కాపులను అణగదొక్కడమే టీడీపీ లక్ష్యం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు
కొత్తపట్నం: రాష్ట్రంలో ఉన్న కాపులను అణగదొక్కడాన్ని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొత్తపట్నంలో ఆదివారం నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 1989 సంవత్సరానికి ముందు కాపులు ఎదుగుతారనే ఉద్దేశంతో తమ నాయకుడు వంగవీటి రంగాను టీడీపీ ప్రభుత్వంలోనే హత్య చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో నోరు కలిగిన వ్యక్తులతో పాటు కాపులను అణగదొక్కడమే పనిగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంపై కూడా అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కాపులను అణగదొక్కడమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు అయిన అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రతిరోజూ మీడియా ద్వారా ప్రజలకు వివరిస్తూ విమర్శలు చేస్తుండటంతో శనివారం టీడీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గపు చర్యని మండిపడ్డారు. ఆయన మీద దాడి చేసి మట్టుబెట్టాలనే ఉద్దేశంతో దారుణానికి తెగబడ్డారన్నారు. ఆయన ఇంటిమీద, కార్యాలయం మీద బీభత్సం సృష్టించి ఆయన లోపల ఉంటే కోడి గుడ్లు, రాళ్లు విసిరి దాడి చేయడం అమానుషమని అన్నారు. కాపు నాయకుడు అంబటి రాంబాబుపై చేసిన దాడులను ఖండించాలని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాపుల మీద జరుగుతున్న దాడులను ప్రభుత్వ అధికారులు పట్టించుకుని న్యాయం చేయాలని కోరారు.


