ప్రాణం తీసిన అధికారుల నిర్లక్ష్యం
ఇందుకూరుపేట: విద్యుత్ లైన్ పనులు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేటలో శనివారం చోటుచేసుకొంది. పోలీసుల కథనం మేరకు.. మైపాడు– నెల్లూరు రోడ్డు విస్తరణలో భాగంగా పాత విద్యుత్ లైన్లను తొలగించి కొత్త లైన్లు ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన ప్రళయకావేరి జాలయ్య (44)తో పాటు మరికొందరు మండలంలోని జగదేవిపేటలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసేందుకు వచ్చారు. కొత్త స్తంభాలను ట్రాక్టర్ సాయంతో ఏర్పాటు చేసే క్రమంలో పాత లైన్కు తగలడంతో జాలయ్య, ఆవుల శీను, వెంకటరమణయ్యలకు కరెంట్ షాక్ తగిలింది. శీను, వెంకటరమణయ్య స్వల్పగాయాల పాలవగా, జాలయ్య తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆయన్ను ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు. విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత లైన్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి పనులు చేయాల్సి ఉండగా, ఇందుకు భిన్నంగా కరెంటు నిలిపివేయకుండా పనులు చేయడంతోనే ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.


