భూములిచ్చిన రైతులపై వేధింపులేంటి
కందుకూరు: ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులను, స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు విచారణ పేరుతో వేధించడం సరైన పద్ధతి కాదని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఇటీవల ఇండోసోల్ కంపెనీకి చెందిన నీటి తరలింపు పైప్లైన్లు దగ్ధమైన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటనతో సంబంధం ఉందంటూ గ్రామ వైఎస్సార్ సీపీ నాయకులు నక్కల శరత్, కళ్యాణ్లను పోలీసులు స్టేషన్లో అక్రమంగా నిర్బంధించారు. అనంతరం విచారణ పేరుతో వేధించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో గురువారం వైఎస్సార్సీపీ నాయకులను బుర్రా పరామర్శించారు. అనంతరం గ్రామంలోని సచివాలయంలో ఉన్న గుడ్లూరు ఎస్సై వెంకట్రావ్ని కలిసి ఆయన ప్రశ్నించారు. చెత్తకుప్ప పక్కనే ఉన్న పైప్లైన్లు ప్రమాదవశాత్తు దగ్ధమైతే ఎటువంటి ఆధారాలు లేకుండా వైఎస్సార్ సీపీ నాయకులను బాధ్యులను చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రోజుల తరబడి విచారణ పేరుతో వారిని వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు. పరిశ్రమలు వస్తే తమ జీవతాలు బాగుపడతాయనే ఉద్దేశంతో భూములిచ్చి సహకరించిన రైతులను ఈ విధంగా పోలీసులు వేధించడం దుర్మార్గమైని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు గ్రామానికి వచ్చి విచారణ పేరుతో రైతులను ఇబ్బందులు పెట్టడం మానుకోవాలని, పోలీసుల తీరు మారకపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతగా ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఉంటే అసలైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలే తప్పా అమాయకులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం తగదన్నారు. ఇటువంటి చర్యల వల్ల పోలీసులపై ఉన్న నమ్మకం పోతుందని, ఇప్పటికై నా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నాయకులు బిల్లా రమణయ్య, కాట్రగడ్డ వెంకట్రావ్, కోర్సిపాటి రవికాంత్రెడ్డి, తాటిపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనను వైఎస్సార్ సీపీ నాయకులకు అంటగడతారా
విచారణ పేరుతో రైతులను, నాయకులను వేధించడం సరైన పద్దతి కాదు
చేవూరులో పోలీసులు తీరుపై బుర్రా ఆగ్రహం
భూములిచ్చిన రైతులపై వేధింపులేంటి


