అవకతవకలు రూ.25 లక్షలు..రికవరీ రూ.32 వేలు
లింగసముద్రం: ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో సుమారు రూ.25 లక్షలు అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే ..డ్వామా పీడీ కేవలం రూ.32 వేల రికవరీ చేయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ కట్టా శ్రీనివాసులు అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలోని 16 పంచాయతీల్లో డీఆర్పీ అధికారులు రూపొందించిన నివేదికను నెల్లూరు జిల్లా డ్వామా పీడీ గంగాభవాని విచారించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పథకం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్లలో రూ.9.65 కోట్లతో జరిగిన పనులపై గ్రామాల్లో డీఆర్పీలు తనిఖీలు నిర్వహించి కూలీలను విచారించారు. విచారణ సందర్భంగా ఏపీఓ సమీష్బాషా, డీఆర్పీలు పంచాయతీల వారీగా నివేదికలను చదివి వినిపించారు. డీఆర్పీలు చూపించిన రికార్డులు, మస్టరు కార్డుల్లో కూలీల వేలిముద్రలు దిద్దుబాటు, కొట్టివేతలు ఉండడం, కూలీల వేలిముద్రలు, సంతకాలు లేకపోయినా డబ్బులు చెల్లించినట్లు గుర్తించారు. పలు చోట్ల మొక్కలు లేకపోవడాన్ని కూడా గుర్తించారు. డీఆర్పీలు మొత్తం రూ.25 లక్షల మేరకు అవకతవకలు జరిగినట్లు గుర్తించినా డ్వామా పీడీ ఉపాధి సిబ్బందికి కేవలం రూ.32,243 రికవరీ చేయాలని ఆదేశించడం విశేషం. జిల్లా విజిలెన్స్ అధికారి విజయలక్షి, ఏపీడీలు శ్రీనివాసులు, బాబూరావు, ఎస్ఆర్పీ రవి తదితరులు పాల్గొన్నారు.


