దేవదేవుడే ధ్వజమెత్తాలి!
పాలకుల నిర్లక్ష్యంపై..
కొనకనమిట్ల:
జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెలుగొండ స్వామి దేవస్థానం అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేయడంపై భక్తుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్న భక్తులు ఇక్కడి పరిస్థితులు చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెలుగొండ క్షేత్రంలో స్వామివారిని సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిగా భక్తులు భావించి మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయంలో కనీస వసతులు కల్పించకపోవడం.. మరోవైపు బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్నా దేవదాయశాఖగానీ, ప్రజాప్రతినిధులుగానీ స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆదాయం వస్తున్నా అదే తీరు..
వెలుగొండ క్షేత్రంలో స్వామివారు, కొండపైన అమ్మవారిని శనివారాలు, పండగలు, ప్రత్యేక పర్వదినాల్లో భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఏటా 13 రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీవారి ఆలయం దేవదాయ శాఖ పరిధిలో ఉండటంతో ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా దుకాణాలు, తలనీలాల వేలం హక్కులు, భక్తులు సమర్పించే కానుకల రూపంలో ఏటా సుమారు రూ.15 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. స్వామివారి భూములకు సంబంధించి కౌలు వేలం ద్వారా కొంత ఆదాయం సమకూరుతోంది. అయినప్పటికీ ఈ పురాతన ఆలయం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండటం భక్తుల్లో అసంతృప్తి, ఆగ్రహానికి కారణమవుతోంది. గతంలో కొంతమంది దాతల సహకారంతో ఆలయంలో కల్యాణ మండపం, ప్రవేశ ద్వారం వద్ద ఆర్చి, మెట్ల మార్గంలో రేకుల షెడ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మెట్ల మార్గంలో రేకులు ఈదురు గాలులకు లేచిపోయి దర్శనమిస్తున్నాయి. అన్నదాన సత్రాల నిర్వాహకులు, దాతలు అందిస్తున్న సహకారం తప్ప ప్రభుత్వం నుంచి ఆలయ అభివృద్ధికి ఎలాంటి సహకారం అందడం లేదన్నది బహిరంగ రహస్యం.
ముక్కు పుటాలు అదిరేలా ‘ముసి’
వెలుగొండ క్షేత్రాన్ని ఆనుకుని ఉండే ముసి వాగు గతంలో వర్షాలు కురిసిన సమయంలో నీటి ప్రవాహం సజావుగా సాగేంది. ప్రస్తుతం ముసి వాగులో చిల్లచెట్లు భారీగా పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. నెలల తరబడి నిల్వ ఉన్న నీరు మురికిగా మారి దుర్వాసన వస్తున్నాయి. ఇటీవల ఆలయ పరిసరాల్లో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటులో భాగంగా కొన్ని చెట్లను, కొమ్మలను నరికి ముసి వాగులో పడేయడంతో సమస్య మరింత జఠిలమైంది. ఇదిలా ఉండగా ఆలయం ఎదురుగా ఉన్న శ్రీవారి పుష్కరిణి అధ్వానంగా తయారైంది. కోనేరు చుట్టూ చెట్లు పెరగడంతో నీరంతా అపరిశుభ్రంగా మారింది. ముసి వాగుతోపాటు కోనేరు పరిసరాలను బాగు చేయకుండా వదిలేయడంపై భక్తులు మండిపడుతున్నారు. మరో నెల రోజుల్లో నిర్వహించనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భక్తులు స్నానమాచరించేందుకు వీలుగా కోనేరును అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది.
ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తాం
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడం వల్ల ధ్వజ స్తంభం విరిగిపడింది. ఈ పరిణామంతో ఆలయ గర్భగుడి అంచు కొంతమేర దెబ్బతింది. ఈ విషయాన్ని దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు, అలాగే ఉభయదాతలైన గార్లదిన్నె గ్రామస్తులకు తెలియజేశాం. త్వరలోనే నూతన ధ్వజ స్తంభం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– చెన్నకేశవరెడ్డి, ఆలయ ఈఓ
దేవదేవుడే ధ్వజమెత్తాలి!
దేవదేవుడే ధ్వజమెత్తాలి!


