిసేలా సాగాల్సిన ప్లాట్ల విక్రయాన్ని గట్టుచప్పుడు కాకుండా టీడీపీ కార్యాలయం వేదికగా టీడీపీ నేతలు పంచేసుకున్నారు. నుడా అధికారుల నుంచి సంపూర్ణ సహకారం ఉండడంతో ఈ దోపిడీ యథేచ్ఛగా సాగిపోయింది. ప్రస్తుతం విషయం బయటకు పొక్కడంతో పట్టణ ప్రజలు అవాక్కవుతున్నారు. ప్లాట్లలో పాగా -
మార్కాపురం శాసనాలకు పురావస్తుశాఖ గుర్తింపు
మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో లభించిన శాసనాలకు, పురావస్తుశాఖ గుర్తింపు ఇచ్చిందని ప్రముఖ కవి, శాసన పరిశోధకులు, రిటైర్డు విద్యాశాఖ జాయింట్ డైరెక్టరు డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి తెలిపారు. మార్కాపురం మండలంలోని బొడిచర్ల ఆంజనేయస్వామి దేవస్ధానం, వెలుగొండ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 16వ శతాబ్ధానికి చెందిన 2 శాసనాలను, చెన్న మల్లేశ్వర ఆలయాల్లోని మరో 2 శాసనాలను మైసూరుకు చెందిన పురావస్తు పరిశోధనా సంస్ధ అధికారులు, పురావస్తుశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎం మునిరత్నం రెడ్డి ఆధ్వర్యంలోని బృందం పరిశీలించి రికార్డు చేశారన్నారు. వెలుగొండ శాసనాలు, శ్రీకృష్ణదేవ రాయుల కాలంలో ఆలయానికి సంబంధించిన దాన ధర్మాలను తెలుపుతోందన్నారు. బొడిచర్ల శాసనాలు 1257 సంవత్సరం కాలంనాటి కాకతీయ గణపతి దేవుడు రాయించిన శాసనంగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారన్నారు. -
చట్ట సవరణతో టెట్ మినహాయించాలి
మార్కాపురం టౌన్: ఆర్టీఈ చట్ట సవరణ ద్వారా 2010 టెట్ నోటిఫికేషన్కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నుంచి మినహాయింపు కల్పించాల్సిందిగా కలెక్టర్ విజయ సునీతకు ఏపీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కే శంకర్రావు, కే శ్రీనివాసులు వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ద్వారా ప్రధానికి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి, సీఎంకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం మార్కాపురం జిల్లా శాఖ తరఫున వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పార్లమెంట్లో చట్టసవరణ ద్వారా ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరి ఉత్తీర్ణత నియమం 2010 టెట్ నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీ రవీంద్రారెడ్డి, డీపీ రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విశ్రాంత ఉద్యోగుల భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగి రిటైర్మెంట్ రోజునే అన్నీ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు వెంటనే ఇవ్వాలని, పీఎఫ్, ఏపీజీఎల్ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కాపురం శాఖ అధ్యక్షుడు డాక్టర్ బాలసుబ్బారావు పాల్గొన్నారు. పుల్లలచెరువు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొని అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మర్రివేముల పంచాయతీ ఎర్రపాలెం వద్ద గురువారం జరిగింది. వివరాలు.. మర్రివేముల పంచాయతీకి చెందిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ సెక్రటరీ రావూరి ఆశోక్ (40) తన మామ దినదిశకర్మ సందర్భంగా అవసరమైన సరుకులు తెచ్చేందుకు బైకుపై పక్క గ్రామం వెళ్లి వస్తుండగా గేదె అడ్డువచ్చింది. బైకు అదుపుతప్పి దాన్ని ఢీకొనడంతో ఆశోక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు ఉన్న మల్లికార్జునకు తీవ్రగాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. మృతుడు ఆశోక్కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్, పార్టీ మండల కన్వీనర్ దోమకాలు వెంకటేశ్వర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
పాపాయిపల్లెలో రెండు గృహాల్లో చోరీ
బేస్తవారిపేట: మండలంలోని పాపాయిపల్లెలో రెండు గృహాల్లో దొంగలు గురువారం తెల్లవారుజామున చోరీ చేశారు. పాపాయిపల్లెలోని మెయిన్రోడ్డులో ఉపాధ్యాయుడు జి. శ్రీనివాసులు గృహంలో వరండాలో నిద్రపోతున్న యశోద మెడలోని 5 తులాల బంగారు సరుడును దొంగలు లాక్కెళ్లారు. శ్రీనివాసులు గృహం కిందవైపున డి.రంగనాయకులు గృహంలో దొంగలు హల్చల్ చేశారు. రంగనాయకులు బతుకుదెరువు నిమిత్తం కంభం మండలంలోని కందులాపురంలోని అంకాలమ్మ ఆలయం వద్ద రేకులషెడ్డు వద్ద చెరుకు రసం మిషన్ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గృహంలో ఎవ్వరూ లేని సమయంలో ప్రహరీ దూకి మెయిన్ తలుపు తాళం పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువా తాళాలు పగులకొట్టి రూ.15 వేల నగదు, జత వెండి ప్రమిదలు దోచుకెళ్లారు. మార్కాపురం క్లూస్ టీం సభ్యులు వీరాంజనేయులు, సుబ్బరావులు వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సర్ పకడ్బందీగా నిర్వహించండి
● కల్టెర్ విజయసునీత మార్కాపురం: సర్ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయసునీత ఆదేశించారు. తర్లుపాడు మండలంలోని చెన్నారెడ్డిపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా గురువారం నిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివాదాలకు, విమర్శలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా సర్ కార్యక్రమాన్ని చేపట్టాలని, ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. సచివాలయ సిబ్బంది విధిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి రాకుండా హాజరు నమోదు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సేవల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని చెప్పారు. -
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
ఒంగోలు సబర్బన్: ‘రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవుతున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ నాయకులు గురువారం ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం ముందు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర కమిటీ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్యాలయానికి వెళ్లి ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణ గురించి ఉద్యోగులకు వివరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిన్నిక మధుసూదనరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హక్కుల సాధన కోసం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణ ప్రకటించారన్నారు. ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కనీసం చైర్మన్ను కూడా నియమించలేదన్నారు. ఐదు డీఏలు ఇవాల్సి ఉన్నా వాటి పైనా మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డీఏలు, ఇతర సదుపాయాలు అన్నీ ఎగనామం పెట్టి ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటు, ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రెండు, మూడు రకాల పనులు ఒకేసారి అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హక్కుల సాధన, వివిధ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రానున్న కార్యక్రమాల్లో ప్రతి ఉద్యోగి చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిన్నిక పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఉద్యోగుల హక్కుల సాధన కోసం కార్యాచరణ ఏపీ జేఏసీ అమరావతి తరఫున ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు -
ఆదుకోకపోగా దాష్టీకం
ఒంగోలు టౌన్: మూడు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో దళిత, గిరిజన కుటుంబాలను విషాదంలో నింపింది. రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మార్చురీ బయట పరిస్థితి మరింత విషాదంగా ఉంది. మార్చురీలో నిర్జీవంగా తల్లి పడుంటే, అదే మార్చురీ బయట అమ్మ కావాలంటూ ఆమె ఇద్దరు కూతుళ్లు మూడున్నరేళ్ల వలంశిక, రెండేళ్ల శ్రీహర్షిక తల్లి కోసం గుక్కపట్టి రోదిస్తున్నారు. ఒక కూతురిని పోగొట్టుకొని, చావు బతుకులతో పోరాడుతున్న మరో కూతుర్ని తలచుకుంటూ గుండెలవిసేలా ఒక తల్లి రోదిస్తోంది. కుటుంబానికి అండగా ఉన్న తల్లి పోయి అల్లాడిపోతున్న కుటుంబం మరోపక్క విలపిస్తుంటే... రెండేళ్ల పాలన విజయోత్సవాల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు సంబరాలు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మూడు రోజులుగా రోడ్డు పక్కన పడి ఉన్న బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పని అధికారులు, ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలిచిన ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం వివాదంగా మారింది. మూడు రోజులుగా మార్చురీ వద్దనే... రోడ్డు ప్రమాదం జరిగి మూడు రోజులైంది. నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన కవిల సజన, పల్నాడు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన బుజ్జిబాయి ఈ ప్రమాదంలో మరణించారు. కవిల సజన సోదరి ఉజ్వల పక్కటెముకలు విరిగిపోయి, లివర్ దెబ్బతిని చావు బతుకుల మధ్య ఉంది. సజనకు ఇద్దరు కుమార్తెలు, బుజ్జిబాయికి కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాంతో తమ కుటుంబాలకు న్యాయం చేయాలని బాధితులు అడుగుతున్నారు. అయితే వారికి ఇప్పటి వరకు అలాంటి భరోసా లభించలేదు. నిరుపేద దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన ఇరువురు మహిళలు మరణించినప్పటికీ కనీసం ఒక్క అధికారి కానీ, ప్రజా ప్రతినిధి కానీ వచ్చి పలకరించిన పాపాన పోలేదు. తగిన న్యాయం చేస్తామని ధైర్యం చెప్పలేదు. కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మార్చురీలో ఫ్రీజర్లు నిలిపేసి... రోడ్డు ప్రమాదంలో మరణించిన కవిల సజన, బుజ్జిబాయి మృతదేహాలను రెండు రోజులుగా మార్చురీలో ఉంచారు. కారు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతదేహాలకు ఇంత వరకు పోస్టుమార్టం నిర్వహించలేదు. కానీ గురువారం హడావుడిగా మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడంలేదని నోటీసులు అంటించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మార్చురీ ఫ్రీజర్లు మరమ్మతులో ఉన్నాయని చెప్పడం అబద్ధమని, ఇప్పటి వరకు పనిచేసిన ఫ్రీజర్లు ఒక్కసారిగా ఎలా చెడిపోతాయని ప్రశ్నిస్తున్నారు. తమ మీద ఒత్తిడి పెంచడానికే ఫ్రీజర్ల నాటకాలాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రోడ్డు ప్రమాదం జరిగి మూడు రోజులు కావడంతో మృతదేహాలు ఇప్పటికే ఉబ్బి పోయాయని తెలిపారు. ఇప్పుడు ఫ్రీజర్లను ఆపివేస్తే కుళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంఘాల నాయకుల అరెస్టు... ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడితే శంకర్ నాయక్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రఘురాం, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకుడు నీలం నాగేందర్, గిరిజన సంఘం నాయకుడు పేరం సత్యం ఆధ్వర్యంలో జీజీహెచ్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వడితే శంకర్ నాయక్ మాట్లాడుతూ... ఒక పక్క దళిత, గిరిజన కుటుంబాలకు చెందిన మహిళలు రోడ్డు ప్రమాదంలో మరణిస్తే మరోపక్క పాలకులు, అధికారులు రెండేళ్ల విజయోత్సవాల సంబరాలు చేసుకోవడం విచారకరమన్నారు. కనీస మానవతా దృక్పథంతోనైనా బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం దారుణమన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులైనా బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై రెండేళ్ల విజయోత్సవ సభలో ఉన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రం అందజేసేందుకు వెళుతున్న దళిత, గిరిజన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జీజీహెచ్ బయట కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం శంకర్ నాయక్, నీలం నాగేందర్, రఘురాం, సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసులు, సైదా నాయక్, బుజ్జిబాయి కుటుంబ సభ్యులు పాత్లావత్ కిష్టమ్మ, శ్రావణిబాయి, బాజియా బాయి, వస్త్రం నాయక్, వెంకటేశ్వర్లు నాయక్ సహా మొత్తం 18 మందిని పోలీసులు అరెస్టు చేసి కొత్తపట్నం పోలీసు స్టేషన్కు తరలించారు. న్యాయం చేయాలని కోరితే అరెస్టు చేయడం దుర్మార్గమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా రిమ్స్ మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్న రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబాలు మార్చురీ బాక్సుల ఏసీని నిలిపేసి ఒత్తిడికి గురిచేస్తున్నారని బాధిత కుటుంబాల ఆరోపణ నేటి వరకు పరామర్శించని ప్రజా ప్రతినిధులు, పలకరించని అధికారులు విజయోత్సవాల్లో మునిగితేలిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధితులకు అండగా నిలిచిన దళిత, గిరిజన సంఘాల నాయకుల అరెస్టు -
నేతివారికుంటను పరిశీలించిన అధికారులు
జరుగుమల్లి(సింగరాయకొండ): జరుగుమల్లి పంచాయతీలోని పంగులూరివారిపాలెంలో నేతివారికుంట చెరువును గురువారం ఇరిగేషన్ ఏఈ రవికుమార్ పరిశీలించారు. చెరువులో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి ‘సాక్షి’లో ‘కట్టలు తెగిన భూదాహం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు చెరువు వద్ద మట్టి తవ్విన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇకపై చెరువు ప్రాంతాల్లో మట్టి తవ్వకాలు జరపాలంటే ఇరిగేషన్ శాఖ అనుమతి తీసుకోవాలని, లేకపోతే వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా అవసరాలకు చెరువులో మట్టిని ఉపయోగించుకోవటానికి అనుమతి ఇస్తామని అలాగని ఇష్టం వచ్చినట్లు మట్టిని తరలిస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. చెరువుకు సంబంధించి సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఇందుకోసం తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు సర్వే చేయమని దరఖాస్తు చేయనున్నట్లు ఆయన వివరించారు. -
నీట్ పరీక్ష నిర్వహణకు కట్టుదిట్ట ఏర్పాట్లు
● కలెక్టర్ పి.రాజాబాబు ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ స్థాయి మెడికల్ నీట్ పరీక్షను సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కట్టుదిట్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. నీట్ పరీక్ష సక్రమ నిర్వహణపై గురువారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి రెవెన్యూ, బ్యాంకు, పోలీస్, పోస్టల్, విద్యా, వైద్య, అగ్నిమాపక, ప్రజా రవాణా, విద్యుత్, చీఫ్ సూపరింటెండెంట్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షకు జిల్లాలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో 1,821 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. మధ్యాహ్నం 2 రెండు గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పీడబ్ల్యూ విద్యార్థులకు 6.20 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. పరీక్ష జరిగే ప్రతి కేంద్రంలో తగిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, బయోమెట్రిక్ హాజరు వంటి చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష నిర్వహణ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాలు, వాటి చుట్టుపక్కల అవసరమైన బందోబస్తు చర్యలు పటిష్టంగా అమలు చేయలన్నారు. సమావేశంలో డీఆర్వో మాధురి, ఒంగోలు ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఈఓ రేణుక, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర రావు, ఆర్టీసీ ఆర్ ఎం సత్యనారాయణ, నీట్ పరీక్ష సిటీ కో ఆర్డినేటర్ ఎం. మనీష్కుమార్, సంబంధిత శాఖల అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఏ తల్లి కన్నబిడ్డో..
● ముళ్ల పొదల్లో ఏడు నెలల మగ శిశువు మృతదేహం ఒంగోలు టౌన్: ఏతల్లి కన్నబిడ్డో.. నవమాసాలు నిండకుండానే నిండు నూరేళ్లు నిండాయి. అమ్మపొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన బిడ్డ నిర్జీవంగా చెత్తకుండీకి చేరాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు నగర శివారులోని గాంధీరోడ్డులో ఒక ప్రైవేటు స్కూలు ఎదురుగా ముళ్ల పొదల్లో ఏడు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ బీవీ సాగర్కు సమాచారం ఇచ్చారు. ఆయన జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి పి.నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, తాలూకా పోలీసులు శిశువు మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. శిశువును పారవేసిందెవరు, అనారోగ్యంతో మరణించాడా... లేక ఇతరత్రా విషయాలను విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్త అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కాపుల అణ చివేతలపై మాట్లాడవేం పవన్
ఒంగోలు టౌన్: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో కాపులపై దాడులు నిత్యకృత్యమై పోయాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోక చోట కాపులపై దాడులు జరుగుతున్నా కాపులకు పెద్దన్నగా ఉంటానని చెప్పి ఓట్లేయించుకొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడడంలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురంలో జుమాటోలో పనిచేసుకుంటూ జీవిస్తున్న గాదె సాయికృష్ణ అనే కాపు యువకుడిని విచారణ పేరుతో విజయవాడ కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లి 14 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఆచూకీలేదని తెలిపారు. కుమారుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్కు వెళ్లిన అతడి తల్లి విజయలక్ష్మిని అక్కడి పోలీసులు నీ కుమారుడు లేడని, ఫొటోకు దండ వేసుకొని చూసుకొమ్మని సలహా ఇవ్వడం పలు సందేహాలను రేకెత్తిస్తుందని చెప్పారు. సాయికృష్ణ మీద నేరాలు ఉంటే చట్టపరంగా విచారించి శిక్షించాలని, దానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్లు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో సాయికృష్ణ కుటుంబం జనసేన విజయం కోసం పనిచేసిందని, స్వయంగా జనసేన కార్యకర్త పోలీసుల లాకప్లో చనిపోయినట్లు వార్తలు వస్తున్నా డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం వెనక మతలబేమిటని ప్రశ్నించారు. పవన్ కోసం కాపులందరూ పల్లకీలు మోశారని, ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం దారుణమని చెప్పారు. సాయికృష్ణ బతికి ఉంటే వెంటనే హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐ చేత సాయికృష్ణను వేధించడం వల్లనే మరణించి ఉంటాడని, చంద్రబాబు ప్రభుత్వం కాపుల చేతే కాపులపై దాడులు చేయించడం, హత్యలు చేయించడం వంటి ఘోరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కందుకూరులో కాపు యువకుడిని కారుతో తొక్కించి అత్యంత దారుణంగా హత్య చేసినా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఇప్పుడు సాయికృష్ణ కాలిబూడిదైనా మాట్లాడడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేశారని, మంగళగిరిలో ఫ్లెక్సీ కట్టిన నేరానికి కేసు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కాపులను చిన్నచూపు చూస్తున్నారని, అడుగడుగునా అణచివేస్తున్నారని చెప్పారు. ఇప్పుటికై నా రాష్ట్రంలోని కాపులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. కాపులను టీడీపీకి తొత్తుల్లాగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వంగవీటి రంగా వంటి మహనీయుడి వారసత్వాన్ని కొనసాగించే కాపులు ఈ కుట్రలను సాగనివ్వరని తేల్చి చెప్పారు. కాపు నాయకుడు వంగవీటి రంగాను ఆనాడు ఏవిధంగానైతే మట్టుబెట్టారో అదేవిధంగా నేడు కాపు నాయకులను అణచివేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ కేసును సీబీఐ చేత విచారణ జరపాలని, టీడీపీకి చెప్పినట్లు వినే రాష్ట్ర అధికారుల విచారణతో న్యాయం జరగదని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి కాపులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాపులపై పెరిగిన దాడులు: పార్టీ డివిజన్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు విచారణకు తీసుకెళ్లిన సాయికృష్ణ 14 రోజులుగా కనిపించకుండా పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కాపులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని 27 శాతం కాపులు ఏకమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు తోట సాయి నవీన్ మాట్లాడుతూ...లోకేష్ రెడ్బుక్లో జనసేన మీద కక్ష తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఏదైనా ఘోరం జరిగినప్పుడు గతంలో బీహార్తో పోల్చేవారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోలుస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కాపు నాయకుడు ముద్రగడను వేధించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో కాపు నాయకుడు అంబటి రాంబాబును వేధింపులకు గురిచేశారని గుర్తు చేశారు. జిల్లా యువజన జనరల్ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్న మాట్లాడుతూ సాయికృష్ణ తల్లి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న పోలీసులు అందులో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం దుర్మార్గమన్నారు. సాయికృష్ణ తల్లిని మానసికంగా వేధిస్తున్న పోలీసులను డిస్మిస్ చేయాలని కోరారు. సమావేశంలో యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు మలిశెట్టి దేవా, సీనియర్ నాయకులు రాయిని వెంకటరావు, అరిగే మల్లికార్జునరావు, కోవూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
న్యాయం చేయాల్సిందే..
