భద్రంగా బండి నడపండి
ఒంగోలు టౌన్: భద్రంగా వాహనాలు నడపడం ద్వారా క్షేమంగా ఇంటికి చేరాలని ఎస్పీ హర్షవర్థన్రాజు సూచించారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బిడ్డలపై ప్రేమతో తల్లిదండ్రులు వాహనాలు కొనిస్తున్నారని, ఉత్సాహంతో రోడ్డు మీదకు వచ్చిన యువకులు వేగంగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెప్పారు. కన్నబిడ్డలు రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబ సభ్యులు పడే వేదన అంతాఇంతా కాదన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. వాహనాలను వేగంగా నడుపుతున్న సమయంలో ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారన్న సంగతి మర్చిపోకూడదని హితవు పలికారు. ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని, పెద్దలు, పిల్లలు మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవాలని, వాటిని పాటించడం వలన రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ జగదీష్, వన్టౌన్ సీఐ నాగరాజు, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, ఆర్ఐ రమణారెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు.
ఎస్పీ హర్షవర్థన్రాజు


