మున్సిపల్ కమిషనర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
దర్శి: దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో శనివారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పలు కీలక డాక్యుమెంట్లు పరిశీలించారు. డాక్యుమెంట్లతో పాటు బంగారం స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సాయంత్రం వరకు పలు డాక్యుమెంట్లు పరిశీలించారు. ఆ తరువాత ఆయన్ను కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు మాట్లాడుతూ 1990లో రెవెన్యూ అధికారిగా ఉన్న ఆయన నెల్లూరు, సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండలలో పని చేశారన్నారు. దర్శిలో మూడేళ్లకుపైగా కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారన్న అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల మేరకు తాము తనిఖీలు చేశామన్నారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. దర్శి, ఒంగోలు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండలలో కూడా సోదాలు చేస్తున్నామని చెప్పారు. అన్నీ ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో భారీ మొత్తంలో ఆస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇంకా సోదాలు పూర్తి కాలేదని, అన్నీ పరిశీలించిన తరువాత ఎంత ఆస్తులు గుర్తించామో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎవరైనా అధికారులు పనులు చేయాలంటే లంచాలు అడిగినా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా, ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టినట్లు సమాచారం ఉన్నా 1064 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. సోదాల్లో సీఐ పీ శ్రీనివాసరావు, ఎస్ఐ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


