మార్షల్ ఆర్ట్స్ నాంచాక్ జాతీయ జడ్జిలుగా జిల్లావాసుల
ఒంగోలు: మార్షల్ ఆర్ట్స్ నాంచాక్ జాతీయ ఏ గ్రేడ్ జడ్జిలుగా జిల్లావాసులు ఇద్దరు ఎంపికయ్యారు. జనవరి 30 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కో ఆపరేటివ్ ఎస్టేట్ దాదానగర్లో నిర్వహించిన 4వ జాతీయ నాంచాక్ పోటీల రిఫరీ జడ్జి సెమినార్కు దేశవ్యాప్తంగా 80 మంది హాజరయ్యారు. రిఫరీ జడ్జిలుగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రకాశం జిల్లా జపాన్ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు టి.శ్రీనివాసరెడ్డి, ఏపీ టెక్నికల్ డైరెక్టర్ కె.రఘునాథబాబు నాంచాక్ కటా విభాగంలో జడ్జిలుగా ఏ గ్రేడ్ సర్టిఫికెట్లు పొందారు. ఈ సందర్భంగా వీరికి నేషనల్ నాంచాక్ అసోసియేషన్ అధ్యక్షుడు మాలిక్ విజయ్ కపూర్, ప్రధాన కార్యదర్శి బబుల్ వర్మ, నేషనల్ కోచ్ ముకుంద్ బర్దన్తో పాటు జిల్లా భాష్యం లిటిల్ చాంప్స్ జెడ్సీవో బి.సుశీల, నారాయణ స్కూల్స్ క్లస్టర్ ప్రిన్సిపాల్ వాకా వేదవతి వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
ఒంగోలు టౌన్: నగరంలో చైన్ స్నాచింగ్ ముఠా రెచ్చిపోతోంది. ద్విచక్రవాహనాలపై సంచరిస్తూ ఒంటరిగా మహిళలు కనిపిస్తే కళ్లు తెరిచి మూసే లోపే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే సంతపేటలోని పశువుల ఆసుపత్రి ఎదరుగా శేషమ్మ పాలబూత్ నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో పాల బూత్ తెరచి సర్దుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి మోటారు బైకుపై వచ్చి శేషమ్మ మెడలోని బంగారు చైన్ను లాక్కొని పారిపోయారు. శేషమ్మ వెంటనే తేరుకొని టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు పొగాకు బ్యారెన్లు దగ్ధం
● రూ.5 లక్షల ఆస్తి నష్టం
కొండపి: ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి రెండు పొగాకు బ్యారెన్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నేతివారిపాలెం గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నేతివారిపాలెం గ్రామానికి చెందిన పోయి వినోద్ కుమార్, తుళ్లూరి సత్యవతి, తుళ్లూరు వెంకటరావు, పొగాకున సాగు చేస్తున్నారు. వారికి సంబంధించిన రెండు బ్యారన్లలో పొగాకు క్యూరింగ్ చేస్తుండగా అల్లిక కర్ర జారి మొద్దు గొట్టంపై పడటంతో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే బ్యారన్ లోపలి టైర్లు, కర్రలు, పొగాకు మొత్తం కాలిపోయాయి. ప్రమాదంలో రూ.5 నుంచి రూ.6 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.


