పొదిలి: పట్టణంలోని తాలూకా కార్యాలయం సమీపంలో నివాసం ఉండే బూచిరాజు నాగరాజు (45) పెయింట్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వీధిలో ఓ ఇంటికి పెయింట్ వేస్తున్నాడు. పెయింట్ వేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పక్కనున్న విద్యుత్ వైర్లు తగలడంతో నాగరాజు విద్యుదాఘాతానికి గురై కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. తీవ్రంగా గాయపడిన నాగరాజు కొద్దిసేపటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