ఒంగోలు టౌన్: రోడ్డు ప్రమాదం జరిగి 30 గంటలు దాటుతున్నా బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు. ఆకలిదప్పులతో మార్చురీ గది బయట రోదిస్తున్నా కనీసం ఓదార్చే దిక్కే లేకుండా పోయింది. బిడ్డను కోల్పోయిన తల్లి, తల్లిని కోల్పోయిన పసిపిల్లలు, భార్యను కోల్పోయిన దివ్యాంగుడైన భర్త.. ఇలా ప్రతి ఒక్కరి రోదనలు మిన్నంటుతున్నా ధైర్యం చెప్పేందుకు ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదు. దీంతో కడుపుమండిన బాధితులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ బుధవారం సాయంత్రం ఒంగోలు జీజీహెచ్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. నిందితుడిని అధికార పార్టీ నాయకులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని, అతడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం నుంచి ఒంగోలుకు వేగంగా వస్తున్న షిఫ్ట్ కారు నగరంలోని దక్షిణ బైపాస్లో వర్మ హోటల్ సమీపంలో బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన నిల్చున్న మహిళలను ఢీకొట్టి, అక్కడి నుంచి ఆగకుండా దూసుకెళ్లి మరో మోటారు బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పాదచారి బుజ్జిబాయి (50), బైకుపై వెళ్తున్న కవిల సజన (20) మరణించారు. సజన చెల్లెలు ఉజ్వలకు పక్కటెముకలు విరిగి, లివర్ దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. నిందితుడిని రక్షించే యత్నం నిందితుడు మద్యం మత్తులో కారు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను ఒక టీడీపీ ప్రజాప్రతినిధికి సమీప బంధువు కావడంతో పాటు రాష్ట్ర మంత్రితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందుకే పోలీసులు కేసును నీరుగార్చి, అతడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని కవిల సజన తల్లి కోటేశ్వరి కన్నీరుమున్నీరయ్యారు. తన చిన్న కూతురు చావుబతుకుల్లో ఉందని, సజన ఇద్దరు కుమార్తెల బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె రోదించారు. పల్నాడు జిల్లాకు చెందిన బుజ్జిబాయి భర్త వెంకటేశ్వర్లు దివ్యాంగుడు. బుజ్జిబాయి సంపాదనతోనే ఆ కుటుంబం గడుస్తోంది. ఆమె మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రమాదం జరిగి రెండు రోజులైనా కేసు నమోదు చేయకపోవడం, పోస్టుమార్టం నిర్వహించకపోవడంపై ఆమె సోదరుడు వెంకటేశ్వర్లు నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తులతో రాజీ యత్నాలు సజన మరణ వార్త తెలిసి చౌటపాలెం నుంచి తరలివచ్చిన గ్రామస్తులు, గిరిజన ప్రజా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు రామావత్ సైదా నాయక్ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఒక టీడీపీ నేత రంగ ప్రవేశం చేసి, శ్రీరోడ్డెక్కితే లాభం లేదు, కూర్చుని మాట్లాడుకుందాంశ్రీ అంటూ రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ నేత బాధితులను జీజీహెచ్ లోపలికి తీసుకెళ్లి పంచాయితీ పెట్టడంతో మూడు గంటల పాటు కొనసాగిన ఆందోళన ముగిసింది. ఇదిలా ఉండగా సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డీ హుసేన్, తంబి శ్రీనివాసులు, మహేష్ తదితరులు బాధితులను పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబ సభ్యుల డిమాండ్ న్యాయం చేయాలంటూ జీజీహెచ్ ఎదుట మెరుపు ధర్నా నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే కేసు నమోదు చేయలేదని ఆగ్రహం మూడు గంటల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ ఇద్దరు మహిళలు మరణించినా కనీసం పరామర్శించని ప్రజాప్రతినిధులు టీడీపీ అనుకూల మధ్యవర్తుల ద్వారా రాజీ యత్నాలు -
గురువారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 2026
బండచాకిరి..భద్రత కిరికిరి గ్రానైట్ క్వారీల్లో ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే భద్రత వారోత్సవాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. నామమాత్రపు ఉత్సవాలు మినహా క్వారీల్లో భద్రత మెరుగుపడటం లేదు.కేజీ రూ.300కి కొనుగోలు చేయాలి పొగాకు గరిష్ట ధర కేజీ రూ.300కు కొనుగోలు చేయాలి. అప్పుడే నష్టాలు రాకుండా ఉండగలం. గరిష్ట ధర పెంచేలా కనిష్ట ధర పడిపోకుండా వేలం కేంద్ర అధికారులు చర్యలు తీసుకోవాలి. వేలం కేంద్రంలో వ్యాపారులు రైతుల వద్ద పోటీపడి పొగాకు కొనుగోలు చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. వేలానికి తీసుకొచ్చే అన్ని బేళ్లను సగటు ధరకు కొనుగోలు చేయాలి. – కిరణ్, పొగాకు రైతు, కొండపి మండలం పొగాకు ధరలు నానాటికీ దిగజారుతున్నాయి. రైతులు ఎన్నో ఆశలతో పొగాకు పంట సాగుచేసి నాణ్యమైన పొగాకు పండించినా తీరా వేలానికి వచ్చేసరికి ధరలు నేలచూపు చూస్తూ పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. పొగాకు వ్యాపారులు కుమ్మకై ్క గిట్టుబాటు ధరలు ఇవ్వకపోగా, నోబిడ్ల పేరుతో అధిక శాతం బేళ్లను తిరస్కరిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కడుపు మండిన రైతులు తరచూ వేలాన్ని అడ్డుకుని నిరసనలు తెలుపుతున్నా వేలం అధికారులు, వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి ఊసేపట్టించుకోవడం లేదు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై రైతులు, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. -
చెరువును మింగిన పచ్చభూచోళ్లు
పామూరు: చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. మట్టి, ఇసుక, మద్యం అక్రమ అమ్మకాలతో పాటు వాగు, వంకలు, చెరువులను కూడా ఆక్రమించి సొమ్ము చేసుకునేందుకు తెగబడుతున్నారు. మండల కేంద్రమైన పామూరులోని కందుకూరు రోడ్డులో గతంలో సర్వే నంబర్ 398లో 6.40 ఎకరాల తొట్టి ప్రాంతంతో కొత్త చెరువును నిర్మించారు. ఈ చెరువు నీటితో భూగర్భ జలాలు పెరగడంతో పాటు, చెరువులో చేపలకు వేలం నిర్వహించడం ద్వారా పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. చెరువులోని పెద్దబావి, ఆర్డబ్ల్యూఎస్ వారు నిర్మించిన బావుల్లో సమృద్ధిగా నీరు ఉండి నీటి ఇక్కట్లు తప్పడంతోపాటు పశువులకు తాగునీరు లభిస్తోంది. అదేవిధంగా చెరువు కింద ఉన్న ఆయకట్టులోని రైతులు ఆరుతడి కింద పంటలు సాగుచేసుకుంటున్నారు. ఇటువంటి చెరువు క్రమేణా ఆక్రమణలకు గురై కొన్నిచోట్ల భనాలు వెలిశాయి. మరికొందరు చెరువు తొట్టిప్రాంతంలో, అలుగు సమీపంలో లేఅవుట్లు వేసి స్థలాలను రూ.లక్షలకు అమ్ముకుని జేబులు నింపుకున్నారు. 86.40 ఎకరాల చెరువుతొట్టి ప్రాంతం క్రమేణా ఆక్రమణలకు గురై ప్రస్తుతం సుమారు 20 నుంచి 40 ఎకరాల లోపు మాత్రమే మిగిలిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల కొందరు అధికార టీడీపీ నాయకులు చెరువు మధ్యలో కట్టవేసి అవతలి ప్రాంతం తమదేనని చెబుతూ ఆక్రమణలకు తెగబడ్డారు. ఈవిషయం తెలిసిన ఇరిగేషన్ అధికారులు చెరువును సందర్శించడంతో పాటు ఆక్రమణల పనులను తాత్కాలికంగా ఆపేశారు. చెరువు నుంచి తూముల ద్వారా నీరు పొలాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కాల్వలను సైతం పూడ్చేస్తున్నారు. చెరువు కోసం కేటాయించిన భూమిని సర్వేచేసి హద్దురాళ్లు వేయకపోతే మిగిలిన భూమి కూడా ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందని, భవిష్యత్లో పామూరుకు నీటి ఇక్కట్లు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పామూరులో జరిగిన ప్రత్యేక ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో సీపీఎం నాయకులు, పట్టణ ప్రజలు చెరువు ఆక్రమణలను తొలగించి చెరువును కాపాడాలని వినతిపత్రం అందజేశారు. -
పొగజూరిన ఆశలు
పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి... పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని రైతులను ఆదుకోవాలి. గిట్టుబాటు ధర లేక పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. అప్పులు తీర్చలేక కష్టాల్లో కౌలు, సన్న, చిన్నకారు రైతులు విలవిల్లాడుతున్నారు. వ్యవసాయ రంగం కుదేలైపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. రైతుల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంది. తద్వారా ప్రభుత్వ ఆదాయంపైన కూడా దీని ప్రభావం పడుతుంది. వైఎస్ జగన్ మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాపారులకు పోటీగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ మార్క్ఫెడ్ను రంగంలోకి దింపి దాదాపు రూ.300 కోట్లకు పైగా వెచ్చించారు. అదేపనిని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది. – ఎంవీఎస్ నాగిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ రబీ సాగులో పొగాకు అమ్మకం ధర దారుణంగా ఉంది. 2023–24 మార్కెటింగ్ సీజన్కి 215.35 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అయితే సరాసరి అమ్మకం ధర కేజీకి రూ.288.65 గా ఉంది. గత సంవత్సరం 2024–25 లో 240.64 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి అయితే కిలో సరాసరి అమ్మకం ధర మాత్రం రూ.248.86 కు పడిపోయింది. 2025–26 రబీ సీజన్కు తీసుకుంటే సాగు విస్తీర్ణం గత సంవత్సరం 1.20 లక్షల హెక్టార్లు అయితే ఈ ఏడాది 1.17 లక్షల హెక్టార్లు మాత్రమే ఉంది. మూడో ముందస్తు అంచనా ప్రకారం హెక్టారు సరాసరి దిగుబడి 2221 కిలోలు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తి అంచనా సుమారు 260 మిలియన్ కేజీలు రావాలి. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి రాష్ట్రం మొత్తం సరాసరి అమ్మకం ధర కిలోకి రూ.237.21 కి పడిపోయింది. అదే ఈనెల 1వ తేదీకి రూ.235.63కు పడిపోయింది. 9వ తేదీ నాటికి రూ.232 కి మరింత తగ్గింది. ఈనెల 11వ తేదీ నాటికి మొత్తం సరాసరి అమ్మకం ధర రూ.230.58 మాత్రమే. ఈ సంవత్సరం ఉత్పత్తి అంచనా సుమారు 265 మిలియన్ కేజీలు అయితే ఎస్ఎల్ఎస్లో ఇప్పటి వరకు 93.05 లక్షల కేజీలు, ఎస్బీఎస్లో 66.75 లక్షల కేజీలు మాత్రమే అమ్మకాలు జరిగాయి. దక్షిణాదిలో పరిస్థితి దారుణం... అందులోనూ ఒంగోలు దక్షిణాది నల్ల నేలల్లో జూన్ మొదటి వారం నాటికి సరాసరి ధర రూ.224.45, 9వ తేదీ నాటికి రూ.221.57 పడిపోయింది. అదే 12వ తేదీ సరాసరి అమ్మకం ధర రూ.200.41 కాగా కనిష్ట ధర రూ.160. గరిష్ట ధర రూ.250 దాటలేదు. దక్షిణాది తేలిక నెలల్లో ఈనెల 1వ తేదీ నాటికి రూ.231.02, 9వ తేదీకి రూ.228.39 కు సరాసరి ధర పడిపోయింది. అదే 12వ తేదీన సరాసరి అమ్మకం ధర రూ.211.04, కనిష్ట అమ్మకం ధర రూ.160 కాగా, గరిష్ట అమ్మకం ధర రూ.250, దక్షిణాది నల్ల నేలల (ఎస్బీఎస్) పరిధిలోకి వచ్చే ఒంగోలు 1, ఒంగోలు 2, టంగుటూరు 1, కొండపి, వెల్లంపల్లి వేలం కేంద్రాల్లో 12వ తేదీన సరాసరి తిరస్కరణ బేళ్లు 21.37 శాతంగా ఉన్నాయి. దక్షిణాది తేలిక నెలలు (ఎస్ఎల్ఎస్) పొదిలి–1, కనిగిరి, కందుకూరు–1, కందుకూరు–2, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో తిరస్కరించిన బేళ్లు 12వ తేదీ నాటికి 21.81 శాతంగా ఉంది. ఉత్తరాదిలోనూ అదే పరిస్థితి... ఉత్తరాది తేలిక నేలల్లో ఈనెల 1వ తేదీ వరకు సరాసరి ధర రూ.260.29 గా ఉంది. అదే 9వ తేదీ నాటికి రూ.257.91. 12వ తేదీన రూ.255.98 దిగజారింది. 2023–24 ధర రూ.288.65 పోలిస్తే 11వ తేదీ వరకు రైతులు సరాసరిన కిలోకు రూ.32.67 నష్టపోతున్నారు. దీనికి పెరిగిన ఉత్పత్తి వ్యయం సంవత్సరానికి కిలోకు కనీసం రూ.10 చొప్పున రెండు సంవత్సరాలకు కలిపి రూ.20 అదనపు నష్టం రైతులు భరిస్తున్నారు. ఉత్తరాది తేలిక నేలలు (ఎన్ఎల్ఎస్) దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2, కొయ్యలగూడెం, గోపాలపురంలలో తిరస్కరించిన బేళ్లు అలానే ఉన్నాయి. ఇలా తిరస్కరించిన బేళ్లను వెనక్కి తీసుకెళ్లడానికి బేలుకు రూ.2 వేలు అదనంగా ఖర్చవుతుంది. గ్రామీణ వ్యవసాయ రంగం కుదేలు: గ్రామీణ వ్యవసాయ రంగం క్రమంగా కుదేలవుతోంది. అత్యధిక శాతం కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లోకి బలవంతంగా నెట్టబడుతున్నారు. రుణాలు తెచ్చి సాగుచేసినా పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకుని వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలపై దృష్టి సారించాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పొగాకు ధరలు నానాటికీ దిగజారుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి నిరసనగా ఈ నెల 19న ఒంగోలులో పొగాకు రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లుచరిత్రలో మొట్ట మొదటి సారిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పొగాకును కూడా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొగాకు రైతుల కోసం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేశారు. మార్కెట్లో పోటీ పెరిగి ఆ మూడు, నాలుగు సంవత్సరాలు రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రైతు ఎంతో సంతోషపడ్డాడు. రైతు లోగిళ్లు కళకళలాడాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రయత్నం ఎందుకు చెయ్యటం లేదో అర్థం కావటం లేదు. మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చి కూడా అమ్మకం ధరలు కుప్పకూలి రైతు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాడు. మొత్తంగా తగ్గిపోతున్న సరాసరి ధర... ఈ మూడు సీజన్ల పొగాకు అమ్మకం ధరలను పరిశీలిస్తే... 2023–24 మొత్తం సరాసరి అమ్మకం ధర కేజీ రూ.288.65. 2024–25లో మొత్తం సరాసరి అమ్మకం ధర కేజీ రూ.248.86. ఈనెల 1వతేదీ వరకు సరాసరి అమ్మకం ధర రూ.235.63. ఈనెల 9వ తేదీ నాటికి రూ.232. 11వ తేదీ నాటికి సరాసరి అమ్మకం ధర రూ.230.58.కానీ 12 వతేదీ ఒక్క రోజు మొత్తం సరాసరి అమ్మకం ధర కిలో రూ.211 మాత్రమే. ఇది ఇంకా ఎంత తగ్గుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రోజు రోజుకీ సరాసరి అమ్మకం ధర పడిపోతూ తీవ్ర సంక్షోభాన్ని తెలియజేస్తోంది. ఒంగోలు సబర్బన్: వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఒంగోలు నగరంలో శుక్రవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ప్రకాశం జిల్లా కమిటీ అధ్యక్షుడు చుండూరు రంగారావు తెలిపారు. జూన్ 19న ఒంగోలులో జరిగే ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని ఆయన పొగాకు రైతులను, రైతు నాయకులను కోరారు. ఒంగోలు దక్షిణ బైపాస్లోని పొగాకు బోర్డు కార్యాలయం, మినీస్టేడియం నుంచి ట్రాక్టర్ ర్యాలీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. -
బూచేపల్లి కమలాకర్రెడ్డికి ఘన నివాళి
చీమకుర్తి: సినీ నటుడు, నిర్మాత బూచేపల్లి కమలాకర్రెడ్డి జయంతి వేడుకలను బుధవారం చీమకుర్తిలో ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కమలాకర్రెడ్డి సోదరుడు, దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాదరెడ్డి, తల్లి, జెడ్పీ చైర్పర్సన్ వెంకాయమ్మ, కమలాకర్రెడ్డి కుమారుడు రిలాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరుగు నాగార్జున హాజరై కమలాకర్రెడ్డి స్మారకం వద్ద నివాళులర్పించారు. కమలాకర్రెడ్డి పార్కులో ఆయన స్మారకాన్ని పుష్పాలతో అలంకరించి, గజమాలలతో నివాళులర్పించి, కేక్ కట్ చేశారు. ఈ సంద ర్భంగా ఆయనతో ఉన్న జ్ఞాపకాలను బూచేపల్లి కు టుంబ సభ్యులు నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ, రూరల్ అధ్యక్షులు క్రిష్టిపాటి శేఖరరెడ్డి, పమిడి వెంకటేశ్వర్లు, దుంపా చెంచిరెడ్డి, చిన్నపురెడ్డి మస్తాన్రెడ్డి, రామసాని పూర్ణచంద్రరావు, బీమన వెంకట్రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
రీ సర్వేని పారదర్శకంగా నిర్వహించాలి
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): భూముల రీ సర్వేని రైతుల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలని కర్నూలు రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సంతనూతలపాడు మండలం మైనంపాడులో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని బుధవారం వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. రీ సర్వే ప్రక్రియపై స్థానిక రైతులతో వెంకటేశ్వరరావు సమీక్షించారు. రైతుల సమక్షంలో పక్కాగా రీ సర్వే జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈకేవైసీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏ ఒక్క రైతూ ఇబ్బందిపడకూడదన్నారు. నెట్వర్క్ సమస్య ఉంటే ఇతర మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ ఆధ్వర్యంలో సరిహద్దు వివాదాలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ గౌస్ బాషా, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి రమణ, జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పరిశుద్ధరావు, సంతనూతలపాడు తహసీల్దార్ నారాయణరెడ్డి, మండల సర్వేయర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు రీజినల్ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు పరిశీలించిన రాష్ట్ర, జిల్లా అధికారుల బృందం -
కోడి పందెం శిబిరంపై పోలీసుల దాడి
