నిబద్ధత కలిగిన నాయకుడు శంకరారెడ్డి
ఒంగోలు టౌన్: నిబద్ధత కలిగిన నాయకుడు మేదరమేట్ల శంకరారెడ్డి అని, నేటి తరాలకు ఆదర్శంగా నిలిచారని వక్తలు కొనియాడారు. నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులోని బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో మేదరమెట్ల శంకరారెడ్డి దశదిన కర్మ సందర్భంగా గురువారం సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన కుమారులు రాజశేఖర్, డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన సంస్మరణ సభలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలువురు ప్రముఖులు, మాజీ శాసనసభ్యులు హాజరయ్యారు. శంకరారెడ్డితో తమకున్న అనుభవాలు గుర్తు చేసుకున్నారు. చివరి శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడ్డారని, ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటరీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరణం బలరాం, కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, బుర్రా మధుసూధనరావు, ముక్కు కాశిరెడ్డి, బాచిన చెంచుగరటయ్య, పీడీసీసీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత శంకరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


