కాలం చెల్లిన ఆహారం..నిల్వ ఉన్న మాంసం
హోటల్స్, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మికదాడులు తూనికలు, కొలతల అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిబంధనలకు విరుద్ధంగా ఫ్రిజ్ల్లో నిల్వ చేసిన 50 కేజీల మాంసం స్వాధీనం 20 మందిపై కేసులు నమోదు
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తూనికలు, కొలతల అధికారులతో కలిసి శనివారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్స్ షాపుల్లో సంయుక్తంగా దాడులు చేపట్టారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడిన అధికారులు హోటల్స్లో, రెస్టారెంట్లలో నిల్వ ఉంచిన మాంసాహారాలను గమనించారు. రోజుల తరబడి ఫ్రిడ్జ్లలో ఉంచిన మాంసాన్ని చూసిన అధికారులు నివ్వెరబోయారు. 50 కేజీల మాంసాన్ని గమనించిన అధికారులు ఆ మాంసాన్ని ధ్వంసం చేశారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను కూడా కనుగొన్నారు. అదేవిధంగా స్వీట్ షాపులు, బేకరీల్లో కూడా నిల్వచేసిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఆహార పదార్థాల్లో తయారు తేదీ కానీ, గడువు తేదీకానీ లేకుండా విక్రయిస్తున్న వాటిని, కాలం చెల్లిన వాటిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 21 శాంపిల్స్ సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తున్నామని అధికారులు తెలిపారు. నిబంధనలు పాటించని నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో తూనికలు, కొలతల అధికారులు మొత్తం 20 కేసులు నమోదు చేశారు. మొత్తం నివేదికను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారికి సమర్పిస్తామని జిల్లా ఫుడ్ కంట్రోలర్స్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారులు తెలిపారు.