● 8 మంది అరెస్ట్ కందుకూరు రూరల్: మండలంలోని పలుకూరు గ్రామ పొలాల్లో కోడి పందెం శిబిరంపై బుధ వారం పోలీసులు దాడి చేశారు. టాస్క్ఫోర్స్ ఇన్చార్జ్ సీఐ కమలాకర్ ఆధ్వర్యంలో ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది కలిసి దాడి చేసి కోడి పందెం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మూడు కోళ్లు, మూడు సెల్ఫోన్లు, మూడు మోటార్ బైకులు, రూ.10,050 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులపై తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. జరుగుమల్లి: ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం తెల్లవారుజామున జరుగుమల్లి మండల పరిధిలోని పాలేరు బ్రిడ్జి వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. కొండపి మండలం కె.ఉప్పలపాడుకు చెందిన కూనం శివారెడ్డి (32) రాత్రి ఒంటిగంట సమయంలో ఒంగోలు వైపు వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన శివారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ఎస్సై పి.భాగ్యరాజ్, హైవే పెట్రోలింగ్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు జీజీహెచ్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సింగరాయకొండ: స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనం, రిజర్వేషన్ల శాతంపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక కమిషన్ బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అర్జీలు స్వీకరించింది. బీసీ డెడికేషన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిషన్కు వినతిపత్రాలు సమర్పించి, తమకు జరుగుతున్న అన్యాయాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలజ్యోతి, డీఎల్డీఓ సువార్తమ్మ, డిప్యూటీ సీఈఓ బాలమ్మ, ఒంగోలు డీఎల్పీఓ పద్మ, తహశీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జయమణి తదితర అధికారులు పాల్గొన్నారు. -
దిగజారిన నిమ్మ ధర
హనుమంతునిపాడు: నిమ్మ సాగు చేస్తున్న రైతులు ధరల పతనం కారణంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో నాణ్యతను బట్టి కిలో రూ.100 నుంచి రూ.120 వరకు పలికిన ధర, మే నెల నుంచి అమాంతం పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.10 నుంచి రూ.15కు చేరడంతో రైతులు పెట్టుబడి కూడా రాక లబోదిబోమంటున్నారు. బహిరంగ మార్కెట్లో రెండు నిమ్మకాయలు రూ.10కి అమ్ముతున్నా, కనిగిరి వ్యాపారులు కుమ్మకై ్క రైతులకు మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కాపురం జిల్లాలో నిమ్మ సాగుకు పెట్టింది పేరైన హనుమంతునిపాడు, కనిగిరి, వెలిగండ్ల, సీఎస్ పురం, కొనకనమిట్ల మండలాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కూలీల ఖర్చులు కూడా రాకపోవడంతో కాయలు కోసేందుకు కౌలు రైతులు వెనుకాడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిమ్మకు మద్దతు ధర కల్పించి, నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. -
కట్టలుతెగిన భూదాహం
జరుగుమల్లి (సింగరాయకొండ): టీడీపీ నాయకుడు తమకు ఇష్టం వచ్చినట్లు చెరువుకట్టను ధ్వంసం చేసి మట్టిని తరలిస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవటంతో చివరకు ఆయకట్టు రైతులే నడుం బిగించి తవ్వకాలను అడ్డుకున్నారు. ఈ ఘటన జరుగుమల్లి గ్రామ పంచాయతీలోని పంగులూరివారిపాలెం గ్రామంలోని నేతివారికుంట చెరువు వద్ద బుధవారం జరిగింది. వివరాల ప్రకారం పంగులూరివారిపాలెంలోని నేతివారికుంట చెరువు కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులు పొగాకు, శనగ పంటలతో పాటు జామాయిల్ సాగు చేస్తుంటారు. ఈ చెరువులో ఎప్పుడూ నీరు సమృద్ధిగా ఉంటుందని నీటి ఎద్దడి సమస్య తలెత్తలేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు కట్టలు ధ్వంసం: మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తన ఇంటి అవసరాల కోసం చెరువు మట్టిని ట్రాక్టరు, జేసీబీల ద్వారా తరలించాడు. రైతులు కూడా చెరువులో మట్టిని తీసుకుని పోవాలే తప్ప చెరువు కట్టలు ధ్వంసం చేయవద్దని సూచించారు. కానీ సదరు టీడీపీ నాయకుడు మాత్రం చెరువు కట్టను ధ్వంసం చేసి మరీ మట్టిని తరలించాడు. దీనిపై రైతులు తహశీల్దార్ వెంకటేశ్వర్లు కు సమస్యను వివరించి చెరువు కట్టను కాపాడాలని కోరారు. కానీ ఆయన ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన సమస్య అని మీరు ఆ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. ఒక పక్క చెరువు కింద ఆయకట్టు పొలాలకు నీటితీరువా పన్ను కట్టించుకుంటూ మాకు సంబంధం లేదని తహశీల్దార్ ఎలా చెబుతారని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న అధికారి బాధ్యతా రాహిత్యంగా అధికార పార్టీ నాయకులకు అండగా ఎలా ప్రవర్తిస్తారని రైతులు విమర్శిస్తున్నారు. నాలుగు రోజులుగా చెరువు కట్ట ధ్వంసం చేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు, మైనింగ్, గ్రామపంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప అక్రమాన్ని అడ్డుకోవటం లేదని ఆరోపిస్తున్నారు. చివరికి బుధవారం ఆయకట్టు రైతులు మూకుమ్మడిగా వచ్చి అక్రమాన్ని అడ్డుకుని జేసీబీని అక్కడి నుంచి పంపించేశారు. చెరువు కట్టలు ధ్వంసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆయకట్టు రైతులు తెగేసి చెబుతున్నారు. నేతివారికుంట చెరువు కట్టలను ధ్వంసం చేయటాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, ఈఈ శివరాం ప్రసాద్ దృష్టికి తీసుళ్లారు. దీంతో గురువారం ఏఈ రవికుమార్ ని పంపించి సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
వేలం పాటల ఆదాయం రూ.13.77 లక్షలు
సింగరాయకొండ: పాత సింగరాయకొండ వరాహలక్ష్మీ నరశింహస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయానికి వేలం పాటల ద్వారా రూ.13.77 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన ఈఓ పీ కృష్ణవేణి తెలిపారు. జెయింట్ వీల్ ద్వారా రూ.12.25 లక్షలు, కొబ్బరికాయలు అమ్ముకొనేందుకు రూ.1.52 లక్షలు వేలం నిర్వహించినట్లు ఆమె వివరించారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యన్నారాయణ, అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీనరశింహాచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరశింహాచార్యులు, సిబ్బంది బ్రహ్మయ్య, దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మార్కాపురం: మార్కాపురం జిల్లా ఇన్చార్జి డ్వామా పీడీగా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ విజయసునీతను కలిశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతరావు గతంలో మార్కా పురం ఎంపీడీఓగా విధులు నిర్వర్తించారు. ● మంత్రి రామానాయుడు పెద్దదోర్నాల: నల్లమల సాగర్ను నింపటమే లక్ష్యంగా వెలుగొండ ప్రాజెక్టు పనులు జరుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ పనులతో పాటు, ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను ఆయన పరిశీలించారు. వెలుగొండ ప్రాజెక్టులో హెడ్ రెగ్యులేటర్లు రిటైనింగ్ వాల్, వింగ్స్ రిటర్న్ పనులతో పాటు, టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలలో ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజి పరిహారాన్ని అందిస్తామన్నారు. ఆయన వెంట కలెక్టర్ ఎం.విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, సీఈ. రమేష్, ఎస్ఈ అబూతాలిం తదితరులు పాల్గొన్నారు. -
మాట్లాడదామని పిలిచి.. మహిళపై కత్తితో దాడి
అర్ధవీడు: ‘సమస్యేదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందాం రండి’ అంటూ నమ్మించి పిలిచి.. ఒక మహిళపై కత్తితో ఘాతుకానికి తెగబడిన సంఘటన అర్ధవీడు మండల పరిధిలోని మాగుటూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త, వైఎస్సార్ సీపీ బీఎల్ఏ యాబాకుల వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం యాబాకుల రజిత (38) ఇంటి ముందర శుభ్రం చేసి నీళ్లు చల్లుతుండగా, పక్కనే ఉండే ఓబినేని వెంకటలక్షమ్మతో చిన్నపాటి వివాదం జరిగింది. అనంతరం రజిత, వెంకటేశ్వరుర్లు ఉపాధి హామీ పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో నాలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ‘సమస్య పరిష్కరించుకుందాం రండి’ అని వారిని తన ఇంట్లోకి పిలిచాడు. రజిత ఇంట్లోకి వెళ్లగానే ముందస్తు పథకం ప్రకారం తలుపులు వేశారు. ఆమె భర్త వెంకటేశ్వర్లు లోపలికి రాకుండా వరండా ఐరన్ గ్రిల్స్ మూసివేశారు. అదే సమయంలో ఇంట్లో మాటు వేసిన ఓబినేని ప్రవీణ్కుమార్, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మ ఒక్కసారిగా రజితపై దాడికి పాల్పడ్డారు. కత్తితో ఆమె వీపు, మెడ భాగాలపై నాలుగు సార్లు విచక్షణారహితంగా పొడిచారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన రజిత భర్తతోపాటు గిద్దలూరు సరోజ అనే మహిళను సైతం నిందితులు గాయపరిచారు. తీవ్రంగా గాయపడిన రజితను స్థానికులు 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని అర్ధవీడు పోలీసులు పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓబినేని ప్రవీణ్కుమార్, కేసనపల్లి వెంకటేశ్వర్లు, సుబ్బారావు, వెంకటలక్షమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడ్డుకోబోయిన భర్త, మరో మహిళకు గాయాలు నలుగురు నిందితులపై కేసు నమోదు -
అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: స్పీడ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ పేరుతో ఎకరా భూమి 99 పైసలకే ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మాత్రం నిధులు లేవని ఒట్టి చేతులు చూపుతోందని, లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తోందని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ తీవ్రంగా విమర్శించారు. అంగన్వాడీల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూలై 10వ తేదీన చలో కలెక్టరేట్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో అంగన్వాడీ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సీహెచ్ ఇంద్రావతి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అంగన్వాడీలకు 42 రోజుల సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని చెప్పారు. మినీలను మెయిన్ చేయడం యూనియన్ ఫలితంగానే జరిగిందన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు గ్రాట్యూటీని ఏపీలో కూడా ఇవ్వాలని, ఈ విషయం గురించి మార్చిలో చలో విజయవాడ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 5 సంవత్సరాల్లోపు చిన్నారులను ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చుకోకుండా జీఓ ఇవ్వాలని, ప్రీ స్కూల్ సక్రమంగా అమలయ్యేలా అంగన్వాడీలకు ఇతర పనులు అప్పగించరాదని కోరారు. రకరకాల యాప్లతో అంగన్వాడీలపై ఒత్తిడి పెంచడం వలన అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 10వ తేదీన జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జాయింట్ మీటింగ్ వేయమని కోరుతున్నా వేయకపోవడం దారుణమన్నారు. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని చెప్పారు. ఐవీఆర్ కాల్స్కు ప్రజలు ఫోన్ ఎత్తక పోయినా, ప్రభుత్వానికి అనుకూలంగా మెసేజ్ ఇవ్వకపోయినా అంగన్వాడీలకు మెమోలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ ఫోన్లను ప్రజలు రిసీవ్ చేయకపోతే దానికి అంగన్వాడీలు ఎలా బాధ్యులవుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలను వేధించడం మానుకోవాలని కోరారు. సమావేశంలో ధనలక్ష్మి, హేమిమా, క్రాంతి కుమారి, చిన్నమ్మాయి పాల్గొన్నారు. -
పటిష్టంగా నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు
● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జేసీ కల్పనా కుమారి ఒంగోలు సబర్బన్: నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి అధికారులను ఆదేశించారు. ఈ నెల 21వ తేదీ ఒంగోలు నగరంలో నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష జరగనున్న నేపథ్యంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అందుకుగాను చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నీట్ మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం ఆరు కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. పీఎం శ్రీ కేంద్రియ విద్యాలయం, డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, పీఎం జవహర్ నవోదయ విద్యాలయం, డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలుర హైస్కూల్లో జరగనున్నట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి మాధురి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
ట్రావెల్స్ బస్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్
● 8 మందికి గాయాలు గుడ్లూరు: హైవే మార్జిన్ వెంట నిలిపి ఉంచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన 16వ నంబరు జాతీయ రహదారిపై గుడ్లూరు మండలం శాంతినగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి నాగూర్(నాగపట్నం) వైపు వెళ్తున్న భార్గవి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శాంతినగర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉంది. అదే సమయంలో విజయవాడ నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకొచ్చి, ఆగి ఉన్న ప్రైవేట్ బస్సును వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రైవేట్ బస్సు రోడ్డు పక్కనే ఉన్న జామాయిల్ తోటలోకి దూసుకెళ్లింది. ప్రమాదం ధాటికి ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు భయాందోళనకు గురై కేకలు వేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు ఎస్సై తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు. ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్న గడికోట ధనలక్ష్మి, జనసూత్రపు రాజేశ్వరి, తుమ్మలపల్లి రేష్మా, కోరా రాధమ్మ, కోడలూరు నాగమణి, దుక్కపాటి మార్తమ్మ, బెల్లం జయరాం, కోడూరు సుబ్బారావు సహా మొత్తం ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనాల్లో కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
సర్ సర్వేలో ఏకపక్షంగా బీఎల్ఓలు
మార్కాపురం టౌన్: సర్ సర్వేలో కొందరు బీఎల్ఓలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఈనెల 15 నుంచి ప్రారంభమైన సర్ కార్యక్రమంలో మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో బీఎల్ఓ మొదటి రోజైన సోమవారం అధికార పార్టీ నాయకులకు మాత్రమే ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఈ విషయాన్ని మాజీ వైస్ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత బాలయ్య అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి గ్రామస్తుల్లో కొందరికి ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చారు. ఇక గజ్జలకొండ, గొట్టిపడియ, నాగులవరం గ్రామాల్లో కూడా పూర్తి స్థాయిలో బీఎల్ఓలు ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు. ఎన్యుమరేషన్ పూర్తిచేసే ఫారంలో, 2002, 2025 ఓటర్ల జాబితా సవరణ చూసి ఫారం నింపే సమయంలో ఎటువంటి ఫారాలు బీఎల్ఓకు అందజేయాలనే విషయంలో కూడా పలు చోట్ల గందరగోళం నెలకొంది. ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తిచేసి బీఎల్ఓకు ఇచ్చిన తరువాత ఓటరుకు అక్నాలెడ్జ్మెంటు స్లిప్ ఇచ్చే విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో ఓటర్లకు, బీఎల్ఓలకు మధ్య వాదనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పలువురు బీఎల్ఓలు తమకు కేటాయించిన గ్రామాల్లో ముందుగా అధికార పార్టీ నేతల వద్దకు వెళ్లి వారిని తీసుకుని ఓటర్ల ఇంటి వద్దకు వెళ్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘సర్’ పట్ల కొరవడిన అవగాహన ● మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పొదిలి: ఓటర్ల పూర్తి స్థాయి ప్రక్షాళనకు సంబంధించి సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీఎల్ఓలు, బీఎల్ఏలు, ఓటర్లలో పూర్తి స్థాయి అవగాహన కొరవడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం ఇన్చార్జ్ అన్నా రాంబాబు అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సర్ పట్ల పూర్తి స్థాయి అవగాహన, విస్తృత స్థాయి ప్రచారం కల్పించాలని కోరారు. మార్కాపురం నియోజకవర్గంలో 257 మంది బీఎల్ఓలు ఉన్నారని, అయితే వారిలో కొందరు అవగాహన లోపించి పలు రకాలుగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో బీఎల్ఏలలో ఓటర్లలో అయోమయం నెలకొందన్నారు. ఇప్పుడిప్పుడే ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, బాలారిష్టాలు అనే విధంగా వ్యవహారం ఉన్నా, గడువు తీరితే ఇబ్బంది వస్తుందన్నారు. సర్ ప్రక్రియకు సంబంధించి కమిషన్ ఆదేశాలను ఏకరూపంగా అనుసరించటం ద్వారా ఎవరికీ సమస్య లేకుండా ఉంటుందన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు కొంత మంది బీఎల్ఓలు నింపడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఫారం నింపటం మాకు సంబంధం లేదని బీఎల్ఓలు కొందరు సమాధానం చెబుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారికి ఎన్యుమరేషన్ ఫారాలు నింపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఐడీ కార్డులు ఎవరి ఇష్టానుసారం వారు అడుగుతున్నారని, ఏ కేటగిరీకి ఎన్ని ఐడీ కార్డులు ప్రూఫులు అవసరమో అన్ని మాత్రమే తీసుకునేలా బీఎల్ఓలకు ఆదేశాలివ్వాలన్నారు. రిసిప్టులు ఇవ్వకుండా, రెండు ఫారాలు బీఎల్ఓలే స్వాధీనం చేసుకుంటున్నారని, అలాంటప్పుడు ఓటర్ల వద్ద ఆధారం ఏమీ ఉండదు కదా అని ఆయన ప్రశ్నించారు. రసీదులు ఇచ్చేలా బీఎల్ఓలకు సూచనలు ఇవ్వాలన్నారు. మరి కొందరు బీఎల్ఓలు కార్యాలయానికి వచ్చి అవసరమైన ఫారాలు తీసుకెళ్లాలని చెబుతున్నారని, అలా కార్యాలయాలకు వెళ్లాలంటే ఓటర్లకు, బీఎల్ఏలకు సమస్యగా మారుతుందని చెప్పారు. దీంతో ప్రక్రియ వేగవంతం తగ్గుతుందన్నారు. అధికారులైనా, బీఎల్ఓలైనా బీఎల్ఏలను అందరినీ ఒకే రకంగా చూడాలని, బీఎల్ఏలకు వచ్చే అనుమానాల నివృత్తి కోసం, సంబంధిత అధికారి ఫోన్ నంబర్ ఏదైనా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
దివి వర్సెస్ ఇంటూరి నువ్వా..నేనా.!
కందుకూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వర్గ విభేదాలు ఎప్పటికప్పుడు బహిర్గతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం వర్గాల మధ్య అంతర్గత పోరు మరోసారి చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చిన శివరాం, తిరిగి మరోసారి అదే స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో ఇంటూరి నాగేశ్వరరావుకి చెక్ పెట్టాలనే వ్యూహంతో తెరవెనుక పావులు కదుపుతూనే సీనియర్లను అవమానిస్తున్నారంటూ బహిరంగంగానే ప్రకటించారు. అదే సందర్భంలో మాజీ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఎమ్మెల్యే ఇంటూరి వర్గం కూడా అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం. కందుకూరు: తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంకు మధ్య అంతర్గత పోరు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. వారి మధ్య ఎన్నికల ముందు నుంచే విభేదాలున్నాయి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతకాలం మౌనంగా ఉన్న శివరాం తిరిగి ఇటీవల కాలంలో ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా దూకుడు పెంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కందుకూరు పట్టణంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు చిరకాలం గుర్తుండిపోయే అభివృద్ధి పనులు నియోజకవర్గంలో చేశారని, దశాబ్దాల పాటు అభివృద్ధి చేస్తేనే ప్రస్తుతం పట్టణంలో కొంత మార్పు కనిపిస్తోందన్నారు. తన తండ్రి దివి కొండయ్యచౌదరి, మానుగుంట ఆదినారాయణరెడ్డి, మహీధర్రెడ్డి, తాను గతంలో చేసిన అభివృద్ధి పనులు గుర్తు లేవా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు మొత్తం అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆరోపించారు. నలుగురు వైఎస్సార్ సీపీ వాళ్లను పార్టీలో చేర్చుకుని అదే బలం అనుకుంటే పొరపాటు అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని గుర్తించాలంటూ ప్రత్యక్షంగానే ఎమ్మెల్యే వ్యవహార శైలిని తప్పుపట్టారు. అలాగే నియోజకవర్గంలో గంజాయి విక్రయాలపై కూడా పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ ప్రకటించారు. ఇలా ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే ఇంటూరి తీరుపై మాజీ ఎమ్మెల్యే ఫైర్ అవుతూనే ఉన్నారు. అసంతృప్త నాయకులు, కార్యకర్తలను కూడగట్టేందుకు జోరుగా ప్రయత్నాలు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత సరైన గుర్తింపు లేకపోవడం, కాంట్రాక్టు పనులు, పదవుల్లో ప్రాధాన్యత దక్కకపోవడం, ఎమ్మెల్యే వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ పార్టీకి కొంత దూరంగా ఉన్న నాయకులు, కార్యకర్తలను తనవైపు తిప్పుకునేందుకు దివి శివరాం కొంత కాలంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీనికి అనుగుణంగా పార్టీలో ప్రాధాన్యత లేని నాయకులు శివరాం దగ్గరకి రావాలంటూ ఆయన వర్గం వాట్స్యాప్ గ్రూపుల్లో ప్రకటించడం గమనార్హం. అదే సందర్భంలో అసంతృప్త నాయకుల కోసం ఓ గ్రూపును కూడా క్రియేట్ చేశామంటూ చెప్తున్నారు. అందరూ కలిసి వస్తే శివరాం ఆధ్వర్యంలో పార్టీ అధిష్టానాన్ని కలిసి బాధలు చెప్పుకుందామని, నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితిని పెద్దలకు చెప్పుకుందామంటూ సమీకరించే పనిలో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం అధికార పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. శివరాంపై అధిష్టానానికి ఫిర్యాదులు అదే సందర్భంలో శివరాం ప్రయత్నాలకు చెక్పెట్టే పనిలో ఎమ్మెల్యే ఇంటూరి వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు, పార్టీలో విభేదాలు సృష్టించేలా శివరాం వ్యవహరిస్తున్నారంటూ పార్టీ అధిష్టానానికి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు పంపుతున్నట్లు సమాచారం. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎటువంటి చర్యలు లేవనే చెప్పాలి. ఇలా పార్టీలో రెండు వర్గాల ఆధిపత్య పోరుతో ప్రస్తుతం అధికార పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు నియోజకవర్గంలో పెద్ద చర్చనీయాంశమవుతున్నాయి. తెరవెనుక రాజకీయ వ్యూహం... ఇటీవల కాలంలో శివరాం పార్టీలో తన స్పీడ్ పెంచడం పట్ల భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందని ఆ వర్గం చెప్పుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి టికెట్ దక్కకుండా చేయడంతో పాటు, తన సోదరుడైన దివి రవీంద్రనాఽథ్ని ఎన్నికల బరిలో దింపేందుకు ఇప్పటి నుంచి తెరవెనుక పావులు కదుపుతున్నారు. ఈ మేరకు ఇటీవల రవీంద్రనాఽథ్ పట్టణంలో సొంత ఇంటిని నిర్మించుకోవడం, ఇక నుంచి తాను ఇక్కడే ఉంటానని ప్రకటించడం చర్చనీయాంశమైంది. కోల్పోయిన దివి వంశ ప్రాబల్యాన్ని మళ్లీ నిలబెట్టాలనే పట్టుదలలో భాగంగా శివరాం తెరవెనుక కథ నడుపుతున్నారు. అందుకు అనుగుణంగా ఇటీవల కాలంలో నియోజకవర్గంలో శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు తన సోదరుడు రవీంద్రనాఽథ్ను వెంటబెట్టుకుని శివరాం తిరుగుతున్నారు. అంటే పార్టీలో కార్యకర్తలు, నాయకులకు తన సోదరుడిని పరిచయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదటి నుంచి తన వెంట వర్గాన్ని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ఈ సీనియర్ నాయకుడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో వేచిచూడాల్సిందే. -
ఈదురుగాలుల బీభత్సం..
మార్కాపురం రూరల్/కొండపి/యర్రగొండపాలెం: : మార్కాపురం, కొండపి మండలాల్లో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం నుంచి ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు సాయంత్రం కురిసిన వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలుల కారణంగా పలుచోట్ల భారీ నష్టం వాటిల్లింది. మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వీచిన బలమైన గాలులకు చెట్లు నేలకూలాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులే స్వచ్ఛందంగా శ్రమించి చెట్లను తొలగించారు. వర్షం ధాటికి తక్కువ వ్యవధిలోనే రహదారులు జలమయమయ్యాయి. ఇంటిపై పడ్డ చెట్టు.. తప్పిన ప్రమాదం కొండపి, పొన్నలూరు మండలాల్లో ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. కోయవారిపాలెం గ్రామంలో మోస్తరు వర్షం కురిసింది. భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడ్డాయి. ఓ చెట్టు ఇంటిపై పడగా, ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.యర్రగొండపాలెంలోని త్రిపురాంతకం రోడ్లోని బీసీ కాలనీ సమీపంలో చెట్టు విరిగి తీగలపై పడటంతో దాదాపు 3గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు ఏఈ కిషోర్ తెలిపారు. నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు -
జవహర్ నవోదయ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
మార్కాపురం టౌన్: మార్కాపురం లోని జవహర్ నవోదయ విద్యాలయ–2లో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లకోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. పదో తరగతిలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని, సైన్సు, గణితం సబ్జెక్టులు ఎంచుకోదలచిన విద్యార్థులు ఆయా సబ్జెక్టులో 60 శాతం మార్కులు కలిగి ఉండాలని తెలిపారు. పూర్తిచేసిన దరఖాస్తులను ఈనెల 25వ లోపు నవోదయ కార్యాలయం పనిచేసే సమయాల్లో అందించాలన్నారు. ● ఇద్దరు విద్యార్థులు డీబార్ ఒంగోలు టౌన్: ఆంధ్ర కేసరి విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం లా పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, దర్శి, మార్కాపురంలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశారు. మూడు సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు గాను 760 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా వారిలో 725 మంది హాజరయ్యారు. 35 మంది గైర్హాజరయ్యారని యూనివర్శిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ జి.సోమశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 5 సంవత్సరాల ఎల్ఎల్బీకి సంబంధించి రెండు, ఆరు సెమిస్టర్లకు 170 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 156 మంది పరీక్షలకు హాజరయ్యారని, మిగిలిన 14 మంది గైర్హాజరయ్యారని వివరించారు. ఎల్ఎల్ఎం రెండో సెమిస్టర్ పరీక్షలకు 46 మందికి గాను 42 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి గాను పరీక్ష కేంద్రాల్లో యూనివర్శిటీ పరీశీలకులను, తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యూనివర్శిటీ తనిఖీ బృందం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఇద్దరు విద్యార్థులను డీబార్ చేసినట్లు తెలిపారు. -
బలిపశువులైంది బడుగులే!
నాగులుప్పలపాడు: కూటమి నాయకుల ఆధిపత్య పోరుకు నిరుపేద జీవాల కాపరులు బలైపోయారు. పరాయి గ్రామం నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన బడుగుల జీవితాలను కూటమి నాయకుల పంతాలు, పగలు చిన్నాభిన్నం చేశాయి. బాపట్ల జిల్లా పెదగంజాంకు చెందిన గొర్రెల కాపరులు ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు కావూరి వాసు చేలో గొర్రెల పెంట కట్టడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పక్కనే చేనున్న టీడీపీ నాయకుడు ఉప్పల సుబ్బారావుకు, వాసుకు పాత కక్షలు ఉన్నాయి. వాసుపై ఉన్న కక్షను సుబ్బారావు అమాయక గొర్రెల కాపరులపై చూపించాడు. గత పంటకు సంబంధించిన ఒకటి రెండు మొక్కజొన్న మొలకలను గొర్రెలు మేశాయనే నెపంతో ఎల్లావుల అనీల్పై సుబ్బారావు తొలుత దాడికి దిగాడు. అంతటితో ఆగక తన అనుచరులను పిలిపించి అనీల్ను మూకుమ్మడిగా చితకబాదారు. ఈ దాడిలో అనీల్ భుజం కీలు జారిపోయింది. ప్రాధేయపడిన మరో కాపరి వడ్లమూడి మధును సైతం శ్రీగొల్ల నా కొడకల్లారాశ్రీ అంటూ కులం పేరుతో, అసభ్య పదజాలంతో దూషిస్తూ విచక్షణా రహితంగా కొట్టారు. గాయపడిన యువకులు న్యాయం కోసం సాయంత్రం గ్రామంలోని పెద్దమనుషుల వద్దకు వెళ్లగా, టీడీపీ కార్యాలయం వద్ద అధికార పార్టీ ఉన్న నిందితులు మరోమారు వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణాన్ని పక్కదోవ పట్టించేందుకు సుబ్బారావు డ్రామాలకు తెరలేపాడు. చేలో పచ్చిరొట్ట ఎరువు పంటను గొర్రెలు మేసేశాయంటూ అబద్ధాలు ప్రచారం చేశాడు. అసలు చేలో పంటే లేకపోవడంతో, అధికారులు వస్తే తన బండారం బటయపడుతుందని మంగళవారం ఉదయం హడావిడిగా చేనును దున్నేశాడు. దౌర్జన్యానికి పాల్పడిన అధికార పార్టీ నాయకులను కాపాడేందుకు పోలీస్ యంత్రాంగం వత్తాసు పలకడం గమనార్హం. బాధితుల ఫిర్యాదును కేవలం సాధారణ దాడిగా చిత్రీకరిస్తూ, ఎదురు దాడి చేసిన వారి ఫిర్యాదుతో బాధితులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు పెట్టాలి ఈ అన్యాయంపై అఖిల భారత యాదవ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులతో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడంతో పాటు, జూన్ 15న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. బాధితులపై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి పాల్పడిన టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని యాదవ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈదుమూడి ఘటనకు కూటమి నాయకుల ఆధిపత్య పోరే కారణం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికార యంత్రాంగం -
రోడ్డు ప్రమాదంలో వలస కార్మికుడు మృతి
● మరో ఇద్దరికి గాయాలు బల్లికురవ: పొట్టకూటి కోసం రాష్ట్రాలు దాటి వలస వచ్చిన కార్మికుల జీవితాల్లో మద్యం చిచ్చు రేపింది. మద్యం మత్తులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఒకరి ప్రాణాన్ని బలిగొనగా, మరో ఇద్దరిని ఆసుపత్రి పాలుచేసింది. ఈ విషాదకర ఘటన సోమవారం అర్ధరాత్రి బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి – అనంతవరం ఆర్అండ్బీ రోడ్డులో వేమవరం జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరాయి రాష్ట్రం నుంచి వలస వచ్చిన చరణ్(40), మరో కార్మికుడు కలిసి సోమవారం రాత్రి పూటుగా మద్యం తాగారు. అనంతరం వారిద్దరూ వేమవరం జంక్షన్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఒక బైక్ వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వలస కార్మికులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన చరణ్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడితో పాటు బైక్పై నుంచి కిందపడిన వ్యక్తిని స్థానికులు హుటాహుటిన చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బల్లికురవ ఎస్సై వై. నాగరాజు తెలిపారు. -
బీసీల ప్రాణాలకు రాష్ట్రంలో రక్షణ కరువు
ఒంగోలు వన్టౌన్: రాష్ట్రంలో బీసీల ప్రాణాలకు, ఆస్థులకు రక్షణ లేకుండా పోయిందని ఈదుమూడిలో గొర్రెల కాపరులపై అగ్రకులస్థుల దాడే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అన్నారు. నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈనెల 7వ తేదీన గొర్రెలు మేపుకుంటున్న యాదవ యువకులపై దాడి చేసిన అగ్రకులస్తులను వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ధర్నాలో నాగార్జున యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గొర్రెల కాపరులపై చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నాయకులు టీడీపీ కార్యాలయంలోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారని, ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే సీఐ శేషగిరిరావు నిందితులకు వత్తాసుపలుకుతూ మాట్లాడటమే కాకుండా ఈ దాడిపై చిన్న కేసు నమోదు చేసి..నిందితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపైనే కేసు కట్టారన్నారు. జరిగిన సంఘటనపై జ్యుడీషియరీ విచారణ నిర్వహించాలన్నారు. ఈ విషయంలో బాధితులకు న్యాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న 139 బీసీ కులాల సంఘ చైర్మన్ మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ గొర్రెల కాపరులపై అధికార పార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐ శేషగిరిరావు అగ్రకుల నిందితుల ఫిర్యాదుతో బాధితులపైనే కేసు నమోదు చేశారని మండిపడ్డారు. 139 బీసీ కులాల జేఏసీ నాయకుడు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ అగ్రకుల వ్యక్తులు చేసిన దాడిలో మధు, అనిల్ అనే ఇద్దరు గొర్రెల కాపరులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారన్నారు. బాధితులు నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, కావూరి నాగార్జున, ఉప్పల సుబ్రహ్మణ్యం, బాచిన రంగారావు, ఉప్పల వెంకట్రావు, ఉప్పల ప్రసాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, అగ్రకులాల వారికి కొమ్ముకాస్తూ సీఐ శేషగిరిరావు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. గొర్రెలను చెల్లాచెదురు చేయడమే కాకుండా, గొర్రెల కాపరులను కాళ్లతో పదేపదే తంతూ, అసభ్యంగా దూషించారని పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని గొర్రెలు కనిపించకుండా పోయాయన్నారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు మాట్లాడుతూ గొర్రెల కాపరలపై దాడి చేసిన దుర్మార్గులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఐ శేషగిరిరావును సస్పెండ్ చేయాలన్నారు. ఈదుముడి గ్రామంలో అన్యాక్రాంతమైన మేత భూములను వెలికి తీసి గొర్రెల కాపరులకు, పశు పోషకులకు హక్కు కల్పించాలని, 50 ఏళ్లు నిండిన గొర్రెల కాపరులకు, పశుపోషకులకు రూ.6 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా హరి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కన్వీనర్ బోట్ల రామారావు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు బంకా చిరంజీవి, పీఎల్పీ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ పీఏసీ చైర్మన్ కొలుసు మోహన్ యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు యనమల నాగార్జున యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు లాకా వెంగళరావు, హైకోర్టు అడ్వకేట్ వీరు యాదవ్, నర్రావుల శ్రీనివాసరావు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావలి సుధాకర్, జీహెచ్పీఎస్ నాయకులు పేరం సత్యం, బాధితులు పాల్గొన్నారు. -
