సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలి
ఒంగోలు టౌన్: కార్మికులను కట్టుబానిసలుగా మార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12వ తేదీ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం నగరంలోని నెల్లూరు బస్టాండు సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం, చర్చి సెంటర్, ట్రంక్ రోడ్డు, అద్దంకి బస్టాండు సెంటర్ మీదుగా కర్నూలు రోడ్డు, ఆర్టీసీ బస్టాండు సెంటర్ వరకు భారీ మోటారు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు, యాజమాన్యంతో బేరసారాలాడుకునే హక్కులను కోల్పోతారని తెలిపారు. పరిమితకాల ఉద్యోగాలతో ఉద్యోగ భద్రత కోల్పోతారని, కార్మికులు కట్టు బానిసలుగా మారతారని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకొచ్చిన వీబీజీ రామ్ జీ పథకంతో రాష్ట్రాలపై భారం పడుతుందని, గ్రామీణ జీవనం అస్తవ్యస్తం అవుతుందని చెప్పారు. విత్తన బిల్లుతో రైతాంగం తీవ్రంగా నష్టపోతారని, విద్యుత్ చట్టంతో మొత్తం ప్రజల జేబులకు చిల్లు పడుతుందని, అమెరికాతో చేసుకున్న ఒప్పందంతో రైతాంగం నడివీధిన పడే పరిస్థితి దాపురిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ నిర్వహించే దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యం.రమేష్, జీవి కొండారెడ్డి, పి.కల్పన, ఆర్.వెంకటరావు, కంకణాల ఆంజనేయులు, చుండూరి రంగారావు, మోహన్, హనుమారెడ్డి, రాజీవ్ రతన్ దేవ్, ఎంఏ సాలార్, జీ.శేషయ్య, చిరంజీవి, రాజశేఖర్, పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.


