మేల్కొనకుంటే శ్రీశైలం సీన్ రిపీట్!
త్రిపురాంతకం:
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ ఘటనలు భక్తుల్లో ఆధ్యాత్మికతను దెబ్బతీస్తూ ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆలయాల్లో భక్తుల రద్దీని నియంత్రించడం, తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందమే అందుకు కారణం. మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 13 నుంచి నిర్వహించే ఉత్సవాలకు ఇప్పటి వరకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం భక్తుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీకి తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలం కావడంతో శివ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శివమాలధారులపై పోలీసులు లాఠీలు ఝులిపించడంతో ఆగ్రహంతో రగిలిపోయిన భక్తులు మల్లన్న సన్నిధి ఎదుట ఆందోళనకు దిగిన దృశ్యాలు.. జిల్లాలోని శివ భక్తులను ఆలోచనలో పడేశాయి. త్రిపురాంతకం క్షేత్రంలో ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్త జనులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూజల సమయంలో, క్యూలైన్లలో తోపులాటలను నివారించడంతోపాటు తగిన భద్రత కల్పిస్తారా అని భక్తుల్లో చర్చ నడుస్తోంది. త్రిపురాంతకేశ్వరుని సన్నిధిలో శివరాత్రికి మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్య ఏటికేటికీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడలేదని తెలుస్తోంది.
ట్రాఫిక్ తిప్పలు తప్పేనా?
కొండపైన చదును చేసినందున వాహనాలు పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంది. కొండకు రెండు వైపులా రోడ్డు ఉన్నందున వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయంలో వాహనాలు నిలిపివేసినా మిగిలిన వేళ్లల్లో వాహనాలను కొండపైకి పంపాలన్న అభిప్రాయం భక్తుల నుంచి వ్యక్తమవుతోంది. ఆలయాలకు వెళ్లే రోడ్డులో సాగర్ కాలువ వంతెన వద్ద ఏటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి భక్తులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. ఈ వంతెన వద్ద పోలీసులకు భక్తులు సహకరిస్తేనే ట్రాఫిక్ సమస్య తప్పుతుంది. అడ్డదిడ్డంగా వాహనాలు నడిపితే రాకపోకలు నిలిచిపోవడం ఖాయం. వీఐపీల దర్శనానికి టైమింగ్ స్లాట్ విధించాలని పలువులు అభిప్రాయపడుతున్నారు.
త్రిపురాంతకంలో శివరాత్రి ఉత్సవాలకు లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం
ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందా అని సంశయిస్తున్న భక్తులు
శ్రీశైలంలో మాదిరి ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన
క్యూలైన్లు, మెట్ల మార్గంలో భక్తుల రద్దీని
కట్టడి చేయాలి.
గంటల తరబడి క్యూలైన్లలో ఉండే భక్తులకు
కనీసం మంచినీరు, మజ్జిగ అందించాలి.
ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు
ఏర్పాటు చేయాలి.
ఆలయంలో అభిషేకాలు, పూజలకు ప్రత్యేక
ఏర్పాట్లు చేయాలి.
రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులు
ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
బయో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి.