రొయ్యల ఫీడ్ ధరలు తగ్గించాలి
ఒంగోలు సబర్బన్: రొయ్యల ఫీడ్ కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను తక్షణమే తగ్గించాలని జిల్లా రొయ్యల రైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రొయ్యల రైతుల సంఘ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దుగ్గినేని గోపినాథ్ అధ్యక్షతన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట రొయ్యల రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుగ్గినేని గోపీనాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రొయ్యల రైతులు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ రొయ్యలు సాగు చేస్తున్నారన్నారు. రొయ్యల సాగులో పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, తగ్గిన రొయ్యల ధరల వలన వనామీ రొయ్యలు సాగు చేసిన రైతులకు 60 కౌంట్ వరకు పెంచితేగానీ పెట్టిన పెట్టుబడి తిరిగి రావటం లేదన్నారు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు పెంచిన రైతులకు కౌంట్ల వారీగా కేజీకి రూ.40 నుంచి రూ.30 వరకు పెట్టిన పెట్టుబడిలో నష్టపోతున్నారని, టైగర్ రొయ్యలు సాగు చేసిన రైతులకు 40 కౌంటు వరకు పెంచితే గానీ పెట్టిన పెట్టుబడులు తిరిగి రావడం లేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఫీడ్ కంపెనీలు వనామి ఫీడును కేజీకి రూ.10, టైగర్ ఫీడ్ను రూ.12 అప్సడా, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రైతుల అభ్యంతరం పట్టించుకోకుండా ఏకపక్షంగా పెంచాయన్నారు. పెంచిన ఫీడ్ ధరలను ఖర్చులో పరిగణలోకి తీసుకుంటే వనామీ సాగుచేసిన రైతులకు 40 కౌంటుకు రొయ్యలను పెంచితే గానీ పెట్టుబడి ఖర్చులు రావన్నారు. వనామి రొయ్యల మొత్తం సాగులో కేవలం 10 శాతం మాత్రమే 40 కౌంట్కు రొయ్యలు ఎదుగుతాయని, మిగతా 90 శాతం రైతులు 100 నుంచి 50 కౌంట్ లోపే రొయ్యలను హార్వెస్ట్ చేస్తారని చెప్పారు. టైగర్ రొయ్యలు సాగు చేస్తున్న రైతులకు ప్రస్తుతం పెరిగిన రొయ్యల ఫీడ్ ధరలు వలన 30 కౌంట్కు పెరిగితే గానీ పెట్టుబడి ఖర్చులు వచ్చే పరిస్థితి లేదన్నారు. పెరిగిన ఫీడ్ ధరలు ఇదే విధంగా కొనసాగితే మొత్తం రొయ్యల రైతుల్లో ఒక సంవత్సరంలోపే 80 శాతం మంది రొయ్యల సాగుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. రొయ్యల ఉత్పత్తి తగ్గి ప్రాసెసింగ్ ప్లాంట్స్ మూతపడే ప్రమాదం ఉందన్నారు. ధర్నాకు ముందు మత్స్యశాఖ కార్యాలయం నుంచి చర్చి సెంటర్ మీదుగా కలెక్టరేట్ వరకు రొయ్యల రైతులు నిరసన ప్రదర్శన చేశారు. రొయ్యల రైతులకు హ్యాచరీ అసోసియేషన్, ఫీడ్ షాప్ల అసోసియేషన్ మద్దతు పలికాయి. ధర్నాలో రొయ్యల రైతులు సంఘ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి కుంతురి సుబ్బారెడ్డి, సంఘం గౌరవాధ్యక్షుడు పమిడి సుబ్బానాయుడు, సంఘం సలహాదారుడు చేపల రమణయ్య, ఉపాధ్యక్షుడు సింగమనేని అంజిబాబు, సహాయ కార్యదర్శి బత్తుల రమేష్ రెడ్డి, నార్నె రమేష్, సంఘం జిల్లా నాయకులు ఉప్పలపాటి నాగరాజు, నార్ని సతీష్, కొంక రంగారావు, గోపాల్ రెడ్డి, పెద్ద ఎత్తున రొయ్యల రైతులు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
టంగుటూరు: ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కారుమంచి, జయవరం గ్రామాల మధ్య సోమవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు..మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారుమంచి, జయవరం గ్రామాల మధ్య ముసివాగులో ముగ్గురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఇద్దరు క్షేమంగా బయటికి వచ్చారు. వారిలో మన్నం కార్తీక్ మృతి చెందాడు. కార్తీక్ జెడ్పీ హైస్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు. ఈ విషయంపై టంగుటూరు పోలీస్స్టేషన్లో ఎటువంటి కేసు నమోదు కాలేదు. గిద్దలూరు రూరల్: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గిద్దలూరు మండలంలోని దిగువమెట్ట – చలమ మధ్య నల్లమల అటవీ ప్రాంతంలోని రైల్వే ట్రాక్పై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. సమాచారం అందుకున్న నంద్యాల జీఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడేందుకే రైలు వచ్చే సమయంలో ట్రాక్ మధ్యలో ఉండటం వలనే రైలు పట్టాల మధ్యలో ఉండిపోయినట్లు రైల్వే పోలీసులు అంచనా వేశారు. రైలు ఢీకొట్టడంతో మొహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. మృతుడు పాచీ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. నంద్యాల జీఆర్పీఎఫ్ ఎస్సై కుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కల్లోల కడలిపై .. ఆకలి వేట
● ముగిసిన రెండు నెలల విరామం ● నిషేధం తర్వాత సంద్రంలోకి గంగపుత్రులు ● రెండేళ్లుగా కడలి పుత్రుల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వం ● వరుస విపత్తులు.. సోనాబోట్ల దాడులతో నష్టపోయిన మత్స్యకారులు ● ఈసారైనా కరుణించు తల్లీ అంటూ పూజలు ఆకలి వేటఅపార మత్స్య సంపదకు నిలయమైన సంద్రమే వారికి జీవనాధారం. ఎగసి పడుతున్న అలలకు ఎదురొడ్డి.. ప్రాణాలకు తెగించి బతుకు నావతో ప్రయాణం. వేట సాగితేనే పూట గడవని గంగపుత్రులు రెండు నెలల విరామం తర్వాత మళ్లీ అలలపై ఆశల వేటకు సిద్ధమయ్యారు. మత్స్య సంపద వృద్ధి కోసం విధించిన వేట నిషేధం నేటితో ముగిసింది. వేకువ జామునే గంగమ్మకు పూజలు నిర్వహించారు. వేట సజావుగా సాగాలని వేడుకున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ సారైనా కరుణించు తల్లీ అంటూ కడలిపుత్రులు సంద్రంలోకి అడుగు పెట్టారు. లంగరు వేసిన బోట్లు తెల్లవారు జామునే తీరానికి చేర్చి సాగర మథనానికి సిద్ధమయ్యారు. సోమవారం జిల్లాలో తీరం సందడిగా మారింది. సింగరాయకొండ: జిల్లాలో రెండు నెలల చేపల వేట నిషేధం తరువాత సోమవారం నుంచి ఎంతో ఆశలతో చేపల వేట ఆరంభమైంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో తొలి రోజు ఆశాజనకంగా ఉందని మత్స్యకారులు సంబర పడ్డారు. ఒక్కో బోటుకు రూ.12 వేల నుంచి రూ.20 వేలకు పైగా విలువజేసే చేపలు లభించాయని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా చేపల వేట సక్రమంగా రోజుకు ఒక్కసారి మాత్రమే చేపల వేట సాగిస్తూ వస్తున్నారు. ఈ సారైనా గట్టెక్కుతామా అంటూ కోటి ఆశలతో వేట మొదలెట్టారు. 70 కిలో మీటర్లు..39 గ్రామాలు.. జిల్లాలో సుమారు 70 కిలోమీటర్ల సముద్రతీరం విస్తరించి ఉంది. సింగరాయకొండ, టంగుటూరు, ఉలవపాడు, గుడ్లూరు, ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలో సుమారు 39 మత్స్యకార గ్రామాలున్నాయి. మొత్తం 50 వేల జనాభా, సుమారు 5,500 గృహాలు ఉండగా చేపల వేటపై ఆధారపడి సుమారు 12 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. జిల్లాలో సుమారు 2,303 బోట్లు ఉండగాా వాటిలో సుమారు 1,661 మోటరైజ్డ్ బోట్లు, 642 నాన్ మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంగపుత్రులకు గడ్డురోజులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మత్స్యకార భరోసా ఎగ్గొట్టింది. రెండో ఏడాది అరకొరగా విదిల్చింది. మూడో ఏడాది రకరకాల నిబంధనలతో ఇబ్బందులకు గురిచేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా అన్నీ ఒడిదుడుకులే.. వరుస ప్రకృతి విపత్తులు ఒకవైపు...తమిళనాడు కడలూరు, పాండిచ్చేరి కరెక్కల్ సోనాబోట్ల దాడులతో రెండేళ్లుగా చేపల వేట ఆశాజనకంగా లేదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచూ తుఫాన్లు, అల్పపీడనాలు రావటంతో వేట సక్రమంగా సాగలేదని, ఒకవేళ వేటకు వెళ్లినా మత్స్య సంపద సక్రమంగా పడలేదని, చివరికి ఖర్చులు కూడా రాలేదు. తమిళనాడు రాష్ట్రం కడలూరు, పాండిచ్చేరి కరైకల్కు చెందిన సోనాబోట్లు తీరంలో విధ్వంసం సృష్టిస్తూ మత్స్యసంపదను కొల్లగొడుతున్నాయి. ప్రాణాలకు తెగించి పాండిచ్చేరి కరైకల్కు చెందిన నాలుగు సోనాబోట్లు పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్లో ఉంచామని, అయితే వాటిని టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు కుట్రలు చేసి వదిలేశారని ఆరోపించారు. వారితో పెద్ద ఎత్తున డీల్ కుదుర్చుకుని బోట్లను వదిలేసి ప్రకాశం, నెల్లూరు జిల్లాల మత్స్యకారులకు తీరని ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార పెద్దలు మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి దోషులను గుర్తించినా ప్రభుత్వం మాత్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మత్స్యకారులు రగిలిపోతున్నారు. పాలేల్లో ప్రత్యేక పూజలు మత్స్య సంపద వృద్ధి కోసం ఏప్రిల్ 14వ తేదీ నుంచి 61 రోజుల పాటు ప్రభుత్వం చేపల వేటకు నిషేధం విధించింది. నిషేధకాలం ముగియడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి తీరంలో సందడి మొదలైంది. తమను చల్లగా కాపాడు. తిరిగి వచ్చేలా చూడమ్మా.. అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అదే విధంగా మత్స్య సంపదతో సిరిసంపద పెరిగేలా చూడాలని కోరుకున్నారు. మత్స్యకార మహిళలు సముద్రంలో కుంకుమ, పసుపు సమర్పించారు..కొత్తబోట్లు, వలలు కొనుక్కున్న మత్స్యకారులు మాత్రం తీరంలో పూజలు చేసుకుని టెంకాయ కొట్టి వేట ప్రారంభించారు. రెండేళ్లుగా వాతావరణం అనుకూలంగా లేకపోవటంతో చేపల వేట సక్రమంగా సాగలేదని గత సంవత్సరం అయితే చేపల వేట మరీ దారుణంగా ఉందని మత్స్యకారులు వాపోయారు. ఈసారైనా కరుణించమ్మా అంటూ గంగపుత్రులు వేడుకున్నారు. తొలి రోజు శుభసూచకంగా ఉందని, మత్స్య సంపద పుష్కలంగా లభించిందని మత్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గత శనివారం నాగూర్మీరాసాహెబ్కు పూజలు నిర్వహించి జెండాలు పాలెంలో ఊరేగించారు. వారం రోజుల ముందునుంచే బోట్లు, వలలకు మరమ్మతులు చేసుకుని వేటకు సిద్ధమయ్యారు. తమిళనాడు బోట్ల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ బోటును ఏర్పాటు చేసినట్టు రామాయపట్నం మైరెన్ సీఐ శివన్నారాయణ తెలిపారు. -
నవోదయలో ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
ఒంగోలు టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్ ప్రథమ సంవత్సరం మిగులు సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సి.శివరాం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివి పాసై ఉండాలని చెప్పారు. మొత్తం 60 శాతం మార్కులతో పాటు సైన్స్ సబ్జెక్టులో 60 శాతం, గణితంలో 60 శాతం మార్కులు కచ్చితంగా వచ్చి ఉండాలని వివరించారు. 2025–26 కంటే ముందు పాసైన విద్యార్థులు అనర్హులని తెలిపారు. అభ్యర్థులు 01–06–2009 నుంచి 31–07–2011 మధ్యలో జన్మించి ఉండాలన్నారు. ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ వెబ్సైట్ నుంచి దరఖాస్తు వివరాలు పొందవచ్చన్నారు. పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు 10వ తరగతి మార్కుల లిస్టుపై హెడ్మాస్టర్ సంతకంతో అటెస్ట్ చేయించాలన్నారు. ఆదాయ, నివాస స్టఫికెట్లు సమర్పించాలని, నేరుగా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు అందజేయవచ్చని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ● 5 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం కనిగిరి రూరల్: మండలంలోని యడవల్లి శివారు ప్రాంతంలో ఈత చెట్ల తోపు పరిసరాల్లో నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులు అనే వ్యక్తిని ఆదివారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ (ఒంగోలు) కే విజయ్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా రవాణా చేస్తున్న అన్నం నరసింహులును పట్టుకుని అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటు సారా, బజాజ్ పల్సర్ బైక్ సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు కనిగిరి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ ఆర్.విజయ భాస్కర్రావు తెలిపారు. ఈ దాడుల్లో సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రియల్టర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీఐ అజయ్కుమార్ పుల్లలచెరువు: రియల్టర్ను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. ఈ నెల 10వ తేదీన పుల్లలచెరువు మండలంలోని శతకోడు గ్రామంలో జరిగిన రియల్టర్ రవికుమార్ హత్య కేసు వివరాలను ఆదివారం సీఐ అజయ్కుమార్ విలేకర్లకు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. శతకోడుకు చెందిన జువ్వా అనీల్కుమార్కు ఉన్న 67 ఎకరాల అసైన్మెంట్ భూమిని అదే గ్రామానికి చెందిన వరకూటి చిన్న పోలిరెడ్డి, మృతుడు రవికుమార్లు కలిసి హైదరాబాద్కు చెందిన సైదారావు గ్రూపునకు విక్రయించారు. ఈ క్రమంలో వారి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. కొన్ని రోజుల తర్వాత చిన్నపోలిరెడ్డి, రవికుమార్ల మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. కాగా, ఆ భూమికి దారి సమస్య ఏర్పడటానికి రవికుమారే కారణమని చిన్నపోలిరెడ్డి భావించాడు. రవికుమార్ను అంతమొందించాలనే ప్లాన్తో, పొలం కొలతల నెపంతో పోలిరెడ్డి తన కుమారుడి చేత రవికుమార్కు ఫోన్ చేయించి పిలిపించాడు. పొలం వద్దకు వెళ్ళాక దారి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రవికుమార్ సమాధానంతో ఆగ్రహానికి గురైన చిన్నపోలిరెడ్డి.. రవికుమార్ పొలం కంచె దాటుతున్న సమయంలో యాకసిరి యల్లయ్య వద్ద ఉన్న గొడ్డలి తీసుకుని వెనుక నుంచి దాడి చేశాడు. రవికుమార్ మెడపై బలంగా నరకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొడ్డలిని, రక్తంతో తడిసిన దుస్తులను సంఘటన స్థలం సమీపంలో విసిరేశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎస్ఐ సాంబశివరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఆదివారం ముటుకుల గ్రామ సమీపంలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు వాడిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన సీఐ అజయ్కుమార్, ఎస్ఐ సాంబశివరావు మరియు సిబ్బందిని ఎస్పీ హర్షవర్థన్రాజు, డీఎస్పీ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు. -
పచ్చని పొలాల్లో ఇనుప ముప్పు!
