సర్కారు వెనుకబడి!
స్థానిక ఎన్నికల నిర్వహణపై అనుమానాలు త్వరలో మున్సిపాలిటీ, పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తి మార్చి 9వ తేదీలోగా ఓటర్ల జాబితా ప్రకటించాలని ఈసీ ఆదేశాలు ఓటర్ల జాబితా తయారీలో అధికార యంత్రాంగం బిజీ ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, 8 మున్సిపల్, నగర పంచాయతీలు ఉమ్మడి జిల్లాలో 925 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్లపై ముందుకు పడని అడుగు స్పెషల్ ఆఫీసర్లకు ప్రతిపాదనలు
ఈసీ హడావుడి..
మార్కాపురం:
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 925 గ్రామ పంచాయతీలున్నాయి. మార్కాపురం జిల్లాలో 406, ప్రకాశం జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు, ఒంగోలు, సంతనూతలపాడు, దర్శి, కొండపి, అద్దంకి నియోజకవర్గాల్లోని 925 గ్రామ పంచాయతీల సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. అలాగే మార్చి 17 తో మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగియనుంది. వీటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉండడంతో హడావుడి ప్రారంభమైంది. మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. ఆ తర్వాత వార్డుల రిజర్వేషన్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. దీనితో ఇప్పటి నుంచే ఆయా వార్డుల్లో పంచాయితీ సర్పంచ్ల పదవులకు, మున్సిపల్ చైర్మన్ల పదవులకు పలువురు ఆశావహులు అంచనాలు వేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఓటర్ల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. కొత్తగా వార్డులు, పంచాయతీలు ఎన్నికల నిర్వహణపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబరు 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా షెడ్యూల్ను ప్రకటించినప్పటికీ మళ్లీ వాయిదా వేసింది. మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయంగా వేడెక్కింది. జిల్లాలో ఎన్ని పంచాయతీలకు, మున్సిపాలిటీల్లో ఏయే మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓటర్ల జాబితా తయారీలో బిజీ..బిజీ
మార్చి 9వ తేదీ నాటికి ఓటర్ల జాబితా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ ఈనెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. 2026 జనవరి 1వ తేదీకి 18 ఏళ్లు నిండిన వారికీ ఓటు హక్కు కల్పించేలా కొత్త ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వార్డులు, ఒంగోలు కార్పొరేషన్లో డివిజన్ల వారీగా వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసీ ఆదేశాల ప్రకారం ఒక ఇంటిలో ఉండే ఓటర్లు ఒకే పోలింగ్ బూత్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
రిజర్వేషన్లపై ఆశావహుల చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో గ్రామాలు, పట్టణాల్లో ఆశావహుల సందడి ప్రారంభమైంది. ఏ నలుగురు కలిసినా వార్డుల రిజర్వేషన్లు, పదవుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్లో 50 డివిజన్లు, మార్కాపురంలో 35 వార్డులు, కందుకూరులో 32, అద్దంకిలో 27, పొదిలిలో 20, కనిగిరిలో 20, దర్శిలో 27, గిద్దలూరు 20, చీమకుర్తిలో 27 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో దర్శిలో 20, చీమకుర్తిలో 20, అద్దంకిలో 20 ఉండగా ఇటీవలే 7 వార్డులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కందుకూరు మున్సిపాలిటీకి, పొదిలి నగర పంచాయతీలకు గతంలో కూడా ఎన్నికలు నిర్వహించలేదు. గ్రామాల విలీనంపై పలువురు కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు వాయిదా వేశారు.


