విద్యుదాఘాత బాధితుడికి రూ.2.25 లక్షల ఆర్థికసాయం
● బాలుడి తల్లికి అందజేసిన వైఎస్సార్ సీపీ నేతలు
మార్కాపురం రూరల్ (మార్కాపురం): విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో గుంటూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి వైఎస్సార్ సీపీ నేతలు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు. మార్కాపురం పట్టణంలోని తర్లుపాడు రోడ్డులో గల సబ్స్టేషన్ సమీపంలో షేక్ కాశీంవలి అనే బాలుడు తమ ఇంటిపై ఆడుకుంటూ విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. బాలుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచన మేరకు అన్నా మిత్రమండలి ప్రతినిధులు రిటైర్డు వార్డెన్ నజీర్ అహ్మద్, పట్టణ వైఎస్సార్ సీపీ ఉపాధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా, 18వ బ్లాక్ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి సయ్యద్ గఫూర్, సీఎం ఖాశీం తదితరులు 1.20 లక్షల రూపాయల నగదును సోమవారం ఆస్పత్రిలో బాలుడి తల్లికి అందజేశారు. దాతల సహకారంతో ఇప్పటికే రూ.53 వేలు అందజేసిన 17వ బ్లాకు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి షేక్ కరీముల్లా.. సోమవారం మరో రూ.1.05 లక్షల నగదు అందించి దాతృత్వం చాటుకున్నారు.


