లడ్డ్డూపై తప్పుడు ప్రచారంతో డైవర్షన్ పాలిటిక్స్
పశ్చాత్తాపంతో క్షమాపణ కోరకపోతే ప్రజా తిరుగుబాటు తప్పదు వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల, దద్దాల ధ్వజం
కనిగిరిరూరల్: కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం.. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డ్డూపై అసత్య ప్రచారాలు చేస్తున్న మానవ రూప రాక్షసులు చంద్రబాబు, కూటమి నేతలు అని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్డర్ దద్దాల నారాయణ యాదవ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్నలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు చేసిన ప్రచారం అబద్ధమని సీబీఐ సిట్, చార్జిషీట్ సాక్షిగా బట్టబయలు కావడంతో.. వారి పై వస్తున్న ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకే కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీవారి ప్రసాదంపై ఎటువంటి ఆరోపణలు చేయని, చంద్రబాబు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక.. కేవలం రాజకీయ లబ్ధి కోసం శ్రీవారి ప్రసాదంపై విషప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక.. ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే .. అత్యంత పవిత్రమైనా.. విశ్వాసమైన శ్రీవారి ప్రసాదంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. కూటమి నేతలను ఆ దైవం క్షమించదన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులను జైలుకు పంపాలనే దురుద్దేశంతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటుకు చంద్రబాబు తెరతీశాడని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్ల పై దాడులు, అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా పశ్చాత్తాపం ప్రకటించి, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రజా తిరుగుబాటు జరుగుతుందని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ శ్రీవారి లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని సుప్రీం కోర్టు నివేదికలో స్పష్టం చేసినా కేవలం వైఎస్సార్ సీపీ నాయకులపై బురద జల్లేందుకే చంద్రబాబు, కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. భక్తుల మనోభావాలు మరింత దెబ్బతినేలా.. లడ్డూ తయారీకి బాత్రూం క్లీనింగ్కి వాడే రసాయనాలు వంటి కెమికల్స్ వాడారంటూ మరీ దిగజారుడు రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎస్కే అబ్దుల్ గఫార్, జెడ్పీటీసీలు మడతల కస్తూరిరెడ్డి, ఒకేరెడ్డి, పులి శాంతి గోవర్ధన్రెడ్డి, తమ్మినేని సుజాతరెడ్డి, ఆర్ మాణిక్యరావు, పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, ఆవుల భాస్కర్ రెడ్డి, కటికల వెంకటరత్నం, ఆయిమల్ల నాగమణి, డాక్టర్ ఆవుల కృష్ణారెడ్డి, డాక్టర్ రసూల్, సిరుప వెంకట గోవర్ధన్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు యక్కంటి శ్రీను, జీ బొర్రారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, శ్యామల సాంబిరెడ్డి పోలక సిద్దారెడ్డి, ముల్లంగి శ్రీహరిరెడ్డి, దరిశి సుబ్రహ్మణ్యం, ఎస్కే రహీం, దాదిరెడ్డి మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