టంగుటూరు: ఐరన్ ఓర్ మైనింగ్ అంశం టంగుటూరుతోపాటు చుట్టుపక్కల మండలాల్లో కాకరేపుతోంది. పర్యావరణం దెబ్బతింటుందని, తాగునీటి లభ్యత తగ్గిపోతుందని, భూగర్భ జలాలకు సైతం ముప్పు వాటిల్లుతుందని, పంటలు నాశనమయ్యే ప్రమాదం ఉందని ప్రధానంగా రైతులతోపాటు ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జేఎస్డబ్ల్యూ పరిశ్రమను తమ ప్రాంతంలో ఏర్పాటు చేయవద్దంటూ టంగుటూరు మండలంలోని మర్లపాడు, కొణిజేడు, కందులూరు, ఎర్రజర్ల, సర్వేరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు గత సోమవారం మూకుమ్మడిగా ఒంగోలు వెళ్లి గ్రీవెన్స్లో కలెక్టర్ రాజాబాబుకు అర్జీ సమర్పించారు. రైతుల జీవనంపై దెబ్బ టంగుటూరు మండలం మర్లపాడు, కొణిజేడు, ఎరజర్ల, కందులూరు పరిసర గ్రామాలు పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇక్కడి రైతులు కేవలం సంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా.. పొగాకుతో పాటు నిమ్మ, జామ, మామిడి వంటి వాణిజ్య తోటలను సాగు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇటువంటి ప్రదేశంలో ఐరన్ ఓర్ శుద్ధి పరిశ్రమ ఏర్పాటు చేస్తే దాని నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, దుమ్ముధూళి, దట్టమైన పొగ వల్ల సారవంతమైన భూములు నిర్జీవంగా మారిపోతాయని రైతులు వాపోతున్నారు. భూగర్భ జలాలు విషమయం ఇప్పటికే అట్టడుగుకు పడిపోయిన భూగర్భజల మట్టాలు మైనింగ్ పరిశ్రమ ఏర్పాటు తర్వాత మరింత పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంది. దీనికి తోడు పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత రసాయన జలాలు భూమిలోకి ఇంకితే, చుట్టుపక్కల గ్రామాల్లోని తాగునీటి బావులు, బోర్లు పూర్తిగా విషపూరితంగా మారుతాయి. ఇది కేవలం వ్యవసాయ రంగాన్నే కాకుండా, తాగడానికి బొట్టు నీరు కూడా దొరకని భయానకమైన నీటి కొరతను సృష్టిస్తుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయు కాలుష్యంతో ప్రాణహాని పరిశ్రమ నుంచి వెలువడే బొగ్గు పొడి, ఇనుప రజను, ప్రాణాంతక విషవాయువులు గాలిలో కలవడం వల్ల ఈ ప్రాంతం కాలుష్య కాసారంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడతారని ఆందోళన వెలిబుచ్చుతున్నా పాలకులు కనీసం పట్టించుకోకపోవడం ప్రజలు రగిలిపోతున్నారు. జింపెక్స్ పోరాటం గుర్తుందా? పరిశ్రమల కాలుష్యంపై ఈ ప్రాంత ప్రజల పోరాటం ఈనాటిది కాదు. గతంలో 2011 డిసెంబర్ 17వ తేదీన అప్పటి ‘జింపెక్స్’ పరిశ్రమ ఏర్పాటుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) మర్లపాడు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కాలుష్య భూతాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు తిరగబడటంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. 15 ఏళ్ల క్రితమే తాము తిరస్కరించిన కాలుష్య కారక పరిశ్రమలను, ఇప్పుడు మళ్లీ కొత్త పేర్లతో తమపై రుద్దాలని చూస్తే సహించేది లేదని స్థానికులు హెచ్చరిస్తున్నారు. సారవంతమైన భూములు బీడువారే ప్రమాదం ఉందని ఆందోళన భూగర్భ జలాలు విషతుల్యమై, వాయు కాలుష్యం ఏర్పడుతుందని ఆవేదన 2011 రణరంగాన్ని గుర్తుచేస్తూ ‘పరిశ్రమ వద్దు.. ‘ప్రాణాలు ముద్దు’ అంటున్న స్థానికులు ప్రజా వ్యతిరేకత, పర్యావరణ ముప్పును పరిగణలోనికి తీసుకోవాలని డిమాండ్ గత సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్ రాజాబాబుకు వినతిపత్రం అందజేత జిందాల్ పరిశ్రమకు అనుమతులివ్వొద్దు మర్లపాడు గ్రామంలో జేఎస్డబ్ల్యూ స్టీల్ పరిశ్రమ మైనింగ్ చేయడానికి అనుమతులు ఇవ్వరాదు. తలపెట్టిన ప్రాజెక్టును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ప్రజల అభిప్రాయాన్ని కాదని ముందుకు వెళితే గతంలో కంటే తీవ్రమైన ప్రజా ఉద్యమం చేపడతాం. చట్టపరమైన పోరాటం చేస్తాం. ప్రజల ఆరోగ్యం దష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – సింగమనేని బ్రహ్మయ్య, మర్లపాడు భూగర్భ జలాలు ఇంకిపోయే ప్రమాదం జిందాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తారు. ఫలితంగా ఎరజర్ల, మర్లపాడు, కందూలురు చుట్టుపక్కల గ్రామాల్లో నీటి సమస్య తీవ్రరూపం దాలుస్తుంది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున పరిశ్రమ ఏర్పాటుపై పునరాలోచించాలి. – బుర్ర అంకరాజు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పు జిందాల్ ఇనుము శుద్ధి కర్మాగారం ఏర్పాటు వల్ల దాని నుంచి వచ్చే కాలుష్యకారకాల వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. వృద్ధులు చిన్నపిల్లలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు. పరిశ్రమ ఏర్పాటుపై ఒంటెద్దు పోకడలు సరికాదు. – ఈదర అమర్నాథ్ చౌదరి, మర్లపాడు -
వేలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒంగోలు డెయిరీ నేడు పాడుబడింది. టీడీపీ పాలకవర్గ హయాంలో అంతులేని అవినీతికి, దుబారాకు పాల్పడి పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు. తాజాగా వేలకోట్ల రూపాయల విలువైన డెయిరీ ఆస్తులపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇప్పటికే అత
చీమకుర్తి: ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి వేలాది మంది పాడిరైతులకు ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒంగోలు డెయిరీ బ్రాండ్తో నిర్వహిస్తున్న ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్) ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని టాప్ 5 పాలకేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. 2015–16 నాటికి అది అత్యధిక స్థాయిలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 56 మండలాల్లో 125 పాలకేంద్రం సొసైటీల ద్వారా 45 వేల మంది రైతుల సభ్యత్వానికి చేరుకుంది. జిల్లాలోని 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు అయిన కనిగిరి, కంభం, యర్రగొండపాలెం, దర్శి, తూర్పు గంగవరం, వీఆర్ కోట, కొండమంజులూరు కేంద్రాల నుంచి రోజుకు 3 లక్షల లీటర్లను సేకరించి ఒంగోలు డెయిరీకి పంపించేవారు. 2013లో ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(పీఎంపీసీఎల్)గా పేరు మార్చారు. అప్పటి వరకు అధికారుల చేతుల్లో ఉన్న నిర్వహణ బాధ్యతలు పీఎంపీసీఎల్ చేతికొచ్చాక లాభాల్లో ఉన్న డెయిరీ కాస్త అప్పుల్లో కూరుకుపోయింది. 2013 నుంచి 2017 మధ్య బాధ్యతలను చేపట్టిన అప్పటి తెలుగుదేశం పార్టీకి చెందిన చల్లా శ్రీనివాసరావు చైర్మన్గా ఉన్న పాలకవర్గం అవినీతి అక్రమాల కారణంగా లాభాల్లో ఉన్న డెయిరీ నెలకు రూ.90 లక్షల అప్పులు చెల్లించాల్సిన దౌర్భాగ్య స్థితిలోకి చేరుకుంది. కొన్ని మిల్క్ కూలింగ్ సెంటర్లలో సొసైటీల ప్రెసిడెంట్లుగా ఉన్న వారు, డెయిరీకి పాలకవర్గం ఆధిపత్యం ఉన్న రోజుల్లో పాల ధరలు, వెన్న శాతం ధరలను ఎక్కువ చూపించి డెయిరీకి వచ్చే లాభాలను స్వాహా చేశారు. అవినీతి తార స్థాయికి చేరటంతో అప్పుల పాలై చివరకు ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు చెల్లించలేని దుస్థితికి చేరుకుంది. రూ.109 కోట్ల అప్పులున్నట్లు ప్రభుత్వం తేల్చింది. ఈలోపు జిల్లాలోని పాలను సరఫరా చేసే 7 మిల్క్ కూలింగ్ సెంటర్లు కూడా ఒక్కొక్కటి మూతపడ్డాయి. చివరకు పీఎంపీసీఎల్ నిర్వహించలేక అప్పులుపాలు కావడంతో మధ్యలో అమూల్ సంస్థ బాధ్యతలను స్వీకరించినప్పటికీ గతంలోని పాలకవర్గం చేసిన అప్పుల ఊబిలోనుంచి బయట పడలేక అమూల్ పక్కకు తప్పుకుంది. ఒంగోలు డెయిరీకి వైఎస్సార్ సీపీ చేయూత: 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఎంపీసీఎల్ డెయిరీని ఆదుకునే క్రమంలో అప్పుగా తేలిన రూ.109 కోట్లకు గాను రూ.69 కోట్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. దానిలో భాగంగా 2023లో ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ల ద్వారా చెల్లించేందుకు రూ.13.29 కోట్లను వైఎస్ జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో పాటు మార్టిగేజ్లో ఉన్న పీఎంపీసీఎల్ ప్రాపర్టీ డాక్యుమెంట్ల్ను విడుదల చేసేందుకు జగన్ ప్రభుత్వం మరో రూ.18 కోట్లను 2023లోనే విడుదల చేసింది. ఇంకా రూ.38 కోట్లను విడుదల చేయాల్సి ఉండగా ఈ లోగా ఎన్నికలు వచ్చి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అడ్హాక్ కమిటీతో కాలం నెట్టుకొస్తోంది. దానిని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఎండీ చైర్మన్గా, జేసీ, వెటర్నరీ జేడీ, డీడీ డైరెక్టర్లుగా అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేసి కొంతకాలం నెట్టుకొచ్చారు. అప్పులు చెల్లించేందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేయకపోగా దానిని పునరుద్ధరించే ప్రయత్నాలను పక్కన పెట్టి పీ–4 పద్ధతిలో ఎవరికో ఒకరికి కట్టబెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. శిథిలావస్థలో మిల్క్ ప్లాంట్ మిషనరీ, వాహనాలు: ఒంగోలు డెయిరీలో పాల ప్యాకెట్లు, వెన్న, జున్ను, మలయ్ లడ్డు, పాలపొడి వంటి పలు రకాల పాల పదార్థాలను తయారు చేయటానికి అవసరమైన రూ.30– రూ.40 కోట్ల విలువైన పరికరాలు మిల్క్ప్లాంట్లో ఉన్నాయి. వాటి ద్వారా రోజుకు పాలకేంద్రం వద్దే 30 వేల లీటర్ల పాలను విక్రయించేవారు. రోజుకు 30 టన్నుల పాలపొడిని అక్కడే ఉన్న పౌడర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసేవారు. అలాంటి విలువైన కోట్లాది రూపాయల విలువ చేసే మిషనరీ ఇప్పుడు పూర్తిగా తుప్పుబట్టి పాడైపోయాయి. పాలను సేకరించేందుకు ఉపయోగించిన మూడు ట్యాంకర్లు ఇప్పుడు నిరుపయోగంగా మిగిలాయి. అధికారుల నిర్వహణకు ఉపయోగించే 2 జీపులు, 2 పశువుల అంబులెన్స్లు, 1 కారు, 2 బైకులు శిథిలావస్థలో ఎందుకూ పనికిరాకుండా పోయాయి. పీఎంపీసీల్ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు, అధికారులు, పాడి రైతులతో ఏర్పాటు చేసే సమావేశాల కోసం నిర్మించిన పాలక మండలి భవనాలు, సాంకేతిక భవనాలు పూర్తిగా శిథిలావస్థలో దర్శనమిస్తున్నాయి. పాడుబడిన పాలక భవనం డెయిరీ ఆస్తుల విలువ రూ.1500 కోట్ల పైమాటే ఒంగోలు డెయిరీకి చెందిన భూములు మొత్తం 90 ఎకరాలు ఉంది. పేర్నమిట్ట–ఒంగోలు మధ్య కర్నూలు రోడ్డు ఫేసింగ్లో డెయిరీ నిర్మించిన 78 ఎకరాల స్థలం, దానికి అనుబంధంగా ఉన్న కొండమంజులూరులో మరో 12 ఎకరాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు రూ.1500 కోట్లకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 6 ఎకరాల్లో ఆక్రమణలు ఒంగోలు డెయిరీ ఉన్న ప్రదేశంలో కొంతమంది అక్రమార్కులు సుమారు 6 ఎకరాల వరకు ఆక్రమించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంట్రెన్స్లో తూర్పు వైపు 25 సెంట్లు, ప్లాంట్కు వెనుక 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఒక ఎకరం, వెనుకనే సుబాబులు వేసి ఉన్న ప్రాంతంలో మరో 5 ఎకరాలను అధికార పార్టీకి చెందిన కొందరు ఆక్రమించుకొన్నారు. దానిపై అధికారులు కోర్టుకెక్కారు. తుప్పుబట్టి ముళ్ల పొదల మధ్య నిరుపయోగంగా మారిన మిల్క్ ట్యాంకర్ పాల పదార్థాలను తయారు చేసే భవనాల దుస్థితి తుప్పు పట్టిన విలువైన పరికరాలుతిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటాం డెయిరీ అప్పులు రూ.109 కోట్లుగా ఉంది. దానికి గాను ప్రభుత్వం విడుదల చేసిన బకాయిలు పోగా ఇంకా ప్రభుత్వం రూ.38 కోట్లు ఇవ్వాల్సి ఉంది. డెయిరీలో పనిచేసే 72 మంది రెగ్యులర్, 48 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.13 కోట్లు ఇచ్చి వీఆర్ఎస్ ద్వారా సెటిల్ చేశాతం. ఎవరైనా పారిశ్రామికవేత్తలు ముందుకొస్తే పీ–4 పద్ధతిలో కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. – రాజమోహన్, సీఈఓ, పీఎంపీసీఎల్(ఒంగోలు డెయిరీ) పాలకవర్గం ఇష్టానుసారంగా తిన్నారు నేను 2000 సంవత్సరం నుంచి పాలకేంద్రం మూసే వరకు నాలుగు విడతలుగా ఓబచెత్తపాలెం పాలకేంద్రానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. పాలకేంద్రానికి చెందిన డబ్బులను పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు ఇష్టానుసారంగా ఖర్చుచేశారు. జనరల్ బాడీ మీటింగ్ జరిగితే పొట్టేళ్లను కొసి పాలకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను కూడా పిలిపించుకొని చేసిన ఖర్చంతా ఒంగోలు డెయిరీ బిల్లులలోనే చూపించేవారు. అలా డెయిరీకి చెందిన లాభాలన్నీ పోగా చివరకు అప్పుల్లో కూరుకుపోవడానికి కారణమైంది. దాని మీద ఆధారపడి వేలాది మంది పాడి రైతులు ఆధారపడ్డారు. చివరకు పాలకేంద్రాన్ని తెరిపించే దిక్కు లేదు. – గంగిరెడ్డి ఓబుల్రెడ్డి, మాజీ పాలకేంద్రం సొసైటీ ప్రెసిడెంట్, చీమకుర్తి పచ్చ నేతలవే -
ట్రాక్టర్ల ర్యాలీని విజయవంతం చేయండి
సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలు మినీ స్టేడియం వద్ద నిర్వహించనున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని రైతు సంఘ జిల్లా కార్యదర్శి జె.జయంతి బాబు కోరారు. ఆదివారం సంతనూతలపాడులోని సుందరయ్య భవన్లో నిర్వహించిన రైతు సంఘ మండల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకు కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయించి రైతులను అప్పుల బారిన పడకుండా కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం 250 రూపాయలతో ప్రారంభమైన పొగాకు ధర.. నేడు రూ.160కి పడిపోయిందని ఆందోళన చెందారు. రోజురోజుకీ ధర దిగజారుతోందని అన్నారు. కానీ, ప్రభుత్వాలకు రైతుల పట్ల చిన్నచూపు ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చంనాయుడు పొగాకు పండే ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల అభిప్రాయాలు తీసుకుని రైతులకు మంచి ధర వస్తుందని, సంతృప్తిగా ఉందని మాట్లాడటమే అందుకు నిదర్శనమని అన్నారు. ఏ పంట వేసినా గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయని ప్రభుత్వాలు.. ఆ పంట ఎందుకు వేశావని రైతులపై ఎదురు దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను దివాలా తీయించి రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. రైతులను ఆ భూముల్లో కూలీలుగా మార్చే విధానాల వైపు వేగంగా అడుగులు వేస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా పొగాకు రైతులంతా మేల్కొని ఐక్యంగా గిట్టుబాటు ధరకు పంటను కొనుగోలు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ట్రాక్టర్ల ర్యాలీలో ప్రతి ఒక్క రైతు ట్రాక్టర్తో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశానికి రైతు సంఘ మండల అధ్యక్షుడు హనుమంతరావు అధ్యక్షత వహించగా, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకటరావు, జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి నల్లూరి వెంకట నరసింహ, రైతు సంఘ నాయకులు కిలారి పెద్దబ్బాయి, ముండ్లమూరి నారాయణ, బత్తుల సుబ్బారావు, పోతినేని చిన్న అంజయ్య, ఆర్.సీతారామయ్య, ఎన్.శ్రీనివాసరెడ్డి, షేక్ కమాల్ తదితరులు పాల్గొన్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధరల సాధన కోసం 19న ఒంగోలులో ర్యాలీ -
ఆర్టీసీ ఆర్ఎం లేక తిప్పలు
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంలో ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కార్యాలయం తాత్కాలికంగా జనవరి మొదటి వారంలో ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్ఎంను మార్కాపురం జిల్లా ఇన్చార్జి ఆర్ఎంగా నియమించారు. అయితే 6 నెలలు కావస్తున్నా ప్రభుత్వం రెగ్యులర్ ఆర్ఎంను నియమించకపోవడం, ఆర్ఎం కార్యాలయానికి సంబంధించిన పర్సనల్, అకౌంట్ డిపార్టుమెంట్లు సిబ్బందిని నియమించకపోవడంతో ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లు గ్రీవెన్స్ కోసం గతంలో లాగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. జిల్లా పరిధిలో మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోల్లో సుమారు 1500 మంది సిబ్బంది పనిచేస్తుండగా 303 బస్సులు ఉన్నాయి. ప్రతి రోజూ 1,21,945 కిలోమీటర్ల మేర తిరుగుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. 6 నెలలు కావస్తున్నా డిపోలో శాశ్వత ఆర్ఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. సిబ్బందిని కూడా నియమించలేదు. దీనితో ఏదైనా అవసరం వస్తే ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికీ ఒంగోలు కేంద్రంగా కార్యకలాపాలు: మార్కాపురం జిల్లా ఏర్పాటైనప్పటికీ రెగ్యులర్ ఆర్ఎం కార్యాలయం, ఆర్ఎంను నియమించకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు ఒంగోలు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల్లోని ప్రజలు ఫిర్యాదులు, ప్రత్యేక బస్సుల డిమాండ్, కొత్త సర్వీసుల ప్రతిపాదనలు ఇవ్వాలంటే ఒంగోలు వెళ్లాల్సిందే. దీంతో జిల్లా ప్రజలకు ఆర్టీసీ సేవలు సకాలంలో అందడం లేదు. బస్సుల కొరత, కొత్త రూట్లు, డిపో అభివృద్ధి, బస్టాండు సౌకర్యాలపై నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రయాణికులు నేరుగా ఆర్ఎంను కలిసే అవకాశం తగ్గుతోంది. సిబ్బంది అప్పీల్ కోసం ఒంగోలుకు వెళ్తున్నారు. ఆర్ఎం కార్యాలయ ఏర్పాటుకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించలేదు. రెగ్యులర్ ఆర్ఎంను నియమిస్తే దాదాపు 15 మంది సిబ్బంది వస్తారు. ప్రయాణికులకు, సిబ్బందికి మెరుగైన సేవలు వస్తాయి. ప్రస్తుతం చిన్నపనికి కూడా ఒంగోలుకు వెళ్లాల్సి వస్తోంది. మార్కాపురం డిపోలో 406 మంది ఉద్యోగులు, గిద్దలూరులో 356, కనిగిరిలో 388, పొదిలి 333 మంది సిబ్బందితో పాటు అదనంగా మరికొంత మంది సిబ్బంది ఉన్నారు. వీరందరూ ఏవైనా సమస్యలు వస్తే ప్రస్తుతం ఒంగోలు వెళ్తున్నారు. మార్కాపురం జిల్లా ఏర్పాటైనా ఒంగోలు కేంద్రంగానే కార్యకలాపాలు గ్రీవెన్స్ కోసం ఒంగోలుకు వెళ్లక తప్పని ఇక్కట్లు మార్కాపురం జిల్లాలో మండలాలు: 21 మార్కాపురం జిల్లాలో డిపోలు : 4 జిల్లా పరిధిలో ఉన్న బస్సులు: 303 4 డిపోల పరిధిలో ఉన్న సిబ్బంది: 1500 రోజూ బస్సులు తిరిగే కిలోమీటర్లు: 1,21,945 -
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
