ఆడ దూడలు పుట్టేందుకు ఇంజక్షన్లు
అద్దంకి: సెక్స్ సార్టెడ్ సెమన్తో పశువులకు ఆడ దూడలు పుట్టే విధానంపై పశుసంవర్థకశాఖ సిబ్బంది పశుపోషకులకు అవగాహన కల్పించాలని జేడీ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పశు వైద్యశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పశుసంవర్థకశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. సాధారణ సెమన్తో పశువులకు గర్భధారణ జరిగేలా గతంలో ఉండేదన్నారు. ప్రస్తుతం సెక్స్ సార్టెడ్ సెమన్తో ఆడదూడలు నూరు శాతం పుడతాయని తెలిపారు. ఈ ఇంజక్షన్ గతంలో రూ.500 ఉండగా ప్రస్తుతం రూ.150కే అందుబాటులో ఉన్న విషయాన్ని పశుపోషకులకు తెలియజేసి ఆడ దూడల పుట్టుకతో పశువుల అభివృద్ధి, తద్వారా పాల వృద్ధికి దోహదపడాలని చెప్పారు. పాడి రైతులు బాగుంటే గ్రామాభివృద్ధి, తద్వారా మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మార్చి నాటికి లక్ష్యాలను అధిగమించాలని, రాబోయే కాలంలో నిర్వహించనున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్యులు సైదయ్య, రాంబాబు, 1962 మొబైల్ వాహన వైద్యులు స్వేత, నాగబాబు, నౌషద్, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మవరంలో మెగా గోకులం స్థలాన్ని
పరిశీలించిన జేడీ...
మండలంలోని ధర్మవరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న మెగా గోకులం స్థలాన్ని జేడీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా గోకులంను ప్రభుత్వం స్థలంలో ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఈ మెగా గోకులం నిర్మించిన తరువాత మేత లేని పశుపోషకుల పశువులను ఇక్కడకు తెచ్చి మేపుకుని పాలు పిండుకుని వెళ్లవచ్చని తెలిపారు. అందుకోసం అయ్యే వ్యయాన్ని పశుపోషకులు భరిస్తే సరిపోతుందని చెప్పారు. జేడీ వెంట ఏడీ డాక్టర్ కసుకుర్తి వీరబ్రహ్మయ్య, గ్రామస్తులు ఉన్నారు.
పశుసంవర్థకశాఖ జేడీ వెంకటేశ్వరరావు


