మొక్కజొన్న మేలు చేసేనా..!
మార్కాపురం:
గత ఖరీఫ్ సీజన్లో సాగుచేసిన పత్తి, మిర్చి పైర్లను మోంథా తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీగా అప్పుల పాలయ్యారు. ఆ నష్టపరిహారం ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో రబీలో సాగుచేసిన మొక్కజొన్న దిగుబడులపై రైతుల ఆశలు పెంచుకుంటున్నారు. మార్కాపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 మండలాల్లో 19,052 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు సుమారు 30 వేల వరకూ ఖర్చు వస్తోంది. దాదాపు 3 టన్నుల వరకూ దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. మార్కెట్లో టన్ను రేటు రూ.35 వేల వరకూ ఉంది. ఎకరా మొక్కజొన్న నాటడానికి 3 వేల రూపాయలు, కలుపు మందుకు 1500 రూపాయలు, ఎరువులకు సుమారు 12 వేలు, పురుగుమందులకు 3 వేలు, జుట్లు పీకడానికి 2200, సేద్యపు ఖర్చుల కింద 2 వేలు, కోత ఖర్చుల కింద దాదాపు 6 వేల రూపాయల ఖర్చు వస్తోంది. ఈ నేపథ్యంలో మొక్కజొన్న దిగుబడులు, తద్వారా వచ్చే లాభాలపై రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటివరకూ ఉన్న గిట్టుబాటు ధర కొనసాగినా, పత్తి, మిర్చి సాగుచేసి వచ్చిన నష్టాలను మొక్కజొన్న ద్వారా తీర్చుకోవచ్చని రైతులు భావిస్తున్నారు.
మార్కాపురం జిల్లాలో 19,052
హెక్టార్లలో మొక్కజొన్న సాగు
దిగుబడులు, లాభాలపై రైతుల ఆశలు