బల్లికురవ: బైకు అదుపుతప్పి వ్యక్తి మృతిచెందిన సంఘటన బల్లికురవ–కొమ్మాలపాడు ఆర్అండ్బీ రహదారిపై బల్లికురవ మండలంలోని చెన్నుపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు మలుపులో ఆదివారం చోటుచేసుకుంది. చెన్నుపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి రామయ్య (48) సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో అమ్మవారి కొలుపులకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రగాయాలపాలైన రామయ్యను స్థానికుల సమాచారంతో 108 వాహనం వచ్చి మార్టూరు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య భూలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భూలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై వై.నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు టౌన్: నగరంలోని రావి ఆంజనేయులు వీధిలో పేకాట శిబిరంపై ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కోతముక్క ఆడుతున్నారన్న సమాచారంతో ఎస్పీ హర్షవర్థన్రాజు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ ఇన్చార్జి సీఐ కమలాకర్ ఆధ్వర్యంలోని బృందం ఆకస్మికంగా దాడి చేసి పేకాటరాయుళ్ల నుంచి రూ.4,860 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. పట్టుబడిన వారిని నగదుతో సహా తాలూకా పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో టాస్క్ఫోర్స్ ఎస్సై చెంచయ్య, ఏఎస్సై షేక్ మహబూబ్ బాషా, సిబ్బంది పాల్గొన్నారు. ● మహిళకు తీవ్ర గాయాలు ● విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్పై ప్రమాదం సింగరాయకొండ: మండల పరిధిలోని జాతీయ రహదారిపై గల విమాన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ట్రాక్పై ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే పోలీసుల కథనం ప్రకారం.. చైన్నెకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు శుభకార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో విజయవాడ వెళ్తున్నారు. మార్గమధ్యంలో కారు సింగరాయకొండ పరిధిలోని విమానాల ఎమర్జెన్సీ ల్యాండింగ్పై ఉన్న కుంభకోణం కాఫీ షాప్ సమీపంలోకి రాగానే, అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు సిమెంటు దిమ్మెతో సహా కారు నెల్లూరు వైపు వెళ్లే రోడ్డు మధ్యలోకి దూసుకెళ్లి ఆగింది. ఆ సమయంలో హైవేపై ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే కారులో ప్రయాణిస్తున్న గోమతి అనే మహిళకు తీవ్ర గాయాలు కావడంతో, హైవే అంబులెన్స్లో ఒంగోలు జీజీహెచ్కు తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై ఎల్.సుధీర్కుమార్ పరిశీలించారు. రోడ్డుపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా హైవే పోలీసు సిబ్బంది శశిధర్రెడ్డి చర్యలు చేపట్టారు. -
జేఎస్డబ్ల్యూతో ఏపీఎండీసీ ఒప్పందం
టంగుటూరుతోపాటు పరిసర మండలాల్లో సుమారు 800 మిలియన్ టన్నుల మాగ్నటైట్ నిక్షేపాలు భూగర్భంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర గనుల శాఖ పరిశోధనల్లో తేలింది. ఇక్కడ లభ్యమయ్యే మాగ్నటైట్ రకానికి చెందిన ముడి ఖనిజంలో సహజంగా ఇనుము శాతం కొంత తక్కువగా అంటే సుమారు 18 నుంచి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. తక్కువ గ్రేడ్ ఖనిజం అయినప్పటికీ, అధునాతన టెక్నాలజీ ద్వారా మలినాలు తొలగించి, ఇనుము శాతాన్ని పెంచి స్టీల్ తయారీకి వినియోగించేందుకు జేఎస్డబ్ల్యూ సిద్ధమైంది. లోగ్రేడ్ ఇనుప ఖనిజాన్ని హైగ్రేడ్గా మార్చడం కోసం ఉక్కు దిగ్గజం జేఎస్డబ్ల్యూతో ఏపీఎండీసీ చేతులు కలిపింది. ఎంఓయూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1300 ఎకరాల భూమిని జేఎస్డబ్ల్యూకు కట్టబెట్టింది. ఈ పరిణామం టంగుటూరు, వలేటివారిపాలెం తదితర మండలాల్లో ప్రజలను ఆందోళనలోకి నెట్టింది. ఇనుము శుద్ధి కర్మాగారంలో ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలని జేఎస్డబ్ల్యూ భావిస్తుండగా.. ఇది పర్యావరణానికి, పంటల సాగుకు, భూగర్భ జలాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
● ఏపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ మార్కాపురం: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీయూఎస్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు హైస్కూల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, ఐఆర్ 30 శాతం ఇవ్వాలని, 2003 డీఎస్సీ వాళ్లకి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దిలీప్, ఏపీయూఎస్ జిల్లా నాయకులు కే శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి శ్రావణ్ కుమార్, కోశాధికారి బీవీ గుణప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగని శ్రీనివాసులు, కోశాధికారి రమణయ్య, జిల్లా సంఘటన కార్యదర్శి విశ్వేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేంద్రుడు, సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకృష్ణ, అల్లూరయ్య, రమణయ్య, బుర్రి శ్రీనివాసులు, అన్నీ మండలాల సభ్యులు కార్యకర్తలు, తదతరులు పాల్గొన్నారు. అనంతరం తర్లపాడు మండలంలో ఎంఈఓగా పదవీ విరమణ పొందిన అచ్యుత సుబ్బారావును ఘనంగా సన్మానించారు. -
మట్టి దొంగలు
ఉలవపాడు: ‘‘నేను ఎమ్మెల్యే బంధువుని...ఈ మండలంలో పెత్తనం నాదే... గ్రావెల్ తరలింపు మొత్తం నాకు తెలిసి నేను తోలాల్సిందే...’’ ఇదీ ప్రస్తుతం మండలంలో ఓ నాన్లోకల్ టీడీపీ నేత పెత్తనం. దీనికి స్థానికంగా ఉన్న మరో టీడీపీ నేత సహకారంతో భారీగా గ్రావెల్ దోపిడీ జరుగుతోంది. ఉలవపాడు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న రాజుపాలెం చెరువును అడ్డాగా చేసుకుని భారీగా గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. రాజుపాలెం చెరువు నుంచి హైవేకు నేరుగా చేరుకునేలా రోడ్డు ఏర్పాటు చేసుకుని టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చెరువులో జేసీబీలు ఏర్పాటు చేసుకుని టిప్పర్లలో నింపుకుని తరలిస్తున్నారు. ప్రతిరోజూ సుమారు 100 ట్రిప్పుల పైనే గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో అక్రమార్జనకు కాదేదీ అనర్హం అన్న చందంగా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమార్జన మొత్తం నాన్ లోకల్ నేత ఆధ్వర్యంలోనే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలోని బడానేత ఉలవపాడు మండలానికి ఒక ఇన్చార్జ్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో పెత్తనం అంతా ఆయనే చేసేవాడు. ఆయన ఆధ్వర్యంలో అన్నీ నడిచేవి. ఇన్చార్జికి, పెద్దనేతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఇప్పుడు ఆ నేతకు బంధువుగా ఉన్న మరో నాన్లోకల్ నేత ఈ గ్రావెల్, మట్టి దోపిడీ, రెవెన్యూ కార్యాలయంలో పనులు అన్నీ తానై చూస్తున్నాడు. అధికారులు సైతం మట్టి, గ్రావెల్ ఎంత తోలుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు. ఒక్కో టిప్పర్ కు సదరు నాన్లోకల్ నేతకు సుమారు రూ.3 వేల ఆదాయం ఉంది. అంతే కాకుండా ఉలవపాడు బైపాస్లో ఉన్న సుమారు 75 ఎకరాల వెంచర్కు భారీగా గ్రావెల్ అవసరం ఉంది. దీనికి తోలడానికి ఉలవపాడు మండలంలోని చెరువుల నుంచి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇలా మండల పరిధిలో గ్రావెల్, మట్టి భారీ దోపిడీ జరుగుతోంది. నిద్రలో ఉన్న అధికారులు... నిద్రపోతున్న వారిని లేపవచ్చు కానీ నిద్రనటిస్తున్న అధికారులను లేపడం కష్టతరంగా మారింది. ప్రస్తు తం ఉలవపాడు మండలంలో అధికారుల పరిస్థితి అలాగే ఉంది. ఈ నాన్లోకల్ నేత గ్రావెల్, మట్టి తోలుతుంటే, నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖలు కనీసం పట్టించుకోరు. ఎవరైనా ఫోన్ చేసినా స్పందించరు. ఆ వైపునకు రారు. ఇలా పకడ్బందీగా జరుగుతున్న గ్రావెల్ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హైవేపై హాహాకారాలు
యర్రగొండపాలెం: ఆధ్యాత్మికత కోసం ఆలయానికి వెళ్తున్న వారు ఊహించని రీతిలో ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారంతా రక్షించండి అంటూ పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. యర్రగొండపాలెం మండలం వై.కొత్తపల్లి వద్ద హైవే రోడ్డుపై ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. కారు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఈ దుర్ఘటనలో పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన అప్పిరెడ్డి వెంకటరమణమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి శ్రీవారి దర్శనం ముగించుకుని వస్తున్న కారు, శ్రీశైలం వెళ్తున్న బొలేరో వాహనం ప్రమాదానికి గురయ్యాయి. అదే సమయంలో వై.కొత్తపల్లిలోని తన గెస్ట్ హౌస్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫోన్ చేసి 108 అంబులెన్స్, హైవే అంబులెన్స్ రప్పించారు. క్షతగాత్రులు విలపిస్తుండగా మాజీ మంత్రితోపాటు ఆయన వెంట ఉన్న కార్యకర్తలు, స్థానికులు కలిసి బాధితులకు ధైర్యం చెప్పారు. గాయపడిన వారిని స్వయంగా వాహనాల్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులతో మాట్లాడి సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. -
మద్యం మత్తులో కారు నడిపిన యువకుడు
దర్శి: ఓ యువకుడు మద్యం తాగి కారును నడుపుతూ పలువురిని ఢీకొట్టాడు. ఈ సంఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండల కేంద్రం దర్శి పట్టణంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు ఒంగోలులోని ఓ కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడు. వ్యక్తిగత పని కోసం దర్శి వచ్చిన అతను మద్యం తాగి నిర్లక్ష్యంగా కారు తోలాడని, రోడ్డు వెంబడి ఉన్న ఆటోలతో పాటు పలు వాహనాలు కూడా దెబ్బతిన్నాయని స్థానికులు చెప్తున్నారు. క్షతగాత్రులను 108లో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
కేజీ రూ.160కి తగ్గడానికి లేదు
● వ్యాపారులు, పొగాకు బోర్డు అధికారులకు తేల్చిచెప్పిన పొగాకు రైతులు ఒంగోలు సబర్బన్: ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో ఎఫ్–3 రకం పొగాకును కేజీ రూ.160కి తగ్గకుండా వ్యాపారులు కొనుగోలు చేయాలని, అంతకన్నా తగ్గించడానికి వీల్లేదని పొగాకు రైతులు తేల్చి చెప్పారు. సదరన్ బ్లాక్ సాయిల్ (ఎస్బీఎస్), సదరన్ లైట్ సాయిల్స్ (ఎస్ఎల్ఎస్) భూముల రైతులు శనివారం ఒంగోలులోని పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యారు. మూడు జిల్లాల్లోని 11 వేలం కేంద్రాలకు చెందిన రైతు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. లో గ్రేడ్ రకం పొగాకు అసలు కొనుగోలు చేయడం లేదన్నారు. ఎఫ్–3 రకం పొగాకును తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, కానీ, కేజీ పొగాకు ధరను రూ.160 కంటే తగ్గిస్తే అంగీకరించేది లేదని ఏకగ్రీవంగా తీర్మానించారు. 2026–27 సీజన్కు క్రాపు సైజు ఎంత ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రీజియన్లకు సమాన నిష్పత్తి ప్రకారం ఎంతవస్తే అంత కొనాలని వ్యాపారస్తులు, పొగాకు బోర్డు అధికారులను డిమాండ్ చేశారు. 2025–26 సీజన్కు ఇచ్చిన క్రాప్ సైజు ప్రకారం 142 మిలియన్ల పొగాకు కొంటామని గతంలో వ్యాపారస్తులు అంగీకారం తెలిపారన్నారు. అంతవరకై నా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత పంట కాలంలో ఇచ్చిన కోటా ప్రకారం కచ్చితంగా వ్యాపారులు కొనుగోలు చేయాలని తీర్మానించారు. ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్ భూముల్లో పండించిన పొగాకుకు కేజీకి రూ.222 ఖర్చయిందని, గత సంవత్సరం ఇచ్చిన కోటాపోను మిగతా పొగాకును వచ్చే సంవత్సరం వేలం ద్వారా అమ్ముకుంటామని రైతులు తేల్చారు. 2026 జూన్ 8వ తేదీ గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత తేలిక నేలలు, నల్లరేగడి నేలలు, ఉత్తర ప్రాంత తేలిక నేలలకు సంబంధించిన అన్ని వేలం కేంద్రాల రైతు ప్రతినిధులు, వ్యాపారస్తులతో పొగాకు బోర్డు ఈడీ విశ్వశ్రీ, చైర్మన్ యశ్వంత్ సమక్షంలో సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశంలో ఆథరైజేషన్ కలిగి ఉన్న 142 మిలియన్ల పొగాకు వ్యాపారస్తులకు అవసరం లేకుంటే మిగతా పొగాకును వచ్చే సీజన్లో అమ్ముకుంటామని రైతులు తేల్చి చెప్పారు. వ్యాపారులెవరూ పొగాకు బోర్డు ఈడీ ఆదేశాల ప్రకారం కొనకపోగా, ఈడీ సమావేశం తర్వాత కేజీకి రూ.15 నుంచి రూ.20 తగ్గించి కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలకు చెందిన పొగాకు వేలం కేంద్ర రైతు నాయకులు నాగినేని భాస్కర్ చౌదరి, బి.బ్రహ్మ, ఏ శేషగిరిరావు, బి.వి.కృష్ణారెడ్డి, ఎస్.గురవారెడ్డి, గుండాల కేదారనాథ్, ఎం.మాధవరావు, ఎస్.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
స్పెషల్
పేరుకే ఖాకీ ఉద్యోగం.. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. సిఫార్సు లేఖల వ్యాపారం.. అధికార పదవులు ఇప్పిస్తామంటూ ద్వితీయశ్రేణి నేతలతో బేరసారాలు.. ఇదంతా ఒక ఎత్తయితే విచ్చలవిడి అవినీతి మరో ఎత్తు.. ఉమ్మడి జిల్లాలో పోలీసు శాఖ గాడి తప్పింది. సీఐల మొదలు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, రైటర్లు, కానిస్టేబుళ్ల వరకు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు వ్యవహరిస్తుండటం పోలీసు శాఖకు తలనొప్పిగా మారింది. వీటిపై పోలీస్బాస్ హర్షవర్దన్రాజు ఆరా తీస్తున్నట్టు సమాచారం. వసూళ్లలోసాక్షి టాస్క్ఫోర్స్: పోలీస్ శాఖకు సంబంధించి ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా పోలీసు శాఖలో అత్యంత కీలకమైన స్పెషల్ బ్రాంచి పోలీసుల వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. పోలీసు శాఖలో అంతర్గత వ్యవహారాలు చూడాల్సిన స్పెషల్ బ్రాంచి హెడ్ కానిస్టేబుల్ ఒకరు పక్కా అఽధికార పార్టీ నాయకుడిలా వ్యవహరిస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. పగలూ రాత్రీ తేడా లేకుండా కీలకనేత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో పదవుల వ్యవహారంలో తలదూర్చి గందరగోళం సృష్టిస్తున్నాడని ఆ పార్టీ నాయకులు కీలక నేతకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తాను ప్రతిపాదించిన అభ్యర్థికే డిప్యూటీ మేయర్ పదవి దక్కుతుందని చెప్పి కొందరు నాయకులను తన చుట్టూ తిప్పుకుంటున్నట్లు సమాచారం. అతడితో పాటు ఎస్బీలో పనిచేసి ఇటీవల రిటైరైన ఒక కానిస్టేబుల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఏఎస్సైలు ఏకంగా కులనాయకులుగా కూడా అవతారమెత్తినట్లు సహచరులే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని కందుకూరు, ఒంగోలు, దర్శి ఎస్బీ సిబ్బంది విధి నిర్వహణలో పూర్తిగా విఫలమైనట్లు క్షేత్రస్థాయి పోలీసులు చెప్పుకుంటున్నారు. కందుకూరు గంజాయి వ్యవహారంగానీ, దర్శి బెట్టింగు వ్యవహారం గురించిగానీ పత్రికల్లో వచ్చేంత వరకు ఎస్పీకి సమాచారం అందించకపోవడాన్ని వారు గుర్తుచేస్తున్నారు. రైటర్ లీలలు ఎన్నెన్నో... ఇటీవల సస్పెండైన రైటర్పై వస్తున్న ఫిర్యాదుల చూసి ఉన్నతాధికారులు సైతం విస్మయానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లలో ప్రత్యేకంగా తన టీంను ఏర్పాటు చేసుకుని పేకాట, భూ సెటిల్మెంట్లు వంటి అనేక వ్యవహారాలు నడిపినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేత వద్ద ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని పలువురు కానిస్టేబుళ్లకు సెక్టార్ రైటర్లుగా డీఓ వేయించినట్లు సమాచారం. ఒక కానిస్టేబుల్ను తనకు ఆర్డర్లీగా నియమించుకుని అతడిచే ఇంటి పనులు చేయించుకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏఆర్లో పనిచేస్తున్న ఒక ఎస్సై, ఒక రిటైర్డ్ హెడ్కానిస్టేబుల్, మరొక హెడ్ కానిస్టేబుల్తో గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇటీవల రిటైరైన హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజూ పోలీసు స్టేషన్కు వచ్చి వ్యవహారాలలో తలదూర్చుతున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా నగరంలో అత్యంత వివాదాస్పదమైన కొప్పోలు, ముంగమూరు భూ వివాదాలలో తలదూర్చి సెటిల్మెంట్లు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఈ సెటిల్మెంట్లలో భారీ మొత్తంలో చేతులు మారినట్లు ప్రచారం జరిగింది. ఈ రైటర్కు పోటీగా మరో రైటర్ కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఐ వీఆర్లో ఉన్న సదరు పోలీసు స్టేషన్లో ఇన్చార్జిగా బాధ్యతలు చూస్తున్న ఎస్సైతో కుమ్మకై ్కన రైటర్.. ఆ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తూ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాసులు కురిపిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు... నగరంలో ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి మీద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే పైకి ఆ వ్యవహారం సాఫీగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నా.. లోపల మాత్రం భారీ ఎత్తున ముడుపుల వ్యవహారం నడుస్తున్నట్టు తెలిసింది. ఒంగోలు వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల పరిధిలో జరుగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను లోతుగా పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని కొందరు పోలీసులు చెబుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన మందుబాబుల వాహనాలను స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే, మధ్యలోనే కొందరి వద్ద రూ.10 వేల వరకు డబ్బు తీసుకుని వదిలిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జిల్లా నుంచి రోజుకు ఎన్ని డీఎస్ఆర్లు వస్తున్నాయి.. ఎన్ని కేసులు డిస్పోజ్ అవుతున్నాయి.. ఎన్ని కేసులు నమోదు చేశారని విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కో పోలీసుస్టేషన్ది ఒక్కో తీరు... ఒంగోలులో వన్టౌన్, టూటౌన్, తాలూకా, రూరల్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం టూటౌన్ సీఐ వీఆర్లో ఉన్నారు. తాలూకా పోలీసు స్టేషన్ సీఐ కూడా వీఆర్లోనే ఉన్నారు. టూటౌన్ పోలీసు స్టేషన్లో ఎస్సై, రైటర్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక, తాలూకా సీఐ బాధితుల లిస్టు చాంతాడంత ఉందని పోలీసులే గుసగుసలాడుతున్నారు. భూ వివాదాల సెటిల్మెంట్లే కాకుండా చివరికి వ్యభిచారం కేసుల్లో వచ్చిన వారి నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ దామోదర్ హయాంలో ఐడీ పార్టీని రద్దు చేయడం తెలిసిందే. అయితే, తాలూకాలో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ మాత్రం ఐడీ కానిస్టేబుల్ పేరుతో డబ్బు వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వన్టౌన్లో ఒక ఎస్సై వేధింపులకు గురిచేస్తున్నాడని ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ట్రాఫిక్ పోలీసు స్టేషన్లో ఒక ఏఎస్సై విధులు నిర్వహించకుండా కీలక నేత చుట్టూ తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా.. నగరంలోని ఏ పోలీసు స్టేషన్లో చూసినా డ్యూటీ కంటే రాజకీయ నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత పనులు చేసుకుంటూ తిరుగుతున్న వారి వివరాలన్నీ ఎస్పీ చేతికి వచ్చినట్లు సమాచారం. డ్రంక్ అండ్ డ్రైవ్ సొమ్ము స్వాహా ఐడీ పార్టీ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్ -
చెరువులను చెరబట్టీ..
