17న చెస్, 24న సైక్లింగ్ పోటీలు
ఒంగోలు: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 17న చదరంగం, 24న సైక్లింగ్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యదర్శి జి.రాజరాజేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలు ఉదయం 9 గంటలకు స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో ప్రారంభమవుతాయన్నారు. పోటీల్లో పాల్గొనే వారు ముందుగా క్రీడాయాప్లో పేర్లు నమోదు చేసుకోవాన్నారు. చెస్ పోటీలు అండర్ 13, 15, 17,19 విభాగాల్లో, సైక్లింగ్ పోటీలు జూనియర్ అండర్ 18 విభాగంలో జరుగుతాయన్నారు. పోటీల్లో గెలుపొందిన వారు ఈ నెల 21,22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు, ఈ నెల 28, మార్చి 1వ తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9121106840 నంబర్ను సంప్రదించాలని కోరారు.
నాగులుప్పలపాడు: అతి వేగం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు..మండలంలోని ఈదుమూడి గ్రామానికి చెందిన కుమ్మూరి అనుబాబు (18) తిమ్మనపాలెం గ్రోత్ సెంటర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం విధులు ముగించుకొని మోటార్సైకిల్ పై వెళ్తున్న క్రమంలో కొత్తకోట సమీపంలో అతివేగంగా ఆర్చీని బలంగా ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
● రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఆపహరణ
మర్రిపూడి: మర్రిపూడి పడమటిబజారులో పట్టపగలే చోరీ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.మర్రిపూడి పడమటి బజారుకు చెందిన మారెడ్డి నరేంద్రారెడ్డి, బేబి దంపతులు వ్యవసాయం చేస్తుంటారు. వారం క్రితం బ్యాంకులో పెట్టిన బంగారాన్ని విడిపించి ఇంట్లోని బీరువాలో ఉంచారు. ఇంటికి తాళాలు వేసి భార్యభర్తలు రోజూ పొలం వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బీరువాను తెరవగా అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు తీసి లాకర్లో ఉన్న బంగారాన్ని దొంగిలించి, తిరిగి యధావిధిగా బీరువాకు తాళాలు వేశారని బాధితులు తెలిపారు. మొత్తం రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశారు. తెలిసిన వ్యక్తులు దొంగిలించి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో వివరాలు తెలియాల్సి ఉంది.