సింగరాయకొండ: మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, కుంటలతో పాటు దేవదాయ భూములు, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయి. పాతసింగరాయకొండ, శానంపూడి, జరుగుమల్లి మండలం కే బిట్రగుంట ప్రాంతాల్లో ప్రతిరోజు వందల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా అడ్డుకోవాల్సిన మైనింగ్, పోలీసు, రెవెన్యూ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ఇక్కడ తవ్విన గ్రావెల్ను పక్క మండలాలైన ఉలవపాడు, టంగుటూరు, కందుకూరు మండలాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. టిప్పర్కు రూ.10 వేలు ఒక్కో టిప్పరును రూ.8 నుంచి రూ.10 వేలకు దూరాన్ని బట్టి అమ్ముతున్నారని ప్రతిరోజు భారీగా మట్టి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి ఈ అక్రమ దందా మొదలవుతుందన్నారు. కె.బిట్రగుంట చెరువును వదల్లేదు.. బిట్రగుంట చెరువులో 20 రోజులుగా మట్టిని తవ్వుతూ టంగుటూరు మండలానికి తరలిస్తున్నారు. ఈ మట్టిని తరలించటానికి ట్రాక్టర్లు రాంగ్రూట్లో వస్తున్నా జరిమానా వేసిన దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. యథేచ్ఛగా గ్రావెల్, మట్టి అక్రమ రవాణా ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమ మైనింగ్ చెరువుల్లో అక్రమ తవ్వకాలు అక్రమ మైనింగ్తో పాటు ఆక్రమణలో చెరువులు భారీగా లబ్ధిపొందుతున్న ఇటుక బట్టీల వ్యాపారులు ప్రభుత్వానికి, మైనింగ్ ఆదాయానికి భారీగా గండి చోద్యం చూస్తున్న మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు అక్రమ మైనింగ్కు అడ్డుకట్ట వేయాలంటున్న ప్రజలు -
టీడీపీ నేత అత్యుత్సాహం
ఉలవపాడు: మండల కేంద్రం ఉలవపాడుకు చెందిన టీడీపీ మండల అధ్యక్షుడి కుమారుడు, టీడీపీ నాయకునిగా చెలామణీ అవుతున్న రాచగల్ల శివప్రసాద్ ఉపాధి కూలీలపై శనివారం అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయన చేష్టలకు కూలీలు తిరగబడ్డారు. వివరాలు.. ఉలవపాడు దర్గా సెంటర్కు చెందిన 15 మంది కూలీలు రోజూ ఉపాధి పనులకు వెళ్తున్నారు. శనివారం ఉదయం కూడా పనులకు వెళ్తున్న సమయంలో సదరు టీడీపీ నాయకుడు కూలీలు వెళ్తున్న ఆటోను ఆపి మీరు కరువు పనికి రావద్దని వారితో వాగ్వాదానికి దిగాడు. మీరు పనికి వెళ్తే మిగిలిన వారికి కూడా మష్టర్ వేయనని బెదిరించాడు. అదే సమయంలో మేట్కు ఫోన్ చేసి ఆ 15 మంది కూలీలకు మష్టర్ వేయవద్దని హుకుం జారీ చేశాడు. అయినా ఆ కూలీలు పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. మీకు హాజరు వేయలేనని మేట్ స్పష్టం చేశాడు. మిగిలిన కూలీలు కూడా ఆ 15 మంది కూలీలకు మీరు పనులకు రావొద్దని చెప్పారు. దీంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చారు. రెండో శనివారం కావడంతో కార్యాలయం మూత వేసి ఉంది. అక్కడకు వచ్చిన సదరు టీడీపీ నాయకుడిని ఇలా ఎందుకు చేస్తున్నావని నిలదీయడంతో అందరూ గుమిగూడారు. టీడీపీ నాయకులకు తమ ఉపాధి పనిపై పెత్తనం ఏంటని తిరగబడ్డారు. 15 మంది కూలీల్లో కూడా అధిక శాతం మంది టీడీపీ సానుభూతిపరులు కావడం విశేషం. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజలు తిరగబడుతున్న పరిస్థితి మండలంలో నెలకొంది. అంతేకాకుండా ఫొటోలు తీస్తున్న కొందరు పత్రికా విలేకరులపై కూడా సదరు టీడీపీ నేత చిందులు తొక్కడం గమనార్హం. తారు రోడ్డుపై మట్టి పోయడంపై విమర్శలు మరో వైపు ఉపాధి హామీ పథకం కింద జాతీయ రహదారి నుంచి వీరేపల్లి మీదుగా పాజర్ల వెళ్లే తారు రోడ్డుపై ఉపాధి కూలీలతో మట్టి పోసి గుంతలు పూడ్చడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. పంచాయితీరాజ్ ఽఆధ్వర్యంలో ఉన్న తారు రోడ్డుపై ఉపాధి పనులు ఎందుకు చేయిస్తున్నారో తెలియదు. పక్కనే ఉన్న మట్టి ఎత్తి పోసి మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు సంబంఽధించి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి పోసి ఉపాధి కూలీలకు మష్టర్లు వేస్తున్నారు. ఈ రోడ్డుకు ఎలాంటి నిధులు మంజూరు కాలేదని, తమకు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని పీఆర్ ఏఈ రమణమూర్తి చెప్పడం గమనార్హం. తిరగబడిన ఉపాధి కూలీలు -
మహిళను హత్య చేసిన నిందితుడికి సంకెళ్లు
లింగసముద్రం: మండలంలోని పెంట్రాలలో జయంపు గోవిందమ్మ హత్య కేసులో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని రాపూరి పోలమ్మ మూడో కుమార్తె జయంపు గోవిందమ్మకు గతంలో కావలికి చెందిన రమణయ్యతో వివాహమైంది. ఆ తర్వాత ఆయన కాలం చేశారు. అనంతరం ఆమె నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సాయిపేటకు చెందిన పాలకీర్తి వెంకటేశ్వర్లుతో సహజీవనం చేస్తోంది. వెంకటేశ్వర్లు నిత్యం గోవిందమ్మను అనుమానిస్తూ మానిసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. వేధింపులను తట్టుకోలేక గోవిందమ్మ సుమారు వారం రోజుల క్రితం పెంట్రాలలోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి ఉంటోంది. ఈ నెల 10వ తేదీన ఉదయం వెంకటేశ్వర్లు ఆమెను తనతో రావాలని కోరగా నిరాకరించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి తిరిగి వచ్చి మరోసారి ఇద్దరూ గొడవపడ్డాడు. 11వ తేదీ తెల్లవారు జామున పెంట్రాల గ్రామంలో ఇంటి వెనుక భాగంలో ఆమె నిద్రిస్తోంది. ఆ సమయంలో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేస్తుండగా కేకలు వేసింది. కేకలు వినిపించడంతో పోలమ్మ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. కత్తితో గోవిందమ్మపై వెంకటేశ్వర్లు దాడి చేస్తున్నట్లు గమనించారు. వారిని చూసిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది వచ్చి ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తల్లి పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లింగసముద్రం పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని గుడ్లూరు సీఐ నరేష్కుమార్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. గుడ్లూరు సీఐ తన సర్కిల్ పరిధిలోని లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం ఎస్సైలు జి.రాంబాబు, వి.వెంకటరావు, బి.ప్రేమ్కుమార్తో మూడు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాయిపేట శివారు ప్రాంతంలో అతడి ఆచూకీ కనుగొని వెంకటేశ్వర్లును శుక్రవారం అదుపులోకి తీసుకుని గుడ్లూరు పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీ కోసం కందుకూరు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కేసు నమోదు చేసి రెండు రోజుల్లో నిందితుడిని అత్యంత చాకచక్యంగా ఆరెస్టు చేసిన దర్యాప్తు అధికారి నరేష్కుమార్, ఎస్సైలను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. -
మార్కాపురంలో భారీ వర్షం
మార్కాపురం: జిల్లా కేంద్రమైన మార్కాపురంతో పాటు తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ వర్షం కురిసింది. శనివారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కురిసిన వర్షంతో మార్కాపురంలో 6.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. తర్లుపాడులో 12.2 మిల్లీమీటర్లు, పెద్దారవీడులో 8.6, పుల్లలచెరువులో 5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. మార్కాపురం నుంచి కుంట, తర్లుపాడు, తర్లుపాడు నుంచి బొడిచర్ల గ్రామాలకు వెళ్లే రహదారులపై వాగులు పొంగి ప్రవహించడంతో మధ్యాహ్నం 12 గంటల వరకూ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చింతగుంట్ల గ్రామంలో శనివారం వేకువజామున మంగమూరి రమణయ్యకు చెందిన పొలంలో ఉన్న చెట్టుపై పిడుగు పడటంతో కాలిపోయింది. ఆ చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. చెన్నారెడ్డిపల్లి ఎస్సీకాలనీలో భారీగా వర్షం నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. గృహాల్లోకి వర్షం నీరు రావడంతో అవస్థపడ్డారు. కాలనీల్లో మురుగునీరు పోయేందుకు కాలువలు కట్టి అంతర్గత రోడ్లు వేయాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. మార్కాపురం పట్టణంలోని భగత్సింగ్కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, పీఎస్ కాలనీ, ఎస్టేట్, రాజ్యలక్ష్మికాలనీ, తదితర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. మధ్యాహ్నం వరకూ ప్రజలు బయటకు రాలేక తీవ్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒంగోలులో ఈదురు గాలులతో వర్షం... ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఒంగోలులో రాత్రి పది గంటల నుంచి ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం నగర ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు మరింత ఇబ్బందిపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
అద్దంకి: గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జింక మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని జార్లపాలెం సమీపం రేణింగవరం రహదారిపై శనివారం జరిగింది. ఫారెస్ట్ బీట్ అధికారి రమేశ్ కథనం ప్రకారం.. జార్లపాలెం గ్రామ సమీపంలో ఒక జింక రోడ్డుపై పడి మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు ఫారెస్టు బీట్ అధికారి రమేశ్కు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి ఆయన జింక కళేబరాన్ని పరిశీలించి వివరాలు సమోదు చేసుకున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో జింక మృతి చెందినట్లు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వాహనదారులు వేగ నియంత్రం పాటించాలన్నారు. వణ్యప్రాణులను ఢీకొట్టి చంపడం నేరమన్నారు. ఫారెస్ట్ చట్టం ప్రకారం వారు నేరస్తులవుతారని హెచ్చరించారు. కుక్కల దాడిలో దుప్పి బలి రాచర్ల: కుక్కలు దాడి చేయడంతో చుక్కల దుప్పి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రం రాచర్ల పెద్ద చెరువులో శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. అందిన వివరాల ప్రకారం.. నల్లమల అటవీ ప్రాంతం నుంచి రాచర్ల పెద్ద చెరువులో నీరు తాగేందుకు వచ్చిన చుక్కల దుప్పిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫారెస్టు సబ్ డీఎఫ్వో బాలరాజు, డీఆర్వో కృష్ణకుమారిలు సంఘటన స్థలానికి చేరుకుని దుప్పి కళేబరాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పశువైద్యాధికారి హరిబాబుకు సమాచారం అందించారు. ఆయన వచ్చి శవపంచనామా చేశారు. ఫారెస్టు బీట్ ఆఫీసర్ లక్ష్మనాయక్ ఉన్నారు. -
బైకును ఢీకొన్న ఆటో
● కుమార్తె దుర్మరణం ● తండ్రికి తీవ్ర గాయాలు పొన్నలూరు: ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని రాజోలుపాడు సమీపంలో ఓవీ రోడ్డుపై శనివారం జరిగింది. బాధితుల బంధువుల కథనం ప్రకారం.. దర్శి మండలం బొట్లపాలెం గ్రామానికి చెందిన గంగిరెడ్డి అశోక్రెడ్డికి మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన వెన్నపూస మాలతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల చిన్నారి దానవితో పాటు ఏడాది బాబు ఉన్నాడు. అశోక్రెడ్డి కర్నూలులోని విత్తనాల దుకాణంలో పనిచేస్తూ రెండు రోజుల క్రితం భార్య, పిల్లలు చెన్నిపాడులో ఉండటంతో వారిని చూడటానికి వచ్చాడు. దీంతో శనివారం ఉదయం తన కుమార్తె దానవి, ఏడాది బాబుని తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని టిఫిన్ కోసం కె.అగ్రహరం సెంటర్కు వెళ్లాడు. అక్కడ టిఫిన్ పార్శిల్ తీసుకుని తిరిగి చెన్నిపాడు బయల్దేరాడు. ఈ క్రమంలో రాజోలుపాడు సమీపంలోకి రాగానే కందుకూరు నుంచి నేరేడుపల్లె వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఎదురుగా వచ్చి బైక్ను ఢీకొట్టడంతో కిందపడిపోయారు. దీంతో అశోక్రెడ్డి, కుమార్తె దానవికి తీవ్ర గాయాలు కాగా ఏడాది బాబుకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు స్పందించి 108కు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి క్షతగాత్రులను చికిత్స కోసం కందుకూరు తరలించారు. చిన్నారి దానవికి తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. దానవి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
19న ఒంగోలులో ట్రాక్టర్లతో ర్యాలీ
● పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం.. సంతనూతలపాడు (చీమకుర్తి రూరల్): పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఒంగోలులోని మినీ స్టేడియం, పొగాకు బోర్డు ఆర్ఎం కార్యాలయ సమీపంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు తెలిపారు. వేలాదిగా పొగాకు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అందులో భాగంగా గ్రామాల్లో ఆయన పర్యటించారు. సంతనూతలపాడు మండలంలోని మంగమూరు, చండ్రపాలెం, తక్కెళ్లపాడు, చిలకపాడు, మద్దులూరు, చీమకుర్తి మండలంలోని పిడతలపూడి గ్రామాల్లో శనివారం పర్యటించి రైతులను కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వలన రోజురోజుకూ పొగాకు ధరలు తగ్గిపోతున్నాయని తెలిపారు. ఫలితంగా రైతాంగం అప్పులపాలై రోడ్డున పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించి వేలం కేంద్రాల్లో మార్క్ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పొగాకు క్వింటాకు రూ.30 వేలు ధరలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి, రైతు కూలీ సంఘ జిల్లా సహాయ కార్యదర్శి పరిటాల కోటేశ్వరరావు, జిల్లా నాయకుడు సాగర్, రైతు సంఘ నాయకులు అబ్బూరి వెంకటేశ్వర్లు, కృష్ణారావు, పొగాకు రైతులు పాల్గొన్నారు. -
సమస్యారంభం కరిష్యామి!
వేసవి సెలవుల అనంతరం శుక్రవారం తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. మొదటిరోజే పుస్తకాలిస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైంది. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లకు కూటమి ప్రభుత్వం మరమ్మతులు చేయించకపోవడంతో, తీవ్రమైన ఎండల్లో విద్యార్థులు తాగునీరు లేక అల్లాడిపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో తొలిరోజు హాజరు కూడా వెలవెలబోయింది. ప్రకాశం జిల్లాలో 1508 స్కూళ్లలో 97,682 మందికి గాను 43,763 మంది హాజరయ్యారు. మార్కాపురం జిల్లాలో 1330 స్కూళ్లలో 90,115 మందికిగాను 46515 మంది మాత్రమే బడిబాట పట్టారు. – సాక్షి నెట్వర్క్ తాగునీటి కొరతహెచ్ఎంపాడు స్కూల్లో పనిచేయని ఆర్వో కొనకనమిట్ల జెడ్పీ స్కూల్లో పని చేయని ఆర్వో ప్లాంట్పామూరు ఎస్టీ కాలనీలో చిరిగిన బ్యాగులతో విద్యార్థులు


